వలస: అమెరికా కలల వెనుక ఆరాటం, పోరాటం

వ్యాసకర్త: రహ్మానుద్దీన్ షేక్

*********

మానవ చరిత్రలో ‘వలస’ అనేది ఒక అనివార్య పరిణామం. మెరుగైన జీవితం కోసం, ఉపాధి కోసం మనిషి సాగించే ప్రయాణం కేవలం భౌగోళిక మార్పు మాత్రమే కాదు, అది ఒక సామాజిక, మానసిక పరివర్తన. ఈ పరివర్తనలో ఎదురయ్యే సంఘర్షణలను, ముఖ్యంగా అమెరికా వెళ్ళిన తెలుగు కుటుంబాల అంతర్మథనాన్ని అత్యంత వాస్తవిక దృక్పథంతో ఆవిష్కరించిన నవల ‘కొత్తావకాయ’ బ్లాగరి  సుస్మిత గారు రాసిన వలస.

ఈ నవలకు ప్రధాన బలం రచయిత్రి ఎంచుకున్న ‘సర్వసాక్షి కథన రీతి’. రచయిత్రి పాత్రల మనసులోకి చొరబడి ఉపన్యాసాలు ఇవ్వకుండా, ఒక నిష్పాక్షిక పరిశీలకురాలిలా పాత్రల ప్రవర్తనను, సంభాషణలను పాఠకుల ముందు ఉంచారు. దీనివల్ల పాఠకుడు ఒక తీర్పు ఇచ్చే న్యాయనిర్ణేతలా కాకుండా, ఆ జీవితాలను గమనించే ఒక సాక్షిలా మారిపోతాడు. నాటకీయత కంటే వాస్తవికతకు పెద్దపీట వేస్తూ సాగిన ఈ కథన శైలి, నవలకు ఒక గాంభీర్యాన్ని ఇచ్చింది.

నవల ప్రారంభం మరియు ముగింపు ఒకే దృశ్యంతో వృత్తాకారంగా ముగియడం కేవలం శిల్పచాతుర్యం మాత్రమే కాదు. రచయిత్రి మాటల్లో చెప్పాలంటే, జీవితంలో జరిగే యాదృచ్ఛిక సన్నివేశాల వెనుక ఒక గమ్యం ఉంటుందని చెప్పే ప్రయత్నమిది. వలస అనేది ఆధునిక జీవితంలో ఒక విడదీయలేని భాగమనే సత్యాన్ని ఈ నిర్మాణం ప్రతిబింబిస్తుంది. 

నవలలోని స్వామి, కల్యాణి, శ్యామ్, గోమతి లాంటి పాత్రలు తెలుగు వలస జీవితానికి ప్రతీకలు. నా దృష్టిలోఈ పాత్రలు  ‘త్యాగమయులు’.  రచయిత్రి ఈ పాత్రల ప్రవర్తనను కుటుంబం కోసం చేసే ‘సర్దుబాట్లు’గా అభివర్ణించారు.

స్వామి మొదటి తరం వలసదారుడిగా ఎదుటివారికి మార్గదర్శిగా నిలిచినా, తన సొంత కుటుంబంలో టీనేజ్ పిల్లల వ్యక్తిగత స్వేచ్ఛ ముందు నిస్సహాయుడవ్వడం ఒక గొప్ప వైరుధ్యం. తురీయ (రియా) పాత్ర అమెరికన్ స్వేచ్ఛకు ప్రతీక. భారతీయ తల్లిదండ్రుల అంచనాలకు, అక్కడి పిల్లల ఆకాంక్షలకు మధ్య ఉండే అగాధాన్ని తురీయ పాత్ర ద్వారా రచయిత్రి చాలా సున్నితంగా చిత్రించారు.

నవలలో కీలకమైన “ఈనగాచి నక్కలపాలు” సామెత కేవలం వలస వచ్చిన వారి కోసం మాత్రమే కాదు, నేటి ఆధునిక ‘న్యూక్లియర్’ కుటుంబాల పెంపకంపై ఒక బలమైన హెచ్చరిక. పిల్లల భవిష్యత్తు కోసం సర్వస్వాన్ని ధారబోసే తల్లిదండ్రులు, చివరకు ఆ పిల్లలు తమ సంస్కృతికి, మూలాలకు దూరం అవుతున్నప్పుడు పొందే వేదన ఈ వాక్యంలో దాగి ఉంది. 

శంకర్ పాత్ర ‘గళ్ళనుడికట్టు’ లాగా, నవలలోని పెద్ద యంత్రంలో ఒక చిన్న బోల్ట్ లాగా ఆమె సృష్టించారు. పాఠకుల తెలివితేటల మీద నమ్మకంతో చేసిన ఈ ప్రయోగం, నవలను రెండోసారి చదివినప్పుడు కొత్త అర్థాలను ఇచ్చింది. 

మానసిక ఆరోగ్య సమస్యలను క్లినికల్ కోణంలో కాకుండా, జీవనశైలి మార్పుల ద్వారా పరిష్కరించవచ్చనే రచయిత్రి అభిప్రాయం కొంత సింప్లిస్టిక్‌గా అనిపించినా, అది ఆమె దృక్పథాన్ని స్పష్టం చేస్తుందని నా అనుకోలు. వర్ణ వివక్ష, ఆహార సంస్కృతి లాంటి అంశాలను మరికొంత విస్తృతంగా చర్చించే అవకాశం ఉన్నప్పటికీ, నవల పరిధిని దృష్టిలో ఉంచుకుని ఆమె ప్రధాన ఇతివృత్తానికే కట్టుబడ్డారు.

భాషపరంగా సుస్మిత గారు తెలుగు నుడికారాన్ని, వచనాన్ని మలిచిన తీరు అద్భుతం. అమెరికా నేపథ్యం కాబట్టి సహజంగానే ఆంగ్ల పదాల వాడకం ఉన్నా, అది కథా ప్రవాహానికి అడ్డంకి కాలేదు. 

‘వలస’ కేవలం అమెరికాలో ఉన్న ఎన్నారైల కథ మాత్రమే కాదు. ఇది దూరమైపోతున్న మానవ సంబంధాల గురించి, మారుతున్న సామాజిక విలువల గురించి ప్రతి ఒక్కరూ చదవాల్సిన నవల. నిష్పాక్షిక కథనం, ఆలోచింపజేసే ఇతివృత్తం, వాస్తవిక చిత్రణ ఈ నవలను ఇటీవలి కాలంలో వచ్చిన ఉత్తమ నవలల సరసన నిలబెట్టాయి.

వలస జీవితాల్లోని వెలుగునీడలను నిశితంగా పరిశీలించాలనుకునే వారు ‘వలస’ నవలను తప్పనిసరిగా చదవాలి.

You Might Also Like