జీవనారణ్యంలో సాహసయాత్ర

(తానా – ఉత్తర అమెరికా తెలుగు సంఘం – 2019లో నిర్వహించిన తెలుగు నవలల పోటీలో 2 లక్షల రూపాయల బహుమతిని ఏకగ్రీవంగా గెలుచుకున్న కొండపొలం నవల [రచన – శ్రీ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి), డిసెంబరు 25న ఆవిష్కరించబడుతున్న నేపధ్యంలో ఆ పుస్తకానికి తానా పూర్వ అధ్యక్షుడు, నవలల పోటీ నిర్వాహకుడు డాక్టర్ జంపాల చౌదరి వ్రాసిన ముందుమాట)

దట్టమైన అడవిలో కొండలమీద చెట్లకింద పడుకున్న అనుభవం నాకు లేదు. అప్పుడప్పుడూ అడవులగుండా ప్రయాణం చేసినా, కారు అద్దాల భద్రత వెనుకనుండే నేను అడవిని చూసింది. నాకు తెలిసినవారిలోనూ అడవిలో బతికిన అనుభవం ఉన్నవాళ్ళు చాలా తక్కువ. కానీ ఈ ఇరవైఒకటవ శతాబ్దంలో ఇప్పటికీ, తెలుగుదేశంలో కొంతమంది మధ్యతరగతి మనుషులు తమ మీద ఆధారపడిన జీవాలను బతికించుకోవడానికి తమ గ్రామాలు, ఆవాసాలు విడచి, స్వచ్ఛందంగా కొన్నినెలలపాటు అడవుల్లో సంచారం చేస్తూ, వందలయేళ్ళకు ముందు తమ పూర్వీకులు బతికినట్టు బతకవలసి వస్తుందని తెలిసినప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది.

నల్లమల అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో అప్పుడప్పుడూ వర్షాభావం చేత తమ గొర్రెలకు తినడానికి మేత, తాగటానికి నీరు లేనప్పుడు, వర్షాలు పడేవరకు తమ గొర్రెలని బతికించుకోవటంకోసం గొర్రెలకాపరులు అడవిబాట పడతారు. ఊరిలో కొన్ని కుటుంబాల మనుష్యులు కలసి తమ గొర్రెల మందలని కలుపుకొని అడవిలో మేత, నీరు దొరికే స్థలాలను వెతుక్కొంటూ మళ్ళీ తమ ఊరిలో వానలు పడి తమ గొర్రెలకు నీరు, మేత దొరికే వరకు వారు అడవుల చుట్టూ సంచరిస్తుంటారు. ఇలా చేసే వనవాసాన్ని స్థానికులు కొండపొలం వెళ్ళటం అని వ్యవహరిస్తారు. ఈ కొండపొలానికి వెళ్ళేవాళ్ళలో చాలా ఏళ్ళ అనుభవంతో తలనెరిసిన వారిదగ్గరనుంచి, మొదటిసారి వెడుతున్న వయసు పిల్లగాళ్ళ వరకు ఉంటారు. కొన్నితరాలుగా ఈ గొర్రెలకాపరుల కుటుంబాలకు ఇలా తరచు కొండపొలం పోవలసి రావటం తప్పకపోవటంతో, ఒక ప్రత్యేకమైన జీవనవిధానం, పద్ధతులు, ఆచారాలు ఏర్పడ్డాయి. గొర్రెలూ, మనుష్యులూ క్షేమంగా వెనక్కు రావటానికి పాటించవలసిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి.

