వ్యాసరమణీయం

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

********

చరిత్రను, సంస్కృతిని రాబోయే తరాలకు అందించటంలో సాహిత్యం చేసే సేవ అపారమైనది. పాఠశాల చదువులోనూ, కళాశాల చదువులోనూ పాఠ్యాంశాలుగా ఎందరో గొప్పగొప్ప సాహితీవేత్తలందించిన విలువైన సంపదను కొద్దిమాత్రంగానైనా తెలుసుకుంటూంటాం. కానీ వారి వ్యక్తిగత జీవితాల్లోని అరుదైన, అందమైన విషయాలు తెలిసే అవకాశం తక్కువ. ఆత్మకథల రూపంలోనో, జీవిత చరిత్రల రూపంలోనో కొన్ని కొన్ని సంగతీ సందర్భాలు, అదికూడా కొందరివి మాత్రమే తెలుస్తుంటాయి. 

అలాటివారి జీవితాల్లోని అసాధారణ సన్నివేశాలు, ఎదుర్కొన్న సవాళ్లు, చేసిన త్యాగాలు వారిని సాధారణ వ్యక్తుల నుండి వేరు చేసి ప్రత్యేకంగా చూపెడతాయి. పరిస్థితులు ఎలాటివైనా జీవించటంలోని ఆదర్శాన్ని, సానుకూలమైన దృక్పథాన్ని చుట్టూ ఉన్నవారికి అలవోకగా అందిస్తూ వారు సమాజానికి చైతన్యపు పరిమళాన్ని అద్దుతారు. సంపూర్ణమైన అర్థవంతమైన జీవితానికి అవసరమైన మెలకువల్ని నేర్పుతారు. 

ప్రతి సమాజమూ తరం తరువాత తరం అలాటి ఆదర్శనీయుల పట్ల తమ గౌరవాన్ని ప్రేమని ప్రకటించుకుంటూ ముందు తరాలకు వారి గురించిన ఎరుకను కలిగించే ప్రయత్నం చేస్తుంటుంది. 

తెలుగు నేల మీద అలాటి ప్రతిభామూర్తులు ఎందరో ఉన్నారు. తెలుగు భాషా సాహిత్యానికి అవధులు లేని ప్రాశస్త్యాన్ని, గౌరవాన్ని తెచ్చిపెట్టిన వారు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ. వారి పేరు మీద డాక్టర్ మద్దినేని సింహ కౌటిల్య చౌదరి విశ్వనాథ సాహిత్య అకాడమి ని స్థాపించారు. అకాడమి తరఫున మంచి పుస్తకాలను ప్రచురించటం తో పాటు అనేక సాహిత్య సంబంధమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

మిత్రుని ద్వారా శ్రీరమణ మిథునం పరిచయమై, క్రమంగా ఆ రచయితతో సాన్నిహిత్యం పెరిగిందంటారు ముందుమాటలో డా. కౌటిల్య. చిన్నప్పట్నుంచి విశ్వనాథని చదువుకున్న తనకు శ్రీరమణలోనూ విశ్వనాథలా పాఠకుడిని తనవెంట నడిపించుకు వెళ్లగలిగే ప్రతిభ కనిపించిందంటారాయన.

శ్రీరమణతో తనకి ఉన్న అనుబంధాన్ని తలుచుకుంటూ, వారు ఆత్మీయంగా తనపైన పెట్టిన కొన్ని బాధ్యతలను చెపుతూ, ‘కొన్నికొన్ని అనుబంధాలను చూస్తే – పూర్వ పర జన్మలు, ఋణపడటం లాంటి పాతచింతకాయ పచ్చడి మాటలు నిజమేనేమో అనిపిస్తుందంటారు ముందుమాటలో సంపాదకులు మోదుగుల రవికృష్ణ.

శ్రీరమణ రాసిన కొన్ని సాహిత్య వ్యాసాలను వ్యాసరమణీయం పేరుతో అకాడమి పుస్తకంగా తీసుకొచ్చింది. ఈ పుస్తకాన్ని డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారికి రచయిత కోరిక మీద అంకితమిచ్చారు.

ఈ పుస్తకంలో ఇరవై ఐదు వ్యాసాలు, రెండు లఘు నాటికలు ఉన్నాయి. 

