ఆపాత మధురాలు – పది ప్రసిద్ధ ప్రపంచ కథలు

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

********

ఆపాత మధురాలు – పది ప్రసిద్ధ ప్రపంచ కథలు
స్వేచ్ఛానువాదంః కాళ్లకూరి శేషమ్మ

 అక్షరాన్ని ప్రేమించేవాళ్ళం ఎక్కడ ఏ చిన్న కాగితం ముక్క కనిపించినా చదివేస్తుంటాం. ఇక పుస్తకమైతే, అది ప్రాంతీయమైనా, దేశీయమైనా, ప్రపంచానికి ఆవలెక్కడో ఉన్న ప్రాంతానిదైనా మనలోని సాహిత్య పిపాసకు అడ్డు కాదు. అనుభవాలిచ్చే జ్ఞానంతో పాటు చదువుకున్న సాహిత్యం జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకి పరిష్కారాలను అందిస్తుంది. జీవితం పట్ల అవగాహనను, లోచూపును కలిగిస్తుంది.

పరిచయం చేసుకుంటున్న పుస్తకం ఆపాత మధురాలు

కాళ్లకూరి శేషమ్మ గారు స్వేచ్ఛానువాదం చేసిన ఈ పుస్తకంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వివిధ రచయితల పది కథలున్నాయి. ఇవన్నీ ఒకటి రెండు శతాబ్దాల క్రితంనాటివి. 

మానవ ప్రవృత్తి ఇతివృత్తంగా రాసిన ఏ కథైనా ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు, అన్ని కాలాలకు, మనుషులందరికీ వర్తించేదే అయి ఉంటుంది. మనిషి ఆలోచనలు, ప్రవర్తన, ప్రేమ, స్నేహం, ద్వేషం, అసూయ ఇలా ఏ భావోద్వేగమైనా ఒకే విధంగా ఉంటుందనటానికి ఈ కథలు నిదర్శనం. ప్రాంతం, భాష, కాలం వేరు కావచ్చు. అంతవరకే. మనం ఎక్కడికైనా పర్యాటకానికెళ్ళినప్పుడు తటస్థపడే వ్యక్తులు కొత్తగా అనిపించరు. మనందరిలో ఉండే సామాన్య లక్షణాల్ని గమనిస్తే ఎవరూ అపరిచితులుగా తోచరు.

అలెగ్జాండర్ పుష్కిన్, ముపాసా, గోర్కీ, లియో టాల్ స్టాయ్, సాకి, దోస్తోవిస్కీ, పెర్ల్ బక్, సెల్మా లోగెలాఫ్ రాసిన చిన్న కథల్ని ఈ పుస్తకంలో చూడచ్చు.

మొదటి కథ ఎలుకల బోను

కథానాయకుడు ఎలుకల బోనులు అమ్మే వ్యక్తి. వృత్తి లాభసాటిగా లేకపోవటంతో చిన్నచిన్న దొంగతనాలు చెయ్యటమో, యాచన ద్వారానో జీవితాన్ని నడుపుకుంటూ ఉంటాడు. 

ఈ విశాల ప్రపంచంలో ఉన్న అపార ప్రకృతి సంపద పట్ల వ్యామోహం కలిగితే మనిషి కూడా బోనులో ఎలుకలాగే బందీ అయిపోతాడు కదా అని ఆలోచిస్తాడతను.

ఆరోజు ఎలాటి వ్యాపారం జరగదు. ఆకలితో ఒక ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లోని వ్యక్తి పేదవాడే కాని అతిథిని ఆదరిస్తాడు. తను పనిచేసే రోజుల్లో కూడబెట్టుకున్న సొమ్మును చూపిస్తాడు. ఆరాత్రి గడిచింది. తెలవారి ఎలుకల బోనుల వ్యాపారి కృతజ్ఞతలు చెప్పి బయలుదేరతాడు. కానీ అంతలోనే వెనక్కి వచ్చి ఆ ఇంటి ఆసామి దాచుకున్న డబ్బును దొంగతనం చేస్తాడు. తాను ఆలోచించినట్టే డబ్బు పట్ల వ్యామోహంతో బందీ అయిపోయాడు.

ఆ డబ్బుతో ఎవరి కంటా పడకూడదని, అడవి దారిలో బయల్దేరాతాడు. దారి తప్పి అక్కడక్కడే తిరిగితిరిగి ఆకలితో, నీరసంతో సమీపంలోని కార్ఖానాలోకి వెళ్తాడు. కార్ఖానా యజమాని అతడిని చూసి తనకు తెలిసిన వ్యక్తి అనుకుంటాడు, కాదని వారిస్తున్నా ఇంటికి తీసుకెళ్తాడు. అది క్రిస్మస్ పండుగ వేళ. శుభ్రమైన బట్టలు, మంచి భోజనం ఇస్తాడు. 

