కథావిమర్శ (చర్చ)-మొదటిభాగం: రచయితలూ, పాఠకులూ

ఈ చర్చ ప్రముఖ రచయిత్రులు, బ్లాగర్లు అయిన నిడదవోలు మాలతి గారికీ, కల్పన రెంటాల గారికీ మధ్య జరిగింది. పుస్తకం.నెట్ కోసం అడగ్గానే ఒప్పుకుని ఈ చర్చ జరిపినందుకు వారిద్దరికీ మా తరపున ధన్యవాదాలు. ఈ చర్చ రెండు భాగాలుగా ఉంది. మొదటి భాగం – “రచయితలూ,పాఠకులూ” ఇప్పుడు వేస్తున్నాము. రెండో భాగం త్వరలో. పుస్తకం.నెట్

మాలతిః కల్పనా, అసలు రచయిత, నువ్వే అనుకో, కథ కానీ కవిత కానీ నీకోసం రాసుకుంటావా, పాఠకులని దృష్టిలో పెట్టుకుని రాస్తావా?

కల్పన: మాలతిగారు, నేనైతే మొదట నాకోసమే రాసుకుంటాను. అయితే అది ప్రచురణకు పంపితే మాత్రం తప్పకుండా పాఠకులగురించి కూడా ఆలోచిస్తాను. వాళ్ళు దీన్ని ఎలా స్వీకరిస్తారు అని.

మాలతిః నేను నాకు ఏదో రాయాలన్న తపన కలగడంచేత రాస్తాను. మరి “పాఠకులకోసం” అన్నది కనీసం నావిషయంలో, పూర్వం లేదు. ఇప్పుడు బ్లాగు మొదలుపెట్టినతరవాత, కొందరు పాఠకులు తప్పనిసరిగా మనసులో మెదులుతున్నారు. ప్రచురణకి పనికివస్తుందా రాదా అన్నఆలోచన లేదనే అంటాను నాకైతే. బహుశా వాళ్లు ప్రచురించకపోతే నేనే ప్రచురించుకుంటాను అన్న ధీమా కావచ్చు. ప్రతి కథకీ కొందరు పాఠకులు వుండకపోరు అని కూడా నానమ్మకం. మరి కవితలు కూడా అంతేనా నీవిషయంలో?

కల్పన: కొంతలో కొంత, కథ వేరు, కవిత వేరు అనుకుంటాను. కవిత మాత్రం ఎప్పుడూ మొదట మనకోసమే రాసుకుంటాము. కధ మాత్రం ప్రధానంగా సమాజం నుంచి పుడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇది చదివినవాళ్లకు ఈకధ ఏమనిపిస్తుంది? ఎలా అర్ధం చేసుకుంటారు? లాంటివి తెలిసి కాని, తెలియకుండానే కాని ఆలోచిస్తామని నేను అనుకుంటాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే కధ రాసేటప్పుడు నేను రచయతని. నా కధను నేనే విమర్శించుకునేటప్పుడు నేనే విమర్శకురాలిని. ఆ తర్వాత నేనే పాఠకురాలినైతే ఈ కధ ఎలా అనిపిస్తుంది అని కూడా ఆలోచిస్తాను. మూడు చోట్లా సంతృప్తి కలగటం అనేది వుండకపోవచ్చు. అలాంటప్పుడు నేను రచయత పాత్రకే కట్టుబడి అవసరమైనమార్పులు చేసుకుంటాను. కధ రాసేటప్పుడు నాపాత్ర అదే. అసలు రాజాస్థానాలు, పత్రికలూ, ప్రచురణలు, బ్లాగులు లేనప్పుడు రచయితలు ఎలా ఆలోచించి వుండేవారనుకుంటున్నారు?

మాలతి: మంచి ప్రశ్నే. నువ్వన్నట్టు కథ వేరూ, కవిత్వం వేరూ అంటే వాటిని వేరేరకంగా ఆలోచించాలి. ఉదా. వేమన … అలాకాక, కథలు పెద్దవాళ్లు పిల్లలకి లోకరీతి నేర్పడానికి మొదలుపెట్టేరేమో. అంటే అవే ఆనాటి వ్యక్తివికాసంపాఠాలు అన్నమాట. మరి పాఠకులకోసమే అనుకుంటే, నువ్వు నీకథలని వాళ్ల అభిప్రాయాలకి అనుగుణంగా మారుస్తావా?

