Latest news for ?cat=374
రాసి పంపిన వారు: మాలతి నిడదవోలు (thulika. net)
1. మాతాతయ్య చలం (వ్యాసం), 2. చేతకాని నటి (కవితలు)
50, 60 దశకాల్లో ప్రసిద్ధులయిన రచయిత్రులలో తురగా జానకీరాణి ఒకరు. తిరుగుబాటు రచయితగా పేరొందిన గుడిపాటి వెంకటచలం చెల్లెలి మనుమరాలు. ప్రముఖజర్నలిస్టు తురగా కృష్ణమోహనరావు గారి ఇల్లాలు. పైరెండు పుస్తకాలూ నేను ఒకేవ్యాసంలో పరిచయం చెయ్యడానికి కారణం వుంది.
జానకీరాణిని నేను 2002లో కలుసుకున్నాను. ఇంటర్వూకోసం మా అన్నయ్యతో వారింటికి వెళ్లేను. నేను వెళ్లేవేళకి ఆవిడ ఇంట్లో లేరు. మరోపావుగంటకి కాబోలు హడావుడి పడుతూ వచ్చేరు. అత్యవసరపనిమీద బయటికి వెళ్లవలసివచ్చిందని చెప్పి కబుర్లకి సిద్ధం అయేరు.
అదే తొలిసారి నేను ఆమెని చూడడం. భారీమనిషి కాదు కానీ కళగల ముఖం, కంచుకంఠం. నేను చాలా ఇంటర్వూలే చేసేను కానీ అంత స్పష్టంగా, అంత ధృఢమైన నమ్మికతో తన అభిప్రాయాలు వ్యక్తం చేసినవారు చాలా తక్కువ. నాకు చాలా తృప్తినిచ్చిన బహుకొద్ది ఇంటర్వూలలో అది ఒకటి. అక్కడ వున్నది నేనూ, మా అన్నయ్యా - ఇద్దరమే అయినా, ఆలిండియా రేడియోలో మాట్లాడుతున్నంత ఉద్వేగంతో ఆమె చెప్తూంటే నేను టేపు రికార్ఢరు ఆన్ చేసి, ఆశ్చర్యంగా ఆమెవేపు చూస్తూ కూర్చున్నాను. ఆమె అభిప్రాయాలన్నిటితోనూ నేను ఏకీభవించలేను కానీ ఆమె వెల్లడి చేసిన తీరు మాత్రం తప్పకుండా గౌరవిస్తాను. ?cat=374 నా ఇంటర్వూ అనువాదం తూలిక. నెట్లో చూడవచ్చు.
"మాతాతయ్య చలం”లో జానకీరాణి తనకి ఆయనతో ఏర్పడిన అనుబంధం ఎంత విలక్షణమయినదో స్పష్టం చేశారు. ఇది గమనార్హం. ఎందుకంటే ఆరోజుల్లో చలం గడించిన దుష్కీర్తి మూలంగా ఆయనంటే వారి కుటుంబంలో చాలామందికి పడదు. సాంప్రదాయవాదులమీద తిరుగుబాటు ప్రకటించిన చలం ఒకపక్కా, పరమ ఛాందసుడయిన మరో తాతయ్య (మాతామహుడు, చలం బావమరిది, దుల్ల పట్టాభిరామయ్య) మరో పక్కా జానకీరాణికి మనసంస్కృతిలోని పరస్పర ?cat=374 వ్యతిరేకాలయిన సిద్ధాంతాలని అర్థం చేసుకోడానికి తోడ్పడ్డారు. ఆవిధంగా ఆమెకి రెండు సాంప్రదాయాలు తూచి చూసుకోడానికీ, తన వ్యక్తిత్వం రూపొందించుకోడానికీ అవకాశం దొరికింది. ఆ సిద్ధాంతాలపరవడిలో పడి కొట్టుకుపోకుండా, నిలదొక్కుకుని తనకి ప్రత్యేకమయిన వ్యక్తిత్వాన్ని సంతరించుకుని రచయిత్రిగా రాణించిన తెలుగుమహిళ జానకీరాణి.
