వివేచనా శక్తిని పెంచే “సారస్వత వివేచన”

వ్యాసకర్త: తోకల రాజేశం

*********

నాకు నచ్చిన,నన్ను బాగా ప్రభావితం చేసిన పుస్తకం సారస్వత వివేచన. ఇది సాహిత్య విమర్శా ప్రక్రియకు సంబంధించిన గ్రంథం. దీని రచయిత రాచమల్లు రామచంద్రారెడ్డి.ఇతడు తెలుగు సాహిత్యంలో ‘రారా’గా ప్రసిద్ధుడు. సారస్వత వివేచన మొదటిసారిగా 1976లో ప్రచురింపబడింది. ఇందులో18 సాహిత్య వ్యాసాలున్నాయి.1968-70 మధ్యకాలంలో రారా తన సంపాదకత్వంలో “సంవేదన”అనే త్రైమాస పత్రికను నడిపారు. ఈ వ్యాస సంకలనంలో -వేకువ అనే పత్రిక కోసం శ్రీశ్రీ మీద రాసిన వ్యాసం మరియు కొడవటిగంటి కుటుంబరావు గారి”సాహిత్య ప్రయోజనం”అనే వ్యాస సంకలనానికి రాసిన పరిచయం తప్పిస్తే మిగిలిన16 వ్యాసాలు సంవేదనలో వచ్చినవే. ఇందులో కొన్ని సంపాదకీయ వ్యాసాలైతే,కొన్ని పుస్తక సమీక్షలు, కొన్ని ప్రసిద్ధ సాహితీ వేత్తల మీద రాసిన వ్యాసాలున్నాయి.సంవేదన పత్రిక ద్వారా సాహిత్య ప్రపంచంలో రారా కలిగించిన సంచలనంలో చాలా భాగం ఈ సారస్వత వివేచన లో నమోదైంది.విమర్శలో రారా ఎందుకంత సంచలనంగా మారాడంటే అప్పటి వరకూ వున్న విమర్శకుల లాగా రారా సాహిత్య విమర్శను తేలిక పాటి వ్యవహారంగా భావించలేదు. ఆయన దానిని ఎంతో బాధ్యతగా భావించాడు. ఆనాటి సాహిత్య ప్రపంచంలో తన విమర్శ ద్వారా రావాల్సిన మౌలికమైన మార్పుల పట్ల స్పష్టమైన అవగాహనతో ఈ రంగంలోకి అడుగు పెట్టాడు.

సారస్వత వివేచన చదివిన వాళ్లకు రారాది మార్క్సిస్టు దృక్పథం అని సులభంగానే అర్థమవుతుంది. ఏ విషయాన్నైనా మార్క్సిస్టు దృష్టి కోణం నుంచి ఎలా చూడాలో ఆనాటి కాలానికొక స్పష్టతనిచ్చిన వాడు రారా. తెలుగులో 1970 లకు ముందు కూడా మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఉంది. కానీ దానికొక నిర్దిష్టమైన రూపాన్ని ఇచ్చిన వాడు మాత్రం రారానే. ఇతరేతర దృక్పథాలతో పోలిస్తే మార్క్సిస్టు దృక్పథం విమర్శకు ఎంతటి విశాలమైన తోవను సిద్ధం చేస్తుందో రారా గారి వ్యాసాల ద్వారా తెలుస్తుంది. ప్రారంభ కాలంలో మార్కిస్టు సాహిత్య విమర్శకు ఆమాటకొస్తే తెలుగు సాహిత్య విమర్శకూ రారా చేసిన దోహదం సామాన్యమైనది కాదు. రారా తెలుగు సాహిత్య చరిత్రలో ఒక మైలు రాయి. ఆయన విమర్శలో రెండు ప్రత్యేకమైన లక్షణాలు గుర్తించవచ్చు. ఒకటి ఆయన దృక్పథంలోని స్పష్టత. రెండు శైలి. మొదటిదానికి కారణం ఆయన మార్క్సిస్టు కావటం అయితే రెండో దానికి ఆయనలోని ఆత్మ విశ్వాసం కారణం. తాను నమ్మిన విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పటం రారా ప్రత్యేకత. ఈ ప్రత్యేకత వల్లనే సారస్వత వివేచన ఒక విశిష్టమైన గ్రంథంగా తయారైంది. ఒక్కసారి చదవటం మొదలుపెడితే ఆపకుండా చదివించే గుణం రారా శైలిలో ఉంది. ఇంత విస్తృతమైన తెలుగు సాహిత్య ప్రపంచంలో రారా లాంటి శైలి మరెవరినీ వరించలేదంటే ఆయన ప్రత్యేకత ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. అయితే రారా వ్యాసాల్లో మరో ప్రత్యేకతను కూడా గమనించవచ్చు. అది తర్క వివేచన. ఆయన కల్పించే తర్కం ఎదుటి వాళ్ళను సులభంగా తన వాదాన్ని అంగీకరించేలా చేస్తుంది. ఇది కూడా ఆయన విమర్శకు సానుకూలాంశంగా పనిచేసింది.