కల్పనః వేమన అయినా సుమతీశతకకారుడైనా తమకోసం మాత్రమే రాసుకుని వుంటారని నేననుకోను. లోకానికి చెప్పటంకోసం కూడా రాసి వుంటారు.. అది కూడా ఎవరోఒకరికి చదివి వినిపించటం, అలా మౌఖికంగా సాహిత్య ప్రచారం ఆ రోజుల్లో జరిగేది కాబట్టి పాపం వాళ్లకు పాఠకుల కామెంట్లగొడవ లేదేమో. అలాగే కధ ప్రయోజనం మొదటినుంచి కూడా సమాజం పోకడల్ని చెప్పటమో, నీతిని బోధించటమో అయివుండవచ్చు. ఆరోజుల్లో అది పర్సనల్ డెవలప్మెంట్ అయినా ఇప్పుడు కధ స్వరూపం, ప్రయోజనం కూడా మారాయి కదా. మరి కథగురించి మన ఆలోచనలు మారాల్సిన పని లేదా?

మాలతి: కథప్రయోజనం ఎలా మారిందంటావు? స్వరూపం మారినట్టు కనిపించినా అది పైపైమార్పే అంటాన్నేను. ఆరోజుల్లోనూ ఈరీోజుల్లోనూ కూడా కథకుడు తనభాషలో తనధోరణిలో చెప్పడమే కదా. ఎటోచ్చీ, సంపాదకులూ, ప్రచురణకర్తలూ లేనిరోజుల్లో నిబంధనలు కూడా లేవు. అంచేత రచయితకి ఎక్కువ స్వేచ్ఛ వుండేది అప్పట్లో.

కల్పన: ఇదివరకు కధకి సామాజికప్రయోజనమే మొదటిలక్ష్యం, బహుశా అదొక్కటే లక్ష్యం కూడా అయివుండవచ్చు. అప్పుడు కూడా అది రచయతని బట్టే వుంటుందనుకుంటాను.. అయితే కాలానుగుణంగా అది ఎంతో కొంత మారింది. ముఖ్యంగా అస్తిత్వచైతన్యం వచ్చాకా.

మాలతి : అస్తిత్వం, చైతన్యం ఒక భావన. దానిఆంతర్యం కూడా వ్యక్తివికాసమే కదా.

కల్పన: అస్తిత్వం, చైతన్యం ఇవి వ్యక్తిత్వవికాసంలో భాగమే.. అయితే వ్యక్తీకరణలో తేడా వుంటుంది కదా! స్త్రీలు, దళుతులు, ముస్లిమ్‌లు తమబాధల్ని, తమగాధల్ని చెప్పుకుంటున్నప్పుడు అందరికీ నచ్చినా, నచ్చకపోయినా వాళ్ళవేదనని చెప్పితీరతారు. చెప్పితీరాలి. మొదటినుంచి సాహిత్య ప్రయోజనమ్ సామాజికప్రయోజనమే అయినా రచయితలు సామాజికప్రయోజనం కోసమ్ రాసినా, వాళ్ళ ఇష్టాఇష్టాలు, వాళ్ళ స్వేచ్ఛ అంతర్లీనంగానైనా వాడుకునేవారు.

మాలతి : మరొకమాట అడుగుతాను. నువ్వు కథ రాసినప్పుడు కొందరయినా అఫెండ్ అవుతారేమో అనుకుని మార్పులు ఏమైనా చేస్తావా, నీకు ఏం రాయాలని వుందో అదే యథాతథంగా రాస్తావా?

కల్పన: ఎవరో బాధపడతారని నేను కధ మార్చిన సందర్భాలు లేవు కాని మధ్యతరగతినుండి రావడంవల్లనేమో మొదట నాకు నా కుటుంబసభ్యులు మాత్రం గుర్తు వస్తారు. మా అన్నయ్యలు, తమ్ముడు, అక్కచెల్లెళ్ళు, బంధువులు ఈ కధ చదివి ఎలా మాట్లాడతారో మాత్రం నాకు ఠక్కున తెలిసిపోతుంది. అదొకరకమైన అప్రకటిత censorship. ఈ సెన్సార్ షిప్ కుటుంబం ఒక్క దాని నుంచే కాకుండా సామాజికంగా కూడా వుంటుంది. స్త్రీలుగా ఎలాంటి విషయాలగురించి రాయవచ్చు, రాయకూడదు, ఏవిధంగా వ్యక్తీకరించవచ్చు లాంటివి. మొదట్లో అది నామీద చాలా ప్రభావం చూపించేది. చాలా విషయాలు రాయడానికి సంకోచించేదాన్ని. క్రమేపి దాన్ని అధిగమించాననే అనుకుంటున్నాను. ఆరకంగా కొన్ని మార్పులు రాసేటప్పుడో, ఆ తర్వాతో మనం తెలిసి కాని, తెలియకుండానో కాని చేసేస్తుంటాము. అది ఇతివృత్తాన్ని, రచయితనిబట్టి కూడా వుంటుంది.

