కవితాసూర్యుడు
వ్యాసకర్త: తోకల రాజేశం
*****
తెలుగు సాహిత్య చరిత్రలోనే అలిశెట్టి ప్రభాకర్ గారిది ఒక విశిష్టమైన స్థానం.ఆయనలాగ రాసిన వాళ్లుగానీ, ఆయనలాగ పేరుమోసినవాళ్ళు గానీ తెలుగులో మరొకరు లేరు.ప్రభాకర్ సాహిత్య రంగంలో కేవలం కవిత్వాన్ని మాత్రమే పట్టుకున్న కవి.కానీ నిజమేమిటంటే ఆయన చైతన్యం కలిగిన గొప్ప సామాజిక విమర్శకుడు. ఆయన చేసిన విమర్శ మొత్తం కవిత్వ మాధ్యమంగానే సాగింది.ఆయన కవిత్వ మాధ్యమం ద్వారా చేసిందంతా సామాజిక విమర్శనే. ఆయన ఎంత సునిశిత విమర్శకుడో ఆయన కవిత్వం చదివిన వాళ్లందరికీ తెలుసు.ఆయన విమర్శకు ఏదీ అతీతం కాదు.ఎవరూ అతీతులు కాదు. భక్తి దగ్గరినుంచి రాజకీయాల దాకా ఎక్కడ ఎటువంటి లోపం కన్పించినా తన కవిత్వం ద్వారా దానిని ఖండించేవాడు.నిజం చెప్పే సందర్భంలో కవికి ఎలాంటి దాపరికాలు,మొహమాటాలూ ఉండకూడదనేది అలిశెట్టి తన ఆచరణ ద్వారా నిరూపించిన సత్యం.’కవిత్వం ఎలా రాయాలి? ‘అనే ప్రశ్నకు సరియైన సమాధానంలాంటి కవిత్వం రాశాడు అలిశెట్టి.చాలా మందికి కవిత్వం ఎలా రాయాలో తెలుస్తుందే కానీ ఎందుకు రాయాలో అన్న అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది.కవిత్వం కూడా ఈ అసమ సమాజం మీద పోరాడటానికి ఒక పోరాట రూపమేనన్న స్పష్టమైన ఎరుక ఆయన కవితల్లోనే అంతర్లీనంగా కనిపిస్తుంది.
ప్రభాకర్ కవిత్వం రాస్తున్న కాలంలో మినీకవితల విజృంభణ కొనసాగుతోంది.తక్కువ పదాల్లో ఎక్కువ భావాన్ని చెప్పటం మినీకవిత ప్రత్యేకత. అంటే మినీకవితలో ఒక మెరుపు ఉంటుంది.ఒక చరుపు ఉంటుంది.తెలుగులో మినీ కవిత్వాన్ని ప్రతిభావంతంగా రాసిన వాళ్ళు చాలా తక్కువ.అలిశెట్టి ప్రభాకర్ లాగా రాసిన వాళ్ళు తెలుగులో ఎవరూ లేరు.మినీకవితకు పర్యాయపదంగా మారిపోయాడు అలిశెట్టి.అంతలా తెలుగులో మినీకవిత్వాన్ని పండించాడు. మామూలు వాక్యాలు ఆయన చేతిలోపడి కవిత్వంతో ప్రాణం పోసుకొని కొత్తగా దర్శనమిస్తాయి. చదువురాని వాళ్లకు సైతం అర్థమయ్యేలా కవిత్వం రాయటం ఆయన ప్రత్యేకత.బహుశా తాను ఏ పేదవాళ్ళ కోసమైతే కవిత్వం రాస్తున్నాడో వాళ్లకు కూడా అర్థమయ్యేలా రాయాలని నిశ్చయించుకున్నాడు కావొచ్చు.ఆయన ఆశయానికి నిర్మాణపరంగా మినీకవిత సరియైన జతగా మారింది. అందుకే తన కవిత్వంలో బరువైన పదాలుండవు.నోరు తిరగని వాక్యాలుండవు. రోజూ మాట్లాడే మాటలే.రోజూ బయట వినిపించే పదాలే.కానీ ఆయన కూర్పులో చేరి అగ్గిని పుట్టిస్తాయి. చెదలు పట్టిన మెదళ్ల దుమ్ము దులుపుతాయి.వ్యవస్థ పట్ల అప్పటిదాకా మనకున్న చూపును మారుస్తాయి. మన కళ్ళకు కొత్త చూపునిస్తాయి.
