మనల్ని ప్రశ్నించే బయటి తావుల తెలుగుజాడలు
వ్యాసకర్త: డా. రాయదుర్గం విజయలక్ష్మి
**********
“తెలుగు అన్నది భాష మాత్రమే కాదు, ఒక జాతి. ఆ జాతి మూలాలు మనం గీసుకున్న భాగోళికహద్దుల్లో మాత్రమే ఒదిగి లేవు. ఈ ఎల్లలు దాటి తిరిగినప్పుడు మాత్రమే, మనం దేవులాడుకుంటున్నది మన కాళ్ళకిందనే అని తెలిసి వస్తుంది. కొన్ని బంధాలను మనం వదిలేశాం. కొన్నిటిని తెగిపోయాయి అనుకుని మరిచిపోయాం. కానీ, ఎల్లలకావల తమ మూలాలకోసం తడుములాడుకుంటున్న వాళ్లను చూసినప్పుడు మాత్రం, గుండెల్లో దేవుతుంది. వాళ్ళ కోప నిష్టూరాల వెనుక ఉన్న బాధ మన పట్టనితనాన్ని ఎత్తి చూపుతుంది”…. అన్న యీ మాటలు ఆర్ ఎం. ఉమా మహేశ్వరరావుగారి రచన *తెలుగుజాడలు* పుస్తకానికి ఆత్మవంటిది.
ఈ పుస్తకంలోని ప్రాంతాలు అన్నీ తెలుగురాష్ట్రాలకు, భారత దేశానికి అవతలనున్నవే. ఆంత్రోపాలజీ పరిశోధకుడు, తెలుగు భాషా ఉద్యమ కార్యకర్త స. వెం. రమేశ్ గారు, శ్రీ అడపాల సుబ్బారెడ్డి గారు తెలుగు తావులను వెదుకుతూ చాలా ప్రాంతాలను చుట్టివచ్చిన భాషాయాత్రికులు. ఇద్దరూ శ్రీలంకకు వెళ్ళి అక్కడున్న అహికుంటికలు అన్న తెలుగు వారినికలిసి, వారి అభ్యర్థన మేరకు వారికి తెలుగును నేర్పడం కోసం పుస్తకాలను తయారు చేసికొని 2014 లో రెండవ విడత ప్రయాణమైనప్పుడు వారితోకలిసి పయనించిన మరో మాతృభాషా ప్రేమికుడు ఉమామహేశ్వర రావుగారు. అలా మొదలైన వారి ప్రయాణం, శ్రీలంక, బాంగ్లాదేశ్, సిలెట్, కంబోడియా , ఆంగ్ కోర్ వాట్, మారిషస్, మలేసియా, బర్మా, ఖరగ్ పూర్ , బెంగాల్ లోని టిటాగడ్, తమిళ నాడు ల లోని తెలుగు వారిని కలిసి,అక్కడ మిగిలిఉన్న తెలుగుభాష ను, వారి చరిత్ర సంస్కృతులను, జానపద కళలను ఒడిసి పట్టికొని ఆంధ్రజ్యోతిలో కొన్ని వారాలపాటు ఆర్. ఎం. ఉమామహేశ్వరరావు గారు రాసిన వ్యాస సమాహార సంపుటి ఈ పుస్తకం.
శ్రీలంకలో సింహళము, తమిళము … మాత్రమే ప్రభుత్వ గెజిట్ లో ఉన్న భాషలు. అక్కడి తమిళుల సంఖ్యలో సగాని కన్నా(ఎనిమిదన్నర లక్షలకు పైబడిన వారు) ఎక్కువగా నున్న తెలుగు వారి ప్రసక్తి ఎవరికీ పట్టలేదు. తమ భాష పేరు తెలియని వీరు తాము మాట్లాడే భాషను “మనమాట” అని పిలుచుకొనే వారు. పాతికేళ్ల క్రితం శ్రీలంకలో సంచార జాతులపై జరిగిన పరిశోధనల్లో ఈ భాషను తెలుగు అని తేల్చాక, దీనిని “తెలుంగు” అని పిల్చుకుంటున్నారు. అయితే ఈ భాషకు లిపి ఉంది అన్న విషయం పదేళ్ళ క్రితం దాకా వీరికి తెలియదు.
