పిల్లలు వర్ధిల్లాలి
పిల్లలు వర్థిల్లాలి
విఠపు బాలసుబ్రహ్మణ్యం, సి. వి. కృష్ణయ్య
వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ
******
ప్రకృతి మనిషికి అందమైన ప్రపంచాన్నిచ్చింది. ఆస్వాదించే మనసిచ్చింది. ఇంకా తనేదో లోటు చేస్తున్నాననుకుందేమో పిల్లలను సృష్టించింది. పిల్లలు ప్రపంచానికి అద్దే రంగులు ఏ చిత్రకారుడు మాత్రం అందించగలడు?! అలవోకగా నవ్వుల్ని పూసే ఆ ముఖాలు ప్రపంచానికి ఎంతటి ఆనందాన్ని, శాంతిని అందిస్తాయో!
పిల్లలు ఊహ తెలిసే కొద్దీ స్వతంత్రంగా చుట్టూ ఉన్న లోకంతో అనుబంధాన్ని ఏర్పాటుచేసుకుంటారు. తమ ఊహకు, అనుభవానికి అందే అనుభూతులతో ఒక కొత్త లోకాన్ని వాళ్ల మనసులు ఆవిష్కరిస్తుంటాయి. నెలల పిల్లలుగా తల్లి స్పర్శను, గొంతును గుర్తు పట్టేస్తారు. ఊపిరి పీల్చినంత సహజంగా తమకంటూ ఇష్టాయిష్టాలను ఏర్పరచుకుంటారు. స్వేచ్ఛని, స్వతంత్రాన్ని తమ హక్కుగా భావిస్తారు. అక్కడే పెద్దలతో పేచీ మొదలవుతుంది. పిల్లల పట్ల, వారిని పెంచటం పట్ల పెద్దల అవగాహన మేరకు పిల్లలు పెరగాల్సిరావటం అసలైన విషాదం.
పిల్లల్లో సహజంగా కనిపించే కుతూహలం వాళ్లల్లో బోలెడన్ని ప్రశ్నల్ని రేపుతుంది. వాళ్ల మనసుల్ని అర్థం చేసుకుని ఓర్పుగా, ప్రేమగా ప్రతిస్పందించే పెద్దలు పక్కన ఉంటే ఆ పిల్లలు ఆరోగ్యవంతంగా పెరుగుతారు. ఇల్లు తరవాత పిల్లల మానసిక వికాసానికి దారులు వేసేది బడి. బడిలోనూ బయటి ప్రపంచంలోని వేగం, పోటీలే. మరింత జ్ఞానం, మరింత పోటీ, మరింత ఒత్తిడి. పిల్లలకి సందేహాలు తీరే దారి లేదు.
ఈ ఆలోచనలకి కారణం జూలై నెలలో ప్రచరించబడిన పిల్లలు వర్ధిల్లాలి పుస్తకం!
పుస్తక రచయితలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, సి. వి. కృష్ణయ్య.
బడికి సంబంధించిన ఏ విషయమూ పిల్లల్ని బడికి దూరం చెయ్యరాదని విఠపు చెప్పగా, పిల్లలతో మమేకమయేందుకు తను ఎంచుకున్న మార్గాలను కృష్ణయ్య వివరించారని ముందుమాటలో ప్రొఫెసర్ యల్. ప్రతాపరెడ్డి చెప్పారు.
ప్రొఫెసర్ రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ఈ పుస్తకం విద్యావ్యవస్థను కాపాడుకుంటే మొత్తం వ్యవస్థ బాగుపడుతుందన్న బాధ్యతను మనందరికీ గుర్తు చేస్తోందంటారు.
మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ఆర్. వెంకట్ రెడ్డి ఈ పుస్తకం మన విద్యారంగంపై సమకాలీన రాజకీయ చర్చకు దారితీసి ఒక ప్రత్యేక విద్యావిధానం రూపొందేందుకు దోహదపడుతుందంటారు.
