రంగనాయకమ్మగారి నవల – “జానకి విముక్తి” – పురుష పీడన నించి స్త్రీల విముక్తి

రాసిన వారు: మంజరి లక్ష్మి
****************
ఙ్ఞానం అభివృద్ధి చెందిన కొద్దీ, ఆత్మ గౌరవానికి కూడా విలువ ఇవ్వటం అనేది అర్ధం అవుతుంది.

ఈ మధ్యనే “నవ్య” వారపత్రికలో రంగనాయకమ్మ గారి, ‘కళ్ళు తెరిచిన సీత’ అనే సీరియల్ ప్రారంభమైంది. దానిలో హీరోయినైన సీత, పెళ్ళి విషయం వచ్చేటప్పటికి, ప్రతిదాన్లోనూ ఫ్యూడల్ ఆచారాలకు లొంగిపోతూ వుంటాన్ని చూపిస్తూ, రంగనాయకమ్మ గారు “పది సార్లు జానకి విముక్తి చదివిన సీత” ఇలా చేసిందీ, అలా చేసిందీ అంటూ వ్యంగ్యంగా సంబోధిస్తూ రాశారు. అది చూసి, ఎప్పుడో చదివిన “జానకి విముక్తి” పుస్తకాన్ని, ఇప్పుడు మళ్ళా చదివాను. ఎప్పుడు చదివినా, ఈ పుస్తకంలో, ఏదొ ఒక కోణంలో, మనం నేర్చుకోవలసిందీ, తెలుసుకోవలసిందీ వుంటూనే వుంటుంది.

రంగనాయకమ్మగారు “జానకి విముక్తి”ని, తన భావాలన్నిటినీ అత్యుత్తమ స్థాయిలో రంగరించి, తన నవలన్నిటిలోకీ మిన్నగా, తీర్చి దిద్దారని నా అభిప్రాయం. ఈ నవల, మొత్తం మొదట మూడు భాగాలుగా వచ్చింది. మొదటి భాగం 1977 లో, రొండవ భాగం 1980 లో, మూడవ భాగం 1981 లో వచ్చాయి. 2005 లో ఈ మూడు భాగాలూ కలిపి, ఒకే పుస్తకంగా ప్రచురించారు.

అమాయకురాలైన జానకి, మూర్ఖుడైన తన భర్త వెంకట్రావు చేతిలో తిట్లూ, తన్నులూ తింటూ ఉంటుంది. అది చూసి, వాళ్ళ అన్న సత్యం ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళి పోతే, మళ్ళా ఆమె భర్త వెంకట్రావు వచ్చి ఏవో మాయమాటలు చెప్పి వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. దాంతో సత్యానికి కోపం వచ్చి, తన స్నేహితుడైన మూర్తికి ఉత్తరం రాస్తే, దానికి సమాధానంగా మూర్తి రాసే ఉత్తరం ఈ నవలలో హైలెట్. స్వతంత్ర ఆలోచన, ఎదిరించే చైతన్యం వాళ్ళలో కలిగించకుండా, మన భావాలను వాళ్ళ మీద రుద్దితే అది సరైన ఫలితాన్ని ఇవ్వదనీ, జానక్కి పరిస్థితుల్ని ఎదిరించే చైతన్యాన్ని కలిగిస్తూ, తనకు అండగా నిలబడటమే మన పని అనీ ఎంతో గొప్పగా చెపుతాడు. జానకి చిన్న, చిన్నగా తన చైతన్య స్థాయిని పెంచుకుంటూ, ఆ నికృష్టుడైన భర్త కబంధహస్తాల్లోంచి బయట పడి, స్వతంత్రంగా ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ళ మీద తను నిలబడి, పిల్లవాణ్ణి తనే పెంచుకుంటూ, తన భావాలను అభివృద్ధి చేసుకుంటూ, అటువంటి భావాలు కల వ్యక్తినే మరల ఎన్నుకుంటుంది. ఆమె తన చైతన్యాన్ని మెల్ల మెల్లగా ఎలా పెంచుకుంటూ వచ్చినదీ, ఆమె అన్న సత్యం దానికి ఎలా దోహద పడిందీ, ఈ నవలలో రంగనాయకమ్మగారు చాలా చక్కగా రాశారు.

