నవీన అనుభవం – ‘A’ చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ కథలు
(త్వరలో రాబోతున్న చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ గారి కథల పుస్తకానికి రాసిన ముందుమాట)
*****
పదిహేడవ శతాబ్దిలో ఒక రోజు. అమెరికాలో బోస్టన్ నగరం చెరసాల ఎదురుగా ఉన్న ఒక బయలులో, నేరస్తులను ఉరి తీసే వేదిక ముందు పురజనులంతా గుమిగూడి ఉన్నారు. వేదికపైన ఉన్న యువతి వంక వారంతా అసహ్యంతో చూస్తూ, ఆమెను ఛీత్కరిస్తూ కోపంగా మాట్లాడుకుంటున్నారు. చేతిలో మూణ్ణెల్ల పాపని పెట్టుకుని నుంచున్న ఆ అందమైన యువతి ఈ కోలాహలమంతా తనకు పట్టనట్లు స్థిరంగానూ ధైర్యంగానూ నుంచుని ఉంది. ఆమె పేరు హెస్టర్ ప్రిన్. ఆమె వక్షస్థలాన్ని కప్పుతున్న నల్లని బట్టల పైన సింధూరవర్ణంలో మెరిసిపోతున్న ‘A’ అనే అక్షరం, పెద్దగా, చుట్టూతా బంగారు జరీతో, ప్రత్యేకంగా స్పష్టంగా కనిపిస్తుంది. భర్త ప్రవాసంలో ఉండగా వివాహేతర సంబంధం పెట్టుకుని గర్భవతి అయింది హెస్టర్ ప్రిన్. ఆమెను చెరసాలలో ఉంచి, ఆ పాప తండ్రి ఎవరో చెప్పమని ఎంత బలవంత పెట్టినా ఆమె నోరు విప్పలేదు. వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఆ నగరపు న్యాయాధికారులు ఆమెకు విధించిన శిక్ష – ఆమె ఆ వేదికపై అందరకూ కనిపించేటట్లు మూడు గంటల పాటు నుంచోవాలి. తన శేష జీవితమంతా తన వక్షస్థలం మీద ఆ ‘A’ అనే సింధూర వర్ణపు అక్షరాన్ని ధరించాలి. A అన్న అక్షరం ఆమె adultress (అడల్ట్రెస్ – జారిణి, స్వైరిణి ) అన్న సంకేతం.
19వ శతాబ్దంలో బహుళ ప్రచారం పొందిన తొలి నవలలలో ఒకటైన The Scarlet Letter, (ద స్కార్లెట్ లెటర్, రచయిత – నథేనియల్ హాథోర్న్; ప్రచురణ 1850) లోని ప్రారంభ సన్నివేశం ఇది. మతము, సంఘము, కట్టుబాటు, ప్రేమ, వివాహము, నైతికత, నిజాయితీ, బాధ్యత, ఆత్మ విశ్వాసము వంటి అనేక విషయాలను స్పష్టంగానూ, ప్రతీకాపూర్వం గానూ చర్చించిన ఈ నవల ఇప్పటికీ అమెరికన్ సాహిత్యంలో ముఖ్యమైన నవలగా, సమకాలీన జీవితానికి కూడ ప్రాసంగికతగల నవలగా భావింపబడుతూ ఉంది.
ఇప్పుడు ఈ సంగతి ఎందుకంటారా? ఈ సంకలనానికీ, ఇందులో మొదటి కథకీ రచయిత పెట్టిన శీర్షిక ‘A’. ఈ విలక్షణమైన పేరు నన్ను ఆకర్షించింది. ఈ రచయిత కథలు నేను ఇంతకు ముందు చదవలేదు. కథ పేరు చూసి ఏదో కొత్త పోకడలో రాసిన, బహుశా అబ్సర్డ్ / మాజికల్ రియలిజం కథేమో అని అనుకున్నాను. కథ ప్రారంభంలో రచయిత ఉటంకించిన వాక్యం ఈ స్కార్లెట్ లెటర్ నవల నుంచే. దానితో కొంత అనుమానం వచ్చింది కానీ ఈ నవలకూ, కథ శీర్షికకూ ఉన్న లంకె కొద్దిగా కథలోకి వెళ్ళాకగానీ తెలియలేదు.