వాళ్ళు అడవులలోకి వెళ్ళి అన్నాళ్ళు ఉండేది సాహసం కోసమో, థ్రిల్ కోసమో కాదు. ఐనా ఈ వనవాసానికి గుండె ధైర్యం ఉండాలి. అడవి గురించి తెలిసిఉండాలి. తమ మీద ఆధారపడి వచ్చిన వందలాది మూగజీవాలను కనురెప్పల్లా కనిపెట్టుకుంటూ, రెప్పపాటులో దెబ్బ తీయడానికి అడవిలో పొంచి ఉన్న ఎన్నో విపత్తులనుంచి మెలకువతో కాసుకోవాలి. అడవిలో ఎక్కడ గడ్డి ఉందో, ఎక్కడ నీరు దొరుకుతుందో తెలిసి ఉండాలి. కొండల, కోనల దారులు ఎరిగి ఉండాలి. చెట్టు మొదలుకీ, చుట్టుకుని పొడుకొన్న కొండచిలవకీ తేడా తెలియాలి. ఎడగండునీ, చిరుబులినీ గుర్తు పట్టగలగాలి. పెద్దపులి ఆనుపానులు తెలుసుకోగలగాలి. ఈ కోరగల్ల జంతువుల నుండి, ప్రకృతి వైపరీత్యాలనుంచే కాదు, అడవి మనుషుల దగ్గరనుంచి, గంధపు చెక్కల దొంగలనుంచీ కూడా తమను, తమ మందలనూ రక్షించుకోవాలి. కొండజ్వరం రాకుండా చూసుకోవాలి. ఈ వనవాసం నిజంగానే అబ్బురపరచే ఒక సాహసపోరాటమే.

ఐతే ఇప్పటివరకూ మనకు ఈ నిత్యజీవితపోరాటపు సాహస గాధ గురించి మనకు చెప్పినవారు ఎవరూ లేరు. ఇదుగో, ఈ సాహసయాత్రలో మనల్ని భాగస్వాములను చేస్తుంది ఈ కొండపొలం నవల. మరి అడవి అంటే తెలీని మనకు ఒక అనుభవజ్ఞుడైన మార్గదర్శి (గైడ్) కావాలి కదా. ఈ కొండపొలాన్ని పలుసార్లు అనుభవించిన రాయలసీమ బిడ్డ, చేయి తిరిగిన ప్రముఖ రచయిత, సన్నపురెడ్డి వెంకటరామరెడ్డిగారు స్వయంగా మనల్ని ఈ యాత్రకు తీసుకువెళ్తున్నారు. బయటివారు చూడలేని, తెలుసుకోలేని అనేక విషయాలను ఈ మార్గదర్శి మనకు అసమాన ప్రతిభతో, నైపుణ్యంతో చూపించబోతున్నారు.

ఈ సాహసయాత్రలో మనం వందలాది గొర్రెలను కాచుకొంటూ ఓబిలం (అహోబిలం) చుట్టుపక్కల పల్లెలపాయ, బింగోని బావి, గద్దగూడుకొండ, చింతల సడ్డు, ఇనప సరూట్లు, రేగిమానుకొండ, గాలికుప్ప, తుమ్మమాని ఏనె, మబ్బుసెల, రాసాల చేను, పెద్దపులి సెల, దొంగ చెలిమ, కులుకుడు గుండాలు, జివ్విమాను బండ, ఒన్నూరమ్మ కోట, బాలప్పబావి, వంటి ప్రాంతాలు తిరుగుతాము. అక్కడి బోడులు, మిట్టలు, పేటలు, కొండలు, ఏనెలు, సెలలు, వాగులు, వంకలు అన్నీ మనకు పరిచయమౌతాయి. దారిలో స్థానిక స్థల పురాణాలు, మందిలో ప్రచారంలో ఉన్న అనేక కథలు కూడా చెబుతాడు మన మార్గదర్శి. ఆ ప్రాంతపు భాష, యాస, పలుకుబడి, మాటతీరును మనం అర్థం చేసుకొని ఆనందించేట్లు చేస్తాడు. భిల్లు, చందనం, ఏపె, సీకరేణి, సిరిమాను, పొలికె, తాండ్ర, మద్ది, సండ్ర వంటి రకరకాల చెట్లను చూస్తాము. పరిక్కాయ, ఈతకాయ, టూకిపండు, మోవిపండుల రుచులు తెలుస్తాయి. కొండల పైన, సెలలలోన మొలిచే అనేక రకాల గడ్డి మనకు కనిపిస్తుంది. నేండ్రగడ్డి కనిపిస్తే గొర్రెలు దబ్బగోగడిని, పీచుగోగడిని, బొచ్చుగడ్డినీ మూచూడవని గమనిస్తాము. ఎడుగండు ఎదురుపడితే గట్టిగా హడలుకొడితే చాలని, కానీ పెద్దపులి అలా జడవదని, మనమే దూరంగా తప్పుకోవాలని మన అనుభవానికి వస్తుంది. ముచ్చుగొర్రెకూ, బొల్లిగొర్రెకూ తేడా తెలుస్తుంది. మందలో కారుపొట్టేలు, దొడ్డిపొట్టేలు, తలపొట్టేళ్ళ తరతమస్థానాలు అర్థమౌతాయి. తలపొట్టేలు, ఎదగొర్రెల యవనదశల వెంపర్లాటే కాదు; కొండచిలవల ప్రణయకాండ గురించి కూడా తెలుస్తుంది.

