అనంత జీవన యానంలో .. ఆర్వీ సుబ్బు “రైలు బండి”
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
*********
‘కూటి కోసం కోటి విద్యలు’ అన్నారు. విద్య అంటే బడుల్లో చదువుకునే ఫార్మల్ ఎడ్యుకేషన్ కాదు. విద్య అంటే జ్ఞానం. ఫార్మల్ ఎడ్యుకేషన్ జ్ఞానాన్ని సమాచారానికి కుదిస్తుంది. నిజమైన జ్ఞానం క్రియాత్మక నైపుణ్యం. జీవించటానికి, జీవిత పోరాటాన్ని అలుపు లేకుండా కొనసాగించడానికి చేసే అవసరమైన ప్రతి చర్యా జ్ఞానమే. బతకటానికి, బతుకుని దిద్దుకోవటానికి వుపయోగపడే జ్ఞానం యే కొందరి సొత్తో కాదు. కానీ జ్ఞాన ఫలాల పంపకంలో చోటుచేసుకుంటున్న అసమానతలు సమాజంలో రాను రానూ పెరిగిపోతున్నాయి. శ్రమ వొకరిది. సిరి మరొకరిది. దాంతో అలజడి ఆందోళనలు తప్పవు. జీవితం కొందరికే వడ్డించిన విస్తరి. చాలామందికి; విస్తట్లోకి పెద్ద మాట; విస్తరే దొరకదు. రెక్కలు ముక్కలు చేసుకున్నా పూట గడవదు. రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్ళు మనలోనే యెందరో, మన చుట్టూ కొల్లలు. ఇటువంటి శ్రామికుల జీవనయానం కథనాలే సుబ్బు ఆర్వీ ‘రైలు బండి’.
సుబ్బు యింతకు ముందు రాసిన ‘మన హీరోలు’ బతుకు గెల్చుకున్న వాళ్ళు. జీవితంలో వున్నత శిఖరాలకు చేరుకున్నవాళ్ళు. పట్టుదలతో వొక ఆశయాన్ని సాధించినవాళ్ళు. సామాన్యులుగా మొదలై అసామాన్యులుగా యెదిగినవాళ్ళు. అసామాన్య కృత్యాలు చేస్తూనే అతి సాధారణ జీవితం గడిపేవాళ్ళు. ‘రైలు బండి’ లో తారసపడే వ్యక్తులు అలా కాదు. వీరికి బతుకు నిత్యసమరం. ఆ సమరంలో గెలుస్తారు. ఓడతారు. గాయపడతారు. పడి లేస్తారు. నిలబడతారు. కలబడతారు. అటువంటివాళ్ళు తన ప్రయాణాల్లో యెక్కడ యెదురైనా వాళ్ళతో మాట కలిపాడు సుబ్బు. కరచాలనం చేసాడు. ఆత్మీయంగా పలకరించాడు. మనసుతో స్పృశించాడు. సహానుభూతి చెందాడు. వాళ్ళ జీవితాల లోతుల్లోకి తొంగిచూశాడు. కష్టసుఖాలు పంచుకున్నాడు. అనుభవాలని మెదడుపొరల్లో భద్రపరచుకుని తనదైన రీతిలో మన ముందు అక్షరాల్లో కళాత్మకంగా ఆవిష్కరించాడు.
జీవితం ఒక కళ అంటారు. ఆయన ఎవరో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ మీద ప్రవచనాలు చెప్పి ఆశ్రమాలు కట్టి పేరు ముందు అనేక శ్రీలు తగిలించుకుని పెద్ద గురువుగా పేరుపొందేశాడు. సంపన్నుడైన సన్యాసిగా హారతులు అందుకుంటున్నాడు. ‘అసలు జీవించడమే ఓ కళ. దాని అభ్యసనే రోజువారీ జీవితం’ అని ఆర్వీ సుబ్బు కూడా యీ కథనాల్లో ప్రస్తావించాడు. ఏరోజుకారోజు నాలుగు వేళ్ళు నోట్లోకి పోవటానికి అనునిత్యం తండ్లాడే వాళ్లకు జీవితం కళగానే అనిపిస్తుందా. ఎన్ని కష్టాలు పడుతూ వున్నా జీవితాన్ని జీవించటమే కళగా భావించాలా అన్న ప్రశ్న వుత్పన్నమౌతుంది. అందుకు సమాధానం యీ కథనాల్లో దొరుకుతుందేమో చూడండి.
