అచ్చమైన ప్రజాకవి కాళోజీ
వ్యాసకర్త: తోకల రాజేశం
(సెప్టెంబర్ 09 కాళోజీ జయంతి సందర్భంగా)
********
నిజానికి ప్రజాకవులమని చాలా మంది సొంతంగా పేర్లు తగిలించుకంటారు కానీ వారిలో చాలామంది ప్రజాకవులు కారు. ప్రజాకవి అనే పదానికి నిర్వచనం ఇవ్వదల్చుకుంటే కాళోజీ పేరు చెప్తే సరిపోతుంది. కాళోజి అచ్చమైన ప్రజా కవి. ప్రజా కవులు ఎలా ఉంటారో? ఏం చేస్తారో? తెలుసుకోవాలంటే కాళోజీ జీవిత చరిత్ర ‘ఇదీ నా గొడవ’ చదివితే తెలుస్తుంది. అప్పుడు గానీ ప్రజాకవులు ఎలా పుడుతారో తెలియదు. ఆయనకు సొంత ఇంటి మీద గానీ, సొంత సంపాదన మీద గాని ధ్యాస ఉండేది కాదు. కమ్యూనిస్టులు చెప్పే సొంత ఆస్తి రద్దు లాంటి సిద్ధాంతాన్ని ఆయన తన జీవితంలో ఆచరణ ద్వారా చూపించారనుకోవచ్చు. ఆయన ధ్యాసంతా మనుషుల మీదనే. ఆ మనుషులను కదిలించటానికి కవిత్వాన్ని ఎట్లా మలచాలనే దానిమీదనే. చాలామంది కవుల వలె ఆశయాలను కవిత్వంలో ప్రకటించడం వరకే పరిమితమై పోలేదు కాళోజీ. తన కాలంనాటి అన్ని రకాల సామాజికోద్యమాలలోనూ పాలుపంచుకొని తన ఆచరణను నిరూపించుకున్నాడు. ఈ ప్రస్థానంలో ఆయనకు వయస్సు అడ్డు రాలేదు. దూరభారాలు అడ్డురాలేదు. ఆర్థిక సమస్యలు అడ్డు చెప్పలేదు. చివరికి ఆయన కుటుంబం సైతం అడ్డు చెప్పలేదు. ఆయన చివరి శ్వాస వరకు ప్రజల కోసమే ఆలోచించాడు.ప్రజలకు ఉపయోగపడని వాక్యం ఏది కూడా కాలోజీ కవిత్వంలో కనిపించదు. అంతలా ప్రజాపక్షపాతం వహించిన కవిత్వం ఆయనది.ఆయన జీవితాన్ని ప్రజలకే అంకితం చేశాడు.
అవని పై జరిగేటి అవకతవకలు చూచి
ఎందుకో నా హృదయం ఎన్ని ఆవేదనలు
పరుల కష్టము చూచి కరిగిపోవును గుండె
మాయ మోసము జూచి మండిపోవును ఒళ్ళు…
అని ఒక సందర్భంలో రాశాడు. తాను కవిత్వం ఎందుకు రాయవలసి వచ్చిందోనన్న సూచన పరోక్షంగా ఈ వాక్యాల్లో కనిపిస్తుంది. ఆయనది అన్యాయాన్ని చూస్తూ ఊరుకునే మనస్తత్వం కాదు. దానిపై రాజీ లేని పోరాటం చేసే మనస్తత్వం. ఆయన తన పోరాటానికి ఒక వాహికగా మాత్రమే కవిత్వాన్ని ఎంచుకున్నాడు.కాళోజి తన చేతిలో పట్టుకున్న కవిత్వాయుధంతో సమాజంలోని అవకతవకలను చీల్చి చెండాడాడు. అందులోని మాయ మోసాన్ని నడి బజార్లో నిలబెట్టి కడిగి పారేశాడు.
కాళోజీ అధికార వ్యవస్థలకు లొంగిపోయిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ప్రజలకు అన్యాయం జరిగిందని తెలిస్తే సాక్షాత్తు ప్రభుత్వంలోని అగ్రనాయకత్వాన్ని సైతం విమర్శిస్తూ బాహాటంగానే కవిత్వం రాసేవాడు. ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఒక్కప్పుటి నిజాం నవాబు దగ్గరి నుంచి ముఖ్యమంత్రుల దాకా తప్పు చేసిన వారినల్లా బాహాటంగా విమర్శించిన సందర్భాలు కాళోజీ జీవితంలో కోకొల్లలు. ఆయన లాంటి నిర్భయమైన గొంతుక ఈనాటి కవులకు రచయితలకు చాలా అవసరం. ముఖ్యంగా ప్రభుత్వాలే ప్రజల హక్కులను కాలరాస్తున్న ఈనాటి తరుణంలో కాళోజీ లాంటి కవులు పుట్టాలి అట్లాంటి కవిత్వం మళ్లీ రావాలి.
దేశంలో కులం పేరిట,మతం పేరిట దుష్ట రాజకీయాలకు తెరలేపారు కొందరు నాయకులు. భిన్న సిద్ధాంతాలను, సంస్కృతులను మట్టు పెట్టటానికి వారు చేస్తున్న వికృత ప్రయత్నాలను మనమందరం గమనిస్తూనే ఉన్నాం. ‘ఏకీభవించనోని పీకనొక్కు సిద్ధాంతం ఫాసిజ’మన్నాడు కాళోజీ. సరిగ్గా ఆ ఫాసిజం చీకట్లే నేడు మన దేశం నిండా ఆవరించాయి. ఆ చీకట్లను పారద్రోలి ప్రజాస్వామ్య వెలుగులను ప్రసరింప చేయడంలో మేధావుల, రచయితల పాత్ర ఎంతో కీలకమైనది. ఇట్లాంటి సందర్భంలోనే కాళోజీ లాంటి కవుల స్ఫూర్తి మనలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. రాజీలేని మనస్తత్వాన్ని కల్పిస్తుంది. నిజానికి కాళోజీ కవిత్వంతో ఆనాటి సమాజాని కంటే ఈనాటి సమాజానికే అవసరం ఎక్కువగా ఉంది. ‘అన్యాయాన్నెదిరించే వాడే నాకు ఆరాధ్యుడ’న్నాడు కాళోజి. నిజంగా కాళోజీ కవిత్వాన్ని చదివిన వాడెవడు అన్యాయాన్ని ఎదిరించకుండా ఉండటం సాధ్యం కాదు. అదే ఆయన కవిత్వం, వ్యక్తిత్వంలోని గొప్పతనం.

Leave a Reply