ఆహ్లాదపురం ఆరో వీధి

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

**********

నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాల అనుభవాలు, సన్నివేశాలు ఏ ఇద్దరికి ఒక్కలా ఉండవు. ఎవరి జీవితం వారిది. ఎవరి అనుభవాలు వారివి. ఎవరి సమస్యలు, పరిష్కారాలు వారివి. ఎవరి సంతోషాలు, దుఃఖాలు వారివి. ఎన్నెన్ని వైరుధ్యాలో! 

అయినా, చిత్రంగా ఇవే మనిషిని మనిషికి దగ్గర చేసేవి. ఒక సహానుభూతి, సారూప్యత మనుషుల మధ్య సంబంధాల్ని నిర్వచించి, దగ్గర చేస్తుంది. ముందడుగు వేసేందుకు శక్తినిస్తుంది. జీవితపు రహదారిలో నడిచినంత మేరా కాల ప్రవాహంలో ఏ గురువూ నేర్పలేని పాఠాల్ని అడుగడుగునా స్వయంగా నేర్పుతూంటుంది. నేర్చుకోనంటూ మొండికేసిన అల్లరి పిల్లల్ని గురువు బుజ్జగించో, దండించో మంచి చెడుల్ని నేర్పినట్టే సహనంతో మనవెంట నిలబడుతుంది. ఎంత గొప్పది జీవితం!   

ఇటీవల చదివిన ఆహ్లాదపురం ఆరో వీధి కథా సంపుటి ఈ ఆలోచనల్ని కలిగించింది. రచయిత కొల్లూరి సోమశంకర్. ఈ సంపుటిలో పధ్నాలుగు కథలున్నాయి. అవి దాదాపు పాతికేళ్ల కాల వ్యవధిలో రాసినవి. అన్ని కథలూ వివిధ పత్రికలలో ప్రచురించబడినవే. కొన్ని కథలు కన్నడ, హిందీ భాషల్లోకి అనువాదం అయ్యాయి. కొన్ని కథలకు నేపథ్యాన్ని వివరించారు రచయిత. 

జీవన గమనంలో రచయితకు ఎదురైన అనుభవాల్ని, సంఘటనల్ని ఆలంబనగా చేసుకుని రాసినవి ఈ కథలు. రచయిత నిబద్ధతను చూపుతూ కథావస్తువు ని గురించిన అవసరమైన సమాచారాన్ని కూడా కథ చెపుతుంది. అయితే, ఆ సమాచారం ప్రస్తుత కాలానికి ఎంతవరకు మార్పుచేర్పులకు లోనై ఉంటుందో ఒక్కసారి గమనించుకోవాలన్న సూచన కూడా రచయిత ఇచ్చారు.

కొన్ని కథల్ని పరిచయం చేస్తాను.

రూపాయల పుస్తకం తెలుగు భాషకి ఒక కొత్త పదాన్ని సృష్టించాడు కథలోని పసివాడు. ఆకాశపు హద్దుల్ని కూడా చెరిపి వెయ్యగలదు పిల్లల ప్రపంచం. పిల్లలకి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిచయం చేసేస్తున్నాం అనుకుంటుంది పెద్దరికం. నిజానికి కొత్త ఊహల్ని, అనుభవాల్ని అందించటంలో పిల్లలే ఎప్పుడూ ముందుంటారు. 

బడికి వెళ్లాలన్న ఆశ ఒక పసివాడికి తాతయ్య పెట్లోని రూపాయల పుస్తకం పట్ల వ్యామోహం కలిగిస్తుంది. మామూలు కాగితానికి, రూపాయి కాగితానికి వ్యత్యాసం తెలియదు వాడికి. అయినా తన సమస్యకు తానే పరిష్కారం వెతుక్కోవాలన్న ఆలోచనను కుటుంబ ఆర్థిక పరిస్థితే నేర్పుతుంది ఈ కథలో.

అతడు ఆమె ఇంటర్నెట్ ప్రస్తుత సమాజం ఇంటర్నెట్ ని శ్వాసిస్తోందన్నది నిజం. శాస్త్ర సాంకేతిక రంగాలు అందించే ఏ సౌకర్యాన్నైనా వ్యక్తి తన స్వంత విజ్ఞతను ఉపయోగించుకుని మాత్రమే వాడుకోవాలని చెప్పే కథ. అది మర్చిపోతే వ్యక్తికే కాక సమాజానికి కూడా ప్రమాదమే అన్న హెచ్చరికను అందిస్తుంది.