మాకు తెలిసున్న వాళ్ళ కుటుంబంలో కూడా ఒక ‘వెంకట్రావ్’ ఉన్నాడు. మా బంధువు లావిడ మొగుడు. వాళ్ళిద్దరూ ఒకే ఆఫీసులో పని చేస్తూ, ప్రేమించి(?), పెళ్ళి చేసుకున్నారు. మగ పెళ్ళి వాళ్ళు తిరుపతిలో పెళ్ళి చేయించమంటే, అలాగే చేయించి, వాళ్ళ ఊళ్ళో విడిదిలో ‘సత్యన్నారాయణ వ్రతం’ చేసుకున్నారు. దాని చివర బహుమతులు చదివించేటప్పుడు, పెళ్ళికొడుకు బంధువు లెవరో ఆవిడను, “ఏం చదువుకున్నావమ్మాయీ?” అని అడిగారు. ఆవిడ, “ఎం.ఏ.” అని చెప్పింది.
దాన్తో వాడు కాస్తా అలిగి, ఎంతమంది బతిమిలాడినా వినక, ఆవిడ అడిగితే, “నీకు పొగరు. నా కన్నా ఎక్కువ చదువుకున్నానని అహంభావం. నాకన్నా నువ్వు ఎక్కువ చదువుకున్నావనీ, నన్ను నలుగురిలో చులకన చెయ్యాలనీ, అలా చెప్పావూ?” అని తిట్టి తిట్టి పోశాడు. దానికి ఆవిడ, “అడిగారు కాబట్టి చెప్పాను. వాళ్ళడిగితే నిజం చెప్పకుండా ఎట్లా ఉంటానూ?” అని ఒకటే గోల. చివరకి, పెద్దదయిన వాళ్ళ నాయనమ్మ వెళ్ళి, క్షమాపణ అడిగితే, ‘మూడు నిద్రలకు’ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.

ఆ చివరి రోజు, నేను, నా స్నేహితులెవరికో వాళ్ళని పరిచయం చేస్తూ, వాళ్ళడిగితే, ” ఆయన ఫలానా చోట ‘ఎల్.డీ.సీ’ గా పనిచేస్తాడూ, ఆవిడ అక్కడే ‘యూ.డీ.సీ.’ గా పనిచేస్తుందీ” అని చెప్పాను.
అంతే! ఆ రోజు వాళ్ళ ఇంట్లో శివరాత్రే. మళ్ళా వాళ్ళ నాయనమ్మే ఎట్లాగో సర్ది చెప్పింది.

“జానకి విముక్తి” చదివిన తరువాత, మా ఇంట్లో మేము మా వాళ్ళతో పోరాడి, ఆ మూడు రోజులూ ‘వాకిట ఉండే’ కార్యక్రమాన్ని తీసేయించాము. మా బంధువు లింట్లోనూ అదే పరిస్థితి. మా బంధువు లావిడ అత్తారింటికి వెళ్ళేటప్పటికి, వాళ్ళత్త గారికి ‘మడి’ కాబట్టి, తమ ఇంట్లో ఉండటానికి వీల్లేదన్నారు. మొగుడు కూడా దానికే వత్తాసు పలికాడు. మా బంధువు లావిడ అత్తగారి కోసం, వాళ్ళ ఇంట్లో అలవాటు లేకపోయినా, పొద్దున్నే లేచి ‘మడి’తో వంట చేసి పెట్టి, ఆఫీసుకు వెళ్ళేది. ఆ మూడు రోజులూ మాత్రం, ఆవిడను, వాళ్ళ ఇంటికి పంపించేసే వాళ్ళు. మిగతా రోజుల్లో “రోగమని” చెప్పి వంట చెయ్యని మా బంధువు లావిడ అత్తగారు, ఆ మూడు రోజులూ మాత్రం ‘మడి’తో వంట చేసుకుని, తన కొడుకూ, తనూ, సుబ్బరంగా మింగి, కూచునే వాళ్ళు.

