మమతలు కురిసే మమత కవిత్వం
వ్యాసకర్త: తోకల రాజేశం
********
భారత దేశానికి మమతా బెనర్జీ ఒక క్రియాశీలకమైన రాజకీయనాయకురాలిగా మాత్రమే తెలుసు. కానీ బెంగాలీలకు ఆమెలోని కవయిత్రి కూడా తెలుసు. తెలుగునాట అచ్చం తెలంగాణా లాగానే తరతరాలుగా బెంగాల్ ప్రజా పోరాటాలకు నెలవైన ప్రాంతం. ప్రజా పోరాటాలకు తోడుగా విస్తృతంగా ప్రజా సాహిత్యాన్ని సృష్టించిన ప్రాంతం అది.దేశ స్థాయి పోరాటాలు అనేకం ముందు అక్కడ పుట్టిన తరువాతనే దేశం మొత్తం విస్తరించిన సందర్భాలు అనేకమున్నాయి. ఈ క్రమంలోనే “నేడు బెంగాల్లో జరిగింది. రేపు దేశంలో జరుగుతుంది”అనే ప్రసిద్ధ నానుడి పుట్టింది. సుభాష్ చంద్రబోస్,బిపిన్ చంద్రపాల్,రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్చంద్ర,రాజరామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యా సాగర్,అమర్త్యసేన్ లాంటి దేశం గర్వించదగ్గ వ్యక్తులను తయారు చేసిన నేల బెంగాల్. సాంస్కృతికంగా,రాజకీయంగా బెంగాల్ భారత దేశానికే గర్వకారణంగా నిలువగలిగిన ప్రాంతం. అక్కడ తరతరాలుగా నెలకొన్న ప్రజాస్వామ్య స్ఫూర్తి మమత జీవితంలో ప్రధాన భాగమయిందన్న సంగతి మమత కవిత్వం చదివితే కానీ అర్థం కాదు. ఆమె నమ్మిన విలువల పట్ల దృఢంగా నిలబడగలిగిన తీరుకు ఆమె కవిత్వం కూడా సాక్ష్యంగా నిలుస్తుంది. అయితే బెంగాల్ సాహిత్యం తెలుగు బాట పట్టడం కొత్త విషయమేమి కాదు. ఠాగూర్, శరత్చంద్ర లాంటి దిగ్గజ రచయితల రచనలు ఇప్పటికీ తెలుగువాళ్ల సాహిత్య అభిరుచిని మెరుగుపెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ కోవలోకి మమత కవిత్వం చేరుతున్నది. మమతా బెనర్జీ రాసిన దాదాపు వెయ్యికి పైగా కవితల్లోనుంచి 51 కవితలను ఎంపిక చేసుకొని సామాన్య గారు చేసిన అనువాదమే ఈ “సరళ సుందర సునిశిత మమత”.
శీర్షికలోనే ఈ కవిత్వం ఎలా ఉంటుందోననే విషయం మీద ఒక సూచన ఉన్నది.ఈ కవిత్వం సరళంగా ఉంటుంది. అంటే సులభంగా అర్థం అవుతుంది. సుందరంగా ఉంటుంది. అంటే కవిత్వం తాలూకు సౌందర్యం కనిపిస్తుంది. సునిశితంగా ఉంటుంది. అంటే సమాజం పట్ల లోతుగా ఆలోచిస్తుంది.ఆ మాటలను నిజం చేస్తూ ఈ మూడు లక్షణాలూ ముప్పేటగా అల్లుకున్న తీరు ఈ కవిత్వంలో కనిపిస్తుంది. ఈ మూడు లక్షణాలు కూడా కవిత్వానికి ఎలా వన్నెలు దిద్దుతాయో సాహిత్య ప్రేమికులకు తెలిసిన విషయమే. ఈ కవిత్వ సంకలనానికి ‘అభినందన’ పేరుతో ప్రొ:కొలకలూరి ఇనాక్ గారు రాసిన ముందుమాటలో మమత కవిత్వంలోని లోతును చూపించే ప్రయత్నం చేశారు. “పార్టీ మేనిఫెస్టో కాదు ప్రేమ మేనిఫెస్టో”అంటూ మమత కవిత్వం పట్ల తనకు కలిగిన ఆసక్తిని ఆసక్తిగా కథనం చేశారు అనువాదకులు సామాన్య. మమత కవిత్వంలో ప్రధానమైన దినుసు మనుషుల పట్ల ప్రేమ అన్న సంగతి సామాన్య రాసిన పరిచయం ద్వారా తెలుస్తుంది. కవిత్వంలోకి వెళ్ళినప్పుడు ఆ విషయం రుజువవుతుంది కూడా.
