సంగీత సాహిత్యాల వారధి-సదాశివ
వ్యాసకర్త: తోకల రాజేశం
*********
సంగీత సాహిత్యాలు దేనికదే చాలా లోతైన విషయాలు. జీవితకాలపు కృషి ద్వారా సంపూర్ణంగా ఒకదాన్ని అందుకోవడమే కష్టం. సామల సదాశివ గారు మాత్రం ఈ రెండింటిలోనూ సమానమైన సాధికారతను సంపాదించడం తెలుగు వాళ్ళమని చెప్పుకుంటున్న వాళ్లందరూ గర్వపడాల్సిన విషయం. సంగీత సాహిత్యాలను రెండు కళ్ళతో పోలుస్తూ “సదాశివ మూడో నేత్రం అనువాద రంగం” అంటారు ఎం.వేద కుమార్ (ఆంధ్రభూమి-3 ఆగస్టు,2012 ). నిజానికి సదాశివ మూడో నేత్రం చిత్రకళా రంగం. అనువాదమన్నది కూడా సాహిత్య రంగానికి చెందినదే కదా! అయితే మూడో నేత్రం కనబడనట్టే (అంతః చక్షువు అనుకుంటే) సదాశివ చిత్రకారుడన్న సంగతి చాలా మందికి తెలియదు. తన కృషి గురించి తాను ఏ సందర్భంలోనూ ఏమాత్రం చెప్పుకోని నిండుకుండ సదాశివ. అందుకే అతనిలో బయటపడని కళలు ఇంకా ఎన్ని దాగిపోయి ఉన్నాయో? అని అప్పుడప్పుడు ఆశ్చర్యమూ, అనుమానమూ కలుగుతూ ఉండేది. ఏకకాలంలో తెలుగు ,హిందీ, ఉర్దూ,పార్శి,మరాఠీ భాషలలోని సాహిత్య చరిత్రలను అర్థం చేసుకొని తులనాత్మకంగా వివేచించడం 21,22 వ శతాబ్దాలకు సంబంధించినంతవరకు బహుశా సదాశివ ఒక్కరికే సాధ్యమైందేమో! తాను నేర్చుకున్న దాన్ని పదిమందికీ పంచాలన్న జ్ఞానదృష్టి సదాశివ గారికి ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సంతరించి పెట్టిందని చెప్పవచ్చు. ఈ దృష్టితోనే తెలుగులోని కవులను ఇతర భాషల్లోకి ఇతర భాషల్లోని అద్భుతమైన కవిత్వాన్ని తెలుగులోకి ప్రవేశపెట్టి రెండు భాషలకూ మేలు చేశారాయన. గుడిపాటికి ఇచ్చిన ఇంటర్వ్యూ (ఏప్రిల్ 21,2012) లో-‘నేను రాయగలిగినవి, రాయాల్సినవి వేరే ఉన్నాయి. మనవాళ్లకు తెలియని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతోనే ఉర్దూ పారసీ సాహిత్యాలను గురించి రాశాను’ అంటారు సదాశివ. ఆయన రచనలు చదువుతుంటే ‘ఈ విషయాన్ని ఆయన మాత్రమే చెప్పగలడేమో’ అని ఆగి ఆలోచించే సందర్భాలు చాలా తటస్థిస్తాయి.
సదాశివ గారు మొదట అందరిలా కవిత్వం రాసిన వారే. కానీ ఆయన సాహిత్య ప్రపంచానికి గొప్ప వ్యాస రచయితగానే తెలుసు. అయితే ఆయన కృషిని పోయెట్రీ నుంచి ప్రోజ్ వైపు మళ్ళించింది సురవరం ప్రతాపరెడ్డి గారు.ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ అనేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో సురవరం వారికి సవినయంగా కృతజ్ఞతలు తెలుపుకున్నారు సదాశివ మాస్టారు.సదాశివ గారికి ఉర్దూతో గల అనుబంధం ప్రత్యేకమైనది.తన చదువంతా ఉర్దూ మాధ్యమంలోనే కొనసాగటం వల్ల,తన వ్యక్తిగత శ్రద్ధ వల్ల ఆ భాషలో నిష్ణాతుడై అనేక వందల వ్యాసాలు రాసి ఉర్దూ సాహిత్య చరిత్రలో చెరిగిపోని సంతకం చేశారు. ఆయన తెలుగువాడంటే నిజంగా ఉర్దూ పాఠకులు ఆశ్చర్యపోతారు. ‘ఉర్దూ సాహిత్య చరిత్ర’, ‘ఉర్దూ కవుల కవితా సామాగ్రి’,’ అంజద్ రుబాయి’లను , ‘ఫారసీ కవుల ప్రసక్తి’ని ,’ఉర్దూ భాషా కవితా సౌందర్యా’న్ని తెలుగు పాఠకులకు అడుగని కానుకలుగా అందించిన సదాశివ ఉర్దూ -తెలుగు భాషలకు మధ్య వారధిని నిర్మించారు. తెలంగాణ జాతి పితామహుడు కొత్తపల్లి జయశంకర్ -‘పండితులుగా చెలామణీ అవుతున్న కొందరు ప్రాంతేతరులు తెలంగాణ ప్రాంతపు తెలుగును తౌరఖ్యాంధ్రముగా కించపరిచినప్పుడు మతాలకు భాషలు అవసరం కానీ, భాషలకు మతాలు ఉండవని నిరూపించిన జ్ఞాని ఆయన’ అని సదాశివ గురించి అన్న మాటలు గుర్తు చేసుకుంటే ఆయన రచనలకు నేటికీ గల ప్రాసంగీకత ఏమిటో అర్థమవుతుంది.