మాలతి: నా అభిప్రాయం కూడా అదే. చెప్పేతీరులో మార్పు వుంటుందేమో కానీ ప్రాథమికంగా చెప్పదలుచుకున్నవిషయంలో మార్పు వుండదనే అనుకుంటాను. పైగా నువ్వన్నట్టు కుటుంబసభ్యులూ, స్నేహితులూ ఈకథని ఎలా స్వీకరిస్తారన్న ఆలోచన నాక్కూడా కొంతవరకూ ఉండొచ్చు. గట్టిగా చెప్పలేను. ఒకవిధంగా చెప్పాలంటే నిజజీవితంలోమాటాడినప్పుడు తూచి మాటాడినట్టే రాసినప్పుడు కూడానేమో. నాకు మరో సందేహం. రచయిత తనకథని మరొకరికథ విమర్శిస్తున్నంత నిష్పాక్షికంగా విమర్శించుకోగలడా అని.

కల్పన: నేను అయితే నో అనే సమాధానమిస్తాను. ఎవరికధగురించి వాళ్ళకు తెలిసినట్టుగా వేరేవాళ్లకధగురించి తెలియదు. మీకధ నాకు నాస్థాయినిబట్టి అర్ధమవుతుంది. నాకు మీకధ అర్ధమ్ చేసుకునే స్థాయి లేకపోతే నాకు ఆకధ అర్ధంకాదు. అందుకని కూడా పాఠకులు వివిధస్థాయిల్లో వుంటారు కాబట్టి వాళ్ళందరికి అర్ధమయ్యేలా, లేదా వాళ్ళందరిమెప్పుకోసం కధ రాయాలని యే రచయితా ప్రయత్నించరు.

మాలతి: నామటుకు నేను నాకథ పదే పదే చదువుకుంటాను. అది ఇప్పుడు వచ్చిన అలవాటేలే. పూర్వం రాసింది రాసినట్టు పంపేయడమే. ఇప్పుడు చదువుకోడం వచ్చేక, అలా చదువుకుంటున్నప్పుడు ఎక్కడ బాగులేదు. ఎక్కడ మరింత స్పష్టం చెయ్యాలి అన్నఆలోచనలు వస్తున్నాయి. నేనంటున్నది అది కూడా ఒకరకంగా స్వవిమర్శే కదా. అస్సలు బాగులేదు అనుకుని పక్కన పెట్టేసేవి కూడా వుంటాయి. నువ్వు స్థాయి అంటున్నావు. నేను అనుభవాలూ, పరిస్థితులూ, వారి ఆలోచనాధోరణిలో గల పరిమితులు అనుకుంటాను. అంతేనా?

కల్పన: మీరన్న అనుభవాలు, పరిస్థితులు, అవగాహన, వీటినే నేను స్థాయి అన్నాను. తక్కువ, ఎక్కువ అన్న వుద్దేశంతో మాత్రం కాదు. మీరు మీకోసమే కధ రాస్తాను అన్నారు. కాని బ్లాగులో రాయడం మొదలుపెట్టాక మీరు కధ రాసేటప్పుడు అంతకుముందు కధకి పాఠకులవ్యాఖ్యలు ఏదో ఒకరకంగా మీమీద ప్రభావాన్ని చూపిస్తాయి అని నేననుకుంటాను. అలా మీకు తెలిసి మీకధలో మీకు మీరుగా ఏం మార్పులు చేసారు? అలా మార్పులు చెయడంవల్ల మీకధ మంచి మార్పుకి గురైందా? లేక వాళ్ళవల్ల మీకధ మీరు అనుకున్న విధంగా కాకుండా మరో రకంగా రాయాల్సి వచ్చిందా? అసలు ఈకధల్లో వస్తున్న మార్పులకు పాఠకులు ఎంతవరకు కారణం? అని మీరనుకుంటున్నారు?

