ఊరి ప్రేమలాంటి కవిత్వం
వ్యాసకర్త: తోకల రాజేశం
**********
కవిత్వం ఎప్పుడూ ఒకే రకమైన పాత్రను పోషిస్తుందా? అంటే లేదనే సమాధానం వస్తుంది.మనిషికి రకరకాల అవసరాలుంటాయి.కొన్ని సందర్భాల్లో అవసరం రీత్యా ఉద్యమాలతో కలిసి నడుస్తాడు. కొన్ని సార్లు సమాజంలో కలగవలసిన ప్రాథమికమైన మార్పు కోసం స్నేహితుడిలా తోడుగా నడుస్తాడు. కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలో ప్రణాళికలు రచిస్తుంటాడు. కొన్ని సార్లు ఉపాధ్యాయునిలా తెలియని విషయాన్ని విడమరిచి చెప్తాడు. ఒక్కోసారి ఏకాంతంగా ప్రకృతిలో లీనమవుతాడు. కవిత్వం కూడా అంతే. మనిషి ఎన్ని పాత్రల్లో ఒదిగిపోగలడో కవిత్వం కూడా అన్ని పాత్రల్లో ఒదుగుతుంది. ఒకే కాలంలో రాసిన అందరి కవిత్వమూ ఒకేలా ఉండకపోవటానికి కారణం ఇదే. ఒకే కవి రాసిన కవిత్వం కూడా అన్ని సందర్భాలలో ఒకే రకంగా ఉండకపోవటానికి సైతం కారణం ఇదే. దీనినే ముద్దుగా మనం వయ్యక్తిక అనుభూతుల కింద లెక్కగడతాం.దీని సారాంశం ఏమిటంటే ఒక కవి అన్ని వేళలా ఒకే మూసలో ఉండే కవిత్వాన్ని రాయలేడు.వస్తువు దగ్గరనుంచి శిల్పం దాకా ఆ మార్పును ఎవరి కవిత్వంలోనైనా గమనించవచ్చు. గోపగాని రవీందర్ గారు రాసిన తాజా కవితా సంకలనం “మా ఊరొక కావ్యం”చదివినప్పుడు కలిగిన ఆలోచనలివి.
రవీందర్ గారి గత కవిత్వంతో పోలిస్తే ఇందులోని కవిత్వం కొన్ని విషయాల్లో విభిన్నంగా కనిపిస్తుంది. ఆయన కవిత్వం మౌళికంగా మనిషి గురించి మాట్లాడుతుంది .”మనిషిని మనిషిగా ప్రేమించటం నా తత్వం “అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రవీందర్. మనిషిని మనిషిగా ప్రేమించటానికి అడ్డువచ్చే ప్రతీ విషయాన్నీ వీరి కవిత్వం తృణీకరిస్తుంది.మనిషి కోల్పోతున్న హక్కుల గురించి సున్నితంగానే అయినప్పటికీ ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ మౌళిక లక్షణాలన్నీ ఈ కవిత్వంలోను ఉన్నాయి. కాకపోతే రూపం దగ్గర శిల్పం దగ్గర గత సంకలనాలకు కొంత భిన్నంగా ఈ సంకలనంలోని కవిత్వముంది. ఇందులోని కవిత్వంలో ఎక్కువ భాగం ఆయన బాల్యంలోని జ్ఞాపకాల పునాది మీద నిర్మాణమైంది. ఆ రకంగా ఇందులో ఎక్కువగా వయ్యక్తిక అనుభూతులు పరుచుకొని ఉన్నాయి. బహుశా ఈ కారణంగానే రూపంలోనూ, శిల్పంలోనూ కొంత విలక్షణత సంతరించుకోవడానికి అవకాశం కలిగి ఉంటుంది.కొన్ని కవితలు ముచ్చట్ల రూపాన్ని తీసుకున్నాయి. కొన్నయితే ప్రసంగంలా సాగిపోయాయి.ఇంకా కొన్ని నిబ్బరంగా మాట్లాడాయి. మొత్తంగా తన జీవితం ద్వారా సంతరించున్న తాత్వికతను పొదిగి ఇందులోని కవిత్వం రాశారు కవి. ఈ సంకలనంలో 35 కవితలున్నాయి. ఇందులోని కవితలన్నీ ఇంతకుముందు చెప్పిన విభాగాలకు లొంగుతాయి.