విద్యా వ్యవస్థలోని పరిశోధనలు, వాస్తవాలు, గణాంకాలు విఠపు చెప్పగా, పిల్లలతో తన ప్రయోగాలు, అనుభవాలు కృష్ణయ్య చెప్పారు. ఈ వ్యాసాలు జనవిజ్ఞానం, దారిదీపం పత్రికలలో ప్రచురించబడ్డాయి.
పిల్లలే ప్రపంచం! పిల్లలే భవిష్యత్తు! పిల్లలు బలహీనుల్లోకల్లా బలహీనులని, వారి అవసరాలను వారు చెప్పుకోలేరని చెపుతూ పెద్దలు వాటిని గుర్తించాలంటారు విఠపు.
“మీ సోషలిస్ట్ రాజ్యంలో కూడా ప్రత్యేక హక్కులున్నవారు వుంటారా” అని సోవియట్ రష్యా నాయకుల్ని విదేశీ విలేఖరులడిగినప్పుడు “లేకేం? మా బాలబాలికలున్నారు” అన్నారట. ఇది విశ్వకవి రవీంద్రుణ్ణి తన్మయుణ్ణి చేసిందట. పిల్లల స్వేచ్ఛకూ, స్వాతంత్రానికి, ఆత్మగౌరవానికి ఇప్పుడు మొదటి అడ్డంకి బడే అన్న అభిప్రాయం పెరుగుతోంది. “బడి లేని సమాజం” కోసం ఇవాన్ ఇల్యిచ్ ఉద్యమాన్ని లేవదీసారు. బడిని, చదువుల్నీ మరమత్తు చేసేందుకు పోరాటం చేసి వోడిపోయి “పసి పిల్లలకు బడి లేని చదువే సరైంద” న్న నిర్ణయానికొచ్చాడు జాన్ హోల్ట్.
ప్రపంచవ్యాప్తంగా ఒంటరి జీవితాలకి పెరుగుతున్న ఆదరణ భవిష్యత్తులో పిల్లలు లేని ప్రపంచం వస్తుందా అన్న సందేహం కలుగుతోందంటారు రచయిత విఠపు. అప్పుడు సహోం లోన్ స్కీ తన హృదయాన్ని ఎవరికి అంకితం ఇవ్వాలి? శ్రీశ్రీ శైశవ గీతి, గిజూభాయి కలలు ఏమైపోతాయి?
ఆడపిల్ల మన ఆశ, మన భవిష్యత్తు
హిజాబ్ ధారణను నిషేధించిన కర్నాటక ప్రభుత్వ ఉత్తర్వులు, దానిని సమర్ధించిన హైకోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుధాంశు దులియా
“భారతదేశంలోని నేటి అత్యుత్తమ దృశ్యాల్లో ఒకటి ఏమంటే ఆడపిల్ల తన స్కూల్ బ్యాగ్ వీపు మీద పెట్టుకుని ఉదయం బడికి బయలుదేరడం”. అంటూ వ్యాఖ్యానించటం ఇప్పటి విద్యావిధానం పట్ల సుధాంశు దులియా చేసిన ధిక్కారం అంటారు రచయిత.
మారుతున్న గురుశిష్య ప్రేమానుబంధాలు!
గురువుకు అన్నీ తెలుసు, పిల్లలకేమీ తెలియదు లాటి దృక్పథాన్ని గ్రీకు దేశపు లిబరల్స్, రూసో నుంచి ఫాలోఫెయిరీ దాకా బద్దలు కొట్టే ప్రయత్నం చేసారు. పిల్లలకు హక్కులు, ఆత్మగౌరవం ఉంటాయి. వాటిని కాపాడే బాధ్యత బడిదే అన్న తత్త్వం మొదలైంది. క్రమంగా విద్య వ్యాపారమైపోయి సకల మానవ విలువలు చదువుల నుంచి మాయమైపోయాయి.
