సామాజిక నీతి : కథన రీతి 

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్

(కథకుడు, విమర్శకుడు డాక్టర్ బివిఎన్ స్వామి పుస్తకం కశప2 కు ముందుమాట)

*************

‘శ్లోకార్ధేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథ కోటిభిః’

మస్త గ్రంథాల సారాన్నీ సగం శ్లోకంలో తేల్చి చెబుతాను అన్నాట్ట యెనకటికి వో పెద్దాయన. అన్నట్టే అందంగా సంక్షేపించాడు కూడా. కథంతా చెప్పి చివర్లో నీతిని బోధించే భారతీయ నీతి కథా సంప్రదాయం అతి ప్రాచీనమైనది. అదే  ప్రముఖమైనది కూడా.  కాంతా  సమ్మితంగా వుపదేశించడం కావ్య ప్రయోజనాల్లో ప్రధాన ప్రయోజనం.  ఇతిహాసాల్లోని వుపాఖ్యానాలు పంచతంత్రాది ప్రధాన కథల్లో వుపకథలు నాటకాల్లో అంతర్నాటకాలు అన్నీ వుపదేశగర్భితాలే. నీతి బోధకాలే.

సూక్తి ప్రధానమైన సాహిత్యం మనకు కొల్లలుగా వుంది. అది పద్యరూపంలో వుంది.  గద్యాత్మకంగా వుంది. మిశ్రంగా వుంది.  సారాన్నంతటినీ వొక శ్లోకంలోకి సూత్రంలోకి కుదించి చెప్పడం, మళ్ళీ ఆ సూత్రాల్నీ శ్లోకాల్నీ మరొక అంతస్సూత్రంతో ముడి వేయడం.. ఇదంతా నిర్మాణానికి చెందిన టెక్నిక్. మౌఖిక సాహిత్యంలో విషయాన్ని జారిపోకుండా కంఠగతం  చేసుకోడానికీ జ్ఞప్తిలో వుంచుకోడానికీ  పునశ్చరణ చేయడానికీ  వుపయోగపడే ప్రక్రియలో భాగం. ఇటువంటి శ్లోకీకరణలు,  సూత్రీకరణలు భిన్న టీకా టిప్పణులకూ వ్యాఖ్యానాలకూ భాష్యాలకూ కారణమయ్యాయి.  సింగిల్ లైనర్ నీతులు భావజాల రంగంలో సమాజంలోకి  తేలికగా చొచ్చుకుపోవడం వల్ల స్థిరపడడం వల్ల అవి మనిషి జీవితాలపై చూపే ప్రభావం చాలా బలంగా వుంటుంది.  ఇక  శతక వాఙ్మయంలోకి వస్తే నీతి శాఖే పెద్దది. 

ఒక  కథని చెప్పి దాని చివర పద్యాన్ని నీతిగా కూర్చటం సాంప్రదాయిక పద్ధతి. ఒక నీతి పద్యాన్ని యేదైనా శతకం నుంచి స్వీకరించి దానికి అనుగుణంగా కథ చెప్పడం అన్నది ఆధునిక ప్రయోగం. ఇటువంటి ప్రయోగాలు మనం దగ్గర యింతకు ముందు చాలా జరిగాయి. డా. బివిఎన్ స్వామి క.శ.ప. తొలి సంపుటి  అటువంటి ప్రయోగమే. అందులో స్వామి పండితారాధ్యుని శివతత్వసారం దగ్గర్నుంచి యివాళ్టి ఆధునిక శతకకారుల వరకు వందకి పైగా  నీతి పద్యాల్ని స్వీకరించి వాటికి అనుగుణంగా కథలల్లి మనకు అందించాడు (దాదాపు అరవై మంది ఆధునిక శతక కవులు, ఎక్కువమంది తెలంగాణవారే, అందులో రికార్డ్ అయ్యారు. ఆ విధంగా శతక కవుల చరిత్రకి ఆకరంగా కూడా ఆ గ్రంథం వుపయోగపడుతుంది).   

