ఏడు తరాల నీడ

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్
(ఈ వ్యాసం గతంలో తెలుగువెలుగు మాసపత్రిక జూలై సంచికలో ఏడుతరాల నీడ శీర్షికతో ప్రచురింపబడింది)
*********
ఉత్తమ సాహిత్యం ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, రచనకు చెందిన స్థలకాలాల్నీ ప్రతిబింబిస్తూనే ప్రపంచంలోని అందరినీ కదిలించగల అంశాలు తనలో దాచుకుంటుంది. అందుకే వాటి అనువాదాలు చదివితే ఆ భాషీయుల విలక్షణ సంస్కృతి అవగాహన కావడమే కాక మానవాళిని అన్నదమ్ముల్ని చేసే వెతలు, ఆనందాలు కూడా అనుభవానికి వస్తాయి. తెలుగుభాషను పరిపుష్టం చేసేందుకు ఎందరో ప్రఖ్యాత కవులు, రచయితలు అనువాద ప్రక్రియను చేపట్టి తామని ప్రభావితం చేసిన, తమకు నచ్చిన పుస్తకాల్ని తెలుగు పాఠకులతో పంచుకున్నారు. దాశరధి కృష్ణమాచార్యులు, దాశరధి రంగాచార్యులు, తిరుమల రామచంద్ర, శ్రీ శ్రీ వంటి వారెందరో అలా తమకు అభినివేశం ఉన్న భాషలో సాహిత్యాన్నో, తమను ప్రభావితం చేసిన సిద్ధాంతానికి చెందిన రచనల్నో అనువదించారు. ఇలా ప్రసిద్ధ రచయీతలు అనువదించిన రచనలే కాక అనువాదాల వల్లనే ప్రసిద్ధులైన రచయితలు కూడా ఉన్నారు. వారిలో ముందు వినిపించే పేరు సహవాసి. ఆయన ఆంగ్లం నుంచి సంక్షిప్తీకరించి, అనువదించిన నవలే ‘ఏడు తరాలూ. అమెరికా చరిత్రాలో చీకిటి కోణాల్ని ఆర్ధ్రంగా స్పృశిస్తూ అలెక్స్ హేలీ రాసిన రూట్స్ నవలకు ఇది అనువాదం.

ప్రపంచం ఒక కుగ్రామమైపోయిందని చెప్పుకున్నా మౌలికంగా మనిషి తన జాతి, తన భాష, తన వంశం, తన చరిత్ర వంటి వాటిలో తన ఉనికిని గుర్తించుకుంటాడు. తన భాషలోని అద్భుత సాహిత్యాన్నీ, తన జాతివారు చేసిన ఆవిష్కరణల్ని తన ఆస్తిగా గర్విస్తాడు. తమ వారు గతంలో సాధించిన విజయాలకు పులకిస్తాడు. తన జాతి అనుభవించిన కష్టాలకు తాదాత్మ్యత చెంది కన్నీరు పెడతాడు. తన వంశం వివరాలేమిటో, తాను ఏ జాతివాణ్ణో, తమవారు ఎక్కణ్ణించి వచ్చారో తెలియని వారి బాధ వర్ణనాతీతం. ఒక జాతి స్వార్థానికి మరొక జాతిజనులు బలవంతాన సముద్రాలు దాటించబడి సొంతజాతికి, తన సంస్కృతికి పరాయి అయి, నీచంగా చూడబడితే వారి వారసులకు ఆ బాధ హృదయంలో పుండులా సలుపుతుంది. అలాంటి పుండు మాంపుకునేందుకు తమ ఆఫ్రికన్ మూలాల్లోకి అమెరికన్ రచయిత అలెక్స్ హేలీ చేసిన అన్వేషణే ఈ నవల.

ఇది పూర్తిగా కల్పిత గాథ కాదు. హేలీ నిజజీవితంలో తన వంశపు మూలాలపై చేసిన లోతైన పరిశోధనకు అక్షరరూపం. ఈ నవల ఆంగ్లంలో విడుదలైనపుడు పెను సంచలనాలు సృష్టించింది. హేలీకి పురస్కారాలు పండించింది. దూరదర్శిని (టీ.వి.)లో ధారావాహికగా, వెండితెరపై చలనచిత్రంగా చిత్రీకరించబడింది. ఈ నవలను నల్లజాతి ప్రజలు తాము అనుభవించిన అణచివేతకు, తమ ఆత్మగౌరవానికి ప్రతీకగా దాచుకుంటే, తెల్లవారు గతంలో జరిగిన తప్పులకు పశ్చాత్తాపంగా చదివారు. మొత్తానికి ఆఫ్రికన్ అమెరికన్లలో ఓ పవిత్రగ్రంథం స్థాయి గౌరవం పొందిందీ నవల.