ఆహ్లాదపురం ఆరో వీథి సమాజంలో ఉండే అన్నిరకాల వ్యక్తులు ఈ వీధిలో కనిపిస్తారు. పక్కపక్క ఇళ్లల్లో ఉంటూ ఒకరిని చూసి ఒకరు ఈర్ష్యాసూయల్ని పెంచుకోవటం, ఎదుటి వ్యక్తుల్లో లోపాల్ని చూసి హేళన చెయ్యటం, ఒకరితో ఒకరు పోటీ పడి డాబు దర్పాల్ని ప్రదర్శించాలనుకోవటం మనుషుల్లో ఉండే బలహీనతల్ని చెపుతాయి. దీనికి ఎవరూ అతీతులు కాకపోయినా తోటివారికి చేతనైనంత ఊతాన్నిద్దామనుకునే మనస్తత్వాల్ని పెంచుకోవటం ఆదర్శ జీవితానికి దారులు పరుస్తుంది. మనిషి సంఘ జీవనానికి మొగ్గు చూపింది ఈ ప్రయోజనం కోసమే.

వారఫలం దినపత్రికలలోనూ, వారపత్రికలలోనూ వారఫలాలను చదివేవాళ్లు ఉంటారు. నమ్మినా, నమ్మకపోయినా సరదాగా అయినా చదువుదాం అనుకునేవాళ్లు కూడా తమ రాశి ఫలాల్లో ఏమాత్రం సానుకూలమైన సంగతులున్నా తమకేదో లాభం చేకూరబోతోందని ఎదురుచూస్తారు. కథలో మోహన్ తన జీవితంలో ఏదో మార్పు రాబోతోందని వారఫలాల్లో చూస్తాడు. ఎప్పటినుంచో ఎదురుచూసే తమ కోరిక ఫలించబోతోందేమో అన్న భార్య మాటలు అతన్ని ఆలోచనలో పడేస్తాయి. భవిష్యత్తు మీద ఆశ లేనిదెవరికి? తల్లి మాటల్లో మోహన్ కి ఆ మార్పేమిటో, దానికి తన కర్తవ్యం ఏమిటో గ్రహింపుకొస్తుంది. సహజమైన కథ. సగటు జీవితాల్లో కనిపించే దృశ్యం.

కొడుకే కావాలా? మగపిల్లవాడి పుట్టుక కుటుంబాల్లో ప్రాముఖ్యత కలిగిన విషయమనేది పురుషాధిక్య సమాజంలో తరతరాలుగా స్థిరపడిపోయిన విషయం. ఆడపిల్లైనా, మగపిల్లవాడైనా తల్లిదండ్రులు, చుట్టూ సమాజమే వాళ్ల వ్యక్తిత్వాల్ని తీర్చిదిద్దేదన్న వాస్తవాన్ని మరిచిపోయే పెద్దలు పిల్లల భవిష్యత్తు గురించి ఏమి ఆశించగలరు? ఆసుపత్రుల్లో అప్పుడే పుట్టిన మగపిల్లల్ని ఆడపిల్లల స్థానంలోకి మార్పు చేసే మోసపూరిత చర్యల గురించిన వార్తలు మనుషుల్లో స్వార్థం, మూఢనమ్మకాల్ని బహిరంగంగా చూపిస్తూ, భయపెడుతున్నాయి. 

నిశ్శబ్దానికి మరోవైపు మన లైబ్రరీల పరిస్థితి గురించి ఎన్నో విషయాల్ని వివరిస్తుంది. వ్యక్తిత్వాల్ని, సమాజాన్ని వికసింపజేసే పుస్తకం విషయంలో ఆర్థిక అంశాలు ఇంత బలహీనంగా ఉన్నాయెందుకో! పుస్తకాల్ని ప్రేమించి, పూజించే లైబ్రేరియన్లు చేసే నిస్వార్థసేవ ఎంత గొప్పది! ఆర్థికంగా భారమైనా లైబ్రరీలను బతికించుకుందుకు వారు వ్యక్తిగతంగా చేసే త్యాగాలు ఎందరికి అర్థమవుతాయి. ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం గురించి నిజంగా నిబద్ధత ఉన్నవే అయితే లైబ్రరీల పట్ల తమ బాధ్యత ఎంత పెద్దదో గ్రహించాలి. కథలోని లైబ్రేరియన్ తన కష్టనష్టాల సంగతిని పట్టించుకోక పదిమందికీ ఉపయోగపడేలా పని చేస్తూ ఆత్మానందాన్ని పొందటం సంతోషం కలిగిస్తుంది. 