మమత రాజకీయ నాయకురాలు.ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రి గా పనిచేసినవారు.మొండిధైర్యం గల నేత.అట్టడుగు ప్రజల పక్షపాతం కలిగిన వారు. చరిత్రను చదివి, ఉపాధ్యాయ విద్యతో పాటు, లా కోర్సు కూడా చేసిన జ్ఞాన పిపాసువు. చిన్న చిన్న ఉద్యోగాలు సైతం చేసిన అనుభవశీలి.మొత్తంగా ఏ స్థాయిలో ఉన్నా ఆమె సాధారణమైన జీవితాన్నే గడపడానికి ఇష్టపడుతారు.ఈ సాధారణత ఆమె కవిత్వంలో కూడా కనిపిస్తుంది.” మీ జీవితం ఆలోచించదగ్గదైతే రాయదగ్గది కూడా”నంటాడు రాబిన్ శర్మ.బహుశా! ఈ గుర్తింపు మమతలో ఉండి ఉంటుంది.
దేశ వ్యాప్తంగా మతరాజకీయాలకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడిన కొద్దిమంది నాయకులలో మమత ముఖ్యురాలు.ఆమె సామాజిక పోరాటానుభవాలను సాహిత్యంలో బలంగా వ్యక్తీకరించారు. ‘హిందూ ముస్లిం’ అట్లాంటి బలమైన కవితల్లో ఒకటి.
స్నేహాలకు చీలిక చేసి
ద్వేషాగ్నులు ఎగదోసి
స్వార్థ నాటకాలకు తెర లేపారు
మన విధ్వంసమే వారి విజయం
సోదరులారా!తెలుసుకోండి
విద్వేషాలను వదులుకోండి
అంటూ మత విద్వేషాలను ఎగదోసే వారి రాజకీయ ప్రయోజనాలను బహిర్గతం చేశారు.రాజకీయాలలో మమత ఆశించిన ప్రజాస్వామ్య విలువలు ఆమె కవిత్వానికి ముడిసరుకుగా మారాయి.
రాజకీయ నాయకులు సాధారణంగా పోరాటాలను ఆమోదించరు. వాళ్లకు పదవి పోయినప్పుడు తప్ప పోరాటాలతో అవసరం ఉండదు. ‘అమరులు’అన్న కవిత పోరాటాల పట్ల, పోరాట వీరుల పట్ల మమతకున్న గౌరవాన్ని, నిబద్ధతను ప్రకటిస్తుంది.
ఆవేశంతో చిప్పిల్లే నా నయనాశ్రువులు
వారు చిందించిన రక్త సిక్త ధారలు
భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం
వారు చేసిన పోరాటపు ఫలితం
నేడు నా నాలుకపై ధీరత్వంతో
నర్తిస్తున్న పద సమూహం
తన నాలుక మీది మాటలకు భావప్రకటనా స్వేచ్ఛ కోసం అమరులు చేసిన త్యాగాలే కారణంగా గుర్తించటం ఆమెలోని నిజాయితీకి నిదర్శనం. బహుశా మమతకు గల ఈ నిజాయితీ కారణంగానే కేంద్రం దుర్మార్గపు చట్టాలను తెచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రిగా ఉండికూడా ప్రజాలవైపు నిలబడి అనేక పోరాటాలు చేసింది. రాజ్యం చేసే హింస పట్ల, అది తృణీకరించే విలువల పట్ల, హరించే స్వేచ్ఛ పట్ల కూడా స్పష్టమైన గొంతుతో మాట్లాడింది మమత. తనకు ముందున్న ప్రభుత్వాల నిర్బంధ కాండను నిరసిస్తూ రాసిన కవితలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి.”స్వేచ్ఛ”అన్న కవిత అందులో ఒకటి.