మరి మీరు ఈ అద్భుతయాత్రకు సిద్ధంగా ఉన్నారా?
* * *
మానవ జీవితపు తొలి దశ అడవులలో ఆహార సేకరణతో మొదలైనా, పరిణామ క్రమంలో తరువాత దశనుంచీ వ్యవసాయము, పశుపోషణ జీవితంలో ముఖ్యభాగాలయ్యాయి. ఇప్పటికీ ఈ రెండు వృత్తులూ సమాజానికి ముఖ్యావసరాలే. ఐతే తెలుగు సాహిత్యంలో వ్యవసాయ సంబంధిత విషయాలకు పెద్దపీటే వేసినా, పశుపోషణవృత్తికి అంత ప్రాముఖ్యత ఇచ్చినట్లు కనపడదు. ముఖ్యంగా ఆధునిక సాహిత్యంలో పశుపోషణ ముఖ్యాంశంగా ఉన్న కథలు, నవలలు బహు తక్కువ. ఉన్న కొద్ది కథల్లోనూ వ్యవసాయానికి అవసరమైన పశువుల (ఎద్దుల) ప్రసక్తే ఎక్కువ. మన ప్రాంతాల్లోనూ, ప్రపంచపు నలుమూలల సంస్కృతులలోనూ కనిపించే గొర్రెల గురించి, గొర్రెల కాపరుల జీవితాల గురించి తెలుగులో వ్రాసినది తక్కువ.

అలాగే తెలుగులో అడవి ముఖ్యపాత్రగా ఉండే పుస్తకాలూ తక్కువే; ఉన్న కొద్ది కూడా గిరిజనుల జీవితాల గురించి లేక నక్సలైటు ఉద్యమం గురించి రాసినవే. ఇటీవలే వచ్చిన అడవి నుంచి అడవికి (జయతి లోహితాక్షన్ స్వీయ అనుభవాలు) కొంత మినహాయింపు అనుకుంటాను.

ఈ రెండు వస్తువులనీ (గొర్రెలకాపరుల జీవన విధానాన్ని, అడవిని) కలుపుకుంటూ, మనలో చాలామందికి పరిచయంలేని ఒక ప్రత్యేక జీవనపోరాటాన్ని, ఈ కొండపొలం నవలలో, మన కళ్ళ ముందు వాస్తవికంగా ఆవిష్కరిస్తున్నారు సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి.
* * *
ఐతే ఈ నవల ఒక్క అడవి సంచారానికే పరిమితం కాలేదు. కొన్ని విషయాలను సూక్ష్మంగానూ, మరెన్నో విషయాలను స్థూలంగానూ చర్చిస్తుంది.

