కౌమార మస్తిష్కాలను ఉత్తేజపరిచే గజ్జారాం శతకం 

వ్యాసకర్త: రాథోడ్ శ్రావణ్

***********

తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నాయి. అందులో వచన కవిత్వం  ఒకటి.

తెలుగు భాషా సాహిత్య జ్ఞాన ప్రపంచంలో వచన కవిత్వాన్ని, పద్యాన్ని ఎంతో ప్రాముఖ్యత ఉంది.   పద్యాలు  విద్యార్థుల్లో కంఠస్థ, ఉచ్చారణ పటిమను,ఉల్లాసాన్ని,ఉత్సాహాన్ని,ఆలోచనను,వివేచనను,విచక్షణను,పెంపొందిస్తుంది.కనుక భాషాభోధనలో వచన  పద్యాలకు విశిష్టమైన స్థానం ఉంది.

తెలుగు భాషా మాధుర్యం లోని  నవరసాలను ఆస్వాదిస్తూ ఆనందాన్ని పొందే శతక   రచయిత  గజ్జారాం చట్ల ఆదిలాబాదు జిల్లా ,బజర్హత్నూర్ మారుముల ఏజెన్సీ మండల కేంద్రంలోని  శ్రీమతి/శ్రీ, చట్ల అమృతమ్మ,   బక్కయ్య  దంపతులకు 01 జూన్ 1961లోజన్మించారు. ప్రాథమిక విద్య స్వంత గ్రామంలో చదివి, ప్రాథమికోన్నత  విద్య  యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని సర్వేలు గురుకులంలో  అభ్యాసించి ఉన్నత విద్యను హైదరాబాదులో పూర్తి చేశారు. డిగ్రీ  పట్టభద్రులై పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం జీవితం ప్రారంభించారు. తెలుగు భాష పై ఉన్న మమకారంతో  బాల్యం నుండే నాటికలు, కథలు, కవితలు  రాయడం  అలవాటు కావడంతో సాహిత్యంలో  బీజాలు పడ్డాయి.

వృత్తి రీత్యా ‌పంచాయితిరాజ్ శాఖలో  మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా  పనిచేస్తూ పదవీ విరమణ పొంది ప్రవృత్తి రీత్యా సాహితీ రంగంలో రాణిస్తూ  ”కౌమారామృతశతకం” ను రచించి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు అంకితం చేశారు. దేశానికి రోల్ మోడల్ నిలిచిన సర్వేలు గురుకుల పాఠశాలలో  చదివే రోజుల్లో నాటికలు రాసి  ప్రదర్శించి గురువుల మన్ననలు పొంది,  ప్రధాన చార్యులు చేతుల మీదుగా చిట్టి పురస్కారం సైతం అందుకున్నారు.  

తాను మాట్లాడే తెలుగు భాషకు ఒక గౌరవ జ్ఞాపకాన్నివ్వాలని గట్టి సంకల్పంతో సమాజ హితాన్ని కోరుకుంటూ ఈ శతకం రాశారు. మానవుని జీవితంలో వికాస దశలు  అందులో బాల్యం, కౌమారం, యౌవనం, వృద్ధాప్యం మొదలు దశలు ఉన్నాయి.  కౌమార దశ అన్ని దశలలో కెల్లా అతి ముఖ్యమైన దశ.  ఈ దశలో సంభవించే శారీరక  పరిపక్వత తో పాటు మానసిక వికాసంలో మార్పులు మరియు ఆరోగ్యం అభివృద్ధికి పునాదులు వేయబడతాయి. ఈ దశలో హార్మోన్లు ఉత్పత్తి కావడం, అతి ఒత్తిడితో  ద్వంద్వార్థాల పదాలు అతిగా వాడటం, మిత్రులతో  చిలిపి చేష్టలు చేయడం, చేడు స్నేహితుల వల్ల భవిష్యత్తును నాశనం చేసుకోవడం, చివరికి  జైలు పాలు కావడం  జరుగుతుంది. కౌమార దశ ముగిసే సమయానికి చదువు సంస్కారంతో మెదడుకు పదును పెడుతూ ఉపాధి పొందాలన్న గొప్ప ఆలోచనలతో ముందుకు సాగితే ఆనందదాయకమైన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ధైర్యంగా కొత్త అనుభవాలను స్వీకరించి,  వాటాని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడం వల్ల భవిష్యత్తులో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా కౌమారం దశలో సంభవించే కౌమార విజయం, కౌమార రుగ్మతలు వాటి పరిష్కారాల మార్గాలు మొదలగు  అన్ని అంశాల పైన ఛందో బద్ధమైన” కౌమారామృత శతకం” ను ఎంతో ఉత్సాహంతో  రచించారు. ఇది గజ్జారాం చట్ల గారి తొలి రచన కావడం విశేషం.

