నేనొక పూలరెమ్మనై…ఒక పరామర్శ
వ్యాసకర్త: రాయదుర్గం విజయలక్ష్మి
******
“సరసముగాగ పద్యములు చక్కగ నల్లెడువాడు – గుండెతో
స్వరములు నింపు శారదకు సన్నిహితంబగు మాటకాడు – తొం
దర పడకుండ కావ్యరస నామక వాక్సుధ గ్రోలువాడు – సో
దరుడగు జ్యోతివాసున కుదారత కల్గుత కీర్తిభాగ్యముల్”
“నిరతము స్వేచ్ఛగా సురధునీ మృదుభంగతరంగ పాళిపై
మురిసెడు రాజహంసమును బోనున పెట్టినవార లెవ్వరో!
సరసకవీంద్రు బట్టుకొని సాధుపరిష్కరణంబులంచు క
త్తెరపని అప్పగించిన సుధీమణులెవ్వరొ! వారికీ నతుల్”
…. ఈ రెండు పద్యాలు చాలు ఈ గ్రంథ రచయితను గూర్చి తెలుసుకోవడానికి. ఇంతకూ ఈ పద్యాలు రాసినకవి శ్రీయుతులు బులుసు వెంకటేశ్వర్లు. పై గ్రంథకర్త శ్రీయుతులు ఉన్నం జ్యోతివాసు. ఒకరు మధుర కవి. మరొకరు ప్రసన్న కవి. దాదాపు పదిసంవత్సరాల తరువాత తన స్వీయ కవితా సంపుటిని ప్రచురించడానికి ప్రేరణనిచ్చిన బులుసు వారికీ కావ్యాన్ని అంకితమిచ్చి, తన ఋణాన్ని తీర్చుకున్నారు ఉన్నం వారు. ఇరువురూ ‘సాహితీసిరికోన’ సభ్యులు కావడం, పద్యకవులే కావడం, సిరికోన భారతికి వన్నె తెచ్చే అంశం.
“నీదు మంత్రంబులో ఓ దివ్య శబ్దమై/తరియించ వలయు నా తరళవాక్కు” అంటూ కల్పవృక్షపు పత్రాలమీద కమ్మనైన గాథలను, గీతులకట్టి కవనమును పాడుదును..” అంటూ తన ‘హృదయ గీతి’ ని వినిపించిన ఉన్నంవారి మూడవ పద్యకావ్యము ‘నేనొక పూల రెమ్మనై’ అన్న ఈ ఖండకావ్య సంపుటి, మొత్తం 36 ఖండికలతో (373 పద్యాలతో), ప్రతిభావంతంగా వివిధాంశాలను స్పృశిస్తూ , చదువుతున్న వారి మదిని దోచుకుంటుంది. పద్య పాఠాలను నేర్పిన గురువులనుండి, గాంధీ, బ్రౌన్ వంటి నాయకులస్తుతులొకవైపు, సన్మానితుల అభినందనలొకవైపు, కవి, కవిత్వలక్షణాలొకవైపు, జాతి జీవనానికి పట్టుగొమ్మలైన సాంస్కృతికాంశాలొకవైపు, సామాజికాంశాలలో లోటుపాటులస్మరణ మరొకవైపు…..వెరసి మొత్తం సమాజాన్ని కళ్ళముందుంచే ఖండకావ్య సంపుటి ఈ రచన!