మా బంధువు లావిడ భర్తకి పదిహేను రోజులకో, నెల రోజులకో ఒక సారి పూనకం వస్తూ వుండేది. ఇంక పొద్దున్నే, నిద్ర మంచం మీద మొదలెట్టేవాడు స్త్రోత్రం. “పెళ్ళినాడు ఆడ పెళ్ళి వాళ్ళు వాళ్ళకి తిరుపతిలో సరయిన ఎకామడేషన్ చూపించలేద”నీ, “భోజనాలు ఆలస్యంగా పెట్టించార”నీ, “అవి ఛండాలంగా ఉన్నాయ”నీ, “వాళ్ళ అప్ప చెల్లెళ్ళకి మర్యాదలు సరిగా జరపలేద”నీ, “కట్నాలు నాసిరకంవి ఇచ్చార”నీ, తిట్టేవాడు. అప్పటికీ, అంతకుముందే, వాళ్ళ నాయనమ్మ, “మా వూళ్ళో చేసుకుంటే అన్నీ సవ్యంగా జరిపించే వాళ్ళం నాయనా! మీరే తిరుపతిలో చెయ్యాలన్నారు. పరాయి చోట మేము మాత్రం ఏం చేస్తాం?” అని చాలా సార్లు చెప్పింది.

“మా బంధువు లావిడకు ‘తను ఎక్కువ చదువుకున్నా’ ననీ, ‘ఉద్యోగంలో తనకన్నా ఎక్కువ గ్రేడ్లో ఉంద’నీ, గర్వం, పొగరూ అనీ, ‘ఆ రోజు అది చెయ్యలేదు, ఈ రోజు ఇది చెయ్యలేదూ'” అంటూ దండకం రాత్రి పడుకునే వరకూ నడిచేది. కొన్నాళ్ళకు ఆవిడ డిపార్ట్మెంట్లోనే వాణ్ణి కూడా వేశారు. ఇకంతే! మూడు నెలలు సెలవు పెట్టి, ఆవిడ నగలు తనఖా పెట్టి, తన చేత లోన్లు పెట్టించి, మొత్తం డబ్బులు తీసుకొని, హైదరాబాద్ వెళ్ళి, ‘యూ.డీ.సీ.’ పోస్టు తెచ్చు ‘కొన్నాడు’. ఆ తరవాత, కొన్నాళ్ళు, కొంత ప్రశాంతంగా నడిచింది ఆ కాపురం. ఈ లోపల ఆవిడ ప్రమోషన్ మీద ‘సూపరిండెంటు’ అయింది. ఇంకేముంది? మళ్ళా నిత్య నరకం. మాక్కూడా వాళ్ళతో తగాదా అయి, మేం వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళింటికి వెళ్ళటం మానేశాం.

ఈ మధ్యనే ఆవిడ రిటైర్ అయితే, వీడ్కోలు పార్టీ ఇస్తే, దానికి మేం కూడా వెళ్ళాం. ఆ సభలో ఆవిడ కొలీగ్స్, ఉద్యోగం పట్ల ఆవిడ చూపించిన సిన్సియారిటీని మెచ్చుకొంటూ, ఆవిడని కూడా మాట్లాడమన్నారు. అప్పుడు ఆవిడ “నేను ఉద్యొగంలో, ఇంత అభివృద్ధి లోకి రావటానికీ, నేను నా ఉద్యోగాన్ని ఇంత బాధ్యతాయుతంగా నిర్వర్తించటానికీ నా భర్తే కారణం. ఆయన ఇచ్చిన తోడ్పాటూ, ప్రోత్సాహం తోనే నేను నా బాధ్యతల్ని ఇంత సక్రమంగా నిర్వర్తించగలిగాను. ఈ విషయంలో ఆయనకు నా జీవితాంతం రుణపడి ఉంటాను” అని చెప్పింది.

