డోరేదార్ – మధు పెమ్మరాజు కథలు
వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ
******
రవాణా సౌకర్యాలు బాగా అందుబాటులోకి వచ్చినప్పట్నుంచీ ప్రపంచం కుగ్రామం అయిపోయిందని, దూరాలు మాయమైపోయాయని దశాబ్దాలుగా వింటున్నాం. మంచిగా చదువుకున్నందుకు మెరుగైన జీవితం, జీవిక వెతుక్కుంటూ ఆ ప్రయత్నంలో అమ్మానాన్నల్ని, స్వంత ఊరుని, చదువుకున్న బడిని, కలిసి తిరిగిన స్నేహితుల్ని అన్నింటినీ వదులుకుని దూరదూరంగా ప్రయాణించి ఎక్కడో అనువైనదనుకున్న చోట కొత్తగా నివాసాన్ని పదిలపరచుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం.ఇవన్నీ వదులుకుందుకు ఎన్ని త్యాగాలను చేస్తున్నామో, ఎన్ని కష్టనష్టాలను ఎదఱ్కొంటున్నామో! ఇలా చెపితే హిపోక్రసీ అనేస్తారేమో, కాదు! ఇవన్నీ అర్థమవుతూంటే అస్థిరత లేనిదెక్కద అని నిట్టూర్చి ముందుకు అడుగులు వేస్తూనే ఉంటాం.
జీవితం సౌకర్యవంతంగా, కోరుకున్నట్టు నిర్మించుకున్నా ఒక అసంతృప్తి, అశాంతి వెంటాడుతుంటే ఎందుకో అర్థం కాక లోలోపల నలుగుతూనే ఉంటాం. కానీ, జీవితంలో ఒక దశకు చేరాక, కుటుంబ బాధ్యతలను నెమ్మదినెమ్మదిగా తీర్చుకుంటూ తేలికపడ్డామన్న ఆలోచన వచ్చేసరికి మనసులో ఏళ్లుగా గూడుకట్టుకున్న స్వంత ఊరి మీద, స్వంత మనుషుల మీద బెంగ మళ్లీ మళ్లీ మనల్ని ప్రశ్నించి వేధిస్తుంటుంది.అయినవాళ్లకి ఇంతంత దూరంలో ఉండి ఎన్ని అరుదైన సందర్భాలను పోగొట్టుకున్నామో ఆలోచనకి వచ్చి మనసు మరింత కృంగుతుంది. ఆకాశం కప్పు కింద ఎక్కడున్నా, చుట్టూ ఎందరు స్నేహితుల్ని ఆత్మీయుల్ని పోగు చేసుకున్నా మనల్ని పెంచిన నేల, గాలి, నీరు ఇవి కావు, ఇక్కడవి కావు వెనక్కి వెళ్లిపోదాం అనే బలమైన కోరిక వస్తూనే ఉంటుంది.
కానీ, అప్పుడెప్పుడో నువ్వు విడిచి వచ్చిన నేల ఇప్పుడూ నీదిగా మిగలే ఉందా? కన్నవాళ్ళు, గారంగా పెంచినవాళ్లు ఇప్పుడున్నారో లేదో, నీతో గల్లీ క్రికెట్ ఆడి, క్లాసు రూం లో నీతోపాటు అల్లరి చేసిన మిత్రులు నిన్నింకా గుర్తుంచు కున్నారో లేదో! ఉన్నా, నీకోసం ఇంకా ఎదురు చూస్తుంటారా లేక నిన్ను పరాయివాడిని చేసేసుకున్నారా? ఏమో!?
