Latest news for ?tag=biography
ఈ పుస్తకం వెనకాల ఓ ముప్పయ్యైదేళ్ళ అధ్యయనం ఉంది. అత్యంత బాధాకరమైన జీవిత విషాదమూ ఉంది. అరుణ్ శౌరి వాళ్ళ అబ్బాయి ఆదిత్యకు సెరిబ్రల్ పాల్సీ (మస్తిష్క పక్షవాతం). నడవలేడు, నిలబడలేడు. కుడిచేయి పని చేయదు. ఎడమచేయి జెర్కీగా కదులుతుంది. కుడి కంటితో చూడలేడు. మైనస్ 5 పవరున్న కళ్ళద్దాల సహాయంతో ఎడమకంట లీలగా కనబడుతుంది. ఒక్కో అక్షరాన్ని పేర్చుకుంటూ మాట్లాడటమూ ప్రయాస కలిగించే పనే! ఇన్ని కాదు గానీ వీటిల్లో ఏ ఒక బాధ సంప్రాప్తించినా జీవితం నరకప్రాయంగా ఉంటుంది కదా. ఇవన్నీ చాలనట్లు ఎప్పుడూ ఏదో ఓ రుగ్మత దాడి చేసి ఆదిత్యనూ తన కుటుంబాన్నీ విలవిలలాడిస్తూ ఉంటుంది. ఎదురొచ్చిన ప్రతి కష్టాన్నీ ఎదుర్కొంటూ, పనిలో పనిగా "ప్రాపంచిక దుఃఖానికి మూల కారణంబెవ్వడు (ఎయ్యది?)" అనే ప్రశ్నకి సమాధానాన్ని వెదుకుతూ, వివిధ మత గ్రంథాలను , ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాలను తరచి చూసారు శౌరి. తన నిజజీవిత విషాదాన్నీ, అధ్యయన సారాంశాన్నీ 425 పేజీలలోకి దించేసి Does He know a Mother's Heart? అని అడుగుతారు, జాలిగా, కోపంగా. మనమనుభవించే సుఖ దుఃఖ పరంపరలకు దేవుడినో, కర్మనో కారణంగా భావిస్తాము. [?tag=biography] హిందూ ఆధ్యాత్మికతతో కొంచెం ఎక్కువ పరిచయం ఉండి దాన్ని ఒంటబట్టించుకున్న వాళ్ళు కొందరు, "అసలిదంతా మాయ. అనుభవమూ లేదు, అనుభవించేవాడూ లేడు. అంతా మిథ్య!" అనేస్తారు. ఈ మూడు (దేవుడు, కర్మ, మాయ) భావనలను "దుఃఖ దీపకాంతి"లో నిశితంగా పరిశీలిస్తారు శౌరి ఈ పుస్తకంలో. *** మనమనుభవించే సుఖదుఃఖాలన్నీ మన మన కర్మానుసారంగానో, యథేచ్ఛగానో దేవుడే ప్రసాదిస్తాడనే నమ్మకాన్ని చాలా గట్టిగా ప్రశ్నిస్తారు, శౌరి. ఎవరీ దేవుడు? ఈయన అవాఙ్మానస గోచరుడైన నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపుడు కాడు. "ఆకాశపు తెర వెనకాల పొడుగు గడ్డం పెట్టుక్కూర్చున్న వాడు", సృష్టి స్థితి లయలకు కారకుడు, సర్వజ్ఞుడు, సర్వ శక్తిమంతుడు, కరుణాళువు, పరిపూర్ణుడు. ఆయన ఆజ్ఞ లేనిదే ఆకైనా అల్లాడదు. మనం చేసే మంచి-చెడుల జమాఖర్చులు ఎప్పటికప్పుడు రాసేసి మనమనుభవించాల్సిన సుఖదుఃఖాల లెక్కలు గట్టే మహాగణకుడు-కం-న్యాయమూర్తి ఆయనే. “దేవుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ అఫైర్స్“ కేసులో దేవుణ్ణి బోనులో నించోబెట్టి అడిగిన కొన్ని ప్రశ్నలు, మచ్చుకి: 1. కోటానుకోట్ల నక్షత్ర సముదాయాలున్న ఈ సువిశాల విశ్వంలో , ఒక మారుమూలనున్న చిన్న నక్షత్రం చుట్టూ తిరిగే ఓ చిన్నపాటి గ్రహం మీద బిలబిలలాడే లక్షలాది జీవరాశుల్లో ఒక జాతికి చెందిన మనిషి అనే ప్రాణికి నీ పట్ల భక్తి ఉందా లేదా అన్న పట్టింపు నీకెందుకు? ఈ ప్రవక్తలూ, మత గ్రంథాలూ, ధర్మ యుద్ధాలూ - ఎందుకివన్నీ? 