షిగా నవోయ (1883-1971) – షి షోసెట్సు

వ్యాసకర్త: పద్మజ సూరపరాజు


(ఈ వ్యాసం మొదట ఆంధ్రజ్యోతి వివిధ పత్రికలో వచ్చింది. పూర్తి పాఠాన్ని మాకు పంపించిన పద్మజ గారికి ధన్యవాదాలు.)

వస్తు పుష్టి , ఆజానుబాహువులైన కథానాయక నాయికలు, వారి ప్రేమ దాని వైఫల్యమో,ఇతరత్రా  సుఖ దుఃఖ విషాదాలో, వాటితో పెనవేసుకున్న అసంఖ్యాక వేరే పాత్రలు, గొప్ప అల్లిక గల కథనం, ఉత్సుకత ఇవన్నిటినీ కలగలుపుకుని, అన్ని తరగతుల పాఠకుల ఆసక్తి, ఆదరణలు దోచుకుంటూ నవలలం అంటూ   ప్రపంచ సాహిత్యంలో  ఆ ప్రక్రియ రాజ్యమేలుతున్నప్పుడు జపాన్ తనకే స్వంతమైన, యూరోపియన్ నవలా సంప్రదాయాలకు పూర్తి భిన్న రూపమైన “Shi- shosetsu”( I novel) అనే ప్రక్రియలో, ఇరవైయో శతాబ్దం మొదట్లో కథలు చెప్పటం మొదలు పెట్టింది. 1860-1890 ల మధ్య జపాన్ లో ఏర్పడిన రాజకీయ పరిస్థితికూడా ఓవిధంగా ఆ దేశయువతకు అటు యూరప్, అమెరికాల ప్రభావం నుంచీ, ఇటు దేశంలో తీవ్రమౌతున్న జాతీయవాదం నుంచీ కూడా తమ వ్యక్తిస్వేచ్ఛనూ, అభివ్యక్తిస్వేచ్ఛనూ నిలుపుకొని ధృడతరం చేసుకోవలసిన అనివార్యతను తీసుకువచ్చింది, ముఖ్యంగా సాహిత్యం లో. అప్పుడే వాళ్ళు తమకే ప్రత్యేకమైన అభిరుచులకూ, ప్రాముఖ్యత లకూ సరిపోయేవిధంగా యురేపియన్ నవలను ఈ షి షోసెట్సు ను పునర్నిర్మించుకున్నారు.

ఫ్రెంచి నాచురలిస్ట్ నవల, యూరోపియన్ వ్యక్తి ప్రాధాన్య భావుకత, జాపనీయ ఆలోచనా స్రవంతి వ్యాస శైలుల మిశ్రమం అనుకోవచ్చు “షి షోసెట్సు” ను.

I-novel అంటే “నేను” ప్రధానపాత్రగా సాగే నవల. యూరోపియన్ నవలకు ముఖ్యగుణమైన కాల్పనికతకు ముందు ఉద్వాసన పలికిన జాపనీయ నవలారచయిత, ఉత్తమ పురుషలో తనకథను తనదే అయిన ప్రత్యేక శైలిలో చెపుతూ‌, దానినే I- novel విధాన ముఖ్యలక్షణం చేశాడు.ఈ శైలిని ఫ్రెంచి నాచురలిస్ట్ నవల, యురోపియన్ వ్యక్తి ప్రాధాన్య భావుకత, జపనీయ ఆలోచనా స్రవంతి వ్యాస శైలుల మిశ్రమం అనుకోవచ్చు.

ఉట్టి ఆత్మకథ అనలేని ఈ I-novel యే ఒక కుతూహలమైన విరోధాభాస: “I” ను కల్పించటం ద్రోహం, novel లో నిజానికి తావుండటం అందం కాదు. కానీ జపాను ఈ రెండూ కలిపిన సామును అపూర్వంగా చేసి ఈ ప్రక్రియలో గొప్ప నవలలు, కథలు సృష్టించింది. Shi shosetsu రచయితల ఈ సాహసాన్ని జీర్ణం చేసుకోలేని పాశ్చాత్య సాహితీలోకం “వీళ్ళది narrative of rhetoric (సొంతగోడు) మాత్రమే, ఇది నవల కాద” న్నది. మళ్లీ తనే “మసిపూయకుండా నిజాయితీగా చెప్పిన గొప్ప ఆత్మకథలు” అనీ అన్నది. నిజానికి ఇవి, కేవలం వాస్తవ సంఘటనలను ముచ్చటించిన ఆత్మకథలు కూడా కావు.