ఇదిగో ఇలాటి ఒకరు దేశపు ఎల్లలు దాటి పరాయి గడ్డ మీద బతుకుతూ తను చూసిన, అనుభవించిన జీవితాల్ని కథలుగా అల్లారు.ఈ కథల పుస్తకం పేరు డోరేదార్. రచయిత మధు పెమ్మరాజు.ఇందులో పదహారు కథలున్నాయి. కథలు కావివి, జీవిత శకలాలు. సున్నితంగా, ఆర్భాటం లేకుండా చెప్పిన నిజాయితీ నిండిన కథలు. కొన్ని కథల్ని మాత్రం పరిచయం చేసి మిగిలినవి పాఠకులు చదివి అనుభూతించేందుకు వదిలి పెడతాను.
ఆఖరి మజిలీ – మిసెస్ జేమీ ఆండర్సన్ జీవిత చరమాంకంలో ఒంటరిగా ఇంట్లో మిగిలిపోయింది. ఇల్లు వదిలి ఆఖరి మజిలీగా ఒక సీనియర్ హోమ్ కి వెళ్లేందుకు ఒక క్యాబ్ బుక్ చేసుకుంది. తను వెళ్లవలసిన అడ్రస్ కాగితం క్యాబ్ డ్రైవర్ కి ఇస్తూ తనో రూట్ చెపుతుంది. ఆ రూట్ లో వెళ్తే చాలా ఆలస్యమవుతుండంటాడు అతను. దానికి సమాధానంగా తను వెళ్లే చోట ఎవరూ తనకోసం ఎదురు చూడట్లేదంటుంది. దారి పొడవునా తను చదువుకున్న స్కూలు, డాన్స్ నేర్చుకున్న స్కూల్, తను ఉద్యోగం చేసిన స్మిత్ కంపెనీ బిల్డింగ్, భర్తతో కలిసి ముఫ్ఫై ఏళ్ళు జీవించిన ఇల్లు – అన్నింటినీ నెమ్మదిగా చూస్తూ తలుచుకుంటూ, ఆగి ఆగి వెళ్తూ…బావిలో చంద్రబింబంలా తొణికిసలాడే జ్ఞాపకాలను తనివితీరా తలుచుకుంది జేమీ అంటారు రచయిత.కథ పూర్తయ్యేసరికి మనసు బరువెక్కుతుంది. ఎవరి జీవితమైనా ఆఖరి మజిలీ ఇంతేకదా అన్న సన్నని నిట్టూర్పు గొంతులో మిగిలిపోతుంది.
ఇనుపతెర జీవిక వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వలస వచ్చినా ఉద్యోగ అభద్రత వెంటాడుతూ, మనిషిని మరింత ఒత్తిడికి గురి చేస్తూనే ఉంటోంది. ఈ అనిశ్చితి కుటుంబ సభ్యుల మధ్య భౌతిక దూరాల్నే కాకుండా మానసిక నిశ్శబ్దాల్ని కూడా గూడు కట్టుకునేలా చేస్తుంటే, ఇలాటి జీవన శైలికి కారణాలేమిటి? బాధ్యులెవరు? దీనికి విరుగుడెక్కడ? ఉద్యోగుల్ని రక్తమాంసాలున్న మనుషుల్లా కాకుండా నిర్దిష్టమైన సమయానికి కచ్చితంగా ఫలితాల్ని మాత్రం పట్టుకొచ్చే మర యంత్రాల్లా చూసే కార్పొరేట్ వ్యవస్థకి కట్టుబడిపోయేలాటి పరిస్థితుల్ని తప్పించుకునే దారేదీ? బతుకు పోరాటం యాంత్రికమై తరుముతుంటే మనిషి మనిషిగా మిగిలేందుకు ఎంత కష్టమైపోతోంది! వర్తమాన జీవితాల కథ ఇది.