శ్రీలంక మూలవాసులుగా జీవించే మూడు తెగల్లో, రెండు తెగల ప్రజలు ఇప్పటికీ మాట్లాడే భాష తెలుగే. జీప్సీలు అని పిలువబడే పాములను ఆడించే తెగ, కోతులను ఆడించే తెగ…. అడవులలోనుంచి సంచారజాతులుగా ఊర్లోకి వచ్చినా, ఆహారసేకరణ దశలోనే ఉండటం గమనించాలి. ఇప్పుడిప్పుడే శ్రీలంక ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలలో సొంత ఇళ్లను కట్టుకుని స్థిరపడుతున్న వీరు ఇంట్లోతెలుగును మాట్లాడినా బయట సింహళభాషను, తమిళాన్ని మాట్లాడుతారు. తమ వారు మరణిస్తే శ్మశానం కోసం, అక్కడి తెలుగు వారు క్రైస్తవులు గానో, బౌద్ధులు గానో మారిపోవడం వీరి సంస్కృతిలో వచ్చిన మరో మార్పు. కొలంబు వంటి నగరాలలో నున్న బంగారు అంగళ్ళ వాళ్ళు, హోటళ్ళ వాళ్ళు … ఇలా ఎన్నో వ్యాపారాలలో స్థిరపడినవాళ్లు తెలుగు వాళ్ళు. కానీ తాము తెలుగువారమని వాళ్ళు చెప్పుకోరు. తమను కూడా జీప్శీలని అంటారన్న భయంతో. “భాష భావోద్వేగాలకే పరిమితమైనది కాదు. అది బతుకుతో ముడిపడ్డ అంశం.” అన్నరచయిత మాట ఆలోచింపజేసే మాట!
అహికుంటికలు అన్న వారు ఎవరు? అని పరిశీలిస్తే మనం తెలుసుకునే అంశాలు ఒకవైపు ఉత్సాహాన్ని, మరోవైపు అంతులేని ఆర్ద్రతను కలిగిస్తాయి. బౌద్ధ గ్రంథాలైన ‘దీపవంశం’, ‘మహావంశం’ లో పేర్కొన్న అంశాలను బట్టి, వంగదేశపు రాజు విజయబాహు క్రీ.పూ. ఐదవ శతాబ్దం లో కళింగం నుండి ఏడుపడవల్లో బయలుదేరి సింహళం వచ్చాడని, అప్పటికే అక్కడ నాగులు, యక్షులు అన్న వారు ఉన్నారని, విజయబాహు ప్రయాణంలో తన భార్య మరణింనందున,యక్షుల రాజుకూతురు ‘కువేణి’ ని వివాహం చేసికున్నాడని వారికి జన్మించిన వారినే శ్రీలంక మూలవాసులైన ‘వెడ్డా’ లని అంటారని చరిత్రకారుల ఉద్దేశం. బ్రిటిష్ రికార్డులలో ఈ వెడ్డాల పేర్లలో బండన్న, ఎర్ర బండన్న, నల్లబండన్న… వంటి పేర్లు తెలుగు జాడలను చూపుతున్నాయి. విజయ బాహు వచ్చేనాటికి ఇక్కడ ఉన్న నాగులు ఎవరు అంటే వారే అహికుంటికలు అనే సమాధానమూ వస్తోంది. వీరి మాటల్లో వినిపించే కొన్ని పదాలు తెలంగాణలో, కొన్ని ఉత్తరాంధ్రలో, మరికొన్ని పదాలు రాయలసీమలోను, కొంగునాడు లోనూ కనిపిస్తాయి, కొంత రాగ పూరితంగా వినిపిస్తాయి. వీటిపై సరైన పరిశోధనలు జరిగితే, తెలుగు భాషా పరిధి మరికొంత దక్షిణానికి పొడిగింపబడుతుంది. అంకెలను తెలుగులో వలె చెప్పడం, పులిని ‘పెద్దనక్క’ అనడం, మంటను ‘నెగిడి’ అని, వారసత్వాన్ని ‘పరంపర’ అని, ఎక్కువ అన్న అర్థంలో ‘బిస’ అనడం, డబ్బుని ‘లెక్క’ (పుట.16)వంటి పదాలన్నీ మనల్ని ఆలోచింప జేస్తాయి. ‘మాటిన్ విక్రమసింగ’ అనే పరిశోధకుడు, సింహళ అక్షరం తెలుగు నుండి పరిణామం చెందిందని చెబుతాడు (పుట: 17)