డిజిటల్ మాయాజాలంలో ఆబాలగోపాలం
పిల్లలు సెల్ ఫోన్ల మాయాజాలంలో చిక్కుకుపోవటమనేది పెద్ద సామాజిక సంక్షోభం. ఈ పరిస్థితుల్లో పదహారు ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా దూరంగా ఉంచాలన్న విజ్ఞత క్రమంగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుండటం ఆశాజనకంగా ఉంది.
బడే భవిష్యత్తు, బడే భరోసా!
బడి పిల్లలది కనుక అది వారి అవసరాలకు తగినట్టుగా ఉండి బాల్యానికి భరోసా ఇవ్వాలి. బడి తల్లి ఒడికి ప్రత్యామ్నాయం కావాలి.
“బడి వదిలాక బిడ్డలో ఏది మిగిలిపోతుందో అదే జ్ఞానం” ఐన్ స్టీన్ స్వీయానుభవంతో చెప్పారు. తక్షణ నైపుణ్యాలనే శాశ్వత జ్ఞానం కింద జమ కడుతోంది ఇప్పటి విద్యా వ్యవస్థ. పిల్లల చదువుల కోసం ఎన్నడూ లేని స్పృహ ప్రస్తుతం సమాజపు కింది పొరలదాకా విస్తరిస్తోంది. కానీ, ఎలాటి చదువులు, బడులు ఉండాలో తెలియదు.
ఇంపోజిషన్ తో ఇక్కట్లు
పిల్లల స్థాయికి తగినట్టుగా బోధించలేని టీచరు అశక్తత ఇంపోజిషన్ లాటి కఠినమైన శిక్షల్ని కనిపెట్టింది.
పిల్లలు వర్ధిల్లాలి ప్రపంచంలోని మొదటి వైజ్ఞానికుడు ఎవరన్న ప్రశ్నకు అబ్దుల్ కలాం “శిశువు” అన్న జవాబు చెప్పారు. శిశువు పుట్టినప్పటినుంచి చేసే కదలికలు, ధ్వనులు, హావభావాలకు సంబంధించి ప్రయోగాలు చేసిన జాన్ హోల్ట్ పిల్లలు ఎలా నేర్చుకుంటారు వంటి పుస్తకాలు రాసారు.
పిల్లలు ఎవరికి వారు ప్రత్యేకమన్న స్పృహ లేని బడులు పిల్లలని బడి పట్ల విముఖులుగా మారుస్తున్నాయి.
గురుస్థానం పదిలమేనా? ప్రపంచం అంతా వ్యాపార సంస్కృతిని ప్రతిబింబిస్తుంటే విద్య సామాజిక, ఆర్థిక అసమానతల్ని స్థిరపరుస్తూంది. విద్యారంగంలోకి తోసుకొస్తున్న సాంకేతిక విప్లవం గురుస్థానాన్ని బీటలు వారుస్తోంది.
చిక్కుల్లో చిన్న స్కూళ్ళు!
తగిన వసతులు కల్పించలేని ప్రభుత్వాలు అనేక కారణాలు చూపి చిన్న స్కూళ్లను మూసివేస్తున్నాయి. కాలానుగుణంగా బలమైన సొంత పాఠశాల విద్యావ్యవస్థను నిర్మించుకున్న కేరళ, ప్రపంచ బ్యాంక్ జోలికి పోని పశ్చిమ బెంగాల్, బీహార్, ఢిల్లీ లాటి రాష్ట్రాలు ఇలాటి సమస్యలను అధిగమించాయి.
జ్ఞానం – మౌనం సమాచారమే జ్ఞానమన్న నమ్మకం బోధకులతో వచ్చిన సమస్య. దానికి ప్రపంచపు వాస్తవాల్ని అర్థం చేయించే శక్తి లేక మనిషిని సర్దుకుపోయేవాడిగా మారుస్తోంది. ప్రశ్నించే గుణం పిల్లలదన్న వారసత్వం ఉపనిషత్తుల కాలం నుంచీ ఉంది.