2. వందల, వేల, లక్షల సంఖ్యల్లో మనుషులనూ, జంతువులనూ హతమార్చే ప్రాకృతిక ఉత్పాతాలు నీ వల్లే సంభవిస్తాయా? లేక నీ ప్రమేయం లేకుండానే వస్తాయా? వాటికి నీవే కర్తవైతే నీకు విచక్షణా, క్షమా ఉన్నాయనే అనుకొమ్మంటావా మమ్మల్ని? 3. ఏ తప్పూ చేయని వారికి (కొండొకచో, నీ భక్తులకు సైతం) దుస్సహమైన దుఃఖాన్ని ఎందుకు కలిగిస్తావు? 4. మేము - మనుషులము - అనుభవించే దుఃఖానికి కట్టకడపటి బాధ్యత ఎవరిది? మేం ఎందుకు పాపం చేస్తాము? మాకు నిర్ణయ స్వేచ్ఛ ఉందా, లేదా? 5. నీవు సర్వశక్తిమంతువూ, సర్వజ్ఞుడవూ, కరుణాళువువూ కూడా అయితే - లోకంలో ఇంత చెడూ, ఇంత దుఃఖమూ ఎందుకున్నాయి? కరుణామయుడవైన నీకు ఈ చెడునీ, దుఃఖాన్నీ తొలగించగలిగే శక్తి లేదా? లేక, సర్వశక్తిమంతుడివైనప్పటికీ ఈ చెడునీ, దుఃఖాన్నీ నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోతావా? పాత ప్రశ్నలే! "వితండవాదమే". సమాధానాలు దొరకనంతకాలమూ మనకు మళ్ళీ మళ్ళీ ఎదురవుతూ ఉంటాయి. మతం గురించి విమర్శనాత్మకంగా రాయాల్సి వచ్చినప్పుడు, సాధారణంగా రచయితలు తాము పుట్టి, పెరిగి, వదులుగా పాటిస్తున్న/వదిలేసిన మతాన్ని తిట్టడమూ, "పరుల" మతాలను గౌరవించడం పరిపాటి. అలాంటి పొలిటికల్ కరెక్ట్నెస్ పట్ల తన అవిధేయతని మరోసారి ప్రకటించుకున్నారు, శౌరి. దేవుడి స్వభావానికి సంబంధించిన ఈ చర్చ, ప్రధానంగా, బైబిల్, ఖురాన్లలోని అబ్రహాం, లాట్ (Lot), జోబ్ (Job) కథల ఆధారంగా, "మంచీ-చెడూ, విశ్వాసావిశ్వాసాలూ అన్నింటికీ నేనే కారణం. " అని దేవుడు చెప్పిన మాటల ఆధారంగా సాగుతుంది. కొటేషన్ల ఎంపికలో పొరబాటు ఉండక పోవచ్చు, ఎంచుకున్న "ప్రమాణ వాక్యాల" నుంచి తను రాబట్టిన నిర్ధారణలు తప్పు కాక పోవచ్చు. కానీ, తన విశ్లేషణ కేవలం బౌద్ధికమైనదే, ఔట్సైడర్స్ పెర్స్పెక్టివ్కి ఉండే పరిమితులు ఉండే ఉంటాయని నాకు అనిపించింది. పైగా, పాఠకులను గుక్క తిప్పుకోన్వివ్వకుండా కొటేషన్లు గుప్పించడం వల్ల పుస్తకం పఠనీయత బాగానే దెబ్బ తిన్నది. ఆమాట అలా ఉంచితే, అస్మదీయ-తస్మదీయ, అస్తి-నాస్తి సంవాదాలకు, అభిప్రాయ భేదాలకు అతీతంగా నేర్చుకోదగ్గ ఓ మంచి విషయాన్ని పలు మార్లు చెబుతారు. ఓ ఆలోచన/ప్రతిపాదన సబబైనదా? అని పరిశీలించేప్పుడు ""ఫలానా వాళ్ళు చెబితే, ఫలానా పుస్తకంలోనిదైతే