1750లో ఉత్తర ఆఫ్రికాలో గాంబియా తీరగ్రామమైన జఫర్ లో కింటో, రెబ్బాలకు కొడుకు కుంటా పుట్టడంతో కథ ప్రారంభమౌతుంది. డేవిడ్, అబ్రహంలు మూల పురుషులుగా ఇస్లాం మతంగా వస్తున్న పురాతనతెగ మాండికోకు చెందినవారు వాళ్లు. ఆఫ్రికాలోని ప్రకృతి సౌందర్యాన్నీ దానిలో మమేకమై జీవించే ఆ తెగవారిని, వారి వింత సంప్రదాయాలను ఎంతో చక్కగా చిత్రిస్తారు రచయిత. ముఖ్యంగా కుర్రాళ్లకు పూర్తిస్థాయి పురుషులై తెగను రక్షించుకునేందుకు అడవిలోకి పంపి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వంటివి వింతగా ఉంటుంది.

ఆ పురాతన నాగరికతలో 16ఏళ్లు పెరుగుతాడు కుంటా. పురుషత్వ శిక్షణ ముగించుకుని పొలానికి కావలిగా పడుకుని భవిష్యత్తులో వైవాహిక జీవనం గురించి మధురమైన కలలు కంటాడు. తర్వాతిరోజు ఉదయాన్నే తమ్ముడికి డప్పు చేసేందుకు మంచి కలప కోసం అడవిలోకి వెళ్లి ఆదమరచిన క్షణంలో ఓ అనుకోని ప్రమాదం వాటిల్లుతుంది. బానిసల కోసం వేటాడుతున్న తెల్లవారికి కుంటా దొరికిపోతాడు. వేటకుక్కలతో, మారణాయుధాలతో వేటాడి ఉచ్చువేసి పట్టుకుంటారు. తండ్రి మనుషులను ఎత్తుకు పోయే తెల్ల గెడ్డంవారి గురించి, వారి నుంచి వచ్చే చచ్చిన కోడి వాసన వంటి ఎన్నో గుర్తులు జాగ్రత్తలు గతంలోనే చెప్పినా పొరపాటున ఆదమరచి ఉన్న సమయంలో దొరికిపోతాడు. కొట్టి, కొట్టి స్పృహతప్పేలా చేసి తీసుకుపోతారు వారు.

అక్కడితో అతని జీవితంలో స్వేచ్ఛ అంతరించి ఘోరమైన బానిసత్వం ఉదయిస్తుంది. వందలాదిమంది నల్లవారిని బానిసలుగా పట్టుకుని అమెరికా తరలిస్తున్న ఓడలోకి సంకెళ్లతో చేర్చబడతాడు కుంటా. అక్కడ డెక్ పైనున్న బానిసలను అందర్నీ వివస్త్రలను చేసి, ఎదిరించినవారిని ఒళ్లు పుళ్లయ్యేలా కొడుతూంటారు. నల్లజాతి స్త్రీలపై ఘోరమైన అత్యాచారాలు చేస్తూంటారు. బానిసగా గుర్తుకోసం కాల్చిన ఇనుపకడ్డీతో గుర్తువేస్తారు. అనంతరం ఎక్కడో ఓడ అడుగు భాగంలో సంకెళ్లతో కట్టి పడేస్తారు. ఆ చీకటి గుయ్యారంలో గాయాలైన పుళ్లు, తమ మల మూత్రాల మధ్య ఘోరమైన ప్రయాణం అనంతరం అమెరికాలో దిగుతాడు కుంటా. అతని శరీరాన్నీ, అవయువాల పటుత్వాన్నీ పరీక్షించుకుని ఓ తెల్ల భూస్వామి కొనుక్కుంటాడు.

