వాద వివాదాల ‘కొలుపు’

వ్యాసకర్త: తోకల రాజేశం

**********

“చైతన్య రూపాల్లో అన్నిటికంటే సాహిత్యానికి భావజాల స్వభావం,తప్పుడు చైతన్యం ఎక్కువగా ఉంటుంద’ని త్రిపురనేని మధుసూధన రావు ఒక సందర్భంలో అన్నారు. చైతన్యం నుంచి పదార్థం పుడుతుందని, చైతన్యం నుంచి చైతన్యం పుడుతుందని భ్రమపడడాన్ని ‘భావజాలం’ అంటారని కూడా అన్నారు. కాసుల ప్రతాపరెడ్డి సాహిత్య వ్యాసాల సంకలనం కొలుపు చదువుతుంటే ఇందులోని వ్యాసాలకూ, మధుసూధన రావు సూత్రీకరణకు మధ్య ఒక తాత్విక సంబంధం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే తప్పుడు చైతన్యాన్ని పసిగట్టి దాన్ని పట్టుకున్న దాఖలాలు కొలుపులో చాలానే ఉన్నాయి. తప్పును తప్పని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. అంతకు మించిన సాహసం ఉండాలి. నిజానికి సాహిత్య విమర్శను ఎంచుకోవటమే దానికది సాహసోపేతమైన నిర్ణయం. ‘కొలుపు’ దానికి పరాకాష్ట. ఎందుకంటే ఇందులోని నిజాలు చాలామందికి మింగుడు పడనివి. జర్నలిస్టుగా ఉన్న ప్రతాపరెడ్డి గారు అనివార్యంగా విమర్శకునిగా మారటానికి కారణం ఆ తప్పుడు చైతన్యాన్ని ప్రశ్నించకుండా ఉండలేకనే. కొలుపు వచ్చింది గత రెండు దశాబ్దాల కిందటనే (2002లో) అయినా ఈ వ్యాసాల అవసరం నేటికీ తీరిపోలేదు. సరిగ్గా చెప్పాలంటే ఆ అవసరం ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువగానే ఉంది. సాహిత్యాన్ని, సమాజాన్ని వాటి మధ్య గల తాత్విక బంధాన్ని సృజనాత్మకంగా వ్యాఖ్యానించిన గ్రంథం ఈ ‘కొలుపు’.

 ‘కొలుపు’కు గల అర్థం తెలిస్తే గాని ఈ వ్యాసాల గొప్పతనం అవగాహన లోకి రాదు. కొలుపు అంటే తెలంగాణ జిల్లాల్లో ఒక గ్రామ దేవత లేదా ఇంటి దేవత (పోచమ్మ, ఎల్లమ్మ,పెద్ద దేవర, అంకమ్మ)కథను సాయంత్రం పూట నుంచి తెల్లారే దాకా అవిచ్ఛిన్నంగా గేయ రూపంలో పాడటం(వాద్య సహకారం ఉంటుంది). అవిచ్ఛిన్నత, ఏకాగ్రత, చారిత్రకత -కొలుపు ప్రధాన లక్షణాలు. ఈ లక్షణాలన్నీ ఈ వ్యాస సంకలనంలోనూ ప్రతిఫలిస్తాయి. అందుకే ఈ సంకలనానికి’ కొలుపు ‘అన్న పేరును రచయిత ఎన్నుకొని ఉంటారు.

11 వ్యాసాలు కలిగిన ‘కొలుపు’ “వాళ్ళూ మనమూ”తో ప్రారంభమై-” వాళ్లూ మనమూ అతనూ”తో ముగుస్తుంది. భాష ఒక్కటే అయినా తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి వెలువడిన సాహిత్యం మౌలికంగా వేరు వేరన్న స్పృహను కలిగించే వ్యాసం ‘వాళ్లూ మనమూ’. ఇంతవరకు ఈ తేడాను గుర్తించకుండా తెలంగాణా సాహిత్యకారులు ఎలా మోసపోయారో స్కాన్ చేసి చూపించారు ప్రతాపరెడ్డి. సాహిత్య చరిత్ర రచనలో తెలంగాణ ప్రాంత సాహిత్యానికి జరిగిన అన్యాయాన్ని విప్పి చూపించారు. రెండు ప్రాంతాల మధ్య వివిధ చారిత్రక కారణాలవల్ల దళిత, మైనారిటీ, స్త్రీవాదాలు ఒకే విధంగా లేవని- అలా ఎందుకు లేవో కూడా స్పష్టంగా చెప్పారు. అలాగే తర్వాత వ్యాసాల్లో దళిత,స్త్రీ, ముస్లిం వాదాలు ఎక్కడ ఇబ్బంది పడ్డాయో కూడా స్పష్టంగా గుర్తించారు. అందుకే ఆ వాదాలు తెచ్చిన చైతన్యాన్ని గుర్తిస్తూనే అవి మధ్యే మార్గ కవులతో మిలాఖతైన వైనం గురించి మాట్లాడుకోవాలన్నారు. 