మోడర్నిస్టు కథకోసం చూస్తున్న నన్ను కథ ఎత్తుగడ సంప్రదాయ సాహిత్యంలోని ఒక ప్రేమ పద్యంతో మొదలవటం ఆశ్చర్యపరిచింది. సరే, కథానాయిక, నాయకుడు మంచి సాహిత్యగంధం ఉన్న సరసులు అనుకుని ముచ్చట పడుతుంటే, సాహితీ పిపాస జీవితేఛ్ఛ కలసి కాపురం చేయలేకపోతున్నాయని అర్థమై కొంత దిగులేసింది. ఇంతటి ప్రణయకలహంలోనూ కథానాయకుడు కృష్ణకవి ప్రణీతమయిన శకుంతలా పరిణయంలోని పద్యంతోనూ, హంసవింశతిలో పద్యాలతోనూ దెప్పుతాడు. ఆవిడా తక్కువ తిన్నదేం కాదు, అలాగే జవాబు చెప్తుంది. కథానాయిక అమ్మమ్మ (నాయకుడి బామ్మకూడా) రంగప్రవేశం చేయటంతో కథ ఒక ఊహించని మలుపు తిరుగుతుంది. ఆవిడ నాకు జయప్రభ గారి రసఝరీయోగం కథలోని బామ్మ గారిని కొంత గుర్తు చేసింది.
స్కార్లెట్ లెటర్ నవలలోనూ, ఈ కథలోనూ ముఖ్యాంశాలు స్త్రీల వైవాహేతర సంబంధాలు, ప్రేమ, నైతికతల పట్ల వ్యక్తులూ, సంఘమూ స్పందించే విధానం గురించి. ఆ సింధూరవర్ణపు అక్షరాన్ని ఈ కథకు పేరుగా పెట్టటంలో శర్మగారి నేరిమి మెచ్చుకోదగింది. నిజానికి ఆధునిక తెలుగు వచన సాహిత్యం ప్రారంభ దశ నుంచి (ఆ మాటకొస్తే హాలుడి గాథా సప్త శతి కాలంనుంచీ కూడా) ఈ వస్తువు ముఖ్యాంశంగా తరచూ కనిపిస్తూనే ఉంది. గత యాభై యేళ్ళలొ తెలుగు సమాజంలో చాలా మార్పులు వచ్చాయి. సమాజంలో స్త్రీల పాత్ర ఒకప్పుడు ఊహించలేనంతగా మారిపోయింది. ఐనా ఈ విషయానికి ఇప్పుడూ ప్రాసంగికత ఉండటం వాస్తవం. ఇంత మారిన సమాజానికి ఇంకా శకుంతలా పరిణయంలోని సామాజిక నియమాలు వర్తిస్తాయా? అలా నలుగురి మధ్య నిలబెట్టి, జేగురురంగు అక్షరాన్ని బట్టకు కట్టి వెలి వేయాల్సిందేనా? అవుననే అంటున్నాడు కథానాయకుడు. మరి కథానాయిక, బామ్మ గారు ఏమంటారు?
ఈ పుస్తకంలో కొన్ని కథల్లో స్త్రీ పురుషుల మధ్య వైవాహేతర (లేక వివాహ రహిత) సంబంధాలు ముఖ్యాంశాలు. ఈ కథల ద్వారా రచయిత స్త్రీ పురుష సంబంధాల పట్ల సమాజం నిర్మించిన నైతిక చట్రపు విలువలనీ, సంబద్ధతనూ నిశితంగా ప్రశ్నిస్తారు. ప్రేమకు, కాంక్షకు, మనసుకూ ఎల్లలు ఉంటాయా అని చర్చిస్తారు. రచయితకు కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ కథలలోని ప్రేమ, సంఘర్షణలలో పోలికలకన్నా వైవిధ్యాలే జాస్తి. టోల్స్టోయ్ చెప్పినట్లు ఎవరి కథ వారిదే.