ఈ జాపనీయ సాహితీ సంప్రదాయలో గొప్ప రచనలు చేసిన వాళ్ళల్లో  నవోయ షిగా ను ఎక్కువ విశేషంగా చెప్పుకుంటారు. వందపై చిలుకు చిన్న కథలు, మూడు నవలిక లు, ఒక పెద్ద నవల, చాలానే వ్యాసాలు వ్రాసిన ఈయన్ను కథల దేవుడని, Shi shosetsu ప్రక్రియను ప్రతిభావంతంగా వాడుకున్న వాడని, ‘‘A Dark Night’s Passing‘’ అనే ఈయన నవలను ‘Divine novel’ అనీ అంటారు జపాన్ లో. అయినా  షిగా కథలకు వేరే భాషల్లో అనువాదాలు ఆయన చివరి రోజుల దాకా రాకపోవటానికీ, పాశ్చాత్యసాహిత్య లోకం షిగా పై శీతకన్ను వేయడానికి కారణం ఈయన సంప్రదాయ యూరప్ నవలారూపానికి ఆయువుపట్టైన కథనాన్ని, శిల్పాన్ని నిష్పూచీగా తోసిపుచ్చి షి షోసెట్సు లో కథ చెప్పడం ఒక కారణం అయితే , క్రమంగా షిగా తన తర్వాతి కథల్లో షి షోసెట్సు నియమాలు కూడా నెట్టి పారేసాడు, I-novel లో కల్పనను జోడించాడు అన్నారు. వాస్తవానికి వారికి అతను అందలేదు, అతని రచనలో లయ చిక్కలేదు. అందుకే ఆధునిక జాపనీయ సాహిత్యం పై గొప్ప ప్రభావం చూపించి, తన దేశంలో చాలామంది అనుసరణీయులను సంపాదించుకున్నా ఆంగ్ల సాహిత్య లోకం లో అనాదరణే I novel కు, ముఖ్యం గా షిగా కు ఇప్పటికీ.

అయినా షిగాకు ఈ విషయం గా అసంతృప్తి లేదు,  ఎందుకంటే విదేశీ కాదు, స్వదేశీ ఐనా కూడా  పెద్ద గుంపు పాఠకులను ఉద్దేశ్యించి వ్రాసినవి కావు తన రచనలు. ఎటువంటి పాఠకులను షిగా ఉద్దేశించి వ్రాశాడో వారి సంఖ్య నెమ్మదిగా పెరగాలి, శతాబ్దాలు దాటి పెరగాలి.

తన సమురాయ్ వంశ కుటుంబం చాలా చిన్న చూపు చూసే కథారచనను వృత్తి గా ఎంచుకుని దాని నుంచి ఎటువంటి  ప్రతిఫలం, చివరికి ఆర్థికం అయినా ఆశించకుండా, కనీసం పాఠకులను ఉద్ధరిగలననే భ్రమ కూడా లేకుండా

ఇన్ని కథలను, నవలలను వ్రాయడంలో షిగా ఉద్దేశ్య, కారణాలు కూడా తన నవలారూపం లాగే చాలా కొత్తవి, ఎక్కడా విననివి.

రచన చేయడం షిగా దృష్టిలో ఒక నిర్మలీకరణ సాధన. వ్రాయడం తన కు కేవలం పూర్తి వ్యక్తిగత వ్యాసంగం. ఎందుకంటే షిగా దృష్టిలో వ్రాసేందుకు ప్రేరణ, ప్రయోజనం కూడా రచయితే.

