శాతవాహన వసంతం – కొత్త నవల

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి

*************

 ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోగలిగి, ఒకరి కోసం ఒకరు ఎంత కాలమైనా వేచియుండగలిగి, ఒకరికోసం ఒకరు ఎంత కష్టాన్నైనా ఓర్చుకోగలిగి, ఒకరినొకరు ఎంతదూరమున్నా తలచుకోగల జంట ప్రేమకథగా అపురూపంగా మలచిన ఈ రచనలో ఈ అంశానికి సరికి సరిగా మరెన్నో విషయాలు విస్తారంగా దృశ్యరూపం దాల్చాయి. 

శాతవాహన కాలం నాటి జీవన స్థితిగతులు, వ్యక్తిగత/సామాజిక నడవడికలు, వ్యాపారవ్యవహారాలు, యుద్ధాలు, దొంగతనాలు, దోపిడీలు, న్యాయవ్యవహారాలు, కళాకౌశలాలు ఇలా ఎన్నో విషయాలు మనకు పరిచయమౌతాయి. అలా అని విసుగు కలిగించే సుదీర్ఘ ఉపన్యాసాలేవీ ఉండవు. ఈ యీ అంశాలపైన ఆసక్తికరమైన సందర్భాలను మలిచి చక్కగా తీర్చిదిద్దారు రచయిత. 

అన్నిటికన్నా నాకు ఆసక్తి కలిగించింది ఆనాటి సముద్రప్రయాణం. అండమాన్ వరకూ ఇష్టపడి మరీ నౌకలో ఈ ఆధునిక యంత్రాల కాలంలో ప్రయాణించిన నాకు శతాబ్దాల క్రిందటి సుదీర్ఘనౌకాయానం గురించి, అందులోని కష్టనష్టాల గురించి సుంత అవగాహన కల్గించిన రచన ఇది. 

భారత దేశంలో జరిగే వ్యాపార వ్యవహారాలు, రవాణా సౌకర్యాలు, జీవనశైలులు మాత్రమే కాక రోమన్ రాజ్యంలోనూ, అక్కడికి చేరే దాకా దాటి వెళ్ళాల్సిన దేశాల్లోనూ కూడా ఇవన్నీ ఎలా జరుగుతున్నాయో , అక్కడికీ ఇక్కడికీ గల వ్యత్యాసాలేంటో కూడా తులనాత్మక పరిశీలనలు, వ్యాఖ్యానాలు ఆద్యంతం ఉంటాయి. వ్యత్యాసాలు భౌగోళికపరిస్థితులలో మాత్రమే కాదు, సామాజిక, కౌటుంబిక, వ్యావహారిక, మానసిక స్థితిగతులలో కూడా అనేకం. భారత, రోమన్ రాజ్యాలలోని సంప్రదాయాలు, పండుగలు, వంటల గురించి కూడా చక్కని సందర్భాలు కూర్చబడి, కథ అల్లికలో భాగం అయి ఉంటాయి.

అనుకూల పరిస్థితుల్లోనే కాదు, వ్యతిరేక పరిస్థితుల్లో కూడా సంయమనంతో, ఆత్మనిగ్రహంతో ఎలా మెలగవచ్చునో, నాయికా నాయకులిరువురూ ఆచరించి చూపించే కథ ఇందులో ఉంది. 

నాటి నౌకావాణిజ్యం, వర్తక వ్యవహారాలు మొదలైన చాలా విషయాలకు ప్రమాణంగా నిలబడే ఆధారాలను రచయిత ప్రత్యేకంగా ఇచ్చారు. అవన్నీ ఊహలు కావని ఆ ఆధారాలను పరిశీలించి తెలుసుకోవచ్చు.

పూర్వ నాటకశైలిలో వలె ఇందులో వస్తువు పరిచయం, ఉత్కంఠ, పరాకాష్ట, పతనం, ముగింపులను పోలిన సందర్భాలు కథాగమనాన్ని మరింత ఆసక్తికరంగా రూపొందించాయి. చందమామ కథకు మరింత భిన్నమైన అంశాలను, హంగులను జోడించడం వలన ఆపకుండా చదివించే గుణం ఉంది. అడుగడుగునా మలుపులు, ఋతువర్ణనలు, నాయికా నాయకుల శారీరక, మానసిక వేదనలు, భిన్న సాంస్కృతిక నేపథ్యంలో ఎదురయ్యే బీభత్స అనుభవాలు, గాథలు, జానపదగీతాలు  చదువరుల అభిరుచిని బట్టి నచ్చడం ఉంటుంది. 

 హాలుని గాథాసప్తశతి సంకలనం కావ్య రూపధారణ నేపథ్య సంగీతంలా కథాగమనానికి శోభ చేకూర్చింది.

ఈమధ్య కాలంలో ఈ విధమైన వస్తువు, కథాగమనం ఉన్న రచనలు తక్కువగా వస్తున్న నేపథ్యంలో పిల్లలూ పెద్దలూ ఆహ్లాదంగా చదవగల రచన అని నా అనుకోలు.

You Might Also Like