రాయలసీమలో ఆధునిక సాహిత్యం – సామాజిక సాంస్కృతిక విశ్లేషణ

(ఇది డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ వారి చర్చ సారాంశం. ఈ చర్చ 2008లో వారి సమావేశంలో జరిగింది. ప్రచురణకు అనుమతి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
సమీక్షకుడు: బసాబత్తిన శ్రీనివాసులు

రాయలసీమలో ఆధునిక సాహిత్యం – సామాజిక సాంస్కృతిక విశ్లేషణ
రచయిత: వల్లంపాటి వెంకట సుబ్బయ్య

సమావేశ స్థలం: ఫార్మింగ్టన్ హిల్స్ గ్రంధాలయం, ఫార్మింగ్టన్ హిల్స్, మిచిగన్.
తేదీ, సమయం: ఆదివారం, జూన్ 8, 2008, మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు
పాల్గొన్నవారు: ఏపూరి హరనాథ్బాబు (చికాగొ), మెట్టుపల్లి జయదెవ్ (చికాగొ), వేములపల్లి రాఘవేంద్రచౌదరి, శంకగిరి నారాయణస్వామి, మద్దిపాటి కృష్ణారావు, పన్నూరు నారాయణ (కందుకూరు, ప్రకాశం జిల్లా), ముసునూరు ఆనంద్,
ఆరి సీతారామయ్య, తెలంగాణా జయప్రకాశ్, చెక్కిళ్ళ చైతన్య, వెలగా రవి, బసాబత్తిన శ్రీనివాసులు (ముఖ్య చదువరి), అడుసుమిల్లి శివ, ఆళ్ళ గణేష్, ఉండవల్లి అనూరాధ, సిద్దం రావు, చేకూరి విజయ్, ముఖ్య అతిధులు నెల్లుట్ల
వేణుగోపాల్, సి. వనజ.

రాయలసీమలో పుట్టినటువంటి నాకు రాయలసీమ పుట్టు పూర్వోత్తరాలకు సంబందించిన ఈ పుస్తకాన్ని చదవడానికి అవకాశమిచ్చిన డిట్రాయిట్ లిటరరీ క్లబ్ కి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాగే ఈ మహత్తరమైన పుస్తకాన్ని రాసిన స్వర్గీయ వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారికి నా అభివందనలు! ఇక పుస్తకం మీద నా అభిప్రాయం విషయానికి వస్తే వల్లంపాటి గారు రాయలసీమ చారిత్రక చిత్రం లో రాయలసీమ ఏర్పాటు గురించి మంచి వివరాలు అందించారు. రాయలసీమలో బళ్ళారి
లేకుండా పోవడం తద్వారా తుంగభద్ర ప్రాజెక్టు పోవడం ఇంకా ఆంధ్రభోజుడూ పరాయి వాడయిపోవడం గురించి చర్చించారు. సీమలో ప్రజలు బాదామి చాళుక్యులు, కంచి పల్లవుల మధ్య యుద్ధాలవల్ల ఎలా నలిగిపోయారో వివరించారు. విజయనగర సామ్రాజ్యంతో రాయలసీమ సంబంధాలు, మరాఠాలతో నైజాం నవాబుల పోరాటాలు సీమ ప్రజల జీవితాలను అతలాకుతలం చేయడాన్ని గుర్తుచేశారు. పాలెగాళ్ళని విజయనగర రాజులు పొషించడం, దత్త మండలాల ఏర్పాటు గురించి వివరించారు. రాయలసీమ సాహిత్యంతో కరువు సాన్నిహిత్యాన్ని వల్లంపాటి గారు స్పష్టంగా వివరించారు. ఇక కోస్తా ప్రాంతంలో ఆనకట్టలు, తద్వారా బాగా పంటలు పండడం దానివల్ల అక్షరాస్యత బాగా పెరిగిందని సీమ ఇటువంటి మార్పుకి దూరమైందని వల్లంపాటి గారి అవేదన మనకి పుస్తకమంతా కనిపిస్తూనే ఉంటుంది. పాతరోజుల్లో పాళెగాళ్ళు, ప్రస్తుత కాలంలో ఫాక్షనిస్టుల మధ్య సీమ ఎలా నలిగిపోతుందో చెప్పారు. రాజకీయనాయకులు రాయలసీమకి అన్యాయం జరుగుతుండగా చూస్తూ ఉన్నారే కానీ అన్యాయాన్ని ఎదుర్కోలేదని వాపోయారు.