తెలుగు సాహిత్యంలో శ్రీశ్రీ లాగా ఎక్కువ సందర్భాల్లో ‘కోట్’ అయిన కవిత్వం అలిశెట్టిది. దానికి ఒక కారణం ఆయన కవిత్వ నిర్మాణంలో శిల్పం పట్ల తీసుకున్న శ్రద్ధ అయితే మరొక కారణం ఆయన నిబద్ధత.తాను ఏ ఆశయాల కోసమైతే కవిత్వం రాశాడో ఆ ఆశయాలతోనే జీవించాడు.తనకున్న ప్రతిభకు సినిమా రంగంలోకి వెళ్లి ఉంటే ఆయన జీవితం మారిపోయి ఉండేది. ప్రభాకర్ కేవలం కవి మాత్రమే కాదు అద్భుతమైన ఫోటోగ్రాఫర్. అంతకు మించిన అద్భుతమైన చిత్రకారుడు. కటిక పేదరికంలో కూడా తన వ్యక్తిత్వాన్ని కానీ కళలను కానీ అమ్ముకోలేదు.క్షయ వ్యాధి సోకినప్పుడు కూడా కనీసం మిత్రులను సైతం సహాయమడుగని ఆత్మాభిమానం ఆయనది.అదే దుర్భరమైన పేదరికంలో 1993 జనవరి12 నాడు అంటే తన పుట్టిన రోజునాడే మరణించాడు. 1956 లో జన్మించిన అలిశెట్టి కేవలం 37 సంవత్సరాలే జీవించాడు.అందులో 20 ఏళ్ల పాటు కవిత్వం రాసాడు.నిజానికి ఆయన పుట్టిందే కవిత్వం కోసమేమో అన్నట్టు బతికాడు. అదే స్ధాయిలో రాశాడు.ప్రభాకర్ కవిత్వ తత్వం అర్థం కావాలంటేఆయన రాసిన “వర్గతత్వం” అన్న ఒక్క కవిత చాలు.
“మెతుకులేరుకోవటం మీ విధి
మీ కడుపులు నిండకుండా చూసే బాధ్యత మాది
మెడలు వంచి శ్రమించటం మీ ఖర్మం
మీ వెనుక మేడల్లా నిలబడి పర్యవేక్షించటం మా కర్తవ్యం
మీరు పునాదుల్ని తవ్వుతూనే ఉండండి
మిమ్మల్ని పూడ్చిపెట్టే పూచీ మాది”.
తెలుగులో ఎన్నోవందల మంది కవులు పుట్టిపోయారు. కానీ అలిశెట్టిలాంటి కవులు చాలా అరుదు. తనలాంటి కవిత్వం కూడా అరుదే. ప్రపంచస్థాయిలో నిలవదగిన కవిత్వం తెలుగులో ఎవరిదన్నా ఉన్నది అంటే అది అలిశెట్టిది మాత్రమే.’మరణం తన చివరి చరణం కాద’ని చెప్పుకున్న కవిత్వవీరుడు ఆయన.తెలుగులో నిరంతరం ప్రజ్వరిల్లే కవితాసూర్యుడు అలిశెట్టి.
*******
వ్యాస రచయిత గురించి: తోకల రాజేశం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం ఆవడం గ్రామానికి చెందిన వారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. 9 వ తరగతి చదువుతున్నపటి నుంచే పద్యాలు రాస్తున్నారు. వీరి ఊరు ఆవడంలో చదివే పిల్లలు 20 మందితో శతకాలు రాయించారు. ఇప్పటివరకు వీరు తెలుగు బాల శతకం(2006), చెమట చుక్కలు(నానీలు-2010), పాతాళ గరిగె (సాహిత్య వ్యాసాలు-2013), అడవి దీపాలు(వచన కవిత్వం-2017), మంచిర్యాల జిల్లా సాహిత్య చరిత్ర (2020), కొబ్బరి నీరా! శతకం (పదిమందితో కలిసి-2023), మట్టి విజయం (పద్యకవిత్వం-2024) అనే పుస్తకాలు ముద్రించారు. తెలుగు నాట ప్రతిష్టాత్మక ఎక్స్ రే ప్రధాన పురస్కారం (2012), సినారె పురస్కారం(2023) తో పాటు రాష్ట్రస్థాయిలో పలు పురస్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదికకు మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు.