తాననుకున్నట్టు ఎలుకల బోను వ్యక్తి తన మిత్రుడు కాదని గ్రహించిన ఇంటి యజమాని వెళ్లిపొమ్మంటాడు. యజమాని కూతురు ఆదరంగా ఆపై సంవత్సరం క్రిస్మస్ కి కూడా రమ్మని చెపుతుంది. ఆ ప్రేమపూర్వకమైన ఆతిథ్యానికి ఎలుకల బోను వ్యక్తిలో ఎలాటి పరివర్తన కలిగిందో చదవండి.

ఎవరినైనా ప్రేమతో మంచి మార్గంలోకి నడిపించగలమంటూ ప్రేమకున్న శక్తిని చెపుతుందీ కథ. 

పెర్ల్ బక్ రాసిన శత్రువు దయామయులైన డాక్టర్ దంపతుల కథ. 

అవి యుద్ధం రోజులు. ఒక శత్రు సైనికుడు గాయపడి తన ఇంటి సమీపంలో పడి ఉండటం చూసిన డాక్టర్, అతని భార్య తమకు, తమ కుటుంబానికి ఆపద రావచ్చన్న భయాన్ని, సందేహాన్ని పక్కన పెట్టి మానవత్వాన్ని చాటుకున్న కథ. తోటి మనిషి పట్ల ప్రేమను, సహానుభూతిని చూపలేని పరిస్థితులు ఎదురవచ్చు. కానీ వాటికి ఎదురేగి, మనస్సాక్షికి, తాను నమ్మిన విలువలకి కట్టుబడి ఉన్నప్పుడు అందులో ఆదర్శం చరిత్రను సృష్టిస్తుంది. 

ఇక్కడో పిట్టకథ చెప్తాను, 

ఇటీవల వచ్చిన టూరిస్ట్ ఫ్యామిలీ అనే చిన్న సినిమా ఇలాటి సందేశాన్నే ఇచ్చింది. జీవించేందుకు పరిస్థితులు కఠినం అయిన నేపథ్యంలో స్వదేశం విడిచి వచ్చిన శరణార్థి కుటుంబం కొత్త సమాజంలో ఎలా ఒకరుగా నిలబడగలిగారో చెప్పిన సినిమా ఇది. మనసులోని సున్నితమైన పార్శ్వాన్ని కాపాడుకుంటూ, తోటివారికి తన పరిధిలో ఏ కాస్త మంచైనా చెయ్యగలిగితే పరాయివారంటూ ఎవరూ ఉండరు. 

దేశాల మధ్య యుద్ధాలు ఎలాటి రక్తపాతానికి, ఎంతటి వినాశనానికి దారితీస్తాయో చెప్పక్కర్లేదు. గెలిచిన దేశం ఓటమి పాలైన దేశానికి సంబంధించిన ప్రజల అస్తిత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు వారి భాషా, సంస్కృతుల్ని అణచివెయ్యటాన్నిఆఖరి పాఠం కథలో అల్ఫోన్స్ డూడె సున్నితంగా ఒక పాఠశాల నేపథ్యంలో చెప్పారు. మన ప్రస్తుత సమాజం కూడా భాషకి సంబంధించిన అనేక సమస్యల్ని ఎదుర్కొంటోంది. 

ముపాసా రాసిన సైమన్ వాళ్ల నాన్న కథలో పిల్లల్లో ఉండే రకరకాల మనస్తత్వాలు, సమస్యలు చూస్తాం.

కొత్తగా బడిలో చేరిన వాడికి నాన్న లేడని అందరూ హేళన చేస్తారు. ఉండేవాడని, చనిపోయాడని చెప్పినా వాళ్ల అల్లరి ఆగలేదు. సున్నితమైన ఆ పసివాడి మనసు ఆ బాధ పడలేక చనిపోవాలన్న ఆలోచన చేస్తుంది. కానీ అమ్మ గుర్తొస్తుంది వాడికి. పిల్లల్ల మనసులు, వాళ్ల ఆలోచనలు, ఒంటరి తల్లులు పిల్లల్ని పెంచుకుందుకు పడే అవస్థలు ఈ కథ చెపుతుంది. కథలో ఆ పసివాడికి ఒక దయామయుడైన తండ్రి తటస్థపడతాడు.