ఈ కావ్యానుశీలనలోకి వెళ్ళేముందు, ఉన్నం వారిని గురించి తెలుసుకోవలసిన కొన్ని అంశాలను స్పృశించడం అవసరమని భావిస్తున్నాను! తెలుగు సాహితికి ఉపాయనంగా వీరిచ్చిన తొలికానుక, 2003 లో రాసిన ‘ఎర్రరెప్పలు’ కావ్యం. హరివంశములోని, కంసుని జన్మవృత్తాంతాన్ని గ్రహించి, మాతృవాత్సల్యానికి ప్రాధాన్యమిస్తూ సాగిన ఆ రచన ద్వారా, “కావ్యభావనలో ప్రాచీనాధునిక లక్షణాలు సంగమింపజేస్తూ, కావ్యమంతటా పండువెన్నెలవంటి పద్యచ్ఛందోభి మానం ప్రకాశించేలా కవిత్వం చెప్పగలిగిన కవి”(వి.వి.యల్. నరసింహారావుగారు) అన్న ప్రశస్తిని పొందిన వీరు మరో రెండు పద్య కావ్యాలను (ఆరాధన, నేనొక పూలరెమ్మనై), ఒక వ్యాస సంపుటిని(ఆరామము), ఒక విమర్శ గ్రంథాన్ని (శబ్దశిల్పి దీపాలవారి భారతీ వరివస్య),మూడుకావ్యాలకు సంపాదకత్వం{(సారంగధర చరిత్రము(జితకాశి వ్యాఖ్య), దీపాలవారి కావ్యావళి, విష్ణూప దశావతార స్తవము (దీపాల వారి వ్యాఖ్య)}తో బాటు, తొమ్మిది కావ్యాలను పరిష్కరించి,విపులమైన పీఠికలతో వెలువరించారు.ఇందులో, కంకంటి నరసింహరాజు గారి రచన, ‘విష్ణుమాయావిలాసం’ అన్నకావ్యం తాళ పత్రాలనుండి, పరిష్కరింపబడగా, తక్కిన ఎనిమిది కావ్యాలు రెండు, మూడు ప్రతులను పరిశీలించి సరైన పాఠ నిర్ణయం చేసినవి కావడం గమనార్హం! ముఖ్యంగా కంకంటి పాపరాజు తమ్ముడు అయిన కంకంటి నరసింహరాజు (16వ శతాబ్ది పూర్వార్ధం) చింతలపూడి ఎల్లన కృత విష్ణుమాయానాటక పద్యకావ్యాన్ని, పుష్పగిరి తిమ్మన సహాయంతో, ప్రౌఢమైన ద్విపద కావ్యంగా రచించాడు. 1865 లో ప్రచురింపబడిన ఆ కావ్యానికి పునర్ముద్రణలులేవు. వ్రాతప్రతులు కూడా లేవు. శబ్దరత్నాకరకర్త ఈ కావ్యాన్ని ప్రామాణికంగా గ్రహించి పలు ప్రయోగాలను గ్రహించారు. వేటపాలెం, సారస్వతనికేతనం లో జీర్ణావస్థలో నున్న ఆ ద్విపద కావ్యాన్ని సంస్కరించి, విపులమైన పీఠికతో 2011లో తిరుమలతిరుపతి దేవస్థానం వారి ఆర్ధిక సాయంతో వీరు పునర్ముద్రించారు. ఇప్పుడు మనకు, వ్యాసప్రారంభంలోని రెండు పద్యాల భావం సుగ్రాహ్యమవడమే కాదు, ఉన్నం వారి గాఢమైన ప్రవృత్తి కూడా అవగతమవుతుంది.
కావ్యం పేరు “నేనొక పూలరెమ్మనై” అని చదవగానే, విరబూసిన పువ్వులతో, తెమ్మెరల ఊయలలో అలవోకగా ఊగుతూన్న పూలరెమ్మ ఒకటి కనులముందు సాక్షాత్కరిస్తుంది. శీర్షికలోనే అద్భుతమైన భావచిత్రాన్ని చిత్రిక పట్టిన వీరు, తన ఈ కావ్యం, గాంధేయవాద క్షేత్రంలో విరబూసిన మొక్క అంటారు. ఆంగ్లేయుల పాలనకు అహింసతో చరమ గీతం పాడిన గాంధీ మహాత్మునిపదసీమను ప్రేమతో తానొక పూలరెమ్మనై అలంకరిస్తానని చెప్పికొన్నారు కవి. నేపథ్యం గాంధేయవాదమైనా, యీ కావ్యంలో వర్తమాన సమాజం ప్రతిఫలిస్తూన్నది. కవిత్వ లక్షణాలు, సామాజిక నీతులు, స్మృతి ఖండికలు, కాలం గూర్చిన చింతనలు, సంస్కృత శ్లోకాలకు, ప్రాకృత గాథలకు అపురూపమైన అనువాదాలతో కూడిన వీరి పద్యాలు, గొప్ప భావుకతతో, ఆర్ద్రతతో, రసోచితమైన లలిత, ప్రౌఢ పదబంధాలతో, అద్భుతమైన ఊహా శాలిత్వంతో కూడిన ఈ పద్యాలను చదివినపుడు, కవిత్వ ధారకు ఛందస్సు అడ్డుపడదన్న సత్యం, మరొకసారి నిరూపితమవుతుంది .