ఈ పుస్తకంలో తనకి చలం స్వదస్తూరీతో రాసిన వుత్తరాలూ, ఆయనకి ఆమెయందు గల అభిమానంతో పాటు, ఆయనధోరణినీ, వాదాలనీ తాను తీవ్రంగా ప్రశ్నించిన సన్నివేశాలు కూడా పొందుపరిచారు. జానకీరాణి ఈపుస్తకం రాయడానికి ముఖ్యకారణం పాఠకులకీ, చలం అభిమానులకీ, ఆయన్ని గర్హించేవారికీ కూడా తన సందేశం అందించడం అంటున్నారామె. ఆమె సందేశం - చలాన్ని అర్థం చేసుకోవాలంటే, ఆయన్నీ, ఆయన బోధలనీ నెత్తిన పెట్టుకోడమే కాదు, ఆయనలో ఏవి లోపాలు అనుకుంటున్నారో వాటిని కూడా సూక్ష్మదృష్టితో పరిశీలించి వాటినేపథ్యాన్ని కూడా గమనికలోకి తీసుకున్నప్పుడే ఆయనని సంపూర్ణంగా అర్థం చేసుకోడం సాధ్యం అంటారు.
ఒకప్పుడు తిరుగుబాటు ప్రదర్శించిన చలం చివరిరోజుల్లో ఈశ్వరసేవలో మునిగిపోవడం. తన భార్యా, పిల్లలజీవితాలు అస్తవ్యస్తమవడంలో ఆయన పాత్ర - ఇవి చలాన్ని విమర్శించేవారు పదే పదే ఎత్తిచూపుతారు. జానకీరాణి ఈవిషయాన్ని సంపూర్ణచిత్రంలో ఒక భాగంగా అంగీకరించమంటారు.
ఈపుస్తకం చదివితరవాత నాకు కలిగిన అభిప్రాయం బహుశా జానకీరాణి ఆమోదించకపోవచ్చు. నామటుకు నాకు ఆమె “తాతయ్య అందరిలాగే మొత్తం మానవాళిలో ఒక మానవుడు” అంటున్నట్టు అనిపిస్తోంది. విస్తృతపరిధిలో ఆలోచిస్తే మానవజీవితం శైశవం, బాల్యం, కౌమార్యం, యౌవనం, వార్థక్యం - ఇలా ఒక క్రమంలో సాగిపోతుంది కదా. పుట్టడంనించీ గిట్టేవరకూ ప్రయాణం ఇది. ఇందులో అమాయకత్వం, కౌతుకం, ప్రయోగం, అనుభవం, అనుభూతి, చివరికి నిర్మోహంతో కూడిన ముగింపు - ఇవన్నీ ప్రతిఒక్కరిజీవితంలోనూ ఆవిష్కృతమయే స్థాయీబేధాలు. అందుకే చలాన్ని “అప్పుడలా ఎందుకు రాసేవు?” అని అడిగితే, “అప్పుడలా అనిపించింది. ” అంటారాయన. “ఇప్పుడీ వైరాగ్యం ఏమిటి?” అంటే “ఇప్పుడు ఇలా అనిపిస్తోంది” అంటారు ఆయనే. ఇది జీవనసత్యం.
రచయిత్రి చివరలో “ఎందుకింత దీర్ఘంగా రాస్తున్నానంటే చలం పేరు మీద, కలుసుకుంటూ, పిచిక, నెమలి . . చలం చూట్టూ వున్న పరిసరాలు, వాటిలో నవ్యత . . . పదే పదే చెప్పుకొంటున్న భక్తులందరూ, మరో మాటలో ఉన్మాదులందరూ - గుర్తించవలసినది ఒకటుంది. ఆ రొమాన్సును మించి, ఆయన తత్త్వం, సిద్ధాంతం, భోధన, జీవనశైలీ వున్నాయి” అంటూ వాటిని గుర్తించి, వాటిని తమకి అన్వయించుకునేముందు ఆత్మవివేచన చేసుకోవాలి అంటారు ఆమె.
