విలువల సంఘర్షణ నుంచి ..
వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్
(ఈ నెల 30 న విడుదల కానున్న దాట్ల దేవదానం రాజు గారి కథా సంపుటికి ముందుమాట)
*********
అమరావతి కథలు మొదలుకొని యిటీవలి కలుంకూరి గుట్ట కథలు గరికపాటోడి కతలు వరకూ, మిట్టూరు, దర్గామిట్ట, పసలపూడి, భట్టిప్రోలు, ప్రళయకావేరి, వేములవాడ, ఉళెనూరు, పల్నాడు .. ప్రాంతం యేదైనా వొక ప్రాంతాన్ని కేంద్రం చేసుకుని వచ్చిన స్థానిక కథనాలంటే నేను చెవి కోసుకుంటాను. రచయితగా దాట్ల దేవదానం రాజు నాకలాగే పరిచయమయ్యారు. నిర్దిష్ట స్థల కాలాల్లోంచి చరిత్రను వర్తమానంతో ముడివేస్తూ ఫ్రెంచ్ పాలనకు వ్యతిరేకంగా యానాం ప్రజల పోరాటాలతో పాటు స్థానీయ సమాజానికి చెందిన అనేక పార్శ్వాలను నమోదు చేసిన ఆ కథలు రాజు గారి ప్రాతినిధ్య కథలుగా యెవరికైనా గుర్తుండిపోతాయి. ఆ తర్వాత ఆయనే రాసిన గోదావరి కథలు (కథల గోదారి) కూడా నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి. గోదావరి యానం యీ రెండూ ఆయన ఊపిరిలో ఊపిరి, ప్రాణంలో ప్రాణం అని నాకు అర్థమైంది. ఏళ్ళూ పూళ్ళూ గడిచినా నడిచినా యానాం గోదారి సాహిత్యంలో ఆయన్ని వదల్లేదు. ఆయన వదుల్చుకోదల్చుకోలేదు. ఇటీవలే వెలువడ్డ ‘లేళ్ల మెరక’ సంపుటిలోని కోరంగి వంటి కథలు అందుకు నిండైన నిదర్శనంగా నిలుస్తాయి. రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిస్తూ వస్తోన్న రాజు గారి కథా ప్రయాణంలో మీ చేతుల్లో వున్న యీ కొత్త కథ సంపుటి మరో చేర్పు. అందులోకి ప్రవేశించడానికి ముందు రెండు మాటలు. నిజానికి దేవదానం రాజు వంటి సీనియర్ సాహిత్యకారులకు ముందు మాటలు అవసరం లేదు. కానీ స్నేహశీలి అయిన ఆయన డిమాండ్ కాదనలేక ..
***
ఈ సంపుటిలోని చాలా కథలు స్వాతి వార పత్రికలో వచ్చాయి. నా అభిరుచి ఆసక్తుల కారణంగా వాటిని నేను యెట్టి పరిస్థితుల్లోనూ చదివి వుండేవాణ్ణి కాదు. ఇక్కడ చదివినప్పుడు దేవదానం రాజు యిన్ని రకాల కథలు యెలా రాశారా అని ఆశ్చర్యం కలిగింది. వీటిలో ప్రేమ కథలున్నాయి. కుటుంబ సంబంధాల్ని చర్చించే కథలున్నాయి. మానవ సంబంధాల్లో వస్తున్న మార్పుల్ని తెలిపే కథలున్నాయి. చుట్టూ వున్న మధ్యతరగతి జీవితాల్లోని ఆదర్శాలు వాటికి కలిగే విఘాతాలు వాటితో రాజీ పడుతూనో పోరాడుతూనో చేసే ప్రయత్నాలు .. ఇటువంటి వస్తువులు రాజుగారి ‘దృష్టికోణం’ నుంచి కథలుగా పరిణమించాయి. కథల్లో మనుషుల్లో మాయమోతున్న విలువలు పట్ల ఆరాటం కనిపిస్తుంది. వాటిని నిలబెట్టుకోవాలనే తపన వ్యక్తమౌతుంది. ఏదో వొక