మరి వస్తువు? ‘‘ నిజాయితీ ఉన్న కథ చెప్పాలంటే రచయిత తన కథే చెప్పాలి, అదే చెప్పగలడు, వ్రాయడం రచయిత తనను ఆవిష్కరించుకోవడానికి. అలా అని పగలు పిచ్చాపాటి ముచ్చట్లలో చెప్పవలసిన దినసరి సంగతులో, రాత్రుళ్ళు డైరీలో ఎక్కించాల్సిన సంఘటనల వివరాల పట్టికో కాదు కథ వ్రాయడం అంటే. ఇట్లాంటి విషయాలు, పేరు తెచ్చిపెట్టగల ఒక నవలకు సామగ్రి కావచ్చు కానీ, ఏ ‘‘ఒక విషయం‘‘ అయితే మామూలు సంభాషణలలో చెప్పడానికి కుదరదో  అదే గొప్ప కథా వస్తువు కాగలదు‘‘ అంటాడు.

ఆ “విషయం” దాని సౌందర్యం ఏమిటనేది నేరుగా చెప్పడు కానీ అతను తన దృష్టిలో సాహిత్య సిద్ధాంతం, ప్రయోజనాలు యివై ఉండాలి అని చెప్పడంలో అది వెల్లడవుతుంది.

షిగాకు అత్యంత సౌందర్యమూ,ముఖ్యంగా కథ అవదగిన లక్షణమూ, మనిషి తన సహజ ప్రవృత్తికి అనుగుణంగా స్పందించే క్షణంలో,  దానికి అనుగుణంగా నడుచుకునే సందర్భంలో కనిపిస్తుంది. ఎందుకని అంటే ఆధునిక మానవుడు తనకు సహజంగా పుటుకతో వచ్చిన మానవ ప్రవృత్తి ని మరిచి జీవిస్తూ, తన స్వాభావికమైన ఆత్మరక్షణ చేసుకోవలసిన లక్ష ణాన్ని పోగొట్టుకుని అటు భౌతిక ఉపద్రవాలకు, ఇటు మానసిక దుర్బలత్వానికి, దుఃఖాలకు  ఇష్టంగా  లోబడుతున్నాడు, లోకంలో, కావ్యం లో కూడా.  కథా రచనక్రియ రచయిత ను,  పాఠకుణ్ణి కూడా  మానవ సహజ ప్రవృత్తి( basic instinct) కి మేలుకొల్పాలి. సహజ ప్రవృత్తి అంటే పశు ప్రవృత్తి కాదు. అది మనిషికి మాత్రమే ప్రకృతి సిద్ధంగా సంజాతమైన వివేకం. మేధస్సు కాదిది, జీవి ప్రాథమిక లక్షణం అయిన విచక్షణ.

ఆ విచక్షణ వలనే వాస్తవ ప్రపంచాన్ని సరిగ్గా  చూసేందుకు, దానికి స్పందించేందుకు, అందులో వ్యవహరించేందుకు మనిషికి సాయపడుతుంది.

షిగా కథల వస్తువు ఆ చూడటం, స్పందించడమే. “పరిశీలన” ౼ అది తనను కానీ, ప్రపంచాన్నిగాని. తన సంఘర్షణ పరిష్కరించుకునేందుకైనా ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకైనా పరిశీలన చేయడం, ఆ పరిశీలన క్రియను అక్షరీకరణ చేయడమే షిగా చేసింది.

అందుకే ఏమాత్రమూ గొప్ప తనం ఆపాదించలేని మామూలు మనుషులు, సంఘటనలు షిగా దృష్టి తో అపూర్వమైన దృశ్యకథలయినాయి. షిగా ఎంచుకున్న కథా వస్తువులు , అతని రైలు ప్రయాణాల్లో తోటి ప్రయాణికులో,ఓ చిన్న షాపులో  పని చేసే పిల్లవాడో, ఒక ఆక్సిడెంట్ నుంచి బయట పడి తేరుకోవడానికి తను వెళ్ళిన చోట ఎదురైన కందిరీగో, ఇంకొక చోట పిల్లి వాత పడ్డ కోడి పిల్లల తల్లో , తను స్నేహితులతో  వెళ్లిన చిన్న పిక్నిక్కో.

