కొన్ని పూరణలు – మరి కొన్ని ఖాళీలు
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
(కెపి అశోక్ కుమార్ రచించిన మలి తరం తెలంగాణ కథకులు కథన రీతులు విమర్శ వ్యాస సంపుటికి ముందు మాట)
********
తమను తాము పూర్వపక్షం చేసుకునే విమర్శకులు అరుదైన కాలం యిది. తమను తాము పరాస్తం చేసుకోడానికి గొప్ప చిత్తశుద్ధి వుండాలి. తప్పు వొప్పుకుని దిద్దుకునే దమ్ముండాలి. తమ రచనా వ్యాసంగం పట్ల నిజాయితీ వుండాలి. ధైర్యం వుండాలి. సత్యావిష్కరణ పట్ల విధేయత వుండాలి. సహృదయత వుండాలి. సాహిత్య విమర్శ పట్ల సాహిత్య చరిత్ర పట్ల అవి నిర్వర్తించాల్సిన కర్తవ్యాల పట్ల స్పష్టమైన చూపు వుండాలి. ఆ చూపు బాధ్యతాయుతంగా వుండాలి. అటువంటి బాధ్యత కల్గిన విమర్శకుల్లో మిత్రుడు కె.పి. అశోక్ కుమార్ వొకరు. తెలంగాణ కథ గురించి తాను యింతకుముందు చేసిన ప్రతిపాదనల్ని, ప్రకటించిన అభిప్రాయాల్ని తానే సరిదిద్దుకుంటూ ‘తెలంగాణ మలితరం కథకుల కథనరీతులు’ ఆవిష్కరిస్తున్న అశోక్ ని చూస్తే ఆశ్చర్యమే కాదు; ఆనందం కలుగుతుంది. విమర్శకులకు ఆత్మవిమర్శ నిత్యావసర వస్తువు అని తేటతెల్లమౌతుంది.
మూడు దశాబ్దాలకు పైగా సాహిత్య విమర్శను వొక నిబద్ధతతో కత్తిమీద సాములా నిర్విరామంగా నిర్వహిస్తున్న అశోక్ కుమార్ తన ‘కథావిష్కారం’ లో 1950 – 75 ల మధ్య కాలంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ యేర్పడ్డ తర్వాత తెలంగాణలో సురమౌళి, తాడిగిరి పోతురాజు వంటి యే కొద్దిమందో తప్ప బలమైన కథా రచయితలు కనపడటం లేదు అని భావించాడు. ‘ఈ యుగం తెలంగాణా కథలో ఒక గ్యాప్ గా శూన్యంగా కన్పించసాగింది’ అని ముదిగంటి సుజాతారెడ్డి వంటి విమర్శకులు కూడా చెప్పారు. తెలంగాణ మాండలిక కథపై నా పరిశోధన సందర్భంలో సైతం దాదాపు యిటువంటి అభిప్రాయమే ప్రకటించాను. సరైన ఆధారాలు దొరకని కాలంలో చేసిన ప్రతిపాదనలు అవి. ఆ కాలపు కథలెన్నో చరిత్రలోకి యెక్కలేదు. శ్రీకాకుళం కథా నిలయంలో వెనకటి తరానికి చెందిన తెలంగాణ కథకుల పేర్లు కనపడవు. కనపడినా వాళ్ళ కథలన్నీ అక్కడ నమోదు కాలేదు. కొద్దికాలం పాటే నడిచిన పత్రికల్లో కేవలం తమ ప్రాంతానికే పరిమితమైన చిన్న పత్రికల్లో ప్రచురితమైన కథలు కాలగర్భంలో నిక్షిప్తమై వుండిపోయాయి (ఇటువంటి సందర్భాల్లోనే తెలంగాణలో కథానిలయం లేని లోటు తెలిసివస్తుంది. కుర్రా జితేంద్రబాబు లాంటి వాఙ్మయ ప్రేమికులు యీ ‘చారిత్రిక’ అవసరం తీర్చగలరేమో!). అందువల్ల యిటువంటి ఆలోచనలు వ్యక్తమయ్యాయి. కానీ కొత్త సహస్రాబ్దంలో కొత్త రాజకీయ సందర్భంలో సాహిత్య పరిశోధకుల తవ్వకాల్లో బయటపడ్డ వాస్తవాలు మరోలా వుండి ఆశ్చర్యం గొలుపుతాయి. తెలుగు సాహిత్య చరిత్ర అసమగ్రతని యెత్తిచూపాయి. పై అభిప్రాయాలు పూర్తిగా నిజం కాదని నిరూపించాయి.
మలి దశ తెలంగాణ రాష్ట్రోద్యమం తెలంగాణ చరిత్ర – సంస్కృతి – సాహిత్యాలకు చేసిన మేలు అమోఘం. సాహిత్యంలో ఆత్మ గౌరవ ప్రకటన తవ్వకానికి పురిగొల్పింది. విస్మృతికీ నిరాదరణకీ నిర్లక్ష్యానికీ గురైన సాహిత్య సంపద యెంతో వెలికి తీయడానికి పరిశోధకులు పూనుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలపాటు ఆ కృషి జరిగింది .
ఈ నేపథ్యంలోనే సంగిశెట్టి శ్రీనివాస్ రూపొందించిన ‘దస్త్రమ్’ తెలంగాణ కథా సూచి సాహిత్య చరిత్ర నిర్మాణానికీ పరిశోధనకూ అమూల్యమైన దోహదం చేసింది. మరుగునపడ్డ యెన్నో కథల్ని అది వెలికి తీసింది. అజ్ఞాతంగా ఉండిపోయిన యెందరో రచయితలని పరిచయం చేసింది. అదే వూపులో సుజాతారెడ్డి, సంగిశెట్టి సంపాదకులుగా వెలువరించిన ‘తెలంగాణా తొలితరం కథలు’, ‘తొలినాటి కతలు’ సంకలనాలు నేల మాళిగల్లో దాగిన కథల్ని తెలుగు పాఠక లోకానికి అందించాయి. ఆ క్రమంలోనే బివిఎన్ స్వామి తన పరిశోధనకు బై ప్రోడక్ట్ గా ఉత్తర తెలంగాణ కథకుల జీవిత విశేషాల్ని, కథల వివరాల్ని ‘అందుబాటు’ లోకి తెచ్చాడు. నల్గొండ ఖమ్మం మెదక్ వరంగల్ కరీంనగర్ ల నుంచి వెలువడ్డ జిల్లా కథా సంకలనాలు అనామకంగా వుండిన విస్మృతి చెందిన అలక్ష్యానికి అనాదరణకి గురైన యెందరో రచయితల కథల్ని వెలికి తీయడంలో తోడ్పడ్డాయి. అయితే గమనించాల్సిన విషయం యేమంటే చాలా కాలం కథల సేకరణ జరిగినంతగా వాటిపై విశ్లేషణ జరగలేదు. ఆ లోటుని తీర్చే ప్రయత్నం యిటీవలే మొదలైంది. సాహిత్య పత్రిక ‘పాలపిట్ట’, వెబ్ మాగజైన్ ‘సంచిక’లో దాదాపు యేకకాలంలో యెంతో శ్రమకోర్చి అశోక్ కుమార్ రచించిన తెలంగాణ తొలి, మలితరం కథకుల పరిచయ వ్యాసాలు ఆ దారిలోనే మరో ముందడుగు. తాను యింతకు ముందు వెలిబుచ్చిన అభిప్రాయాన్ని పునరాలోచన చేసుకొని సంచికలో ధారావాహికంగా రాసిన వ్యాసపరంపరకు పుస్తక రూపమే ‘తెలంగాణ మలితరం కథకుల కథనరీతులు’. అరుదైన రచనల్నీ విస్మృత రచయితల్నీ వెలుగులోకి తేవడానికి అశోక్ పడే తపనను యీ పుస్తకం మరోసారి వెల్లడి చేస్తుంది.
