తెలంగాణ ఒక  సజీవ స్రవంతి

వ్యాసకర్త: తోకల రాజేశం

*******

 “నా దేశంలో కవులు తటస్థులు కారు, రాజకీయాలకు దూరంగా ఉండలేరు. రచనా వ్యాసంగం నా ఊపిరి, నేను శ్వాసించకుండా ఉండలేను, రాయకుండా బతకలేను”అంటాడు స్పానిష్ కవి పాబ్లో నెరూడా.బహుశా! తెలంగాణ నేలలో పుట్టిన కవి తెలంగాణా ఉద్యమం కొనసాగతున్నపుడు సరిగ్గా ఇవే మాటలు అనుకొని ఉంటాడు. తెలంగాణ ఏర్పాటు రిత్యా రాజకీయాల పరిధిలోనిదే అయినా సాంస్కృతికంగా తెలంగాణ-ప్రజల గుండె చప్పుడుగా మారిపోయింది. ఒకప్పుడు జాతీయోద్యమంలో కులమతాలకతీతంగా ప్రజలంతా ఏకమై ముందు నడిచిన విధంగానే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా ఉప సమూహాన్నీ కలిసి నడిచాయి. నిజంగా అదొక అపురూపమైన చారిత్రక సన్నివేశం. మలిదశ తెలంగాణ ఉద్యమానికి గల ప్రత్యేకతలలో ఇది ప్రాముఖ్యతతో కూడుకున్నది. తెలంగాణా సిద్దించిన తరువాత ఆ స్ఫూర్తి అట్లాగే నిలబడిందా లేదా దానికి కారణాలేమిటి అన్నది వేరే చర్చ. కానీ తెలంగాణ అనే ఒక్క విషయం ప్రజలందరినీ ఏకం చేసిన తీరు ఆధునిక పోరాటాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అధ్యాయాన్ని లిఖించింది. ఈ చరిత్రలో మామూలు ప్రజల దగ్గరి నుంచి కవులు, కళాకారులు కూడా భాగమయ్యారు.అప్పటికే కవులైన వారు తెలంగాణ నేపథ్యంలో బలమైన కవిత్వాన్ని రాసారు. వారితో పాటు ఎప్పుడూ కలం పట్టని ఎంతోమంది తెలంగాణ సాధనోద్యమం ఇచ్చిన ఉద్రేకంతో కవిత్వం రాసారు. తెలంగాణ ఉద్యమంలో ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక రూపంలో పాలుపంచుకోని మనుషులున్నారా? అనే ప్రశ్న తలెత్తే విధంగా జనసముద్రమై సాగింది ఉద్యమం.ఈ మహోద్యమంలో భాగంగా ప్రజలను చైతన్యం చేస్తూ ఇంతకుముందే చెప్పినట్టు చాలామంది కవులు ప్రభావశీలమైన కవిత్వం రాసారు. వారి కవిత్వం వివిధ మాధ్యమాల నిర్వర్తించవల్సిన బాధ్యత నిర్వర్తించింది. ఈ క్రమంలో వచ్చిన తెలంగాణ కవిత్వాన్ని కొందరు వ్యక్తిగత సంకలనాలుగా ముద్రించుకున్నారు.కొందరు సామూహిక సంకలనాలు వేశారు.అట్లా వచ్చిన సంకలనమే ఈ “తెలంగాణ గొంతుకలు”. ఇది వెలువడటానికి ప్రధాన కారకులు బోనగిరి రాజారెడ్డి. ఆయనే దీని ప్రధాన సంపాదకులు.

