“ఇంగ్లండులో కార్మిక వర్గ స్థితి గతులు” – ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ – మనుషుల్ని మనుషులే పీడించే చరిత్ర

రాసిన వారు: జె. యు. బి. వి. ప్రసాద్‌
—————————————

నా దగ్గిరకి పదకొండో క్లాసు చదివే ఒకమ్మాయి లెక్కలు చెప్పించుకోడానికి వస్తూ వుంటుంది. ఒక రోజు మా ఇద్దరి మధ్యా సంభాషణ జరిగింది.

“కమ్యూనిజం ఎంత గొప్పదైనా, అది అన్ని చోట్లా ఫెయిలయింది కదా, అంకుల్‌?” అంది.

“కమ్యూనిజం అంటే ఏంటమ్మా? ఆ సిద్ధాంతం ఏమిటీ?” అనడిగాను.

“కమ్యూనిజం అంటే పేద వాళ్ళని బాగా చూసుకోవడమేగా?” అంది తేలిగ్గా.

“అలా తేలిగ్గా మాట్టాడకు. ఏదన్నా పుస్తకం చదివావా, ఆ సిద్ధాంతం ఏమిటో తెలుసు కోవడానికి?”

“లేదంకుల్‌. అందరూ మాట్టాడుతున్నట్టే, నేనూ మాట్టాడుతున్నాను. పోనీ మీరు చెప్పండి కమ్యూనిస్టు సిద్ధాంతం ఏమిటో.”

“ఆ సంగతి తెలుస్తోంది. నువ్వే కాదు, పండితులమనుకునే వాళ్ళు కూడా, ఆ సిద్ధాంతం ఏమిటీ అన్నది తెలుసుకోకుండా, ఏ పేపర్లోనో అక్కడో ముక్కా, ఇక్కడో ముక్కా పట్టుకుని, చర్చించేస్తూ వుంటారు. నేను సిద్ధాంతం గురించి చెప్పడం ఏమిటీ? నువ్వు మార్క్సు రాసిన ‘కేపిటల్‌’ చదివి, అప్పుడు దాని గురించి చర్చించు” అన్నాను వివరంగా.

“నేను ఇప్పుడు మార్క్సు రాసిన అంతంత పెద్ద పుస్తకాలన్నీ చదివెయ్యాలా? అదెప్పుడు జరిగే పనీ?” అంది గాభరాగా.

“అంత కంగారెందుకూ? పోనీ, రంగనాయకమ్మ గారు రాసిన, ‘కేపిటల్‌ పరిచయం’ చదువు. పోనీ, ‘పిల్లల కోసం ఆర్థిక శాస్త్రం’ చదువు” అని చెప్పాను.

ఆ అమ్మాయి మాట్టాడలేదు. ఆ పుస్తకాలు చదవడానికి కొన్ని రోజులు పడుతుంది. ఎటొచ్చీ, ఆ సిద్ధాంతం తెలుసుకోకుండా, నాతో చర్చించే ప్రయత్నం చెయ్యదు.

“సరే! ఆ విషయాలు తర్వాత. మార్క్సు ‘కేపిటల్‌’ రాయక ముందరే, ఎంగెల్సు అనే ఇరవై ఏళ్ళ ఒకబ్బాయి, ‘ఇగ్లండులో కార్మిక వర్గ స్థితి గతులు’ అనే పుస్తకం రాశాడు. ఆ పుస్తకం గురించి చెబుతాను వింటావా?”

“అలాగే. చెప్పండంకుల్‌, వింటాను” అందా అమ్మాయి కుతూహలంగా.

“1844 లో ఎంగెల్సు ఇరవై నాలుగేళ్ళ కుర్రాడు. బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టాడు. తండ్రి ఒక పెట్టుబడి దారుడు. ఆ తండ్రి ఆ కొడుకుని, తమ ఫాక్టరీల పని చూడమని ఇగ్లండు పంపిస్తే, ఈ కుర్రాడు అక్కడ వున్న కార్మికుల స్థితి (తన ఫాక్టరీల్లో మాత్రమే కాదు) పరిశీలించి, ఆ విషయాల గురించి ఒక పుస్తకం రాశాడు. అది అతను జర్మనీ భాషలో రాశాడు. దాన్ని తర్వాత ఇంగ్లీషు లోకి అనువదించారు. ఆ ఇంగ్లీషు పుస్తకాన్ని రావు కృష్ణారావు గారు తెలుగు లోకి అనువాదం చేస్తే, దాన్ని రంగనాయకమ్మ గారు సంక్షిప్తీకరణ చేసి, ముందు మాటా, కొన్ని ఫుట్‌ నోట్లూ రాశారు.