దొరికిన వొక దారప్పోగు పట్టుకుని దాని వస్త్రం కోసం చేసే అన్వేషణ యిది. దొరకబుచ్చుకున్న ఆ వస్త్రాన్ని పదుగురి ముందు ప్రదర్శించి వస్త్ర నాణ్యతతో పాటు నేతగాడి నైపుణ్యాన్ని సైతం అంచనాగట్టే విలువైన పూనిక యిది.
***
1950 ల్లో సాహిత్య విమర్శకులు, చరిత్ర కారులు తెలుగు కవిత్వంలో స్తబ్ధత గుర్తించారు గాని ఆ కాలంలో, ఆ తర్వాత రెండు దశాబ్దాల పాటు కథ బలంగా బయటకు వచ్చింది. పాలగుమ్మి పద్మరాజు (గాలివాన, పొడవు ప్రయాణం), బుచ్చిబాబు (అరకులోయలో కూలిన శిఖరం, తడి మంటకు పొడి నీళ్ళు ), రావి శాస్త్రి (పిపీలికం, కలకంఠి, ఆరు సారో కథలు, ఋక్కులు), కారా (తీర్పు, యజ్ఞం, నోరూం, ఆర్తి, భయం, హింస), బీనాదేవి (ఎ మేటర్ ఆఫ్ నో ఇంపార్టెన్స్, నల్లంచు తెల్లచీర, రాధమ్మ పెళ్లి ఆగిపోయింది) వంటి కథకులు వారి జీవితకాలంలో అత్యుత్తమమైన కథలు అప్పుడే రాశారు. తరచి చూస్తే తెలంగాణలో మాత్రం అది పుంజుకోవలసినంత బలం పుంజుకోలేదనే చెప్పాలి.. ఆంధ్రప్రదేశ్ యేర్పడిన తర్వాత వచ్చిన స్తబ్దత ఇది. అంతకుముందు ఉర్దూ మాధ్యమంలో చదువుకుని విద్యావంతులైన రచయితలు తమది కాని పత్రికల ప్రామాణిక భాషలో కథ చెప్పడానికి వొక విధమైన యిబ్బందికి, బిడియానికి గురై వుండొచ్చు. ఇంటి భాషకూ బడి భాషకూ మధ్య నిర్మితమైన గోడలు అడ్డువచ్చి వుండొచ్చు. సాంస్కృతిక రంగంలో కనపడని ఆధిపత్యాల కింద నలిగిన వేదనలో మౌనాన్ని ఆశ్రయించి వుండవచ్చు. అమ్మ వొడిలో నేర్చిన భాష కంటే భిన్నమైనది పరాయి భాషే. భాషా పరాయీకరణ సందర్భంలో తొలి తరం నాటి రచయితల్లో కొందరు ఆగిపోయారు. కొందరు కొనసాగారు. కొందరు కొత్తగా యేటికి యెదురీదారు. చాలా కొద్దిమంది మాత్రమే స్వీయ ముద్రను నిలుపుకోగలిగారు.
ఈ తరంలో తెలంగాణ నేల నుంచి కొత్తగా యెదిగిన కథా రచయితలు యెవరు – వారు యెదుర్కొన్న సవాళ్లు యేవి – వారు స్వీకరించిన కథా వస్తువులేవి – కథనరీతులేవి? నిజాం పాలన అంతమయ్యాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యేర్పడే వరకూ ఆ మధ్య కాలంలో తెలంగాణ సమాజంలో సంభవించిన పరిణామాలేవి – వాటిని ఆ నాటి కథలు యే మేరకు ప్రతిఫలించాయి? మరీ ముఖ్యంగా ముల్కీ ఉద్యమం, తొలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వీటికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి ? తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విరమణ తర్వాత మళ్లీ శ్రీకాకుళం ప్రభావంతో ఉత్తర తెలంగాణలో ఆదివాసి రైతాంగ కార్మిక పోరాటాలు పురివిప్పే వరకు జరిగిన సామాజిక రాజకీయ పరిణామాలు కథల్లో యెంతవరకూ చోటుచేసుకున్నాయి? ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా యేర్పడటానికి ముందు వెనుక హైదరాబాద్ రాష్ట్రంలో సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో జరిగిన కీలక పరిణామాలేవి? ‘విశాలాంధ్రలో ప్రజారాజ్యం’ వంటి ఆశయాలు యెక్కడ యెందుకు విఫలమయ్యాయి? విలీనాల పేరుతొ పెద్దమనుషుల మధ్య జరిగిన చీకటి వొప్పందాల విద్రోహాలేవి? అవి తెలంగాణ ప్రజల జీవితాల్ని యెలా కుంగదీశాయి? ఆ చీకటి రోజుల్లో ప్రజలు యే వెల్తురు స్వప్నాలు కన్నారు? రాబోయే యే యుద్ధాలకు యెలా సన్నద్ధమయ్యారు? వీటి ప్రభావం సాహిత్యం మీద విస్తృతంగా పడాల్సిన సందర్భంలో కథ యెందుకు బలహీనంగా ఉంది? భూస్వామ్య పీడనకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ పోరాట విరమణ వల్ల కలిగిన నిర్వేదమా? ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేయటం ద్వారా కలిగిన నైరాశ్యమా? కథా వికాసంలో వెనుకబాటుకి కారణాలేంటి? కొత్తగా చొచ్చుకువచ్చిన ఆధిపత్య సాంస్కృతిక పరిస్థితులు సాహిత్యకారుల్ని యే విధంగా ప్రభావితం చేశాయి? అంతకు ముందు తరంలోనే స్థానీయ భాషా యితివృత్తాలతో రచయితలు కథలు రాయడం మొదలైనప్పటికీ ఆశించిన రీతిలో వాటి కొనసాగింపు జరగకపోడానికి కారణాలేమిటి? ఇటువంటి ప్రశ్నలెన్నో సాహిత్య విమర్శకుల మేధస్సుకు పదునుపెట్టాయి.