మాలతి: అమ్మో, పెద్ద ప్రశ్న వేసేవు. నేను బ్లాగు మొదలు పెట్టింతరవాత జరిగిందేమిటంటే – ఏదో పాతతరం రచయిత్రి అని కాకుండా, ఈనాటియువత నాకథలని ఆదరించడం. వాళ్లు రాసే వ్యాఖ్యలనిబట్టి కొంతవరకూ నేను చెప్పేతీరులో మార్పు వచ్చింది. వైదేహీ, రాధిక ఈమాటే అన్నారు. నేను కావాలని పనికట్టుకు చేసింది సంస్కృతసమాసాలూ, అవీ కాస్త తగ్గించడం :). అందువల్ల నాకథ మెరుగుపడిందా అంటే చెప్పడం కష్టం. ఈపాఠకులు వేరు. నిజానికి మంచి ఉదాహరణ నా ఉసుపోక కతలు చూడు. బ్లాగుపాఠకులు విశేషంగా ఆదరించారు ఆశీర్షికని. అదే ఆంధ్రాలో ఒక ప్రచురణకర్తకి మాఅన్నయ్య చూపిస్తే, అందులో హాస్యం లేదండీ అన్నారుట. అంటే వారిదృష్టిలో ప్రింటుపుస్తకాలు చదివే పాఠకులని ఆకర్షించగల హాస్యం కాదనే కదా. ఈనాడు కథల్లో వస్తున్నమార్పులకి ఎక్కువగా బాధ్యులు ఇంగ్లీషుపుస్తకాలు చదివి ఆ ఒరవడిలో ఆలోచించే పాఠకులు. వీరిలో కొందరికి అసహనంపాలు కూడా ఎక్కువే అనిపిస్తుంది ఒకొకప్పుడు. వెనక ఒకసారి ఒక పాఠకుడు “మాకు అర్థంఅయేలా రాయండి చదువుతాం”, అన్నారు నాకథగురించి. ఇలాటి వ్యాఖ్యలు చేసి పాఠకులు నారచనావిధానంలో మార్పు తేలేరు. నిజానికి నారచనావిధానంలో, నాశైలిలో మార్పులు ఏమైనా వుంటే, దానికి కారణం నా వ్యక్తిగతపరిస్థితులూ, నాచుట్టూ వున్న పరిస్థితులే అని చెప్పాలి.

కల్పన: అంటే మీభాషలో మార్పు వచ్చింది అంటారు. మీరు చెప్పేది పాఠకులకు అర్థం కావాలంటే వాళ్ళకు ఎలా చెపితే అర్థం అవుతుందో అలాగే చెప్పాలి అంటారు. మీదగ్గర పాతతరానికి సంబంధించిన మంచి భాష,నుడికారం వున్నాయి. కాని, అవి వీళ్ళకు పెద్దగా అర్థం కాదు కాబట్టి వాళ్ళకోసం మీరు అందరికి అర్ధమయ్యే భాష రాయాల్సివచ్చింది. మీ కొత్త కధ ’నీ కోసం’ లో కూడా చాలా మంచి పదాలున్నాయి ఈనాటితరంవాళ్లకు తెలిసే అవకాశం లేనివి. ఔద్ధత్యంలాంటివి.

