అమర్ హార్ట్
వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ
*********
మనిషి సంఘజీవి అయినా వర్తమాన సమాజంలో వ్యక్తిగతమైనది మాత్రమే ప్రాముఖ్యత కలిగి ఉందన్నది కంటెదుట కనిపిస్తున్న నిజం. సంఘం మనకు మంచీ చెడూ పంచుకునే తోడునిచ్చేందుకు కావాలి. కానీ కేవలం బలాన్ని, భద్రతనీ మాత్రమే కోరుకుంటూ, అంతవరకే మనకి సమాజంతో నిమిత్తం అన్నట్టు జీవితాలు గడిచిపోతున్నాయి. మనకు అన్యాయం జరిగినపుడు గొంతెత్తుతాం. అందరినీ కూడగట్టు కుందుకు ప్రయత్నిస్తాం. ఆనక మరెవరితోనూ పనిలేదు. వ్యక్తిగతమైన పని ఉంటేనే ఆ వ్యక్తి, వ్యక్తుల వరకూ మన సంబంధం కొనసాగుతుంటుంది.
ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా ఉన్న మన దేశంలో పేదరికం, నిరక్షరాస్యత మధ్య బతికే ప్రజానీకం కూడా పెద్దదే. వారి దైనందిన జీవితాల్లో ఉండే అవసరాలు, కష్టాలు ఎవరికి పడతాయి? ఎవరికి వారు తమ జీవన పోరాటంలో నిమగ్నమైపోయుంటారు. అయినా తోటివారి కోసం, ముఖ్యంగా అనేకానేక సమస్యల మధ్య బరువైన జీవితాల్ని గడుపుతున్న పేదవారి కోసం కొందరైనా శ్రమిస్తున్నారన్నది అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది. అలాటి ఒక వ్యక్తి రాసిన పుస్తకాన్ని గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
దాదాపు రెండేళ్ళ క్రితం స్నేహితురాలు శశికళను కలిసేందుకు అనంతపూర్ వెళ్ళాను. అక్కడున్న రెండు రోజులు ఆమె అద్భుతమైన వ్యక్తులు కొందర్ని పరిచయం చేసింది. వారిలో ఒకరు తరిమెల అమరనాథ్ రెడ్డి.
ఇక్కడొక ఆసక్తికరమైన విషయం చెప్పుకోవాలి. ఒకే పేరు కలిగిన వ్యక్తులు ఎందరో ఉంటారు. వారిలో మనదైన గుర్తింపు తెలియాలంటే మన ఇంటిపేరును చెపుతుంటాం. అమరనాథ్ రెడ్డి పేరులో ఉన్న ఇంటిపేరు ఆయనది కాదు. అది ఆయన ఊరిపేరు. తన ఇంటిపేరును పక్కన పెట్టి తరిమెల ఇంటిపేరుగా చేసుకుని ప్రపంచానికి పరిచయం అవటానికి ఒక గొప్ప కారణం చెపుతారాయన.
అన్నట్టు ఆయన్ని పలకరిస్తే గలగలమంటూ కబుర్లు చెపుతారు. అవన్నీ సమాజాన్ని అతి దగ్గరగా చూసిన తన అనుభవాలు. వాటికి హాస్యాన్ని జోడించి జీవితాన్ని తేలిక పరిచేలా చెప్పటమన్నది ఆయన అలవాటు. ఆ అనుభవాలు పేదల జీవితాలతో వారికున్న అక్కర. అదేమిటో తెలుసుకోవాలంటే వారి కుటుంబ నేపథ్యం తెలుసుకోవాలి. ఆయన పుట్టి పెరిగిన కుటుంబం, పరిసరాల ప్రభావం ఆయన జీవనవిధానంగా మారింది.
