లేపాక్షి – నాటి బతుకుల సాక్షి

వ్యాసకర్త: చరసాల ప్రసాద్

********

సడ్లపల్లె చిదంబరరెడ్డి గారు రాసిన ‘లేపాక్షి – నాటి బతుకుల సాక్షి’ చదివాను.

ఆయన నాకు చాలాకాలంగా తెలుసు. ఆయన రాసిన ‘బతుకు వెతుకులాట’ రాయలసీమ పల్లెల వందేళ్ల జీవితానికి దర్పణం. సామాన్యుల జీవితాల పట్ల ఆయనకు ఉన్న శ్రద్ధ, గౌరవం నాకు తెలుసు. అందుకే ఇది రచయితను గురించి కాదు; ‘లేపాక్షి’తో నా పఠనానుభవం.

‘లేపాక్షి – నాటి బతుకుల సాక్షి’ అని పేరు చెప్పినట్టుగానే, ఈ నవల రాజులూ, యుద్ధాలూ, విజయాలూ మాత్రమే కనిపించే చరిత్రను పక్కకు జరిపి, నాటి సామాన్య ప్రజల బతుకుల్లోకి తొంగి చూస్తుంది.

కృష్ణదేవరాయల తరువాత అచ్యుతరాయల కాలంలో, రెండవ రాజధానిగా పేరున్న పెనుగొండ చుట్టుపక్కల జీవితాలను కేంద్రంగా చేసుకున్న ఈ నవలలో సానులు, గొల్లలు, మాదిగలు, శిల్పులు, కాపులు వంటి వివిధ వృత్తుల ప్రజల జీవన విధానాలు, వారి మధ్య ఉన్న అంతరాలు, ఘర్షణలు కనిపిస్తాయి. బ్రాహ్మణ సమాజంలోని శైవ–వైష్ణవ విభేదాలూ కనిపిస్తాయి. నాటి ప్రజల ఆహార అలవాట్లు, వేషభాషలు, వ్యవసాయం, పశువులు, వృత్తులు, గ్రామీణ జీవితం వంటి ఎన్నో అంశాలు ఇందులో కనిపిస్తాయి.

పంది, పంది మాంసం, వంటలు వంటి మనం సాధారణంగా చరిత్ర పుస్తకాల్లో పెద్దగా చూడని విషయాలకూ ఇందులో స్థానం ఉంది. పెనుగొండ మండలాధిపతిగా ఉన్న నంది విరూపణ్ణ గవిగుడి దగ్గర కట్టించిన లేపాక్షి ఆలయ నిర్మాణాన్ని ఒక కేంద్రబిందువుగా తీసుకున్న ఈ నవలలో ఎన్నో చిన్న చిన్న కథలు కనిపిస్తాయి.

ఇన్ని కథలు, ఇంత పెద్ద సమాచారంతో, పద్దెనిమిది వందల పేజీల సమాచారాన్ని 180 పేజీల్లోకి కుదించినట్టుగా అనిపిస్తుంది.

గట్టు తెగిన చెరువుకు గంగమ్మ కోపించిందని నమ్మి అమాయకురాలైన హొన్నమ్మను బలివ్వడం, దాని వెనక దాగి ఉన్న అధికారుల అవినీతి, దుర్మార్గం; సాధారణ కాపు రైతు గవప్ప గవిరెడ్డిగా ఎదిగిన కథ; బసవకు ఎద్దులతో ఉన్న అనుబంధం — ఇలా ఎన్నో చోట్ల సామాజిక చరిత్రను సజీవంగా పట్టుకోవాలన్న రచయిత ప్రయత్నం కనిపిస్తుంది.

ఇవన్నీ ఈ నవలలోని గొప్ప బలాలు.

అయితే చరిత్ర పట్ల, సామాన్యుడి జీవితం పట్ల ఎంత శ్రద్ధ, గౌరవం ఉన్నా, అది మాత్రమే దాన్ని నవలగా మలచడానికి సరిపోతుందా?

‘లేపాక్షి’ చదివాక నాకు కలిగిన ప్రధానమైన అభిప్రాయం — ఇందులో చరిత్ర ఎక్కువ, కథ తక్కువ అయిపోయింది.

“నవల అంతా చదివారు కదా, కథ ఏమిటి?” అని ఎవరైనా నన్నడిగితే ఒక్క వాక్యంలో చెప్పడం నాకు కష్టం.

ఇది పద్మిని–వీరభద్రప్పల ప్రేమకథా?

పోనీ, సామాన్య సాలెవాడైన విరూపణ్ణ మండలాధిపతిగా ఎదిగిన కథా?

లేపాక్షి ఆలయ నిర్మాణ చరిత్రా?

అధికారుల దుర్మార్గం నుంచి బయటపడినా, మూఢనమ్మకానికి బలైన హొన్నమ్మ కథా?

మనుషుల శ్రమకు ధీటుగా తమ శ్రమను అందించి, చివరకు ఆ శ్రమలోనే కన్నుమూసిన ఎద్దుల కథా?

అవును. ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇవన్నీ కలిపి నడిపించే ఒక ప్రధాన కథ మాత్రం నాకు బలంగా అనిపించలేదు.

పూలన్నీ ఉన్నాయి. కానీ వాటిని గుదిగుచ్చిన దారం బలహీనంగా ఉంది — లేదా నాకు కనిపించలేదు.