తాతయ్యని తాను అర్థం చేసుకున్నానని ప్రగాఢంగా నమ్మిన ఈ రచయిత్రి చివరలో “ఆయన ప్రేమని కిందు చేసి, నానామాటలూ అంటున్నందుకు” క్షమించమనడంలో ఔచిత్యం వుందా అని ప్రశ్నించుకుని, నాకు నేను చెప్పుకున్న సమాధానం - అది మనరక్తంలో జీర్ణించుకుపోయిన సాంప్రదాయపు ఛాయ అని. వినయం ఒక వైయక్తిక విలువ. “అప్పుడలా అనిపించింది” “ఇప్పుడు ఇలా అనిపిస్తోంది” అన్న చలం మాటలే ఆమె తనకి తాను అన్వయించుకుని వుంటే, ఆనాడు తాను ఆప్రశ్నలు వేయబట్టే, ఆజవాబులు రాబట్టగలిగారు అని అనుకోడానికి వీలుంది కదా. ఆ జవాబులు పొందబట్టే ఇప్పుడు ఈ సదసద్వివేచనకి నాంది పలికింది అని కూడా తోస్తోంది నాకు. ఇప్పుడు చలం వుండి వుంటే, “క్షమించు తాతయ్యా” అని ఈ మనుమరాలు అని వుంటే, ఆయన జవాబు ఏమిటి అయివుండేది? ఇలాటి చర్చ కేవలం తిలకాష్ఠబంధనమేమో!
తురగా కృష్ణమోహనరావుతో జానకీరాణి వివాహానికి పెద్దలు అభ్యంతరం చెప్పినా పెళ్లి జరిగింది, చలం ప్రోత్సాహించారు. 16 సంవత్సరాల సాంసారికజీవనం ఆకస్మికంగా ఘోరమైన రైలుప్రమాదంతో తల్లకిందులపోయింది. అప్పటికి అమ్మాయిలిద్దరు చిన్నవాళ్లు. వాళ్లకి ఎలా చెప్పడం “అమ్మా, నాన్న ఎప్పుడు వస్తారు?” అంటే? ఎవరినయినా పట్టి కుదిపివేయగల ఈ దుర్భరవేదనని అక్షరగతం చేసారు జానకీరాణి “చేతకాని నటి” అన్న కవితాసంపుటిలో.
ఈశీర్షికలో “చేతకాని” అన్నది కేవలం దుఃఖాతిశయంతో అన్నదే కానీ జానకీరాణి “చేతకాని” వ్యక్తి కారు. నాలుగు నిముషాలపాటు రంగస్థలంమీద ఏవో భావాలు నటించేసి తనపని అయిపోయిందనుకునే “నటి” అసలే కారు. క్షణాలమీద ఒక రైలుప్రమాదం కారణంగా తారుమారయిన తనజీవితాన్ని అందిపుచ్చుకుని, తనవ్యధని తనలోనే దాచుకుని ?cat=374, ఇద్దరు పసివాళ్ల ఆలనా పాలనా చూసుకుంటూ, సాహిత్యసేవ కొనసాగిస్తున్న సిసలు తెలుగునారి ఆమె. ఆమెని వక్తగా పిలిస్తే హాలు కిటకిటలాడిపోతుందిట శ్రోతలతో.
“నాన్న వచ్చాక కంచం పెట్టాలా?” అని అడిగిన చిన్నారిప్రశ్నతో
“గిర్రున కడుపులో చిచ్చు సుడులై తిరిగి కన్నీరు
చూపు దానిని మూయగా, లెక్క తెలియక
ఒకటి తక్కువగా అన్ని కంచాలు పెట్టేశాను”
అన్నప్పటి వ్యథ,
నువ్విక్కడికి ఎప్పుడొస్తావు?” అంటూ వుత్తరం వచ్చిందిట. దానికి సుదీర్ఘమయిన జవాబు
“వస్తాను . . కానీ త్వరగా వద్దామంటే కుదరడం లేదు” అంటారు. కారణం “ఎన్నో పనులు”, “జంట కలువలు రెండు కంటికగుపించాయి”. “ఇవి ముద్దుగా, ఏపుగా ఎదిగేదెప్పుడో”, . . . అంతవరకూ వేచివుండాలి. ఇవీ మనకి నిత్యం ఎదురయ్యే కటికసత్యాలు.
“ఈ స్టేషనులో నేనెంత పెద్ద జబ్బు [?cat=374] పడ్డానో చూశారా?”
చూడ్డానికి వీలేదీ? దొరకని రైలెక్కి మీరు
వెళ్లిపోయారుగా?”
అంటూ వేదన పడి, పడి, ఆకాశవాణిమీద తన కసి వెళ్లబోసుకుంటారు. ఆకాశవాణిలో చాలాకాలం ఉద్యోగి అయిన ఈ రచయిత్రికి ఆ సంస్థ నిర్వహించే కార్యక్రమాల్లో ఒకరకమయిన కృతకధోరణి కూడా స్ఫురించడంలో ఆశ్చర్యంలేదు. అందుకే దాన్ని రాకాసివాణి అంటారు.