కథానాయకుడు రవికి కొండపొలం పోవటం ఇదే మొదటిసారి. తప్పనిసరి పరిస్థితులలో, తండ్రికి సాయంగా, అతను కొండపొలం వెళ్ళవలసి వచ్చింది. ఇది అతనికి పరిచయం ఉన్న ప్రపంచానికి బహుదూరమైన ప్రపంచం. ఆ ఊళ్ళో ఎవరూ చదవని చదువు – బీటెక్ – చదివిన రవి, ఊర్లో గొర్రెలకాపరుల జీవితానికి దూరంగా, ఇంటిపనులు చేయనంత సుకుమారంగా పెరిగాడు. బెరుకువల్ల ఇంటర్వ్యూలు సరిగా చేయక ఉద్యోగాన్ని సంపాదించలేక ఆత్మన్యూననతో బతుకుతున్న రవి, అడవికి వచ్చినా, గొర్రెలను కాయటం బదులు తన భయాన్నే కాసుకుంటూ ఉన్నాడు మొదట్లో. ఆ భయం అతన్ని తన చుట్టూ ఉన్న అడవిని కూడా సరిగ్గా చూడనివ్వలేదు. మిగతా అన్ని అనుభవాలకూ ఈ భయం అడ్డై నిలచింది. ఐదు బత్తేల పాటు (40 రోజులు) అడవిలో తిరిగేసరికి రవికి అడవి గురించీ, గొర్రెల గురించీ, తనవాళ్ళ గురించీ, తన గురించీ కొన్ని సత్యాలు ఎరికకు రావటం ఈ నవల ముఖ్య ఇతివృత్తాలలో ఒకటి. ఈ జ్ఞానం రవి జీవితాన్ని మెరుగు పరచింది. ఊర్లో మిగతా యువతతో ఈ జ్ఞానాన్ని పంచుకొని వారికీ దారిచూపేలా చేసింది.

ఈ నవల రవి ఒక్కడి గురించే కాదు; అతనితో పాటు కొండపొలానికి వెళ్ళిన మిగతావాళ్ళ గురించి కూడా. అంతే కాదు, ఊరిలో మిగిలి ఉన్నవారి గురించి కూడా. మారుతున్న ఆర్థిక సామాజిక పరిస్థితులలో ఒక్కొకరిదీ ఒక్కో కథ, ఒక్కోరకమైన వ్యధ. ఐనా మనుషుల మధ్య ఉండే ప్రేమలు, బాంధవ్యాలూ, ఆశలూ, వైషమ్యాలూ, వైరుధ్యాలూ జీవితాన్ని సప్తవర్ణాల మిశ్రమంగా ఎలా చేస్తాయో రవికి తెలిసివస్తుంది. అలిగి పుట్టింటికి వెళ్ళి తిరిగిరాని భార్యకోసం వేదనపడే అంకయ్య, కూతురుకు తనకు ఇష్టంలేని సంబంధం చేస్తున్న భార్యపట్ల కోపించిన రామయ్య, అల్లుడికిస్తానన్న కట్నంకోసం మందను అమ్ముకోవలసి వచ్చిన పాములేటి, చస్తే సేద్యగాడి సంబంధం కూతురుకి చేయనని పట్టుపట్టిన తిరిపేలు, పోలీసుల భయంతో అటు గ్రామంలో ఉండలేక, చందనపు దొంగల భయంతో అడవిలోనూ స్వేచ్ఛగా తిరగలేక సంచార జీవితం చేస్తున్న యానాదులు, రవి గుండెలోనే కాదు, మన గుండెల్లోనూ ముద్రలు వేస్తారు.

