అరసున్నా – స్వాతికుమారి కథలు

వ్యాసకర్త: యామిని కృష్ణ

********

నలుగురూ కలిసి కూర్చుని చదువుకునే కథలు కొన్ని అయితే, ఎవరికీ చెప్పకుండా తలుపులు బిడాయించుకుని ఒక్కళ్ళమే కూర్చుని చదువుకోవాల్సి వచ్చే అక్కర సృష్టించే కథలు కొన్ని. స్వాతి కుమారి గారి ‘ అరసున్న ‘ కథల పుస్తకంలోని కథలు ఆ కోవకే చెందుతాయి.

అసలు తలుపులు ఎందుకు వేసుకోవాలి అని ప్రశ్న వస్తే..
మన అంతరంగంలో మనం బిడాయించుకున్న ఎన్నో ప్రశ్నల ద్వారాలను… జవాబులను…సజీవ శిథిలాలను .. రహస్య భావ ప్రపంచాన్ని ఒక్కసారిగా తట్టి లేపి మనముందే నగ్నంగా నిలబెట్టగల సత్తా ఉంది కాబట్టి అని సమాధానం చెప్పాలి.

జీవితంలో మనుషులు తనకు తెలిసో, తెలియకో ఎన్నో రకాల తప్పులు చేస్తూ ఉంటారు.

ప్రేమగా కళ్ళకు దిద్దుకున్న కాటుక మనమే అదమరపుగా చెరుపుకునే లాంటి తప్పులు కొన్నయితే…

ఎంతో అందంగా వేసిన రంగవల్లిని.. ఎవరో కావాలనే నిర్దయగా నిర్లక్ష్యంగా చెరిపేసే లాంటి నేరాలు కొన్ని.

కలిగే పరిణామాలను బట్టి…
కొన్నిసార్లు
తప్పుకు… నేరానికి మధ్య ఉన్న సన్నని గీత చెరిగిపోతుంది.

అలానే మంచి చెడుల మధ్య కూడా.

మనిషికి ఉండే అవసరాలు…. భావనలే..
తమ జీవితాన్ని నిర్దేశిస్తాయి అని ఈ కథల్లోని అంతులేని నిత్యవేదనల…విషాదాల మాటున అంతర్లీనంగా ద్యోతకమవుతుంది.

తన కథాసంపుటిలో రచయిత్రి…

ఇది మంచి, ఇది చెడు అని వేరుగా చూడలేని సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ ను ఎలా అణగదొక్కాలని అరసున్న కథలో సూటి ప్రశ్న వేస్తారు.

అలానే… వాంగ్మూలం కథలో సంస్కారపు జబ్బు ముదిరినోడివి అని ప్రేమగా నిందిస్తుంది తండ్రి సమానమైన పాత్ర.

పట్టలేని ప్రేమ… వాత్సల్యం ఒకమనిషి పై ఉన్నపుడు, ఒక లక్షణం లేదా అలవాటు జబ్బుగా మారడానికి ఆట్టే సమయం పట్టదని అర్థమవుతుంది.

బీటలు వారుతున్న గోడలోనుంచి కూడా జీవం పోసుకుని మొలకెత్తుతున్న పిచ్చి మొక్కని చూసైనా బతకడం నేర్చుకోవాలని..
నీ నిరాశకు సమాధానం చెప్పే బాధ్యత నీ బ్రతుకుకి లేదని….
సున్నితంగా మందలిస్తూనే..

కథలు రాయగల పనిమంతుడివి…
పోయే ముందర చిన్న చీటీముక్క అయినా రాయడం చేతకాని వాడివి…
ఎవరిని కాపాడడం కోసం…

ఏ చివరి జ్ఞాపకాన్ని మిగుల్చుకోవడం కోసం…!
అని ఒక్కసారిగా గుండెలు బరువెక్కే శైలిలో వాక్యాన్ని రాస్తారు.

‘ తింటాకి మళ్లీ అర్టికాయలేనా. నాక్కోడా జెరవొస్తే బాగుండేది, బత్తాయి రసమిచ్చేవాళ్ళు నీకిచ్చినట్టే… ‘

ఈ మాటలు బుడుగువి కదో?!
కావు మరి.

చిన్నతనంలో తన చెల్లెలు అన్నదనీ బెష్టు ఫ్రెండ్స్ కథలో రచయిత్రి రాసుకున్న మాటలు.

అనుకున్న మార్కులు రాలేదని జోతి ఏడుస్తుంటే.. అంజిగాడిచ్చిన కాఫీబైట్ చాక్లెట్

అమ్మకు బాలేదని దిగాలుగా ఉంటే..
‘ తగ్గిపోయిద్ది లే. ఏవన్నా కావాలంటే చెప్పు. మీ ఇంటికొచ్చి సాయం చేస్తా ‘ అని గొప్ప భరోసా ఇచ్చిన మల్లేస్వరి..

ఇవన్నీ దేనితో పోల్చలేని జ్ఞాపకాల సిరులు..!

చెల్లెలితో పాటు తన టెన్త్ స్నేహితులకు తనకు మధ్యన జరిగిన సంఘటనలు, స్వభావాలు, చిరుకలహాలు, పలవరింతలు, సాయాలు, ద్వేషం ఇమడని, ఇముడ్చుకోని, ఆట్టే నిలవని పసి హృదయాల గోసను…
సముద్రతీరాన పిల్లలు గవ్వలేరుకున్న తీరున మధురాతిమధురంగా అదే యాసలో, భాషలో అచ్చుగుద్దినట్టు నిజాయితీగా, హృద్యంగా రాసారు స్వాతి.