“ఉత్తమ సాహిత్యం లౌకిక జీవితానికి వెలిగా, విడిగా మడికట్టుకున్న ప్రత్యేక ప్రపంచమేమి కాదు,అది సమాజ జీవితంలో ఒక భాగం(లక్ష్య నిర్వచనం)” అని చెప్పిన రారా సమాజానికి, సాహిత్యానికి గల అవిభాజ్యతను నిరూపించడానికి చాలా సందర్భాలను ఈ వ్యాసాల్లో వాడుకున్నారు. సాహిత్యం పట్లా-సమాజంలో అది కలిగించవలసిన పరివర్తన పట్లా రారా లోని తండ్లాట ఈ సారస్వత వివేచన నిండా కనిపిస్తుంది. సాహిత్యానికి వివిధ సామాజిక శాస్త్రాలతో గల సంబంధాన్ని రారా విశ్లేషించిన తీరు తదనంతర విమర్శకులకు ఎన్నో కొత్త పాఠాలు నేర్పింది. సాహిత్యానికి సామాజిక శాస్త్రాలతోగల పరస్పర సంబంధాన్ని నిరాకరించిన విమర్శ మీద మొదట్లో గట్టి విమర్శ పెట్టిన వాడు రారా. ఈ నేపధ్యంలో విమర్శ అంటే కేవలం గ్రంథ ప్రశంస-రచయిత ప్రశంశ వరకే పరిమితమైన విమర్శకు కొత్త చూపును ప్రసాదించి సాహిత్యాన్ని నిర్మమకారంగా ఎలా చూడాలో నేర్పి సమాజాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళ రచనల లక్షణాలను, వెనుకకు నడిపించే వాళ్ళ రచనల లక్షణాలను పసిగట్టడానికి కావాల్సిన పరికరాలను అందించినవాడు రారా. ఈ క్రమంలోనే నిర్మొహమాటమి, రాజీలేనితనం అనే అంశాలు రారా విమర్శకు బలాన్ని చేకూర్చాయి. ఈ నేపథ్యంలో రారా విమర్శ కొన్ని సందర్భాల్లో కటువుగా తయారైంది.

దానికాయన “క్షమించరాని నేరాలను తూర్పార బట్టేటప్పుడు మాత్రమే మా విమర్శలు నిర్ధాక్షిణ్యంగా వుంటున్నాయి” అని చెప్పుకున్నాడు. సాహిత్యం ద్వారా సమాజానికి నష్టం జరగకూడదు అన్నదే రారా గారి అభిమతం. అందుకాయన కొంచెం కఠినంగానే వ్యవహరించవలసి వచ్చింది. ఆయన విమర్శాశైలిలోని గొప్పదనాన్ని-వ్యంగ్యాన్నీ గుర్తించని వాళ్లకు అది వ్యక్తిగత విమర్శగా కనబడింది. కొందరు దాన్ని తిట్ల దండకమని కూడా అనుకున్నారు. ఇక్కడే ఆయనను కొందరు అపార్థం చేసుకున్నారు. దిగంబర కవుల కవిత్వం మీద ఆయన రాసిన “సమాజం అంతగా పతనమైందా?” లాంటి ఒకటి రెండు వ్యాసాలు ఇట్లాంటి వాదనలకు ఆస్కారమిచ్చాయి. ఇట్లాంటి సందర్భాల్లో రారా సంయమనం పాటించి ఉంటే బాగుండేదని కొందరన్నారు. ఇతర వ్యాసాల సందర్భాల్లో కూడా రారా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ ప్రచారానికి కారణమయ్యాయి. చరిత్ర విధించిన పరిమితులు అందరిలోనూ ఉన్నట్టే రారా లోను ఉన్నాయి. అవి తదనంతర కాలంలో మాత్రమే బయటపడినాయి. కానీ తన కాలానికి ఎంతో ముందు చూపు ఆయన విమర్శలో ఉంది. ‘మహానుభావుడు చలం’ లాంటి వ్యాసాల్లో రారా గారి పురోగమన దృష్టినీ-ముందుచూపునీ చూడవచ్చు.

తెలుగులో రారా కంటే ముందు సాహిత్య తత్వాన్ని కచ్చితంగా అంచనా కట్టి విమర్శ చేసిన వాళ్ళు తక్కువ. అందులోనూ రారా ప్రకటించినంత స్పష్టంగా సూటిగా ఆ సాహిత్యం తాలూకూ భావజాలాన్ని చెప్పిన వాళ్ళు తక్కువ. ఈ మొత్తం క్రమంలో గుర్తించవల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అదేమిటంటే విమర్శలో రారా వేసిన మార్గం గతంలో లేనిది,ఆయన కాలంలో కానీ తరువాత కాలం అంత సులభంగా అనుసరించటానికి వీలు కానిది. అందుకే రారా తర్వాత కాలంలో ఎవరూ ఆ మార్గంలో ఆయన లాంటి దూకుడుతో ప్రయాణించిన దాఖలాలు లేవు. ఈ ప్రత్యేకత ఒక్క రారా కే సొంతం.అయితే సారస్వత వివేచనని ఎప్పుడు చదివినా ఏదో ఒక కొత్త ప్రతిపాదన దొరుకుతూనే ఉంటుంది.ముఖ్యంగా పాఠకుల ఆలోచనా శక్తిని పెంచుతుంది ఈ సారస్వత వివేచన.

You Might Also Like