  క. శ. ప.  రెండో భాగం ద్వారా యిప్పుడు స్వామి మరో ప్రయోగం చేస్తున్నాడు.  ఇందులో కథా  అతనిదే, దాని సారాన్ని క్రోడీకరిస్తూ చెప్పే నీతి పద్యమూ అతనిదే. ఈ కథలకూ  పద్యాలకూ అతని శ్రోతలు పాఠకులు ప్రధానంగా పిల్లలు.  తరగతి గదిలో విద్యార్థులు పాఠాల కంటే కథల మీదే ఆసక్తి చూపిస్తారు. పాఠ్యాంశాల బోధనలో కథా కథన పద్ధతికి ప్రాధాన్యం వుంది. ఉపాధ్యాయులు చెప్పే ప్రతికథా సాధారణంగా నీతిని బోధిస్తుంది. హాస్య అద్భుత కథలది ఆ తర్వాతి స్థానం. స్వామిలోని ఉపాధ్యాయుడే యీ కథలు చెప్పాడు. ఈ పద్యాలు కూర్చాడు. ఎదిగే వయస్సులో పిల్లలకు సంస్కారం అలవర్చడమే యీ రచన పరమార్థం. అందుకే మంచీ చెడూ విప్పి చూపే నైతిక విలువల ప్రస్తావన యెక్కువ చోటుచేసుకుంది. తర్వాతి స్థానం వ్యక్తిత్వ వికాసానిది. అక్కడక్కడా సమాచార ప్రసారానికి కూడా ప్రత్యేక స్థానం లభించింది. అలాంటి సందర్భాల్లో కశప కథల పరిధి విస్తృతమై చరిత్ర సంస్కృతి వంటి ఇతరేతర అంశాల వరకూ వ్యాపించింది. అప్పుడు యివి పెద్దలకి కూడా బుద్ధిగరపుతాయి (పెద్దలు నిన్నటి పిల్లలే కదా!).   

అందువల్ల యీ కథలన్నీ సామాజికాలు. తన చుట్టూ జరుగుతున్న అనేక సామాజిక ఘటనల పట్ల దురన్యాయాల పట్ల రచయితగా స్వామి స్పందనలు అవి. సమాజంలో విచ్ఛిన్నమౌతోన్న మానవ సంబంధాల పట్ల ఆవేదన, లుప్తమౌతోన్న నైతిక విలువల పట్ల ఆర్తి, సమస్త మానవీయ సంవేదనల్నీ ధ్వంసం చేసే ధనస్వామ్యం పట్ల క్రోధం, మనుషుల్లో వూడలు దిగిన స్వార్థం పట్ల అసహిష్ణుత, సమాజంలో నానాటికీ పెరిగిపోతోన్న రెండు నాల్కల ధోరణి పట్ల విసుగు, కుల మత మౌఢ్యాల పట్ల బలమైన విమర్శ   కథల నిండా పరుచుకుని వుంది.

కథ చెప్పటంలో స్వామిది ప్రాచీన నీతి కథా కథన సంప్రదాయం. అయితే పద్యం కట్టడంలో మాత్రం అతను వేమన దారిలో పయనించడానికి ప్రయత్నించాడు. అందుకే పద్యాలలో అనేకం పాద పాదానికి విడిపోతాయి. గణానికి గణానికి విడిపోతాయి. వేమన పద్యాల్లో  మొదటి రెండు పాదాలు వొక నిర్దిష్ట భావ శకలంతోనో  వుదాహరణతోనో  వుంటే మూడో పాదం జీవిత సత్యాన్ని ప్రతిపాదిస్తుంది. ‘కశప చెప్పిన కథనమ్ము కాంతి పథము’ అన్న మకుటాన్ని ధరించిన స్వామి పద్యాల్లో సైతం కొన్ని చోట్ల అటువంటి నిర్మాణం కనిపిస్తుంది.  వేమన పద్యం లాగానే అక్కడక్కడా అతని రచన వ్యంగ్యభరితంగా కూడా ఉంటుంది. ఉదాహరణకు చూడండి:

‘మొగుడు వేసిన పుస్తెల ముడులు మూడు 

ఆమె అతనితో వేసిన అడుగు లేడు 

ఆసరా కాదగినవాడు ఆరిపోయె’

మూడు ముళ్ళు ఏడు అడుగుల బంధాలు శాశ్వతం కాదన్న యీ  కథా శతక పద్యం ‘మును ముహూర్తమెంచ ..’ అన్న వేమన భావాన్ని గుర్తు తెస్తుంది. 