…
ఈ సంకలనంలోని కథలన్నీ స్త్రీపురుషుల సంబంధాల చుట్టూతానే నడవవు. ఒకదానికొకటి పోలిక లేని వస్తువులతో ఉంటాయి ఈ కథలు. వస్తువులే కాక, శర్మగారు కథ చెప్పే తీరు కూడా కథకూ, కథకూ మారుతూ వస్తుంది.
నన్ను ఈ కథల్లో ప్రధానంగా ఆకర్షించిన విషయాలు మూడు. పైన చెప్పిన వైవిధ్యత మొదటిది. రెండవది: పై పూతలన్నీ తీసివేసి నిశితంగా తరచి చూసినా, ప్రతి కథలోనూ కనిపించే వాస్తవికత, మానవీయ దృక్పథం, పాత్రలపై రచయితకు ఉన్న సానుభూతి. మూడవది అన్ని కథలలోనూ కనిపించే రచనా చమత్కారం.
ఈ కథలన్నీ ఒక మూసలో ఒదగవు. కథ చెప్పిన తీరులో ఏ కథకు ఆ కథే ప్రత్యేకం; ఒక ప్రయోగం. “కథకి విస్తరణ పరిమితి, నిర్మాణ క్రమం— ఉత్కంఠ ఎత్తుగడ, రచనాచాపం, నిర్దిష్ట నిలుపు; ఈ కొలబద్దలకి ఆవల నేను” అని రచయిత కొంత తెలివిగా తప్పించుకోవాలని చూసినా, ప్రతి కథకూ దానికి అనువైన నిర్మాణక్రమం, భాష, ఎత్తుగడ, ఉత్కంఠ – అన్నీ ఉన్నాయి.
ఈ కథల్ని ఊసుపోకకు చదవటానికి వీలు లేదు. రచయిత చాలా విషయాలను సూటిగా చెప్పడు; సూచిస్తాడు మాత్రమే. ఆ సూచనలు అర్థం చేసుకొని ముందుకు సాగాలంటే రచయిత ముందు మాటలో చెప్పినట్లు పాఠకులనుంచి కొంత శ్రమైక సాహచర్యం కావాలి. లేకపోతే ఈ కథలను పూర్తిగా అర్థం చేసుకోవడమూ, ఆస్వాదించడమూ కష్టమే. కాశీభట్ల వేణుగోపాల్ తన తపన నవల ముందు మాటలో సోమరి పాఠకుల మీద విసిరిన సవాల్నే శర్మగారు కొద్దిగా మృదువైన మాటల్లో మర్యాదగా చెప్పారన్న మాట.
శర్మగారు కథలకు పెట్టిన శీర్షికలు క్లుప్తంగా (ఎదుగు, చితుకు, తాలీ, అనేన వగైరా) ఉంటాయి. కథ గురించి ఊహాగానం చేయటానికి పెద్దగా వీలు కల్పించవు. కథా వస్తువును పట్టి కథ నిడివి మారుతుంది. కథని స్పష్టంగా, సూటిగా చెప్పాలన్న నియమమేమీ ఈ రచయితకు లేదు. తన కథల పాఠకుల పట్ల ఈయనకు మంచి నమ్మకం ఉన్నట్లుంది. కథలోని ముఖ్య విషయాన్ని స్పష్టంగానూ, వాచ్యంగానూ చెప్పకపోతే పాఠకులు అర్థం చేసుకోలేరు అన్న భయం ఈయనకు లేదు. కథ పూర్తి అయ్యేసరికి కథ అర్థమైనట్లుగానే ఉన్నా పాఠకుడి మనసులో అనేక ప్రశ్నలు లేవనెత్తటం, కథలో పాత్రల గురించి ఆలోచించవలసి రావటం ఈ కథల ప్రత్యేకత.
