జైత్ర కవిత్వంలో ఆలోచనల అలజడి
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
********
తొంభైల చివర. హిమాయత్ నగర్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ ఆవరణ. జయధీర్ ఆధ్వర్యంలో ‘జానపద’ సంస్థ తరపున నకాషీ బొమ్మలతో మందెచ్చుల కథా ప్రదర్శన. కళాకారుల కాలిగజ్జెల అడుగుల సవ్వడిలో నా గుండె లయ లీనమైంది. కాటమరాజు కథ నడుస్తోంది. తెల్లటి కుర్తా మీద ఎర్ర రంగు నడికట్టు బిగించి తల మీద మరో రంగు రుమాలు ధరించి పొందికగా చిందేస్తున్న కళాకారుడు నన్ను అమితంగా ఆకర్షించాడు. తీరా తేరిపారా చూస్తే అది కళాకారుడు కాదు. కళాకారిణి. మేం ముద్దుగా పాసీ అని పిలుచుకునే శివానీ. నాకు కొండంత ఆశ్చర్యం. కళ్ళ ముందు తిరిగే పిల్ల వృత్తి కళాకారులతో దీటుగా అడుగెయ్యడం యెప్పుడు నేర్చుకుందా అని. ఆమె కళా నైపుణ్యం చూసిన నాకెందుకో ఆనందంతో కళ్ళు చెమర్చాయి. నాలో పరిశోధకుడు మరణించి కేవలం కళాస్వాదకుడు మాత్రమే జీవించిన క్షణం అది. మళ్ళీ మరో పాతికేళ్ల తర్వాత పాసీ బిడ్డ జైత్ర కవితలు చూస్తుంటే అదే రకమైన అనుభూతితో కళ్లలో నీళ్ళూరాయి. కవితల్ని అరచేత ఫోన్ లో పట్టుకున్నప్పుడు చిన్నారి జైత్రని వొళ్ళోకి తీసుకున్నట్టే వుంది. మూడో తరంతో యేర్పడ్డ అనిర్వచనీయ బంధమిది. ఈ అనుబంధంలో కంచెల్లేవు కాలావధుల్లేవు. కపటాల్లేవు కుతంత్రాల్లేవు. కల్మషాల్లేవు కార్పణ్యాల్లేవు. స్వచ్ఛమైన పసితనపు అమాయకత మాత్రమే వుంది. తన తొలి కవితలకు నాలుగు మాటలు రాయమని జైత్ర నన్నడగడానిగ్గానీ నేనీ మాటలు మీతో పంచుకోడానిగ్గానీ కారణం అదే.
ఇక్కడి నుంచి నేను చిన్నారి జైత్రని కవి జైత్రగా సంబోధిస్తాను.
కయిగట్టడం జైత్రకి కూసు విద్య. గాయపడ్డ సీతాకోకచిలుక ఆమెలోని కవిని తట్టిలేపింది. దాని బాధ చుట్టూ మాటలు అల్లింది. బాల మౌఖిక కవి వూపిరిపోసుకున్న క్షణాలవి. శోకం కదిలించిన గుండె నుంచే కదా అప్పుడైనా యిప్పుడైనా ఆదికావ్యం పుట్టింది! శోకమే శ్లోకమైంది.