కొత్త చదువుల్లో సరికొత్త మనో ‘విజ్ఞాన’ శాస్త్రం!
ఆధునిక మనో విజ్ఞాన శాస్త్రం, శరీర శాస్త్రం పిల్లల వికాసం గురించి ఎన్నో పరిశోధనలు చేసాయి. పరిసరాలు గమనిస్తూ వాటితో చేసే ప్రయోగాలు, ఆటలు ద్వారానే శిశువు తొలిదశలో నేర్చుకుంటాడు. కొనసాగింపుగా బడిలో విద్య శిశువే ప్రధానంగా, శిశువే కేంద్రంగా ఉండాలి. మన నూతన విద్యావిధానపు ప్రణాళికలు పిల్లల వికాసానికి ఉపయోగపడేవిగా లేవు.
నూతన విద్యావిధానం – విశ్వవిద్యాలయాలు
ఆధునిక భారతదేశ నిర్మాణంలో అనితర పాత్ర పోషించిన మహాబోధివృక్షాల్లాంటి మన విశ్వవిద్యాలయాలు నూతన విద్యావిధానం ద్వారా స్వేచ్ఛా స్వతంత్రాల్ని కోల్పోయాయి. విద్యను కార్పొరేటీకరించటంతో పాటు అధ్యాపకుల, విద్యార్థుల స్వేచ్ఛను, హక్కుల్ని, భాగస్వామ్యాన్ని ఇప్పటి విద్యావిధానం పట్టించుకోదు. అంతర్జాతీయ అవసరాలు, ప్రమాణాలు గురించి చెపుతూనే వీటికి మన ప్రాచీన సంప్రదాయాల్ని, జ్ఞాన వ్యవస్థల్ని పునాది చేసుకొమ్మంటోంది.
ఉన్నత విద్యారంగం చుట్టూ ఊహాలోక విహారం
“అఖిలభారత ఉన్నత విద్యా సర్వే – 2025” గణాంకాల ప్రకారం 2022 – 23 లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 60.9 శాతం. వాస్తవానికి ఉన్నత విద్యలోకి వెళ్తున్నది 2022 నాటికి కేవలం 28.4 శాతం మాత్రమే. సామాజిక ఆర్థిక సాంస్కృతిక పరిస్థితులు ఆయావర్గాల్ని వెనుకే ఉండిపోయేలా చేస్తున్నాయన్నది వాస్తవం. విద్య సరుకుగా మారాక విద్యా ప్రమాణాల స్థాయి అడుగంటింది.
ప్రాథమిక విద్యారంగంః ప్రస్తుతం – ప్రత్యామ్నాయం
స్వాతంత్రానంతరం విద్యను ఒక రాజకీయ సామాజిక తక్షణ లక్ష్యంగా మనం ఎంచుకోలేదన్నది చేదు నిజం.
అన్ని దేశాల్లోనూ స్థానిక ప్రజావ్యవస్థలూ, తల్లిదండ్రులు బడి నిర్వహనలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మన వ్యవస్థలో బడి కేవలం అధికారులకే జవాబుదారీ. ప్రభుత్వం అందరికీ నాణ్యమైన విద్యను అందించేలా బలమైన వ్యవస్థను ఏర్పాటు చేసి, వాటి నిర్వహణకు ప్రజా వ్యవస్థల్ని తోడు చేసుకోవాలి.
కథలు చదవని మనుషులు
పుస్తకాలు చదువరిలో మంచి భావనలు కలిగించి మానవతా సింహాసనం పై కూర్చోబెడతాయంటారు బాల్యంలో కథలు వింటూ పెరిగిన రచయిత కృష్ణయ్య.