ఒప్పు, కాకుంటే తప్పు" అనే ధోరణిలో కాకుండా పూర్వ నిర్ధారితమైన అభిప్రాయాల నీడ పడకుండా, నిష్పక్షపాతంగా , వివేచించాలని సూచిస్తారు శౌరి. తను బోధించిన పాఠాన్ని తానే ఆచరించి చూపారు కూడా - బీహార్ భూకంపం సందర్భంలోనూ, యూదుల సమస్య విషయంలోనూ గాంధీగారి అభిప్రాయాలను చర్చించిన ఆసక్తికరమైన అధ్యాయంలో. Personal/Interceding/Intervening Godకి సంబంధించిన చర్చకి ముక్తాయింపు (శౌరి పుస్తకం నుంచే): ''What a delight to meet you, ' I say on encountering a friend. 'How are things?' 'God is kind', he says. 'Business is really looking up'. Perhaps, that is why things are the way they are, I tell myself. God is so busy ensuring that everybody's business prospers, ?tag=biography how can He have time for climate change?. . . " *** దుఃఖితుల గురించి అట్టే బాధపడని దేవుణ్ణి ప్రశ్నించి, ప్రశ్నించి వదిలేసాక, రామకృష్ణ పరమహంసా, రమణ మహర్షీ బోధనల పరిశీలనలో పడతారు శౌరి. ప్రపంచమనే తామరాకు మీద నీటిబొట్లలా జీవించినా, వీరిద్దరూ తమనాశ్రయించిన వారికి దుఃఖోపశమనాన్ని కలిగించడానికి ప్రయత్నించిన వారే. వీరిద్దరు ఈ విషయమై ఏమని బోధించారు? దుఃఖాన్ని ఎలా అధిగమించగలమని చెప్పారు? ఓ వంద పేజీలు నిండిపోయిన సంభాషణల్లో మనకు కనబడే దుఃఖ కారణాలు ఇవి: 1. దైవేచ్ఛ (God's Inscrutable Will). మనకు అర్థం కాని లీల! 2. ప్రారబ్ధ కర్మం - గత జన్మలలో అనుభవించగా మిగిలిపోయిన కర్మశేషం 3. అదలా జరగాలని రాసి పెట్టి ఉంది గనక (నియతి వాదం) అహాన్ని మరిచి సంపూర్ణ సమర్పణా భావంతో జీవించగలిగితే కష్టాలు బాధించవంటారు రామకృష్ణ పరమహంస. 'పవర్ ఆఫ్ అటార్నీ' పైవాడి చేతిలో పెట్టి హాయిగా ఉండక, "నేనూ, నాదీ అనడం పామరత్వం. నీవే నేను. నీవే అంతా. నీదే అంతా అనుకోగలిగితే ఏ కష్టమూ నిన్ను బాధించదు. బండిలో కూర్చున్నవాడు పెట్టే బేడా తల మీద మోయడం దేనికి? వాడిని మోసిన బండి వాటిని మాత్రం మోయదా?" అని అడుగుతారు తనదైన శైలిలో. "దేహమే నీవనే భ్రమను వదిలిపెడితే, ఇంద్రియాల ద్వారా అవగతమయ్యే ఈ ప్రపంచమూ, దాని వాసనలూ బంధాలూ ఉత్తి మాయ అని గ్రహించగలిగితే ఈ బాధలు మనలను బాధించవు. అవి mere scratches on the surface అని గ్రహించండి. " అంటారు రమణ మహర్షి. "ఏ పాపం ఎరగని పసి పిల్లలకు సైతం కష్టాలూ/బాధలు ఎందుకు కలుగుతాయి?" అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం: "ప్రపంచం అంటే ఏవిటో, నీవెవరివో తెలుసుకుంటే