విని ఆనందించే సంగీత ప్రపంచంలోని గమ్మత్తైన విషయాలను సదాశివ గారు చెప్తుంటే వినటం ఒక మధురానుభూతి. అవి వ్యాసాల రూపంలో ఉన్నప్పటికీ దగ్గర కూర్చుండి ముచ్చట్లు చెబుతున్నట్లు ఉండేలా రాయటం తెలుగు సాహిత్య ప్రపంచంలో కేవలం సదాశివ ఒకరికే చెల్లింది. ‘సంగీతానికి సాహిత్య గౌరవం ఇచ్చిన వారు సదాశివ. నాకు ఆయనతో ఉన్న పరిచయం తక్కువైనా గౌరవం ఎక్కువ’ అని ప్రజాకవి గోరటి వెంకన్న(ఆంధ్రభూమి- ఆగస్టు 13,2012) అనడం కూడా ఇదే విషయాన్ని రుజువు చేస్తోంది.
ముచ్చట్లు తెలంగాణ ప్రజా జీవితానికి సంబంధించిన మౌఖిక కళారూపం. అలాంటి ముచ్చట్లకు సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు సదాశివ.తన ‘యాది’ ద్వారా ముచ్చట్లకు జాతీయస్థాయి ఖ్యాతిని తీసుకొచ్చిన తెలంగాణ వైతాళికుడు సదాశివ. ఆయన యాది నిండా ఉన్నవి ముచ్చట్లే. యాదిలో ఆయన రాసిన ముచ్చట్లను చదివితే సాహిత్యానికి అలాగే జీవితానికి సంబంధించి మనకింతవరకు అనుభవంలోకి రాని ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. ఇంతటి జ్ఞానాన్ని సంపాదించడానికి ఆయన ఎన్ని వందల పుస్తకాలు చదివారో? ఎంత కాలాన్ని ధారపోశారో? ఆ సారమంతా మనకు యాదిలో దొరుకుతుంది. సదాశివ గారే స్వయంగా చాలా చోట్ల చెప్పుకున్నట్లు యాదిలో ఆయన వ్యక్తిత్వం ఉంది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ‘స్వరలయలు’ గ్రంథానికి వచ్చినప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో(నమస్తే తెలంగాణ, ఆదిలాబాద్: డిసెంబర్ 22,2011) లో- ‘స్వరలయలు పుస్తకం కేవలం హిందుస్తానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించినది మాత్రమే .ఆ పుస్తకంలో అంతా సంగీతం గురించే ఉంటుంది. యాది పుస్తకంలో నా జీవిత అనుభవాలు నేను కలిసిన వ్యక్తుల గురించి ప్రస్తావించాను.ఆ పుస్తకంలో నా వ్యక్తిత్వం ఉంది. ఇదే పురస్కారం ‘యాది’కి వస్తే మరింత సంతోష పడేవాన్ని’ అంటారు. నిజంగా యాదిలో సదాశివ ఆత్మ ఉంది. ‘ జీవిత చరిత్రల్లో, నవలల్లో, కథల్లో,కవిత్వంలో దొరకని అనేక అంశాలు ఆత్మకథల్లో దొరుకుతాయి.ఆత్మకథలాంటి ఈ యాదిలో రెండు మూడు తరాల సాహితీ మూర్తుల వ్యక్తిత్వం దొరుకుతుంది. వాళ్ళ మూర్తిమత్వం, మాటతీరు,మానరిజం దొరుకుతవి’అని సుంకిరెడ్డి నారాయణరెడ్డి (తెలంగాణ సంస్కృతి నిధి యాది: వ్యాసం- జయంతి) అన్న మాటలు యాదిని చదివిన వాళ్ళందరికీ అక్షర సత్యాలుగా అనుభవంలోకి వస్తాయి. కె. రామచంద్ర మూర్తి గారే పట్టుబట్టి రాయించుకోకపోతే ఈనాడు మనకు యాది లాంటి మహోన్నతమైన గ్రంథం లభించి ఉండేది కాదు. సదాశివ అభిమానులందరూ రామచంద్ర మూర్తి గారికి రుణపడి ఉంటారు. ఆ రామచంద్ర మూర్తి గారే ఓకచోట ‘సదాశివ మాస్టారుతో పరిచయం లేకపోతే నాకు చాలా విషయాలు తెలిసేవి కావు.అంతటి పరిజ్ఞానాన్ని పుస్తకాలు చదివి సంపాదించడానికి జీవిత కాలం పడుతుం’దని చెప్పారు .ఈ రెండు ముక్కలు చాలు సదాశివ గారి సాహిత్య సమగ్ర మూర్తిమత్వం ఏమిటో అవగాహనలోకి తెచ్చుకోవడానికి.