ఉపాధిని సమకూర్చుకొని జీవితాన్ని చేతనైన విధంగా వెళ్లదీయడంలో కొందరు నిలబడతారు. కొందరు జారిపోతారు. కొందరు పారిపోతారు. కొందరు నమ్మిన విలువల్ని పాటించలేక చతికిలపడతారు. కొందరు అంతు దొరకని పెనుగులాటలో చిక్కుకుపోతారు. ఈ ఘర్షణ ఒక్కోసారి ఆశ్చర్యం కలిగిస్తుంది. ‘నగ్న సందేశం’ కథలో హరికథ కళాకారుడు నారాయణదాసు వేసిన వేషాలు చూడండి. కళలో అతనికి గొప్ప నేర్పు వుంది. కానీ అతనికి తన వృత్తి పట్ల గౌరవం లేదు. కుటుంబ పోషణకి కూడా వుపయోగపడని కళ పట్ల అతనికి చిరాకు. చివరికి సంపాదనకి తెగబడి కూతుర్ని అర్ధ నగ్నంగా హరికథ చెప్పించడానికి అతను ప్రయత్నిస్తాడు. జీవితం మీద వొక రకమైన విసుగు తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించడంలో వైఫల్యం తన అసమర్థత పట్ల తెలీని కోపం కళని ఆదరించని సమాజం పట్ల అసహనం .. యిలా యెన్నో అంశాలు అతని విపరీత ప్రవర్తనకి కారణమై వుండొచ్చు. అతని వైఖరికి జాలిపడాలో కోపం వహించాలో తెలీదు. నిజానికి నికార్సైన కళాకారుడిగా బతకడం కూడా అతని చేతుల్లో లేదు. నడిచే దారినీ దారిలో అడుగుల్నీ శాసిస్తున్న నియంత్రిస్తున్న శక్తులేవో తెలీదు. ఆధునికత తెచ్చిన వైపరీత్యాల్లో పరాయీకరణకి గురికాని క్షేత్రం లేదు.
వ్యవసాయాన్ని నమ్ముకుని బతికాలని తాపత్రయపడే రైతు జీవితాన్ని వర్ణించిన రెండు కథలు కాలం – పొలం, తడబడని అడుగులు యిదే విషయాన్ని మరింత తేటగా స్పష్టం చేస్తాయి. 60 ల నాటి రైతు స్వతంత్రుడు. మరో అరవై యేళ్ళ తర్వాత యివ్వాళ్టి రైతు పరాధీనుడు. యంత్రానికో కార్పొరేట్ యంత్రాంగానికో బానిస. ఇప్పుడు వ్యవసాయంలో అరకల్లేదవు దమ్ముల్లేవు. ఊడ్పుల్లేవు ఊడ్పు పాటల్లేవు. కట్టేతలేదు పరిగెలేరటం లేదు. ఎద్దుల్లేవు ఎద్దు మెడలో మువ్వల్లేవు. అదిలించే కొరడాల్లేవు. మోత బండ్లు లేవు బండిలో ధాన్యం మూటల్లేవు. ధాన్యానికి గిట్టుబాటు ధరలేదు. ఆరుగాలం పంట లేదు. వాకిట పురికట్టటం లేదు ధాన్యం నిల్వల గోదాముల్లేవు. సేద్యగానికి పిల్లనిచ్చే మామ కూడా లేడు. భూమిని నమ్ముకోవటమా అమ్ముకోవటమా అన్నది పెద్ద మీమాంస. వ్యవసాయ జూదంలో రైతు అన్ని విధాలా పరాజితుడు. పంట భూములు రొయ్యల చెరువులయ్యాయి. లేదా పొలాలు రియల్ ఎస్టేట్ స్థలాలయ్యాయి. రొయ్యల మీసాలు యెక్కడో కూర్చొని మార్కెట్ ని శాసించే చైనా వాడి చెప్పు చేతల్లో వున్నాయి. స్థలాలు రాజకీయ రౌడీ వామన పాదం కింద యే దురాక్రమణకి గురౌతాయో తెలీని అభద్రత. వ్యవసాయం చిన్న జూదమైతే రొయ్యల చెరువులు పెద్ద జూదం. రియల్ ఎస్టేట్ బడా మాఫియా.
