ఆట సాగుతూనే ఉంటది
వ్యాసకర్త: జి. లక్ష్మీనరసయ్య
సమకాలీన సంవేదనలు మెండుగా ఉన్న కవిత్వమిది
(తోకల రాజేశం గారి “ఆట సాగుతూనే ఉంటది”(ఆగస్ట్-2026) కవితా సంకలనానికి ముందుమాట).
********
తోకల రాజేశం కవిత్వం లో తన ప్రాంతం పట్లా, మొత్తం సమాజం పట్లా ఆర్తిపూర్వక పట్టింపు ఉంది. బహుజన జీవిత సమస్యల పట్ల వేదన ఉంది. బాధ్యత ఉంది. అంబేద్కర్ ఆలోచనల ప్రభావం ఉంది. విప్లవ భావాల జాడ ఉంది. సమకాలీన సామాజిక రాజకీయ ఘటనల గురించిన విమర్శనాత్మక దృష్టి ఉంది. ఆలోచనా, ఉద్వేగం కలగలిసిన వాక్య సంపత్తి ఉంది. తను రాస్తున్న విషయం మీద ఎంత స్పష్టత ఉందో ఆ విషయాన్ని కవిత్వం చేయటంలో అంతే అలవోకతనం ఉంది.
బెస్త కుల నేపథ్యం నుంచి వచ్చిన ఈ కవి ఆలోచనలు చెరువుతోనూ, చేపలతోనూ, వలతోనూ , శ్రమతోనూ నిండి ఉన్నాయి. దిన దిన మనుగడలో తాండవమాడే సబ్బండ సంస్కృతి లో తడిసిన ఇతని అక్షరాలు అందుకే తడిగా పలుకరిస్తాయి. పాఠకుల్ని తమ వైపుకు తిప్పుకుంటాయి.
“మేమంతా తల్లి కడుపులోనుంచి సరాసరి
చెరువు కడుపులోకి చేరుతాం బువ్వ పెడుతుందని
ఎండాకాలం మొదలువ్వగానే
మా బెస్తోళ్ల ఇళ్ళముందుకు చేపల ఋతువు దిగేది
చెరువు తల్లికి మొక్కితే
మాకు బుట్టెడు బుట్టెడు చేపలిచ్చేది
తన కడుపులో వల వేసి దేవితే
మా కడుపులు నింపిన కన్నతల్లి మా చెరువు
చెరువుతో మా పేగు బంధానికి ఎన్ని వేల ఏళ్ళో? “
బెస్తలకూ చెరువులకూ ఉన్న సంబంధాన్ని ఇలా రికార్డు చేశాడీ కవి. రాజకీయ నాయకులు జనాల్ని మోసం చేయడానికి వల విసిరితే జీవిక కోసం వల విసురుతారు బెస్తలు. ఆ వలా ఈ వలా ఒకటి కాదు కవి దృష్టిలో.అందుకే అంటాడు
“ఇంతకీ వాని వల రహస్యం ఏమనుకుంటున్నారూ?
కులమొక పోగు మతమొక పోగు
ప్రజాస్వామ్య మొండి కత్తి తెంపినా తెగని వల “
జనాన్ని మోసం చేసే వల రాజకీయం కనుక ‘ దేశమిప్పుడు
వలలో విల విల ‘ అనే ప్రకటన చేశాడు.
‘ఉచ్చు ‘ అనే కవితలో పాలన అంటే ఇక్కడ ఒక ఉచ్చును పన్నటంగా వర్ణించాడు. ‘వేటగాని పధకం పారుతోంది ‘ అని చెబుతూనే పిట్టల చైతన్యం వేటను చిత్తు చేయడాన్ని చూపాడు. ‘మా అవ్వ ‘ అనే కవిత లో తల్లిని గురించీ ఆమె శ్రమ సౌందర్యం గురించీ రాసిన విధానం ఆకట్టుకుంటుంది.