‘కొలుపు’లోని వ్యాసాలు రాస్తున్న కాలంలో రకరకాల వాదాలు- వాటి ప్రభావాలు తెలుగు సాహిత్య రంగాన్ని కుదిపేస్తున్నాయి. అప్పుడే బయలుదేరిన వాదాల మీద అంత ఖచ్చితమైన అభిప్రాయాలు వెలువడే అవకాశం చాలా తక్కువ. అలాంటి సందర్భంలోనే నిర్మొహమాటంగా వాటి సాఫల్య వైఫల్యాలను విమర్శనాత్మకంగా అంచనా కట్టారు రచయిత. ఈ అన్నిరకాల వాదాలను వాటి చారిత్రక సన్నివేశంలోనుంచి సంపూర్ణంగా అర్థం చేసుకుంటే తప్ప వాటి మీద వ్యాఖ్యానించే పరిస్థితి ఉండదు. అలాంటిది వాటిని విమర్శకు పెట్టాలంటే ఎంత లోతుగా అధ్యయనం చేయాలో? ఆ అధ్యయనం తాలూకు విస్తృతి ఆయన చేసిన ప్రతీ సూత్రీకరణలోనూ కనిపిస్తుంది. ఆయన చేసే సూత్రీకరణల్లో సాధికారతతో బాటు నిర్మొహమాటమి కూడా ఒక ప్రధాన విషయంగా ముందుకు వచ్చింది. ఇలా నిర్మొహమాటంగా రాసేవారు తెలుగు విమర్శకుల్లో తక్కువే. ఒకప్పుడు రాచమల్లు రామచంద్రారెడ్డి, త్రిపురనేని మధుసూధన రావుల తర్వాత కాసుల ప్రతాపరెడ్డి నిర్మొహమాటమిని ప్రధాన లక్షణంగా మార్చుకొని విమర్శను ఆయుధం వలె వాడుకున్న తెలుగు విమర్శకులు. అయితే ‘తెలుగు సాహిత్యానికి వాదాల, సిద్ధాంతాల గొడవ ఎక్కువ. ఎప్పుడు ఏ వాదం బలంగా ముందుకు వస్తే అందుకు అవసరమైన సాహిత్యం పుట్టుకొస్తుంది’ అని చెప్పిన ప్రతాపరెడ్డి ఆ వాదాల సాఫల్య వైఫల్యాలను సరిగ్గానే గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ సంకలనం అప్పుడు వాదవివాదాలకు కేంద్రంగా నిలిచింది. వాదాలను వివాదాలుగా మార్చే వారు కొందరు దీని మీద ఒంటికాలుమీద లేచిన సందర్భాలు కూడా ఉన్నాయి.ఈ పరిస్థితి కూడా సాహిత్యంలో ‘కొలుపు’ సృష్టించిన అలజడిని సూచిస్తుంది.

