కవుల్లో తొలి సంస్కర్త -వేమన
వ్యాసకర్త: తోకల రాజేశం
********
భారత దేశం అనాదిగా అనేక కులాలతో విడిపోయి తద్వారా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నది.ఈ దేశంలోని అన్ని సమస్యలకు మూలం కుల సమస్య అని ఆధునిక కాలంలో అంబేద్కర్ మహాశయుడు చెప్పేదాక కులం గురించి అది పోషిస్తున్న దుష్ట పాత్ర గురించి చాలామందిలో కదలిక రాలేదు. అంబేద్కర్ కు ముందు ఈ తరహా ఆలోచనలు చేసిన వారు ఫూలే, భాగ్యరెడ్డి వర్మ. అయితే సాహిత్య సాంస్కృతిక రంగంలో కులం మొదలైన అనాగరిక ఆచారాల మీద మొదటిసారిగా దండెత్తిన వాడు వేమన. వేమన తన కాలం కంటే ఎంతో ముందుచూపును ప్రదర్శించిన కవి. తనకు ముందున్న ఏడు వందలేళ్ళసాహిత్య చరిత్రలో ప్రజల దృష్టితో ఆలోచించిన కవి వేమన మాత్రమే.వేమన సంఘ సంస్కరణ దృష్టిగల మొదటి తెలుగు కవి.
వేమన పదిహేడవ శతాబ్దిలో జీవించిన కవి.ఆనాటి రాచరికవ్యవస్థలో ఎన్ని అపసవ్యతలు ఉండాలో అన్నీ ఉన్నాయి.కుల దాష్టీకం, మతమౌఢ్యం, రాచపీడన ప్రజలను పట్టిపీడిస్తున్నాయి.ఒకరకంగా ఆనాటి అపసవ్యతలే వేమన కవిగా రూపొందటానికి కారణమై ఉంటాయి.
మాలవాని నేల మహిమీద నిందింప
నొడల రక్తమాంస మొకటి గాదె?
వానిలోన మెలగు వాని కులంబేది? అన్న ప్రశ్న ఆరోజుల్లో సామాన్యమైనది కాదు. ‘శివునిముందు అన్ని కులాల వారు ఒకటే ‘ అని చెప్పిన పాల్కురికి సోమనాథుడు, “బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే” అని రాసిన అన్నమయ్యల తరువాత కులం గురించి ఇంత గట్టిగా, స్పష్టంగా మాట్లాడిన తెలుగుకవి మరొకరు లేరు. ఈ స్పష్టత ఒక్క కులం విషయంలోనే కాదు ఏది చెప్పినా అంతే స్పష్టంగా, అదే కరుకుదనంతో చెప్పాడు వేమన.
వేమన తాత్విక ధారలో అచలము, శివయోగము, రాజయోగము కలిసి ఉన్నాయి. ఈ మూడింటి సమ్మేళనం ఆయన పద్యాలలో దర్శనమిస్తుంది. ఈ తాత్వికత మనుషుల మధ్య ఎటువంటి హెచ్చుతగ్గులనైనా ఖండిస్తుంది. మనిషికి, దేవునికి మధ్య గల సంబంధాన్ని మానవీయకోణంలో ఆవిష్కరిస్తుంది.దేవునికి జీవునికి అబేధాన్ని స్థాపిస్తుంది.
“తోలుకడుపులోన దొడ్డవాడుండగా
రాతి గుళ్లకేల రాశి పోయ” అని వేమన ఈ తత్వంలో నుంచే సమాజాన్ని ప్రశ్నించాడు.ఆయన ఆలోచనలు ఎంతో విప్లవాత్మకమైనవి. కులమతాల విషయంలో ఆయన శాస్త్రీయమైన పద్ధతిలో ఆలోచించాడు. కులం వద్దన్నాడు.మతానికి,దేవునికి పరిమితులు లేవన్నాడు.మనిషి నిజమైన మనిషిగా బతకటమే జీవిత పరమావధిగా నిర్ధారించాడు.
నీళ్ల మునుగనేల?నిధుల మెట్టగనేల?
మొనసి తీర్థములకు మొక్కనేల?
కపట కల్మషములు కడుపులోనుండంగ– అన్నది ఆధ్యాత్మిక జీవితం పట్ల వేమన దృక్పథాన్ని తెలియజేస్తుంది.ఇది ఏ కాలంలోనైనా ప్రజల కళ్ళుతెరిపించే అద్భుతమైన సూత్రీకరణ.విగ్రహారాధన పట్ల,మత శాఖలమధ్య ఘర్షణలపట్ల,దేవుని విషయంలో బ్రాహ్మణాధిక్యత పట్ల,అర్థంలేని మతాచారాల పట్ల సునిశితమైన విమర్శలు గుప్పించాడు వేమన్న.