సాధారణంగా తెలంగాణ కథా సాహిత్య చరిత్రలో 1956 ముందు కాలానికి చెందిన కథకుల్ని తొలితరం కథకులుగా ఆ తర్వాత 70 వరకు మలితరం కథకులుగా గుర్తిస్తున్నాం. నిజానికి 56కు ముందే తెలంగాణ కథ ఆరంభ వికాసాలు రెండింటినీ గమనించగలం. ఒకవిధంగా తెలంగాణ కథని ‘పరిసరాలు’ (సం. వట్టికోట – 1956 )కు ముందు తొలితరంగానూ, తర్వాత మలితరంగానూ స్వీకరించవచ్చు. అశోక్ కూడా అదే గీతల్లోంచి తొలి – మలి తరాల్ని నిర్ధారించాడు. కొందరు రచయితలు ముందు వెనక కూడా కథా రచనలో వుండి కొనసాగారు. మరి కొందరు యీ తరంలో మొదలై తర్వాతి కాలంలో పరిణతి చెందారు. అందువల్ల పరిశోధనలు విస్తృతమౌతున్నకొద్దీ తొలి – మలి విభజన పునర్నిర్వచనానికి గురికావచ్చు.
పరిసరాలు (రెండు భాగాలు) కథల సంకలనం సురవరం ప్రతాపరెడ్డి ప్రకటించిన గోల్కొండ కవుల సంచిక వంటిదే. వట్టికోట ఆళ్వారుస్వామి తెలంగాణ కథకు కట్టిన పట్టం అది. ఆ సంకలనం వొక ఆత్మగౌరవ ప్రకటన. ఆయన సేకరించిన కథలు తెలంగాణ వెలుపలి రచయితలు యెందరికో కనువిప్పు. అందులో కథలు యెక్కువ భాగం తొలి తరం నాటివి. మలి తరంలో యిటువంటి సంకలనం లేకపోవడం వొక పెద్ద లోటు. ఆ తర్వాత విప్లవోద్యమం నేపథ్యంలో వచ్చిన కథలు మాత్రమే బయట ప్రపంచానికి యెక్కువగా తెలిశాయి. ఇందుకు కారణం పరిణామాత్మక మైన మార్పులు గుణాత్మకంగా అభివృద్ధి చెందే క్రమాన్ని రచయితలు గుర్తించడంలో వెనకబడటమేనేమో అని కూడా ఆలోచించాలి. ఆంధ్ర పాలకుల వలస ఆధిపత్య ధోరణి వల్ల తెలంగాణ ప్రజలు ఎటువంటి ఒత్తిడికి గురయ్యారు అనే విషయాలు సురమౌళి (ముక్కోటి బలగమోయి) యశోదారెడ్డి (మా పంతులు) లాంటి యెక్కడో ఒకరిద్దరు రచయితల కథల్లో మాత్రమే చూడగలం. ఇతర కథకుల్ని ఈ పరిణామాలు ఎందుకు అంతగా కలవరపరచ లేకపోయాయి, ఆందోళనకు గురి చేయలేకపోయాయి ? ఇవన్నీ చర్చనీయాంశాలే.
ప్రజల మనిషి గంగు (ఆళ్వారుస్వామి), అంపశయ్య (నవీన్) చిల్లర దేవుళ్ళు (దాశరథి రంగాచార్య )వంటి క్లాసిక్ నవలలు పుట్టిన ఆ కాలంలో ఆ స్థాయిలో కథలు ఎందుకు రాలేదు అని మరో ప్రశ్న తొలుస్తుంది. అలాగే కాళోజి పొట్లపల్లి కాంచనపల్లి వంటి ప్రముఖ రచయితలు తర్వాతి కాలంలో కథారచనలో ఎందుకు కొనసాగలేదు – ఇతరేతర సాహిత్య ప్రక్రియల కంటే కథ బలహీనంగా వుండటానికి కారణం ఏమిటి? అశోక్ రాసిన ‘తెలంగాణ మలితరం కథకుల కథనం రీతులు’ అన్నీ వొకచోట చదువుతున్నప్పుడు యిలా నాలో యెన్నో ప్రశ్నలు కదలాడాయి. తెలంగాణ సాహిత్య చరిత్రని పునర్నిర్మిస్తున్న అశోక్ కుమార్ లాంటి విమర్శకులే వీటికి సమాధానాలు చెప్పాలి.
***
పాత తరం కథల్ని కథకుల్ని అంచనా వేయడంలో వొక ఇబ్బంది వుంది. శిల్ప పరంగా ప్రయోగ పరంగా అభివృద్ధి చెందిన కథలతో వాటిని పోల్చి చూసినప్పుడు అవి పేలవంగానూ ప్రాథమికంగానూ కనిపించే అవకాశం వుంది. ఆ నాటి కొన్ని కథా వస్తువులు కాలగమనంలో నిరర్థకంగానో అసంగతంగానో కనిపించవచ్చు. ఆ కాలపు కథనరీతుల్ని దృష్టిలో వుంచుకుని వాటిని పరిశీలించాలి. అంతేకాదు, ఆ యా రచయితల పరిణతి స్థాయిని కూడా గమనం లోకి తీసుకోవాలి.
అశోక్ దొరకబుచ్చుకున్న మలితరం కథకులు భిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చినవారు. భిన్న భావజాలాలకు చెందినవారు. కథల వస్తు స్వీకరణ విషయికంగా, కథా కథన పద్ధతి పరంగా వేర్వేరు ప్రభావాలకు లోనైనవారు. అందుకే వ్యాపార పత్రికల అవసరాలు తీర్చిన పాపులర్ రచయితలు మాదిరెడ్డి సులోచన పోల్కంపల్లి శాంతాదేవి దగ్గర్నుంచి దిగంబర కవిత్వోద్యమంతో మొదలై – జీవితాంతం విప్లవ సాహిత్య వుద్యమాలతో, నిర్మాణాలతో కొనసాగిన చెరబండరాజు నిఖిలేశ్వర్ వరకూ భిన్న భావజాలాలకు చెందిన కథకులు యీ వ్యాస సంపుటిలో దర్శనమిస్తారు. ప్రాపంచిక దృక్పథాలు వేరైనా కాలం వొక్కటే వాళ్ళని కలిపింది. వారు జీవించిన స్థల కాలాల ప్రత్యేకతలు తెలియకుండా వాళ్ళ కథల్ని పరామర్శించడం, నిర్దిష్టంగా వారి కథన రీతుల్ని పరిశీలించడం అసమంజసం.
