కలకాలం నిలిచి ఉండే కవి శివసాగర్
వ్యాసకర్త: తోకల రాజేశం
*********
“కాలానికి ఒక కవి కావాలి
ఒక కవిత కావాలి
అందుకనే కాలం కడుపుతో వుండి
శ్రీశ్రీ ని కన్నది”
అని ఒక సందర్భంలో శివసాగర్ రాసాడు. శ్రీశ్రీ తరువాత అదే కాలం అదే కడుపులో మోసి శివ సాగర్ ని కన్నది. ఆధునిక కవిత్వంలో శ్రీశ్రీ ఎలాంటి పాత్ర పోషించాడో, ఆ తరువాత విప్లవ కవితాయుగంలో శివసాగర్ అలాంటి పాత్రనే పోషించాడు. నిజం చెప్పాలంటే అంతకన్నా ఎక్కువ పనే చేసాడు. అందుకే శ్రీశ్రీ తరువాత శివసాగర్ గారిని యుగకర్త గా చెప్పాడొక సందర్భంలో సతీష్ చందర్. శివసాగర్ కవిత్వాన్ని చైతన్యవంతమైన ఒక ఆయుధంగా స్వీకరిస్తూనే, అదే చైతన్యంతో అదే చేతిలో ఆయుధాన్ని కూడా పట్టుకున్నాడు. విప్లవ పోరాటంలో ఆయన సాధించినదేమిటో మనకు తెలియదు గానీ తెలుగు కవిత్వలో ఆయన సాధించింది చాలా ఉంది.ఆయన వల్ల తెలుగు కవిత్వం అప్పటికంటే ఒక మెట్టు పైకెదిగింది.ఈ సత్యాన్ని ఆయన విప్లవ శిబిరంలో లేకపోయి ఉంటే చాలామంది ఒప్పుకునేవాళ్ళు. వాళ్లకు తెలియని సత్యం ఏమిటంటే విప్లవ శిబిరంలో ఉండటం వల్లనే ఆయన అంత గొప్ప కవిత్వం రాయగలిగారు. ఆచరణలో ఉన్నవాళ్ళ సాహిత్యం ఎంత సజీవంగా, ఎంత సారవంతంగా ఉండగలదో అన్న దానికి నమూనా శివసాగర్ కవిత్వం.
విప్లవ కవుల్లో చాలామంది నినాదప్రాయమైన కవిత్వం రాస్తారన్న ప్రచారమొకటి ఉంది. శివసాగర్ రాసిన “ఉద్యమం నెలబాలుడు”కి రాసిన ముందుమాటలో ‘గొప్ప కవిత్వమే నినాద స్థాయికి చేరగలుగుతుం’దంటాడు చేరా. శివసాగర్ కవిత్వంలో ఇట్లా నినాద స్థాయికి ఎదిగిన వాక్యాలు చాలా ఉన్నాయి. ఆ నినాదంలో కూడా కవిత్వం పలికించటమే ఆయన ప్రత్యేకత.అయితే కవిత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఉండే తేడాల వల్ల ఇలాంటి వాదనలు ముందుకు వస్తాయి.ఈ క్రమంలో అన్నిరకాల స్థాయిల్లో ఉన్న పాఠకులను ఆకట్టుకున్న కవి శివసాగర్. ఈ రకంగా చూస్తే విప్లవ కవులకు, ఆమాటకొస్తే తెలుగు కవులందరికీ ఆదర్శప్రాయుడాయన. విమర్శకులు భవించినట్టు విప్లవ కవిత్వంలో ఆనాడు చోటుచేసుకున్న ఒక మొనాటనీ కి భిన్నంగా ఆయన కవిత్వం రాసాడు.అప్పటిదాకా విప్లవ కవిత్వంలోకి ప్రవేశంలేని అనేక కొత్త ప్రతీకలను తెచ్చి ఆ కవిత్వాన్ని కొత్త దారిలో నడిపించాడు.
పాట రాసినా, కవిత రాసినా అందులో కవిత్వం లేకుండా రాయలేదు శివసాగర్. ప్రజల దగ్గరినుంచి బాణీలను తీసుకొని తాను చెప్పదల్చుకున్న విషయాన్ని ప్రజల భాషలోనే పాటగా మలిచి మళ్ళీ అదే ప్రజల దగ్గరికి-వాళ్ళను చైతన్యం చేయటానికి పాటను తీసుకెళ్లటంలో ఆయన ఎంతో సృజనాత్మకంగా వ్యవహరించాడు. నర్రెంగా సెట్టుకింద నరుడో భాస్కరుడా!,నా చెల్లీ చెంద్రమ్మ, తోటరాముని తొడకు కాటా తగిలిందాని, ఇప్పపూల చెట్ల కింద దాచిన విల్లంబులన్ని లాంటి పాటలు ఈ విధంగానే బహుళ జనాదరణ పొందాయి. అయితే విప్లవాచారణలో ఉంటూ కవిత్వాన్ని కవిత్వంగా రాయటం అంత మామూలు విషయమేమీకాదు. ఆయనది ఒకరకంగా విప్లవ నిబద్ధతతో పాటు కవిత్వ నిబద్ధత కూడా. ఈ రెంటినీ ప్రాణప్రదంగా ప్రేమించి నడిపించిన మనకాలపు మహాకవి శివసాగర్. ఆయన అడవిలో ఉన్నా, జైల్లో ఉన్నా, ప్రజల్లో ఉన్నా నిరంతరం ప్రజల కోసమే ఆలోచించి ప్రజల కోసమే రాసాడు. ప్రజాకవి అని ఎవరినన్నా పిలవాల్సి వస్తే ఆ పదం శివసాగర్ కు సరిగ్గా సరిపోతుంది. ప్రజా కవులు నిజంగా మరణించినా ప్రజల్లో జీవించే ఉంటారు, ఇంకొక అర్థం లో వాళ్ళు కలకాలం నిలిచే ఉంటారు.ఈ కవిత్వ ప్రపంచంలో అట్లాంటి అరుదైన కవి శివసాగర్.