పిల్లలను సమాజం పట్ల బాధ్యులుగా మలిచి, నిజాయితీగా బతికేలా చేసే గొప్ప అవకాశం చుట్టూ ఉన్న పెద్దలదే. పెద్దవాళ్ళ ప్రవర్తన, వాళ్ళు పంచుకునే అనుభవాలు పిల్లల మీద గాఢ ముద్ర వేస్తాయి. కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టి, సమాజం కోసం చేసే పోరాటాల మధ్య నిత్యం జీవించే కుటుంబ సభ్యుల మధ్య పెరుగుతూండే సమయంలోనే అమరనాథ్ రెడ్డికి కులమతాల పట్ల, ధనికపేద వర్గాల మధ్య ఉండే అంతరాలు, వివక్ష అర్థమయ్యాయి.
రచయిత ముందుమాటలో తాను మొదలుపెట్టిన రక్తదాన కార్యక్రమానికి సహకరిస్తున్న ఎందరో గొప్ప మనసులను గురించి ప్రస్తావించారు. వీరికి అనేక అవార్డులు వచ్చాయి. వాటిలో ప్రతిభా రాజీవ్ పురస్కార్ (2004) కూడా ఒకటి.
అనంతపురం కరువు జిల్లాగా పేరుపొందినా అక్కడ ప్రాణాలు కాపాడే రక్తానికి మాత్రం కరువు లేదంటారాయన. హేతువాద సంఘంలో రక్తదాన కార్యక్రమానికి బీజం పడిందంటారు. అది 1994లో జనవిజ్ఞాన వేదిక రక్తదాతల సంస్థ. అదే 1995 లో మమత గానూ, ఆ తర్వాత 2001లో మానవత గానూ పెరిగింది. ఈ కార్యక్రమం ఏదో పుణ్యకార్యంగా కాక సామాజిక బాధ్యతగా, శాస్త్రీయ దృక్పథంతో చేపట్టడం వల్ల రక్తదాన ఉద్యమమైందంటారు. ఈ ఉద్యమంలో అన్ని వర్గాలను, మతాలను ఏకం చేసి అందరినీ కూడగట్టుకోగలిగారు. ఉదాహరణకి హిందు, ముస్లిం పండుగ సందర్భాలలో హిందు, ముస్లిం యువకులతో రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.
వారి మాటలకి ప్రభావితులై రక్తదానాన్ని తమ వంతుగా చేస్తున్న కొందరి అభిప్రాయాలు ముందు పేజీల్లో ఉన్నాయి. ఉదాః
“సార్, నేను విజయభాస్కర్, బ్లైండ్ టీచర్ని. గుడ్డివాళ్ళం ప్రతిపనికీ ఇతరుల సాయం మీద బతికే మేము కూడా ఏమైనా సాయం చేయగలమా అంటే రక్తదానం అన్నది కూడేరులో మీటింగ్ లో మీ మాటలు విన్నాక అర్థమైంది. సమాజాన్ని మనసుతో చూడటం నేర్పారు. జనవరి 4వ తేదీ లూయీ బ్రెయిల్ పుట్టినరోజు సందర్భంగా మా బ్లైండ్ అసోసియేషన్ తరఫున రక్తదాన శిబిరం నిర్వహిస్తాండాం. మీరు రావల్ల.” (2000- కక్కలపల్లి కాలనీ)
“అయ్యా, ఇంటికి పోతాంటయ్యా, నీగొంతు యినపడతానే కుచ్చుండానయ్యా. ఆరుగంటలు నీ మాటలు యిన్నానయ్యా. ఈ కాలేజీలో ఎన్నో మీటింగ్ లు జరిగినాయయ్యా, పేదోన్ని గురించి ఒక్కడు మాట్లాడలేదయ్య. నువ్వు మాట్లాడిన ప్రతి మాటా పేదోన్ని గురించే. నీ మాటలు యింటాంటే నాకే రక్తం యియ్యల్లనిపిస్తాందయ్య.” (సాయిబాబా సింగ్, వాచ్మన్, బాలశివ డిగ్రీ కాలేజీ, కర్నూలు – 2001)
“సార్ నేను సద్దాం బాషా, యంగ్ మెన్ ముస్లిమ్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రెటరీ. యిన్నాల్లు మమ్మల్ని రాజకీయ నాయకులు రౌడీలుగా వాడుకున్నారు. యింగ అట్ల బతకదల్చుకోలేదు సార్. మీ మాటలు విన్నాను నిన్న. యింగనుంచి మీతో కలిసి పనిచేస్తాను సార్. (సద్దాం బాషా, రెయిన్ బో హోం, అనంతపురం – 1996)