ఇంతటి ప్రతిభాశాలికి తన 83వ ఏట అంటే తాను చనిపోయే కంటే ఒక సంవత్సరం ముందు ( అంటే 2011లో) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈ ఆలస్యం వెనుక ఆంతర్యమేమిటి? అందుకే కొత్తపల్లి జయశంకర్ గారు ‘ఇంతటి మహోన్నత వ్యక్తికి ఈ సువిశాల ఆంధ్రప్రదేశ్లో లభించవలసిన గుర్తింపు లభించిందా?’ అన్న ప్రశ్నను సంధించారు. ఎందుకు లభించలేదో మన అందరి అనుభవాల్లో ఉన్నదే. తాను తెలంగాణ వాడినైనందుకు ఎలా అవమానాలు పొందవలసి వచ్చిందో సదాశివ స్వయంగా చాలా చోట్ల చెప్పుకున్నారు కూడా.’మా చుట్టూరా ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్లో ఇంతటి సంగీతం సాహిత్యం వ్యాపించి ఉన్నా తెలంగాణ జిల్లాల వాళ్లకు కళా సాహిత్యాలలో అంతగా ప్రవేశం లేదంటూ- అంతా ఔ! మళ్ల గాళ్లేనంటూ ఈసడించినట్లు మాట్లాడుతూ వుంటే కొంచెం బాధగానే ఉంటుంది’ అని యాదిలో ఒకచోట ప్రస్తావించారు. ఆయన ఇలాంటి ప్రతికూల పరిస్థితులలో నుంచి మరింత శక్తివంతంగా తయారయ్యారు.వారి వ్యక్తిత్వంలోని సానుకూల ధోరణి అలాంటిది. ఈ నేపథ్యంలో సదాశివ ఒక ఇంటర్వ్యూలో ‘నేను కట్టర్ తెలంగాణ వాదిని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకునే వారిలో నేను అగ్రగణ్యున్ని. ఈ విషయాన్ని నేను నా ఆంధ్ర మిత్రులకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను’ అన్నారు. ఆయన ఆశించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రవిర్భావాన్ని చూడకుండానే కళ్లు మూశారు. అలాగే పద్మభూషణ్ కన్నా ఉపాధ్యాయ వృత్తి అత్యున్నత పురస్కారమని వేరొక ఇంటర్వ్యూలో చెప్పారాయన.అందుకే జయధీర్ తిరుమలరావు ‘సదాశివ మాస్టారు తన జీవితాన్ని పాఠం చేసి చెప్పే విషయం ఆయన కన్నా గొప్పది. సదాశివ గారి ఔన్నత్యం అదే’నంటారు.అటు సంగీత సాహిత్యలకు,ఇటు తెలుగుకు ఉర్దూకు మధ్య వారధిలా పనిచేసిన సామల సదాశివ భౌతికంగా నేడు మన కళ్ళ ముందు లేకున్నా ఆయన సృష్టించిన అపూర్వమైన సాహిత్య సంపద ఉన్నది. అందులోకి వెళ్లి మన పాత తరాల జీవితాల్లోని అమూల్యమైన మేధో సంపదను అందుకోవటమే మన ముందున్న కర్తవ్యం. అదే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి .

Leave a Reply