165 ఏళ్ళ క్రిందట, ఒక ధనవంతు లబ్బాయి, కార్మికుల స్థితి గతులకి స్పందించాడంటే, ఎంత ఆశ్చర్యం? అదే, ఈ కాలం లోని, ఇరవై నాలుగేళ్ళ కుర్రాడయితే, పక్క వాడు ఏమయి పోతున్నా పట్టించు కోడు. ఇక పేద కార్మికుల సంగతా? దాన్ని సినిమాలకే వదిలేస్తాడు.

ఈ పుస్తకాన్ని రంగనాయకమ్మ గారు ‘ప్రగతి ప్రచురణలు’ సంస్థ తరఫున ప్రచురించారు. ఈ సంస్థలో కొంత మంది పాఠకులు కలిసి, లాభాపేక్ష లేకుండా, కొన్ని మంచి పుస్తకాలని ప్రచురిస్తున్నారు చాలా తక్కువ ధరకి.

ఈ పుస్తకంలో ముందుగా రంగనాయకమ్మ గారి ముందు మాట, ఆ తర్వాత ఎంగెల్సు రాసిన రెండు ముందు మాటలు, ఆ తర్వాత 15 చాప్టర్లూ, చివరగా ‘మార్క్స్‌ – ఎంగెల్స్‌ల గురించి’ ఉన్నాయి. విపులంగా వున్న ఫుట్‌నోట్లు, ఈ పుస్తకం లోని విషయాలని అర్థం చేసుకోడానికి బాగా ఉపయోగిస్తాయి.

ఈ పుస్తకం లోని చాప్టర్లు: ఉపోద్ఘాతం, పారిశ్రామిక కార్మిక వర్గం, పెద్ద పట్టణాళు, పోటీ, ఐరిష్‌ శ్రామికులు వలస రావడం, ఫలితాలు, పరిశ్రమ శాఖలూ, ఫాక్టరీ కార్మికులూ, ఇతర పారిశ్రామిక శాఖలు, శ్రామికోద్యమాలు, గని కార్మికులు, వ్యవసాయ కార్మిక వర్గం, కార్మిక వర్గం పట్ల బూర్జువా వర్గ వైఖరి, అమెరికన్‌ ప్రతిక ముందు మాట, రెండవ జర్మన్‌ ప్రతికి ముందు మాట, లండన్‌ ప్రతికి ముందు మాట.

రక రకాల శ్రామికుల పని పరిస్థితులూ, వారి అనారోగ్య వాతావరణం, వారికి సరైన తిండి లేక పోవడం, వారు నివసించే ప్రదేశాలూ, లాంటి విషయాలు చదువుతూ వుంటే, ఈ పెట్టుబడి దారీ వర్గం కార్మికులని ఎంత దుర్భర స్థితిలో వుంచుతుందో తెలుస్తుంది. ఆ కార్మికులకు సరైన నిద్ర వుండదు. శుభ్రమైన నివాస స్థలం వుండదు. పౌష్టికాహారం వుండదు. తామెందుకు, ఎలా బతుకుతున్నామో తమకే తెలియని ఘోరమైన పరిస్థితి.