ప్రస్తుత చదువులు కేవలం శాస్త్ర జ్ఞానానికి పెద్దపీట వేసి మనిషిని యంత్రంగా మారుస్తున్నాయే తప్ప పుస్తకాల్ని చదవటంలో ఉన్న ఆనందాన్ని నేర్పటం లేదు. మనిషి గుండెను తట్టిలేపే అనుభవాల్ని కలిగించటం లేదు. మనుషుల ఊహలకు, కల్పనలకు, ఆకాంక్షలకు ఊపిరి పోసి వాటిని శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాస్త్రాల ద్వారా నిజం చేసుకునేలా చేస్తుంది సాహిత్యం.
బడి బయట పాఠం – భయం భయంగా…
చిన్నతనంలో ఆటలాడుతూ పాము పుట్టపై రాళ్లు విసిరిన కృష్ణయ్య పాము వెంటపడటంతో పరుగెత్తారు. అది పగబడుతుందని విని భయపడతారు. క్రమంగా పాముల గురించిన శాస్త్రీయ విషయాలు పుస్తకాల్లో చదివి అది మూఢ నమ్మకమని అర్థం చేసుకుంటారు. పుస్తకాలు చదవటం వల్లనే జ్ఞానం సంపాదిస్తామంటారు.
బడి బయట పాఠం – అమాయకంగా
చదువు పూర్తై ఒక పల్లెలో ఉద్యోగంలో చేరిన రచయిత ఒక రోజు రోడ్డు మీద జరిగిన ఘర్షణ చూసి పోలీసులకు సాక్ష్యం చెప్పి సహకరించేందుకు ఒక పౌరుడిగా బాధ్యత అనుకుని ముందుకొస్తారు. కానీ పోలీస్ స్టేషన్ లో అబద్ధం సాక్ష్యం ఇవ్వమన్నప్పుడు ధైర్యంగా అది తన వల్ల కాదని చెప్పి వచ్చేస్తారు. పాఠాల్లో చదువుకున్నట్టు పోలీసులు రక్షించేందుకు, కోర్టులు న్యాయం చేసేందుకు మాత్రం తన అనుభవంలో రాలేదని, ఈ వాస్తవాల్ని బడిలో నేర్పనేలేదని అంటారు.
పిల్లల సైకాలజీని పట్టించుకోని బోధన
ప్రతి పిల్లవాడి వ్యక్తిగత స్థాయిని బట్టి పాఠాలు చెప్పాలన్నది రచయిత గట్టి నమ్మకం. తన అనుభవంలో ఎదురైన రెండు ఆసక్తికరమైన సంఘటనలను ఇక్కడ చెప్పారు. “నీకేం రాదు” అని పెద్దలు నిరుత్సాహ పరచటం పిల్లల పట్ల చేసే అతి పెద్ద తప్పు. స్నేహం, స్వేచలతో పాటు భయం లేని వాతావరణంలో పిల్లలు ఇష్టంగా చదువుకుంటారంటారు.
పాఠాలు గుణపాఠాలు
జీవితంలో జరిగే ఎన్నో సంఘటనలు మనకి ఎన్నెన్నో పాఠాలు చెపుతున్నా చాలాసార్లు వాటిని పట్టించుకోం.
పిల్లలు తప్పు చేస్తే నిలబెట్టి సారీ చెప్పిస్తాం. పెద్దలు తప్పు చేసినప్పుడు పిల్లలకు సారీ చెప్పరు. తరగతిలోని పిల్లలు ఎదిరించినప్పుడు తన వలన వాళ్ల మనసులు నొచ్చుకున్నాయన్న భావనతో తానే సారీ చెప్పటం ద్వారా ఆ పిల్లల జీవితాల్లో మంచి మార్పును తీసుకొచ్చిన సంఘటనలను కృష్ణయ్య చెప్పారు. ఇలాటి ప్రేమ, అవగాహన టీచరులో ఉన్నప్పుడు పిల్లలు తమ తప్పులు సరిదిద్దుకుని మంచిగా మారతారు. .