“అవ్వ అడవి నుంచి నడిచొస్తుంటే
ఆకలి పాటలు పాడుతున్న పేగులతో
మా ముగ్గురి చూపులూ
గంప మీద గుడ్డీగలై మూగేవి
తునికాకు కోస్తున్నప్పుడు చూడాలి
మా అవ్వే
ఒక ఆకుపచ్చని అడవిలా కనిపించేది “
ఇలాంటి అభివ్యక్తి ఇతని కవితా శక్తిని ఇట్టే పట్టిస్తుంది.మామిడి పండ్లు రెండు కోసినందుకు ఆధిపత్య కులస్తుల చేతుల్లో హత్యకు గురైన బక్కి శ్రీను ఉదంతం గురించి రాస్తూ ఈ కవి అంటాడు :
“మనుషుల రక్త నాళాల్లో ప్రవహిస్తున్న కులాలు
మనుషులు నాటిన చెట్లలోనూ
చెట్లకు కాసిన పళ్ళలోనూ
మొరుగుతాయని మా అయ్యవ్వలు చెప్పి ఉంటే
అసలు పండ్లు తినటమే నేర్చుకునే వాణ్ని కాదు “
ఇలా ఉంటుంది కవిగా ఇతని ధోరణి.
ఈనాటి వాట్సాప్ యూనివర్సిటీ అబద్దాల వ్యవస్థ లో దేశం ఓ పెద్ద అబద్దం లో కూరుకుపోయి నిజం ఎండమావిగా తయారైన పరిస్థితి ని దృష్టిలో ఉంచుకుని, ‘మురికి కాళ్ళ ఈగ /ముట్టని పదార్ధాలు లేనట్లే /అబద్ధం దూరని సందులూ గొందులూ ఏవీ లేవు ‘ అని రాస్తాడు.’దేశానికి అందమైన నాటకాన్ని విందు చేస్తుంది ‘ అని వాపోతాడు.’నా తల్లీ తెలంగాణా ‘ అనే కవితలో తెలంగాణా రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఆశించిన స్వేచ్ఛ దొరికినట్లేనా అని సందేహిస్తాడు.
“నువ్వు కోరుకున్న ఇల్లు కట్టుకున్నావు కానీ
కోరుకున్న స్వేచ్చా స్వాతంత్ర్యా లు
నీ గుండె సడిలో వినిపిస్తున్నాయా తల్లీ!”
అనడంలో కొంచెం విమర్శ ఉంది.
ఇంకా మత రాజకీయాల గురించీ, బాధ్యత లేని పాలకుల గురించీ, ఆశా నిరాశల మధ్య జరిగే సంఘర్షణల మధ్య సాగుతున్న ఆటల గురించీ, కవిత్వ భాష గురించీ ఈ కవి రాశాడు. మొత్తం గా చూస్తే ఈనాటి కవిత్వం లో ఇమిడిపోయిన క్లుప్తతనూ, గుప్తతనూ, లోతునూ ఈ కవి సాధించాల్సి ఉంది.
కవిత్వం రాయడం లోని పడికట్టుతనాన్ని కొంత పక్కన పెట్టగలిగిన రాజేశం, ‘నాయనమ్మ చెప్పిన కధల్లోని పలుకులు /జీడీ పలుకులంత కమ్మగా ఉంటై ‘అని గమనించగలిగిన రాజేశం, అమ్మలక్కల చీర కొంగుల నుంచి రాలిపడే మాటల్లో తెలుగు తల్లిని చూసిన రాజేశం ముందు ముందు కవిత్వం లో మరింత తేజస్సునూ లోతునూ సాధించగలడనే నమ్మకం కలుగుతుంది. సమకాలీన సంవేదనలు మెండుగా ఉన్న కవిత్వమిది. అందుకు కవి రాజేశం కు అభినందనలు.

Leave a Reply