చిరంజీవి శ్రీ శ్రీ
వ్యాసకర్త: తోకల రాజేశం
**********
శ్రీ శ్రీ గురించి కొత్తగా చెప్పేదేముందని చాలామంది భావిస్తారు. దానికి ప్రధాన కారణం శ్రీ శ్రీ రాసిన సాహిత్యం కంటే,వందల రెట్ల సాహిత్యం ఆయన మీదా, ఆయన రాసిన సాహిత్యం మీదా వచ్చి ఉండటమే. ఈ రాసిన వాళ్లలో శ్రీ శ్రీ ని అనేక వాదాల కొలమానాలతో తూచిన వాళ్ళున్నారు.అనేక సాహిత్య మర్మాలతో,ధర్మాలతో పొత్తు కలిపిన వాళ్ళున్నారు.శ్రీశ్రీ భాషను మాత్రమే చూసి కవే కాదు పొమ్మన్న వాళ్ళూ ఉన్నారు.ఆయన పిలుస్తున్నదని చెప్పిన మరో ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచమని సంబరపడిపోయిన వాళ్ళూ ఉన్నారు. సముద్రం గురించి చెప్పమంటే ఒక్కొక్కరు ఒక్కో అంశానికి పరిమితమై చెప్పినట్టు శ్రీ శ్రీ ని కూడా ఒక్కొక్కరు ఒక్కో విధంగా దర్శించారు. శ్రీ శ్రీ అనంతరం వచ్చిన అనేక వాదాలను చర్చిస్తున్నప్పుడు కూడా ఆయన ఆ వాదాల తాలూకు ఆలోచనలు ఏమైనా చేశాడా అని కూడా వెతికారు.దొరికిన వాళ్ళు సంబరపడ్డారు. దొరకని వాళ్ళు తిట్టుకున్నారు. చాలా మందికి ఆయన వాడిన భాష మీదా, తీసుకున్న ప్రతీకల మీదా ఫిర్యాదులున్నాయి. కానీ శ్రీశ్రీ వీటన్నింటినీ దాటి చూడదగినవాడు. అపరిమిత మేధతో మనం కల్పించిన పరిమితులకు అతీతుడు.
ఎందుకంటే ఆయన తెలుగు సాహిత్యంలో ప్రజలెవరికీ పనికిరాకుండా బీటలు వారిపోయిన సాహిత్య రాజ సౌధాలను కూల్చి సామాన్యుల కొరకు కొత్త కవిత్వపుటిల్లు కట్టినవాడు. కుళ్ళిపోయిన రక్త నాళాలతో కునారిల్లుతున్న సాహిత్య ప్రపంచానికి సరికొత్త రక్తాన్ని ఎక్కించిన వాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే-గురజాడ చూపించిన మలుపును మహాప్రస్థాన గీతాలతో మరింత వెడల్పు చేసినవాడు.ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా శ్రీ శ్రీ మహాకవి.శ్రీ శ్రీ అభ్యుదయ మార్గం పట్టించకపోతే తెలుగు కవితాకన్యక ఇంకా పురాణ వీధుల్లోనే విహరిస్తూ ఉండేది. చలం మాటల్లో చెప్పాలంటే “పాత పదాలు, డిక్షన్, వర్ణనలు, అలంకారాలు, ఛందస్సు, ఉపమానాలు, పద్ధతులు ఆచారాలు కవిత్వంలోనివీ, జీవితంలోనివీ ఇంకా మళ్లీ లేవకుండా వాటి నడ్డి విరక్కొట్టాడు శ్రీశ్రీ”. అందుకే శ్రీశ్రీ ఆధునిక తెలుగు కవిత్వానికి ఆదికవిలా అవతరించాడు.