***
సుబ్బు రాసిన ‘మన హీరోలు’ చదివి ఆ కథనాల్ని కందుకూరి రమేష్ బాబు సామాన్య శాస్త్రంతో, జయధీర్ ‘తొవ్వ ముచ్చట్లు’ లోని వ్యక్తుల ప్రొఫైల్స్ తో పోల్చినందుకు కొందరు నొసలు చిట్లించారు. కొందరు కనుబొమ్మలు యెగరేశారు. కానీ మన హీరోలు చదవక ముందే రైలు బండి కథనాలు కొన్ని చదివి వుండటం వల్ల ఆ పోలిక అనుకోకుండానే చటుక్కున స్ఫురించింది. ఇప్పుడు యీ 50 కి పైగా కథనాల్లోని అతి సామాన్యుల జీవిత చిత్రాల్ని చూశాకా ఆ మాట నిజమే అని మరోసారి రుజువైంది.
బతుకు తెరువు వెతుక్కుంటూ యెక్కడెక్కడో పల్లెల నుంచి పట్టణాలకు నగరాలకు ప్రయాణం కట్టి వయసుతో నిమిత్తం లేకుండా ప్రాంతాల దూరాల్ని అధిగమించి కోట్లాదిమంది జీవితం కొనసాగిస్తున్నారు. ఈ పుస్తకంలో యెక్కడెక్కడ నుంచో, ముఖ్యంగా ఆంధ్ర నుంచి, వలస వచ్చి భాగ్యనగరంలో బతుకు సాగిస్తున్న వాళ్ల కథనాలు యెక్కువే వున్నాయి. భాగ్యనగరం వచ్చి బతకలేనివారు వుండరు. నగరం అందరినీ అమ్మలా ఆదుకుంటుంది. ఏదో వొక వుపాధి యేర్పరచుకొని కష్టపడి బతకడానికి పలు దారులు చూపిస్తుంది. ‘ఇది బంగారు తెలంగాణ బాబూ, నన్ను ఆదుకుంది. ఆకురాలిన చెట్టు మరలా చిగురించి నట్టు జీవితంలో అన్నీ కోల్పోయిన బాధలతో భారంగా వచ్చిన నాలాంటి యెందరినో అక్కున చేర్చుకొని ఆసరా యిచ్చి ఆదరించి కడుపునింపటమే గాక నలుగురికి అన్నం పెట్టే స్థాయికి చేర్చే భాగ్యనగర్ కి చేతులెత్తి నమస్కరించాలి’ అంటాడు పనస పొట్టు వ్యాపారం చేసే లక్ష్మణరావు.
తన సంచారంలో వ్యక్తుల ప్రొఫైల్ రాయడంలో సుబ్బు పరిశీలన చాలా లోతైనది. శ్రమైక సౌందర్యంతో నిజాయితీతో ఆత్మగౌరవంతో ధిక్కారంతో వినయంతో వివేకంతో వివేచనతో తనని ఆకట్టుకున్న మనుషుల్ని బొమ్మకట్టించడం దగ్గర అతను ఆగిపోడు, వాళ్ళ జీవితం చుట్టూ అల్లుకొని వుండే అనేక సూక్ష్మ అంశాలు పాఠకుల ముందు ఆవిష్కరిస్తాడు. వెదురు బుట్టల అక్క గురించి చెప్తూ వెదురుతో ఎన్ని పరికరాలు చేయొచ్చో లిస్ట్ చేస్తాడు. వడ్లు దాచుకుని దోనెలు అన్నం వార్చే గంపలు ఇంట్లో అవసరాలు తీర్చే బుట్టలు చాటలు తడికలు మగ్గులు పూజ బుట్టలు కోళ్ల గంపలు చేపలు పట్టేవి పూల కుండీలు లైటింగ్ లాంప్ లు అల్మరాల్లో బొమ్మలు బాల్కనీలో వేలాడే చాపలు కుర్చీకి అల్లికలు .. ఇలా ఒకటేమిటి వెదురుతో చేసే సమస్త కళాత్మక వస్తుజాలాన్నీ ప్రస్తావిస్తాడు. అలాగే పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్లో అమ్మే దిబ్బ రొట్టె గురించి చెబుతూ దాంతో పాటిచ్చే బెల్లం పాకం తయారీని విపులంగా కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తాడు.