పాఠకులు మీరచనావిధానంలో మార్పు తేలేరు అని మీరు స్పష్టం చేయటం నాకు నచ్చింది. అయితే మీరు ఇక్కడ ప్రధానంగా బ్లాగ్ పాఠకుల గురించి మాట్లాడుతున్నరనుకోండి. అయినా ఇంతకుముందు భారతి టైం నుంచి మొన్న మొన్నటి అంధ్రజ్యోతి లాంటి వారపత్రికల్లో కధల ప్రచురణవరకు తీసుకొని చూస్తే, చాలా తేడా తెలుస్తుంది. భారతి లాంటి పత్రికల్లో కధ ప్రచురించటమంటేనే అది మంచి కధ అని గుర్తింపు. అలాగే అందులో రాసే రచయితలకు ఒక గుర్తింపు, ఒక స్థాయి వుండేది. క్లుప్తం గా చెప్పాలంటే ఇదివరకు పత్రికల్లో ఎంపిక స్థాయి ఆరకంగా వుండేది. పాఠకులఆలోచనలు కూడా భిన్నంగా వుండేవి. అలాగే వారు చదివిన కధలమీద నచ్చినా, నచ్చకపోయినా పత్రికలకు ఉత్తరాలు రాసేవారు. అంటే కధగురించి ఆలోచించి ఏది బాగుందో, ఏది బాగులేదో ఉత్తరాలు రాసేవారు. ఇలాంటి లేఖలద్వారా కాని, లేదా రచయితలు ఒకరికొకరు రాసుకోవడంద్వారా తమ రచనలమీద అభిప్రాయాలు తెలుసుకోగలిగేవారు. కాని ఇప్పుడు ఈ బ్లాగులవల్ల పాఠకులు ఏమనుకుంటున్నారో, మనకు తెల్లారేసరికి తెలిసిపోతోంది. పత్రికల్లోకంటే బ్లాగులద్వారా ఎక్కువమంది పాఠకులకు మనం చేరుకోగలగటం మాత్రం శుభపరిణామమే.

మాలతిః “పెద్దగా అర్థం కాదు” అనడంలేదు నేను. వారిదృష్టిని అట్టే ఆకట్టుకోదు అనుకుంటాను. ఈనాటిపాఠకులు instant lifeకి అలవాటు పడ్డవారు. ఆలోచించుకునే ఓపిక లేక, ప్రతిదీ స్పష్టంగా అరటిపండు వొలిచి చేతిలో పెట్టినట్టు అందించమంటారు. అంచేత పూర్వం మనకథల్లో వున్న ధ్వనీ, వక్రోక్తీ ఇప్పటికథలలో కనిపించదు. ఒకవేళ నాలాటివాళ్లం రాసినా, పాఠకులు వెంటనే ఇది నాకు అర్థం కాలేదు, అంటూ వ్యాఖ్యలు కురిపించేస్తారు. పైగా ఇంగ్లీషుమాటలవాడకం మరోబాధ. చాలామందికి అదే “కంఫర్టబుల్‌గా” వుంటుంది ☺. నేను మాత్రం తెలుగుకథ అంటే తెలుగు నుడికారం వెదజల్లేదే అనుకుంటాను. రచయితలు పాఠకులవ్యాఖ్యలని సీరియస్‌గా తీసుకోవాలంటే, మరి వారు కథని జాగ్రత్తగా చదివి తమఅభిప్రాయాలు రాయాలని రచయితలు ఆశించడంలో తప్పు లేదు కదా. ఏమంటావు?

కల్పన: ధ్వని, వక్రోక్తి ఇవి ఈనాటి కధల్లో వినిపించవు, కనిపించవు. ఆమాటకొస్తే అసలు అవి ఎలా వాడాలో కూడా నాలాంటి వర్ధమానరచయితలకి తెలియదు. మీకాలపు రచయితలు అలాంటివాటితో ఈనాటి కధలు రాయడం మా అదృష్టం అనుకుంటాను. మీకధా రచన, నైపుణ్యం, భాష మాకు కూడా కాస్త ఇలా ఒక చేత్తో ధారపోయవచ్చు కదా. కాస్త జాగ్రత్తగా కధ చదివి, ఆ పైన ఆలోచించి కామెంట్ పెట్టండి అని అంటే అర్ధం చేసుకునే సహృదయత ఈనాటి బ్లాగ్ పాఠకులకు వుందంటారా?

మాలతి: చేత్తో ధారపోయవచ్చు కదా – హాహా. మంచి జోకే. తాతకి దగ్గులు నేర్పడం అంటే ఇదే.
పాఠకులవ్యాఖ్యలవిషయం – అదే నేను కూడా అంటున్నది. పూర్తిగా కథ చదివి, ఆలోచించి రాసే వ్యాఖ్యలని రచయితలు తప్పకుండా గణనలోకి తీసుకుంటారు. “రచయితలు మెప్పు అయితేనే గ్రహిస్తారు కానీ తప్పులు చూపితే ఒప్పుకోరు” అన్నమాట నేను అంగీకరించను. వ్యాఖ్యలు కథలో వస్తువుకో, శైలికో సంబంధించినవి అయితే రచయితకి తనకథని మరోసారి తరిచి చూసుకోడానికి ఆవకాశం వుంటుంది. అంతే కానీ “ఇలాటిపాత్రలు వుండరు”, “ఇలాటి సంఘటనలు జరగవు,” “ఎవరూ ఇలా మాట్లాడరు” అంటే దానికి ఏముంది జవాబు చెప్పడానికి. రచయిత అలాటి పాత్రో, సంఘటనో చూసినందువల్లనే కదా రాసింది.