చరిత్రలో, పని చేయని వర్గం, పని చేసే వర్గాన్ని, ఎంతగా అణగ్గొట్టి వుంచిందీ, ఎటువంటి భయంకర స్థితిలో వుంచిందీ మనం తెలుసుకోక పోతే, మన జ్ఞానాన్ని మనమే ప్రశ్నించు కోవాలి. కార్మికులనే వారు ఏ స్థితి నించి, ఏ స్థితికి వచ్చారో తెలుసు కోవాలి. ఇప్పటి స్థితికి చేరుకోడానికి, ఎన్ని విప్లవాలు జరిగాయీ, ఎన్ని నర మేధాలు జరిగాయీ ప్రతీ ఒక్కరూ తెలుసు కోవాలి. బూర్జువా వర్గం శ్రామిక వర్గాన్ని తాగుడు వ్యసనానికి అలవాటు చేసేదీ, వారి శ్రమకి ఇచ్చిన అతి స్పల్ప జీతం లోంచి, ఎలా వేరు వేరు మార్గాల్లో తిరిగి దోచుకునేదీ, ఎన్నో వివరాలతో రాశాడు ఎంగెల్సు తన 24 ఏళ్ళ వయసులో.

ఈ పుస్తకంలో బాల కార్మికుల గురించి వివరాలు వున్నాయి. అవి హృదయాన్ని కలచి వేస్తాయి. ఇగ్లండులో బాల శ్రామికుల పరిస్థితి ఇంత ఘోరంగా వుండేదా అని చాలా బాధ కలుగుతుంది.

ఒక ఫుట్‌ నోటులో, ఆత్రేయ రాసిన పాట, “కారులో షికారు కెళ్ళే” గురించి వివరాలు ఉన్నాయి. అలాగే, “చొక్కా పాట” కూడా ఆ కుట్టు శ్రామికుల మనో వేదనని చాలా హృద్యంగా చెబుతుంది.

రంగనాయకమ్మ గారు, “మార్క్స్‌, ఎంగెల్సుల గురించి” లో చాలా విలువైన విషయాలు, చాలా విమర్శలతో ఇచ్చారు. మార్క్స్‌, ఎంగెల్సుల కుటుంబాల గురించి విషయాలు తెలుస్తాయి. ఎంగెల్సు తన కుటుంబ సంస్కృతికి భిన్నంగా ఎలా పెరిగాడో అర్థం అవుతుంది. మార్క్స్‌తో అతని స్నేహం ఎలా మొదలయిందో తెలుస్తుంది.

చివరగా, ఈ చివరి మాట లోంచి, ఒక కొటేషను:

“పాఠకులు ఎప్పుడూ ఒక విషయంలో జాగ్రత్తగా వుండాలి. కమ్యూనిస్టు రచనలూ, కవిత్వాలూ, ఎవరు రాసినవైనా చదవండి! అందులో వున్న మంచి అంతా నేర్చుకోండి! కానీ, అవి రాసిన వాళ్ళందర్నీ కమ్యూనిస్టులుగా భ్రమ పడకండి! మంచి పుస్తకం అయినా సరే, మంచి కవిత్వం అయినా సరే!”

ఈ పుస్తకానికి లేతాకు పచ్చ రంగు అట్ట వున్నా, దీంట్లో వున్నది ఇంగ్లండు లోని కార్మికుల దుర్భర పరిస్థితి వర్ణన కాబట్టి, కొంత మంది ‘చదువు’కోని వారి దృష్టిలో, ఈ పుస్తకం ఎర్ర రంగు అట్ట వున్న పుస్తకం కిందే లెక్క.

యువ తరం, మద్య పానాల్లోనూ, శృంగార కార్య కలాపాల్లోనూ మునిగి తేలుతుండే రోజుల్లో, ఒక 24 ఏళ్ళ ధనవంతుల అబ్బాయి, ఇంత వివరంగా, అనేక ప్రభుత్వ పత్రాల సాక్ష్యాలతో, కార్మికుల స్థితి గతులను రాశాడంటే, ‘ఆశ్చర్యం’ కన్నా వేరే గాఢమైన పదం వుంటే, దాన్ని ఈ సందర్భంలో వాడాలి. ఈ కాలం కూడా ఈ వయసు వాళ్ళు, సమాజాన్ని పట్టించు కోకుండా తిరుగుతూ వుంటారు. వీళ్ళందరితో పోలిస్తే, ఫ్రెడరిక్‌ ఎంగెల్సు చేసింది చాలా గొప్ప పని.

