రస్కిన్ బాండ్: ఓ ఏకాంతజీవి బ్రతుకాట
వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ
********
రస్కిన్ బాండ్: ఓ ఏకాంతజీవి బ్రతుకాట (ఆత్మకథ)
అనువాదం: దాసరి అమరేంద్ర
జీవితం! ఈ పదానికి ఎందరెందరో ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. భౌతిక ప్రపంచంలో శాశ్వతమైనదంటూ ఏదీ లేదన్న వాస్తవంతో పాటు జీవితం విలువైనదన్నది అందరూ ఒప్పుకునేదే. అశాశ్వతం అని తెలిసీ అర్థవంతంగా, అందంగా మలుచుకుందుకు మనిషి పడే తాపత్రయమే జీవితం కాబోలు.
జీవితం పట్ల కనే కలలు సాకారం చేసుకునే ప్రయాణంలో నిశ్చలమైన నేర్పు, ఓర్పు, పట్టుదల, నమ్మకం అవసరం. కల నిజం చేసుకున్నప్పుడు కలిగే అంతులేని తృప్తి చుట్టూ ప్రపంచం పట్ల సానుకూలతను, ప్రేమను పోగుచేసి మరెందరికో స్ఫూర్తినిస్తుంది.
రస్కిన్ పసివాడుగా పొందిన ప్రేమ, చుట్టూ పచ్చని ప్రకృతి, తోడుగా తండ్రి సహచర్యంలో పరిచయమైన సంగీతం, పుస్తకాలు ఆయన చుట్టూ అపురూపమైన లోకాన్ని సృష్టించాయి.
అక్షరాలే తన గమ్యం అన్నది మనసులో స్థిరంగా నిర్ణయించుకుని నమ్మకంతో అడుగులు వెయ్యటం మొదలుపెట్టినప్పుడు ప్రపంచం అపనమ్మకంగా చూసింది. నిరుత్సాహపరచింది.
పరిచయం అక్కర్లేని రస్కిన్ బాండ్ ఎనభై మూడేళ్ల వయసులో మిత్రుల ప్రోద్బలంతో రాసిన ఆత్మకథను దాసరి అమరేంద్ర తెలుగులో అనువదించారు.
ముందుమాటలో రచయిత ఇదొక సగటు మనిషి జీవిత గాథ అని, తన ఎరుకలోని చిన్నచిన్న ప్రదేశాల గురించి, స్నేహాల గురించిన జ్ఞాపకాలే ఈ పుస్తకం అన్నారు.
అనువాదకుడు ఈ ఆత్మకథలో తనను బాగా ఆకట్టుకున్న అంశం నిర్మోహత్వం అన్నారు. మూల రచయిత జీవితానికి తన జీవితంతో ఉన్న సారూప్యాన్ని అనువాద సమయంలో తను ఏవిధంగా కనుగొన్నారో చెపుతారు. ముఖ్యమైన అంశాలుగా, ప్రత్యేకతలుగా అనువాదకుడు చెప్పినవన్నీ ముందుగానే పుస్తకం పట్ల అవగాహనను కలిగిస్తూ, రస్కిన్ బాండ్ జీవితాన్ని ఆయన ఎంతగా స్వంతం చేసుకున్నారో తెలుపుతుంది.
యాదృచ్ఛికమో ఏమో కానీ, రచయిత, అనువాదకుడు ఇద్దరూ జీవితం పట్ల అమిత సానుకూలమైన ధోరణితో ఉండే వ్యక్తులు. ఇద్దరూ భౌతికమైన ఆడంబరాలు, ఆర్భాటాల జోలికి పోకుండా సామాన్యమైన జీవితాల్నే ఎంచుకుని, తాము ఆరాధించే ప్రకృతిని తమ జీవితాలకు ఆలంబనగా చేసుకున్నారు. మిగిలిన ప్రపంచానికి భిన్నంగా, నిశ్చలంగా మనసావాచా నమ్మిన దాన్ని జీవితమంటూ ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. ఇది రచయిత, అనువాదకుల మధ్య కుదిరిన అద్భుతమైన సమన్వయం. జీవితం పట్ల చదువరి గ్రహించుకోవలసిన ఒక మెలకువ!