శ్రీలంకలో తెలుగు రాజుల పాలన, 1739 లో ప్రారంభమైంది. పోర్చుగీసు బలగాలను ఎదిరించడానికి, మదురై తంజావూరు నాయకరాజులు సింహళ రాజులకు అవసరమైనపుడు సాయం చేసేవారు. ఇలా వీరిమధ్య ఆయుధ విస్తరణే గాక సంబంధ బాంధవ్యాలను కూడా కలుపుకోవడం మొదలయ్యింది. విజయరాజసింగ భార్య నాయకరాజుల కుమార్తె.
శ్రీలంకను, కండి రాజధానిగా పాలించిన చివరి రాజు, ‘శ్రీ విక్రమ రాజసింగ’ , 1815 లో బ్రిటిష్ దురాక్రమణను ఎదిరించి పోరాడి తన ఇద్దరు భార్యలతో బాటు బందీగా దొరికి పోయారు. ప్రస్తుతం తమిళనాడులోని, వేలూరు కోటలో వీరిని ఖైదు చేశారు. 1832 లో శ్రీ విక్రమ రాజ సింగ మరణించారు. వీరు మరణించిన వందేళ్ళకు వీరి ముని మనుమడు 1932 లో తాతకు, అవ్వలకు సమాధులను నిర్మించాడు. “1990 లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి, ఈ స్థలానికి భద్రతను కల్పిస్తూ ఒక స్మారక మండపాన్ని నిర్మించి, దాని నిర్వహణకు 210 ఏకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు”(పుట:28) కొస మెరుపు ఏమిటంటే, “తెలుగు రాజైన విక్రమ సింగ సమాధివద్ద తమిళ నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమాచార ఫలకంలో ఆయనను తమిళ రాజుగా పేర్కొవడం. అసత్యాలను కూడా అధికారం చరిత్రగా మార్చగలదు అనేందుకు ఇదొక నిదర్శనం” ప్రతిసంవత్సరం …జనవరి 30 వ తేదీన దేశం నలుమూలల్లో స్థిరపడినవీరి వంశస్థులందరూ అక్కడ కలుస్తారు. మరో కొసమెరుపు ఏమిటంటే బెంగుళూరు లో డిగ్రీ చదువుతున్న విక్రమరాజ సింగ, తన కుటుంబ చరిత్ర తెలియనందున తన పేరు చివరనున్న సింగ అన్న పదాన్ని తీసేయడం.
శ్రీలంక రాజ ఖైదీలుగా బ్రిటీషు వాళ్ళు గుర్తించిన ఈ కుటుంబానికి 1965 దాకా శ్రీలంక ప్రభుత్వం భరణం చెల్లించేది. క్రమంగా ఆ భరణం కూడా నిలిచిపోయింది. శ్రీలంకను పాలించిన చివరి తెలుగు రాజుల వారసుడు, కండి మోహన రాజసింగ, మోహన్ బాబు పేరుతో, ఇప్పటికీ చిత్తూరికి 18 కిలోమీటర్ల దూరంలో నున్న నరసింగరాయని పేట బస్టాప్ లో కనిపిస్తారు అన్న సత్యం కాలప్రభావానికి దయనీయమైన నిదర్శనం.