నవలలో ప్రధాన పాత్ర విరూపణ్ణ. అతని చుట్టూ చాలామంది మనుషులు ఉన్నారు. కానీ అతని జీవితాన్ని లోపలినుంచి కదిలించే, పాఠకుడి మనసులో కూడా బరువు పెట్టే సంఘటనలు నాకు పెద్దగా కనిపించలేదు.

పద్మిని, విరూపణ్ణ, కటికం క్రిష్టప్పల మధ్య ప్రేమ, మోహం ఉన్నాయి. కానీ అవి మనల్ని అనుభూతి చెందించేంతగా సంఘటనలుగా మారలేదు అనిపించింది. పద్మిని, విరూపణ్ణ ఇద్దరూ కలిసి తిరుమల వరకు ప్రయాణించినా, వారి సంబంధాన్ని గుర్తుండిపోయేలా చేసే క్షణాలు నాకు కనిపించలేదు.

అలాగే విరూపణ్ణను బాల్యంలోనే రోగగ్రస్తుడిగా చూపించడం కూడా కథలో పెద్దగా ఉపయోగపడినట్టు అనిపించలేదు. అది కథను ఏదైనా కీలక మలుపు తిప్పి ఉంటే దాని అవసరం మరింత బలంగా కనిపించేది.

మరో విషయం — కాలస్పృహ.

రచయిత చరిత్రను మన ముందుంచాలన్న ఉత్సాహంలో మళ్లీ మళ్లీ మనల్ని కథాకాలం నుంచి బయటకు తీసుకొస్తుంటారు.

ఒకచోట “అప్పటి వ్యవస్థలో ఎవరి బతుకులకూ భరోసా ఉండేది కాదు” అంటారు. ఇంకొకచోట “అప్పుడు గొర్రెల దొంగతనాలు ఎక్కువగా జరిగేవి” అంటారు. మరోచోట రాయల పరిపాలనా కాలంలోని సానివాడల వృత్తిపన్ను గురించి వివరిస్తూ “ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది” అంటారు.

ఇలాంటి వాక్యాలు చిన్నవే అయినా, పాఠకుడికి ఒక ప్రశ్న వస్తుంది — “ఇప్పటికీ అంటే ఎప్పటికి? కథలోని అచ్యుతరాయల కాలం నాటికా, లేక పుస్తకం చదువుతున్న మన కాలమా?”

చారిత్రక నవలలో రచయిత కనిపించకుండా, ఆ కాలమే మనతో మాట్లాడితే పాఠకుడి అనుభవం మరింత బలంగా ఉంటుంది. ఆ కాలంలోకి పాఠకుణ్ణి తీసుకెళ్లి, అక్కడే వదిలేయాలి.

విరూపణ్ణ తిమ్మేడ అనే సానివాడకు వెళ్తున్నాడని చెప్పి, ఆ సందర్భంగా ఆ కాలంలోని సానుల పరిస్థితి గురించి రెండు పేజీల వివరణ వస్తే, ఆ సమాచారం విలువైనదే అయినా, కథ కాసేపు ఆగిపోయిన భావన కలుగుతుంది. ఆ విషయమే పాత్రల మాటల్లోనో, సంఘటనల్లోనో మనకు కనిపించి ఉంటే మరింత సహజంగా ఉండేదేమో.

అయితే ఈ అభ్యంతరాలన్నింటి మధ్యా ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి.

ఈ నవల వెనకున్న పరిశోధనను, సామాన్యుల జీవితాలను చరిత్రలో భాగంగా చూడాలన్న రచయిత ప్రయత్నాన్ని నేను ఎంతో గౌరవిస్తాను.

చరిత్ర అంటే రాజులు, రాజ్యాలు, యుద్ధాలు మాత్రమే కాదని; ఒక సాలెవాడి మగ్గం, ఒక రైతు ఎద్దులు, ఒక సాని జీవితం, ఒక మాదిగ కుటుంబం, ఒక పేద బాలిక ప్రాణం, ఒక గ్రామం నమ్మిన మూఢాచారం — ఇవన్నీ కూడా చరిత్రలో భాగమేనని గుర్తుచేసే ప్రయత్నం ఈ నవల చేసింది.

అందుకే ‘లేపాక్షి’ ఒక చరిత్రను వెతికి తెచ్చిన నవలగా చాలా విలువైనది.

నా అభ్యంతరం చరిత్రను ఇంతగా సేకరించడంపై కాదు; ఆ చరిత్రను ఒక బలమైన కథలో మరింత గట్టిగా అల్లకపోవడంపైనే.

ఆ చరిత్రకు ఒక బలమైన కథను మరింత గట్టిగా అల్లివుంటే, ఈ పుస్తకం మనకు సమాచారాన్ని అందించిన నవలగానే కాకుండా, మనసులో చాలాకాలం నిలిచిపోయే గొప్ప నవలగా కూడా మిగిలేదేమో.

‘లేపాక్షి – నాటి బతుకులకు సాక్షి.’

ఆ బతుకుల మధ్య నుంచి ఒక మరపురాని కథను కూడా మనకు అందించి ఉంటే — ఆ సాక్ష్యం మరింత శక్తివంతంగా ఉండేది.

You Might Also Like

Leave a Reply