డోరేదార్ సంక్రాంతి సమయం -నేల మీద రంగురంగుల ముగ్గులు, ఆకాశంలో రంగురంగుల పతంగులు! ఱుతువు ఱుతువుకూ కొత్త సందడి చేసే ప్రకృతి మధ్య మనుషుల జీవితాలకి ఎప్పటికప్పుడు కొత్త శోభని అద్దే ఈ లోకం ఎంత అందమైనది! ఆకాశమంతా పల్టీలు కొట్టే పతంగులు, మాంజా నెమ్మదిగా ఒడుపుగా వదులుతూ మైదానాల్లో కేరింతలు కొట్టే పిల్లల హడావుడి చూడవలసిందే మరి. పతంగులంటే బాల్యానికే పరిమితం కాక, పెద్దరికాన్ని పక్కనబెట్టి పండుగ నాడు పిల్లలతో మమేకమైపోవటం అందరికీ అనుభవమే. రవి, చందులది పతంగ్ కొనుక్కోలేని ఆర్థిక పరిస్థితి. గన్నుగాడు ఎగరేసే ఖరీదైన రంగురంగుల డోరేదార్ ని చూసి ముచ్చట పడటం వరకే వాళ్ల పరిమితి.అది తెగి నేల వాలుతుంటే అందుకోబోయేంతలో ఎర్రబస్తీ జిల్లయ్య గుంపు స్వంతం చేసేసుకున్నారు. రవి, చందు స్వంతంగా తయారు చేసుకున్న పతంగ్ ఎగరనే లేదు, చేసేదేం లేక మైదానంలో హడావుడిని ప్రేక్షకులై నిశ్శబ్దంగా చూస్తున్నారు. వీళ్లని గమనించిన జిల్లయ్య క్రితం రోజు తనకి అందిన డోరేదార్ ని ఇచ్చేసాడు. రవి, చందుల ఉత్సాహం అందుకుని వాళ్ల చేతిలోని డోరేదార్ పైపైకి ఎగురుతోంది. పతంగుల పోటీలకి లౌడ్ స్పీకర్ లో కామెంటరీ చెప్పే గోవర్ధన్ వీళ్ల పేర్లేమిటో కనుక్కున్నాడు కూడా.
పాఠకుడిని బాల్యంలోకి తీసుకెళ్లిపోయే తియ్యని కథ. ఇలాటి పిల్లల కథలు పుస్తకంలో మరికొన్ని ఉన్నాయి.
ఫైండింగ్ డోరీ అందమైన మనుషులకి, అరుదైన కెమిస్ట్రీకి ఆ భార్యాభర్తలు పర్యాయ పదమనుకుంటాడు వాళ్లను చూసిన మిత్రుడు. ఏళ్లు గడిచాయి. ఆ భర్తకి భార్య కెరీర్ పరుగులు నచ్చట్లేదట. భార్యకి భర్త బయటి ఆకర్షణలు నచ్చట్లేదట. ఇద్దరూ తమ దారులు వేరువేరు అని నిర్ణయించుకున్నారు. కానీ వాళ్లని, వాళ్ల మధ్య గాలిలో కనిపించే వింత పరిమళాన్ని చూస్తూ కాస్తో కూస్తో అసూయ పడిన ఆ మిత్రుడు వాళ్ల మధ్య దూరాలు పెరగటాన్ని చూసి సహించలేకపోతాడు. అహం వాళ్లని మనసులు విప్పి మాట్లాడుకోనియ్యటం లేదన్నది గమనించాడా మిత్రుడు. తను వాళ్లనలా వదలకూడదని నిశ్చయం చేసుకుంటాడు. నేటి కెరీర్ పరుగుల్లో పరస్పరం సమయాన్నిచ్చుకోలేని ఎన్ని జంటల పరిస్థితో ఇది! ఒక్క పలకరింపు, ఒక్క మాట, ఒక చిరునవ్వు, కాసింత తమదైన సమయం ఇద్దరి మధ్య అందించలేని సందేశమేదైనా ఉంటుందా? జీవితాల్లో జొరబడిన అస్థిరత, పోటీ మనుషుల మధ్య బంధం మిగలకుండా చేస్తోంది. జీవితం మనది కదా అన్న ఒక్క ఆలోచన బాంధవ్యాల్ని సజీవంగా నిలపగలదేమో!