ప్రతులకు: నవోదయా బుక్‌ హౌస్‌, (ఆర్య సమాజ మందిరం ఎదురు సందులో), కాచీగుడా చౌరస్తా, హైదరాబాదు – 500 027 (ఫోన్‌: 040 – 32465 – 2387)

You Might Also Like

10 Comments

  1. manjari lakshmi

    మీరు అమెరికాలో ఉంటారుకదా. మీ దగ్గరకు స్టూడెంటుగా వచ్చినమ్మాయికి తెలుగులో ఉన్న పుస్తకం చదవటం వచ్చా. ఇంగ్లీష్లో చదవాలంటే రంగనాయకమ్మ గారి వివరణలు చదవటం కుదరదేమో కదా.

  2. B.S.Raju

    Prasad Gariki EE Pusthakam Parichayam chesi nanduku abhinanadanalu.
    40 yella kritham 22 vayussulo naa anubhuthini nemaru vesukunnanu.
    Thirigi urgent ga telugulo chaduvuthanu.
    Sramika yuvatha tho chadivinche prayathnam chesthanu.
    B S Raju
    Convenor
    SRAMIKA JANAPATHAM
    janapatham@gmail.com
    +91 9985532686

  3. O.Satyanarayana

    Fedrick Angles so accurate in assessing problems of poor at the age of 24 years . To understand why Marks Angles invented the theory of surplus value at England we found the seeds in this books ” England lo karmika vargha sthitigathulu” in telugu . Hatsoff to the translator Rao Krishna Rao and reviewer JUBV Prasad.

  4. D.L.Vidya

    We completely read the book of Engles England lo Karmika Varga Sthitigatulu . Translation is very good and the book review by JUBV Prasad garu is very apt and excellent . This is the book that should be read by every human being .

  5. jagadeeshwar reddy

    ee pustakam gathamlo chadiva. ayite prasad gaari parichayam bhinnangaa, aasakthikaranga undi. kotta paatakulu ee parichayam chadavagaane book kosam prayatninchela undi.
    – gorusu

  6. వేణు

    అంత చిన్నవయసులోనే ఎంగెల్స్ ఎన్నో తిరుగులేని ఆధారాలు సేకరించి ఈ పుస్తకం రాయటం తల్చుకుంటే అబ్బురంగా అనిపిస్తుంది. కార్మికుల దుస్థితిని తెలుసుకోవటం కోసం వాళ్ళతో కలిసి జీవించాడు. ఈ పుస్తకం పని కోసం ‘మధ్యతరగతి వర్గాల నా మిత్రబృందాన్నీ, రాత్రి విందులనూ, పోర్చుగల్ ద్రాక్ష సారాయినీ, షాంపేన్ నూ వదులుకున్నా’నని రాశాడు ఎంగెల్స్. చాలా సంతోషంగా చేశాడు ఇదంతా. మీ పరిచయం బాగుంది. చదవాల్సిన మంచి పుస్తకం!

  7. కెక్యూబ్ వర్మ

    u.b.v.prasad గారు ధన్యవాదాలు సార్. నేటి యువతరం యొక్క బాధ్యతలను గుర్తెరగ చేసే వ్యాఖ్యానంతో కూడిన పుస్తక పరిచయం చేసినందుకు కృతజ్నతలు…

  8. Praveen Sarma

    మనవాళ్లు ‘proletariat(శ్రామిక వర్గం)’ అనే పదం కూడా విని ఉండరు. పేదవాళ్లని కించపరచడానికి వాడే ‘మాస్‌గాళ్లు’ అనే పదం విని ఉంటారు. మనవాళ్లకి సినిమాల మీద ఉన్న ఇంటరెస్ట్ సమాజం మీద ఉండదు.

  9. ramamohan

    చాలా భాగారాశారు ఇప్పుడు వున్న పెద్దపెద్ద చదువులు వెలగపెడుతున్న యువకులు వాళ్ళు మార్క్స్, ఎంగెల్స్ పెర్లు కూడా విని వుండలెదు వాళ్ళకు కమ్మునిజం అంటె సి.పి.ఐ, సి.పి.యం అంతె

  10. Gks Raja

    Atidhi/ Prasad Garu! Good work done. Useful for the youth and ofcourse for everybody.
    Raja. gksraja.blogspot.com

Leave a Reply