మూడువందల డెబ్భై ఆరు పేజీల పుస్తకంలో రెండు మూడు మాత్రం అచ్చుతప్పులు కనిపించాయి. ఈ పుస్తకాన్ని ఎంత ఇష్టంతో అచ్చువేసారో!
పసివాడుగా తాను పొందిన ప్రేమను చెపుతూ పసిదేవదూత లా కనిపించే తాను విపరీతమైన మొండివాడంటారు రస్కిన్. తన తల్లి, “నా పిల్లలందరిలోనూ వీడంత ఇబ్బంది పెట్టేవాళ్లు లేరు” అనేదట. బాల్య జ్ఞాపకాలను చాలా వివరంగా జ్ఞాపకం ఉంచుకోగల తన సామర్థ్యాన్ని చెప్పాడాయన. పెంచిన ఆయమ్మ, వంటాయన ఉస్మాన్ చెప్పిన కథలు భవిష్యత్తులో తనను రచయితగా తయారయేందుకు తగిన భూమికను ఏర్పరచాయంటారు.
1933 లో ముస్సోరిలో కలుసుకుని ప్రేమలో పడిన రస్కిన్ తల్లిదండ్రులకు వారి మధ్య వయసు తారతమ్యం పెళ్లికి అడ్డు కాలేదు. జామ్ నగర్ సంస్థానంలో తండ్రి స్కూల్ నడిపే రోజుల్లో నాలుగేళ్ల వయసులోనే రస్కిన్ ఒంటరిగా పచ్చని ప్రకృతితో అనుబంధం ఏర్పరచుకున్నాడు. పార్టీలను ఇష్టపడే తల్లికి, గ్రామఫోన్ రికార్డులు వింటూ, స్టాంప్ కలక్షన్ తో ఒంటరిగా కాలం గడిపేందుకు ఇష్టపడే తండ్రికి త్వరలోనే మనస్ఫర్థలు వచ్చాయి. ఆయమ్మని ఆటపట్టిస్తూ ఆయమ్మ – బొప్పాయమ్మ అంటూ రిథెమికల్ గా ఒక పాట రాసేసాడు చిన్నారి రస్కిన్.
తండ్రికి రాయల్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం రావటంతో మూడు రోజుల రైలు ప్రయాణంతో డెహ్రాడూన్ లో ఉన్న అమ్మమ్మ ఇంటికి చేరింది రస్కిన్ కుటుంబం. తాతయ్యను చూడకపోయినా ఆయన విపరీత ధోరణి గురించి విన్న మాటలే రస్కిన్ కథల్లోని తాతయ్యకు ప్రేరణ అయింది. ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడే అమ్మమ్మ కంటే ఆవిడ ఇంట్లో అద్దెకున్న మిస్ కెల్నెర్ రస్కిన్ కి మంచి స్నేహితురాలైంది. ఆరేళ్లు నిండిన రస్కిన్ కు క్రమశిక్షణ అవసరమని నమ్మిన అమ్మమ్మ రస్కిన్ కి నచ్చకపోయినా ముస్సోరిలోని హాంప్టన్ కోర్ట్ స్కూల్ లో చేర్చింది.
రస్కిన్ తల్లిదండ్రుల మధ్య దూరం పెరిగింది. తల్లి మిస్టర్ హెచ్ పట్ల ఆకర్షితురాలై ఆయన్ని వివాహం చేసుకుంది. ఎనిమిదేళ్ల వయసులో తండ్రిని చేరేందుకు ఒంటరిగా రస్కిన్ ఢిల్లీ బయలుదేరాడు. తండ్రిని రాయల్ ఎయిర్ ఫోర్స్ యూనిఫామ్ లో చూసి గర్వపడతాడు. ఆయన ఆఫీసు మినహా పూర్తి సమయాన్ని రస్కిన్ తోనే గడిపేవాడు. బ్రేక్ఫాస్ట్ చేసాక తండ్రి ఆఫీసుకు వెళ్లిపోతే రస్కిన్ ఇంట్లో కామిక్స్ చదువుకుంటూ, పాత గ్రామఫోన్ రికార్డులు వింటూ గడిపేవాడు. ఒంటరితనం, రాత్రి చీకటి తననెప్పుడూ భయపెట్టలేదంటాడు.