ఈ కథలు చదువుతున్నప్పుడు చాలాసార్లు రచయిత చమత్కారాన్ని చూసి ముచ్చట పడ్డాను, అబ్బురపడ్డాను. ఒకోసారి పేరాగ్రాఫుల్లో చెప్పగల విషయం ఒక్క వాక్యంలో ఇమిడిపోతుంది. ఒక కొత్త మాట ఇంతకుముందెవరూ చెప్పని భావన్ని కళ్ళకు కట్టిస్తుంది. వ్యంగ్యం చురకలు వేస్తుంది. తర్కం ఆలోచింపచేస్తుంది. అనుభూతి సానుభూతి ఔతుంది. పాఠకుడు అప్రమత్తంగా ఉండకపోతే రచయిత చులాగ్గా వేస్తున్న దాట్లను, చురకల్నీ, చెళుకుల్నీ, తెలివిగా కట్టిన ప్రహేళికలనూ మిస్ అయ్యే అవకాశం ఎక్కువే. రచయిత ముందే చెప్పాడుగా మేధోసహాయం, శ్రమైక సాహచర్యం కావాలి అని.
…
ఈ తొమ్మిది కథలలో ప్రతిదాని గురించీ వ్రాయవలసింది చాలానే ఉన్నా, తినబోతున్న వంటకపు రుచి ఎక్కువగా చెప్పటం ఎందుకన్న సంకోచం, వ్యాస విస్తరణ భీతి నన్ను కట్టడి చేస్తున్నాయి. కాని, ఒక్క కథ గురించి మాత్రం తప్పక చెప్పాలి.
ఈ సంకలనంలోని అన్ని కథలలోనూ విలక్షణమైన కథ బావరి. సాయి పాపినేని గారి ఆంధ్ర చారిత్రక కథాయజ్ఞం – కాలయంత్రం – ప్రేరేపణతో ఈ కథ రాసినట్లున్నారు. దక్షిణాపథంలో బౌద్ధం ప్రారంభ దశను గురించి ఈ కథ చెపుతుంది. ఈ కథకు ఆధారం సుత్తపిటకంలోని సుత్తనిపాతంలో చెప్పబడిన బావరి అనే బ్రాహ్మణుని కథ. ఈ బావరి కోసలిదేశం నుంచి వచ్చి అస్సక దేశంలో, అలకాప్రాంతంలో గోదావరీతీరాన తన శిష్యులతో నివసిస్తున్న వృద్ధ పండితుడు. ఒక సంకట సమయంలో ఆయన తన శిష్యులను బుద్ధుని కలవటానికి వైశాలికి పంపిస్తాడు. త్రిపిటకాలలో సుత్తనిపాతం ప్రత్యేకత ఏమిటంటే, బావరి శిష్యులు పదహారుమంది బుద్ధుని కలసి (తమ మనసులో) అడిగిన పదహారు ప్రశ్నలకు బుద్ధుడు చెప్పిన సమాధానాలు ఇందులో పొందుపరచి ఉన్నాయి. ఆ సమాధానాలను ‘అర్థం చేసుకొని ఆకళింపు చేసుకొని ధమ్మాన్ని ఆచరించటం ఆవలి ఒడ్డుకి దారి’ అని సుత్తనిపాతం చెపుతుంది.
సుత్తనిపాతాన్ని చదవటమొక్కటే ఈ కథ రాయటానికి సరిపోదు. అప్పటి చరిత్ర గురించి, భౌగోళిక పరిస్థితిగురించి, సామాజిక స్థితిగతుల గురించి కూడా తెలిసి ఉండాలి. అవన్నీ కలిపి ఒక కొత్త కథ అల్లగల సృజనాత్మకత ఉండాలి. సుత్తనిపాతంలోని బావరి కథలో మొదటి మూడు వాక్యాలు శర్మగారి కథలో తొమ్మిది పేజీలయ్యాయి. బావరి విద్యార్థిగా మొదలై గురువుగా మారిన ప్రస్థానం, ఆయన వైవాహిక జీవితం, వీటికితోడు కపిలవత్తు రాజకుమారుడు బుద్ధుడిగా పరిణామం చెందటం గురించి చెప్తూ ఒక సజీవ చిత్రపటాన్ని మన కళ్ళముందు ఆవిష్కరింపజేసి తరువాతి కథకు మనల్ని సిద్ధపరుస్తారు. అప్పుడు గోదావరీ తీరంనుంచి మనల్ని వైశాలి వరకూ ప్రయాణం చేస్తూ దారిలో వివిధ విశేషాల్ని దర్శింపజేస్తారు. సంస్కృత మిళితమైన తెలుగును చదవటానికి అలవాటు పడ్డ నాకు పాళీ భాషలో మనుషుల, ఊళ్ళ పేర్లు చదవటం కొద్దిగా వింతగానే అనిపించినా కథ మాత్రం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ కథ నాకు అడివి బాపిరాజు గారిని గుర్తు చేసింది.