అయితే జీవితాల్ని యథాతథంగా నమోదుచేయడం దగ్గరే రచయిత బాధ్యత ఆగిపోదని తెలిసినందువల్ల సుబ్బు సమాజంలో మార్పుకి గురౌతున్న అనేక అంశాలపట్ల విమర్శనాత్మకంగా వున్నాడు. ఉదాహరణకు చూడండి: కష్టాన్ని ఆకలిని గుర్తించేవాడే కమ్యూనిస్టు. శ్రమని నమ్ముకుని సమానత్వాన్ని చాటుతూ స్వతంత్రంగా సాగేదే కమ్యూనిస్టు జీవితం – అని చెబుతూనే నేడు కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని కమర్షియల్ గా కల్తీ చేసి బూర్జువా జీవితాన్ని గడిపేస్తున్నారు అని విమర్శిస్తాడు. కామ్రేడ్ మాల్పూరి కోవా ప్రపంచవ్యాప్తం కావటానికి కమ్యూనిజంపై వలీకి వున్న నికార్సయిన కమిట్మెంటే కారణం అని నిర్ధారిస్తాడు. సమానత్వం సంపూర్ణత దేశంలో మాటలుగానే మిగిలిపోయాయనీ బడికి పోవాల్సిన పిల్లల బాల్యం వీథుల పాలైపోయిందనీ చెప్తూ ఛిద్రమౌతున్న బాల్యం గురించి వాపోతాడు. ప్రతి ఒక్క బాల్యం విద్యను పొందాలనీ విద్య జ్ఞానాన్ని పెంచేలా ఉండాలనీ సంపూర్ణ అక్షరాస్యత పోషకాహారం పిల్లల న్యాయబద్ధమైన హక్కు అనీ చెబుతాడు. ఎక్కడో రాజస్థాన్ చెందిన ‘రాముడి’ బాల్యం బెలూన్లు అమ్ముకొంటూ బజారు పాలవడానికి కారణమైన పాలకుల బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తాడు.
అలాగే టమాటో రైతు పక్షాన నిలిచి చెప్పిన కథనం చదవండి. ‘పడుతుందో లేదో తెలియని వర్షం మీద ఆధారపడి కాసిని నీళ్లతో సాళ్లు తడిపి పురుగు పట్టకుండా తెగులు సోకకుండా కాపాడి రాలే పూతను నిలబెట్టి పిందెలను కాపాడి కోత కోసి మార్కెట్ కి తెచ్చే వరకూ రోజుకో యుద్ధం చేస్తాడు’ రైతు. పంట పండించడంలో గెలిచినప్పటికీ మార్కెట్ కి వచ్చేసరికి వోడిపోతాడు. అక్కడ యేదీ అతని చేతిలో ఉండదు. ధర అమాంతం పెరగటం సాంతం పడిపోవడం ఈ రెండిటినీ నియంత్రించే వాళ్ళు ఎవరో తెలీదు. దీన్ని కాపాడగలిగే ప్రభుత్వ యంత్రాంగం వుండి కూడా రైతు ఎందుకు రోడ్డు పాలవుతున్నాడు? ఇదీ సుబ్బు ప్రశ్న. ధర పెరిగినప్పుడు సబ్సిడీ ఇచ్చి వినియోగదారులకు మేలు చేసే ప్రభుత్వం రైతుకి కనీస మద్దతు ధర ఎందుకు ఇవ్వదు? అని కార్పొరేట్ లకు దళారీలుగా మారిన పాలకుల ఆర్ధిక విధానాల మూలాల్లోకి వెళ్తాడు.
కులం మతం ప్రాంతం రూపం తినే తిండి వేసుకునే దుస్తులు బట్టీ మనుషుల్ని గౌరవించే స్థాయి నుంచి మనిషిని మనిషిగా గుర్తించే స్థాయికి మనిషి యెదగాలని సుబ్బు కోరుకుంటాడు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ని గుర్తిస్తాడు. వీథుల్లో చెత్త ఏరుకునే మనిషి పట్ల (స్ట్రీట్ ఎవెంజర్), అదే చెత్తతో వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ నడిపే బడా వ్యాపారి పట్ల సమాజం చూపే ద్వంద్వ వైఖరిని యెండగడతాడు. ఆ క్రమంలోనే రాసిన మంతమ్మ కథనం నన్నెంతగానో ఆకట్టుకుంది. ఆమె ఆత్మగౌరవ స్వరం వొళ్ళు గగుర్పడిచేలా చేసింది. ‘చెంచులక్ష్మి తెల్లగా వుండేదట కదా తెల్లగా వుండే చెంచులక్ష్మి శిల్పానికి నల్లరంగేయడమేమిటి’ అని ఆమె ప్రశ్న. మనుషుల సామాజిక నేపథ్యాన్ని చూసి మాటల్లో చేష్టల్లో వివక్ష చూపడాన్ని చెంచు మంతమ్మ నిరసించింది. ఇటువంటి కథనాలన్నీ రచయిత ఆత్మని పట్టి యిస్తాయి.