బౌండరీ దాటిన బాలు ఆరోక్లాసు చదువుతున్న జంగారెడ్డి కొత్త కార్కు బాలు తెచ్చాడు ఆ రోజు క్రికెట్ ఆటకి. తండ్రిని సతాయించి కొనుక్కున్న బాలు ఆరోజు ఆటలో ఎక్కడో ముళ్లపొదల్లోకి పోయింది. డ్యూటీ నుంచి తండ్రి తెలవారేక కానీ రాడని తల్లి సమచారం అందించటంతో ఊపిరి పీల్చుకుంటాడు. తల్లి పాలకోసం ఇచ్చిన రెండు రూపాయలు పట్టుకుని చెప్పాచెయ్యకుండా కోఠీలో కార్కు బాలు కొనేందుకు బస్సెక్కాడు. తీరా షాపు దగ్గర తండ్రి నేస్తం ఒకరు చూడనే చూసి పలకరించారు.బాలుతో సహా ఇంటికి చేరుకున్నాక అక్కడ తండ్రి తో పాటు ఎదురైన దృశ్యం జంగారెడ్డి ని వణికించింది. మల్లారెడ్డి మాత్రం తాను కోప్పడతాడని భయపడుతున్న కొడుకుని ప్రేమగా దగ్గరకు తీసుకుని, … “నా తీరుగ ప్యూను గావొద్దు, పెద్ద సారు లెక్క గావాల…” అంటాడు. ఎంత మంచి నాన్న! సున్నితమైన కథ!
నవ్వే ఏనుగు బొమ్మ కథ కూడా ఇలా పసివాళ్ల మధ్య జరిగే కథ.
ఎత్తరుగుల ఇల్లు ఆ ఇంటికి ఒక హోదా, ఒక గౌరవం ఉన్నాయి ఆ ఊళ్లో. రోజూ క్రమం తప్పకుండా అన్ని పేపర్లూ కొని, తన హోదాని పెంచుకుంటున్నాననుకుంటాడు రాయుడు, ఆ ఇంటి పెద్దాయన మనవడు. న్యూస్ పేపర్లో ఆసక్తికర కథనాలంటూ ఎవరెవరి గురించో రోజూ చూస్తూ తన పేరు, గొప్పదనం అలా ఒకరోజు పేపర్లో ఒక సెక్షన్ నిండా ఫోటోలతో సహా రావాలని ఆశపడతాడు. ఇంట్లో పెద్దవారి మాటని కొట్టిపారేసి వెంట తిరిగే కాలక్షేపం స్నేహితుల సలహాతో రకరకాల వ్యాపకాలు, వ్యాపారాలు మొదలెట్టి ప్రయోగాలు చేస్తాడు. మునసబు కూడా సాయం చేస్తాడు. తీరా, ఊరి మునసబు మంచివాడు, తను బావుంటే ఊరంతా బావుంటుందనుకునే అమాయకుడు. ఇదంతా ఎటు దారి తీసిందో, రాయుడి సరదా ఎలా పరిణమించిందో కథ చదవాల్సిందే. అన్నీ చెప్పేస్తే ఎత్తరుగుల ఇల్లు గౌరవం పోతుంది సుమా!
ఆడ్ జాబ్ – వాళ్లిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఎందరిలాగానో భవిష్యత్తు గురించి బోలెడు కలలు కన్నారు.పెద్ద చదువుల కోసం ధైర్యం చేసి అమెరికా బయలుదేరారు. కష్టపడేందుకు సిద్ధపడే వచ్చారు కనుక పక్కవారి అనుభవాలను వింటూ, చూస్తూ యూనివర్సిటీ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేసారు. ఆ మిత్రుల్లో ఒకరు చందు. తల్లిని విడిచి రాలేనని అమెరికా విమానం ఎక్కనన్న చందూ తల్లినే కాదు, ప్రపంచాన్నే వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కలలు కనటం మనిషి హక్కు అయినప్పుడు, వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం చెయ్యటం నేరం కాదుగా. కానీ, ప్రపంచం తోటి మనిషి పట్ల ఎందుకింత నిర్దయగా ఉంటోంది? మనిషికి మనిషి ఏమీ కాడా?ఎక్కడివీ శతృత్వాలు? ఎక్కడిదీ ద్వేషం? దీనికెక్కడ ముగింపు? జవాబు దొరికేలోపు ఎందరి జీవితాలు సమిధలై పోవాలి? అసలు జవాబు ఉందా?