షిగా కు గొప్పతనం వస్తువుల్లో ఉండదు, అది పర్వతమైనా ఎలుకైనా ఒకటే. ఈ రెండూ అతనికి  వేరు, వేరు కథల్లో కథా వస్తువులు. గొప్ప సాహిత్యం గొప్ప విషయం తో రాదు. విషయాలను రచయిత చూచిన విధం, తన పైన వాటి ప్రభావం, ఆ ప్రక్రియ లో తనకు తెలియవచ్చిన ‘‘ఎఱుక‘‘, ఇవీ షిగా కథా ముఖ్యాంశాలు.

ఇక్కడ, ఇతని మీద పద్దెనిమిదో శతాబ్దపు జాపనీయ సాహితీ సిద్ధాంత కారుడు, తత్వవేత్త నోరినాగ ప్రభావం ఉందనుకోవచ్చు.  నోరినాగ, ‘‘ఏ కళ ఐనా ప్రేక్షకుడికి, పాఠకుడికి ఒక మెలకువ తెప్పించేది గా ఉండాలి.  జన్మతః  మానవుడిగా తనకు ప్రకృతి ద్వారా సంక్రమించినా, పెరిగే క్రమం లో సిద్ధాంతాల ముసుగులు వేసుకోవడం లో మనిషి పోగొట్టుకున్న తన మూల ప్రకృతి  (‘‘nature‘‘) యొక్క ఉనికికి స్పృహ  కలిగించాలి‘‘ అనీ,  అటువంటి స్పందనను ‘‘ మోనో నో అవేర్‘‘ అనీ అంటాడు.

ఒక కళ తను ఆవిష్కరించే దృశ్యం దానిని చూస్తున్న  ప్రేక్షకుడిని స్పందింప చేయ కలిగినపుడే, అతనిని తన సహజ ప్రకృతి కి జాగరూకుణ్ణి చేసినపుడే, గొప్ప కళ అవుతుంది అనే ఇతని సిద్ధాంతమే అంతస్సూత్రంగా  షిగా రచనల్లోనూ కనపడుతుంది.

నవలల్లోని  స్త్రీ, పురుషులు మానవ సహజమైన బుద్ధి, వివేచనలతో ప్రతికూల పరిస్థితులకు పరాజితులు కాకుండా, వాటి ని అధిగమించడంలోను, ఆ అనుభవ సాయంతో మరింత పరిణితి పొందుతున్న పరిక్రమంలో ను గొప్ప సౌందర్యం కనపడుతుంది , అదే సాహిత్యానికి ఉండవలసిన నిజమైన ప్రయోజనం అంటాడు షిగా, ఇదే తన సాహిత్య సిద్ధాంతం. అందుకే తన కథలలో విఫల ప్రేమలు, విషాదం లో ఆనందం వెతుక్కునే మానసిక దుర్బలులు, హత్య, ఆత్మహత్యలు చేసే ఉద్రేక స్వభావులూ ఉండరు. సాధారణ మనుషుల్లా కాకుండా ప్రతిఘాతాలను దాటగల దృఢవ్యక్తిత్వం కలవారే కథలో కనిపించగల పాత్రలు ఇతనికి.

మనుషులకు సహజసిద్ధంగా సంక్రమించిన ఈ వ్యక్తిత్వ దృఢత్వానికి, వివేకానికి పాఠకులను ప్రచోదనం చేయడమే మంచి సాహిత్య ప్రయోజనం షిగాకు.

పాఠకులకు ఈ ప్రయోజనం ఉద్దేశించి రచయిత నవల వ్రాయడు, కానీ అది సాధ్యం అయితే సంతోషమే . ఎందుకంటే రచన క్రియ షిగాకు పూర్తి వ్యక్తిగతం.

తన సంఘర్షణ స్వరూపం తనకు తెలియజేసే ఉపకరణం రచనలు చేయడం.

ఈ process లో పాఠకులను ప్రత్యేకంగా ఉద్దేశ్యించి ఆహ్వానించకపోయినా తన ప్రయాణాలలో కి, వాళ్ళ కు తన పక్కన కిటికీ సీటు ఇచ్చి మరీ తన కథను చూసే అవకాశం ఇస్తాడు షిగా. కథ చెప్పడం కాదు,  అక్కడ అప్పుడు ఉన్న వాస్తవాన్ని  ఎట్లా చూడాలో చెప్పకుండా చూపించే కథలు షిగా వ్రాసినవి. “వాస్తవాని”కి సరిగా స్పందించడం తెలిసొచ్చే కథలు.  Man’s first responsibility is to be able to respond. Shiga records his responses in Shi shisetsu , the genre best suited for his chosen subject and style.