కల్పన:
ఒక కధ చదివాక, పట్టుమని ఎవరైనా పది నిమషాలైనా ఏమిటి ఇందులో చెప్పింది? చెప్పాలనుకుంది? అని ఎవరైనా ఆలోచిస్తారంటారా? వూరికే నాసందేహం అది. ఎందుకంటే నేను చదవగానే కామెంట్ పెట్టలేను. ఆలోచించాకా పెడదాము అనుకుంటాను. ఈలోగా మర్చిపోతాను కూడా చాలాసార్లు. అలా జరుగుతుందనే తొందర్లో అలా వెంటనే కామెంట్ పెట్టెస్తారేమో?

మాలతి:
అలా అనిపించడంలో తప్పులేదు. ఆలోచించి వ్యాఖ్యలు పెట్టేవారికోసం నేను ఎప్పుడూ ఎదురుచూస్తాను. లేకపోతే బాగుందనో, పరవాలేదనో సరిపెట్టేసినా ఫరవాలేదు. కానీ సగం సగం చదివి, వ్యాఖ్యలు రాసేస్తే ఏం చెయ్యడం? తప్పనిసరిగా నేను కథలో ఫలానా చోట చూడండి మీకు సమాధానం కనిపిస్తుంది అని చెప్పాలి. అసలు పాఠకులకి ఎందుకింత తొందర? ఇక్కడే బ్లాగులోకంలో పాఠకులధోరణి వేరుగా కనిపిస్తున్నది. రచయిత రాసింది అర్థం చేసుకుందాం అన్నతపన కంటే తమకి తెలిసింది చెప్పాలన్న తపన ఎక్కువేమో అనుకుంటున్నాను నేను. నాచిన్నతనంలో మేం రచయిత ఏం చెప్పేడు అన్న దృష్టితో చదివేవాళ్లం. కొత్తవిషయం తెలిస్తే ఓహో అలాగా అనుకునేవాళ్లం. లేకపోతే, సరే అని మరోకథకి తరలిపోయేవాళ్లం. ఈనాటి మీడియా సౌకర్యంవల్ల క్షణాలమీద ప్రశ్నలు గుప్పించేయడం జరుగుతోంది. రెండోది వస్తున్న కథలసంఖ్య కూడాను. వారానికి కొన్నివందలకథలు విడుదల అవుతుంటే, అందులో పదోవంతయినా చదివి ఆలోచించుకునే తీరికేదీ?

కల్పన:
కాబట్టి ఎక్కువ కధలు రావడం ఒకందుకు మంచిది, ఒకందుకు చెరుపు చేస్తోందన్న మాట.

మాలతిః అలాగే వుంది చూస్తుంటే. కనీసం పాఠకులకి ఆలోచించుకునే వ్యవధి లేకుండా చేస్తున్నాయి అనాలి. ఆదృష్టితో చూస్తే, నాకు మరొకసందేహం వస్తోంది. కథలకి సాంఘికప్రయోజనం వుండాలి అనుకుంటే, గబగబ క్షణాలమీద చదివి పక్కన పెట్టేస్తే మనం ఆశించిన సాంఘికప్రయోజం ఎలా సాధ్యం? పాఠకులు ఆలోచించుకోడం, విశ్లేషించుకోడం, తమ జీవితాలకి అన్వయించుకోడం – ఇవన్నీ టైము వుంటేనే కదా సాధ్యం.

అసలు ఎలాటి కథలు వస్తున్నాయి, ఏవి “మంచికథలు” అని ఎవరు నిర్ణయిస్తున్నారు అన్నవిషయం వివరంగా మరోసారి చర్చించాలి మనం..

