గాంధీజీ వ్యక్తిత్త్వాన్ని కళ్ళకు కట్టే ‘బాపు – నా మాతృమూర్తి’

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్

**********

మను బెహన్ గాంధీ వ్రాసిన ‘Bapu – My Mother’ అన్న పుస్తకానికి శ్రీ చింతకుంట్ల సంపత్ రెడ్డి చేసిన అనువాదం‘బాపు – నా మాతృమూర్తి’. గాంధీజీకి మునిమనవరాలి వరసైన మను బెహన్ అసలు పేరు మృదుల.

1946 సెప్టెంబరులో హిందూ-ముస్లింల మధ్య సామరస్యం కోసం గాంధీజీ నౌఖాలిలో పర్యటించినప్పటి నుండి, గాంధీజీ మరణించేంత వరకూ మను బెన్ ఆయనతోనే ఉన్నారు. ‘గాంధీజీ చేతి కర్ర’గా పిలబవడ్డ మను బెహన్ గాంధీజీ తన అనుభవాలను గుజరాతీ భాషలో ‘భావ్‍నగర్ సమాచార్’ అనే పత్రికలో ధారావాహికంగా రాశారు. వాటిని చిత్రా దేశాయ్ ఆంగ్లంలోకి అనువదించారు. ఈ వ్యాసాలే 1949లో ‘Bapu – My Mother’ పేరిట పుస్తక రూపంలోకి వెలువడ్డాయి. ఈ పుస్తకంలో 14 వ్యాసాలున్నాయి. 

మొదటి వ్యాసం ‘బాపు – నా మాతృమూర్తి’లో గాంధీజీ ఒక తల్లిలా తనకి ఏమేం నేర్పారో చెప్పారు మను బెహన్. కస్తూర్బా మరణించాకా దుఃఖంలో ఉండిపోయిన మను బెహన్‌కి కర్తవ్య బోధ చేస్తూ ఉత్తరం రాశారు గాంధీజీ. చదువు ఎంత అవసరమో ఆమెకి వివరిస్తారు. పాశ్చాత్యుల నుంచి నేర్చుకోవాల్సిన అనేక మంచి విషయాలను వదిలేసి, వస్త్రధారణ, అలంకరణల వంటి అక్కరలేని విషయాలను నేర్చుకుంటున్నామని అంటారు బాపూజీ. బాహ్యసౌందర్యం కన్నా పవిత్రతతో కూడిన ఆత్మసౌందర్యం ముఖ్యమని చెప్తారు. బాపుజీ ఉత్తరం ద్వారా – తల్లి ప్రేమని తిరిగి పొందినట్లు మను బెహన్ భావించారు.

త్యాగనితరి పరిపూర్ణం ఎలా అవుతుందో ‘త్యాగానికి అర్థం’ అనే వ్యాసంలో వివరించారు. మనుకి భగవద్గీత బోధిస్తూ, “మనమంతా ‘నేను’ అనే అహంకారం వదిలిపెట్టేవరకూ, మన త్యాగం సంపూర్ణం కాదు. అసలు సిసలు త్యాగం అంటే నేను, నాది అనే రెండింటిని పూర్తిగా త్యజించగలగడం” అని బాపూజీ చెప్పారు. సరైన ఆలోచనా విధానం ఉంటే, ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోవచ్చని చెబుతారు. సేవాభావం అలవర్చుకుంటే, త్యాగమూ అలవడుతుందని గాంధీజీ అంటారు.

“బి.ఎ., ఎమ్.ఏ. వంటి క్లాసుల్లో కూడా దొరకనంత జ్ఞానాన్ని ఈ గొప్ప గురువు నాకు ప్రసాదించారు” అన్నారు మను బెన్ ‘భగవద్గీత పాఠాలు’ వ్యాసంలో. డిగ్రీ అనేది ఓ బరువని, నిర్మాణాత్మక పని దేశానికి అత్యవసరమని బాపూజీ అంటారు. అసలైన చదువు, నిజమైన సేవ అంటే ఏమిటో గాంధీజీ వివరించారు. పాశ్చాత్యుల్ని గుడ్డిగా అనుసరిస్తే, వినాశనం వైపు వెళ్తామనీ, భారతీయ సంస్కృతికి దీటైనది మరేదీ లేదని గాంధీజీ అంటారు. “ఎంతటి విమర్శ నైనా, తేనె కలిపిన నీరు సేవించినట్లుగా స్వీకరిస్తారు” అన్నారు మను బెహన్.