చుట్టూ జరుగుతోన్న ఘటనలే కాదు వొక్కోసారి చటుక్కున్న స్ఫురించిన చిరు తరంగం లాంటి  వూహ కూడా స్వామి చేతిలో కథగా రూపాంతరం చెందుతుంది. వెర్రి తలలు వేస్తున్న ఆధునికతకు అతను బద్ధవిరోధి. హింసను గ్లామరైజ్ చేస్తున్న సినిమా సంస్కృతిని అతను మనసు లోతుల్లో నుంచి ద్వేషించాడు (‘హింస హీరోయై తెచ్చె ఆహవమును’). సామాజిక అంశాల్నే కాదు; సాంస్కృతిక విశేషాల్ని కూడా స్వామి కశపగా మలిచాడు. చరిత్ర శకలాల, తాళపత్ర గ్రంథాల పరిరక్షణ వంటి అంశాలు సైతం అతని దృష్టి నుంచి తప్పించుకుపోలేదు. కానీ వాటిని వర్తమానానికి అన్వయించడం మర్చిపోడు. చూడండి: కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కురిక్యాల గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో కొండన్నపల్లి దగ్గర బొమ్మల గుట్ట మీద లభించే త్రిభాషా శాసనం విశిష్టత గురించి వివరాలు అందిస్తూనే అక్కడి గ్రానైట్ మాఫియా దురాగతాల్ని ఖండించాడు. 

‘మనిషి డబ్బును ప్రేమించు మరచు జగము’ అంటాడు స్వామి వొకచోట. జీవితం అమ్మకపు సరుకైపోయినప్పుడు ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ అన్న సిద్ధాంతం యెంత డొల్లదో తెలుపుతూ కట్టిన కథనం స్వామిలోని సామాజిక తాత్విక దృక్పథానికి అద్దంపడుతోంది. ఆ దృక్పథమే అంతరిక్ష యాత్రలను వాణిజ్యీకరించిన  కుబేరుల అభివృద్ధి విజయాల్ని  యెండకడుతుంది. ఈ పద్య పాదంలో వొక చమత్కారం ఉంది. మనిషి డబ్బుని ప్రేమించి తక్కిన ప్రపంచాన్ని మరచిపోతాడని వొక అర్థమైతే, డబ్బుని ప్రేమించే మనిషిని ప్రపంచం మరచిపోతుందని మరో అర్థం స్ఫురిస్తుంది.

క. శ. ప.  కథల్లో బుంగి పాత్ర గమ్మత్తయింది. బుంగి కి జెండర్ లేదు.  మగ కావచ్చు, ఆడ కావచ్చు. ఒకసారి పూర్వపక్షం‌, మరోసారి సిద్ధాంతం. కాసేపు అడ్వకేట్, మరి కాసేపు జడ్జి. ఒక సందర్భంలో ప్రశ్న, మరో సందర్భంలో సమాధానం. ఒక చోట అమాయకత్వం. మరో చోట సర్వజ్ఞత.  కొన్నిసార్లు స్టూడెంట్. మరి కొన్నిసార్లు టీచర్. కథకి అనుకూలంగా నీతి పద్యానికి అనుగుణంగా ఆ పాత్ర రూపొందుతుంది.  అతని మాటల్ని సమర్థిస్తూనో ఖండిస్తూనో స్వామి జీవితార్థాల్ని ప్రతిపాదిస్తాడు. సత్యాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. స్వామి స్వయంగా కథకుడు అయినప్పటికీ నీతి కథా నిర్మాణం దగ్గరకొచ్చేసరికి తనదైన ప్రత్యేక  శైలిని రూపొందించుకున్నాడు. అందుకే తరచుగా కథకుణ్ణి వెనక్కి నెట్టేసి అతనిలోని వుపాధ్యాయుడు ముందుకు వచ్చాడు. ప్రశ్నోత్తర పద్ధతిలో సంభాషణాత్మక శైలిని ఆశ్రయించాడు.     

స్వామిది ప్రధానంగా   సంస్కరణ దృష్టి అయినప్పటికీ సమాజానికి కీడు చేసే దుర్మార్గం పట్ల కోపాన్ని యెక్కడా దాచుకోలేదు. అది  సామాజిక ఆగ్రహం. వ్యక్తిగా చాలా కథల్లో తాను కూడా పాత్ర అవడం వల్ల దాన్ని నియంత్రించుకొని కథ చెబుతాడు. ఎంత విమర్శనాత్మకంగా వున్నా అతనిలోని మర్యాదస్తుడు బయటికి వస్తాడు. సమన్వయ ధోరణిలో పరిష్కారాలు ప్రతిపాదిస్తాడు. అందువల్ల కొన్ని కథలు  భావవాదాన్ని   ఆశ్రయించుకున్నట్టు కనిపిస్తాయి. నిజానికి సున్నితమనస్కుడైన స్వామి వ్యక్తిత్వమే వాటిలో ప్రతిఫలిస్తుంది. స్త్రీ దృష్టి కోణం రాసిన శబరీ సీతల కథలో దీన్ని గుర్తించవచ్చు. 