“మాతృమూర్తి యెడల, మాతృభాషయెడల /శుభ్రమైన ప్రేమను జూపువాడు/ ఇరుగు పొరుగు వారి నింపుగా ప్రేమించు/ అదియే దేశభక్తి, అదియే శక్తి..(పుట:76)”అని ధృడంగా నమ్మిన వీరు, “…శాంత్యహింసలతో సుప్రసన్నయగుచు, ప్రత్యహమలరుగాత! నా భరతమాత!” అంటూ భరతమాత స్తుతితో కావ్యాన్ని ప్రారంభించారు. చండశాసనుడైన సార్వభౌముని పుర్రెయందు నేడు పులి నీరు గ్రోలుచుండె… అంటూ కాల ప్రభావాన్ని చెబుతూ, ఏకకాలంలో ఆనంద దుఃఖాంబువులను కనిపింపజేయగల కాల శక్తికి నమస్కారములర్పించెదన్ (పుట: 24)… అంటూనే, కాల క్షణికత్వాన్ని గుర్తించడంతో బాటు, దానిపట్ల సానుకూల దృక్పథాన్ని కూడా చూపుతారు. గింజను మట్టిలో పూడ్చినపుడు, అది అంత్యక్రియ కాదు. బంగారును అగ్నిలో కాల్చినపుడు కూడా అది శిక్షకాదు, అంటూ, గింజ మొలకెత్తి భువిని పచ్చదనంతో అలంకరిస్తుందని, కాల్చిన బంగారం మెరుగులీనుతుందని, చెబుతూ,
“కత్తి పోటు వోలె ఎత్తిపొడుపు తాకి
నపుడు నీవు చచ్చినట్లు కాదు
నెత్రు చమురు చేసి నిశిత సంకల్ప సూ
ర్యు వెలిగించినట్టు లుజ్జ్వలముగ”
(సంకల్పము. పుట: 74)అని తనను తాను ఓదార్చుకుంటారు. ఒక పనిలో ఎన్నో విమర్శలను ఎదుర్కోవలసి రావొచ్చు! ఎటువంటి విమర్శలనైనా తట్టుకొని, అక్కడినుండి ఎదిగినపుడే, వ్యక్తి అయినా, కవి అయినా, సమాజమైనా రాణించగలదు అన్నఉపదేశం మనలను ఆలోచింపజేస్తుంది .
కవిత్వం గురించిన వీరి భావాలు గమనింపదగినవి. ఎంత ఆలోచించినా కొంత కూడా అర్థం కాకుంటే, అది కవిత్వం కాదని, కొంత యోచింపగనే జగమంతయు చూపించు శక్తి గలదే అసలైన కవిత్వమని వీరి ఉద్దేశం. ప్రౌఢ భావాలను చెప్పినా, వాటికి ఉచితమైన శబ్దాలనే వాడాలని, పీడిత వర్గాన్ని స్పృశించడం, వసుధైక భావనతో నిండి ఉండటం(కవి-కవిత, పుటలు: 34&35), అన్నిటి పట్ల, అందరిపట్ల సమత్వాన్ని చూపేదే మంచి కవిత్వమని వీరి నిర్వచనం. “కాటియందు పలు ఉగాదులు సృష్టింప, సతతమున్ శ్రమించు స్రష్ట అని, సంఘంపు దిశ మార్చెడు ఉపదేష్ట (పు:33) అని వీరు కవికి ఇచ్చే నిర్వచనం.
వీరి కవిత్వంలో ప్రధాన రసం కరుణ! తనకు తెలుగు పద్యం పై మక్కువను పెంచిన తన గురువు మరణానికి చలించి స్మృతికావ్యాన్ని రాయడంలో మాత్రమే కాదు, సమాజంలోని అసమానతలను ప్రశ్నించడంలోనే కాదు, కాల క్షణిక స్వభావాన్ని గుర్తించడంలోనే కాదు, ప్రతి చోటా కరుణరసప్లావితంగా వీరి రచన సాగుతుందనడం నిర్వివాదాంశం! “కాల జలధియందు కదలు మహానౌక, జల సమాధి అయినట్లు, పోడిమెరుగనట్టి భూకంప మందొక మధుర శిల్పవాటి మడిసినట్లు(పు:21)గా ఉన్నదంటూ, తన గురువు మరణానికి చింతించడం, చదువుతున్న మన ఎదను కూడా తడుపుతుంది. “కనుల యందు ఎన్ని కన్నీటి వీణియ/లొలుకుచున్న ఉలుకుపలుకు లేక/ నేర్పు మీరుచున్న నీ మౌన భాషకు/ వ్యాకృత క్రియలను వ్రాయుచుంటి” (పు:94)అంటూ తన గుండె పువ్వుకన్న కోమలమని, కష్టాలను తట్టుకొనే శక్తి లేనిదని ….అనడం వంటివన్నీ కరుణ రస ప్రతీకలే! అన్నపు ముద్దకోసం అవనిలో ఇంకుతున్న చెమట బిందువు, కామాంధుని చేతిలో చితికిన కుసుమంబు, కులమతాల వైషమ్యాలమధ్య తెగిపోయిన కుత్తుకలు, చెదిరిపోయిన మట్టి….(పు:32) వంటివన్నీ కరుణరస వాహికలే!