పెరల్ బక్ రాసిన కథ ముసలి తల్లి

ఆమె వృద్ధురాలు. కొడుకు దగ్గర ఉంది. కొడుకేమో పెద్ద హోదాలో ఉన్నాడు. ఆమె పల్లెటూరి అలవాట్లు, తిండి తినే పద్ధతి కోడలికి, కొడుక్కి చిరాకు తెప్పిస్తాయి. ఆకలి తీరకుండానే భోజనం ముగించే తల్లి ఆనక ఎవరూ చూడకుండా కొన్ని ఆహార పదార్థాల్ని తన గదిలోకి తీసుకెళ్లి తింటూంటుంది. మనవల్ని దగ్గరకి పిలిచి కబుర్లు చెప్పాలనుకుంటుంది. సాధ్యం కాదు. బ్రతకటం దండుగ అనుకుని జీవితం చాలించాలనుకుంటే కొడుకు తల్లికి కాపలాగా మరింత మందిని నియమిస్తాడు.

వృద్ధాప్యంలో శారీరక బలహీనత కారణంగా ఎవరో ఒకరి మీద ఆధారపడి జీవించవలసి రావటం తప్పకపోవచ్చు. ప్రస్తుత ప్రపంచంలోని సమాజాలన్నీ అధిక శాతం వృద్ధుల సంఖ్యతో నిండిపోతున్నాయి. వారిని అక్కున చేర్చుకుని, వాళ్ల అనుభవాలను, ఆరాటాలను వినగలిగే తరాన్ని తయారు చేయవలసిన అవసరం ఉంది.

సాకి రాసిన కథ చెప్పనా? ఆసక్తికరంగానూ, ఎంతో వాస్తవంగానూ ఉంది. 

ఒక రైలు ప్రయాణంలో ముగ్గురు పిల్లలు తమ పిన్ని చెప్పే కథల్ని వినేందుకు ఎంతమాత్రం ఆసక్తి చూపించరు. ఆమె చెప్పే నీతి కథలు, అనగనగా మంచివాళ్ళ కథలు వాళ్లని ఆకర్షించవు. వాళ్ల మానాన వాళ్ళు రైలంతా పరుగులెత్తుతూ అల్లరి చేస్తుంటారు. ఇదంతా చూస్తున్న ఎదుటి సీట్లోని వ్యక్తి పిల్లల్ని పిలిచి కథ చెప్పినపుడు వాళ్లు ఆసక్తిగా వింటారు. వాళ్లు కథలో పూర్తిగా నిమగ్నమైపోయి, మంత్రముగ్ధులవుతారు. 

ఆ కథలో ఒక మంచి, ఒక నీతి లేదని, తలాతోక లేదని పిన్ని ఆశ్చర్యపోతుంది. పసివాళ్ల ఊహలకి తగిన కథలు చెప్పటం, మెప్పించటం అందరికీ పట్టుబడే సంగతి కాదు. ప్రయత్నించి చూడమంటాడా ఎదుటి సీట్లోని వ్యక్తి.

పిల్లల్ని తక్కువ అంచనా వేస్తుంటాం. వాళ్ల ఊహా ప్రపంచమెంత పెద్దదో మనకి తెలియదు. వాళ్లకేమి కావాలో వాళ్లకి స్పష్టంగా తెలుసన్నది మనమే తెలుసుకోం. 

టాల్ స్టాయ్ రాసిన మూడు ప్రశ్నలు. 

ఒక పని ప్రారంభించేందుకు సరైన సమయం నిర్ణయించుకోవటమెలా, దానికి తగిన వారిని ఎంచుకోవటమెలా, అత్యవసరంగా ఏరోజు చెయ్యవలసిన పనిని ఆరోజు ఎంపిక చేసుకోవటమెలా అన్న మూడు ప్రశ్నలు ఒక రాజును కలవరపెట్టాయి. ‘ఎవరైతే తన ప్రశ్నలకి సరైన సమాధానాలు చెపుతారో వారికి బహుమతులిస్తానంటూ’ రాజ్యంలో దండోరా వేయిస్తాడు.

సంతృప్తి కలిగిన సమాధానాలు దొరక్క రాజు తానే వెతుక్కుంటూ పక్కనున్న అడవిలోని ఒక ముని దగ్గరకెళ్లి అడుగుతాడు. మౌనమే సమాధానమా అన్నట్టు ముని తన పని తాను చేసుకుంటూంటాడు. సమాధానం కోసం ఎదురుచూస్తూ రాజు మునికి పనిలో సహాయపడతాడు. 