ఇక సాహిత్యంలో రాయలసీమ చైతన్యం గురించి వివరిస్తూ శ్రీకృష్ణదేవరాయలు రచించిన “ఆముక్త మాల్యద” లో సామాన్య జీవితాలు మరియు వాటి వర్ణన పేర్కొన్నారు.గురజాడ “కన్యాశుల్కం” రాస్తున్న సమయంలో సీమలో వావిలకొలను సుబ్బారావు “ఆంధ్రవాల్మీకి రామాయణం”,”ఆర్య కథానిధి” మరియు “పతివ్రతా హితచర్య” వంటి గ్రంధాలను రాస్తున్నారని తెలిపారు. ఆధునిక సాహిత్యం సీమలో ప్రారంభం కాకపోవటానికి కవి పండితుల ప్రతిభా రాహిత్యం ఎంత మాత్రం కారణం కాదన్నారు. 19వ శతాబ్దం మధ్య భాగం నుంచి కోస్తా జిల్లాల ఆర్ధిక స్వరూపం మారిపోవడం, తద్వారా మంచి బడుల ద్వారా అక్కడి ప్రజల అక్షరాస్యత పెరగడం గుర్తు చేసారు. బెంగాల్ లో పుట్టిన సంఘ సంస్కరణోద్యమం గోదావరి జిల్లాలను ఎలా తాకిందో వివరించి, ఈ ప్రభావం రాయలసీమను తాకలేదన్న వాస్తవాన్ని గుర్తు చేసారు.

ఆధునిక కవిత్వంలో రాయలసీమ చైతన్యం రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ “పెనుగొండ” అన్న పాటతో ప్రారంభమయిఉండచ్చని వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు అభిప్రాయపడ్డారు. విద్వాన్ విశ్వం గారి “పెన్నేటి పాట” మాహాప్రస్థానం కి కవితావేశంలో ధీటైన కావ్యం అన్నారు. విశ్వం గారి మాటల్లో చెప్పాలంటే రాయలసీమ ఆధునిక కవిత్వంలో “శుకపిక శారికారపరుచుల్వినిపించవు”. ప్రేమలు, విరహాలు కనిపించవు. రాయలసీమ కవిత్వం రాయలసీమ బతుకంత భయంకరంగా, నిర్జీవంగా, శుష్కంగా, అలంకార రహితంగా ఉంటుంది. అన్నమయ్యను తొలి సంకీర్తనాచార్యుడిగా గుర్తిస్తే తెలుగులో సంకీర్తనా సాహిత్యం రాయలసీంలోనే ప్రారంభమయిందని అన్నారు.