***
రిటైర్మెంట్ తర్వాత రాపిడో రైడర్ గా మారిన వృద్ధుడు, జీవితం మొత్తం పాములతోనే గడిపి పాముకాటు గురైన వారి ప్రాణాల్ని కాపాడే పాముల నరసయ్య, భూచక్ర గడ్డల్ని అడవి నుంచి తెచ్చి నగరంలో అమ్మే దాసు, బాపట్ల నుంచి నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం చేసి కనిగిరి పామూరు బస్టాండ్ సెంటర్లో నారు మొక్కల్ని అమ్మి పొట్ట పోసుకునే రమణమ్మ, పాలకొల్లులో ఎమ్మార్వో ఆఫీస్ పక్కన బెల్లం పొంగనాలమ్మి యిల్లు గడిపే ఈశ్వరమ్మ, గుంటూరులో పెళ్ళిళ్ళకి ఆట గుర్రాలు తయారుచేసే కిషోర్, మూసీ కృష్ణ సంగమంలో బతుకుతోపాటు పడవలు నడుపుతూ ఎందరో ప్రాణాల్ని కాపాడే సోమయ్య, వృద్ధాప్యంలో యెవరి ముందూ చేయి చాపడానికి ఇష్టపడక రైలు బండిలో పుస్తకాలమ్మే పెద్దమ్మ (ఈ పుస్తకానికి ‘రైలు బండి’ పేరుకు ప్రేరణ ఆమె కథే), నమ్మకమే పెట్టుబడిగా బతుకు బండికి వెల్డింగ్ అతుకులు వేసే ఇబ్రహీం, కూల్ డ్రింక్ ల యుగంలో ముసలితనంలో సోడా బండి నడిపే రెహమాన్ చిచ్చా, మూగ భాషతో మనుషుల్ని చదివే టిక్కా చిన్నోడు, కోవా బన్నుకి మాస్టర్ చెఫ్ కర్నూల్ జలీల్, మట్టికుండలు తయారు చేసే ఏసుబాబు, ఒంటికాలితో ఆటో నడిపే అనిల్, బోనాల పండగలో భయంకరంగా కేకలు వేస్తూ చేతిలో కొరడాతో నృత్యం చేసే పోతరాజు, తియ్యని పాన్ డబ్బా శీను బాబాయ్, డాగ్ లవర్ రాజు, గుంటూరులో నీరా సరఫరా చేసే నాగరాజు, అనుకున్నది సాధించే దాకా ఆగని ఆర్టిస్ట్ శేఖర్.. యిలా యెంతో మంది పరుల సొమ్ము ఆశించకుండా యితరుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడకుండా సొంత కాళ్ళమీద నిలబడడానికి ప్రయత్నించేవాళ్లే. ఈ కష్టజీవులతో మమేకమై వాళ్ళ హృదయాల్లోకి జొరబడి పరకాయ ప్రవేశం చేసి చెక్కిన కథన శిల్పాలు ఆ యా వ్యక్తుల దగ్గర ఆగిపోకుండా అటువంటి జీవితాలే గడిపే వారందరి కష్టాలతో సామాన్యీకరించి జీవిత సత్యాలు వెలికితీస్తాడు సుబ్బు. ఓలా కారులో నగరాన్ని చుట్టివచ్చే వెంకట్ మాటల్లో కనిపించే సమకాలీన సమాజపు డాక్యుమెంటరీ చిత్రం గీసినప్పుడు గానీ బడి విద్యార్థి కానప్పటికీ మధ్యాహ్నం భోజనం కోసమే స్కూలుకి వెళ్లే కుమారుని నెపం చేసుకొని అనాథ బాలల అభాగ్య జీవితాలకు కారణాలు వెదికినప్పుడు గానీ అనేక సందర్భాల్లో రచయితగా సామాజిక వ్యాఖ్యాతగా మానవతావాదిగా అతని ప్రాపంచిక దృక్పథం స్పష్టమౌతుంది.