శతకకర్త పద్యం పట్ల మక్కువను పెంచుకొని, విద్యార్థులకు, పాఠకులకు, తెలుగు భాషాభిమానులకు, మంచి జ్ఞానాన్ని ఇవ్వాలని ఉద్దేశంతో వచన  పద్యాలను తీసుకుని నేటి తరానికి  ఈ శతకము ద్వారా సమాజంలో కౌమార దశలో పతనమౌతున్న భక్తి,నీతి, ప్రేమ, జీవిత విలువలను తీసుకురావడానికి, బాలబాలికలు, విద్యార్థులు, సమాజ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు మొదలగు వారు   చైతన్యవంతులు కావాలనే తపనతో, తన యొక్క రచన నైపుణ్యం వలన  ప్రయత్నాలు చేస్తూ, నిర్మల్ జిల్లా పద్యకవులలో ఒకరుగా స్థానం సంపాదించుకున్నారు.

ఈ  పద్య ఛందస్సు ప్రమేయం లేకుండా 108 పద్యాలు రచించన  గజ్జారాం చట్ల గారు. 2023లో నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య గార్డెన్ లో అప్పటి తెలంగాణ తొలి  దేవాలయ గృహ, నిర్మాణ న్యాయ అటవీ శాఖ మంత్రి వర్యులు శ్రీ, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి శ్రీ , వరుణ్ రెడ్డి ఐఏఎస్,గార్ల చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం. తొలి గురువు ఆయన తన తండ్రి  కీ,శే, బక్కయ్య చట్ల గారితో ఏర్పడిన తండ్రి కొడుకుల బందం కాస్తా గురుశిష్య  బంధంగా మారడంతో పాఠశాల స్థాయి నుంచే తెలుగులో కవితలు , కథలు, నాటకం, పద్యాల పట్ల ఆకర్షితులై  నాన్న గారి పద్యాలు విని స్ఫూర్తి పొందారు.తదనంతరం స్వయానా భగవద్గీత అర్థ తాత్పర్యాల పుస్తకాలు చదువుతూంటే వాటి అర్థాలను  నాన్న వివరించే వారు. ఇంతటి గొప్ప పాండిత్యాన్ని  తండ్రి వలన సంపాదించారు.

మాతృ మూర్తి, మాతృ  భాష అంటే ప్రాణమని  చేప్పే గజ్జారాం చట్ల తెలుగు భాష పై ఉన్న అభిరుచితో  తనకు చిన్నప్పుడు   తల్లిదండ్రుల నేర్పిన సాహితీ విద్యతో శతకం పూర్తి చేసారు.తన తొలి శతకాన్ని బాల్యాన్ని నడిపేది – శివ కేశవులే అను దైవస్తుతి తో ఆరంభించడం గొప్ప విషయం.

కొన్ని శతక పద్యాలు పరిశీలిద్ధాం; –

1).

శైశవంలో సంరక్షణ – సరస్వతీపతి

బాల్యాన్ని నడిపేది – శివ కేశవులే 

యవ్వనం వార్దక్యం – పరిపక్వమే

చిక్కుల్లో చిక్కుకుంది కౌమారమే అమృత పుత్రా!!

భావము :- పిల్లలు దైవ సమానులు

అని అంటారు.రచయిత మనవ జీవితంలోని వికాస దశలను వివరిస్తూ   శైశవ దశలో బ్రహ్మ దేవుడు బాల్యంలో విష్ణువు సంరక్షిస్తూ నడిపిస్తారు.మరి యవ్వనం, ముసలితనంలో ఆదర్శంగా నిలిచిన మనిషి ,కౌమార దశలో పలు సమస్యలను ఎదుర్కొనక తప్పదు  అని  చక్కగా వర్ణించారు.  

2).