మలేరియాతో తండ్రి ఆసుపత్రిలో ఉన్నప్పుడు తమకు నీళ్లు మోసి తెచ్చే అతని కొడుకు తోడుగా పడుకునేవాడు. అతనితో కలిగిన కొద్దిపాటి సహచర్యం ఆధారంగా పదేళ్ల తరువాత ద అన్ టచబుల్ అన్న మొదటి కథ రాసాడు రస్కిన్. తండ్రి పదే పదే మలేరియాతో ఆసుపత్రి పాలవటం ఢిల్లీ రోజుల్లో జరుగుతూనే ఉంది.
ట్రాన్స్ ఫర్ వచ్చే అవకాశముందని రస్కిన్ ని సిమ్లా లోని బిషప్ కాటన్ స్కూల్లో చేరుస్తాడు తండ్రి. సిమ్లా స్కూల్లో ఉన్నప్పుడే కామిక్స్ నుంచి క్రైం థ్రిల్లర్లు, అక్కణ్ణుంచి పెద్దల సాహిత్యంలోకి రస్కిన్ ప్రవేశించాడు. 1944లో ట్రాన్స్ఫర్ మీద కలకత్తా వెళ్ళిన తండ్రి రస్కిన్ నాయనమ్మ, చెల్లెలు ఎలెన్ తో ఉండేవాడు. అక్కడ మలేరియా తిరగబెట్టటం, ఆయన మరణం రస్కిన్ సిమ్లా స్కూల్లో ఉండగానే జరిగిపోయాయి.
తండ్రి ఉత్తరాలను చదువుకుని దుఃఖపడే రస్కిన్ నుంచి ఉత్తరాలను జాగ్రత్త పెడతానని స్కూలు హెడ్డు మాస్టర్ ప్రీస్ట్లీ తీసుకుంటాడు. అవి రస్కిన్ కి తిరిగి అందనేలేదు. తండ్రి రాసిన ఆఖరి ఉత్తరం మాత్రం తన దగ్గరే జాగ్రత్తగా మిగిలింది.దానిని చదువుతున్న మనకూ మనసు చెమ్మబారుతుంది. కుటుంబ జీవితం విచ్ఛిన్నమై తల్లికి దూరమైన కొడుకు పట్ల రస్కిన్ తండ్రి అంతులేని ప్రేమను చూపాడు.
తండ్రి అంత్యక్రియలు చూడని రస్కిన్ ఆయన భౌతికంగా లేడన్నది ఎప్పటికీ ఊహించలేకపోతాడు. ఆయనతో కలిసి ఆస్వాదించిన స్టాంపుల కలెక్షన్, గ్రామఫోన్ రికార్డులు, చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు జ్ఞాపకాలుగా రస్కిన్ జీవితం మీద గాఢ ముద్ర వేసాయి. మధ్య వయసు వచ్చాక తండ్రిని ఉద్దేశించి ఉత్తరాలు రాసాడు. ఆయనను అకస్మాత్తుగా ఏ వీధిలోనో కలుసుకున్నట్టు, కలిసి రైలు ప్రయాణం చేసినట్టు ఊహిస్తాడు. తన అరవై ఏడేళ్ల వయసులో తండ్రి సమాధిని వెతుక్కుంటూ కలకత్తా వెళ్లి చూసొస్తాడు రస్కిన్.
తండ్రిని పోగొట్టుకున్న పదేళ్ల రస్కిన్ తల్లి పిలుపుతో డెహ్రా బయలుదేరతాడు శెలవులకి. రస్కిన్ ప్రయాణించిన, నివసించిన ప్రదేశాలు, వాటి ప్రకృతి శోభ ఆయనలో భావుకతను నింపాయి. డెహ్రా స్టేషన్ లో దిగేసరికి తన కోసం ఎవరూ రాలేదన్నది గమనిస్తాడు. ఆనవాళ్లను బట్టి అమ్మమ్మ ఇంటికి తానే టాంగా మాట్లాడుకుని వెళ్తాడు. ఆవిడ సహాయంతో తల్లి, సవతి తండ్రి మిస్టర్ హెచ్ నివసిస్తున్న ఇంటికి చేరతాడు.
కలకత్తా నుంచి తండ్రి అన్నదమ్ములు పంపిన ట్రంకుపెట్టె లో కొన్ని రికార్డులు, పుస్తకాలు మాత్రమే ఉండి తండ్రి ఇష్టంగా సేకరించిన స్టాంపులు మాయమవటం గమనిస్తాడు.