“సార్, మీ పరిచయం కాకుంటే యిప్పటికి ఎక్కడో, ఎప్పుడో అగ్యాతంగా ఎన్కౌంటర్ అయ్యిండేవాన్ని. మీ ఆలోచనల వల్ల నా వ్యక్తిత్వం ప్రభావితమైంది. ఫిరా జాతీయ అవార్డు వచ్చింది. లండన్ మ్యాగజైన్ లో నా పేరు వచ్చింది. (సలీం మాలిక్, కోకన్వీనర్, మానవత – 2003)
“సార్ నీవు నాకు యిచ్చింది రక్తం కాదు సార్ ప్రాణం. అందుకే నిన్ను ఎప్పటికీ మర్చిపోకూడదనే నా కొడుక్కు అమరనాథ్ అనే నీపేరు పెట్టుకుండాను సార్.” (2004 – ఈశ్వరయ్య, బ్రాహ్మణపల్లె)
“అమరనాథ్ రెడ్డి అంకుల్ పరిచయం నా జీవితానికి గొప్ప మలుపు. సంపాదనే ధ్యేయంగా సమాజాన్ని మరిచిపోతున్న నేటితరం యువత వ్యక్తిత్వ వికాసానికి మానవీయ విలువలు, సామాజిక స్పృహ పెంచే మానవత అనుభవాలు ఎంతో అవసరం. ఆయన స్ఫూర్తితోనే గత ఆరు సంవత్సరాలుగా రక్తదాన సంస్థ కన్వీనర్గా స్వయానా రక్తదానం చేస్తూ ప్రస్తుతం లెక్చరర్ గా విద్యార్థులను చైతన్యం చేస్తున్నా. (నవీన్ కుమార్, నగరి, ఎం. టెక్.)
ఇవన్నీ చెప్పాక ఈ పుస్తకంలో ఉన్నదేమిటో చెప్పవలసిన పనిలేదు.
యువతను చైతన్యపరిచి రక్తదానం అవసరాన్ని చెప్పి, వాళ్ళను ఆ దిశగా కర్తవ్యోన్ముఖుల్ని చేసేందుకు అమరనాథ్ రెడ్డికి అనేక కాలేజీలకు వెళ్ళటం అలవాటు. అలా ఎక్కడికెళ్ళినా తనను తాను తరిమెల అమరనాథ్ రెడ్డి గా పరిచయం చేసుకుంటారు. రేడియో ఇంటర్వ్యూలో కానీ ఒక ఆహ్వాన పత్రికలో కానీ తనపేరు ముందు కేవలం తరిమెల ఇంటిపేరుగా మాత్రమే ఉండాలని పట్టుపడతారు.
(తరిమెల నాగిరెడ్డి కమ్యూనిస్టు విప్లవోద్యమ అగ్రనాయకుల్లో ఒకరు. వారు అనంతపురం జిల్లా తరిమెల గ్రామంలో 1917లో పుట్టారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి, పీడిత ప్రజల విముక్తి కోసం సమసమాజ స్థాపనకోసం తన సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి.)
తనను పరిచయం చేసుకున్నప్పుడు తరిమెల ఊరి పిల్లలు తామూ అదే ఊరునుంచి వచ్చామని సంతోషంగా పరిచయం చేసుకుంటారని అమరనాథ్ రెడ్డి చెప్తారు.
పెద్దలైతే “మీరు తరిమెల నాగిరెడ్డి కొడుకా సార్. మేం ఆయన్ని చూసినాం. ఆయన మాటలు విన్నాం. మీలో ఆ స్పిరిట్ ఉంది.” అని నమస్కరిస్తారట. తరిమెల నాగిరెడ్డిగారి పై వారికున్న గౌరవమే దానికి కారణమంటారు. తరం మారినా నాగిరెడ్డిగారి పట్ల ప్రజలు చూపే ప్రేమాప్యాయతలు తనను తన ఇంటి పేరును తరిమెల గా మార్చుకునేలా చేసాయంటారు. నాగిరెడ్డి లాటి నేపథ్యమున్న తాను అట్టడుగు వర్గాల కోసం సేవ చేసేందుకు తనవంతుగా రక్తదానాన్ని ఎంచుకున్నానంటారు అమరనాథ్ రెడ్డి.