ఎల్లలు దాటిన తెలుగుభాషా చరిత్ర యిది. ”మేము ఆంధ్రదేశానికి వస్తాము. మాకు వొక వర్క్ షాప్ నిర్వహించి తెలుగు భాషను నేర్పించండి. మేము తిరిగి వచ్చి మా పిల్లలకు మన మాతృభాషను నేర్పుకుంటాము” అన్న శ్రీలంక తెలుగువారి కోరిక తీరేదెన్నడో కదా!
ఇది ఒక్క శ్రీలంకలోని తెలుగు వారి చరిత్ర సంస్కృతి, మాతృభాషాభిమానం.
వీరు తిరిగిన తక్కిన ప్రాంతాలలో నున్న తెలుగు వారి పరిస్థితి కూడా ఇటువంటిదే. 160 ఏళ్లకు ముందే తెలుగు జాడలు కనిపిస్తున్న ఖరగ్పూర్ లో అతిపెద్ద రైల్వే వర్క్ షాప్ ల్లో పనిచేయడానికి, శ్రీకాకుళం,విజయనగరం, బరంపురం వంటి ప్రాంతాలనుండి తెలుగు వాళ్ళ వలసలు మొదలయ్యాయి. అక్కడి జూట్ మిల్లులు కూడా వీరికి ఉపాధిని కల్పించాయి. 1944 లోనే ఆంధ్రవిద్యాపీఠం పేరితో, తెలుగుబడుల నిర్మాణం కొనసాగింది. ఇంగ్లీష్ తప్పనిసరి అవసరం కదా, తెలుగు మీడియం లో చదివితే …అన్న ప్రశ్నకు జవాబుగా, ఇంటిలో తెలుగులోనే మాట్లాడుకొంటామని, మాతృభాషలో తక్కిన పాఠాలు బాగా అర్థమవుతాయని,ఆంగ్ల భాష ఒక సబ్జెక్ట్ గా ఉన్నందున తమకు ఆంగ్లభాషకూడా వచ్చునని విద్యార్థుల ధీమా! (పుట:40) తెలుగు పాఠశాలలకు బెంగాలీ కుటుంబాలు కూడా తమపిల్లలను పంపడం, ఇక్కడ బెంగాలు, ఆంగ్ల మాధ్యమిక పాఠశాలలకన్నా తెలుగు పాఠశాలలు ప్రథమ huస్థానంలో ఉండటం గర్వింపదగిన అంశం.
తెలుగు బోర్డులు, తెలుగు మాటలతోనిండిఉన్న ఖరగ్ పూర్ లోనూ; తెలుగువారు మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉంటూ ఇరుకిరుకు ఇళ్ళల్లో జీవిస్తున్న ఢాకా లోనూ,; సిట్టి సీకాకులమా అనిపించే సిలెట్ లోనూ.. తెలుగు భాష, భాషమీది ప్రేమ, తెలుగు పల్లెకళలు ఇంకా మిగిలి ఉండటం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కూడా కలిగించే అంశం.
ఢాకా యూనివేర్సిటీ లో “దక్షిణ భారతదేశపు జాతులు” గురించి పరిశోధన చేస్తున్న మికా మాటలు గమనింప దగినవి. “మేము బంగ్లాదేశ్ కు ఇండియానుండి వలసవచ్చిన వారం అన్నమాట సరైనది కాదు అనిపిస్తుంది. ఇండో ఆస్ట్రో జనం అడుగుపెట్టేటప్పటికే, ఉత్తరభారత దేశంలో ద్రవిడులున్నారు.ఘర్షణల అనంతరం, తూర్పు, దక్షిణ ప్రాంతాలకు వెళ్ళి పోయారు. ….ఉత్తరాదిలోను, తూర్పునా, అక్కడక్కడా ఉండిపోయిన ద్రవిడులే తెలుగువాళ్లు ఎందుకు కాకూడదు? …ఇప్పటి ఆంధ్ర, తెలంగాణ ల్లో లేని కొన్నికులాలు, ఇంటి పేర్లు, మాటలు….మా దగ్గర మాత్రమే ఉన్నాయి” (పుట: 62) అన్నమాటలు మన మూలాలను ఇంకా లోతుగా వెదుక్కోవలసిన అవసరం ఉందన్న సత్యాన్ని చెబుతున్నాయి.