ప్రతి చోటా, ప్రతి వ్యక్తిలోనూ స్నేహం, ప్రేమ వెతుక్కున్న రస్కిన్ ఒంటరి జీవిత ప్రయాణం ఆ లేత వయసుకే మొదలైంది. తండ్రి అలవాటు చేసిన దూరపు నడకలు దినచర్యగా మారాయి. పుస్తకాల కోసం వెతుక్కుంటూ అమ్మమ్మ ఇంట అద్దెకున్న మిస్ కెల్నెర్ ని కలుస్తాడు. తండ్రిపోయాక దొరికిన మొదటి స్నేహితురాలామె. మరో ఐదారేళ్లపాటు ఆమె స్నేహం కొనసాగింది. తన మరణానంతరం కూడా మిస్ కెల్నెర్ ని తన ఇంట్లో నివసించేందుకు అనుమతినిచ్చిన అమ్మమ్మ దయాగుణాన్ని తలుచుకుంటాడు.
ఒకచోట రస్కిన్ ఇలా రాసుకున్నాడు- తమ స్వంత విషాదాల్లోంచి నడచి వచ్చిన వ్యక్తులే కరుణ చిప్పిల్లుతూ ఉంటారనుకుంటాను!
బిషప్ కాటన్ స్కూల్లో స్కూలు జరిగిన తొమ్మిది నెలల కాలంలో తన అనుభవాలు, ఆటలు, స్నేహాలు, అక్కడి వసతులు, టీచర్ల మీద వ్యంగ్య విమర్శలు అన్నింటినీ ఒక పుస్తకం రాసాడు. పుస్తకంపేరు తొమ్మిది నెలలు. స్నేహితుడు అజర్ చదివి బావుందంటూనే ఎవరి కంటైనా పడితే ప్రమాదమంటాడు. అది వాస్తవమవుతుంది. మిషనరీ స్కూలు ప్రార్థనా గీతాల బృందంలో సిఖ్ఖు కుర్రాళ్లు ఇష్టంగా చేరటం గురించి చెపుతూ మతాల, సంస్కృతుల సమ్మేళనానికి, తద్వారా ప్రపంచాన్ని మరి కాస్త నివాసయోగ్యంగా, వర్ణభరితంగా చెయ్యటానికీ అలాటి అందమైన అంశాలను మించి ఏముంటాయి అంటాడు రస్కిన్.
ఖ్యాతి గడించిన ఎందరో తన స్కూలు విద్యార్థులే అని చెపుతూ జనరల్ డయ్యర్ కూడా అక్కడి విద్యార్థే అంటాడు. దేశ స్వాతంత్రోద్యమం గురించి, దేశ విభజన గురించి కథలో అంతర్లీనంగా చెప్పుకుంటూ వస్తాడు. అజర్ పాకిస్తాన్ వెళ్లిపోయాడు. చిన్నచిన్న పనులు చేసుకునేవారంతా మతం పేరుతో ఇరు దేశాల్లోనూ రోడ్ల మీద హత్య చెయ్యబడ్డారు.
ఇంట్లో పిల్లల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నా, రస్కిన్ సవతి తండ్రి ఎంతోమంది ముస్లిం లను ప్రమాదానికి భయపడక పదేపదే దేశ సరిహద్దుల వరకూ దింపి వచ్చాడు.
డెహ్రాలో ఫుట్ బాల్ ఆడే పిల్లలతో స్నేహం కలిసింది. ఆపైన సినిమాలు, పుస్తకాలు రస్కిన్ ఏకాంతాన్ని కాపాడుతుండేవి. గాంధీ హత్యకు గురైన సమయంలో రస్కిన్ సినిమా హాల్లోనే ఉన్నాడు. చెల్లెలు ఎలెన్ మనసు ఆ వార్తతో గాయపడింది. 1949-50 బిషప్ కాటన్ స్కూల్ లో రస్కిన్ ఆఖరి ఏడాది. ఆ సమయంలో అతడిని కామెర్ల జబ్బు నీరసపరిచింది. అదే సంవత్సరం ఫుట్ బాల్ టీం కెప్టెన్ అయ్యాడు. ఆనాటి గ్రూప్ ఫోటో ఇప్పటికీ తన ఇంటి హాల్లో ఉందని, టీం లో అందరి పేర్లూ స్పష్టంగా జ్ఞాపకమున్నాయని రస్కిన్ రాసాడు.