ఈ పుస్తకం ఎలాంటి మనుషులతో జీవించ కూడదో మాత్రమే కాదు, ఎటువంటి మనుషులతో జీవించాలో కూడా చెబుతుంది. ఇందులో సత్యం, శాంతల మధ్య పరిచయం, స్నేహం, ప్రేమా, సహ జీవనం చాలా స్పష్టంగా వివరించారు. స్త్రీ, పురుషుల మధ్య ఎటువంటి సంబంధాలు వైరుధ్యాల కతీతంగా వుంటాయో కూడా ఈ పుస్తకం చెబుతుంది.

బఫే భోజనాలంటి వర్ణనలు చాలా నవ్వు పుట్టిస్తాయి. వెంకట్రావు గురించి చదువుతూ వుంటే, మనకి కూడా వాణ్ణి పట్టుకుని చితక బాదాలని అనిపిస్తుంది. అయినా, జానకి వాణ్ణి వదిలెయ్యడమే వాడికి తీరని శిక్ష లెండి. ఇంటా, బయటా సమానంగా పని చేయని భార్యాభర్తల మధ్య సమానత్వం కుదరదని ఈ కధ స్పష్టంగా చెబుతుంది. మంచి భర్త/భార్య దొరికితే జీవితం మంచి గానూ, చెడ్డ భర్త/భార్య దొరికితే జీవితం చెడ్డ గానూ వుండటం లాగా కాకుండా, ప్రతీ స్త్రీ/పురుషుడూ తనకి సరైన స్త్రీని/పురుషుణ్ణి తానే ఎన్నుకోవాలి అని ఈ పుస్తకం నేర్పిస్తుంది.

“జానకి విముక్తి” వచ్చిన కొత్తల్లో, మా ఇంటికి ఎదురుంగా ఒక కుటుంబం అద్దెకు వచ్చారు. ఆ ఇంట్లో నా ఈడమ్మాయే ఉండేది. ఆ అమ్మాయి పేరు పార్వతి. ఆ అమ్మాయికి రంగనాయకమ్మగారి పుస్తకాలంటే ప్రాణం. నాకూ అంతే కాబట్టి, ఆమెతో బాగా స్నేహం కుదిరింది. వాళ్ళింట్లో రంగనాయకమ్మగారి అన్ని పుస్తకాలతో పాటు, ఆవిడ సంపాదకీయంలో వచ్చిన “ప్రజాసాహితి” పుస్తకాలు కూడా ఉండేవి. ఆ అమ్మాయి చెవుల దుద్దులు మాత్రం ఉంచుకుని, మిగిలిన నగలేవీ పెట్టు కోకుండా తిరిగేది. ‘అందం’ కోసమని చెప్పి, చిన్న బొట్టు కూడా ఉంచుకునేది. ఉండటానికి, కావలసినంత నాస్తికత్వం వుంది ఆ అమ్మాయి దగ్గర.

నేను కుతూహలంతో, “ఎందుకలా ఏ నగలూ పెట్టుకోకుండా ఉంటారు? బంగారంవి లేకపోతే రోల్డుగోల్డువైనా, పెట్టు కోవచ్చు కదా?” అని, ఆ అమ్మాయి అభిప్రాయం తెలుసు కోవాలని అడిగాను. దానికి పార్వతి, “రంగనాయకమ్మగారు స్వీట్ హోమ్ లోనూ, ముఖ్యంగా జానకి విముక్తి లోనూ ‘నగలనేవి బానిసకాలం నాటి చిహ్నాలని, అవి పెట్టుకోవటం ఆడవాళ్ళకు అవమానమని’ చెప్పారు. అది చదివి నప్పటి నించీ నగలు తీసెయ్యాలని అనిపించింది” అని చెప్పింది.