చరాచర ప్రకృతినుండి మనం నేర్చుకోవలసినవెన్నియో ఉన్నాయని వీరి నమ్మకం. చీమల నుండి ఐకమత్యాన్ని నేర్చుకోవలసిన లక్షణంగా మనమూ గుర్తిస్తాం! కాని వీరు చీమలనుండి , చెమటను చిందించు శ్రమను, శ్రమ ఫలాన్ని రక్షించుకొనే చతురతను, లక్ష్యశుద్ధితో శ్రమించడాన్ని, ఫలితాన్ని సమంగా పంచుకోవడాన్ని, న్యాయబద్ధంగా బ్రదకడం, భేదభావం లేక సమత్వంతో జీవించడం, పరిశుద్ధమైన మనసును కలిగి ఉండటం, మహత్తరమైన జ్ఞాన సంపాదన పట్ల అభిలాష, ధీప్రభాకరమైన కార్యశీలతవంటి ‘పర్సనాలిటీ’ తో బాటు, అక్షయమైన ఐకమత్యము, కృషి, దీక్ష, పట్టుదల, తాలిమి, ప్రేముడి, చేతనత్వం వంటి లక్షణాలను కూడా చీమలనుండి మానవులు నేర్చుకోవలసిఉందని చెబుతారు. అంతేకాదు, “నీదు విద్యుక్తధర్మమ్ము నీవె తప్ప/అన్యఫలితాలకెన్నండు ఆశపడవు/బ్రతుకు పోరులో విజయమ్ము బడసి, బడసి/పూతమై నడచు భగవద్గీతవీవు”(చీమ, పుటలు: 55-59) అనడంలోఫలితాలపై గాక కర్తవ్య నిర్వహణ పట్ల అవగాహన అవసరమని చెబుతారు కవి.
విభిన్న అంశాలను తడవిన ఖండిక ‘ఉచ్ఛిష్ట భారతము’(పుటలు: 75-81) భారత దేశ ప్రశస్తి మొదలు పాకిస్తాను, చీనా దేశాల వరకుగల విషయాలను స్పృశిస్తూ , నేటి నాగరికత మనిషిలో తెచ్చిన మార్పులను,పోటీ ప్రపంచం, మనిషిని క్రూరజంతువుగా మార్చివేస్తున్న నేపథ్యాన్ని, ఒకనాడు ప్రపంచానికే ఆదర్శంగా వెలిగిన భారతంలో నేడు వచ్చిన మార్పులను, చెప్పే ఈ ఖండిక ఒక ప్రకీర్ణక పరిచ్చేదం వలె సాగిన రచన. “హృదయభూములందు ప్రేమవనము లెండి/గుండె ఒక ఎడారి కొలిమియయ్యె/ప్రేముడులు నశించి ద్వేషానలములతో/ మండుచున్నవాడు మనిషి నేడు“(22)అనే పద్యం, నేటి తరం లోని మార్పును, ప్రాచీన సాంస్కృతిని పట్ల అభిమానాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ‘పెండ్లి’ (పుటలు: 25.26) అన్న ఖండికలో, “గణితశాస్త్రమందు కానరాని సూత్రమ్ము/ జీవిత గణితమ్ము చెప్పునట్టి/మహితమంత్రమదియెమంగళసూత్రమ్ము…” అనడం, పసుపు దారపు పోగులతో, రెండు చిత్తములను గట్టిగా కట్టివైచు, హైందవుల ధార్మిక సూత్రము లెంత గట్టివోఅనడం భారతీయ సంస్కృతిపట్ల వీరికి గల గౌరవానికి ప్రతీక!
ఈ కావ్య సంపుటికి తలమానికం అనదగిన మూడు అంశాలు గమనింపదగినవి. మొదటిది, తరువోజ పద్యాలతో సాగిన ఒక ఖండిక రచన! అద్దంకి శాసనంలో తొలిసారిగా తరువోజ కనిపించిందంటూ, ఆ పద్య లక్షణాలను, ప్రాచీన తెలుగు సాహిత్యంలో తరువోజ ఛందస్సును వాడిన, తిక్కన, నన్నెచోడుడు, ఎర్రన, శివకవులు, కొంత విరామం తరువాత కనిపిస్తున్న యీ ఛందస్సును వాడిన, గోపీనాథ వెంకయను, ఆధునికుడైన శ్రీపాద కృష్ణమూర్తి గారిని పేర్కొంటూ సాగిన ఈ ఖండిక కవి ప్రతిభకు నిదర్శనం. ఏడంటే ఏడు పద్యాలలో, తెలుగు సాహిత్యంలో ఈ ఛందస్సు ఎంతవరకు వాడబడినదో తెలుపుతూ సాగిన యీ ఖండిక, అపురూప మైన ఛందస్సుల పట్ల కవికున్నఅభిమానానికి కూడా గుర్తు!