గట్టిమేలు స్వచ్ఛంద సంస్థలు సమాజమంతా తామరతంపరగా కనిపిస్తూనే ఉంటాయి. వాటిని నడుపుతున్న వారి స్వార్థ ప్రయోజనాలు, పనితీరు వాళ్లు చెప్పుకునే పెద్ద ఆశయాలను చిన్నబుచ్చుతున్నాయంటే బాధగా ఉంది. డబ్బు సంపాదనే ధ్యేయం అనుకునేవారికి సమాజసేవ కూడా ఒక మార్గంగా కనిపిస్తోందంటే మనిషి స్వార్థానికి హద్దులు కనిపించవు. 

తెల్లకాగితం చదువుకోవాలన్న ఆశ ఉన్న పసివాడు, వాడిని చదివించాలన్న తపన ఉన్న తల్లి కథలో కనిపిస్తారు. ఆర్థిక పరిస్థితులు తమ ఆశయానికి అడ్డుకట్ట వెయ్యలేవని నిరూపించారు ఈ సున్నితమైన కథలో తల్లీపిల్లలు. కథ నేపథ్యం చెపుతూ అది తన స్వంత అనుభవం అంటారు రచయిత. 

ఫ్రెనర్ లా విదా స్పానిష్ భాషలో పేరు పెట్టిన కథలో మనిషికి కావలసిందేమిటో మృదువుగా, అందంగా చెప్పారు. నిజంగా మనిషికి ఏం కావాలి? రోజువారీ పనులు చేసి సంపాదించుకునే వారిలో జీవితం పట్ల కనిపించే నిష్పూచి, నిర్భయాలకు కారణం బహుశా వాళ్లకు అందుకోలేని కోరికలు, వస్తువ్యామోహాలు లేకపోవటమే కావచ్చు. 

చదువుకునే సామర్థ్యం, అవకాశం లేవు. ఏ రోజు సంపాదన ఆ రోజుదే. ఆ పూటకి కడుపు నిండుతుంది. ఇల్లు లేదు. ఫుట్పాత్ ఉంది కదా. కట్టుకుందుకు ఆమాత్రం బట్ట దొరక్కపోదు. చేతిలో మాత్రం వాళ్ల మనశ్శరీరాల్ని సేదదీర్చే మొబైల్ ఉంది. ఇంకేం కావాలి. 

చదువుకుని, కెరీరంటూ పెద్ద పరుగులు పెడుతూ అసంతృప్తితో జీవించే వారికి నిత్యం కనిపించే ఈ బడుగు జీవులు ఎంత మంచి సందేశం ఇస్తుంటారో! తాము ఏదో కోల్పోతున్నామనే భావనే ఒప్పుకోలేని వారికి సంతోషం, సంతృప్తి ఎండమావులే. ఒక్క క్షణం నిలబడి తమకు కావలసినది ఏమిటో తెలుసుకుని ఆచరణలో పెట్టినపుడు నాణ్యమైన జీవితం అందుతుంది. ఏ కాలానికైనా అన్వయించుకునే గొప్ప కథ. 

లోపలికి చూడు బాల్యదశ దాటి వ్యక్తిత్వం ఏర్పడే వయసులో చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు, సామాజిక మాధ్యమాలు బోలెడంత ప్రభావం చూపిస్తాయి. మంచి కంటే ముందు కనిపించే చెడు ఆకర్షణల మాయలో పడకుండా ఉండాలంటే విజ్ఞత అవసరం. అది ఎలా వస్తుంది? ఎవరు నేర్పుతారు? నేర్పే బాధ్యత తల్లిదండ్రులది, గురువులది అని చెప్పేస్తే సరిపోదు. నేర్పేస్తే వచ్చేసేది కాదు. అనుక్షణం ఎవరో కాపలా కాసే అవకాశం ఎటూ ఉండదు. అలాటి అవసరం రాకుండా పిల్లల్లో మానసిక పరిణతిని కలిగించే సన్నివేశాల్ని, సాహిత్యాన్ని చిన్నతనంలోనే కుటుంబంలోనూ, బడుల్లోనూ పరిచయం చెయ్యగలిగితే ఆ పిల్లలు పెరిగి సమాజానికి బలమైన చేర్పు అవుతారు. పెరిగే వయసులో సంయమనాన్ని, వివేకాన్ని మేల్కొలిపే మాటలు,చేతలు వారిని సక్రమమైన దారి గ్రహించేలా చేస్తాయి. ఏ తరానికైనా అవసరమైనది ఇదే. ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారుచేస్తుందిది.