మొదటి వ్యాసం కృష్ణాతీరాన ప్రభవించిన వెలుగు దివ్వెలు 

కృష్ణాతీరంలో పుట్టిన ఎందరెందరో మహనీయుల్ని గురించి చదువుతుంటే గుండె ఉప్పొంగక మానదు. 

నూతన సహస్రాబ్దిలో కృష్ణానదికి వచ్చే తొలి పుష్కరాన్ని పురస్కరించుకుని ఈ నదీతీరంలో ప్రభవించిన సంస్కృతీ సాహిత్యాలను, వాటికి మూలస్తంభాలైన మహనీయుల్ని తలుచుకోవాలంటూ ప్రారంభించిన ఈ వ్యాసంలో కృష్ణానదికి ఉన్న ఉపనదుల్ని అక్కడి సంస్థానాల్ని చెప్పారు. గద్వాల సంస్థానాధీశులు రామాయణం బాలకాండ ను అచ్చువేసి మొదటిసారిగా 1818లో పుస్తక ప్రచురణకు శ్రీకారం చుట్టారంటూ, అదే క్రమంలో వచ్చిన అనేక పత్రికల వివరాలను చెప్పారు. కృష్ణా ప్రాంతం వారైన అద్వైత పరబ్రహ్మశాస్త్రి సి. పి. బ్రౌన్ దొరకు గురువు. 

పద్మభూషణ్ మాడపాటి హనుమంతరావు, గ్రంథాలయోద్యమ సారథి అయ్యంకి వెంకట రమణయ్య, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య, కవి పింగళి లక్ష్మీకాంతం, సినీ రచయిత సాహసం శాయరా ఢింబకా వంటి పదబంధాల్ని కట్టిన పింగళి నాగేంద్రరావు, తాళ్లపాకవారిని వెలుగులోకి తెచ్చిన వేటూరి ప్రభాకర శాస్త్రి, సినిమా పాటలకు కొత్త నడక నేర్పినవేటూరి సుందర రామమూర్తి… ఎందరో మహానుభావులు!

బందరులో ప్రముఖ వాగ్గేయకారులు, వయొలిన్ విద్వాంసులు హరి నాగభూషణం గారితో ఒక అభిమాని “మీరు, ద్వారం వారు ఒకే వేదికపై కచేరీ చేస్తే …” అన్నప్పుడు, “హరిద్వారం” అవుతుందన్నారట! తెనాలి దగ్గర అనంతవరం పంచాంగకర్తలకు నిలయం. శ్రీశ్రీ తన గురువుగా చెప్పుకునే అబ్బూరి రామకృష్ణారావు మెట్రిక్యులేషన్ చదువుతుండగానే శతావధానం చేసారు. ఆంధ్రాప్యారిస్ తెనాలి అంటే చలం, కొడవటిగంటి, కొమ్మూరి సాంబశివరావులు మనసుని ఆవరిస్తారంటారు శ్రీరమణ.

తెనాలి పౌరాణిక నాటకాలకు ప్రసిద్ధి. తెనాలివాడైన శ్రీరమణకు యీ నాటకాల గాలి సోకి కొన్నాళ్లు వాళ్లతో కలిసి యిల్లుపట్టకుండా తిరిగారట!

తుమ్మపూడి అనగానే సంజీవదేవ్, రసరేఖ! వారితో శ్రీరమణకి మంచి స్నేహం. పెనుగంచిప్రోలులో పుట్టిన కొమర్రాజు లక్ష్మణరావు తెలుగులో తొలి విజ్ఞాన సర్వస్వాన్ని రూపొందించారు. కృష్ణాజిల్లాలోని పద్ధెనిమిది సంస్థానాల్లో ప్రసిద్ధిపొందినది గద్వాల. దేశంలోని శైవక్షేత్రాలలో ప్రముఖమైన శ్రీశైలం ఇక్కడిదే. “వేదంలా ప్రవహించే గోదావరి, వెన్నెలవలె విహరించే కృష్ణవేణి” అన్నారు ఆరుద్ర

1883 లో ది మాన్యువల్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ రాసిన గోర్డన్ మెకంజీ – ఏమీ సందేహం లేదు. బ్రిటిష్ రాజ్యాల కంటే ముందు కృష్ణానదీ తీరంలో జనజీవనం, నాగరికత విలసిల్లాయి అని స్పష్టం చేసారు. కృష్ణాతీరాన శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆలయ మండపంలో కృష్ణదేవరాయలు తన ఆముక్తమాల్యద రచనా సంకల్పాన్ని ప్రకటించాడు. దేశభాషలందు తెలుగు లెస్స అన్న వాక్యం పుట్టిందిక్కడే. 

ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో ప్రముఖస్థానం గడించిన విశ్వనాథ మొదలు ఇక్కడ పుట్టి పెరిగిన రంగస్థల, చలనచిత్ర నటీనటులు, కమ్యూనిస్ట్ ఉద్యమకారులు, త్యాగయ్య పరంపరలోని సంగీత విద్వాంసులు, పత్రికా రచనలో ఆరితేరిన ప్రముఖులు, ప్రపంచ ఖ్యాతినార్జించిన చిత్రకారులు, సినీ దర్శకులు, స్వాతంత్ర సమరయోధులు, శాస్త్రవేత్తలు, గాయకులు, దిగంబర కవులు, పరిశోధక పండితులు, కవులు, చదరంగ ప్రవీణులు … కృష్ణాతీరంలో ప్రభవించిన ప్రముఖుల పేర్లనుమాత్రంగా స్మరించేందుకే ఒక పెద్ద వ్యాసం అవుతుంది. ఇది పరిశోధనావ్యాసం కాదని, ఏ పేరు లోపించినా పెద్దమనసుతో మన్నించమన్నారు శ్రీరమణ. (కొన్ని పదుల పేర్లను వ్యాసంలో ప్రస్తావించారు.)

భమిడిపాటి కామేశ్వరరావు తెలుగునాట నవ్వుల రాజనాలు పండించిన భమిడిపాటి గంభీరంగా, ముభావంగా ఉండటమేం అంటే వడ్డించేవాడు తింటూ వడ్డిస్తాడా? నే మాత్రం ఎందుకు నవ్వాలి అనేవారట. మధ్యతరగతి జీవితాలు వారి రచనకు ముడిసరుకు. వారి కుమారుడు రాధాకృష్ణ విద్యార్థిగా ఉన్నప్పటి అల్లరిపనికి తండ్రి వేసిన శిక్ష, భమిడిపాటివారి మెడ మీద కణితిని తొలగించాక ఎదుర్కొన్న చిక్కులు పుస్తకంలో చదవాల్సిందే. దేవులపల్లి రచనల్లా భమిడిపాటి వ్యాసాలన్నీ ఆకాశవాణికే రాసారు.

పిలకా గణపతిశాస్త్రి వండర్ బాయ్ అన్న నిక్ నేమ్ ఉన్న వీరు పిలకా అన్న తన ఇంటిపేరు వెనుక తమాషా కట్టుకథ చెప్పేవారు. తొలిరోజుల్లో అధ్యాపక వృత్తిలో ఉన్నప్పుడు తరగతిలో ఒక విద్యార్థిని తెగ నవ్వుతూ ఉండేదట. ‘మీ అమ్మాయి నవ్వు నుంచి నేను కాళిదాసు కవిత్వంలో అందచందాలను, విలువలను, లోతుపాతులను తెలుసుకోగలిగాను. మనసులో మీ అమ్మాయిని దీవిస్తూ ఉంటాను.’ అని ఆమె తండ్రిగారిని కల్సినప్పుడు చెప్పారు. ఆ విద్యార్థిని ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ తన జీవిత చరిత్రలో దీనిని గుర్తు చేసుకున్నారు. 

పప్పు వేణుగోపాలరావు సంగీత సాహిత్యాలను కాచి వడపోసి తూచిన చిన్నపాటి ఆదిభట్ల నారాయణదాసు వీరు. సాహిత్య సంగీతాలపై డా. పప్పు సోదాహరణ ప్రసంగాలు చాలా రసవత్తరంగా ఉండేవి. యన్నార్ చందూర్ చనిపోయినప్పుడు కొడుకులా నిలబడి అంతిమ సంస్కారాలు నిర్వర్తించారు. మిమిక్రీ సమ్రాట్ నేరెళ్ల వేణుమాధవ్ అందర్నీ అనుకరిస్తే, వేణుమాధవ్ ను పప్పు అనుకరించేవారు.