(సశేషం)

You Might Also Like

9 Comments

  1. పొద్దు » తెలుగు వెబ్ పత్రిక - Poddu, Telugu Web Magazine » రమాదేవి మళ్ళీ రమ్మంది

    […] కథావిమర్శపై నిడదవోలు మాలతి, కల్పనా రెంటాల పుస్తకం.నెట్‍లో జరిపిన చర్చ మొదటి భాగం […]

  2. kalpana

    పూర్ణిమా,

    కధ, నవలలు చదవటం గురించి మీరన్నది నూటికి నూరుపాళ్ళు నిజం. మీలాగా కధలు అంత వోపికగా చదివి, అలోచించి, ఆస్వాదించే పాథకులు ఎంత ఎక్కువ మంది వుంటే తెలుగు సాహిత్యానికి అంత గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. మన జీవితాల్లో భాగమై పోయిన కధల్ని సృజించిన గొప్ప రచయతలకు మనమెప్పుడూ రుణపడి వుంటాము.

    కల్పన

  3. కొత్తపాళీ

    మాలతిగారూ, మీ రచనలు చదవడంలో నాకు కలిగే గొప్ప ఆనందానుభూతి భాష శైలి వల్ల. చక్కటి తెలుగు వాడుకలూ, పలుకుబళ్ళూ కనువిందు చేస్తాయి, కథా పాత్రలూ నచ్చినా నచ్చక పోయినా.
    కల్పనగారూ, కొన్నికొన్ని ఇతివృత్తాల గురించి రాసేముందు మనవాళ్ళేమనుకుంటారోనని సంకోచంతో రాయడానికి జంకడం నాకూ అనుభవమే.
    వ్యక్తులుగా, రచయితలుగా మీరిద్దరిపట్లా నాకు చాలా గౌరవముంది. అంచాత ఈ కింది నా అభిప్రాయాల్ని ఒక చిటికెడు ఉప్పుతో కలిపి స్వీకరించ ప్రార్ధన.
    ఈ చర్చలో ఈ భాగం చదవడానికి చాలా అస్పష్టంగా, తికమక పెట్టేలా ఉంది. కథకి రచనకి సంబంధించిన అనేక అంశాలగురించి సాధారణంగా తలెత్తే ప్రశ్నలకి సమాధానాలు దొరక్క పోగా, మరికాస్త అయోమయానికి గురి అయ్యాను.
    పాత కాలంలో అంటే ఏ కాలంలో కథ కేవలం సామాజిక ప్రయోజనం కోసం ఉంది? ఏ కాలంలో కథకులకి ఇప్పటికంటే ఎక్కువ స్వేఛ్ఛ ఉంది? పంచతంత్రపు విష్ణుశర్మ కాలంలోనా? హాలుడి గాథాసప్తశతి కాలంలోనా? గురజాడ కాలంలోనా? రచయిత్రులు పత్రికాసామ్రాజ్యాన్ని శాసించిన 70లలోనా? ఎప్పటి కథలు వ్యక్తిత్వవికాస పాఠాలుగా ఉండినాయి? ఇదంతా చాలా గందరగోళంగా ఉంది.
    అలాగే రచయిత తన కోసం రాయడమా, పాఠకుల కోసం రాయడమా అనే ప్రశ్న కూడా. అందరు రచయితలూ ఒకే కారణం కోసం రాయరు అనేది ఆయా రచనలు చూస్తేనే తెలుస్తుంది. ఒక రచయిత తన జీవిత కాలమంతా రచనలు చేస్తూండినట్లయితే తన అన్ని రచనలూ ఒకే కారణం వల్ల రాయక పోవచ్చు. నా మట్టుకు నేను రాసిన 15, 20 కథలూ పాఠకులు చదివి మెచ్చాలనే కోరికతోనే రాశాను. పాఠకులనే వాళ్ళు రచయిత దృష్టిలో లేకపోతే కథని ప్రచురించడం ఎందుకు? ఊరికే మన నోటుబుక్కులో రాసుకుని ఊరుకోవచ్చు. అసలామాటకొస్తే రాయడం కూడా ఎందుకు? మనలో మనం ఆలోచించుకుని మెదలకుండా ఊరుకోవచ్చు.

  4. మాలతి

    బొల్లోజుబాబా, మీరడిగిన ప్రశ్నకి నేను చెప్పగలజవాబుకంటే మంచి జవాబే సంపాదించేరు. సంతోషం. మీఅభిప్రాయానికి ధన్యవాదాలు.
    పూర్ణిమా, మీరే అన్నట్టు మీరు వేరే వ్యాసం రాయాలి. మంచి పాయింట్లు చెప్పేరు. ఇప్పటికయినా మించిపోయింది లేదు. ప్లీజ్, మీఅనుభవాలు వివరిస్తూ వేరేవ్యాసం రాయవలసిందిగా కోరుతున్నాం.