విప్లవ సాహిత్యం గురించి విపులంగా చర్చిస్తూ ‘రక్తం చేత రాగాలాపన’ అన్న వ్యాసంలో శివారెడ్డి కవిత్వం మీద నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను బయటపెట్టారు.’ విప్లవ శిబిరంలోని కవుల కవిత్వం లోని పద చిత్రాల వ్యామోహానికి కారణం నూటికి నూరుపాళ్ళు శివారెడ్డి కవిత్వ ప్రభావమే’నన్నారు. ఇంకో సందర్భంలో ‘శివారెడ్డి కవిత్వం విప్లవ కవిత్వానికి చేసిన నష్టం అంతా ఇంతా కాద’ని కూడా అంచనా వేశారు.సాహిత్యంలో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా విమర్శ దగ్గర అందరూ సమానమేనని నిరూపించిన  సాహిత్య విమర్శ కాసుల వారిది. నిజమైన విమర్శకు మోహమాటమి గానీ, స్థాయీ బేధాలు గానీ ఉండవు. ఈ క్రమంలోనే సాహిత్యం మీద వ్యక్తిగత ప్రభావాలు పడటం వల్ల సాహిత్య విలువలు, ప్రమాణాలు పడిపోవటాన్ని ప్రతాపరెడ్డి సహించరు. ఇది ప్రతాపరెడ్డి ధోరణి. ఇది మంచి విమర్శకునికి ఉండవలసిన లక్షణం. ఈ ధోరణి చాలా వ్యాసాలలో కనిపిస్తుంది. బహుశా!ఈ ధోరణి వల్లనే ఆయన చాలామందికి శత్రువుగా కనిపించి ఉంటారు. ఇదేవిధంగా సినారె గురించి కూడా రాశారు. ఒకప్పుడు రాచమల్లు రామచంద్రారెడ్డి కాళోజి గురించి దిగంబర కవుల గురించి పొరపాటు పడి వాళ్లను ఈసడించుకున్నారు. వాళ్ల పట్ల రారా ప్రిజుడైజ్ అయి అలా ప్రవర్తించిన సంగతి అందరికీ తెలిసిన సత్యమే. అయితే ప్రతాపరెడ్డిలో మాత్రం ఇలాంటి ప్రిజుడిస్సులు ఏమీ కనిపించవు. ఏది రాసిన వాస్తవాల పునాది మీదనే రాయటం ప్రతాపరెడ్డి పద్ధతి. కొందరు ప్రసిద్ధుల గురించి రాస్తున్నప్పుడు ప్రతాపరెడ్డిలో ఒక ఆవేదన, ఒక ఆగ్రహం ఉన్నట్టు కనిపిస్తుంది. అదంతా ధర్మాగ్రహం మాత్రమే. కొందరి ధోరణుల వల్ల సాహిత్యం, ఆ సాహిత్యం మూలంగా సమాజం చెడిపోకూడదన్నదే ప్రతాపరెడ్డిలోని ఆవేదనగా కనిపిస్తుంది.

నిజాయితీగా రాయటం వల్ల ప్రతాపరెడ్డి శైలికి ఉదాత్తత ఒక లక్షణంగా వచ్చి చేరింది. రారా గారి శైలిలోవలె వేగమూ అబ్బింది. చెప్పే విషయం మీద పూర్తి స్పష్టత ఉండటం కూడా శైలిలోని గొప్పదనానికి ఒక కారణమై ఉంటుంది. అచ్చం రారా గారి వలె విడవకుండా చదివించే శైలి ప్రతాపరెడ్డి గారిది. అయితే అనేక వాదాలతో పాటు సాహిత్య రంగంలో తెలంగాణ వాదాన్ని స్థిరీకరించే ప్రయత్నం ఈ వ్యాసాల్లో అంతటా కనిపిస్తుంది. రాజకీయంగా మలిదశ తెలంగాణ ఉద్యమం ఊపందుకోక ముందే తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగాలలో అది మొదలయింది. దానికి సాహిత్య రంగంలో కాసుల ప్రతాపరెడ్డి లాంటి వాళ్ల పాత్ర ఎంతో ఉంది. అయితే ఈ సంకలనంలో  చివరి వ్యాసం కాళోజి మీద రాసింది. ‘కాళోజీని యాది చేసుకుంటే తెలంగాణను యాది చేసుకున్నట్టే’ అంటారు ప్రతాపరెడ్డి. కాళోజి జీవిత సాహిత్యాలను గురించి గొప్ప విశ్లేషణ ఈ వ్యాసంలో కనిపిస్తుంది. తెలంగాణ కోణం నుంచి సాహిత్యాన్ని చూసే దృక్పథాన్ని అందించే వ్యాసాన్ని మొదట ఉంచి, యావత్ తెలంగాణకే పర్యాయపదమైన  కాళోజీ గురించిన వ్యాసాన్ని చివర వుంచి ప్రతాపరెడ్డి 2002లోనే సాహిత్యంలో తెలంగాణ వాదాన్ని బలంగా స్థాపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమై దశాబ్ద కాలం గడిచిపోయిన సందర్భంగా ‘కొలుపు’ లాంటి పుస్తకాలకు ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంటుంది. తెలుగు సాహిత్య చరిత్రలోనైనా తెలంగాణ సాహిత్య చరిత్రలోనైనా కొలుపు నిజంగా ఒక అధ్యాయం. ముందుమాటలో బీసీ రాములు  ‘బహుశా!ఈ దశాబ్దంలో తెలుగులో ఇన్ని వాదాలను, వివాదాలను చర్చించిన మొదటి సంకలనం ఇది’ అన్నారు. కానీ ఈ రెండు దశాబ్దాలలో కూడా ఇలాంటి పదునైన పుస్తకం రాలేదంటే అతిశయోక్తి కాదు.

You Might Also Like

Leave a Reply