ఒక మహాప్రకృతి దృశ్యం ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు తెలుగు సాహిత్య వెలుగు జిలుగులను వాటి స్థాయిని బట్టి తీర్చిదిద్ది ఒక ప్రకృతి చిత్రంగా సమీకరిస్తే ఎలా ఉంటుందన్న ఊహతో రూపొందించిన అపురూపమైన దృశ్యం ఈ వ్యాసం. మచ్చుకి … 

వాల్మీకి, వ్యాసుడు, కణ్వ పరాసర చరకాదులు హిమాలయ పర్వతాలు గా మొదలు పెట్టి రామకృష్ణ పరమహంస, గాంధి, అంబేద్కర్ లు నింగిని తాకే వటవృక్షాలుగా, వాగ్గేయకారులు అన్నమయ్య, త్యాగయ్య శ్రీచందన వృక్షాలుగా తెలుగు సాహితీ మూర్తులందరినీ ప్రకృతి గా రూపుకట్టిస్తూ ఇంతటి మహాప్రకృతిదృశ్యంలో సూర్యుడు ఆదిశంకరుడంటూ ముక్తాయించారు రచయిత శ్రీరమణ.

ఇప్పుడెందుకు విశ్వనాథ? కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఆయన పంథా అంటూ రచయిత చెప్పిన ఒక సందర్భం… 

గురువుగారు చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి శిష్యులందరినీ ఇంటికి భోజనానికి పిలిచి ఇష్టాగోష్టిలో ఒక పద్యం చదివి అది వారిదో, తిరుపతిశాస్త్రిదో చెప్పమన్నారు. అందరూ ‘మీదేనండీ’ అన్నా, విశ్వనాథ మాట్లాడక కూర్చున్నారు. గుచ్చిగుచ్చి గురువుగారు ప్రశ్నించినప్పుడు పద్యం తిరుపతిశాస్త్రిగారిదేనంటూ, ‘మీ జన్మలో మీరిలాంటి పద్యం రాయలేరు’ అని సమాధానం చెప్పారు విశ్వనాథ. ఇలాటివెన్నో ఆ ప్రతిభామూర్తి జీవితంలో!

రంగస్థల కళాపూర్ణోదయం – బళ్లారి రాఘవీయం

చాలా ఏళ్ల క్రితం శ్రీశ్రీ బళ్లారి రాఘవని చూసేందుకు వెళ్లి రెండు రోజులు వారితో గడిపి తిరుగు ప్రయాణమైనపుడు “దగ్గర్లోని హంపీ శిథిలాలను చూచి వెళ్లరాదా?’’ అని రాఘవ అడిగారు. దానికి శ్రీశ్రీ “చాల్లెండి, మిమ్మల్ని చూశా కదా!” అన్నారు. రాఘవ శారీరకంగా అప్పటికి శిథిలమై ఉండటం, హంపీ క్షేత్ర కళావైభవంతో సమానమైన వైభవాన్ని అప్పటికే ఆయన చూసి ఉండటం అన్నది శ్రీశ్రీ మాటల్లోని ఆంతర్యమని రాఘవ గ్రహించి నవ్వుకున్నారు.

“రాఘవ భారతీయుడు కావటం భారతీయుల అదృష్టం” అని ఇంగ్లండ్ లో నాటకోత్సవాల్లో పాల్గొన్న రాఘవని గురించి జార్జి బెర్నార్డ్ షా అన్నారు. గాంధీజీ, విశ్వకవి రవీంద్రుడు రాఘవ నటనా కౌశలం చూసి ముగ్ధులయ్యారు.