స్నేహితుల సాంగత్యం – అధికమగుటచే

తల్లిదండ్రుల సాన్నిధ్యం – అధమమగునులే

సాంప్రదాయ సంస్కారం – గగనమగుటచే

ఆత్మస్థైర్య తగ్గుదల ఆత్మ న్యూనతే – అమృత పుత్రా !!

భావము:- ఓ అమృత పుత్రా! నీవు స్నేహితులతో కలిసి చేసే సరదా, చిలిపి చేష్టలు ఒత్తిడిని  తగ్గించి,స్నేహాన్ని బలోపేతం చేస్తాయి. కనుక తల్లిదండ్రుల చేప్పిన మాటలు పిల్లలు పట్టించుకొక దూరంగా ఉండటం ప్రారంభిస్తారు. తన సంస్కృతి సంప్రదాయాల పట్ల కూడా చిన్నచూపు కలిగి ఆత్మ విశ్వాసం తగ్గిపోవడంతో ఆత్మ న్యూన పై ప్రభావం చూపుతుందని కవి స్పష్టం చేశారు 

3)

ఇట్టి ఘర్షణ తో గడిపేటి – కౌమారంలో 

ప్రేమ తగ్గి,పగనెగ్గి – బుగ్గిపాలె భవిష్యత్తు

హార్మోన్లు,మేధవృద్ధి కారణమని ఎరిగి – తల్లిదండ్రులె

మార్చాలి తనయుల బుద్ది – అమృత పుత్రా!

భావము:- కౌమార దశలో హార్మోన్ల మార్పు వల్ల మానసిక ఆందోళన, చిరాకుతో రక్తసంబంధికుల మధ్య ప్రేమ ఆప్యాయత అనురాగాలు తగ్గి పోతుంది. అలాంటప్పుడు  తల్లిదండ్రులు కారణాన్ని గుర్తించి తనయులను అనుకూలంగా మార్చుకోవాలని కవి భావోద్వేగంతో తెలియజేశారు.

4).

తనుపడ్డ తిప్పల్ని – తనయులు పడకూడదంటు

గాడిద చాకిరి చేసి – డబ్బు గడించి పెడితే 

గార్థభ పుత్రులు మొత్తం – బూడిద పాల్చేసి

అడుక్కు తింటుంటారు – అమృత పుత్రా !

భావము:- తాను పడ్డ కష్టాలు భవిష్యత్తులో పిల్లలు పడకుడదు అనే ఉద్దేశంతో  తల్లిదండ్రులు పిల్లల్ని గారాబంగా పెంచడమే అస్సలు పిల్లలు చెడిపోవడానికి కారణం. దీని వల్ల పిల్లల పట్ల  మనం చూపిస్తూన్న ప్రేమ వారిని బద్దకస్తుల్ని చేస్తుందని దానితో  పిల్లలు దద్దమ్మలుగా తయారవుతున్నరని  రచయిత శత  శాతం వాస్తవాలను  కళ్ళకు కట్టినట్లు చూపించారు.

రచయిత గజ్జారాం చట్ల గారు సంఖ్యాపరమైన శతక లక్షణం పాటించి 108 పద్యాలు లిఖిస్తు “అమృతపుత్రా” అనే  తన అమ్మ పేరుతో మకుటంగా శతకం రాయడం అభినందనీయం. వారి పదపొందిక, రచనా నైపుణ్యం, కవితా శైలి ఎంతో బాగుంది.ఎన్నో విషయాలను సృజించిన కౌమార రచయిత గజ్జారాముని కలము నుంచి మరింత కావ్యాలు జాలువారాలని వారి కీర్తి దశదిశలా వ్యాపించాలని ఆకాంక్షిస్తున్నాను.

వెల : ₹=150/-

ప్రతులకు,

ఇ.నెం1- 4–130/3 

ఆదర్శనగర్ ,

నిర్మల్ జిల్లా,-504106

చరవాణి : 9959299039

పుస్తక సమీక్షకులు:-

రాథోడ్ శ్రావణ్ 

ఉట్నూర్ సాహితీ వేదిక పూర్వ అద్యక్షులు &

అధ్యాపకులు ప్రభుత్వ జూనియర్ కళాశాల గుడిహత్నూర్,ఆదిలాబాద్ జిల్లా. తెలంగాణ చ.సంఖ్య 9491467715.

You Might Also Like