‘ ఉరేయ్… నా పేరు ఎవడు చెప్పాడ్రా నీకు. బలే బలే. అని పెద్దగా నవ్వాడు పిచ్చాడు. బయమేసేలా కాదు. నవ్వొచ్చేలా నవ్వుతాడు వాడు.’

‘ ఊహుహు, రాళ్లు రప్పలు కాదు, మొద్దురాచిప్పలు, బాగుంది.’ అని కళ్ళు మూసుకొని మళ్ళీ పాడతాడు. అప్పటికి ఊరు సద్దుమణిగి సగం నిద్రలో ఉంటుంది. ఐనా పాటలెవరిక్కావాలి. దొంగలొస్తే కాపలాకుక్క అరుపులాగా, రావిచెట్లు, వేప చెట్లూ ఊగినట్టు.. అర్ధరాత్రి వాడి పాటలు కూడా.’

పైకి ఎగతాళి లా కనిపిస్తున్న వాక్యాల్లో అంతర్లీనంగా…
ఇంకా సహజత్వం కోల్పోని, పిచ్చాడుగా పిలవబడే కల్మషమంటని, కోరికలు లేని ఒకానొక స్వేచ్ఛాజీవి మాటల్ని, పాటల్ని సరళంగా, హృద్యంగా రచయిత్రి చెరువు- చింతచెట్టు కథలో చిత్రీకరించారు.

‘ రాత్రిపూట చెట్ల కింద రాలిన పూలేరి ఆమె రాగానే నీళ్ల బిందెలో వేసేవాడు. మిగతా వాళ్ళలా ‘ మూగదానా’ అని పిలవడానికి వాడికి మనసు రాలేదు. ‘ నువ్వు మంజులవి కదూ’ అనేవాడు. దానికి నోరుంటే మిగతా వాళ్ళలా వాడిని పిచ్చోడా అని పిలవదని వాడికి ఎట్లా తెలుసో కానీ తెలుసు.’

నేస్తుగా మారిన మూగపిల్ల అమాయక మనసు, పిచ్చివాడి శీల ఔన్నత్యం రెండే రెండు వాక్యాల్లో చెప్పగలగడం లో స్వాతి గారి పదసంక్షిప్తతా పటిమ, అద్భుతమైన శైలి ఇట్టే స్పష్టమౌతుంది.

అలాగే..

ప్రతి మనిషి జీవితంలో భాగమైపోయిన ఒకానొక యాంత్రికత, తప్పనిసరైన ఎన్నో అవసరాలు, వాటి సాధనకై అప్రయత్నంగానే అలవడిపోయిన లేదా లౌక్యం పేరుతో అత్యవసరంగా అలవర్చుకున్న కృత్రిమత్వం, ఆత్మ వంచనలు..

చాలా తక్కువ వాక్యాల్లో..
ఒక సాధారణ లోకల్ బస్సు లో ప్రయాణంచేస్తున్న వారి మధ్య జరిగే వివిధరకాల సంభాషణల ద్వారా చెప్పకనే చెప్పడంలో…

218డి అనే కథ ఖచ్చితంగా సఫలమైందని చెప్పవచ్చు.

చివరిగా…

ఇది ప్రేమే అని నమ్మి లేదా మానసిక అవసరం కొద్దీ మనల్ని మనం నమ్మించుకుని అత్యవసరంగా ప్రేమించిన తర్వాత..

కొంతకాలానికి సామీప్యం అవసరానికి మాత్రమే పరిమితం అవడం గురించి…
ఉమ అనే పాత్ర అనుభవించే వేదన ‘ మాకు మేమే’ అనే కథలో చూడవచ్చు.

‘ జాలితోనో, అబ్లిగేషన్ తోనో, క్యాజువల్ గానో అతను మళ్ళీ ఎప్పటికి ఇలా దగ్గరకు తీసుకుంటాడో తెలీదు. ఆకలితో అలమటించిపోతున్నప్పుడు ఎవరైనా రొట్టెముక్క విసిరేస్తే తోకూపుకుంటూ అత్రంగా వెళ్లే కుక్క పిల్లలాగా అనిపించింది ఉమకి తన పరిస్థితి.’

నిజాయితీతో కూడిన ఒక చిన్నపాటి ఆత్మీయస్పర్శ కోసం ఒక ఆడపిల్ల పడే తపన, అది ప్రాణావసరంగా మారిన తీరు..
హృద్యంగా వివరించారు రచయిత్రి.

తన అవసరాలకు అనుగుణంగా..
ఆడవాళ్ళని..
ముఖ్యంగా సాఫ్ట్ టార్గెట్స్ ను తనపై ఎమోషనల్ గా ఆధారపడేలా బ్రెడ్ క్రంబింగ్ చేసే ఒక మగపాత్రను…

తన పప్పులుడక్క చుట్టపీకని చెప్పుకింద నలిపేసి, కండువా తలమీద కప్పుకుని ‘ డామిట్! కథ అడ్డం తిరిగింది ‘ అనే గిరీశం పాత్రతో పోల్చడం ఎంతో సమంజసంగా అనిపిస్తుంది.

అస్తిత్వ వాదం, తాత్విక చింతనలే కాక, మనిషి తనకు కూడా తెలియకుండా పెంచి పోషించే వివిధ మానసిక రుగ్మతలను సరళమైన, లోతైన, సంక్షిప్తమైన, ఆసక్తికరమైన కథనంతో అందంగా గీసుకున్న స్వాతి కుమారి గారి ‘అరసున్న’ పాఠకుల ఆదరణను చూరగొంటుందని నమ్ముతూ …

**********

Title : అరసున్నా 

Author: స్వాతికుమారి బండ్లమూడి

పబ్లిషర్స్: ఒక పబ్లికేషన్స్

Available on Amazon

You Might Also Like