2011 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డు

(వివరాలు తెలిపినందుకు తమ్మినేని యదుకుల భూషణ్ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

ఈ ఏడాది సి.పి.బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డుల తాలూకా ప్రకటన ఇది.

పద్మలతకు ఇస్మాయిల్ అవార్డు

తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు పద్మలత కవితా సంకలనం “మరో శాకుంతలం ” ఎంపికైంది.గడుసైన ఎత్తుగడలు,క్లుప్తత, సకలోద్వేగాలను సమర్థంగా వెల్లడించగల నేర్పు నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి.గతంలో పాలపర్తి ఇంద్రాణి, గోపిరెడ్డి రామకృష్ణారావు, గరికపాటి పవన్‌కుమార్, పి.మోహన్‌,వైదేహి శశిధర్, గండేపల్లి శ్రీనివాస రావు లకు ఈ అవార్డ్ లభించింది.

కోరాడ మహాదేవ శాస్త్రి గారికి బ్రౌన్ పురస్కారం

భాషా శాస్త్రంలో ఏడు దశాబ్దాల అవిరళ కృషి, పరిశోధనకుగాను శ్రీఖరనామ సంవత్సరం బ్రౌన్ పురస్కారానికి, కోరాడ మహాదేవ శాస్త్రి గారిని ఎంపిక చేసాము.తెలుగు పరిశోధనా రంగంలో మహాదేవ శాస్త్రి గారు భీష్మ పితామహులు అనడంలో అతిశయోక్తి లేదు.ఇటీవల తెలుగుకు శ్రేష్ఠభాషగా గుర్తింపు వచ్చింది.ఘనత వహించిన కేంద్ర ప్రభుత్వం ఒక పీఠాన్ని కూడా అనుగ్రహించింది. దీని వెనుక కోరాడ వంటి ఎందరో మహానుభావుల పట్టుదల ఉన్నది. మహాదేవ శాస్త్రి గారు పరిశోధక విద్యార్థిగా గావించిన కృషి తెలుగు చారిత్రక వ్యాకరణంగా రూపు దిద్దుకుంది. ఈ విశిష్ట గ్రంధాన్ని హరప్పా లిపిని అర్థవంతంగా చదివే ప్రయత్నాల్లో ఐరావతం మహదేవన్ వినియోగించుకున్నారు అంటే కోరాడ వారి గొప్పదనం విశదమవుతుంది. అక్కడితో ఆగిపోలేదు వీరి కృషి , దక్షిణాదిన , జర్మనీలో ఆచార్యత్వం వహించి ఎన్నో మేటి గ్రంధాలను రచించి బుధవరుల మన్నన పొందారు. ఐతే, వీరి పుస్తకాలకు పునర్ముద్రణలు రావలసి వుంది. నేటి తరం వీరి రచనలు చదివి స్ఫూర్తి పొందాలి.ఈ డిసెంబర్ 29 కి తొమ్మిది పదుల నిండు వయసు లోకి అడుగు పెడతారు కోరాడ వారు.. ప్రస్తుతం వారి నివాస స్థానం మద్రాసు లో తలపెట్టిన వారి సన్మానానికి ఇదే మా ఆహ్వానం.

జీవిత విశేషాలు

బందరులో జననం (1921), చెన్నపట్టణం ప్రెసిడెన్సీ కాలేజీ లో చరిత్ర ఆర్ధిక శాస్త్రాల్లో ఉన్నత విద్య(1944), కొంతకాలం సంబంధిత రంగాల్లో పరిశోధన.తిరిగి కలకత్తా విశ్వవిద్యాలయం లో ప్రఖ్యాత భాషా శాస్త్రవేత్త సునీతి కుమార్ చటర్జీ మార్గదర్శకత్వం,ఉద్దండులైన సుకుమార్ సేన్ , క్షితిజ్ చంద్ర చటర్జీల శిష్యరికం.అంతేగాక సర్వ ప్రథమునిగా ఉత్తీర్ణులై బంగారు పతకం, D.Litt పట్టా (1952) పొందారు. తదుపరి అక్కడ మానవ శాస్త్ర విభాగం క్షేత్ర పరిశోధనల్లోపాలుపంచుకొని ఉత్తర ప్రదేశ్ లో యునెస్కో ప్రాజెక్టులో భాగంగా భోజ్ పురీ మాండలికాన్ని అధ్యయనం చేశారు.పదేళ్లకు పైబడి అన్నామలై ,వెంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో బోధన. జర్మనీలో మూడేళ్ళ పాటు ఆచార్యత్వం. International School of Dravidian Linguistics , Trivandrum కు గౌరవాధ్యక్షత వహించారు. వీరు వెలయించిన ఉద్గ్రంధాలు , పరిశోధక వ్యాసాలు మచ్చుకు కొన్ని:

Historical Grammar of Telugu(1969) ,Descriptive Grammar of Telugu,(1985), Hand Book of Modern Telugu (1985), వ్యాకరణ దీపిక(1984) , ఆంధ్ర వాజ్మయ పరిచయము , తెలుగు వ్యుత్పత్తి పద కోశము(2003).A Folktale in Western Bhojpuri (1954), Prakrit inscriptions in Buddhic Andhra, Dialectal differences in Eleventh Century Telugu, పాళీ భాషా వాఙ్మయములు , ప్రాఙ్నన్నయ శాసన భాషలో గ్రాంధిక వ్యావహారిక భేదములు.

(2010 అవార్డుల ప్రకటన గురించి పుస్తకం.నెట్లో వచ్చిన వార్త ఇక్కడ చూడవచ్చు)

You Might Also Like

Leave a Reply