సంస్కృత శ్లోకాలకు, ప్రాకృత గాథలకు వీరొనరించిన సరళసుందరమైన అనువాదాలు కూడా గమనింపదగినవి. భోజరాజు ఒకసారి, ధారానగరం రాచవీధిలో వెడుతుండగా, ఒక జవ్వని బంతిని ఎగిరెగిరి కొడుతూ, ఆడుతూ ఉందట. ఆమె చెవికి అలంకరించికున్న కలువపువ్వు జారి క్రిందపడిందట! ఈ మనోహర దృశ్యాన్ని వర్ణించమని భోజుడు కోరగా, భవభూతి, వరరుచి, కవికులగురువు కాళిదాసు చెప్పిన మూడు శ్లోకాలను వీరు అనువదించిన తీరు, వీరి శేముషికి గుర్తు! ఉదాహరణకు ఒక అనువాదాన్ని చూద్దాం!
శ్లో: “పయోధరాకార ధరోహి కందుకః /కరేణ రోషా దాభిహన్యతే ముహుః/ ఇతీవ నేత్రాకృతి భీతాముత్పలం/స్త్రియః ప్రసాదాయ పపాత పాదయోః” అన్న కాళిదాసుని రసరమ్య శ్లోకానికి వీరి అనువాదం:
చ. తన చను రూపు దాల్చెనని తన్వి మహోగ్రము తోడ కందుక
మ్ము నహ! పదేపదే భువినిముట్టగ గట్టిగ కొట్టుచుండుటన్
గని కనురూపు నున్న చెవి కల్వయు తప్పదు శిక్ష ఎంతయున్
తనకని కావుమంచు ఎలనాగ పదాల పయింబడెన్ కడున్
(పు:106) అన్న వీరి పద్య భావం సుగ్రాహ్యమే!
జయవల్లభుని(క్రీ.శ. 750-850 ప్రాంతం) వజ్జాలగ్గం ప్రాకృత సాహిత్యంలో ప్రసిద్ధమైన గాథాసంకలనం. 795 గాథలున్న వజ్జాలగ్గమ్ లోని 14 గాథలను, జయవల్లభము (పుటలు: 89-92)పేర అనువదించారు.
“కడలి యందు బుట్టె, కంజాక్షు రాణికి/తమ్ముడయ్యె, శివుని తలనె ఎక్కె/నయిన చంద్రుడు పదియారు కళల కోలు/పోయినపుడు నూలుపోగు కోరు”
శుక్ల విదియనాడు, కనపడీ కనపడని దశలో నున్న చంద్రునికి వస్త్రాంచలము నుండి తీసిన నూలుపోగును సమర్పిస్తారు. పాలకడలిలో పుట్టినా, లక్ష్మీదేవికి సోదరుడయినా, శివుని శిరస్సుకు అలంకారమైనా చంద్రునికి ఇలా సమర్పించే ఆచారం వలననే, చంద్రునకొక్క నూలుపోగు అన్న సామెత వచ్చిందన్నది కవి వ్యాఖ్యానం. వజ్జాలగ్గమ్ లోని ప్రతి గాథ, బహువిషయ సమన్వితం, భావబంధురం అన్న కవి మాటకీ గాథ చక్కటి ఉదాహరణ!
అందమైన భావుకతతో, సందర్భానుసారంగా లోకోక్తులను, వాడుతూ, సాగిన వీరి ఈ కావ్యాన్ని గురించి చెప్పుకోవాలంటే పతిపద్యము, ఒక రసరమ్యగీతికే! ప్రతి పద్యము ఉటంకింపదగినదే!వారి మాటల్లోనే చెప్పాలంటే,
“అంతలోనే అంబరాలకు రివ్వుమని ఎగసే పై చూపు/ అంతలోనే అంతరాలకు త్ర వ్వుకొనిపోయే లోచూపు” గల కవిత్వ తత్త్వంతో,కూడిన మానవతా పరీమళాలను ప్రపంచానికి పంచిన కవిత్వ సంపుటమీ “నేనొక పూల రెమ్మనై” అన్న పద్య కావ్యం అనడం అక్షర సత్యం!
•••••••••