మహాప్రస్థానంలోని కవితలన్నీ దాదాపు ఒకటి రెండు అటూ ఇటుగా తొంభై ఏళ్ళ కింద రాసినవే. అయినా వాటిలో చాలావరకు నేటికీ తాజా దనాన్ని కలిగిన కవితలున్నాయి. తిరోగమన వాదం నెత్తిమీద సుత్తెతో దెబ్బలు వేసిన కవితలున్నాయి. దుష్ప్రచారాల హోరులో సత్యమేదో, అసత్యమదో తెలుసుకోలేని నిస్సహాయత ఒకటి నేటి సమాజంలో ఆవరించింది. ప్రజాస్వామ్యం స్థానంలో మూకస్వామ్యం, సామాజికత స్థానంలో అసాంఘికత రాజ్యమేలుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో శ్రీ శ్రీ కవితలకు మరింత ప్రాసంగీకత పెరిగింది. “మిథ్యావాది”కవిత ఆధ్యాత్మికత ముసుగులో ప్రజలను మోసం చేస్తున్న అసత్యవాదులకు చెంపపెట్టులాంటిది.
పాలికాపు నుదుటి చెమట
కూలివాని గుండె చెరువు
బిచ్చగాని కడుపు కరువు
మాయంటావూ?…… అంటూ భౌతిక వాస్తవికతకు మసిపూసి ప్రజల్లో నిస్తేజం నింపాలని చూసే పరాన్నభుక్కుల బండారం బయట పెడతాడు. తనకాలపు కవులలో చాలామంది ప్రజలను నిద్రపుచ్చే కవిత్వం రాస్తే ఆ మొద్దునిద్రలో నుంచి మేల్కొల్పి తమ కర్తవ్యమేమిటో బోధించిన కవిత్వాన్ని శ్రీ శ్రీ రాశాడు.
కర్షక వీరుల కాయం నిండా
కాలువ కట్టే ఘర్మ జలానికి
ఘర్మ జలానికి
ధర్మ జలానికి
ఘర్మ జలానికి ఖరీదు లేదోయ్ (ప్రతిజ్ఞ)
అంటూ మాట్లాడిన తెలుగు కవి ఆనాడు మరొకరు లేరు.
“నాలో కదిలే నవ్యకవిత్వం
కార్మిక లోకపు కల్యాణానికి
శ్రామిక లోకపు సౌభాగ్యానికి
సమర్పణంగా సమర్చనంగా..”
అని ప్రకటించిన కవి లేడు. తనది నవ్య కవిత్వమని చెప్పుకున్నాడు శ్రీ శ్రీ. అంత వరకు ఉన్న కవిత్వానికి భిన్నంగా వస్తువులోను, శిల్పంలోను విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి దానిని నవ్య కవిత్వమన్నాడు. ‘నవకవిత’లో ఆయన చెప్పిన లక్షణాలకు లక్ష్య ప్రాయమైన కవిత్వాన్ని ఆయన కవిత్వంలోనుంచే చూపించవచ్చు. “దేశ చరిత్రలు” కవిత తదనంతర తెలుగు కవితాదృష్టిని పూర్తిగా మర్చివేసిన కవిత. దీనిలో శాస్త్రీయ దృష్టికోణం,సామాన్య ప్రజల వైపు నుంచి చూసే చూపు, చరిత్ర నిర్మాణం పట్ల స్పష్టత మునుపెవ్వరూ ప్రదర్శించనివి. తరువాత తరానికి ఎంతో స్ఫూర్తిని పంచినవి.ఇలా తెలుగు కవిత్వాన్ని సంపూర్ణంగా ప్రజామార్గం పట్టించిన మొదటి తెలుగు కవి శ్రీ శ్రీ. సమసమాజం రానంత వరకు సమాజంలో పీడన ఉంటూనే ఉంటుంది. సమాజంలో పీడన ఉన్నంత కాలం శ్రీ శ్రీ కవిత్వానికి ప్రాసంగీకత మరింత పెరుగుతుంది. ఆయన కవిత్వం పీడనను ధిక్కరించమని చెప్తూ ప్రజలలో చైతన్యం నింపుతూనే ఉంటుంది. అప్పటిదాకా శ్రీ శ్రీ బతికే ఉంటాడు.
(శ్రీశ్రీ జయంతి సందర్భంగా)