1872లో అచ్చయిన “శ్రీ రంగరాజు చరిత్ర” మొదటి నవల తొలి తెలుగు నవల అయి ఉండచ్చని చాలా మంది వాదించారని వల్లంపాటి గారు అన్నారు. ఈ నవలని చారిత్రక నవలగా ఎలా పరిగణించలేమో విశ్లేషించారు. అలాగే ఈ నవలలో కధా వస్తువు లేదు అని చెప్పారు. 1915 నుంచి 1950 వరకు సీమలో నవలా సాహిత్యం సంచలనం ఎందుకు లేదో వివరించారు. సబా, నాదమునిరాజు నవలలో ప్రారంబించిన సమకాలీన జీవితచిత్రణను తరువాత తరం కొద్దిగా విస్త్రుతం చేయగలిగిందన్నారు. ప్రసిద్ధ కధారచయిత పి.రామక్రిష్ణారెడ్డి 1975లో రాసిన “నత్తగుల్లలు” సంచలనం కలిగించిందన్నారు. రాలసీమ నవలను నిశ్చితమయిన మలుపు తిప్పి దళిత, నిమ్నవర్గాలకూ, వర్ణాలకూ అంకితమిచ్చిన వాడు కేశవరెడ్డి అని చెప్పారు వల్లంపాటి గారు.
“దళితుడి పయనం” రెండవ ముద్రణకు ముందు మాటలో కేశవరెడ్డి “గత 22 సంవత్సరాలలో దళితపోరాటం వివిధ ప్రాంతాలలో సాగి, ఎన్నో దశలను దాటింది.నేడు దళితుడు తన సంకెళ్ళను కళ్ళకు అద్దుకోవటం లేదని నిస్సంకోచంగా అంగీకరిస్తున్నాను” అని చాలా స్పష్టంగా చెప్పారన్నారు.

గురజాడ “దిద్దుబాటు” ని మొదటి కథగా గుర్తిస్తే ఆ తరువాత 30 ఏళ్ళకు గానీ రాయలసీమలో మొదటి కథ రాలేదు. ఈ 30,40 సంవత్సరాల కాలంలో కొస్తా జిల్లాలలో గురజాడ, చింతా దీక్షితులు, శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి, విశ్వనాధ సత్యనారాయణ, వేలూరి శివరామ శాస్త్రి, మల్లాది రామక్రిష్ణ శాస్త్రి, గోపీచంద్, చలం, బుచ్చిబాబు, కరుణకుమార, కొడవగంటి కుటుంబరావు వంటి మహోన్నత కథా రచయితలు ఉద్భవించారని, అదే సమయంలో రాయలసీమలో సమకాలీన జీవితాన్ని
గురించిన సామజిక అవగాహన కనిపించలేదన్నారు వల్లంపాటి గారు. రాయలసీమలో కరువు గురించి రచయితలు గొప్ప కథలు రాశారని, నేటి యువతరం వీరి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగుతారన్న విశ్వాసాన్ని వ్యక్త పరిచారు.

(ఈ వ్యాసం కాపీరఈట్లు డీటీఎల్సీ వారివి)

You Might Also Like

One Comment

  1. రాణి

    ఇది రాయల సీమ సమగ్ర చిత్రణం. ఇందులో చరిత్ర, ఆ చరిత్రని గ్రంథస్తం చేసిన సాహిత్య చరిత్ర. దానికి దోహదపడిన భౌగోళిక స్థితిగతులు, తద్వారా ఆవిష్కృతమైన సాంస్కృతిక జీవన వికాసం, దాని పరిణామ క్రమం, తద్వారా జీవన విధానంలో వచ్చిన చైతన్యం మొదలయిన సమస్త విషయాలనీ సవివరంగా సప్రామాణికంగా సూత్రబద్ధమైన వివరణలూ శాస్త్రీయమైన అంచనాలతో విశ్లేషించడం జరిగింది.
    దీన్ని చదివితే ఒక ప్రాంతపు సామాజిక సాంస్కృతిక ఆర్ధిక రాజకీయ సమగ్ర చిత్రం కనిపిస్తుంది. ఈ మొత్తం చిత్రం సాహిత్యపు నేపథ్యంలో చిత్రించబడింది. అది సాహిత్యపు పరమ ప్రయోజనాన్ని గుర్తించే విలక్షణమైన పద్ధతి. విశిష్టమైన ఒరవడి.
    ఈ పుస్తకాన్ని గురించి జరగాల్సినంత చర్చ జరగలేదు.
    ఇలాంటి విస్తృత ప్రాతిపదిక కలిగిన విశ్లేషణాత్మక రచనలు ప్రతి జిల్లా నించీ కూడా వెలువడవలసిన అవసరం ఎంతైనా ఉంది.

Leave a Reply