బాల్యంలోని జ్ఞాపకాల తరహా కవిత్వాన్ని రాసేకవికి బలమైన భావనా శక్తి ఉండి తీరాలి. నిజానికి భావనా శక్తిలేని వారు కవులుగా నిలబడలేరు. కానీ అనుభూతి ప్రధానమైన కవిత్వాన్ని రాసి మెప్పించటంలో భావనాశక్తిలోని బలమే నిర్ణాయక పాత్ర పోషిస్తుంది. భావనా శక్తి గురించి కట్టమంచి రామలింగారెడ్డి గారొక సందర్భంలో “భావనా శక్తి యనగా విషయములను మనసులో ప్రతిబింబింప జేయు సామర్థ్యము” అని అన్నారు. ఆ సామర్థ్యం గోపగాని రవీందర్ గారిలో పుష్కలంగా ఉన్న సంగతిని ఇందులోని చాలా కవితలు నిరూపిస్తాయి. “రక్షణ కవచమది”అన్న కవితలో తన ఊరి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ రాసిన-
నాడక్కడ బతుకుల కలబోతలుండేవి
ఏ మనిషిని కదిలించినా ఊటై పెనవేసుకుపోయేది
గోడలపై పూల తీగలు పారినట్లుగా
సంచలన విషయాలతో దినపత్రికలు వచ్చేవి….లాంటి వాక్యాలు కవిలోని భావుకతను పట్టి చూపిస్తాయి.’ఆదరణ కోల్పోయిన ఎర్రడబ్బా’,’అభిమాన వర్షం”ఐదు దశాబ్దాల అంతరంగం’మొదలైన కవితల్లో కవిలోని భావుకత ఆనాటి వాతావరణాన్ని కళ్ళముందు నిలుపుతుంది.ప్రత్యక్ష అనుభవాలను లేదా జ్ఞాపకాలను కవిత్వీకరిస్తున్న సందర్భంలో చాలా కవితలు వచనంలోకి జారిపోతుంటాయి.ఇది నిర్మాణపరమైన సమస్య.ఈ సమస్య కొన్ని కవితల్లో కనిపిస్తుంది. నిజానికి ఇది అధిగమించలేని సమస్య ఏమీ కాదు.
కవులలో దాదాపు ఎవరూ కన్నతల్లి మీద, కన్నతల్లిలాంటి పుట్టిన ఊరు మీద కవిత్వం రాయకుండా ఉండలేరు. బహుశా! ఋణవిముక్తికి అదొక మార్గంగా భావిస్తారేమో కవులు?.రవీందర్ గారు కూడా తన బాల్యాన్ని భరించిన ఊరు గురించి రాసారు. తన ఊరు గురించి ప్రత్యేకంగా రాసిన “మా ఊరొక కావ్యం”,”పునర్దర్శన ప్రాప్తిరస్తు..!” అనే రెండు కవితలు ఈ సంకలనంలో ఉన్నాయి.మిగిలిన కవితల్లో చాలా సందర్భాలలో ఊరి ప్రస్తావన వస్తుంది.తన ఊరి మీద కవికి గల వల్లమాలిన ప్రేమ ఈ కవిత్వం నిండా పరుచుకొని కనిపిస్తుంది. నిజానికి ఇందులోని కవిత్వం ప్రత్యక్షంగా, పరోక్షంగా తన ఊరి గురించి,ఆ ఊరితో అల్లుకుపోయిన చిన్ననాటి జ్ఞాపకాల గురించి చెప్పడానికే రాశారేమో అనిపిస్తుంది.
పుస్తకంలోని పేజీల నడుమ దాచుకున్న
అపూర్వమైన అందమైన నెమలీకలా
ఆకాశంలో తారల మధ్యన
వెలుగుతున్న చందమామలా
పూలవనంలో విహరిస్తున్న
రంగు రంగుల సీతాకోక చిలుకలా
విశాలంగా పరుచుకున్న సంద్రం నుండి
వడివడిగా ఉరకలేస్తున్న కెరటంలా
నా గుండెలో మబ్బుతునకలా
గూడు కట్టుకుంది మా ఊరు..! అని రాసుకున్నారు గోపగాని.అందుకే ఈ సంకలనంలోని కవితల నిండా పూసల మధ్య దారంలా ఊరు అల్లుకుపోయింది.ఇందులో ఊరి ప్రస్తావన లేని కవిత ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు.ఒకరకంగా చెప్పాలంటే గోపగాని వారు తన పుట్టినూరికి సమర్పించిన నజరానా ఈ కవిత్వం. అందుకే ఈ సంకలనానికి ‘మా ఊరొక కావ్యం’అనే పేరు అతికినట్టుగా సరిపోయింది.ఊరి ప్రేమ ఎలా ఉంటుందో అలాంటి కవిత్వమిది.ఈ కవిత్వం చదివిన వారు కవులైనా కాకున్నా సరే తమ ఊరి మీద నాలుగు వాక్యాలైనా రాసుకుంటారు.అట్లాంటి అనుభూతిని ఈ కవిత్వం పాఠకులకు అందిస్తుంది.
-తోకల రాజేశం
9676761415
పుస్తకం:మా ఊరొక కావ్యం
కవి:గోపగాని రవీందర్
ప్రతులకు:9440979882