కుంటా బలవంతంగా బానిస బతుకు బతుకుతుంటాడు. అయినా ఎప్పుడూ తప్పించుకుని పారిపోయే ప్రయత్నాలు చేస్తుంటాడు. ప్రతి ప్రయత్నం విఫలమౌతుంది. ఓమారు తప్పించుకుని దొరికిపోయిన బానిసల్ని పట్టుకునే తెల్లవాడు శిక్షించదలిచి జననాంగాన్నో, పాదాన్నో ఒకటే ఎంచుకోమని గొడ్డలి ఎత్తి సైగ చేస్తాడు. ఏ పురుషుడూ సృష్టి చేసే శక్తిని వదులుకోకుడదన్న తమ తెగ సంప్రదాయం మేల్కొంటుంది, కుంటా మర్మావయువాన్ని కప్పుకుంటాడు. పాదాన్ని తెల్లవాడు నరికేస్తాడు. ఇక తప్పించుకునే అవకాశం లేదని తెలుసుకుని బానిస బతుకుతో సమాధానపడతాడు కుంటా. తోటి బానిస స్త్రీ బెల్ ను పెళ్లి చేసుకుంటాడు. వారికి కిజ్జీ అనే కూతురు పుడుతుంది.

ఈ పరిస్థితులు ఇలా ఉన్నా కుంటాకి తన తెగ సంప్రదాయాలు, మత విశ్వాసాల పట్ల అపారమైన నమ్మకం ఉంటుంది. చావడానికైనా సిద్ధపడతాడు కానీ వాటిని భంగపరిచేందుకు ఇష్టపడడు. ఐతే ఆ ఘోరమైన పైరిస్థితుల్లో తన భాషలో మాట్లాడడం, మతాచారాలు పాటించడం లాంటివి నిషేధం. అయినా రహస్యంగా అవి సాగిస్తూనే ఉంటాడు. కుంటా తన సంప్రదాయాల ప్రకారమే తన కూతురు కిజ్జీని పెంచుతాడు. తన మాతృభాషలోని కొన్ని పదాలు నేర్పుతుంటాడు. తన కథ అంతా చెప్తాడు. అంతే కాదు రాబోయే తరాలకూ ఈ కథ చెప్పాలని చెప్తాడు.

ఆ తర్వాతి కథలో కిజ్జీ, ఆమె వారసులు పడే దారుణమైన అవమానాలూ, బాధలూ ఉంటాయి. కుంటా తర్వాతి తరాల వారు అంతర్యుద్ధం అనంతరం అందరు బానిసల్లాగానే విముక్తి పొందుతారు. వివక్ష అనుభవిస్తారు. ఇన్నింటి నడుమా కుంటా వంశీకుల్లో అతని కథ పరంపరానుగతంగా అన్ని తరాలకూ వస్తూంటుంది. అలా కుంటాకి ఏడో తరం వాడైన రచయిత అలెక్స్ హేలీకి కూడా తెలుస్తుంది. అతను ఆ కథను ఆధారంగా చేసుకుని తన మూలాల్ని అన్వేషిస్తాడు. పదేళ్లు దీక్షగా బానిసల వివరాలు, వారిని తీసుకువచ్చిన ఓడల రాకపోకలు నమోదైన పురాతన ప్రభుత్వ పత్రాలను అమెరికా దక్షిణ ప్రాంతంలోని గ్రంథాలయాల్లో పరిశోధించి వివరాలు సేకరించాడు. చివరకు తన ముత్తాత ముత్తాత పుట్టిపెరిగిన ఉత్తర ఆఫ్రికా ప్రాంతాన్నీ, అక్కడ నదిని చూస్తాడు. కుంటా కథలోని పదాల ఆధారంగా అతను పుట్టిపెరిగిన ఊరికి చేరతాడు. అక్కడ మాండికో తెగవారు కంఠస్థం చేసి వినిపించే వంశవృక్షంలో తప్పిపోయిన వ్యక్తిగా కుంటా కింటో పేరు విని ఆనందం, ఉద్వేగం ముప్పిరిగొని చలించిపోతాడు. ఈ సన్నివేశం చదువుతూ కంటతడిపెట్టుకోని మనిషి ఉండడు. కుంటా కథని వినిపించి, తమ బంధువులను కలుసుకోవడంతో ముగుస్తుంది కథ.

‘సహవాసి’ అనే కలం పేరుతో ప్రసిద్ధులైన జంపాల ఉమామహేశ్వరరావు అనువదించిన ఈ నవల తెలుగు అనువాద రంగంలో బాగా పేరుపొందిన పుస్తకం. ఒక పక్క నవల రాసిన స్థల కాలాల స్పర్శ అందిస్తూనే, మరోపక్క నేరుగా తెలుగులో వచ్చిన నవలే చదువుతున్నామ అనిపించే అనువాద శైలి సహవాసిది. ‘రక్తాశ్రువులూ, ‘తిరస్కృతులూ, ‘విముక్తి’ వంటి ఎన్నో నవలలను అనువదించి తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయిన చిర యశశ్వి సహవాసి.