ఇలాంటి ప్రశ్నలు ఉదయించవు. ఈ వ్యత్యాసాలూ, అమాయకులకు కష్టాలూ, బాధలూ - ఇవన్నీ "నీవు" లేనప్పుడు లేవు. ఇవన్నీ ఎందుకని అడుగుతున్నది ఎవరు? నువ్వు. నీవెవరివో తెలుసుకో ముందు. తానెవరో తెలుసుకున్న వాడికి ఏ ప్రశ్నా ఉండదు. ” కనబడేది మాయ. చూస్తున్నాను అనుకోవడమూ మాయే. తనను తాను తెలుసుకున్న జ్ఞాని మాయనూ, మాయాజనితదుఃఖాన్నీ అధిగమిస్తాడు అని తాత్పర్యం. దేవుడి మీద కోపంతో ఊగిపోయినట్లు కాకుండా ఈ ఇద్దరు జ్ఞానులను, ఆధ్యాత్మికానుభవులను చాలా గౌరవంతో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు శౌరి. అవసానదశలో ఎంతో యాతనను అనుభవిస్తూ కూడా తమను దర్శించేందుకు వచ్చిన వారి పట్ల వారు చూపిన ఆదరభావమూ, కరుణల గురించి రాస్తూ, “These traits - solicitude and compassion. . . [of these saints] are so unlike what we see of God through His deeds” అని అంటారు. అయినా తండ్రిగా, తాత్త్వికుడిగా సమాధానపడరు. అదిత్ అనుభవించే అనుదిన నరకయాతనకు ఓ దైవిక ప్రయోజనం ఉంటుందా? అది అతడు ఏదో జన్మలో చేసుకున్న పాపానికి శిక్షా? తన కుటుంబ సభ్యుల కర్మఫలమా? అరుణ్ శౌరికో, ఆయన భార్యకో ఏవో గొప్ప గొప్ప పాఠాలు నేర్పడానికి ఇదంతా జరిగిందా? ఏ హెచ్చెరుక ఈ కింది ప్రశ్నలకు జవాబివ్వగలుగుతుంది? “But has my son not suffered an injury to the brain or not? Can he stand and walk? Can he talk like others?. . . Have these things happened or not? Or is it just that because my wife and I did not fathom the ‘Who am I’, these things appear to have happened when in fact, they have not? The question is not. ‘Are these injuries significant or not”. . . The question is of fact: have the injuries occurred or not? If they have, why they have been visited on this hapless child?” ఈ విచికిత్సలో భాగంగా కర్మ గురించీ, మాయ గురించీ మౌలికమైన విశ్లేషణ చేస్తారు రచయిత. మహాభారతంలోని అనుశాసనికపర్వంలోని మొదలై ఉపనిషత్తులూ, బ్రహ్మసూత్ర భాష్యాల మీదుగా, సి. జి. యుంగ్, ఎరిక్ ఫ్రామ్లను పరామర్శిస్తూ దగ్గర ముగుస్తుంది కర్మ సిద్దాంత వివేచన. ఎప్పుడో ఏ జన్మలోనో చేసుకున్న కర్మఫలమే మనం ఇప్పుడు అనుభవించే సుఖదుఃఖాలనీ, కర్మఫలశేషం ఉడిగిపోయేదాకా మనం పునర్జన్మలనెత్తుతూ ఉంటామనే ప్రతిపాదనలను మనలను మనం మభ్యపెట్టుకునేందుకు పనికొచ్చే "convenient fiction"గా వర్ణిస్తాడు శౌరి. ఐతే - సుఖదుఃఖ మూలాల వివరణభారాన్ని