అర్థం చేసుకోకుండా చదివితే ఏమవుతుంది?
కొత్త విషయాన్ని తెలుసుకునేప్పుడు పిల్లల్లో ఆనందం, ఉత్సాహం కలిగి ఎన్నో ఆలోచనలు రేగుతాయి. కానీ మన తరగతి గదిలో పాఠాల్ని పిల్లలు చదవటం, ప్రశ్నించటం, చర్చించటం ఉండవు. పాఠాన్ని ఉపన్యాసంలా విని, జవాబుల్ని కంఠస్థం చేస్తారు. అది అవగాహన ఇవ్వదు.
పరీక్షలు – మార్కులు – పోటీలు
టీచర్లు, తల్లిదండ్రులు, తోటి పిల్లలు ఇలా అందరూ మార్కుల గురించి ఒక ఒత్తిడిని, భయాన్ని విద్యార్థికి కలిగిస్తారు. అది విద్యార్థిలోని సహజమైన ఉత్సాహాన్ని, తెలివితేటల్నికూడా ప్రభావితం చేస్తుంది. “పరీక్షలు పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాలపై ప్రభావం చూపిస్తాయని” చెప్పిన ఐన్ స్టీన్ మాటల్ని పట్టించుకోము కానీ ఆయన విశ్వం గురించి చెప్పిన భౌతిక సూత్రాల్ని నమ్ముతాము.
బాల్యం ఎందుకు ఆనందంగా ఉండాలి?
బాల్యంలో శిశువు ఎలాటి వాతావరణంలో పెరిగితే ఎలాటి వ్యక్తిగా తయారవుతాడన్నది పెద్దలకి తెలియదు. బాల్యం బాధ్యతలు, బరువులు, వివక్షలెరుగని అమాయకపు ఆనందకరమైన కాలం. బాల్యపు జ్ఞాపకాలు ఆనందాన్నివ్వాలి. ఆనందంగా ఎదిగిన బాలల సమాజం ప్రపంచాన్ని సరైన దిశగా నడిపిస్తుంది.
పుస్తకం చదువుతుంటే పిల్లలకు సంబంధించిన ప్రపంచం ఎంత అస్తవ్యస్తంగా ఉందో, వాళ్లకు సరైన దారి చూపవలసిన బడి ఎంత అధ్వాన్న స్థితిలో ఉందో తెలిసి వ్యవస్థ మీద, దానిని తయారుచేసిన పెద్దల మీదా అసంతృప్తి, నిరాశ ఆవరిస్తాయి.
ఏది పిల్లలకు ఆనందమయమైన బాల్యాన్నిస్తుందో, మనసును తట్టిలేపి వాళ్లను సంపూర్ణ మానవులుగా చేస్తుందో అది ఇవ్వలేని పెద్దరికం ఏం పెద్దరికం? పాపాయి పుడుతోందంటే ఆర్భాటాలు చేసే పెద్దలు పాపాయికి అవసరమైనది అందివ్వలేకపోవటం శోచనీయం. పిల్లలకేం తెలియదు అని కొట్టిపారేసే పెద్దల్నే కదా తరాలుగా చూస్తున్నది. అలా పెరిగిన పిల్లలే ఇప్పటి పెద్దలు!
పిల్లల్ని ప్రేమించే ఇందరు ఉన్నప్పుడు వాళ్లకి లోటు ఎందుకుంటోందో?!
ఈ పుస్తకం చదవటం పెద్దలుగా మనలను మనం బాగుచేసుకుందుకు ఒక అవకాశం. రచయితలకు అభినందనలు.
ప్రచురణః జనవిజ్ఞాన వేదిక
ప్రథమ ముద్రణః జూలై 2026
వెలః రూ. 120/-

Leave a Reply