మూల రచన రచించిన హేలీ ఈ పుస్తకం విషయంలో కొన్ని విమర్శలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కుంటా కింటేనే టోబీ (బానిస పేరుగా రికార్డుల్లో దొరికినది) అనడానికి ఉన్న ఆధారాలు చాలా బలహీనమైందని కొందరు విమర్శించారు. ఐతే అవన్నీ ఆయన రచన విలువ తగ్గించకపోగా పెంచినట్టైంది. ఇంత శ్రమకోర్చిన ఆయ్న మూలాలను తెలుసుకోలేరని భావించాల్సి వస్తే ఆ వేళ్లకు పట్టిన బానిసత్వమనే పురుగు ఎంత లోతుగా చొచ్చుకుపోయిందో ఊహించుకోవచ్చు. బానిసల కష్టాలు, అవమానాలు, బానిస స్త్రీలపై జరిపే లైంగిక హింస వంటివి కలచివేస్తాయి. ఇక సాంస్కృతికంగానూ అణచివేసేందుకు బానిసల పూర్వ మతాచారాలు అనుసరించకూడదనీ, మాతృభాషలో మాట్లాడకూడదనీ నిషేధిస్తారు. చివరకు కొత్త బానిసల పేర్లు కూడా మార్చేస్తారు. వేలాది ఎకరాల్లో పత్తిని పండించేందుకు లక్షలాది బానిసల జీవితాలు బుగ్గిపాలు చేసిన దౌర్భాగ్యకరమైన చరిత్రకి ఈ నవల ప్రత్యక్ష సాక్ష్యం. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ఈ నవల ఎంతటివారినైనా ఒక ఊపు ఊపి, హృదయాన్ని కల్లోల పరచి మానవత్వాన్ని మేల్కొలుపుతుంది.

వంశవృక్షాలతో, ఇంటిపేర్లతో, గోత్రాలతో అవిచ్ఛిన్నమైన చరిత్రనీ, అమృతతుల్యమైన మాతృభాషనీ, తనదైన సంస్కృతీ కలిగి ఉండీ వాటిని కాలదన్నుకునే తెలుగువారు ఈ నవల నుంచి ఎంతైనా నేర్చుకోవచ్చు. ఆంగ్లభాషకూ, పాశ్చాత్య నాగరికతకూ పట్టం కట్టి తమంత తాముగా స్వచ్ఛంద సాంస్కృతిక బానిసత్వంలో ఇరుక్కున్న తెలుగువారు తప్పక చదవాల్సిన నవల ఇది.తన భాష, విశ్వాసాలు, జీవన విధానం, చివరికి తన పేరును కూడా పరాయి చేసిన స్వార్ధపరుల నుండి వాటిని వేయి చేతులతో కాపు కాసుకున్న కుంటా, పరంపరానుగతంగా వస్తున్న కథను అన్వేషించి మూలాలను కనుక్కున్న హేలీ ఆదర్శం కావాలి.

నవల:ఏడు తరాలు (రూట్స్ ఆంగ్ల నవలకు అనువాదం)
మూలరచన:అలెక్స్ హేలీ,
అనువాదం: సహవాసి
ప్రతులకు: అన్ని ప్రధాన బుక్ షాపుల వద్ద
ప్రచురణ: హైదరాబాద్ బుక్ ట్రస్ట్

ఈ పుస్తకంపై గతంలో పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ.

You Might Also Like

2 Comments

  1. C.B.SARMA

    ఈపుస్తకాన్ని కష్టపడి కొనుక్కుని చదివి దాచుకున్నా. మళ్ళీ మళ్ళీ చదివించే మంచి పుస్తకం.

  2. మణి వడ్లమాని

    నేను అనువాదం చదివాను. అద్భుతమైన నవల అలెక్స్ హేలీ,అపూర్వ సృష్టి ఈ నవల తరతరాల తన వంశవృక్ష
    తెలిసికోవడం కోసం కదానాయకుడు పడేతపన ఆరాటం చదువరులను కంటతడి పెట్టిస్స్తాయి.

Leave a Reply