ఆఖరికి తనకు సమాధానమిమ్మని అడిగినప్పుడు అప్పటిదాకా రాజు ప్రవర్తించిన తీరులోనే అతని ప్రశ్నలకి సమాధానాలున్నాయని వివరిస్తాడు ముని. 

ఇలాటి మీమాంస ప్రతి వారి జీవితంలోనూ ఎదురవుతూనే ఉంటుంది. అప్రయత్నంగా సమాధానమూ స్ఫురిస్తుంటుంది.

దోస్తోవిస్కీ రాసిన పిల్లల పండుగ వేడుకలు – చర్చ్ లో పెళ్లి

ఒక వ్యాపారవేత్త ఇంట జరిగే పిల్లల పండుగలో ఒక కృత్రిమ వాతావరణం నిండి ఉంటుంది. 

బొమ్మల మధ్య ఆడుకుంటున్న పిల్లల్లో అందమైన పదకొండేళ్ల పిల్లను చూసి ఆ పిల్ల తండ్రి బాగా ధనవంతుడని, కూతురి పెళ్లికి పెద్ద మొత్తం కట్నంగా ఇస్తాడని అక్కడ చేరినవాళ్లు మాట్లాడుకుంటారు. అతిథిగా వచ్చిన ఒక మధ్యవయస్కుడిని ఆ సంభాషణ ఆకర్షిస్తుంది. ఆ అవకాశం దక్కించుకోవాలన్న పథకంతో ఆ మధ్యవయస్కుడు పిల్ల తల్లిదండ్రులతో అప్పటికప్పుడే స్నేహం చేసుకుంటాడు.

పదేళ్ల తర్వాత అనుకున్నట్టుగానే అత్యధిక కట్నంతో తనకంటే ఎంతో చిన్నదైన ఆ పదహారేళ్ల అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. చిన్నారి పెళ్లికూతురు దుఃఖంలో మునిగి పోతుంది. మనిషిలో దురాశ, స్వార్థం, డబ్బు పట్ల వ్యామోహం కలిగించే మైకం మంచి చెడుల ప్రస్తావన తోచనివ్వదు. ప్రపంచ చరిత్రలో ఇలాటి అన్యాయానికి బలైపోయిన ఆడపిల్లలెందరో! సమాజం ఇప్పుడైనా ఏం మారిందని?

గోర్కి కథ వర్షరుతువులో ఒకనాటి రాత్రి

తినటానికి తిండి లేక, తలదాచుకునే గూడు లేక నడిరోడ్డు మీద మంచులో అతను, ఆమె ఎదురుపడతారు. అతి కష్టం మీద చిన్న రొట్టె సంపాదించుకుని పంచుకుంటారు. కానీ మంచు, చలి బాధ నుంచి తప్పించుకునే దారి లేదు. జీవితంలో దగాపడిన ఆమె తన దుఃఖాన్ని పక్కనపెట్టి మానవత్వంతో అతనికి కొంత సాంత్వననిస్తుంది. కష్టం అంటే తెలిసిన ఆమె రేపటి గురించిన భరోసాగా తానున్నానంటూ ధైర్యం చెప్తుంది. 

అలెగ్జాండర్ పుష్కిన్ కథ మంచుతుఫాను

ధనవంతుల ఇంట పుట్టిన అమ్మాయి ఒక పేద సైనికుడిని ప్రేమిస్తుంది. సైనికుడు కూడా ఆమెను ఇష్టపడతాడు. పెద్దలు ఇష్టపడకపోయినా ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు. వాళ్లు నిర్ణయించుకున్న పెళ్లి రోజున ఏమైందో, ఆ ప్రేమజంట ఏమయ్యారో ఆ మంచుతుఫానేంటో కథ చదవాల్సిందే. ప్రేమలో నిజాయితీదే విజయమంటారు రచయిత. సినీఫక్కీలో ఎన్నో మలుపులున్న కథ. 

వస్తు వైవిధ్యంతో ఉండి, ప్రసిద్ధిపొందిన ఈ కథలను చదవటం ఒక గొప్ప అనుభవం. వీటిని తెలుగు పాఠకులకు సులువైన భాషలో అందించిన అనువాదకురాలు శేషమ్మగారికి అభినందనలు.

పుస్తకం వెలః రూ. 120/-

ముద్రణః కలిమిశ్రీ గ్రాఫిక్స్, విజయవాడ. ఏప్రిల్, 2025

You Might Also Like