250 పేజీల పుస్తకంలో 38 ఆసక్తిరమైన పేర్లతో అధ్యాయాలున్నాయి. రచయిత ‘మానవత’ రక్తదాన ఉద్యమంలో వివిధ వ్యక్తులతో తానెదుర్కొన్న అనుభవాల్ని గురించే పుస్తకమంతా చెప్పారు.
రోజూవారి దినచర్యగా గవర్నమెంటు ఆసుపత్రిలో జనరల్ వార్డులో తిరుగుతూ పేద రోగులకు అవసరమైన రక్తాన్ని ఉచితంగా ఏర్పాటు చేసే పనిని నిబద్ధతతో చేస్తున్న అమరనాథ్ రెడ్డి అనంతపురంలోనూ, చుట్టుపక్కల ఎన్నో గ్రామాల్లోనూ ప్రాణాల్ని కాపాడే రక్తాన్ని అత్యవసరంగా ఏర్పాటు చెయ్యగలిగేందుకు తనతో పాటు వెనుక పెద్ద సైన్యాన్ని తయారుచేసుకున్నారు. ముఖ్యంగా కళాశాలలకి వెళ్ళి అక్కడి యువతలో చైతన్యం కలిగించటం, వారందరికీ బ్లడ్ గ్రూపింగ్ చేయించటం వంటి పనులలో నిమగ్నమైపోయుంటారు.
ఆయన్ను వెన్నంటి ఉండే సలీం మాలిక్ కథ కూడా ఆసక్తికరమైనది. సమాజాన్ని తుపాకీతో మార్చాలని నమ్మిన సలీం అమరనాథ్ రెడ్డి మాటలతో, చేతలతో ప్రభావితుడై, సమాజాన్ని ప్రజా చైతన్యంతోనే మార్చగలమన్న సత్యాన్ని కనుగొన్నాడు. ఆ మార్పు సలీం కు లండన్ మ్యాగజైన్ లో పేరు వచ్చేలా చెయ్యటమే కాక ప్రేమానంద్ అవార్డును తెచ్చిపెట్టింది.
ముందుమాటలో రెయిన్ బో నిర్వాహకులు సద్దాం బాషా చెప్పిన మాటల్ని చూసాం. ఆయన అమరనాథ్ రెడ్డి ద్వారా ప్రభావితుడై తన జీవిత విధానాన్ని మార్చుకున్నారు. 2002 లో గుజరాత్ లో జరిగిన మతకల్లోలాల్లో దెబ్బతిన్న ముస్లిం మైనారిటీలకు యాక్షన్ ఎయిడ్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న పునరావాస కేంద్రాల్లో స్వచ్ఛంద సేవకుడుగా సద్దాం ఎనిమిది నెలలు సేవ చేసారు. 2003లో ప్రిన్స్ ఛార్లెస్ చేతుల మీదుగా ఇన్ విజిబుల్ హీరో అవార్డు తీసుకున్నారు. రెయిన్ బో హోం అనే ఆర్ఫనేజ్ స్థాపించి అనంతపురంలోనూ, చుట్టుపక్కల తల్లిదండ్రులు లేని అమ్మాయిలను చదివిస్తూ, వివిధ స్కిల్స్ నేర్పిస్తూ వారంతట వారు తమ కాళ్ళపై నిలబడేలా కృషి చేస్తున్నారు.
ఇవన్నీ ఈ పుస్తకం చెప్పే కబుర్లు. ఇవి ప్రపంచానికి తెలియాల్సి ఉంది.
సమాజంలోని పీడిత పేద ప్రజలను తనవాళ్ళను చేసుకుని తనవంతుగా పని చేస్తూ మరింతమందికి స్ఫూర్తినిస్తూన్న వ్యక్తి వర్తమాన సమాజంలో మన కళ్ళముందున్నారు. వీరి ద్వారా చైతన్యవంతులై సమాజం కోసం నిలబడగలిగే యువశక్తిని తయారు చేసుకోవటమే మనముందున్న బాధ్యత.