అందువల్ల యీ వ్యాసాల్లో కె.పి. ముందుగా రచయితల జీవిత విశేషాలు గురించి, వారి సాహిత్య ప్రస్థానం గురించి పేర్కొని కథకులుగా వారి కృషిని స్థూలంగా తెలియజేస్తాడు. తర్వాత తనకు లభించిన కథల్లో కనిపించే సామాజిక అంశాలు, కథన రీతులు వివరిస్తాడు. ఈ వివరణకు మూస సంవిధానం లేకపోవడం గమనిస్తాం. అది వొక్కోసారి వ్యాఖ్యాన పద్ధతిలో వుంటుంది. మరొకసారి విశ్లేషణాత్మకంగా వుంటుంది. మరికొన్నిసార్లు విమర్శనాత్మకంగా వుంటుంది. కథల్లో ప్రస్తావించదగ్గ గొప్పదనం/ప్రత్యేకత యేదీ లేనప్పుడు కేవలం కథ చెప్పి వదిలేయడం సైతం వుంటుంది. ఏది యెలా వున్నా కథ అంతస్సూత్రాన్ని, రచయిత ఆలోచననీ పట్టుకునే ప్రయత్నం ప్రతి వ్యాసంలోనూ కనిపిస్తుంది.
అరవైల నాటి తెలంగాణ సమాజంలో చోటుచేసుకున్న చలనాన్ని గుర్తించడానికి కొంతమేరకైనా యీ రచయితల కథలు తోడ్పడతాయి. ఆనాటి కథల్లో యెక్కువ భాగం ఆశయాలు ఆదర్శాలు ప్రేమలు వాటి వైఫల్యాలు వీటి చుట్టూనే తిరగటం గమనిస్తాం. ఆ విషయాన్ని అశోక్ స్పష్టంగానే గుర్తించాడు. అయితే అందుకు కారణమైన ప్రత్యేక సామాజిక పరిస్థితుల గురించి, ఇతరేతర ప్రభావాల గురించి, పరిమితుల గురించి కూడా ఆలోచించవలసి వుంటుంది. ఈ నేపథ్యంలో అశోక్ చేసిన ప్రతిపాదనలు, సూత్రీకరణలు రచయితల్ని అవగతం చేసుకుని అంచనా వేయడానికి దోహదం చేస్తాయి.
- పోల్కంపల్లి శాంతాదేవి కథలన్నీ ప్రేమ కథలే అనీ ప్రేమించుకోవడాలు, విడిపోవడాలు, అపార్థాలు తొలగి కలిసిపోవడాలతో ముగుస్తాయనీ చెబుతూ ‘ఎక్కువగా చదువుకోలేకపోవడం, బయటి ప్రపంచంతో సరియైన సంబంధాలు లేకపోవడం వలన వారి ఆలోచనా ధోరణి విస్తరించలేకపోయింది. అందుకని ఎక్కువ ప్రయాస పడకుండా తమకు తోచిన విషయాలను, తమకు నచ్చిన విధంగా రాసుకుంటూ పోతున్నార’ని అశోక్ చేసిన తీర్మానం గమనించదగ్గది. శాంతాదేవి రచనలు ఆనాటి వ్యాపార పత్రికల అభీష్టం మేరకు కాలక్షేపం కోసం పాఠకుల అభిరుచి లక్ష్యంగా, ప్రచురణకర్తల అవసరాలకోసం చేసినవే అని గ్రహించాలి.
- పాపులర్ రచయిత్రి అయినప్పటికీ తెలంగాణ భాషకి నవలా సాహిత్యంలోకి సాధికారంగా స్థానం కల్పించిన మాదిరెడ్డి సులోచనని కథకురాలిగా పరిచయం చేసిన వ్యాసాన్ని అశోక్ కాలపరిమితి (ఆరో దశకం)కి లోబడే రాశాడు. అయినప్పటికీ అతని పరిశీలనలు ఆసక్తికరంగా కనిపిస్తాయి. నవలాకారిణిగా ప్రసిద్ధురాలు అయిన మాదిరెడ్డి సులోచన రాసిన కథల గురించి పట్టించుకోకపోడానికి కారణం ఆ రోజుల్లో పత్రికల్లో కథల కన్నా సీరియల్ నవలలకే ప్రాముఖ్యం యివ్వడమేనని భావించాడు. ఆమె కథల్లో సమస్యలను పరిష్కరించడానికి బదులుగా నాయకులు ఆ సమస్యలకు దూరంగా వుంటారనీ , ఖచ్చితమైన లేదా సరియైన పరిష్కారం తీసుకుంటే కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదముంది కాబట్టి కొంతకాలం దూరంగా ఉంటేనే, ఆయా కుటుంబీకులు తాము చేసిన తప్పిదాలను గుర్తించి, తమను తాము సరిదిద్దుకునే అవకాశముందని రచయిత్రి భావించడం వల్ల, అలాంటి మార్పులను చేసి ఉండవచ్చని ఊహించాడు. ఆమె కథలన్నీ గాక కేవలం యెంపిక చేసిన కథల మీద చేసిన వ్యాఖ్యానం అది. కథకురాలిగా ఆమె స్థానాన్ని సమగ్రంగా అంచనా వేయాలంటే మొత్తం కథల్ని విశ్లేషించాల్సి వుంటుంది. అందుకు యీ వ్యాసం ప్రేరకంగా తోడ్పడుతుంది.
- ‘తెలంగాణ కథకుడైనప్పటికీ రామలింగం గారి కథల్లో ఎక్కడా తెలుగు నేటివిటీ కనిపించకపోడానికి ఆయన కాంగ్రెసు పార్టీ మనిషి కావడం, వారి జీవనశైలి వేరు కావడం కారణాలు కావచ్చ’ని అశోక్ అభిప్రాయం. మధ్యతరగతి జీవితాలు, పాత్రల చిత్రణ, మనస్తత్వ విశ్లేషణలను బట్టి వీరి కథలపై – వీరెంతగానో అభిమానించే బుచ్చిబాబు, గోపీచంద్ల ప్రభావం అమితంగా వుందని గుర్తించాడు. కొత్తగా తెచ్చిన ఆయన సంకలనాన్ని ప్రచురణ కర్తలు ‘పది కథలతోనే సరిపెట్టారు, కాని వెతికితే ఇంకో అరడజను కథలయినా దొరుకుతాయ’ని అశోక్ ఘంటాపథంగా చెబుతాడు. భావి పరిశోధకులకు యీ మాట తొవ్వ దివ్వె. దాని వెలుగులో పయనించాలని అతను అన్యాపదేశంగా పేర్కొన్నాడు.