వీధులంతా రక్తం
ఉచ్ఛ్వాసంలో మరణ భయం
జీవనార్థాన్ని లాగేసుకుంటున్న రణం
ఇది తుపాకులు
నృత్యం చేస్తున్న రాజ్య చరిత్ర
‘స్వేచ్ఛ’ గురించి మరోకవిత “అస్పృశ్య”లో మాట్లాడుతూ-‘జీవించడానికి తిరగడానికి, బంధాలు వేయని నేల కావాలి’అంటుంది. మనిషికి అత్యంత ఆవశ్యకమైన స్వేచ్ఛ గురించి మమత కన్న కలలు ఈ కవిత్వంలో చాలా చోట్ల కనిపిస్తాయి.
మమత ప్రాథమికంగా కవయత్రి అయితే కావొచ్చు కానీ నిలబడింది మాత్రం రాజకీయరంగంలో. కాబట్టి ఆమె ప్రకటించే అభిప్రాయాలకు చాలా విలువ ఉంటుంది. మామూలు రచయితలు చెప్పే విషయాలకు, ప్రకటించే ఆశయాలకు ఆచరణ రూపం తీసుకోవటమనే సందర్భం అన్ని వేళలా బయటి ప్రపంచం దృష్టిలోకి ఎక్కకపోవచ్చు. కానీ రాజకీయ వేదిక నిలబడిన వాళ్ళ మాటలను సమాజం జాగ్రత్తగా పరిశీలిస్తుంది. వాళ్ళు సృజన శీలులైతే ఇంకింత జాగ్రత్తగా అవలోకిస్తుది. వాళ్ళ మాటలకూ, చేతలకూ మధ్య అగాధం పొడసూపతే అటు రాజకీయ విమర్శకులు, ఇటు సాహిత్య-సామాజిక విమర్శకులు దుమ్మెత్తి పోస్తారు. మమత రాజకీయ రంగాన్ని, ఇటు సాహిత్య కృషితో పోల్చి చూసినప్పుడు ఈ విషయం పట్ల ఆమె జాగ్రత్తగానే మసులుకుంటున్నారని అర్థమవుతుంది. ఈ కవిత్వాన్ని సంపూర్ణంగా చదివితే ఈ విషయం పట్ల ఆ స్పష్టత వస్తుంది.
ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో ప్రజల భూములను గుంజుకోవటం, ప్రజలపై దౌర్జన్యాలకు తెర లేపటం దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఒక దుర్మార్గం. ఈ క్రమంలోనే సింగూర్ భూములను తనకు ముందున్న ప్రభుత్వం అభివృద్ధి సాకుతో కార్పొరేట్లకి కట్టబెట్టే ప్రయత్నాలను చాలా తీవ్రంగా నిరసించింది మమత. నిజానికి తాను రాజకీయరంగంలో బలపడడానికి సింగూరు రైతుల తరపున ఆమె చేసిన పోరాటం కీలకమైన మలుపుగా పనిచేసింది.ఈ నేపథ్యంలో ఆమె రాసిన “సింగూర్” కవిత ఒక విప్లవాత్మకమైన ఆలోచనల సమాహారం.