స్వాతంత్రం రాక పూర్వం తన స్కూల్లో క్వాయర్ పాడిన మెసయ్యా గీతాన్ని ఆలిండియా రేడియో ప్రసారం చేసిందట. (యూ ట్యూబ్ లో అందుబాటులో ఉంది.) 1948లో స్కూల్లో ప్రవేశపెట్టిన హిందీ బోధించేందుకు మోహన్ రాకేష్ మాస్టారు వచ్చారని, ఆయన మంచి నాటక రచయిత అని రస్కిన్ చెప్పాడు. (మోహన్ రాకేష్ కి పేరు తెచ్చిన ఆధే అధూరే నాటకం యూ ట్యూబ్ లో అందుబాటులో ఉంది.) స్కూలు చదువు ముగిసాక ఇంట్లో రేడియా వాడకం విషయంలో తల్లి హెచ్చరిక నచ్చక ఇల్లు విడిచి బయటికి వచ్చేస్తాడు పదహారేళ్ల రస్కిన్. స్నేహితులు ఆదరించినా, నాలుగు రోజుల్లో తిరిగి ఇల్లు చేరతాడు.
టైపు రైటర్, కుర్చీ, బల్ల, తన రచనావ్యాసంగానికి వీలుగా విడిగా గది కూడా అమరాయి. కానీ అరవై ఐదేళ్ల వయసులో చేతితో రాయటమే బావుందంటాడు. కలం, కాగితం, చేయి, మనసుల మధ్య ఒక భౌతిక అనుబంధమంటాడు.
మై మ్యాగజైన్ ఆఫ్ ఇండియా అన్న మద్రాసు పత్రిక రస్కిన్ రాతల్ని ప్రచురించి ఐదు రూపాయల పారితోషికం పంపుతుంటూంది. డెహ్రాలో పరిచయాలు, పెద్దపెద్ద సైకిలు యాత్రలు, కథల పారితోషికంతో స్నేహితులకి శీతలపానీయాల పార్టీలు ఇవన్నీ డైరీలో నమోదై, రస్కిన్ మొదటి పుస్తకం ద రూమ్ ఆన్ ద రూఫ్ లో కొందరు కాల్పనిక పాత్రలయ్యారు.
అమ్మమ్మ మరణానంతరం తనకు చెందేలా రాసిన డబ్బుతో, తల్లి ప్రోద్బలంతో ఇంగ్లండ్ ప్రయాణమయ్యాడు పదిహేడేళ్ల రస్కిన్. కేవలం తన మూలాల బాంధవ్యమే ఆ దేశంతో. తనవంటి వాడికి ప్రపంచమే ఒక ఒంటరి ద్వీపమనుకుంటాడు రస్కిన్.
మూడు పౌండ్ల జీతంతో ఒక ఉద్యోగంలో చేరి జెర్సీలో తన పెద్దమ్మ ఇంట ఉంటూ ఆవిడకి ఒక పౌండ్ ఇచ్చి, మిగిలిన డబ్బు పుస్తకాలకి, సినిమాలకి, నోటు పుస్తకాలకి ఖర్చుపెట్టేవాడు. తండ్రి, ఇండియా, స్నేహితులు జ్ఞాపకం వస్తూంటారు. లైబ్రరీలో భారతీయ రచయితల పుస్తకాలు, ముఖ్యంగా టాగోర్ కవిత్వం రస్కిన్ ని భారతీయ ఆత్మకు దగ్గర చేసింది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తూ, సహోద్యోగుల సలహాతో జెర్సీ సివిల్ సర్వీస్ పరీక్ష రాసి పర్మనెంట్ ఉద్యోగస్థుడవుతాడు.
తన తల్లి గురించి పెద్దమ్మ భర్త తక్కువగా మాట్లాడటం నచ్చట్లేదని రస్కిన్ తన డైరీలో రాసుకున్నాడు. అది పెదనాన్న కంట పడ్డాక జరిగిన సంఘటనతో వారి ఇల్లు, ఉద్యోగమూ వదిలేసాడు.
