లొట్టపీసు పూలు
వ్యాసకర్త: చరసాల ప్రసాద్
********
ఇది తెలంగాణ చరిత్ర, సమాజంతో ముడిపడిన 15 కథల సంకలనం. రచయిత శీలం భద్రయ్య.
ఇందులోని అధికభాగం కథలకు 80–90 ఏళ్ల క్రితం నాటి తెలంగాణ నేపథ్యం ఉంది. కథలు కమ్మని తెలంగాణ రుచిలో వున్నాయి. ఆ పదాలు మనల్ని ఆయా స్థలకాలాలకు మోసుకొని వెళతాయి. గ్రామీణుల అలవాట్లు, ఆచారాలు తెలిసివస్తాయి. తెలంగాణ పల్లె జీవితం, అక్కడి మనుషుల బతుకు, రాజకీయ–సామాజిక మార్పులు, పేదరికం, కుల సంబంధాలు, మానవ సంబంధాలు వీటి వెనుక బలంగా ఉన్నాయి.
రచయితకు కథ కంటే బతుకు ముఖ్యం అనిపిస్తుంది. అందుకే చాలా కథల్లో సంఘటనలు పెద్దగా కల్పించినట్టు అనిపించవు. ఒక ఊరిలో నిజంగా జరిగే సంఘటనను చూస్తున్నట్టుంటుంది.
‘ఇసపురుగు’ కథలో చిన్న పిల్లవాడి అనారోగ్యం, నర్సమ్మ పడే ఆందోళన, ఇసపురుగు కాటుకు సంబంధించిన స్థానిక నమ్మకాలు, వైద్యం కోసం తిరగడం — ఇవన్నీ ఒక గ్రామీణ జీవితాన్ని చాలా సహజంగా చూపిస్తాయి. ఉదాహరణకు ఇది చూడండి.
“పొద్దుగాల నుంచి కురిసే అనతో ఏరు రువ్వడిగా ఆనాకాలం జోరుతో పొర్లుతోంది. ఏట్లో దూకే నీళ్ళనూ, కొండ్లమ్మట కారే నీళ్ళనూ అపలేక చీకట్లోకి అప్పుడప్పుడు తన దుఃఖాన్ని గుమ్మరిస్తోంది. ఆ తల్లి గుండెధైర్యంపై నల్లటి ఆకాశం అప్పుడప్పుడూ ఉరుముతూ, భయంకరంగా పిడుగులను వానగా కురిపిస్తుంది. “ఈ అన పొడుగానూ… నా ఎంటబడ్డది. నన్నిడిసేటట్టు లేదు” అని అనను తిట్టుకుంటోంది.”
ఈ కథల్లో తెలంగాణ మాండలికం చాలా సహజంగా వస్తుంది. మాండలికాన్ని చూపించడానికి మాండలికం వాడినట్టు అనిపించదు. పాత్ర ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడుతుంది. అందువల్ల పాత్రకు ఒక సామాజిక నేపథ్యం ఏర్పడుతుంది.
సామాన్య ప్రజల బ్రతుకును చూపించడంలో రచయిత ప్రతిభ, పల్లెపట్టుల జీవనశైలి పట్ల అవగాహన, అనుభవం కనిపిస్తాయి.
అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే రచయిత పుట్టింది 1980లో. అంటే ఈ మెజారిటీ కథల్లో కనిపించే రజాకార్ల దౌర్జన్యం, హింస ఇతను ప్రత్యక్షంగా చూసింది కాదు. విన్నదీ, చదివిందీను. నాటి చరిత్ర నేపథ్యంలో రాసిన అన్ని కథల్లోనూ ఇంచుమించు ఒకే మూస కనపడుతుంది. “రజాకార్లు వచ్చారు – ప్రజలను హింసించారు – ప్రజలు ప్రతిఘటించారు”. ఏ ఒక్క కథలోనూ “రజాకారు” ఒక రక్తమాంసాలున్న మనిషిగా కనపడడు. ఆ వైపు నుంచి ఒక సంభాషణ గానీ, ఒక సంఘర్షణ గానీ.. పోనీ తమ చర్యలకు వారికున్న నైతిక సమర్థన గానీ.. ఏవీ కనపడవు. “రజాకార్లు” కేవలం క్రూరమృగాలు అంతే అన్నట్టుగా ఈ కథలన్నీ వున్నాయి.
రచయిత జరిగిన సంఘటనలను తమ పెద్దవాళ్లనుంచి విని కథలుగా మలిచి వుండవచ్చు, మరి ఆ పెద్దవాళ్లు ఆ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ పాత్ర గురించి చెప్పలేదా? దొరలకు, రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలను ఎలా కూడగట్టింది, వాళ్లలో ఎలా ధైర్యం నింపింది అన్నది ఏ కథలోనూ ఎందుకు కనిపించదు? సామాన్య ప్రజల ప్రతిఘటనే కనిపిస్తుంది తప్ప, ఏ కథలోనో పార్టీ దొరలకు, రజాకార్లకు వ్యతిరేకంగా ఎలా వాళ్లను కూడగట్టింది, ఎలా ధైర్యాన్నిచ్చింది అన్నది కనపడదేల?