మనిషి వివిధ అస్తిత్వ పోరాటాలే జీవితంలోనూ , ప్రపంచలోని సాహిత్యాలన్నిటిలోను కావ్య వస్తువు ఎప్పుడూ.

షిగా జీవితం లో కూడా తండ్రి తోటి మనస్స్పర్థ  అతను ఎదుర్కోవలసి వచ్చిన పెద్ద కష్టం. నాయనకు ఇష్టం లేని తన రచనా వ్యాసంగం, ఒక పిల్ల తల్లైన వితంతువు తో వివాహం, తనను ఆయనకీ, కుటుంబ వారసత్వానికి తాత్కాలికంగా దూరం చేసాయి.

‘‘ The Reconciliation” అనే నవలిక లో పూర్తి గా, “A Darknight’s Passing” నవలకు కొద్దిగా , ఆ ఘర్షణే నేపథ్యం.

షిగా కథలలో ఆ పోరాటాల తాలూకు వివరాలుండవు. సంఘర్షణ సమసిపోవడానికి తనను తను సమాయత్తం చేసుకోవడం, ఆ సాధనలో ఎదురైన అనుభవాలే కథ మొత్తం.

తండ్రి తో సఖ్యత కుదిరాక ఇక తనకు పరిష్కరించవలసిన పోట్లాటలు లేవు కనక వ్రాయవలసిన కథలూ లేవు అనుకుని రచనలు చేయడం క్రమం గా తగ్గిస్తూ చివరకు పూర్తిగా మానేసి నలభై యేళ్ళు విశ్రాంత రచయితగా జీవించాడు షిగా.

బహుశా అన్నేళ్ళు  నిరుద్యోగి గా ఉన్న నవలాకారుడు ప్రపంచంలో ఈయన ఒకడే.

సాహిత్య ప్రయోజనం విషయంలో ఇతని సిద్ధాంతం  didactic గా కనిపించినా శైలి సంగతికి వస్తే ఈయనది ఒక gentle guide లాటిది,ఒక పీఠంపై న కూచుని బోధలు చేయడు. తను కథను నడిపిన తీరులోనే పాఠకుడికి రచన నుంచి చేరవలసిన మాట చేరుతుంది.

ఈయన వచనం లయబద్ధమైన కవితలా సాగిపోతుంది అంటారు మూలభాషలో కథలు చదివినవారు. ‘‘కథ అసంకల్పితంగా స్వేచ్ఛ గా రచయిత అంతరంగం నుంచి రావాలి, వ్యాకరణం కానీ లయ కానీ భాషకు సంబంధించినవి కాదు. రచయిత ఆలోచనల శక్తి కి అనుగుణంగా నడుచుకుంటూ వచ్చిన వాక్యం లో సహజంగానే చక్కటి వాక్యనిర్మాణం, లయ ఉంటాయి. అప్పుడు ప్రయత్నపూర్వకంగా కథనానికి ప్రాముఖ్యత ఇవ్వకపోయినా స్వతఃసిద్ధం గా కథలో శిల్పం ఏర్పడుతుంది.‘‘ షిగా చెప్పడమే కాక , సాధించిన సిద్ధాంతం.

ఇంత విషయమూ చాలా తక్కువ మాటలు ఉపయోగించి చెప్తాడు. ప్రకృతి ని పదే పదే ప్రస్తావించే షిగాకు ప్రకృతి అంటే నదులూ కొండలూ , పూవులూ పచ్చికబయళ్ళూ, పొలాలు సెలయేళ్ళో కాదు. వాటి వర్ణన చేయడు.

తన నవలలో ఒక చిన్న అధ్యాయంలో ఒకటిన్నర పేజీకి మించని ఇతని ప్రకృతి వర్ణన అత్యుత్తమ సాహిత్యాలలోని ప్రకృతి వర్ణనలకు సరితూగగలదు, ఇక్కడ కూడా దానికి ఒక విశిష్ట ప్రయోజనం ఉంది కాబట్టే దానికి అతని రచనలో చోటు దక్కింది.