- విస్తృత కథకుడు ఎదిరె చెన్నకేశవులు అరవై ఏళ్ల పూర్వం రాసిన కథల్ని ఇప్పటి కథలతో పోల్చుకుని చూస్తే అవుట్ డేటెడ్ గా కనిపిస్తాయని పేర్కొన్నాడు అశోక్. నిజమే సమస్యలు మారుతుంటాయి. వాటి పరిష్కారాలు మారుతుంటాయి. ఒకప్పటి ఆదర్శాలు తర్వాతి కాలంలో హాస్యాస్పదంగా వుండొచ్చు. స్థిరీకృతమైన విలువలు ప్రశ్నకు గురౌతాయి. అదే విధంగా సాహిత్యంలో ప్రమాణాలు కూడా మారే అవకాశం వుంది.
- బెల్లంకొండ లక్ష్మణసూరి కథలు ‘కొన్ని అస్పష్టంగా ఉంటాయి, ఏ విషయాన్ని రచయిత ఒక పట్టాన తేల్చడు’ అని చెబుతూనే రచయిత తన ఆలోచనలను లేదా లోక రీతిని, ప్రచారంలో ఉన్న విషయాలను మన ముందు ఉంచి ఏ సంగతి పాఠకుడినే తేల్చుకోమంటారు అని ప్రస్తావించి చివరికి ‘అసంబద్ధ కథా కథనానికి’ ఆయన కథలు నిదర్శనాలుగా నిలుస్తాయి అని తేల్చాడు. ఆనాటి తెలంగాణ కథకుల ప్రయోగ పరమైన కథన రీతిని అధ్యయనం చేయడానికి అశోక్ చేసిన యిటువంటి పరిశీలనలు వుపయోగపడతాయి. ‘అరవైయవ దశకంలో వచ్చిన మూస ప్రేమ కథలు, సినిమాల ప్రభావం’ సూరి కొన్ని కథలపై కొట్టొచ్చినట్లు కనిపిస్తుందన్న పరిశీలన గమనార్హం (ఆయన ఆరుద్రతో కలిసి ‘కొత్తనీరు’ సినిమా స్క్రిప్ట్ రచించాడట).
- అంపశయ్య నవీన్ కథల్లో మనోవిశ్లేషణ ధోరణిని అశోక్ కుమార్ స్పష్టంగా గుర్తించాడు. సమాజంలోని సంక్లిష్టత మానవ మనస్తత్వం పై ప్రభావం చూపుతుందని నవీన్ అరవైలలో రాసిన కథల ద్వారా నిరూపించాడు. అంతేకాదు, తర్వాతి కాలంలో చైతన్య స్రవంతి కథలకు నమూనాలా కనిపించే ప్రయోగాల్ని ఆ కథల్లో గమనించాడు.
- తెలంగాణలో దొరల పీడనకు వ్యతిరేకంగా ప్రశ్నించే తత్వం తిరుగుబాటు చైతన్యానికి దారితీస్తున్న వైనాన్ని చెరబండరాజు ఆ నాటి తన కథల్లో సూచించాడని అశోక్ స్పష్టం చేశాడు. శ్రీకాకుళం వుద్యమ కాలం లో బూటకపు యెదురు కాల్పుల్లో చనిపోయిన పద్నాలుగేళ్ళ తామాడ చినబాబు అమరత్వాన్ని యితివృత్తం చేసుకొని చెరబండరాజు రచించిన చిరంజీవి కథ అతని కథల్లో విశిష్టమైనదని పేర్కొంటూనే అతినాటకీయంగా వుందని అతను ఆరోపిస్తాడు. అక్కడితో ఆగకుండా చెర వచన రచనల కంటే కవిత్వం పాటలే ఆయనను ‘చిరంజీవి’ గా నిలబెడతాయి అని యెటువంటి తడబాటు లేకుండా ప్రకటించాడు.
- న్యాయం, పునాది వంటి సామాజిక చేతనను ప్రతిబింబించే కథలు రాసిన యం వి తిరుపతయ్య ప్రేమను, ప్రేమరాహిత్యాన్ని, దాంపత్య జీవితంలోని అసమానతలను చిత్రించే కథలు రచించారనీ క్షీణిస్తున్న కుటుంబ సంబంధాలు – మానవసంబంధాలు గురించి వివరించడంలో, వ్యవస్థలో రావల్సిన మార్పులు గురించి తెలియజేయడంలో ఆయన చూపిన శ్రద్ధ, ముందుచూపు పాఠకులను ఆశ్చర్యంలో ముంచెత్తుతాయనీ వస్తుపరంగానే కాకుండా, శిల్పపరంగా కూడా ఈ కథలను తీర్చిదిద్దడంలో చక్కటి నేర్పును కనబరిచారనీ కొన్ని కథల్లో బీజప్రాయమైన చైతన్యస్రవంతి పద్ధతి కనిపిస్తుందనీ కొసమెరుపు ముగింపులు కథల్ని ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా రూపొందించాయనీ కథలలో వాడిన పాత్రోచిత తెలంగాణ మాండలిక ప్రయోగాలు కథలకు మెరుగులు దిద్దాయనీ కూలంకషంగా వివరించాడు. ఆ నాటి రచయితల్లో కథకుడిగా తిరుపతయ్య స్థానాన్ని అంచనా వేయడానికి యీ వ్యాసం చక్కగా తోడ్పడుతుంది.
- విమర్శా రంగాన్ని తన కార్యక్షేత్రంగా యెన్నుకున్న నవ్య సంప్రదాయవాది ముదిగొండ వీరభద్రయ్య కథల్ని అశోక్ కుమార్ లోతుగా విశ్లేషించాడు. ఆ కాలంలో చాలామంది రచయితల కథలు యివాళ్టి పరిస్థితుల్లో కాలదోషం పట్టినట్లు కనిపిస్తాయని చాలా సందర్భాల్లో ప్రస్తావించిన అశోక్ ‘ముదిగొండ వీరభద్రయ్య కథలు మాత్రం నేడు వస్తున్న కథలకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటాయి. కథాకథనం, కథలలో చోటు చేసుకున్న చర్చలలో, లోకరీతిని అనుభవ పూర్వకంగా తార్కికంగా వివరించడం కనిపించి మనల్ని ఆశ్చర్యం లో ముంచెత్తుతాయి’ అని ఆసక్తి రేకిత్తించే ముక్తాయింపునిచ్చాడు. సాహిత్య క్షేత్రంలో ముదిగొండ వీరభద్రయ్య వంటి కొందరిపై యేర్పరచుకున్న ముద్రల్ని మించి ఆలోచించడానికి యీ వ్యాసం ద్వారాలు తెరుస్తుంది.