జాతీయ గేయకవితా గరిమ గరిమెళ్ల “మాకొద్దీ తెల్లదొరతనము!” గేయంతో దేశవ్యాప్త కీర్తిని పొందారు. ఇది ఇంగ్లీషులోకి అనువాదమై స్వరాజ్య పత్రికలో వెలువడింది. గృహలక్ష్మి, ఆనందవాణి, త్రిలింగ వంటి పత్రికలకు పనిచేసినప్పటికీ ఎక్కడా ఇమడలేకపోయిన స్వేచ్ఛాపిపాసి. ఆఖరి రోజుల్లో దీనావస్థలో జీవించారు. తమిళ, కన్నడ భాషల్లో పాండిత్యం ఉంది. తెలుగులో సుబ్రహ్మణ్యభారతి అని చెప్పదగిన ప్రతిభామూర్తి గరిమెళ్ల అని వావిళ్లవారు అనేవారు. మరణానంతరం సుబ్రహ్మణ్య భారతిని తమిళులు గొప్పవాడిగా గుర్తించారు. గరిమెళ్లకి ఆ కీర్తీ దక్కలేదు.

శివరాత్రి ప్రభల స్వచ్ఛంద కవిత – కవికొండల జీవితంలోనూ, కవిత్వంలోనూ, వేషధారణలోనూ ఆర్భాటాలు లేని స్వచ్ఛమైన ప్రకృతికవి. ఆస్వాల్డ్ జె. కూల్డ్రే దొర కవిగారిని ఆంధ్ర వర్డ్స్ వర్త్ గా చెప్పారు. శ్రామికజనం భాషలో వారి మాటలను గేయఛందంలో పొదిగిన కవి.

నావలో పిల్లున్నాది

పిల్లకు వొళ్లున్నాది

వొళ్లెల్ల వయసున్నాది అంటూ బొమ్మకట్టించిన కవిత గుండెను ఝల్లుమనిపిస్తుంది.

రాయలసీమ రతనాలు స్వేచ్ఛగా ఆలోచించి, అందరినీ స్వేచ్ఛగా ఆలోచించమని ప్రభోధించిన ఇద్దరు చింతనాపరులు యోగి వేమన, జిడ్డు కృష్ణమూర్తి రాయలసీమవారు. నమ్మిన సత్యాలను అలతి పదాలతో ఆటవెలదులతో ఆశువుగా చెప్పిన వేమన పద్యాలు తెలుగునాట శాశ్వతంగా నిలిచిపోయాయి. తాత్త్విక ధోరణులను, నమ్మకాలను విశ్వాసాలను వ్యవస్థీకరించటం మంచిది కాదన్నారు కృష్ణమూర్తి. అపరిమితమైన, అమేయమైన ఒక మహాశక్తిని గుళ్లకు, గోపురాలకు పరిమితం చేయరాదని, అది మన పక్కనే ఉందన్నారు.

రాజేస్వరం రసాలూరు రాజేశ్వరరావు, రాజేస్వరరావు, సంగీత రాజేశ్వర్రావు అని చెప్పబడిన సాలూరి రాజేశ్వరరావువాద్యగోష్టికి రూపురేఖా పరిమళాలు అద్దడానికే సాలూరి జన్మించారని పలువురి అభిప్రాయం. అన్ని సంగీతవాద్యాలను చనువుగా సాధికారంగా పలకరించగల సామర్థ్యం వారికి ఉంది. 

ఇంటిల్లిపాదినీ స్వరబ్రహ్మలుగా మలిచి, పాశ్చాత్యబాణీలను తెలుగువారికి అనువుగా అనువదించిన సాలూరిని 1992 రఘుపతి వెంకయ్య అవార్డుతో రాష్ట్రప్రభుత్వం గౌరవించింది. ప్రముఖ వాయులీన విద్వాంసులు యమ్మెస్ గోపాలకృష్ణన్ తో పూజాఫలం చిత్రంలో వయొలిన్ వినిపింపజేసినది సాలూరి. చంద్రలేఖ డ్రమ్స్ మ్యూజిక్, మల్లీశ్వరి సంగీతం సాలూరి అందించిన గొప్ప కానుకలు.

అడివోరి చిన్నోడ! అమృత ధారలవాడ!

విశ్వనాథ వారికి సమకాలికులు అడవి బాపిరాజు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన నవలల పోటీలో విశ్వనాథ వేయిపడగలు తో పాటు తన నారాయణరావు నవలకు బహుమతిని పొందారు.