ప్రకృతిని ప్రేమించే జైత్ర మనిషిని ప్రకృతిలో భాగంగా చూడటం నేర్చుకుంది. ఆమె చూపు నిశితమైనది. అది కేవలం చూడటం కాదు. సూక్ష్మ పరిశీలన. కళాకారిణికి అవసరమైన తొలి పరికరం. ఆ పరికరాన్ని వుపయోగించుకొని ప్రకృతి నుంచే రంగుల్ని పోగేసుకుని అన్ని రంగులూ తనే అయి వాటి వెనుక వున్న భావాల్నీ వుద్వేగాల్నీ ప్రతీకలుగా గుండె గోడలపైన ముద్రించుకుంటుంది. ఆ తర్వాత కాన్వాస్ పైన చిత్రించుకుంటుంది లేదా తనదైన భాషలోకి వొంపుకుంటుంది. కొందరికి అనుభవాలు కేవలం అనుభవాలుగానే మిగిలిపోతాయి. జైత్ర లాంటి కవి నోట అవి సృజనాత్మకంగా వ్యక్తమౌతాయి. అప్పుడది అందమైన చిత్రం కావొచ్చు గాఢమైన కవిత కావొచ్చు. ఈ విద్యని జైత్ర సాధన చేసింది. పెరిగి పెద్దవుతూ భావాలకు రంగులుంటాయని గ్రహించింది. భాషకు హంగులుంటాయని తెలుసుకుంది. రంగులకూ అక్షరాలకూ మధ్య వారధి కట్టింది. నోటి కవి నుంచి రాత కవిగా మారే క్రమంలో పదాలకు పదును పెట్టింది. వాక్యాలకు సానపట్టింది. పద వాక్య ప్రయోగాల్లో అర్థాల లోతుల్ని తెలుసుకోడానికి ప్రయత్నించింది. మాటతోపాటు రాత నైపుణ్యాల్ని పెంచుకొంది. అమ్మమ్మ తాతయ్యల ఆలనాపాలనా లాలనల్లో వాటిని మెరుగుపరుచుకుంది. ఆద్య కళని వెతుకుతూ తాత వెంట దేశాలు తిరిగింది. మనుషుల్ని చదివింది. సమాజంలో తేడాల్ని అర్థం చేసుకుంది. చెడుని ద్వేషించింది. మంచిని ప్రేమించింది. కవి కావడానికి అసలైన అర్హత సాధించింది.
జైత్ర అంతరంగంలో మత్తడి దుంకే ఆలోచనలున్నై. ఆ ఆలోచనల వెనక అలజడి వుంది. కవిత్వాభివ్యక్తిలో కొత్తదనం వుంది. పరీక్షలైన తర్వాత తన మానసిక స్థితిని వర్ణించిన పద్యం చూడండి. పంజరం నుంచి విడుదలై స్వేచ్ఛ పొంది గూడు దొరకని పక్షిలా వుందట! రాతి పలకల మీద వులితో చెక్కినా, తాళపత్రాలపై ఘంటంతో లిఖించినా, కాగితంపై కలంతో రాసినా .. రూపమేదైనా ‘ప్రశ్నించడానికి పిడికిలి బిగించిన ధైర్యం పుస్తకం’ అన్నప్పుడు, ప్రశ్నని ప్రశ్నగా మార్చేది పిల్లలు అని పిల్లల సహజ స్వభావాన్ని నిర్వచించినప్పుడు, ఆరోగ్యప్రదాతలైన వైద్యుల్ని రోగాల సరోవరంలో పూచిన తామరపూలతో పోల్చినప్పుడు, ‘తల్లినిచ్చిన తల్లి’ అమ్మమ్మ మనవరాలితో ఆడుకుంటూ ఆడుకుంటూ చివరికి తానే ఆటబొమ్మయ్యింది అని చమత్కరించినప్పుడు, ‘ప్రవహించే నీటికి విశ్రాంతినిచ్చే కూడలి చెరువు’ అని బొమ్మ కట్టినప్పుడు బాల కవి స్థాయిని అధిగమించి యువ కవిగా పరిణతిచెందుతున్నట్టు నాకు అనిపించింది .
ఈ కవిత్వంలో జైత్ర ‘రంగులు మారుస్తూ రక్తపాత రాజకీయాలు చేస్తూ’ పాలించేవాడే విషం చిమ్మడం చూసి విస్తుపోయింది. ఆడపిల్లలు స్వయంగా పెంచి పోషించుకునే ప్రేమ ముడులే కలలకు వురితాళ్లుగా మారుతున్నందుకు బెంగపడింది. అడవి వొడిలో జీవించే ప్రకృతి ప్రియులైన ఆదివాసీలను మానవత్వానికి మారుపేరుగా సంభావించి ఆలింగనం చేసుకుంది. ఆడపిల్లగా తన అస్తిత్వాన్ని గర్వంగా ప్రకటించుకుంది.