మోపకుండా ఉంటే, పునర్జన్మలూ ?tag=biography, ఆత్మ అనశ్వరత్వమూ అంటూ దాన్ని పొడిగించకుండా ఉంటే, 'ఫలానా కర్మకి ఫలానా ఫలితమే రావాలి కదా' అని నిలదీయకుండా ఉంటే కర్మ సిద్ధాంతం ఇప్పటికీ మనకు ఎంతో ఉపయోగపడుతుంది అని సూచిస్తారు. కర్మ సరే - మాయను ఎలా అర్థం చేసుకుంటాము? చూసేవాడు (perceiver) లేకపోతే ప్రపంచం (perceived) మాయమయిపోతుందా? ఇదంతా ఓ పెద్ద కల మాత్రమేనా? "జమీందారు రోల్సుకారు, మహారాజు మనీపర్సు, పాలికాపు నుదుటి చెమట" అంతా మాయే అంటే ఎలా నమ్మడం? నిజం చెప్పాలంటే - ఈ పుస్తకంలో మాయకు సంబంధించిన చర్చను చదువుతూ ఉంటే ఇనుప గుగ్గిళ్ళను నములుతున్నట్లనిపించింది నాకు. 'ఉన్నది చూస్తున్నామా? చూస్తున్నాము కాబట్టి ఉన్నదనుకుంటున్నామా?' అన్న సమస్య తత్త్వశాస్త్రంలో చాలా మౌలికమైనదంటారు కానీ నాకందులో అంతుబట్టనిదేమున్నదో అర్థం కాదు. "స్వప్నావస్థకీ, జాగ్రదవస్థకీ అట్టే తేడా లేదు", "నేను (అహం) లేనప్పుడు లోకమే లేదు" అని పదే పదే రమణ మహర్షి చెబుతూ ఉంటే "ఎందుకింత మొండి, ఈయనకి?" అనుకునే వాణ్ణి. మాయ గురించి ఈయన ఇంతగా నొక్కి వక్కాణించడానికి మూడు కారణాలున్నాయి అంటారు శౌరి. వాటిల్లో చాలా ముఖ్యమయింది ఆయనకి లభించిన ఆధ్యాత్మికానుభవం. అత్యున్నతమైన ఆధ్యాత్మికానుభవాన్ని పొందిన రమణ మహర్షి వంటివారు మాట్లాడే అంతరువు ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటుందని, ఆ స్థాయి నుంచి చూసే వారికి మన జీవితాలూ, సుఖ దుఃఖాలూ అల్పస్థాయికి చెందినవిగా అనిపిస్తాయని, దాదాపుగా అవాస్తవమైనవిగా, భ్రమాజనితమైనవిగా తోస్తాయని అంటారు శౌరి. *** దేవుడూ, కర్మా, మాయా - ఈ తరతరాల కంటితుడుపు, సర్దుబాటు మాటలను దాటి ఆలోచించే ఓ సుదీర్ఘ "నాస్తిక ప్రకరణం" తరువాత రచయిత ఆలోచనా జగన్నాథ రథచక్రాలు ఆచరణా భూమార్గం పడతాయి. “దుఃఖం ఎందుకు?” అంటే It just happens అంతే! ఈ జన్మలో మనం చేసుకున్న కర్మ కానప్పుడు దుఃఖానికి కారణాలు రెండే - those two demons - time and chance. దుఃఖాన్ని అనుభవించేవాడికి మత గ్రంథాల్లో, గురువుల ప్రవచనాల్లో ఉపశమనం లభించదు. లభించినా అది తాత్కాలికమే. తీసేయలేనంత దుఃఖమే సంభవిస్తే దాన్ని భరించాల్సిందే. దాన్ని తొలగించుకునే మార్గాలను వెదకాల్సిందే. As often suffering can be put to work అని చెబుతారు. ఆ సాధనలో తను నేర్చుకున్న పాఠాలను బోధిస్తారు. ఈ పుస్తకంలో ఎంతో విలువైన భాగం ఇదే. "మనకెదురైన ప్రతి సందర్భంలో ఏం చెయ్యాలో, ఎలా స్పందించాలో నిర్ణయించుకోగల అవకాశమూ, బాధ్యతా