బాపిరాజు గాంధేయవాది, కళాహృదయుడు. చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, కవిత్వం అన్నిటా అధికారం సంపాదించిన ప్రతిభావంతుడు. కళలో పుట్టి, పెరిగి, తన్మయులైన బాపిరాజు సృష్టించుకున్న ఊహాసుందరి శశికళ. బాపిరాజు సాహిత్యంలో స్పృశించని శాఖ లేదు. నవలలు, కథలు, కావ్యాలు, వ్యాసాలు, రేడియో ప్రసంగాలు, నాటికలు, నాటకాలు అన్నింటినీ సుసంపన్నం చేసారు. “కళలే కోరి ఆయనను వరించాయి” అన్నారు ముద్దుకృష్ణ. వారు వరద గోదావరిపై రాసిన ఉప్పొంగి పోయింది గోదావరి గేయాన్ని బాలాంత్రపు రజనీకాంతరావు స్వరపరచి, సంగీతం కూర్చి ఆకాశవాణిలో ప్రసారం చేసారు. దీనికి జపాన్ అంతర్జాతీయ అవార్డ్ ను అందించింది. 

ఘుమఘుమలాడే గుమ్మడి జ్ఞాపకాలు గుమ్మడి లక్షణమైన నటుడు. విలక్షణమైన వ్యక్తి. బాపు సీతాకళ్యాణం చికాగో ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికై ప్రదర్శింపబడినపుడు ఫిలిం జర్నలిస్ట్ డెరిక్ మాల్కోమ్ దశరథుని పాత్రను చూసి గుమ్మడికి అభిమానిగా మారారు. 

మాయాబజార్ రంగుల్లో వచ్చినపుడు థియేటర్లో చూసాక “ఇందుకే బతికివున్నానేమో” అని గుమ్మడి మురిసిపోయారు. ఆంధ్రజ్యోతిలో “తీపి గురుతులు – చేదు జ్ఞాపకాలు” శీర్షిక రాసారు. పుచ్చలపల్లి సుందరయ్య గారితో గుమ్మడికి మరపురాని జ్ఞాపకం ఒకటి ఉంది. 

డి. వి. నరసరాజు ఒక వొరవడి ప్రఖ్యాత సినీరచయిత, నాటకకర్త, ప్రయోక్త, నటుడు. డెబ్భై ఎనభై ఏళ్ల నాడు బెజవాడ రూపురేఖలెలావుండేవో నరసరాజు ఆత్మకథ చదివితే అర్థమవుతుందంటారు శ్రీరమణ. కొన్ని జట్కాలు, నాలుగైదు కార్లు వున్న బెజవాడ వీథుల్లో ఆయన తిరిగారు. యాభై ఏళ్ల క్రితంనాటి ఆయన వాపస్ నాటిక చాలా ప్రసిద్ధి. సుతిమెత్తని హాస్యం, వ్యంగ్యం ఆయన సొంతముద్ర. ఈనాడు దినపత్రికలో అక్షింతలు శీర్షిక 19 సంవత్సరాలు నడిపారు. హేతువాది, యం. ఎన్. రాయ్ అనుచరుడు. వృత్తి, ప్రవృత్తులలో క్రమశిక్షణ పాటించిన వ్యక్తి. ఒడిదుడుకులు లేని జీవితం. స్వీయచరిత్రకు అదృష్టవంతుని ఆత్మకథ అని పేరు పెట్టుకున్నారు.

బ్రహ్మర్షి, దేవులపల్లి మరియు ఋగ్వీథి రాజకీయ దాస్యం, దరిద్రం, అవిద్య, సాంఘిక దురాచారాలు దేశాన్ని ఆవరించి ఒక ఆశాజ్యోతి, ఒక మార్గదర్శి కోసం చూస్తున్న 19 వ శతాబ్దపు ఆఖరి దశాబ్దాల్లో సంఘంలో నైతిక ధార్మిక విద్యారంగాలను దేదీప్యమానం చేస్తూ అవతరించిన దివ్యజ్యోతి రఘుపతి వెంకటరత్నం నాయుడు. తమ దార్శనికతతో, త్యాగంతో, చైతన్యంతో జాతిని పునీతం చేసిన వైతాళికుడాయన. సమాజాన్ని సాధనక్షేత్రంగా, విద్యాలయాలను తపోనిలయాలుగా మలుచుకున్న కర్మయోగి. దేవులపల్లి కృష్ణశాస్త్రి నాయుడుగారిని ఏకైక గురువుగా భావించి ఆయన ప్రచారం చేసిన బ్రహ్మసమాజాన్ని స్వీకరించారు. నాయుడుగారు అలనాటి సూఫీ ప్రవక్తల బాణీలో చెప్పిన సూక్తులను దేవులపల్లి తేటగీతులుగా, లలితగీతాలుగా తెలుగులోకి తెచ్చారు. అది ఋగ్వీథి పేరుతో ప్రసిద్ధిపొందింది.