జరగలేదు దౌర్జన్యం సింగూరులో
జరిగింది మా గుండెలలో
తల్లీ చెల్లెళ్ళ గొంతులు కాదు మీరు నొక్కింది
పిడికిలితో గుద్ది పిసికింది గణతంత్రపు గొంతు
అంటూ తీవ్రంగా పేదరైతు భూముల ఆక్రమణను గణతంత్ర వ్యవస్థ మీద దాడిగా అభివర్ణించారు.సింగూర్ ఒంటరి కాదంటూ ప్రజాపోరాటాల బలాన్ని బలంగా చెప్పారు.
సింగూర్ ఓటమి లేదు నీ బాటన
లిఖిస్తావు నీవు నూతన చరిత్ర
కూటి కుండ కోసం నీ యుద్ధం
నిలుపుతుంది జన విశ్వాసం
అని ఆమె చెప్పిన విధంగానే సింగూర్ ప్రజా ఉద్యమాల బాటలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది. భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశం చేసింది. ఆ చరిత్రలో మమతది కీలకమైన భాగస్వామ్యం. ఆ తడి ప్రత్యక్షరంలోనూ కనిపిస్తుంది.మమత ఇలా పేదల బతుకుల మీదుగా నిర్మాణమయ్యే అభివృద్ధిని “వక్రాభివృద్ధి” అన్నారు. “విధ్వంసం నుండి అభివృద్ధి పుడుతుందనేది అపప్రచార”మని కొట్టి పారేశారు.
అభివృద్ధి చిరునామా
భూదురాక్రమణమా
తుపాకీ గొట్టం
ఎలా అవుతుంది అభివృద్ధి జన్మద్వారం?
అంటూ ఆమె వేసిన ప్రశ్నలు ఎంతో విప్లవాత్మకమైనవి.ప్రస్తుతం రాజకీయ రంగంలో ఉన్న వారు ప్రశ్నలను ఎలా అణిచివేస్తున్నారో చూస్తున్నాం. ప్రశ్నించే వాళ్ళను ఎలా కటకటాల పాలు చేస్తున్నది కూడా గమనిస్తున్నాం. మమత తీరు ఇందుకు భిన్నంగా ఉంటుంది. మమత ప్రశ్నలను ఎదుర్కోవటమే కాదు తనపైన ఉన్న వ్యవస్థలను కూడా ధైర్యంగా ప్రశ్నించగలదు. అందుకే దేశనాయకులందరిలోనూ మమత వ్యవహార శైలి భిన్నంగా కనిపిస్తుంది. ఆ ప్రత్యేకత ఆమె వ్యక్తిత్వంలో ఒక భాగం.ఈ క్రమంలోనే అది కవిత్వంలో కూడా ప్రతిఫలించింది. ఈ రకంగా పూర్తి ప్రజాపక్షపాతం కలిగిన దృష్టికోణం మమత కవిత్వంలో కనిపిస్తుంది. ఇందులో రైతుల మీద, మామూలు మనుషుల మీద శ్రీశ్రీ భాషలో చెప్పాలంటే ‘దీనులు హీనులు బాధా సర్ప ద్రష్టుల మీదా” మమత మమతలు కురిపించారు. అయితే ఆమె హృదయాన్ని అద్భుతంగా పట్టుకోగలిగారు అనువాదకులు సామాన్య.ఎక్కడో ఒకచోట తప్పిస్తే ఇది అనువాద కవిత్వమన్న స్పృహే పాఠకులకు కలగదు. అంత సరళంగా చేసిన అనువాదం సామాన్యంగా అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు.ఏ పుస్తకం పాఠకులకు అవసరమో,ఏది సామాజిక ప్రయోజనాన్ని కలిగించగలదో తెలుసుకొని చేసే అనువాదం నిలువగలుగుతుంది.అట్లా నాలుగు కాలాల పాటు చరిత్రకు సాక్ష్యంగా నిలిచే పుస్తకమే ఈ ‘సరళ సుందర సునిశిత మమత’.

Leave a Reply