ఇవన్నీ విమర్శకుడిగా అశోక్ పరిశీలనలు, అభిప్రాయాలు. వాటితో అందరికీ యేకీభావం వుండాల్సిన అవసరం లేదు. విభేదించవచ్చు కూడా. కానీ అతను ఆ అభిప్రాయాలకు రావడానికి కారణమైన అంశాలు తప్పనిసరిగా చర్చను కోరుతున్నాయి.
ఈ సంపుటిలోని కొన్ని వ్యాసాల్లో రచయితల కథలపై చేసిన విశ్లేషణ కన్నా వారి జీవిత విశేషాల చిత్రణ ఆసక్తి కలిగిస్తుంది. విషాదంగా ముగిసిన డి. రామలింగం జీవితం పఠితల్ని షాక్ కి గురిచేస్తుంది. అదే విధంగా ఆయన కథన రీతుల గురించి ప్రస్తావిసూ చేసిన పరిశీలనలు గమనించదగ్గవి.
రాజకీయ వ్యాసరచనకు జీవిత చరిత్రల రచనకు ప్రసిద్ధుడైన జి వెంకట రామారావు జీవిత నేపథ్యం గురించి విస్తృతంగా వివరిస్తూ కథకుడిగా ఆయన అంత ప్రసిద్ధి చెందక పోవటానికి కారణాలు ఏమై ఉంటాయో తెలుసుకోవటానికి అశోక్ ప్రయత్నించాడు.
జి. సురమౌళి, యశోదారెడ్డి తర్వాత అంతే ప్రతిభావంతంగా తెలంగాణ మాండలిక సౌందర్యాన్ని కథల్లోకి పట్టితెచ్చిన ఇరివెంటి కృష్ణమూర్తి ధ్వన్యనుకరణ కళాకారుడు కూడా అని అశోక్ చెప్పకుంటే నాబోటివాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఆయనలోని ఆ కళే తెలంగాణ గ్రామీణ భాషని కథల్లోకి యథాతథంగా తేవడానికి తోడ్పడిందన్న గమనింపు చాలా విలువైనది. ‘పరిసరాలు’ సంకలనంలో సాధికారంగా చోటు సంపాదించుకున్న ఇరివెంటి యిల్లలుకుతూ తనను తాను మర్చిపోయిన ఈగ లాగా యువభారతి సారస్వత పరిషత్ వంటి సంస్థలకు నిస్వార్థసేవ అందిస్తూ సృజనాత్మక రచనకు దూరమైనందుకు అశోక్ బాధపడతాడు. మంచి కథా రచయిత అనామకంగా మరుగున పడిపోవడానికి పరిశోధకుల బాధ్యత కూడా వుందని గుర్తుచేస్తాడు.
కొలిపాక మధుసూదన రావు పబ్బరాజు గోపాలరావు వీరిద్దరిని తెలంగాణ తొలి జంట కథా రచయితలుగా అశోక్ పేర్కొన్నాడు. వారు విడివిడిగా రాసిన కథల్ని, కలిసి రాసిన కథల్ని వేరు వేరుగా విశ్లేషించాడు.
ఉమ్మడి పాలమూరు జిల్లా కవి పండితులు పరిశోధకులు గ్రంథ పరిష్కర్త శతాధిక గ్రంథకర్త ‘బహుముఖ ప్రజ్ఞాశాలి కపిలవాయి లింగమూర్తి’ ని కథా రచయితగా యీ తరం ముందు సాక్షాత్కరింపజేశాడు.
మునిమాణిక్యం నరసింహారావు గారి ‘కాంతం’ మాదిరిగా, హాస్య బ్రహ్మ దూపాటి సంపత్కుమారాచార్య ‘శ్రీమతి’ అనే నాయికను సృష్టించారని ఆ కాలంలో విమర్శకులు భావించారు. అయితే వారిద్దరి మధ్య వున్న తేడాలని అశోక్ తన వ్యాసంలో సూక్ష్మ దృష్టితో పరిశీలించాడు. ఖమ్మం ప్రాంత రచయితల మీద ఆంధ్ర రచయితల ప్రభావం వుందని చెబుతూ దూపాటిని భమిడిపాటి కామేశ్వరరావుతో పోల్చాడు. దూపాటి స్వస్థలం ఆంధ్ర సరిహద్దు ప్రాంతం సత్తుపల్లి కావడం వల్ల యీ ప్రభావం వుందని అశోక్ చెబుతాడు (ఆయన కథలు కథానిలయంలో లభించడానికి కారణం కూడా అదేనేమో!). ఎవరు వొప్పుకున్నా వొప్పుకోకున్నా వొక కాలంలో వొకే భాషలో భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన సాహిత్యాన్ని తులనాత్మకంగా పరిశీలించడం అనివార్యంగానే జరుగుతుంది. అందునా విస్తృత అధ్యయనశీలి అశోక్ లాంటి విమర్శకుల విషయంలో అది సహజం.
యశోద రెడ్డి కథల్లో కనిపించే మాండలికం సొగసుని తెలియజేస్తూ గ్రామీణ సంస్కృతిలో ఉన్న గొప్పతనాన్ని చూపిస్తూ ఆమె తొలిరోజుల్లో రాసిన మాండలిక కథలు ‘మా ఊరి ముచ్చట్లు’ సంపుటి దగ్గర నుంచి ఆ తర్వాత కాలంలో రాసిన ‘ఎచ్చమ్మ ముచ్చట్లు’ వరకు భాషలో శైలిలో వచ్చిన మార్పుల గురించి కె.పి. సున్నితంగా సునిశితంగా విశ్లేషించాడు. అలాగే ముచ్చట్లు చెప్పిన భాష, తక్కిన కథల్లో ఉన్న భాష వేరుగా వుండటం గమనించాడు. తెలంగాణలో మాండలికం వుపయోగించి రచనలు చేసిన యశోద రెడ్డి గారి కథల్లోని వైశిష్ట్యాన్ని, తెలంగాణదనాన్ని లోతుగా ఆవిష్కరించాడు అశోక్. మాండలికంలో కథలను రాసిన ఏకైక రచయిత్రి యశోదారెడ్డి అని తీర్మానిస్తూ ఆమె కథల్లో అచ్చమైన తెలంగాణ భాషను ఉపయోగించినప్పటికీ ఆ భాష యాసలను చదవడంలో పాఠకులకు ఎటువంటి ప్రయాస కలుగదని తేల్చిచెప్పాడు. మట్టివాసనలతో కూడిన పల్లె ప్రజల జీవితాలు, వాళ్ళు నిత్యజీవితంలో మాట్లాడుకునే యాస భాషలు సామెతలు నుడికారాలు, ఉపమానాల సొంపులు ఆమె కథల్లోని రచనాశైలికి జీవకళను తెచ్చిపెట్టాయనీ అలా తెలంగాణ జనజీవన చరిత్రకు – సంస్కృతికి యశోదారెడ్డి కథలు సాక్ష్యంగా నిలుస్తాయనీ వుగ్గడించాడు. ఈ సంపుటిలో నాకు బాగా నచ్చిన వ్యాసమిది. వ్యాసాన్ని సమగ్రంగా తీర్చిదిద్దడంలో అశోక్ పడిన శ్రమ యిందులో అడుగడుగునా కనిపిస్తుంది. నా పరిశోధనలో భాగంగా తెలంగాణ భాషా సాహిత్యాలే ముప్పై నాలుగు ఏళ్ళ కింద మా యిద్దరి మధ్య సాన్నిహిత్యం యేర్పడటానికి కారణమైనందువల్ల కూడా యీ వ్యాసానికి నేను బాగా దగ్గరైనట్టున్నాను.