కంబోడియాలోని చిత్రలేఖనాలు, ‘తెలాంగ్ దేవత’ అన్న చీరకట్టుతోనున్న స్త్రీమూర్తి చిత్రంలో చుట్టూ ఉన్న మంత్రాక్షరాలు అని చెప్పబడుతున్న తెలుగు అక్షరాలు, కళింగం నుండి మహాబలిపురం దాకా ఉన్న తెలుగు ప్రాంతాలనుండి వలసవచ్చినవారు, పల్లవ లిపినుండి పరిణామం పొందిన(?) వెంగీ లిపిలో నున్న అక్షరాలు, చిత్రాలలో కనిపించే పల్నాటి కోడి పందేలు,….. ఇవన్నీ చరిత్ర పరిశోధకులు నిగ్గుతేల్చాల్సిన అంశాలు. అంతవరకు, కంబోడియాలో ‘ఖ్మేర్’ రాజ్యాన్ని స్థాపించినవారు తమిళ చోళరాజు రెండవ సూర్యవర్మన్అన్నా, సంస్కృతం ఊసు పట్టని, వైష్ణవ ఆలయాల జోలికి పోని చోళరాజులే కంబోడియా లోని అంగ్ కోర్ వాట్ వైష్ణవాలయాన్ని చోళశైలికి భిన్నంగా నిర్మించారని, మనల్ని మనంనమ్మించుకోవాలి. ఎడాపెడా చరిత్రను చెరిపివేసి,సర్వం తమిళం అంటూ రాసేసుకుంటూనే ఉన్నా ….చేతులు ముడుచుకొని ఉండవలసిందే. (పుట: 82) అన్న మాటలు, భాష, భాషతో బాటు తెలుగు చరిత్ర సంస్కృతికూడా ఎలా ఎలా ఖిలమై పోతున్నాయో అన్న దానికి నిదర్శనం.
5 తరాలకు ముందు, దాదాపు దక్షిణ భారతం అన్ని (59) ప్రాంతాల నుండి బ్రిటిష్ పాలకులచే, తీసుకుపోబడి, అడవులను నరికి మారిషస్ నగరాన్ని ఏర్పరచిన తెలుగువారు,పరస్పరం “జై తెలుగు తల్లి” అని పలుకరించుకునే తెలుగువారు, “మా ఊరు ఎక్కడ ఉంది?” అని అడిగే అలెక్స్ హేలీ వంటి మారిషస్ లోని తెలుగు వాళ్లు, ప్రస్తుతం తెలుగు భాషను మాట్లాడటం మర్చి పోతున్నా, తెలుగు పాటలను, జానపద గీతాలను స్వచ్చంగా పాడేవాళ్లు, తెలుగును కాపాడుకోవాలని తాపత్రయపడే 93 సంవత్సరాల వృద్ధుల మాటలు, పాటలు మనలను ఆర్ద్రపరుస్తాయి. 1948 నుండి క్రియా శీలకంగాప్రారంభ మయిన ఆంధ్రమహాసభ వలన,1958 నుండి బడులలో తెలుగు బోధన ప్రారంభ మయింది. ప్రాథమిక పాఠశాలనుండి, హయ్యర్ సెకండరీ దాకా 600 బడులు, 200 మంది తెలుగు టీచర్లు, 4000 మండి విద్యార్థులు… వారానికి ఒక్క రోజు తప్పని సరిగా తెలుగులోనే మాట్లాడు కోవాలన్న నియమం, దీనికి వారు ఆ రోజు జానపద కళలను ప్రదర్శించుకోవడం, తెలుగు కుటుంబాలు కలిసి భోజనాలు చేయడం…. వంటి కార్యాచరణ పద్ధతులను చూస్తే, ఒకవైపు ఆనందం, మరోవైపు తెలుగు భాష కు ఏమీ చేయలేక పోతున్నామన్న బాధ మనలను తొలిచి వేస్తుంది.