మనకు అవసరం లేని వాటిని వాడుకోవటం హింసతో సమానమని గాంధీజీ మను బెహన్‍కి  అర్థమయ్యేలా ఎలా చెప్పారో ‘దుబారా ఖర్చు హింసాత్మకమైనది’ అన్న వ్యాసం చెబుతుంది. క్రిక్కిరిసిన రైలులో తనకోసం మను చేయించిన ప్రత్యేక ఏర్పాట్లకు బాధపడిన బాపూజీ, తర్వాతి స్టేషన్‍లో స్టేషన్ మాస్టర్‌ని పిలిపించి, తను ఉన్న ఆ బోగీలోని రెండో గదిని మెట్లపై వేలాడుతున్న ప్రయాణీకులు కేటాయించమని చెప్తారు. గాంధీజీ సూచన మేరకు ఆ రైలుకి కొత్త బోగీని జోడించారు. ఈ ఉదంతం ద్వారా – జీవితంలోని సౌకర్యాలను.. వీలయినంత తక్కువగా వినియోగించుకోవాలనే పాఠం మను బెన్‍కి నేర్పారు.

చెప్పిన సమయానికి అనుకున్న పని మొదలుపెట్టకపోవడం గాంధీజీకి నచ్చేది కాదు. ఓ రోజు ఉదయం ఏడు గంటలకి ప్రారంభమవాల్సిన పాదయాత్ర మను బెహన్ వల్ల ఐదు నిమిషాలు ఆలస్యమవుతుంది. తన ఒక్కడిదే కాకుండా, వేచి ఉన్న 500 మంది యొక్క ఐదు నిమిషాల సమయాన్ని దొంగిలించినట్టే అని మను బెహన్‌ని మందలించారు బాపూ. అర పేజీ నిడివి మాత్రమే ఉన్న చిన్న వ్యాసమైనా ‘సమయపాలన’ చక్కటి సందేశమిస్తుంది.

ఒక కఠిన పరీక్ష ద్వారా, అవసరమైన ప్రతిదాని పట్ల ఎంత శ్రద్ధగా ఉండాలనే పాఠాన్ని మను బెన్‍కు నేర్పారు గాంధీజీ. ఆ కఠిన పరీక్షలో ‘రామనామ స్మరణ’ తనకెంతో ఉపయోగపడిందని మను బెహన్ ‘పరీక్ష – పాఠం’ అనే వ్యాసంలో చెప్పారు.

తాను ఏదైనా నవ్వులాటకి అన్నా కూడా, అందులో అంతరార్థం ఉంటుదని మను బెన్‍కి చెప్పారు గాంధీజీ. దేశసేవలో గాంధీజీకి ఎన్నో పనులున్నా, తనకు బోధించే పనిని ఆయన ఇష్టపడేవారని మను బెహన్ ‘పిసినారి బాపు’ అనే వ్యాసంలో చెబుతారు.

పరిసరాలను శుభ్రం చేయడం తనకెంతో సంతోషమో గాంధీజీ ‘పారిశుద్ధ్య ప్రేమికుడు’ అనే వ్యాసంలో చెప్పారు. నౌఖాలీలో తానే స్వయంగా పరిసరాలను శుభ్రం చేయడం ద్వారా రెండు విధాలుగా మంచి జరిగేలా చూశారు బాపూ. ఒకటి తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులు గ్రహించారు, రెండు ఇకపై గ్రామన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామని గాంధీజీకి మాట ఇచ్చి, దాన్ని నిలబెట్టుకోవడం! పారిశుద్ధ్యం పని తనకెంత సంతృప్తినిస్తుందో గాంధీజీ ఈ వ్యాసంలో తెలిపారు.

ఆమ్కి అనే ఊరిలో గాంధీజీ అస్వస్థతకి గురవుతారు. డాక్టర్ సుశీలని పిలించాలనుకుంటారు మను బెహన్. తన అనారోగ్యానికి చికిత్స రామనామ జపమేనంటారు బాపూజీ. “రాముడే నిజమైన డాక్టర్. నా సేవలు అవసరమైనన్ని రోజులు రాముడు నేను బ్రతికి ఉండేట్టు అనుగ్రహిస్తాడు” అని . ‘రామనామం’ అనే వ్యాసంలో అంటారు. హనుమంతుడు జపించిన శ్రద్ధగా, హృదయపు లోతుల్లోంచి రామనామాన్ని జపించాలని మను బెహన్‍తో అన్నారు గాంధీజీ.