అశోక్ తన అధ్యయనంలో మలితరం తెలంగాణ కథన రీతుల్లో రెండు ప్రధాన అంశాల్ని బలంగా యెత్తిచూపాడు – ఒకటి: కథనంలో చైతన్య స్రవంతి ధోరణి; రెండు: శైలి పరంగా మాండలిక భాషా ప్రయోగం.
రచనారీతులు శైలీ శిల్పాలు యేవైనా అవి కథలో పఠనీయతకు వుపయోగపడాలనే అతను కోరుకుంటాడు. ఈ క్రమంలోనే అప్కారి సూర్య ప్రకాష్ కథల్లో చైతన్య స్రవంతి ధోరణిని, ఉమాపతి పద్మనాభశర్మ ఇరివెంటి కృష్ణమూర్తి వుపయోగించిన మాండలిక శైలినీ అశోక్ చక్కగా యెత్తి చూపాడు.
నిజానికి యివి పరిచయ వ్యాసాలే. ఈ రచయితలు వారి స్థల కాల నేపథ్యాల నుంచి మరింత విస్తృతమైన అధ్యయనానికి అర్హులు. పూరించాల్సిన ఖాళీలు యెప్పుడూ మిగిలే వుంటాయి. అశోక్ చూపిన యీ దారిలో తెలంగాణా సాహిత్య సమాజం పయనిస్తుందని ఆశిస్తాను.
***
ఈ సంపుటిలోని వ్యాసాలు, వాటిలో అశోక్ కుమార్ సూచనా మాత్రంగా చెప్పి విడిచిన అంశాలు యెన్నో కొత్త ఆలోచనలకు ద్వారాలు తెరుస్తాయి. 50ల తర్వాతి కాలంలో కోస్తా ప్రాంతంలో వచ్చిన కథల్నీ తెలంగాణలో వచ్చిన కథల్నీ వస్తు పరంగా శిల్ప పరంగా తులనాత్మకంగా అధ్యయనం చేయడానికి యీ వ్యాసాలు పురిగొల్పుతాయి. ఒకానొక దశలో యిటువంటి పోలికలు తప్పు అన్న వాదం కూడా ప్రాంతీయవాద సాహిత్య విమర్శలో వినిపించింది. సాహిత్య ప్రమాణాలపై చర్చ జరిగింది. కోస్తా సాహిత్య ప్రమాణాలతో తెలంగాణా కథని అంచనా వేయడం అసమంజసం అని నిర్ధారణలు జరిగాయి. వెనకబడ్డ ప్రాంతాల సాహిత్యాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతపు సాహిత్య ప్రమాణాలతో బేరీజు వేయడం వల్ల తెలంగాణ కథకి అన్యాయం జరిగింది అని తీర్మానాలు కూడా వెలువడ్డాయి.
అయితే 70 కి ముందు కోస్తా కథ బలంగా వుంటే 70 ల తర్వాత ఎనభైల నుంచి తెలంగాణ నుంచి గొప్ప కథలు వచ్చాయి. తొంభైల నుంచి రాయలసీమ కథ వూపందుకొంది. తొలి దశకాల్లో కథా రచనలో ముందున్న కోస్తా ప్రాంతం ఆ తర్వాత రానురానూ వెనకతట్టు పట్టడానికి కారణాలు అన్వేషించాలి. నిజానికి ఆ యా ప్రాంతాల సామాజిక పరిస్థితులూ అవసరాలే మంచి కథల పుట్టుకకి కారణమౌతాయి తప్ప భిన్న ప్రాంతాలకు భిన్న ప్రమాణాలు పాటించాలి అన్న వాదం సాహిత్య అవసరాలకు అనుగుణంగా రూపొందుతుంది.
దేశ స్వాతంత్ర్యానంతరం నైజాం పాలన అంతరించాకా తెలుగు మాధ్యమంలో చదువు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎదిగొచ్చిన సామాజిక వర్గాల నుంచి కులాల నుంచి కొత్త రచయితలు తయారయ్యారు. ఈ తరానికి చెందినవారు 70ల తర్వాత తెలంగాణ కథని వున్నత శిఖరాలకు తీసుకు వెళ్ళారు. అంతవరకూ భాషా శైలీ రూపాల్లో కనిపించేవి అనుకరణ ఫలాలే అని యీ సంపుటిలోని వ్యాసాలద్వారా అవగతమౌతుంది.
అలాగే తొలి దశ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అందుకు కారణమైన సామాజిక రాజకీయ పరిస్థితుల సాహిత్య ప్రతిఫలనాన్ని అధ్యయనం చేయాలి. ఆ నాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నేపథ్యంలో వచ్చిన కథల్ని సైతం ప్రత్యేకంగా పరిశోధించాలి. ఇంతకు ముందు చెప్పినట్లు తెలంగాణ సాహితి ప్రచురించిన ఉద్యమ కథల తొలి సంకలనం తెలంగాణ చౌక్ (సంపా. స్వామి, ఎల్లారెడ్డి) ఆ దిశగా కొంత ప్రయత్నం చేసినప్పటికీ అది సర్వ సమగ్రం కాదు. ఆ కాలంలో వచ్చిన ఉద్యమ కథల్ని వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. తక్షణ స్పందనగా కథలు వెలువడకపోడానికి కారణాలని పరిశోధకులు తవ్వి తీయాలి. ‘సలాం హైదరాబాద్’ నవల (లోకేశ్వర్) వంటి వొకటి రెండు అరుదైన రచనలు ఆ తర్వాతి కాలంలోనే వచ్చాయి.