వేమన హేతువాది.కాబట్టే ఆయన తన ముందుకు వచ్చిన ప్రతీ విషయాన్ని హేతుబద్ధంగా ఆలోచించి అర్థం చేసుకోగలిగాడు. తనకు ముందున్న సమాజాన్ని అధ్యయనం చేసి తననాటి పరిస్థితులతో పోల్చుకొని ఆనాటికంటే మెరుగైన సమాజాన్ని కలగన్నాడు. అందుకే తనకాలంనాటి మేధావులందరికంటే భిన్నంగా ఆలోచించగలిగాడు.ఈ క్రమంలో కేవలం వాస్తవ పరిస్థితిని వర్ణించటంతోనే ఆగిపోలేదు వేమన.ఆ పరిస్థితులు ఎట్లా మార్చుకోవాలో కూడా చెప్పాడు.ఆయన తాను జీవిస్తున్న సమాజం తాలూకు లోపాలు చెప్తున్నాడంటేనే ఆ సమాజంలో రావాల్సిన మార్పులను సూచిస్తున్నాడని అర్థం.ఆయన సమాజం గురించి ఏం చెప్పినా అవన్నీ నిప్పు లాంటి నిజాలు. అంతవరకు ఏ కవీ చెప్పని నిజాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. సమాజం కాస్తో కూస్తో మారాలంటే ఏనాడైనా వేమన లాంటి నిఖార్సయిన మనుషుల అవసరం ఉంటుంది.
వేమన మనిషికి సంబంధించిన ఆధ్యాత్మిక జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ-రెంటిలోను మార్పును కోరుకున్నాడు. ఆయన చెప్పిన పద్యాలన్నీ ఈ రెండు విభాగాలకూ లొంగుతాయి.బహుశా ఆయన గురువుగా అచల సిద్ధాంత బోధనలు చేస్తూ అవసరం రీత్యా పద్యాలను రాసి జనులకు హితబోధ చేసేవాడు కావొచ్చు. ఆ ఆశుశైలి వేమన రాసిన చాలా పద్యాలలో కనిపిస్తుంది.ఆ శైలి వల్లనే ఆయన పద్యాలు ప్రజలకు అంతలా చేరువయ్యాయి.సామాన్య ప్రజల నాలుకల మీద స్థిరనివాసాన్ని ఏర్పరచుకున్నాయి. కానీ తన పద్యాల వల్ల నొచ్చుకున్న ఆనాటి కొందరు పండితులు అసూయపడి ఆయన వివరాలేవీ నమోదు చేయలేదు. పెద్ద పెద్ద రచనలు చేసినప్పటికీ ప్రజల్లో వేమన్నకు ఉన్న పేరు మాకు లేదన్నది మరో కారణం కావొచ్చు.
ఆధునిక కాలంలో కూడా వేమన్నకు వివక్షే ఎదురైంది. ‘ఆంధ్రకవుల చరిత్రము’రాసిన కందుకూరు వీరేశలింగం, ‘కవిజీవితములు’ రచించిన గురజాడ శ్రీరామమూర్తి, ‘దక్కను కవుల చరిత్ర’ రాసిన కావలి రామస్వామి లాంటి సాహిత్య చరిత్రకారులు వేమనను ఉద్దేశపూర్వకంగా విస్మరించారు. వేమన భావాలతో ఏకీభావం లేకపోవటమొక్కటే దీనికి కారణంగా కనిపిస్తుంది. ఎందుకంటే 1829 లోనే సి.పి.బ్రౌన్ వేమన పద్యాలను మొదటిసారిగా అచ్చువేశాడు. వీళ్లంతా ఆ తరువాతి వారే. మేఘాలు కమ్ముకున్నంత మాత్రాన సూర్యుడు మరుగుపడిపోడు కదా! వేమన్నను ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా ప్రజలు గుర్తించారు. ప్రజల కోసం వేమన ఎలా నిలబడ్డాడో వేమనను ప్రజలు అలా అక్కున చేర్చుకున్నారు.నిస్సందేహంగా వేమన తెలుగు కవుల లోకంలో మొట్టమొదటి మహాకవి. ఆయన మీద పరిశోధన చేసిన ప్రసిద్ధ కవి, విమర్శకుడు డా:ఎన్.గోపి గారు చెప్పినట్లు ‘వేమన సమాజమనే మేడిపండు పొట్టవిప్పి పురుగుల్ని చూపించాడు. సమాజంలోని అన్యాయాలకు,దుర్మార్గాలకు కారణాలను అన్వేషించాడు. ఆ కారణాలను వెల్లడించి ఖండించాడు. పరిష్కారాలను దర్శించగలిగాడు. నీతిబద్ధమైన, బాధ్యతగల సమాజాన్ని వేమన ఆకాంక్షించాడు. అతని నైతిక చక్రానికి ఇరుసు ప్రేమ. కాబట్టి వేమన ప్రజాకవి’.