నవోయ షిగా కథలన్నీ గొప్ప అనుభవాన్ని ఇచ్చేవే, మరీ ముఖ్యంగా  ‘‘At Kinosaki”(కొద్ది లో మృత్యువును తప్పించుకున్నప్పుడు తనకు వచ్చిన ఆలోచనలు ప్రేరణగా, మృత్యువు వస్తువుగా  వ్రాసిన గొప్ప తాత్విక కథ), “The Reconciliation”, “The Shopboy’s God”, “Manazuru” “Han’s Crime” ఇంకా మరికొన్ని ప్రపంచ సాహిత్యంలో గొప్పగా ఎన్నదగిన ఇతని కథలు.

పైన ఒక సందర్భంలో మనిషి ప్రాధమిక నైజం(basic instinct) గురించి చెప్పుకుంటూ ఇది పశుప్రవృత్తి కాదు అన్న గ్రహింపుకు చిన్న కొనసాగింపు: మరునిమిషంలో చావు తప్పించుకోలేని పరిస్థితి లో ఉండీ ఆ సంగతి ఎంత తెలుసో తెలియదో కానీ బ్రతికి బయట పడడానికి చివరి నిమిషం వరకూ నిస్సహాయ ప్రయాస పడిన ఎలుక పోరాటం “At Kinosaki”లో, అటవంటి పరిస్థితి లో సరైన సమయంలో చికిత్స కోసం తను చేసుకున్న ప్రయత్నంలో పోలిక చూడగలిగాడు, అలాగే కోడి పిల్లల తల్లి అచ్చం ఒక మనుష్య స్త్రీ తన పిల్లలను కాచుకున్నట్లే కాచుకోవడం “Dwelling by the Moat” లో చూశాడు. అందులో హృద్యమైన అందం ఉంది, అదే, మనిషి వివేకం కోల్పోయి పశుస్థాయి కి జారితే ఏహ్యంగా ఉంటుంది అనీ చెప్పాడు. నోరినాగా, షిగాలకు మనిషిని అనుభూతులకు, సహజ స్పందనలకూ దూరంగా ఉండమనీ, మానవజీవితం బుద్బుద ప్రాయమని మాటలు చెప్పే బౌద్ధ, కన్ ఫ్యూషియన్ బోధనలు తప్పు అని ఖండించారు.

“A Darknight’s Passing” నవల వ్రాసేటప్పుడు షిగా, ‘‘నేను ఈ సంవత్సరం సంపూర్ణ మైన రచయిత గా జీవించదలుచుకున్నాను, ఉద్వేగాలకు లోనవను, ఎవరితోటీ ఘర్షణ లకు దిగను, బాహ్యాంతర కాలుష్యాలకు దూరంగా ఉంటాను, భార్యాపిల్లలపట్ల వ్యామోహం లేని ప్రేమ చూపిస్తాను,ఆడంబర జీవితానికి దూరంగా ఉంటాను, ప్రశాంతంగా కాలం గడపాలనుకుంటున్నాను” అన్న మాట మనకు వద్దనుకున్నా తలపుకు తెచ్చే మాట “నానృషిః కురుతే కావ్యం”!

ఇతని ఇంకొక మాట, మనకు పరిచయమైన మాట ” ప్రేక్షకుడు చూసేవిధంలోనే  దృశ్యం కావ్యం అవుతుంది”.

మంచి సాహిత్య రచనతో మెరుగైన నడవడి, మంచి నడవడిక తో  చక్కటి సాహిత్యం సాధించగలరు అనే షిగా మాట అన్ని వేళలా, అందరికీ అనువు కాకపోవచ్చు. కానీ కథలన్నీ షిగా వి తను పరిపూర్ణ మానవుడిగా ఎదిగే సాధన ను అక్షరీకరణం చేయడమే. దాని ప్రయోజనం అంతవరకే.

అందుకే తన దృక్పథం లో ఎంత గొప్ప సాహిత్యం అయినా అది జీవితం కంటే గొప్పది కాదు.

You Might Also Like

Leave a Reply