పిట్టలు వాలిన చెట్టు జీవితపు మొదటి మెట్టు మీద ఉన్నప్పుడు తప్పు దారిని ఎంచుకుని నష్టపోయిందామె. అందుకు దుఃఖపడుతూ కూర్చోలేదు. అందిన చిన్న అవకాశాల్ని పుచ్చుకుని ఎలాటి ఉన్నతస్థానానికి చేరవచ్చో జీవించి చూపించింది. తప్పు చెయ్యటం సహజం అయితే దాన్ని దిద్దుకుని, మరింత మందికి దారి చూపగలగటం గొప్ప విషయం.

నీ వాడనుకో సభ్యత పాటించని అల్లరిపిల్లలు మనకి అన్ని వీధి మలుపుల్లోనూ కనిపిస్తూనే ఉంటారు. భవిష్యత్తు గురించి, జీవితం విలువ గురించి పట్టనట్టుంటూ బాధ్యతారాహిత్యంతో బతికేసే వాళ్లకి సహనంతో మంచేమిటో చెప్పేవారు దొరికినప్పుడు ఫలితం అనూహ్యంగా మారిపోతుంది. 

లావైతే నేమిరా జీవుడు ఏ మనిషైనా ఆరోగ్యంగా ఉండాలనే అనుకుంటాడు. కొన్నిసార్లు పరిస్థితులు సహకరించకపోవచ్చు. ఇప్పుడిప్పుడు మన చుట్టూ కనిపిస్తున్న కొన్ని అనారోగ్యకరమైన అంశాలు మనిషిని ఏవైపు తీసుకెళ్తున్నాయో అర్థం కాదు. జాతి, మతం, కులం, వర్గంలాటి వాటితో పాటు భౌతికమైన రూపం, రంగు, ఆహారం కూడా వ్యక్తులను విడదీసి చర్చించదగ్గ అంశాలుగానూ, పరిహసించదగ్గ విషయాలుగానూ మారిపోయాయి. వస్తు వినిమయానికి అలవాటు పడిన మనిషి బాహ్య ఆడంబరాల్ని ఇష్టపడుతున్నాడు. వీటన్నింటిని మించి మనిషి లోపల ఏముందో పట్టించుకోని వారే ఎక్కువ కనిపిస్తున్నారు. అయినా తమ సమస్యను గుర్తించి, పరిష్కారం వైపుగా ఆలోచించి ఆత్మవిశ్వాసంతో, ఆనందంగా బతికేసే వాళ్లు ఎప్పుడూ ఆదర్శప్రాయులే.

మన చుట్టూ వాస్తవంగా ఉన్న విషయాల్ని, వాటి లోటుపాట్లను చెప్పిన కథలు ఇవన్నీ. ఆలోచించే వ్యక్తికి ఇవన్నీ నొప్పి కలిగిస్తాయి. వాటిని అలా ఉంచేసి తన మానాన తను బతికెయ్యలేడు. తనవంతుగా ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. రచయితగా తను చూసిన ప్రపంచానికి అక్షర రూపాన్నిచ్చి అర్థవంతమైన జీవితాలకి దారులు వేసుకొమ్మంటున్నారు సోమ శంకర్. ఈ అంశాలు చిన్నవిగా కనిపిస్తున్నాయేమో కానీ ప్రాధాన్యత లేనివి కావంటూ మనకి జ్ఞాపకం చేస్తున్నారు.

రచయితకు అభినందనలు.

అక్కడక్కడ కాసిని అచ్చుతప్పులు కనిపించినా అవి పుస్తకం చదువుకుందుకు అడ్డం కావు. అక్షరదోషాలకు మన్నించమంటూ ముందుమాటలో రచయిత చెప్పనే చెప్పారు. 

ముద్రణః పొదరిల్లు పబ్లికేషన్స్, జనవరి 2026

ధరః రూ. 150/-

You Might Also Like