ఆ దృక్పథ పటిమ కారణంగానే మన గల్లీలోనే మన చుట్టుపక్కల మన హడావిడి జీవితంలో పరుగుల పందెంలో చూడని/చూడలేని యెందరో గొప్ప వ్యక్తుల్నీ వారి వ్యక్తిత్వాల్నీ మానసిక ప్రపంచాల్నీ అంతరంగాల లోతుల్నీ సుబ్బు చూడగలిగాడు. ‘అద్భుతాన్ని చూడాలంటే ఏకాగ్రతతో కూడిన పరిశీలన అవసరం’ అని తెలుసుకున్నాడు. తెలియజేశాడు. మాయ మాటలు చెప్పి మోసాలు చేసి ఈజీ మనీ కోసం తప్పుదారులు తొక్కుతూ సంపాదిస్తున్న జనాల మధ్య కాళ్లు చేతులు పూర్తిగా పనిచేయకపోయినా కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళే నగరంలో అతనికి తారసిల్లారు. కళ్ళకు కాళ్లకు అడ్డుపడ్డారు. భాగ్యనగరంలో ఆవకాయ పచ్చడి పెట్టుకోవటానికి మామిడి ముక్కలను కొట్టిచ్చే సుబ్రమణ్యం, ఎక్కడో కృష్ణాజిల్లా కూచిపూడి నుంచి తాటి గెలలు తెచ్చి ముంజలు కొట్టిచ్చే వెంకటేశ్వర్లు, కాలనీల్లో గాడిద పాలమ్మే నాగేశు, ఉస్మానియా క్యాంపస్ లో మిరియాలు రసాన్ని అమ్మే మూర్తి, కూకటపల్లి వీథుల్లో సైకిల్ మీద ఆయుర్వేద స్టోర్స్ నడిపే వెంకటరావు నాగరికుల అన్నదాతల్లా ఆరోగ్యరక్షకుల్లా కనిపించారు. వీళ్లంతా రైలు బండి కథనాల్లో అసమాన పాత్రలయ్యారు. ఆ క్రమంలోనే బొమ్మల కొలువు బతుకమ్మ బోరింగ్ బావి బాదం చెట్టు కుడితి తొట్టి సైతం సామాజిక కథనాలకు అర్హమయ్యాయి. గంగిరెద్దులాట విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసి వాళ్లకు వొక కళారూపం కానీ ఆడించే వాళ్లకు బువ్వ పెట్టే ఆదాయపు వనరు మాత్రమే. మతం బలుస్తోన్న కాలంలో భక్తుల కోరిక మేరకు దాని స్థానంలోకి ‘గోమాత’ వచ్చినా అది భుక్తి కోసమే గానీ ప్రత్యేకంగా భక్తితో కాదని రచయిత మాటల్లో గ్రహిస్తాం. నిర్దిష్ట స్థల కాలాలనుంచి చూసినప్పుడు రైలుబండి కథనాల లోతు అర్థమౌతుంది.
***
రైలుబండి కథనాల్లో సుబ్బు దృష్టి గాఢతరమైంది. ఆలోచన విస్తృతమైంది. పరిశీలన నిశితమైంది. జీవితాన్ని చూసే దృక్పథం విశాలమైంది. అతని రాత మనిషి దగ్గరకు మరింత చేరువైంది. వాక్యం వైజాగ్ రైల్వే స్టేషన్ బయట టిఫిన్ బండిపై ఇడ్లీ అమ్మే వ్యక్తి నిజాయితీలా తెల్లగా మెరిసిపోతూ రుచికరంగా తయారయింది.
