“శ్రీదోసగీత” కథలు – ఆప్తవచనం
వ్యాసకర్త: రావి ఎన్. అవధాని ******* నేతి సూర్యనారాయణ శర్మగారి కలం నుండి జాలు వారిన 18 కథల సంపుటి శ్రీదోసగీత. ఈ కథాసంపుటిలోని కథలు 2004 నుండి 2021 మధ్య కాలంలో వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి, మరియూ ఆకాశవాణి ద్వారా ప్రసారితమైన వారి కథల నుండి ఎంపిక చేసి కూర్చినవి. కాదేదీ కథకు అనర్హం! అనే నానుడిననుసరించి శర్మగారు కథాకథనానికి ఎంపిక చేసుకున్న ఇతివృత్తాలు నాసిక, నాలుక, నఖం, చెప్పు ఇత్యాది వస్తు వైవిధ్యం గలవి. సామాజిక, సాంఘిక సాంస్కృతిక, ఆర్థిక రాజకీయ నేపథ్యం గలవి. రచయిత కథలన్నిటిలో ఒక్క రాజనంది చారిత్రక నేపధ్యం గలది. మిగిలినవన్నీ ఇతివృత్తానికి హాస్యరసం జోడించి కథారచనచేయడం గొప్ప విషయం. ‘సగం చచ్చి సంగీతం అంతా చచ్చి హాస్యం!’ అన్నట్లుగా గత వంద సంవత్సరాల కాలంలో ప్రాచీన కవులు, రచయితలు సాహసించి హాస్య రసం జోలికి పొలేదు. అలాగని ఆంధ్రులలో హాస్యరసం లోపించింది అనలేం. నూతన దంపతుల చిలిపి కజ్జాలు, బావామరదళ్ళు మేలమాడుకోవడం, పంటచేలల్లో హాస్యము లాస్యం చేస్తోంది. హాస్యగాడు వచ్చి బారాబర్లు చేస్తేగాని వీధినాటకాల్లో ముఖ్యపాత్రలు రంగం మీదకిరావు. చోపుగాడు వచ్చి బహుపరాక్ పలికితే గాని యక్షగానాదుల్లో నాయకులు సభకు వేంచేయరు. బంగారక్క, కేతిగాడు తొంగి చూడందే తోలుబొమ్మలాటల్లో అసలు బొమ్మ తెరమీదకి దిగదు. పగటి…