కవిగా జైత్ర తన తరం తరపున భూమితో మాట్లాడుతోంది. గాలితో వూసులాడుతోంది. జైత్రకి పరిమళాలు మోసుకొచ్చే పూల బాసలు తెలుసు. ‘ఆకాశానికి ముత్య’మైన చందమామ పంచే వెన్నెల చల్లదనం తెలుసు. పసితనం కాపాడుకోవడం వల్ల మంచి గంధం లాంటి మనసున్న మనుషుల్ని గుర్తుపట్టగలదు. వారిని తన కవితా హస్తాలతో మానవీయంగా హత్తుకోగలదు. మనిషి మనసు మెదడుల మధ్య తేడాను కనిపెట్టగలదు. ఆ క్రమంలోనే తొలుత ప్రాకృతిక అంశాలని వర్ణించింది. తర్వాత వ్యక్తులతో (అమ్మమ్మ, తాతయ్య, మనోజ, కమలమ్మ) ఆత్మీయ బంధాలను వ్యాఖ్యానించింది. అమ్మ ప్రేమలోని కమ్మదనం గురించి, జ్ఞానదీపాలైన అధ్యాపకుల గురించి సాధారణీకరించి కవిత్వం కట్టింది. కుక్కపిల్ల మీద సైతం శ్రీశ్రీ రాయని పద్యాలు రాసింది. అక్కడి నుంచి వ్యవస్థలోని అసమానతలని ప్రశ్నించడం వరకూ పర్యావరణ పరిరక్షణాకాంక్ష వరకూ కుట్టి కవి జైత్ర చేసిన ప్రయాణం చిన్నదేం కాదు. ప్రపంచమొక పద్మవ్యూహం అని తెలిసీ లోనికి అడుగు వేసింది.
తాను నడయాడే పరిసరాల్లోని అనేక వస్తువులు – అవి ప్రతినిత్యం వుపయోగించే కుండ అద్దం టీ కప్పు కాలిపట్టీలు కావొచ్చు, అరుదుగా వాడే హారతి పళ్ళెం పాతాళ గరిగ కావొచ్చు జైత్రకి కవితా వస్తువులవుతాయి. తమ లోతు కనుక్కోమని డిమాండ్ చేస్తాయి. తాతయ్య కనుల నుంచి జైత్ర బయటి ప్రపంచాన్ని చూసింది. అమ్మమ్మ ద్వారా లోపలి ప్రపంచాన్ని అర్థం చేసుకుంది. కానీ బయటి లోపలి ప్రపంచాల్లో యెన్నో వైరుధ్యాలున్నాయి. వాటి మధ్య ఘర్షణ వుంది. అందునుంచి నేర్చుకునే కొత్త అనుభవ పాఠాలు యెదుగుతున్న జైత్రకి కవితా సామగ్రి కావాలి. అనుభవపాఠాలతోపాటు అధ్యయనంద్వారా సమకాలీన స్పృహతో కొత్త పరికరాలు సమకూర్చుకోవాలి. ఆమె యిప్పుడు న్యాయాన్యాయాల గురించి వాటి మధ్య గీతల గురించి అధ్యయనం చేసి పీడితుల వైపు నిలబడే నిబద్ధ న్యాయవాదిగా న్యాయం పక్షంలో పనిచేయాలని నిశ్చయించుకుంది. ఆమె చదివే లా పుస్తకాల్లో కనిపించని ‘కవితా న్యాయం’ వొకటి వుంటుందని గ్రహించి దాని గెలుపు కోసం కృషి చేయాలని నా ఆశంస.
ఇది కవిగా చిన్నారి జైత్ర తొలి సంతకం. రాబోయే రోజుల్లో యీ ఆలోచనల్లో మరింత పరిణతి, గుణాత్మకమైన మార్పు రావాలనీ ప్రకృతినీ మనిషినీ ప్రేమించే తన మౌలిక స్వభావాన్ని జీవితాంతం కాపాడుకోవాలనీ కోరుతూ..
ఆశీస్సులు అభినందనలు ప్రేమలు జేజేలు..
ఎ. కె. ప్రభాకర్
30-06-2026


Leave a Reply