రచయిత దేశం కాని దేశంలో కఠినమైన జీవితాల్ని పరకాయించి చూసాడు. అయినా తనలోని భావుకుణ్ణి మాత్రం అలాగే దాచుకున్నాడు. ఎంతటి సమస్యల్ని చూసినా తన సహజత్వాన్ని, సున్నితత్త్వాన్ని మాత్రం పోగొట్టుకోలేదు.కొన్ని వాక్యాలు అలా జ్ఞాపకం ఉండిపోతాయి. మచ్చుకి కొన్ని చెప్పకుండా ఉండలేను,
“కాల గమనంలో రోజూ మారే మజిలీలు, పెరిగే బాధ్యతల మధ్య వయసొక అంకెగా మారిపోతుంది.” (15 p)
“మాటల కంటే మౌనంగా సాగే సంభాషణ విస్తృతి ఎక్కువ…” (17)
“అయినా నడిచే పనిముట్లతో మాటలేమిటి?” (28)
“…పొడుగాటి చలి చీకటితో చేసే రహస్య మంతనాలకి అనువుగా ఉంది.” (45)
“ఆంజనేయస్వామి గుడి ఏడాదిలో ఓ వారం రోజుల వైభవానికి సంవత్సరమంతా వేచి ఉంటుంది. రెక్కలు రాగానే ఎగిరిపోయిన బిడ్డలు అతిథులుగా రావటం చూసి చూసి ఊరు మొద్దుబారిపోయింది.” (49)
“కిటికే తెరిస్తే…ఓ బుల్లిపిట్ట కొమ్మలకి హడావిడిగా పాఠాలు చెపుతుంది, అర్థమైనట్టు ఆకులు రాలటం…” (59)
“ప్రపంచం విశాలమయ్యే కొద్దీ మా మధ్య ఇరుకు పెరిగింది.” (79)
“బ్యాంకు బ్యాలన్స్ పెరగటం చూసి బిజినెస్ అంటే ఇంతేనా అనుకున్నాను. రానురాను…” (97)
పుస్తకం ముందుమాటలో పతంజలిశాస్త్రి గారు రచయితకు ఆకర్షణీయమైన కథన పద్ధతి ఉందని, కథను ఎక్కడ ముగించాలో తెలిసినవాడని అంటారు. పుస్తకం అట్ట వెనుక సాయి బ్రహ్మానందం గొర్తి మధు కథల్లో విశిష్టత కథను చెప్పటం కాక అక్షరాల్లో దృశ్యం చూపటం అంటారు. ఏ.వి. రమణమూర్తి సంక్లిష్టమైన భావనలని సైతం పొదుపైన తేలికపదాల్లో చెప్పే అరుదైన రచయిత మధు అంటారు.
రచయిత తను చూసిన ప్రపంచాన్ని, జీవితాల్ని చెప్పిన తీరు మృదువైనది. ఆయా సమస్యల గాఢతను ఎంతో సంయమనంతో చెప్పటం ప్రసంశించదగ్గది. రచయితకు అభినందనలు.
కవర్ డిజైన్ః సౌమ్య కల్యాంకర్
బుక్ డిజైన్ః అక్షర క్రియేటర్స్
పుస్తకం ముద్రణః శ్రీశ్రీ ప్రింటర్స్
ధరః రూ. 120/- $10