కొండపొలం వెళ్ళిన బృందానికి పెద్దదిక్కు ముసలి పుల్లయ్య ఇంకో ముఖ్యపాత్ర. అనుభవంతో తలపండిన పుల్లయ్యకు కొండపొలం వచ్చినవారందరూ – మానుసులూ, గొర్రెలూ -సురక్షితంగా ఇంటికి తిరిగివెళ్ళటం అన్నిటికన్నా ముఖ్యమని తెలుసు. ఉడుకురక్తపు యువకులు తొందరపడి అడవిజంతువులతోనూ, అడవిలోఉన్న చెడ్డ మనుష్యులతోనూ గొడవలుపడి అపాయానికి లోను కాకుండా ఉండటానికి. అందర్నీ ఒక కంట కనిపెడుతూ, తన అనుభవాన్ని అందరితో పంచుకుంటూ, అవసరమైనప్పుడు అదిలిస్తూ ఉండే పుల్లయ్యకు తమకు అడవికీ ఉన్న సంబంధం గురించి స్పష్టత ఉంది. ఈ అడవికి తాము చుట్టపు చూపుగా వచ్చినవాళ్ళు. తమ పని తాము చూసుకుని మర్యాదగా తిరిగిపోవాలి; అడవికి నష్టం కలిగించకూడదు; చెట్లు నరకటమూ, అడవిజంతువులను చంపడమూ తాము చెయ్యాల్సిన పని కాదు, ఏ పెద్దపులైనా దాడి చేసినా, దానితో కలబడి దెబ్బలు తినే బదులు, దానికి ఒకటో రెండో గొర్రెల్ని పుల్లరిగా ఇవ్వటమే మిగతా మందకూ, కాపరులకూ క్షేమం అని తెలిసిన వ్యక్తి. ఇది పెద్దపులి రాజ్యమనీ, ఆకలి తీర్చుకునే హక్కు దానికీ ఉందని, దాని మానాన దాన్ని పోనిస్తూ, తమ మానాన తాము పోవటమే ఉత్తమమార్గమని గుర్తెరిగినవాడు. తన అనుభవంతోనూ, మాటకారితనంతోనూ, అవసరమైనప్పుడు వెటకారంతోనూ మిగతావారి సమస్యలను సానుభూతితో పరిష్కరించే పుల్లయ్య పాత్రను రచయిత మలిచిన తీరు మెచ్చుకోతగ్గది. అడవిలో తిరుగుతున్నందుకు తమకు పుల్లరి కట్టమని వచ్చిన చెంచులతో పుల్లయ్య వ్యవహరించిన తీరు నన్నుచాలా అలరించింది.

రచయితకు అడవి, అక్కడి జంతువులే కాదు, ఊర్లో మనుషుల గురించి కూడా బాగా తెలుసు. ప్రస్తుత ఆర్థిక సామాజిక పరిస్థితులు రైతుల, గొర్రెలకాపరుల కుటుంబసంబంధాలను, బాంధవ్యాలను ఎలా విఛ్ఛిన్నం చేస్తున్నాయో తెలిసిన ఈ రచయిత ఈ నవలలో అనేక ఉపకథలలో ఈ విషాదపు అనేక పార్శ్వాలను మనకు చాలా ప్రతిభావంతంగా చూపిస్తాడు. అంకయ్య అనే గొర్రెలకాపరి ఫోనులో మాట్లాడుతూ తన భార్య ముందు తన ప్రేమనూ, తన నిస్సహాయతనూ వెల్లబరచిన సన్నివేశాన్ని రచయిత నిర్వహించిన తీరుకి గుండె చిక్కబడుతుంది. అప్పుల బాధకు తాళలేక ఆత్మహత్యకు తయారైన రైతు, తన చావు తర్వాత విధులకు ఐనవాళ్ళు ఇబ్బంది పడకుండా అన్నీ సమకూర్చుకొని మరీ చనిపోవటం వెనుక ఉన్న మర్మాన్ని వెదికినప్పుడు కంటికి చెమ్మ వస్తుంది.