“భగవంతుడు నీలాగా లంచానికి లొంగడు” అని గాంధీజీ ఏ సందర్భంలో మను బెన్‍తో అన్నారో ‘చిన్న విషయాల ప్రాముఖ్య’ అనే వ్యాసంలో తెలుస్తుంది. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అనే సామెత లోని మరో అర్థాన్ని మనుకి వివరించారు గాంధీజీ ఈ వ్యాసంలో.  వర్తమానాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో – కవి లలిత్ రాసిన ఓ భక్తి గీతం ద్వారా మను బెన్‍కి విశదం చేశారు బాపూ.

తానుండబోయే ఓ గుడిసెని రాజభవనమని బాపూ ఎందుకన్నారో తెలియాలంటే ‘నిరాశ్రయులు’ వ్యాసం చదవాలి. 1946 లోనే మడిచిపెట్టగల గుడిసెని రూపొందించారు గాంధీజీ అనుచరుడు సతీష్‌బాబు. కానీ గాంధీజీ కేవలం ఒకే ఒక పూట మాత్రమే ఆ గుడిసెని ఉపయోగించారు. ఆ గుడిసెను ఆయన వినియోగించలేదో చదివితే బాపూజీ గొప్పతనం కళ్ళకు కడుతుంది. ఈ వ్యాసంలో రవీంద్రనాథ్ టాగోర్ కవితకి ‘ఒకడవే పదవోయ్’ అనే పేరిట బాలాంత్రపు రజనీకాంతరావు గారి అనువాదాన్ని వాడేరు. గ్రామీణులతో ఎలా మమేకమవ్వాలో గాంధీజీ ఈ వ్యాసంలో తెలిపారు.

తన మీద నిజంగా ప్రేమ ఉంటే, తాను చెప్పినట్లు చేయమని దేవీపూర్ గ్రామంలో ఓ నాయకుడికి కాస్త కఠినంగా చెప్తారు గాంధీజీ. ఆ ఉదంతం గురించి ‘ఖరీదైన పూలమాలలతో స్వాగతం’ వ్యాసంలో చదవవచ్చు. ఈనాటి రాజకీయ నాయకులు, వారి అనుచరుల హంగామాకి ఇది చెంపపెట్టు లాంటింది.

స్వాతంత్ర్యం వచ్చాకా, నౌఖాలీలో శాంతిని స్థాపించగలిగినందుకు తనని అభినందిస్తే, “ఏ వ్యక్తైనా ఒక్కచేత్తో ఏం చేయగలడు? నన్ను ఒక్కడినే మీరు అభినందిస్తున్నారు. మీ అందరి సహకారం వల్లనే ఈ విజయం సాధ్యపడింది” అన్నారు గాంధీజీ ‘అసాధారణ విజయం’ వ్యాసంలో. ఆయన వినమ్రత ఎంత గొప్పదో అర్థమవుతుంది ఈ వ్యాసం ద్వారా! అపరాధభావనతో ఉన్న ఒక వ్యక్తికి మున్ముందు అతని ప్రవర్తన బావుండేవిధంగా అతనిపైనే బాధ్యత మోపడం గాంధీజీ ఆలోచన అని చెప్తారు మను బెహన్.

బాపూజీ, సర్దార్ పటేల్ మధ్య బంధం ఎంత తీయగా ఉండేదో ‘మహత్తరమైన బాపు జన్మదినాలు’ వ్యాసం చెబుతుంది. గాంధీజీపై పటేల్ గారు వేసిన హస్యపు చెణుకు పాఠకుల పెదాలపై నవ్వుని పూయిస్తుంది. రామనామ జప ప్రభావాన్ని ఈ వ్యాసంలోనూ గాంధీజీ నొక్కి వక్కాణించారు.

~

మహాత్ముని వ్యక్తిత్వాన్ని, జీవనాదర్శాల గురించి సరళమైన శైలిలో చక్కగా వివరించిన ఈ చిన్ని పుస్తకం ఏకబిగిని చదివిస్తుంది. అనువాదకులు చింతకుంట్ల సంపత్ రెడ్డి గారికి అభినందనలు.

***

‘బాపు నా మాతృమూర్తి’ అనే పుస్తకాన్ని హైదరాబాద్‍కి చెందిన టాల్‍స్టాయ్ ఫాం లెర్నింగ్ సెంటర్ ప్రచురించింది. పేజీలు: 42. వెల: ₹ 40/-. ప్రతులకు ఫోన్‌: 9849501696

కొల్లూరి సోమ శంకర్ 

You Might Also Like