రజాకార్ల దోపిడీ, హింస, దౌర్జన్యాల గురించి విపులంగా చెప్పిన కథలున్నాయి గానీ, ఆ రాజాకార్ల పీచమణిచి నిజాం పాలన నుండీ ప్రజలకు విముక్తి కల్పించిన యూనియన్ సైన్యం అంతవరకూ ప్రజల తరపున, ప్రజలకోసం ప్రాణాలర్పించిన కమ్యూనిష్టులను ఎలా వెంటాడి వేటాడి చంపిందో మచ్చుకైనా లేదెందుకు? యూనియన్ సైన్యం చేతుల్లోనూ పెద్ద ఎత్తున హింస, హత్యలు జరిగాయని చరిత్రలో నమోదైన విషయాన్ని ఈ కథలు కనీసం స్పృశించవు. చరిత్రలో ఈ కోణాన్ని పెద్దలు రచయితకు చెప్పలేదా? రచయిత ఎక్కడా చదవలేదా? ఒక దుర్మార్గాన్ని మనం గుర్తు చేసుకుంటూ, మరో దుర్మార్గాన్ని కావాలనే మరుగు పరుస్తున్నామా?
దొరల కబంధ హస్తాల నుంచి భూములను విడిపించి, రైతులకే వాటిపై హక్కు ఉండాలని సాగిన నాటి పోరాటం, యూనియన్ సైన్యం వచ్చాక ఏమైంది? ఆ భూములు రైతులకే శాశ్వతంగా దక్కాయా? ఆ పోరాటం తెచ్చిన మార్పేమిటి? అన్నది ఏ కథైనా పట్టుకొందా అంటే లేదనే చెప్పాలి.
రచయిత చరిత్రను “రజాకార్ల హింస → ప్రజల ప్రతిఘటన” అనే ఫ్రేమ్లో ఎక్కువగా చూశాడు.
కానీ చరిత్ర అక్కడితో ముగియదు.
రైతాంగ సాయుధ పోరాటం రజాకార్ల మీద మాత్రమే జరిగిన పోరాటం కాదు. దాని రాజకీయ లక్ష్యాలు దొరల భూస్వామ్య వ్యవస్థను కూల్చడం, భూమి ప్రశ్నను పరిష్కరించడం, గ్రామీణ అధికార నిర్మాణాన్ని మార్చడం వంటి వాటితో కూడా సంబంధం కలిగి ఉన్నాయి. అందుకే యూనియన్ సైన్యం ప్రవేశించిన తర్వాతి దశ కథలోకి రావాలి.
ఇంకా చెప్పాలంటే రజాకార్లను ఎదుర్కొన్న రైతు వీరుడు కథలో “వీరుడు”గా నిలుస్తాడు. అదే రైతు యూనియన్ ప్రభుత్వంతో ఎందుకు ఢీకొన్నాడు? అతని పోరాటం ఎందుకు కొనసాగింది? అక్కడ అతను ఎలా చనిపోయాడు? — ఆ ప్రశ్న మాత్రం రచయిత కథల్లో దాదాపు కనిపించదు.
ఇదే నాకు ఈ సంకలనంలోని అత్యంత పెద్ద చారిత్రక లోపంగా అనిపిస్తోంది.
మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘కొత్త దొర’లో యూనియన్ సేన ప్రస్తావన ఉంది; అంటే రచయిత ఆ చారిత్రక దశను పూర్తిగా మరిచిపోలేదు. కానీ అక్కడ కూడా యూనియన్ సైన్యాన్ని ప్రజల మీద హింస చేసిన శక్తిగా చూపించే ప్రయత్నం లేదు. మరోవైపు ‘బంచెరాయి’, ‘లోట్టపీసు పూలు’, ‘మాయాబారి’ వంటి కథల్లో రజాకార్ల హింస చాలా ప్రత్యక్షంగా, శరీరానుభవంగా, భయానకంగా వస్తుంది.
రచయిత ఒక చారిత్రక ఘట్టంలోని ఒక వైపు బాధను చాలా విస్తృతంగా చూపించి, అదే కాలంలోని మరో వైపు హింసను కథనానికి దాదాపు బయట ఉంచాడు అన్నది నా పరిశీలన. ఇది ఉద్దేశపూర్వకమైన ఎంపికా? లేక రచయితకు అందిన చరిత్రలోనే ఈ లోటు ఉందా? ఈ రచయిత ఇతర రచనల్లోనైనా ఈ కోణం కనిపిస్తుందా? తెలుసుకోవాల్సిన ప్రశ్నలివి.
సాహిత్యపరంగా కూడా ఈ కథల్లో కొన్ని పరిమితులు కనిపిస్తాయి. రచయితకు గ్రామీణ జీవితం మీద మంచి పట్టు, పాత్రల మాటల్ని సహజంగా పట్టుకునే నేర్పు స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని కథల్లో మాత్రం పాత్రల అంతర్ముఖ ప్రపంచంలోకి లోతుగా వెళ్లడం కంటే, వారి జీవితంలో జరిగిన సంఘటనలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అందువల్ల కొన్ని కథలు ఒక కుటుంబం లేదా ఒక ఊరి జీవన వృత్తాంతంలా అనిపిస్తాయి. జీవితానుభవం, స్థానిక జీవితం పట్ల అవగాహన బలంగా ఉన్నప్పటికీ, ప్రతి కథా వస్తువునీ అంతే బలమైన అంతర్మథనంగా, కట్టుదిట్టమైన కథా నిర్మాణంగా మలచడం అన్నిచోట్లా సాధ్యపడలేదనిపిస్తుంది.

Leave a Reply