చెరబండరాజు నిఖిలేశ్వర్ తిరుపతయ్య వంటి రచయితలు మార్క్సిస్ట్ లెనినిస్ట్ దృక్పథంతో తెలంగాణ సమాజాన్ని చూసిన విధానానికీ, నవీన్ చెన్నకేశవులు విద్వాన్ నాగం వంటి యితర రచయితల సామాజిక దృష్టికోణాలకీ మధ్య తేడాలని, అవి కథల్లో ప్రతిఫలించిన రీతుల్ని వేరుగా అధ్యయనం చేయొచ్చు. అదే విధంగా శ్రీకాకుళ రైతాంగ పోరాట ప్రభావంతో వచ్చిన కథల్ని ప్రత్యేకంగా పరిశీలించాల్సి వుంటుంది. ఉత్తర తెలంగాణలో విప్లవోద్యమ జైత్రయాత్రకు పూర్వ రంగంగా వుండిన భౌతిక వాస్తవికతను నేపథ్యం చేసుకొని వచ్చిన కథల్ని కూడా ఆ క్రమంలోనే అధ్యయనం చేయాలి.
విప్లవ కథా రచయితగా కాకపోయినా కథకుడిగా కూడా నిఖిలేశ్వర్ కు యెందుకనో రావలసినంత గుర్తింపు రాలేదు. ఉద్యమ నేపథ్యంతో తొలి దశలో నిఖిలేశ్వర్ సృజించిన కథలకూ 80ల్లో రాసిన కథలకూ, వాటిలో వ్యక్తం చేసిన భావజాలంలో వచ్చిన మార్పులు పరిశీలించాలి. అలాగే నవీన్ తొలి నాటి (లైఫ్ ఇన్ ఎ కాలేజ్) కథలకూ తర్వాతి కథలకూ వస్తు రూప పరంగా వచ్చిన మార్పుల్ని అధ్యయనం చేయొచ్చు. అంతేకాదు, కాలగతిలో సామాజిక రాజకీయ అవసరాలకు అనుగుణంగా వస్తు రూప దృక్పథ రీత్యా మొత్తం తెలంగాణ కథ పొందిన పరిణామక్రమాన్ని సూక్ష్మ దృష్టితో వివేచించాలి. మంచి అనువాదకుడిగా అందరికీ తెలిసిన ముక్తవరం పార్థసారధి తొలినాటి కథల్లోనే గొప్ప వస్తు వైవిధ్యం ప్రదర్శించారని ఆయనపై రాసిన వ్యాసం నిరూపిస్తుంది. మిణుగురులు లోని తక్కిన కథల్ని, ఆ సంపుటిలోకి యెక్కని మరిన్ని కథల్ని దొరకబుచ్చుకొని అధ్యయనం చేయడం ద్వారా కథకుడిగా ఆయన స్థానాన్ని అంచనా వేయవచ్చు.
మలితరంలో యీ యిరవై మంది రచయితలు మాత్రమే వున్నారని నిర్ధారించలేం హీరాలాల్ మోరియా, ఇల్లిందల సరస్వతీ దేవి, ధరణికోట శ్రీనివాసులు, సింగరాజు లింగమూర్తి, భాస్కరభట్ల కృష్ణారావు, నెల్లూరు కేశవస్వామి, గూడూరి సీతారాం వంటి తొలితరం రచయితలు తర్వాతి కాలంలో కూడా కొనసాగారు (వీరిలో కొందరి కృషి గురించి అశోక్ కుమారే వేరే సందర్భాల్లో వివరించాడు). అశోక్ ప్రస్తావించిన కథల వరకు మాత్రమే ఆ యా కథకుల్ని కుదించలేం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1956 నుంచి వచ్చిన కథల్ని అశోక్ మలి తరం కథలుగా స్థూలంగా గుర్తించినప్పటికీ అతని దృష్టికి వచ్చినవి యెక్కువ భాగం దాదాపు ఆరవ దశకానికి చెందినవే అని గమనించాలి. ఇంకా వెలుగులోకి రాని కథకుల్ని వారి కథల్ని వెదికి వెలికి తీయడానికి అశోక్ కుమార్ కృషి దోహదం చేస్తుందని ఆశిద్దాం. ఒక విధంగా యీ వ్యాస సంపుటి భావి పరిశోధకులకు ప్రేరణనిస్తుంది. సాహిత్య చరిత్రలోని ఖాళీలను పూరించడంలో జరిగిన ప్రయత్నంలో భాగంగానే దీన్ని చూడాలి. ఇది సర్వ సమగ్రం కాదనే యెరుక కూడా అశోక్ కి వుంది. మరింత లోతైన అధ్యయనానికి దారి చూపడమే అతని ఆశయం.
***
తెలంగాణ సొంతరాష్ట్రం యేర్పడిన తర్వాత కూడా పరిశోధకులు తవ్వుతూనే వున్నారు. తవ్విన కొద్దీ బండ్లకెత్తేంత బయటపడుతోంది. అయితే తవ్వి వెలికి తీసిన భిన్న ప్రక్రియల సాహిత్యాన్ని సానపట్టి రాపాడి నాణ్యత పరీక్షించి దాని లోతుపాతుల్ని పరిశీలించాల్సిన పని యిప్పుడు ప్రధానంగా జరగాల్సి వుంది. వాటి మంచిచెడ్డల్ని నిర్మమంగా నిష్పక్షపాత వైఖరితో బేరీజు వేయాలి. అందునా తెలంగాణ దృష్టితో ప్రత్యేకంగా పరిశీలించాలి. సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణంలో యీరోజు విమర్శకుల ముందున్న పెద్ద చాలెంజ్ యిది. అధ్యయనపరులైన తెలంగాణ సాహిత్య విమర్శకులు ఆ దిశగా ప్రయాణం షురూ చేయాలి. ఆకరాల సేకరణ దగ్గర, కేవల పరామర్శ దగ్గర ఆగని పరిశోధన యివాల్టి అవసరం. భిన్న అస్తిత్వ వుద్యమాల్లో పనిచేస్తున్నవాళ్ళు అందుకు పూనుకోవాలి. అప్పుడు తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మితికి వుపయోగపడే అనేక రాజకీయ సామాజిక అంశాలు భిన్న కోణాలతో సహా వెలికి వస్తాయి. నా చిరకాల ఆత్మీయ మిత్రుడు కె.పి అశోక్ కుమార్ యెంతో శ్రమకోర్చి వొక విధమైన పట్టుదలతో తెస్తున్న ‘తెలంగాణ మలితరం కథకులు: కథనం రీతులు’ పుస్తకం ఆ అవసరాన్ని మరోసారి గుర్తుచేస్తుంది.
ఎందుకంటే – పూరించినకొద్దీ కొత్త ఖాళీలు బయల్పడుతూనే వుంటాయి. పూరణం నిరంతర ప్రక్రియ.
దీని కొనసాగింపు కోసం ఎదిరిచూస్తూ …
ఎ. కె. ప్రభాకర్