…
చాలామంది రచయితలు తొలియవ్వనపు కాలంలోనే రచించటం మొదలుబెడతారు. తమకున్న కొద్ది జీవితానుభవంతోనో, లేకపొతే పుస్తక జ్ఞానంతోనో (ఒకోసారి సినిమా జ్ఞానంతో కూడా) సాహిత్యాన్ని సృష్టించటానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగ విరమణ చేసి, మనుమళ్ళు, మనుమరాళ్ళతో ఆడుకుంటూ విశ్రాంత జీవితం గడిపే సమయంలో రచనాప్రక్రియను చేపట్టటం అరుదు; తెలుగులో మరీనూ. శర్మగారు ఈ ప్రత్యేకమైన జాబితాకు మంచి చేర్పు.
ముందు మాటలో తనకు తెలుగు తప్ప తెలియదు అని శర్మగారు వినయంగా చెప్పుకున్నా ఆయన చాలా విస్తృతంగా చదువుకున్నారని ఈ కథల వల్ల మనకు తెలుస్తుంది (ఆయన ఆత్మకథ చదవకపోయినా). తన చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారనీ, ఆలోచిస్తున్నారనీ అర్థమవుతుంది. రచయిత ఆత్మకథ చదివినప్పుడు ఆయన చాలా వైవిధ్యమైన జీవితాన్ని చూశారని, అనుభవించారని తెలిసింది. ఈయన చెప్పదలుచుకున్న, తెలిసిన, చెప్పగలిగిన, చెప్పవలసిన కథలు చాలానే ఉండాలి.
ఆలశ్యంగా కథలు వ్రాయటం మొదలుపెట్టిన శర్మగారు దానికి పరిహారంగా తాను చెప్పదలచుకున్న కథలన్నిటినీ తొందరగా రాయాలని నా అభ్యర్థన. విస్తృతమైన తెలుగు కథాప్రపంచంలో శర్మగారు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారని నా నమ్మకం. ఆ నమ్మకానికి ఆధారం ఇవిగో మీ ముందున్న తొమ్మిది కథలు.
…
రచయిత చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ గారితో నా ప్రత్యక్ష పరిచయం బహు చిన్నది. కొన్నేళ్ళ క్రితం ఆయన జీవిత కథ, నేనూ శాంత కూడా, చదవటం వల్ల ఆయన గురించి కొంత తెలుసు. మూడేళ్ళ క్రితం హైదరాబాదులో ఒక సాహితీ మిత్రుల సమావేశంలో ఆయన్నీ, శాంత గారినీ కలిసి బహుకొద్దిసేపు మాట్లాడాను. ఖదీర్బాబు నిర్వహించే కథకుల వర్క్షాప్ ఒకసారి వారి నివాసంలో జరిగిందని తెలుసు గానీ ఆయన స్వయంగా కథలు రాస్తారన్న విషయం నాకు ఈ మధ్యే తెలిసింది. ఈ పుస్తకానికి ముందు మాట వ్రాయమని నన్ను వారు అడగటం ఆశ్చర్యపరచింది. నాకున్న పరిమితుల వల్ల జరిగిన విపరీతమైన ఆలశ్యాన్ని సహృదయంతో భరించినందుకు కృతజ్ఞతలు.
‘A’ చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ కథలు
అజు పబ్లికేషన్స్
202 పుటలు Hardbound; 250 రూ.