చివరికి యేవో కొన్ని ఆదర్శాల్ని వున్నతీకరించడాన్ని వుద్దేశించినప్పటికీ ఆధునికత వ్యవసాయ రంగంలో తెచ్చిన మార్పుల క్రమాన్ని రాజుగారు యీ రెండు కథల్లో చక్కగా పట్టుకోగలిగారు. అదే సందర్భంలో ప్రత్యక్షంగా సూక్ష్మస్థాయిలో కాలక్రమేణా వ్యవసాయ పద్ధతుల్లో వచ్చిన మార్పుల్ని ప్రధానంగా ప్రస్తావించినప్పటికీ పరోక్షంగా రైత్వారి జీవితంలో చోటుచేసుకుంటున్న సంక్షోభాన్ని కూడా చిత్రీకరించగలిగారు. పర్యావరణ వృత్తం లోపలికి పయనిస్తూ జీవావరణ కేంద్ర బిందువుని చేరుకున్నారు. ప్రకృతి మనుషుల మధ్య మనిషికీ మనిషికీ మధ్య మిగుల్చుకోవాల్సిన అనుబంధాల లోతుల్ని అందుకున్నారు.
ఇందులోని ప్రేమ కథల్ని మనోవైజ్ఞానిక కోణంలో అధ్యయనం చేయొచ్చు. ఆ సాహసానికి నేను పూనుకొను; కానీ నా దృష్టికి వచ్చిన వొకట్రెండు పరిశీలనలు ప్రస్తావిస్తాను. ‘ప్రేమైక బంధం’లో సుబ్బలక్ష్మి సుధాకర్ ల మధ్య వున్న ప్రేమలో భిన్న పార్శ్వాలున్నాయి. అతనిపై ఆమెకు, ఆమెపై అతనికి వున్న ప్రేమలోనూ దాని గాఢతలోనూ దాన్ని వ్వ్యక్తపరపరచడంలోనూ చాలా వ్యత్యాసాలున్నాయి. వాటిని శాసించే సోషల్ స్టిగ్మా మాత్రం నిరంతరాయంగా యిప్పటికీ కొనసాగుతూనే వుంది. సమాజం భౌతికంగా ఆధునికమైనప్పటికీ స్త్రీ పురుష సంబంధాలు పాత ముక్క వాసనల్ని వదిలించుకోలేకపోతున్నాయి. పాలకుల సాంస్కృతిక విధానాల ఫలంగా మనం వెనక్కి నడుస్తున్నాం.