లండన్ చేరి, ఫోటాక్స్ కంపెనీలో ఐదు పౌండ్లకి ఉద్యోగంలో చేరాడు. నగరంలో తాను చదివిన నవలల్లోని ప్రదేశాల ఛాయల్ని వెదుకుతాడు. బి.బి.సి. రస్కిన్ కథ ను స్వీకరించి, లైవ్ లో చదవమని అడిగింది. బి.బి.సి. కార్యక్రమం కోసం వెళ్లినప్పుడు రచయిత గ్రహం గ్రీన్ ని చూసాడు. తన మొదటి నవల ప్రారంభ ప్రతిని చదివి లండన్ ప్రచురణ సంస్థకు చెందిన డయానా విశ్లేషణాత్మకంగా ఎన్నో అంశాల్ని చెపుతూ, చక్కని సలహాలు ఇస్తూ ఉత్తరం రాసింది. లండన్ జీవితంలో కలిసిన స్నేహితులు జార్జి, వియత్నాం కుర్రాడు థన్హ్, అతని కజిన్ వూ గురించి చెపుతూ, వూ పట్ల తన విఫలప్రేమ ను చెపుతాడు.
తల్లి, స్నేహితులు ఇండియా రావద్దనే సలహా ఇచ్చినా నాలుగేళ్లలో వెనక్కి ప్రయాణమవుతాడు. ఎక్కడ ఏ పత్రిక చూసినా అందులో కథలకు స్థానం ఉందేమోనని వెతుక్కునే రస్కిన్ మార్గమధ్యంగా ఆగిన కరాచీలోనూ వార్తా పత్రికలు కొని వాటిని పరిశీలిస్తాడు.
బొంబాయిలో ఓడ దిగిన రస్కిన్ ఢిల్లీ చేరగానే మిస్టర్ హెచ్ స్టేషన్ లో కలిసాడు. డెహ్రా ప్రయాణంలో ఆ పగటి ఎండ, మట్టి నీళ్ళ కాల్వలు, వర్షాకాలపు ఉరుముల వాన …అన్నీ మానవ స్పర్శలోని దగ్గరతనాన్ని కలిగిస్తాయి. ఇంగ్లండులో తాను కోల్పోయింది ఇదే అనుకుంటాడు రస్కిన్. అపరిచితుల మధ్య వారిలో ఒకరిగా కలిసిపోయే అవకాశం, ఆవేశాలు, భావోద్వేగాలు చూపించటంలో తప్పు లేదనిపించే సర్వమూ తనకు కావాలనుకుంటాడు.
తల్లి, సవతి తండ్రి ఢిల్లీకి మకాం మార్చే సన్నాహాల్లో తనని కూడా రమ్మన్నప్పటికీ డెహ్రాలో ఉండాలన్నది రస్కిన్ కోరిక. మిస్టర్ హెచ్ మొదటిభార్య బీబీజీ అద్దెకున్న గదుల్లోనే ఒక గదిలో అద్దెకుంటాడు.
ద ఇలస్ట్రేటెడ్ వీక్లీ రస్కిన్ కథలకి యాభై రూపాయల పారితోషికం పంపుతుంటుంది. ఇంగ్లండ్ నుంచి రాగానే ద రూం ఇన్ ద రూఫ్ నవల అచ్చైందన్న విషయం పబ్లిషర్ ద్వారా తెలియకముందే దానిని తమ మ్యాగజైన్ లో ధారావాహికగా వేస్తున్నాం అన్న కబురు ఆ వీక్లీ నుండి వస్తుంది. వీక్లీ ఆర్టిస్ట్ మారియో మిరాండా వేసిన బొమ్మలతో నవల 1956లో మొదలైంది.
ఆ ఉదయం రస్కిన్ తెలవారుఝామున లేచి నేషనల్ న్యూస్ ఏజెన్సీ వాళ్ల ఆఫీసు తెరిచే సమయానికి అక్కడికి చేరుకుంటాడు.వీక్లీ మూడు కాపీలు కొనుక్కుంటాడు. ఆరోజు తన డైరీలో రాసుకున్న మాటల్ని తన ఆత్మకథలో చేర్చాడు. అది చిన్న విషయం కాదుగదా!