బోనగిరి వారి తత్వం ఆయనతో పరిచయం ఉన్న వాళ్లందరికీ తెలిసిందే.ఆయన ఒక పనిని సంకల్పించాడంటే దానిని పరిపూర్తి చేసేవరకు నిద్రపోరు. మంచిర్యాల వేదికగా ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పేరెన్నిక గన్న రంగస్థల కళాకారుడాయన. కవిత్వంలో కూడా కాళోజీ లాగా తానేది అనుకుంటున్నాడో దానిని కుండబద్దలు కొట్టినట్లు చెప్పగల అనుభవజ్ఞుడు. సాహిత్య కళా రంగాల ద్వారా సామాజిక ప్రయోజనంలాంటిదేదో సాధించవచ్చుననే దృఢ నిశ్చయం కలిగినవారు రాజారెడ్డి. అందుకే వ్యయానికి,ప్రయాసకు భయపడకుండా “తెలంగాణా గొంతుకలు” తెచ్చారు. తెలంగాణా మలిదశ ఉద్యమం మహోధృతంగా సాగుతున్న 2010 జనవరిలో వచ్చింది ఈ సంకలనం. “మీ రక్తంతో త్యాగాలు ఫలించగా, మీ ఆశయాలు సిద్ధించగా, ప్రత్యేక తెలంగాణ మీ అమరత్వం సాక్షిగా సాక్షాత్కరించాలి” అంటూ 1969 నుంచి 2010 వరకు తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు అంకితమైంది ఈ సంకలనం. ఈ సంకలనంలో అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవులతో బాటు, గోదావరిఖని కవులు కూడా పాలు పంచుకున్నారు. 40 మంది కవుల గొంతులను వినిపించిన ఈ సంకలనం ఆనాటి ఉద్యమ వ్యాప్తికి ఎంతో కొంత తోడ్పడింది.ఈ రకంగా తెలంగాణ ఉద్యమ కవిత్వంలో “తెలంగాణ గొంతుకలు” ఒక విడదీయరాని భాగమైపోయింది.ప్రచారం కొరవడటం వల్ల ఇలాంటి ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించకుండా పోయింది కానీ ఆ ప్రయత్నం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది.

ఉద్యమావసరాల కోసం రాసే సాహిత్యం నిజానికి ఉద్యమం ఫలవంతం కావటంతో తెరమరుగుకు వెళ్ళిపోతుంది. కానీ చారిత్రకంగా దాని స్థానం పదిలంగానే ఉంటుంది. ఉద్యమాన్ని ఆనాటి కవులు ఎట్లా అర్థం చేసుకొని, ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని భావించారో ముందుతరాలకు తెలుస్తుంది. చాలా సున్నితంగా వ్యవహరించే కవులు ఉద్యమ సందర్భంగా ఉద్రేకాల వెల్లువలో ఎట్లాంటి వ్యక్తీకరణలు తీసుకున్నారో తెలుస్తుంది. మొత్తం తెలుగు సాహిత్యంలో తెలంగాణ ఉద్యమ సాహిత్యం దశ దిశ అవగాహనకు వస్తుంది. మొత్తంగా సాహిత్యం ద్వారా ఉద్యమాలు, ఉద్యమాల ద్వారా సాహిత్యం పరస్పరం ఎలా ప్రేరణ పొంది ముందుకు సాగుతాయో బోధపడుతుంది. నిజానికి ఉద్యమ సాహిత్యం ఆనాటి పరిస్థితులను మన కళ్ళకు కట్టే చలన చిత్రం లాంటి చరిత్ర. ఒకనాటి ప్రజా ఉద్యమం ప్రత్యక్షంగానో,పరోక్షంగానో మరో ప్రజా ఉద్యమానికి ప్రేరణనిస్తుంది. అందుకు ఆ ఉద్యమ సాహిత్యాధ్యయనం ఎంతో తోడ్పడుతుంది.ఉద్యమానికి చెందిన వివిధ దశలు, వాటి తీవ్రత కూడా సృజనాత్మక సాహిత్యంలో జీవకళతో నమోదవుతాయి. ఉద్యమానికి చరిత్రలో ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ఆ ఉద్యమాన్ని ప్రతిఫలించిన సాహిత్యానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఆలోచనల క్రమంలో చూస్తే ఈ సంకలనానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉంది. తెరమరుగు కాకుండా”తెలంగాణ గొంతుకలు” మరోసారి తెలంగాణ సమాజం ముందుకు వచ్చినందుకు తెలంగాణా సమాజం సంబరపడాలి. పునర్ముద్రణ అనే ఆలోచన మళ్ళీ ఒకప్పుడు ప్రధాన సంపాదకులుగా బాధ్యత వహించిన బోనగిరి వారికే కలగటం, అది ఇలా ఆచరణ రూపంలోకి రావటం నిజంగా స్ఫూర్తిదాయకం. తెలంగాణా ఉద్యమ సందర్భంగా చాలా సంకలనాలు వచ్చాయి. వాటిని ఒక్కచోట చేర్చి ప్రభుత్వమే పునర్ముద్రణ చేస్తే, భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచితే తెలంగాణ చరిత్రకు గొప్ప మేలు జరుగుతుంది. అట్లాంటి కార్యక్రమాలకు ఈ సంకలన పునర్ముద్రణ ఒక దిక్సూచిలా మారుతుందని ఆశిద్దాం!

You Might Also Like

Leave a Reply