ఈ పుస్తకాన్ని పరిచయం చెయ్యటంలో ముఖ్య ఉద్దేశం ఇదే.
ఇలాటి విలువైన జీవితాలు మరింతమందికి తెలియాలి. చైతన్యం కలగాలి. రకరకాల ఆకర్షణలకు లోనవుతూ జీవితాన్ని కేవలం అనుభవించి, ఆనందించేందుకే అనుకుని తప్పుదారి పడుతున్న యువశక్తికి దీపధారులు ఎందరో ఉన్నారు అమరనాథ్ రెడ్డి వెనుక. ఈ పుస్తకం నిండా వారే.
ప్రశ్నించే గుణం ఉన్న అమరనాథ్ రెడ్డి అన్యాయాన్ని చూస్తూ ఊరుకోరు. ఎవరికీ భయపడరు. సరైన కారణానికి ఎవరినైనా ప్రశ్నించే ధైర్యం యువతలో కావాలి. కేవలం తమ జీవితాలు, తమ విజయాలు మాత్రమే కాక మంచి మనుషులుగా ఎదగాలన్నదే పుస్తకం చెపుతున్న ఆదర్శం. అది ఆదర్శం లా కాక అలవాటుగా చేసుకున్న అమరనాథ్ రెడ్డి ని మీరు అనంతపురం ప్రభుత్వాసుపత్రి జనరల్ వార్డులో తిరుగాడటం నిత్యం చూడవచ్చు. అనంతపురం వెళ్ళినప్పుడు ఆ పెద్దాయన్ని పలకరించటం మరచిపోకండి. ఎలాటి సమయంలోనైనా, ఏ గ్రూపు రక్తం కావాలన్నా నిస్సందేహంగా వారికి ఫోన్ చేయండి. అంతా ఉచితమే సుమా.
పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి జీవిక కోసం ఒక ప్రింటింగ్ ప్రెస్ ను పెట్టుకున్న అమరనాథ్ రెడ్డి ఎలాటి లౌల్యాలకు లోబడకుండా నిజాయితీగా పనిచేసి ప్రెస్ మూతపడేలా చేసుకున్నారు. ప్రెస్ నడిచినన్నాళ్ళు కూడా అది రక్తం కావాలంటూ వచ్చే జనంతోనే కిటకిటలాడుతుండేది. అధికారం, హోదా చూపి రక్తం కావాలంటూ ఆదేశాలివ్వబోయిన వారిని ధైర్యంగా ఎదుర్కొన్న సందర్భాలు, అలాటివారిని మార్చిన తీరు కూడా పుస్తకం చెపుతుంది.
అమరనాథ్ రెడ్డి తాను రచయితను, కవిని కాను అంటూనే అమర్ హ్యూమర్, అమర్ హార్ట్, అమర్ టాక్స్, సుపుత్రుడు, టైం పాస్ వంటి అనేక పుస్తకాల్ని రాసారు. సమాజానికి ఏ వ్యక్తైనా తన వంతుగా ఏదైనా చెయ్యాలని, ఇవ్వాలని కోరుకునే అమరనాథ్ రెడ్డి తన కొడుకు ఇదే వారసత్వాన్ని అందుకునేలా పెంచారు. శ్రీమతి శాంత భర్త ఆశయాన్ని, మనసును అర్థం చేసుకుని, కొండంత అండలా అమరనాథ్ రెడ్డి వెనుకనే ఉన్న వ్యక్తి.
అన్నట్టు వీరంతా మనమధ్య వర్తమాన ప్రపంచంలోనే ఉన్నారు! భవిష్యత్తు ఎంత నిబ్బరంగా కనిపిస్తోంది!
పుస్తకం చదివితే అమరనాథ్ రెడ్డి స్ఫూర్తితో జీవితాల్ని మలుచుకున్న మరెందరో పరిచయమవుతారు.
ప్రచురణః 2020
వెలః రూ. 100/-
ముద్రణః ది ప్రింట్ షాపే, హైదరాబాద్