మలయా ద్వీపంతో 2,3 శతాబ్దాల కాలం నుండే భారత, చైనా దేశాలకు వ్యాపార సంబంధాలున్నాయి. కూలీలుగా కడుపు చేతబట్టుకొని సముద్రాలు దాటి వచ్చిన ఒకప్పటి బడుగు జనం వీరు. అయితే ఇప్పుడు ఇంటికొక్క కారైనా లేని తెలుగు కుటుంబాలు అక్కడ లేవు. 500 వందల తమిళ బడులున్న మలేసియా లో ఒక్క తెలుగు బడీ లేదు అన్న కొరత అక్కడి తెలుగు వారిది. దాదాపు 60 ఏళ్ల క్రితం , 30 శాఖలున్న తెలుగు సంఘం ప్రారంభమయింది. 5 అంతస్తుల భారీ భవనంతో తెలుగు అకాడమీ గా మారి, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంతో కలిసి, తెలుగు బోధనా కోర్సులను నిర్వహిస్తూ, 5000 వేలకు పైగా ప్రవేశిక నుండి డిప్లొమా దాకా తెలుగు కోర్సులను పూర్తి చేయడానికి సహకరించింది. ఇక్కడ ఎన్నో జానపద కళలతో బాటు, అతిక్లిష్టమైన ‘దాటు భజన’ ను ఇప్పటి తరం కూడా నేర్చుకుంటూ,మలేసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లో నమోదైన దాటు భజనను గిన్నీస్ బుక్ లోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మార్చ్ నుండి చిన్న పిల్లల కోసం “మలయజము” అన్న మాసపత్రికను కూడా నడుపుతున్నారు.
బర్మాలో తెలుగు భాషను నేర్పుతున్న, ఎర్రం నాయుడు గారిని, దక్షిణ తమిళ ప్రాంతంలో వేమనకు ఉన్న గుడిని(అన్వర్ధిఖాన్ పేటలో) గూర్చి చదివినపుడు, ఆనందంతో బాటు మన తెలుగుపట్ల మనకు కొరవడిన అభిమానానికి దిగులుపడతాము. మాతృదేశానికి దూరంగా నున్న వారిలోని భాషాభిమానం మనలో కొరవడినందుకు సిగ్గిల్లుతాము. ఈ పుస్తకాన్ని చదివిముగించిన తరువాత, సంచార జాతుల్లో తెలుగు వారే ఎందుకు ఎక్కువగా ఉన్నారు? అన్న విషయం మనలను ఆలోచనలోముంచుతుంది. “ఉత్పత్తి దశలోకి ముందుగా వచ్చిన తెలుగు జాతిప్రాచీనత చరిత్రలో నమోదు కావాలన్న తాపత్రయంతో చేసే గోరంత ప్రయత్నమే ఈ పుస్తకం” అన్న రచయిత మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి.
******
ఈ పుస్తకానికి వచ్చే ప్రతి రూపాయి తెలుగు వారి జానపద కళలను నిక్షిప్తం చేస్తూన్న “తెలుగు నెరవు సంస్థ”కు చెందాలన్న సదుద్దేశంతో, కళా చిత్ర ప్రచురణలు, మన్నారు పోలూరు, సూళ్ళూరు పేట, తిరుపతివారిచే (2025లో) ప్రచురింపబడినది యీ పుస్తకం.
ప్రతులకు:
తెలుగు నెరవు,
కేరాఫ్ ఎస్.విజయ్ రెడ్డి
1-311/1, రెండో అంతస్తు,
మున్సిపల్ ఆఫీసు సమీపంలో, పిచ్చాటూరు రోడ్డు,
శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా – 517644
ఫోన్: 8886066501 (ఫోన్పే, గూగుల్ పే),
8179866501