ఈ కథనాల్లోని వ్యక్తులతో చేసే సంభాషణల్లో సుబ్బు యెన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. వాళ్ళ మనోభావాలను గౌరవించాడు. వాళ్ళ వైయక్తితను కించపరచకుండా వ్యవహరించాడు. ప్రైవసీని కాపాడే నైతికతని పాటించాడు. వాళ్ళ అనుమతితోనే కథనాలు ఫోటోలు ప్రచురించాడు. నగరం గల్లీల్లో తిరుగుతూ బిందీలమ్ముకునే వలీ దాదా ఫోటో తీసుకుంటానంటే అతను భయపడ్డాడు. ‘రాజకీయ ఫేక్ ప్రోపగండాలు అతని అస్తిత్వానికి ఏ బురద పూస్తాయో’ అని వలీ భయం నిర్హేతుకం కాదని సుబ్బు సరిగానే గుర్తించాడు. అతన్ని అంతగా అభద్రతకు గురిచేసిన రాజకీయాల ప్రస్తావన ద్వారా దేశంలో ప్రబలుతోన్న మత అసహనం పట్ల సుబ్బు అవగాహన స్పష్టమౌతుంది. ‘మా స్త్రీలు నుదుటి మీద పెట్టే పవిత్రమైన బొట్టు బిళ్ళలని అమ్మటానికి నువ్వెవరు’ అని వలీని యే మతోన్మాదులో ప్రశ్నించొచ్చు, అతని పౌరసత్వమే ప్రమాదంలో పడొచ్చు, ఏ తీవ్రవాది ముద్రో మోయాల్సిరావొచ్చు .. అన్న సూక్ష్మ స్ఫురణ సుబ్బు ని డిస్టర్బ్ చేసినట్టే నన్ను కూడా డిస్టర్బ్ చేసింది.
అలాగే శ్రీశైలం గుడి లోపల కదంబవనవాసిని భ్రమరాంబ కంటే అడవిలో హై వే పక్కన కదంబం కింద పళ్ళమ్ముకునే జయమ్మ సుబ్బుకి జీవిత పాఠాన్ని నేర్పిన దేవతైంది. శ్రమకు కూడలైన కదంబ వృక్షమే అతనికి పవిత్ర వృక్షంగా ఉత్సవ వృక్షంగా రాజవృక్షంగా అసలైన ఆలయంగా గోచరించింది. పనస పొట్టు కోసం కాయల్ని కత్తితో నరికే లక్ష్మణరావు ‘కందిన ఆర చేతులు కాయలు కట్టిన వేళ్ళను పట్టి చూసి గర్భగుడిలో విగ్రహాన్ని తాకినట్టు’ మురిసిపోయాడు. రాముడే దిక్కని నమ్ముకుని చదువుకోవాల్సిన వయస్సులో ముఖానికి రంగేసుకుని వీథులపాలై బిచ్చమెత్తుకొనే బుడగ జంగాల శివకుమార్ ఆకలి తీర్చే పాలన రావాలని బలంగా కాంక్షించాడు. ఆ యా సందర్భాల్లో రైలు బండి కథనాలు కేవలం జీవన రేఖా చిత్రాలుగా మిగిలిపోవు. సామాజిక రాజకీయ వ్యాఖ్యలుగా పరిణమిస్తాయి. గొప్ప మానవీయ స్పందనలుగా భాసిస్తాయి. సుబ్బు వ్యక్తిత్వాన్ని పట్టిస్తాయి.
‘మన హీరోలు’ కథనాల నుంచి నుంచి స్ఫూర్తి పొందినవాళ్ళు అనేకులు. కొందరు ఆ కథనాల్లోకి యెక్కిన హీరోలకు అభిమానులయ్యారు. కొందరు తామే స్వయంగా హీరోల్లా యెదగాలని తీర్మానించుకున్నారు. కొందరు సుబ్బుకి అభిమానులై అతని fan club లో చేరిపోయారు. ఎంతోమంది వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్చుకున్నారు. ఇప్పుడు యీ రైలు బండి కథనాలు చదివితే – సరైన బతుకు తెరువు దొరకక తలకిందులవుతున్నవాళ్ళూ బతుకు పోరులో అలసిపోయినవాళ్ళూ జీవన సమరంలో వోడిపోయామని బెంగపడేవాళ్ళూ ఆత్మగౌరవంతో స్థిరంగా నిలబడి జీవితాన్ని కొత్తగా మొదలుపెట్టే ధైర్యాన్ని పొందగలరని నా నమ్మకం. అందుకు దారి చూపుతున్న నా యువ మిత్రుడు ఆర్వీ సుబ్బుకు మరోసారి ఆత్మీయ అభినందనలతో..
హైదరాబాద్ ,
ఫిబ్రవరి 7, 2025 ఎ. కె. ప్రభాకర్