“నాది పాతకలమే కదా అని”, “కాఫీ కొంచెమే వుందండీ”, “నిన్ననే పౌర్ణమి వెళ్లిందని మరిచి” వంటి అర్థవంతమయిన శీర్షికలతో 18 కవితలూ చిన్నవే అయినా చెప్పలేనంత బరువుని నింపుకున్న వేదనాశకలాలు వున్నాయి ఈ చిన్నిపుస్తకంలో. ప్రతి కవితకీ అనుబంధంగా జతపరిచిన చిత్రం (family albumనించి) ఆ కవితలో భావుకతని ఘనతరం చేసి, పాఠకుల మనసులమీద బలమైన ముద్ర వేస్తుంది.
నటి అన్నపదం ఆమె బహుశా భరతనాట్యం నేర్చిననాటి స్ఫూర్తి కావచ్చు. “జీవితం నాటకం, మనమందరం నటీనటులం” అన్న విస్తృతార్థంలో కావచ్చు. ఈరెండో అర్థంలో ఆలోచిస్తే, సాధారణంగా ప్రతిభాశాలి అయిన నటుడు తాను తనపాత్ర ఎంతో సమర్థవంతంగా నిర్వహించినతరవాత కూడా, ఇంకా బాగా చెయ్యగలనేమో అనుకుంటూ రవంత చింతించక మానడు. రచయిత్రి ఈ పుస్తకంలో అదేవిధమయిన సందేహమో, అనుభూతో వ్యక్తం చేస్తున్నారేమో అనిపించింది నాకు.
ఇప్పుడు చెప్తాను రెండు పుస్తకాలు ఒకే వ్యాసంలో పొదగడానికి కారణం. మొదటిపుస్తకం చదివిన తరవాత, నాకు చలంగురించి కంటే జానకీరాణిగురించే ఎక్కువ తెలిసింది. ఎవరీవిడ?, ఈమె విద్యావ్యాసంగం ఎటువంటిది? తనకుటుంబంవారిలో ఎవరితో ఎటివంటి సాన్నిహిత్యం వుంది? ఆమెలోని ఏ ఆలోచనాధోరణికి ఎవరు కారకులు? - ఇలాటి విషయాలు ఎన్నో తెలుస్తాయి మనకి “మాతాతయ్య చలం” చదివితే.
రెండో పుస్తకం, “చేతకాని నటి”లో ఆమెకి భర్త, ఆప్తమిత్రుడు అయిన కృష్ణమోహనరావుతో గల సాన్నిహిత్యం, మానసికంగా ఆమె ఎదుగుదల, బలమైన వ్యక్తిత్వం దృగ్గోచరమవుతాయి. పదహారు సంవత్సరాలపాటు ఎంత చక్కని బాంధవ్యం వారిద్దరూ కలసి సంతరించుకున్నారో తెలుస్తుంది. జానకీరాణివ్యక్తిత్వం రూపు కట్టడానికీ, అందుకు కారకులయిన వ్యక్తులకీ ఈ రెండు పుస్తకాలూ అద్భుతమయిన అద్దం పడుతాయి.
ఆరున్నరేళ్లక్రితం ఆమె నాకు ఈరెండు పుస్తకాలూ ఇచ్చేరు ఆప్యాయంగా. వాటినిగురించి రాసే అవకాశం నాకు ఇప్పుడొచ్చింది. ఇప్పటికయినా రాయగలిగేనని తృప్తి నాకు.
పుస్తకాల వివరాలు.
1. మా తాతయ్య చలం
67 పేజీలు. 50 రూపాయలు.
ప్రచురణః 2002
2. చేతకాని నటి
43 పేజీలు. 40 రూపాయలు.
ప్రచురణః 2002
ప్రత్యూష ప్రచురణలు
29 జర్నలిస్ట్స్ కాలనీ, రోడ్ నెంబర్ 3
బంజారా హిల్స్, హైదరాబాదు 500 034
ఫోన్. 335 1153. సెల్. 98851 51153
(పుస్తకం. నెట్లో చూశాం అని చెప్పడం మర్చిపోకండి. ఇది స్వంతంగా ప్రచురించుకున్నవారికి ఆనందదాయకం. మనం వారికి చెయ్యగల చిన్ని సేవ లేదా ప్రోత్సాహం అనుకోండి. )