స్వామి సామాజిక పరిశీలన నిశితంగా వుంటుంది. కథల్లో ప్రజల కోపానికి కూలిన కోటల్నీ గడుల్నీ ప్రస్తావించాడు. మనిషి తనలోకి తాను చూసుకుని తత్వం గ్రహించమని బోధించాడు. మనసెరిగిన కథలు మనిషిని సంస్కరించి ఖచ్చితంగా మార్పు తెస్తాయి అని ఆశ ప్రకటించాడు. కుటిల మనస్కులే సమాజానికి విషం అని హెచ్చరించాడు. లోకవ్యవహారంలోని అనేక  అపసవ్యతల్ని ఖండించడం  దగ్గర స్వామి  ఆగిపోవడం లేదు. అందులో మార్పుని కోరుకుంటున్నాడు. మార్పు అనివార్యమనే గ్రహింపు అతనికి బలంగా వుంది. అందుకోసం పెనుగులాడే మనుషుల పట్ల ప్రేమ వుంది. 

‘మారనంటే నువ్వు కుదరదు మనిషి ముందు 

మారిన మనిషి సుఖపడు మరల మరల

మార్పు భవితకు మేలును కూర్చు నెపుడు’

అయితే మార్పు కోసం మార్పు కాదు. మానవీయ విలువల్ని మంటకలిపే  మార్పు నేరం. మనిషి మరుగునపడిపోయే మార్పు అతనికి ఆమోదం కాదు. 

‘మనిషి మారుట సత్యము మహిని యెపుడు 

మార్పు వేగము కరుణను మంట గలిపె

మనిషి మరుగున పడిపోయె మమత లుడిగి’

మార్పు తప్పనిసరిగా మనిషి జీవితాన్ని ఏదో విధంగా మెరుగుపరచడానికి దారితీయాలి. మంచికి తోడ్పడాలి. అంతిమంగా అందుకే అంటాడు:

‘మేలు కోసం మార్పును మలచవలెను’ 

స్వామి  ముందు కథ చెప్పి చివరిగా సారాన్ని  కయిగడుతున్నాడా? లేదా పద్యం మొదట రాసి దానికి అనుగుణంగా కథ అల్లుతున్నాడా? అన్న అనుమానం తొలుత కలిగింది. కానీ  వాటి నిర్మాణాన్ని లోతుగా చూస్తే ముందు కథ తర్వాత పద్యం అన్న క్రమాన్నే పాటించాడని గ్రహిస్తాం.   కయి కట్టడమైనా కథ చెప్పడమైనా కళాత్మకంగా వున్నప్పుడే అది మనసుని తాకుతుంది. ఆ దిశగా లోకానికి సరైన రీతిని తెలియజేయడానికి స్వామి శ్రద్ధగా చేసిన ప్రయత్నమే క.శ.ప. : 2. దీని ప్రయోజనం పాఠకులే తేల్చి చెప్పాలి. అతని మాటల్లోనే చెప్పాలంటే –

 ‘రీతి తెలిసిన కథనమ్ము రిత్త కాదు’. స్వామి వుద్దేశించిన సామాజిక నీతి, దాన్ని అందించడానికి యెన్నుకున్న కథన రీతి యిదిగో మన ముందున్నాయి.  

***

ఇంతకీ ముందుగా  ప్రస్తావించుకొన్న పెద్దాయన సగం శ్లోకం యేదో చెప్పలేదు కదా!

 ‘పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్’

ఇదీ ఆ రెండో సగం. 

పాప పుణ్యాల మాటేమోగానీ రా వి శాస్త్రి అన్నట్టు యే  రచనైనా  మేలుకు కీడు కీడుకు మేలు చేయకూడదు. సమాజంలో  ‘మేలు కీడుల మర్మం’ విప్పిచెప్పడానికి పూనుకున్న మిత్రుడు బివిఎన్ స్వామి రచన ఆ దారిలోనే నడుస్తున్నదని నా నిండు నమ్మిక. 

సెలవ్. 

హైదరాబాద్,                                                                                                        ఎ. కె. ప్రభాకర్   

24 సెప్టెంబర్ 2024.  

You Might Also Like