డెహ్రాలో ఆదాయం తగినంతగా లేక ఢిల్లీ ప్రయాణమవుతాడు రస్కిన్. కేర్ అనే సంస్థలో ఉద్యోగం దొరుకుతుంది. అది ప్రయాణాలతో కూడినది. సిమ్లా లో తను చదువుకున్న స్కూల్, అక్కడి టిబెటన్ కాందిశీకుల పిల్లలు పాత జ్ఞాపకాల్ని కలిగిస్తాయి. తండ్రి పుట్టిన షాజహాన్పూర్ చూస్తాడు. రాతపని వెనకబడింది.
ఉద్యోగం మంచి ఆదాయాన్నిస్తున్నా డెహ్రా వెళ్లి స్థిరపడాలన్న కోరిక మొదలైంది రస్కిన్ లో. ఉద్యోగ రీత్యా ముస్సోరి వెళ్లినప్పుడు మిస్ బీన్ కలిసి తన కాటేజ్ లో ఖాళీ ఉందని ఆహ్వానిస్తుంది. అడవిని తలపించే పరిసరాల్లోని ఆ గదిని రస్కిన్ ఇష్టపడతాడు. రచనల ఆసరాతో జీవించాలన్న రస్కిన్ కల సాకారం కానుంది ఆ నిర్ణయంతో.
దాదాపు ముఫ్ఫై సంవత్సరాల వయస్సులో తన కలను నిజం చేసుకుందుకు రస్కిన్ ముస్సోరి చేరాడు. ఈ చివరి అధ్యాయం పేరు పుస్తకానికి పెట్టిన పేరే, ఏకాంత జీవి బ్రతుకాట. ఈ అధ్యాయంలో ప్రకృతి వర్ణన చదువరిని బాహ్యలోకపు స్పృహను కోల్పోయేలా చేస్తుంది. బిభూతిభూషణ్ బందోపాధ్యాయ్ రాసిన వనవాసి జ్ఞాపకం రాక మానదు.
దశాబ్దాలుగా ముస్సోరిలో జీవిస్తూన్న మిసెస్ బీన్ ముస్సోరి చరిత్రనంతా కథలుగా చెపుతుంది. రస్కిన్ కి ఢిల్లీలో పరిచయమైన కమల్ కుటుంబంతో అనుబంధం ఏర్పడింది. కమల్ సోదరి పదహారేళ్ల సుశీల పట్ల రస్కిన్ ఆకర్షితుడవుతాడు. తాను ఆమెను పెళ్లి చేసుకుందుకు సిద్ధమని కమల్ కుటుంబానికి చెప్పినప్పటికీ, ఆమెకి వేరే వ్యక్తితో వివాహం జరుపుతారు.
రచనావ్యాసంగాన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తున్నా దాని ద్వారా పెద్దగా డబ్బులు దొరకవన్న వాస్తవం రస్కిన్ కి తెలుసు. ఇండియాలోని ఇంగ్లీషు ప్రచురణకర్తలకు పాఠ్యపుస్తకాల మీదే ఆసక్తి అంటాడాయన.
తల్లికి కాన్సర్ ఆపరేషన్ అని తెలిసి ఢిల్లీ వెళ్తాడు రస్కిన్. తల్లి మరణం తర్వాత చెల్లెలు ఎలెన్ బాధ్యతను సవతి సోదరి ప్రమీల తీసుకుంది. తల్లి మరణంతో బయటి ప్రపంచపు బంధం పూర్తిగా తెగిపోయిందనుకుంటాడు రస్కిన్.
ఒకనాడు పని కావాలంటూ వచ్చిన ప్రేమ్ రస్కిన్ జీవితంలో ముఖ్యభాగమై పోయాడు. ప్రేమ్ భార్య, పిల్లలు రస్కిన్ కుటుంబ సభ్యులైపోయారు. పెళ్లి చేసుకోకపోయినా తన బాధ్యతను తీసుకునే ఒక కుటుంబం, పిల్లలు, మనవలూ, మనవరాళ్లూ తనకూ ఉన్నారంటాడు రస్కిన్. ఇంతకు మించిన నిండైన జీవితం ఎవరు మాత్రం కోరుకుంటారు?!
చదువరికి మంచి అనుభూతినిచ్చిన రచయితకు, అనువాదకునికీ, ప్రచురణకర్తకూ అభినందనలు!
ప్రచురణ: కథాప్రపంచం, 2026
వెల: రూ. 500/-

Leave a Reply