‘మనిషి లోపలి నీడ’ కథ తిలక్ అద్దంలో జిన్నా కథని గుర్తుచేసింది. అయితే యీ కథలో సవ్యసాచి లాంటి నియంతలు మన కళ్ళ ముందు తిరుగాడుతున్నారు. మన జీవితాల్ని శాసిస్తున్నారు. వారి మూర్ఖత్వం వ్యక్తిగతమైన బలహీనత కాదు; దేశమంతా దాని ఫలితాల్ని అనుభవిస్తుంది. అగ్రరాజ్యాధినేతలకు అధికార మదం/ఆధిపత్య అహంకారం వంటి వైకల్యం ముదిరితే అది ప్రపంచశాంతిని హరిస్తుంది. యుద్ధాల్ని కొని తెస్తుంది. అప్పుడిక దేశభక్తి డ్రైనేజిలో మురుగులా పొంగిపొర్లుతోంది. ఫాసిజం ఆమోదం పొందడానికి దేశభక్తి బలమైన పరికరమోతుంది. మనలో అలా దేశభక్తి వెల్లువైనప్పుడు పాలకుల దోపిడీ నిరాటంకంగా సాగుతుంది. ‘మెత్తని కత్తి’ తో దే(శ)హంలోని ప్రతి అవయవాన్నీ ఖండఖండాలుగా కోసుకుపోతారు. దొంగ గారి మంచితనానికి మనం కూడా మురిసి ముక్కలౌతాం. పోనీ మనలో యెవరన్నా ‘యిదేంటి?’ అని ప్రశ్నిస్తే నేరం నీదే నోరుమూసుకుని పడుండు అని యెదురుదాడికి దిగుతారు.
దేశభక్తి గురించి యివ్వాళ మన పాలకులు అనుసరిస్తోన్న వ్యూహం యిదే. ఇప్పుడు వాళ్ళు దేశానికీ ధర్మానికి తేడాని చెరిపేశారు. దేశభక్తి రోజుకో కొత్త వుడుపులు ధరిస్తుంది. వివిధ సందర్భాలలో సమయానుకూలంగా పాలకులు దేశభక్తికి సొంత నిర్వచనాలు చెప్పుకుంటున్నారు. టీవీల్లో కవరేజి కోసం పేపర్లో ఫొటోల కోసం చీపుర్లు పట్టుకుని వీధుల్నిశుభ్రం చేయడం స్వఛ్చమైన దేశభక్తి. డిజిటిల్ ఇండియా, మేకిన్ ఇండియా అని శుష్క నినాదాల చాటింపు వేయడమే ‘అర్థ’ వంతమైన దేశభక్తి. భారతమాత చిత్రపటాలకు దండలేయడం, జై కొట్టమని నిర్బంధించడం కొందరికి దేశభక్తి అయితే సినిమా థియేటర్లలో బొమ్మ పడేముందు ‘జనగణమన’ గీతం వేయగానే నిలబడి గొంతెత్తి సెల్యూట్ చేయడమే యింకొందరికి నిఖార్సైన దేశభక్తి. ఆవు చుట్టూ ప్రదక్షిణలు చేయడం చాలామందికి అసలు సిసలైన దేశభక్తి. వీటిల్లో యేది కాదన్నా వారంతా దేశద్రోహులే అంటాడు వొకాయన. రాజ్యాంగ బద్ధులమై ప్రవర్తిస్తామని ప్రమాణం చేసిన సభ్యులు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జై శ్రీరాం అని నినదించడం యివ్వాళ అదుపులేని దేశభక్తి వ్యక్తీకరణకి పరాకాష్ట రూపమైంది. ప్రజలంతా తమకు విధేయులుగా వుండడమే నేటి పాలకులు చెబుతున్న నిజమైన దేశభక్తి. వారి పాలసీలతో విభేదించడం విచారణకి తావులేని రాజద్రోహం. దేశద్రోహం. కోట గుమ్మాలకి తలలు వేలాడదీసిన రాచరికం కాలపు పద్ధతుల్నే మరింత క్రూరంగా అమలవుతోంది. విదేశాల్లోని భారతీయుల్లో దేశభక్తి పొంగిపొర్లడానికి గానీ లోపించడానికి కానీ కారణాలు వెదికిన ‘దేశభక్తి కావలెను’ కథని యీ కోణం నుంచి చూసినప్పుడు అసలు రహస్యం అర్థమౌతుంది. అప్పుడు దేశభక్తి వొక విలువగా కాకుండా వొక రాజకీయ భావజాలంగా వొక యెత్తుగడగా విశ్వరూపంలో సాక్షాత్కరిస్తుంది.