మనకుంటాయి. అన్నీ అమరినప్పుడే కాదు, ఏదీ అనుకూలించనప్పుడు కూడా మనకున్న ఈ అపరిహార్యమైన, అంతిమమైన స్వేచ్ఛను జారవిడుచుకోకూడదు. అత్యంత నిస్సహాయతలో ఉన్నవాడికి సైతం ఛాయిస్ ఉంటుంది - విహ్వలంగా విలపిస్తాడో, ధీరత్వంతో పరిస్థితులను ఎదుర్కొంటాడో తేల్చుకోవాల్సి ఉంటుంది. ”, నాజీ నిర్బంధ శిబిరాల్లోంచి నేర్చుకొచ్చిన పాఠం అది. "నిజంగా నీకోసమే స్వార్థంగా జీవించాలనుకుంటున్నావా? అయితే ఎవరికైనా సహాయం చెయ్యి" అన్నారట దలై లామా. ఆ మాటకి అరుణ్ శౌరి సవరణ: "నిజంగా నీకోసమే స్వార్థంగా జీవించాలనుకుంటే నీకు ప్రత్యుపకారం చేయలేని వాడికి సహాయం చెయ్యి. ". అందుకు పొడిగింపు మదర్ థెరెసా మాటల్లో - "Help until it hurts. " సాధన కొద్దీ పరిణతి అనే మాట ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్నవారికే కాదు, సేవా వ్రతంలో ఉన్నవారికి కూడా - ఇంకా చెప్పుకోవాలంటే - అన్ని రంగాలలో మన చేయగలిగే కృషికి - వర్తిస్తుంది. మన ప్రవృత్తిలో మన లక్ష్యానికి సహాయపడగలిగేదేమిటి? అడ్డుపడేదేమిటి? లక్ష్య సాధనకు మనం చేసే ప్రయత్నం మన ప్రవృత్తి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? లక్ష్య సాధనా మహత్కార్యంలో పడిపోయాక మనం పక్కవాడితో ఎలా ప్రవర్తిస్తున్నాం?. . . చెప్పినట్లు "రజతకారుడు వెండిలోనుంచి మలినాలను తొలగించినట్లు, - ఒకదాని తరువాత మరొకటి, కొంత శుభ్రపరిచాక [తృప్తికీ నిరాశకూ లోనవకుండా] ఇంకా కొంచెం, [ఒక్కసారితో వదిలేయకుండా] మళ్ళీ మళ్ళీ. . . " మనలోని దోషాలను తొలగించుకుంటూ ఉండడమే కర్తవ్యం - దుఃఖంతో నిత్య సహవాసం చేసే వారికైనా, దానికి దూరంగా ఉన్న అదృష్టవంతులకైనా. ఇంతా రాసాక, “In the foregoing, I have listed a few lessons that ring true to me in the light of my own experience. . . ?tag=biography no reader will think that i have learnt the lessons fully, and i hope that no reader will think that i think that i have learnt even a fraction of them. " అని వినయంగా ముగిస్తారు. పుస్తకం అంతటితో ముగియదు. గుండెలు బరువెక్కించే ఓ రెండున్నర పేజీల ఉపసంహారం మిగిలే ఉంది. విధితో శౌరి కుటుంబపు పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. *** కొసరు వివరాలు: 1) హార్పర్ కొలిన్స్ ప్రచురణ; 432 పేజీలున్న ఈ పుస్తకం (పేపర్బాక్) ధర 399 రూపాయలు. ఇంగ్లీష్ పుస్తకాలమ్మే అన్ని పెద్ద దుకాణాల్లో కొనుక్కోవచ్చును.
2) (295 రూపాయలే); 3) ; 4) 5) Flipkart Link .