చల్లనితల్లి సూర్యకాంతమ్మ చిన్నవయసులోనే పాడటం నేర్చి సినిమాల్లో నటించాలన్న కోరికతో నాటకానుభవం సాధించి చెన్నపట్నం వెళ్లారు. సంసారం చిత్రంలో గయ్యాళి పాత్ర చేసి, జీవితమంతా ఆ పాత్ర బ్రాండ్ అంబాసిడర్ గా అభిమానుల గుండెల్లో నిలిచారు. గడుసుదనాన్ని, అమాయకత్వాన్ని పరుషసరళాలుగా పలికించడం ఆమెకు అవలీల. నిజజీవితంలో చల్లనితల్లి.

మహారథి కర్ణ వేమూరి రామయ్య పౌరాణిక రంగస్థలాన్ని గడగడలాడించినవారు వేమూరి గగ్గయ్య. అంతటి గొప్ప నటుడికి కుమారుడిగా పుట్టిన రామయ్య మారుతున్న ధోరణులను సంయమనంతో ఆకళింపు చేసుకుంటూ జీవితంలోనూ, రంగస్థలం మీదా నెగ్గుకొచ్చారు. అనేక పౌరాణిక పాత్రల్లో మెప్పించారు. మహారథి కర్ణ నాటకాన్ని సానపట్టి తిరుగులేని ఖ్యాతిని ఆర్జించారు. 

చక్కదనానికి నిర్వచనం కాంచనమాల ఆమె వర్ణచిత్రంతో ప్రతి నట్టింట్లో ఓ క్యాలెండరు వేలాడుతూ ఉండేది ఆ రోజుల్లో. విప్రనారాయణ చిత్రంలో దేవదేవి పాత్ర ఆమెకు గుర్తింపు తెచ్చింది. గూడవల్లి దర్శకత్వంలో మాలపిల్ల గా ఆమె ఒదిగిపోయింది. జెమినీ సంస్థలో పనిచేస్తూ తన స్వేచ్ఛను పోగొట్టుకున్నట్టుగా భావించి జెమినీ అధినేతను ఎదిరించి మానసిక కల్లోలానికి గురైంది. మతిస్థిమితం లేకుండానే నలభై సంవత్సరాలు జీవించింది. శ్రీశ్రీ రెండు మూడు కవితల్లోను, వేటూరి ఒక సినీగీతంలోనూ ఆమెను స్మరించారు. 

ఈ వ్యాసాలన్నీ ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక, భక్తి పత్రిక, క్రోక్విల్ హాస్యపత్రిక వంటి పత్రికలలో వచ్చినవి. 

ఈ పుస్తకం చదువుతున్నంతసేపూ ఆయా ప్రముఖులు జీవించిన కాలాదుల్లో తాము కూడా ఉన్నట్టే భావిస్తారు పాఠకులు. పేరుకు తగ్గట్టుగానే ఇది వ్యాసరమణీయం! 

ఈ పుస్తకం చదువుతున్నప్పుడు 2023 లో చదివిన తిరుమల రామచంద్ర గారి మరపురాని మనీషి పుస్తకం, అందులోని ఇరవయ్యో శతాబ్దపు తెలుగు తేజోమూర్తుల అపురూప చిత్రాలు జ్ఞాపకం వచ్చాయి. ఆ పుస్తక పరిచయం ఇదే వేదిక పై ఫిబ్రవరి 2023లో వచ్చింది.

ఈ పుస్తకం తెలుగువారంతా చదివి అనుభూతించదగ్గది. దాచుకోదగ్గది. ప్రచురణకర్తలకు అభినందనలు!

ప్రచురణః విశ్వనాథ సాహిత్య అకాడమి, 26- 5- 2024

టైటిల్ డిజైనింగ్ః డా. సెట్లెం చంద్రమోహన్

ధరః రూ. 120/-

You Might Also Like