మనిషి లోపలి నీడ లాగే – టోపీ, మెత్తని కత్తి కూడా రాజకీయ కథలే. టోపీలో చొప్పించిన వ్యంగ్యం, మెత్తని కత్తి లో నిర్వహించిన హాస్యం ఆ కథల ముగింపు దగ్గరకి వచ్చేసరికి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలు ఆడుతున్న నాటకాలపై గంభీరమైన విమర్శగా పరిణమించడం గమనిస్తాం. పతంజలిలా దేవదానం గారు బ్లాక్ కామెడీని ముందుకు తీసుకెళ్లవచ్చు అని యీ కథలు హామీనిస్తాయి.
ఈ సంపుటిలోని కథల్లో వెనకటి తరానికి చెందిన ఆదర్శవాదులున్నారు. కొత్తతరపు అవకాశవాదులున్నారు. వారి మధ్య విలువల సంఘర్షణ వుంది. అదే యెక్కువ భాగం కథల్లో అంతస్సూత్రమేమో! అయితే కథల్లోని పాత్రలన్నీ వాస్తవ జీవితంలో తన చుట్టూ వున్న ప్రపంచంలో తాను చూసినవే అని రచయిత తన మాటలో ప్రస్తావించారు. కళ్ళముందు జరిగే అన్యాయాల్ని సూటిగా యెదుర్కొనే నారాయణ (అట్లా అని పెద్ద బాధా ఉండదు), నరసింహం (పసిడి సంతకం) మన సమాజంలోనే యింకా జీవించే వున్నారని తెలిసి గొప్ప సాంత్వన పొందుతాం. అలాగే ‘వాగ్దాన పరిమళం’లో త్రికాలాల్లోనూ ఇచ్చిన మాటకి కట్టుబడే మూడుతరాల వ్యక్తుల్ని చూసినప్పుడు మనిషితనం పట్ల కొత్త భరోసా లభిస్తుంది. తన కథల ద్వారా రచయిత ఆశించిన ప్రయోజనం కూడా అదేనేమో!
***
‘మెదడు మోకాళ్ళలో’ వంటి వొకట్రెండు ప్రతీకాత్మక కథల్లో తప్ప కథా నిర్మాణంలో దేవదానం గారిది నిరాడంబరమైన సాదాసీదా శైలి. అనవసరపు ప్రయోగాల జోలికి ఆయన పోరు. కథని సూటిగా చెప్పడమే ఆయనకు యిష్టం. స్టేట్ మెంట్ తో మొదలై స్టేట్ మెంట్ తో ముగిసే కథన ప్రక్రియ చాలా కథల్లో కనిపిస్తుంది. కొన్ని కథల్లో పాత్రల వున్మీలనంలో కొంత వైరుధ్యం గోచరిస్తుంది. అందువల్ల కొన్ని కథలు ప్రాథమిక స్థాయిలోనే వున్నాయి. ఆ విషయం ఆయనకు తెలుసు. కానీ ‘రాసినవన్నీ ఒబ్బిడి చేసుకోవాలనే ఉద్దేశం’తోనే యీ సంపుటి తయారైంది. ఆ పరిమితుల నుంచే యీ కథల్ని చూడాలి.
కొన్ని ముద్రలు బలంగా ఉంటాయి. పాత ముద్రల్ని చెరిపివేయాలంటే కొత్త ముద్ర మరింత బలంగా వుండాలి. నా మట్టుకు నాకు దేవదానం రాజు యానాం కథల రచయిత అని బుర్రలో పడ్డ ముద్ర యిప్పటికీ చెరిగిపోలేదు. చదివి మీరు చెప్పండి.
పుస్తకం నా కారణంగా ఆలస్యమైనందుకు మన్నించమని రాజుగారిని కోరుతూ ..
హైదరాబాదు, మప్పిదాలతో
10. 10. 2024 ఎ. కె. ప్రభాకర్