  5. బొల్లోజు బాబా

    ఇరువురికీ నమస్కారములు

    చర్చ బాగుంది. ఎన్నో విషయాలు తెలిసినయి.
    మాలతి గారికి
    అమ్మా
    ధ్వనీ వక్రోక్తి ల గురించి కొంచెం వివరించగలరని ప్రార్ధన.
    వినటమే కానీ కనీసం నిర్వచనాలు కూడా తెలియదు.

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    పి.ఎస్.
    ధ్వనీ వక్రోక్టి ల గురించి గూగిల్లితే, కృష్ణ శాస్త్రి గారి ఉపన్యాసమొకటి ఈ మాటవారి 2004 ఆర్చైవ్స్ లో దొరికింది. అదొక అద్బుతం. అందుకు సెపరేటు ధన్యవాదములు. 🙂

  6. Purnima

    నేను ఇక్కడ రాయడం మొదలెడితే ఓ పోస్టు అయ్యేలా ఉంది. కమ్మెంటడం కష్టం – టైమే కాదు, డబ్బా కూడా సరిపోదు! 😛

    కథలు చదవటం పై ఒక పాఠకురాలిగా నా అభిప్రాయం! (with all my limitations in understanding and comprehending literature.)

    ఓ మూడు – నాలుగొందులు పేజీలున్న నవలని అన్నే గంటల్లో పూర్తిచేయగలను కానీ.. ఒక కథా సంపుటి పూర్తి చేయటం నా వల్ల కాదు. నేను దాదాపు ఏడాది కాలంగా శ్రీపాద, ముళ్ళపూడి, మధురాంతకం రాజారాం కథా సంపుటాలు పూర్తిచేయలేకపోతున్నా. అవే నవలలు అయితే అయ్యిపోయేవి. దీనికి కారణం నవల్లో మూడొందల పేజీల్లో అంతా వివరంగా రాసుంటారు కాబట్టి, దాన్ని పూర్తిచేసి ఆలోచించుకోవచ్చు. అదే, కథ పది పేజీలే ఉన్నా (అంటే పూర్తి చేసే సమయం కేవలం అరగంటే అయినా) అది చూపించే ప్రభావం కూడా నవలకి తీసిపోదు అని నాకనిపిస్తోంది. ఆ ఆలోచనల్లో పడి కాసేపు అలా ఉండకపోతే ఆ కథ “మజా” రాదు. ఈ సంపుటాల్లో కథ వెనుక కథ చదివేయటం అంటే ఓ దూరప్రయాణం చేసి వచ్చీ రాగానే మళ్ళీ బయలుదేరటం. Taxing! 🙂

    ఇహ.. “ఆహా కథా.. ఓహా కథా.. ఏం కథా,ఎంత బావుందో” అని మురిసిపోవటం, “నాకు నచ్చలే, ఎంటసలు.. చీ, ఛా!” అని చెప్పటం కథను “గ్రేడ్” చేసినట్టు కాదని నా అభిప్రాయం. నా అనుభవం ప్రకారం అయితే ఓ కథ చదవగానే అది మెదడులో మన ప్రత్యేక ప్రయత్నాలేవీ లేకుండానే తిష్ట వేయాలి (అంటే మనల్ని కదిలించుండాలి ఏదో విధంగా), అలా స్థిరపడిపోయిన కథ జీవితానుభవాల్లో మనకి తెలీకుండానే తెరపైకి రావాలి, మనలో భాగం కావాలి. అదీ కథ అంటే! కథ వినటం వల్ల కానీ, చదవటం వల్ల కానీ నాకున్న అనభవం.

    అన్నట్టు, నాకు మంచి కథలు, చెడ్డ కథలూ అంటే తెలియదు. నేను కథలను రెండుగా విభజించగలను ౧) నాతో నిలిచిపోయినవి ౨) నేను మర్చిపోయినవి! 🙂

    రచయితలుగా మీకు ఫీడ్‍బాక్ అవసరమేమో.. కానీ మీ కథ నిజంగా కదిలించిన వైనాన్ని నాలాంటి సామాన్యులు చెప్పలేరు. మీలాంటి రచయితలే అయ్యుండాలి వారు కూడా! 😉

Leave a Reply