గొర్రెలకాపరులకు గొర్రెలకు మధ్య ఉండే సంబంధాన్ని రచయిత ఈ నవలలో ఆవిష్కరించిన తీరు చాలా ఆర్ద్రంగా ఉంటుంది. తమ సంరక్షణలో ఉన్న మూగ జీవాల పట్ల గొర్రెల కాపరులకు చాలా ప్రేమ; పసిబిడ్డలను చూసుకున్నట్లు వాటి బాగోగులను చూసుకొంటారు. వాటి సంక్షేమాన్ని తమ బాధ్యతగా భావించి ఆరాటపడుతుంటారు. తన గొర్రెలకు తిండీ, నీరు సరిగా దొరకని రోజున తాను కూడా తిండి తినలేని గురప్ప లాంటి మనుష్యులను రచయిత మనకు పరిచయం చేస్తాడు.
* * *
రచయిత స్వీయానుభవాల, పరిశీలనలలో జన్మించిన ఈ కొండపొలం వాస్తవికతను నింపుకొని ప్రామాణికతను సంతరించుకుంది. మనుషుల పట్ల, జంతువులపట్ల, పర్యావరణం పట్ల రచయితకు ఉన్న సానుభూతి, సంతులన దృష్టి ఈ నవలను అరుదైన మానవీయతతో నింపాయి.

సన్నపురెడ్డి గారు ఈ కథ చెప్పిన తీరు కూడా బహు గొప్పది. తెరలు తెరలుగా ఉత్కంఠ పెంచుతూ ఈ నవల ఎక్కడా ఆగకుండా చదివిస్తుంది. రచయిత తనకు తెలిసినదంతా ఊకదంపుడుగా మనకు చెప్పటం కాకుండా అవసరమైనప్పుడు అవసరమైనంతవరకే చెప్పడంతో మనకు విసుగు కలగదు. రచయిత భాషను ఉపయోగించుకున్న తీరు కూడా మెచ్చుకోతగ్గది. కొన్ని సన్నివేశాలు, సంభాషణలు, మళ్ళీ మళ్ళీ చదివించాయి. అనంతపురపు మాండలికంలో పాత్రోచితమైన సంభాషణలు, సామెతలు ఒక పక్క, కొండల, అడవుల, అడవిజీవాల గురించి అద్భుతమైన కవితాత్మక వర్ణనలు ఇంకో పక్క. కథలతోనూ, నవలలతోనూ పేరుగన్న సన్నపురెడ్డిలో ఒక మంచికవి ఉన్నాడని ఈ నవలతో అందరికీ తెలుస్తుంది.
* * *
అరుదైన వస్తువు, పాత్రలు, స్థలకాలాలు ఎన్నుకొని, చిక్కటి కథాక్రమం, కథన విధానం, మంచి ముగింపు, చక్కటి భాష, అంతర్లీనమైన తాత్వికతలను చక్కగా సమతూకంలో సంతరించుకున్న ఈ కొండపొలం చదివిన ప్రతిసారీ నాకు మరింత గొప్పగా అనిపించింది. 2019 తానా నవలల పోటీలో రెండులక్షల బహుమతిని అందుకొంటున్న ఈ కొండపొలం పాఠకుల, విమర్శకుల మెప్పును పొంది, సమకాలీన తెలుగు సాహిత్యంలో ప్రముఖస్థానాన్ని అందుకొంటుందని నా నమ్మకం.
* * *
ఇంకా ఆలస్యమెందుకు? ముందుకు సాగండి. ఈ సాహసయాత్రను మీరూ అనుభవించండి.

 

* * *

కొండపొలం

సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి (sannapureddy12@gmail.com

341 పుటలు; రూ. 225 /$10

తానా ప్రచురణలు, డిసెంబరు 2019

Available at all leading book stores and kinige.com

You Might Also Like

One Comment

  1. Bhaskar Pulikal

    Very comprehensive foreword that compels reader to go through the novel asap. Am in India on an unplanned visit and will try to attend the release function of the book @ Ravindra Bharathi.

Leave a Reply