“మరి దిద్దులు మాత్రం వుంచుకున్నారెందుకూ? బొట్టు సంగతేమిటీ?” అని అడుగుదామనుకున్నాను గానీ, ఆ అమ్మయిలో చూసిన ఆ కాస్త చైతన్యానికే ముచ్చటేసి, ఆ అమ్మాయిని చిన్నబుచ్చ కూడదని, వూరుకున్నాను. తర్వాత కాలంలో ఆ అమ్మాయికి ఒకబ్బాయితో పరిచయం అయింది. ఆ పరిచయం ఒక చిన్న సైజు ప్రేమ లోకి దారి తీసింది.

ఆ అబ్బాయి, “చేతికి గాజులందమూ, ముక్కుకు పుడక లందమూ” అని సినిమా పాట పాడేటప్పటికీ, ఆ ప్రేమకి మురిసి పోయి, పారేసిన గాజులూ, ముక్కు పుడకా తెచ్చుకుంది.

ఆ తర్వాత నెమ్మదిగా మెడలో గొలుసూ, వేలికి వుంగరమూ తిరిగి వచ్చాయి. ఆ అబ్బాయి వడ్డాణం కోసం కూడా ప్రయత్నించాడు గానీ, మరీ నాటుగా వుంటుందని పార్వతి ఒప్పుకోలేదు. నీరసంగా వూరుకున్నాడు.

ఆ తర్వాత అమ్మ కోసం పీటల మీద పెళ్ళీ, నలుగురిలో గొప్ప కోసం కట్నమూ కావాలని కోరాడు. ఇంకా చాలా సినిమా పాటలు పాడాడు. ఒంటి మీద నగలన్నీ అతని ఆస్తి కోసం అని అప్పుడు అర్థం అయింది. అప్పటికి కళ్ళు తెరుచుకున్న పార్వతి, ముందరగా వాణ్ణి వదిలేసింది. విప్పారిన కళ్ళతో, జానకి విముక్తి మళ్ళీ చదవడం మొదలు పెట్టింది.

ప్రజాసాహితిలో రంగనాయకమ్మ గారి “ప్రశ్నలూ‌-జవాబులూ” శీర్షికకి, ఎవరో ఒక అమ్మాయి, “నగలు తీసెయ్యాలనే ఉంది కానీ, అలా ఒక్కసారే తీసెయ్యటం చేతకావటం లేదు, ఎలాగా?” అని ఉత్తరం రాస్తే, అప్పుడు రంగనాయకమ్మగారు, “ఒక సారి తీసి, ఒక సారి పెట్టు కుంటూ, కొన్నాళ్ళు తీసి, కొన్నాళ్ళు పెట్టుకుంటూ, ఒక్కక్కటే తీసేస్తూ అలవాటు చేసుకోమని” జవాబు చెప్పారు.

కళ్ళు తెరుచుకున్న వాళ్ళు అలాగే వుండిపోరు కదా? పార్వతి కొన్నాళ్ళు సాధన చేసి అన్నీ, దిద్దులతో సహా, బొట్టుతో సహా, తీసేశానని చెప్పింది. “రంగనాయకమ్మ గారు చెప్పిందాన్ని, అలా తూ.చా. తప్పకుండా పాటించే వాళ్ళున్నారా?” అని నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

ఇది తప్పక చదివి తీర వలసిన పుస్తకం.

పుస్తకాలకు:

అరుణా పబ్లిషింగ్‌ హౌస్‌,
ఏలూరు రోడ్డు,
విజయవాడ – 520 002
(ఫోన్‌: 0866 – 2431181)

503 Service Unavailable

Service Unavailable

The server is temporarily unable to service your request due to maintenance downtime or capacity problems. Please try again later.

Additionally, a 503 Service Unavailable error was encountered while trying to use an ErrorDocument to handle the request.