ఒక ఉద్విగ్న ప్రేమగీతం – తేరా నామ్ ఏక్ సహారా?!

పాకీజా వంటి చిత్రం చూశాకో,  దిల్ హూం హూం కరే అని భూపేన్ హజారికా పాడుతుంటే విన్నాకో, కృష్ణశాస్త్రి కవిత చదివాకో ఒక్కసారి గట్టిగా నిట్టూర్పు వదలా లనిపిస్తుంది. అస్పష్టమైన బాధ సుళ్ళు తిరుగుతుంటుంది. గుండె కొద్దిగా బరువైనట్లు ఉంటుంది. అయ్యో అని అనాలనిపిస్తుంది. భుజం తట్టో, కావలించుకొనో, కన్నీళ్ళు తుడిచో ఓదార్చాలనిపిస్తుంది. తేరా నామ్ ఏక్ సహారా?!లో ఆఖరు వాక్యం చదివాక కూడా అలానే అనిపించింది.

తేరా నామ్ ఏక్ సహారా?! ఒక ప్రేమకథ. భావుకుడూ, సౌందర్యారాధకుడూ, మొండివాడూ ఐన యువకుడు.  భక్తిసాగరంలో పూర్తిగా  మునిగిపోయి ఆనందంగా ఈదులాడుతూ, హఠాత్తుగా వచ్చిన ప్రేమకెరటాలలో ఊయలలూగటం మొదలు బెట్టిన యువతి. ఆమె గానం, సౌందర్యం అతన్ని మంత్రముగ్ధుణ్ణి చేశాయి. అతని ఆరాధన, ఆరాటం ఆమెను నిలువెల్లా ముంచెత్తాయి. ఐతే ఈ ప్రేమకథను భగ్న ప్రేమ కథను చేసింది విధి కాదు; ఆమె ఆరాధించిన దైవం.  అదీ ఈ కథలో మెలిక. ఇప్పటికే కాదు, ఎప్పటికీ వీరి ప్రేమ ఫలించదంటూ శాసించాడు ఆమె నమ్మిన దైవం. ఆమె దేవుడు అంత కర్కశంగా, నిరంకుశంగా ఎప్పటికీ విడదీస్తుంటే ఆ లేతగుండెలను తలచుకుంటే జాలి వెయ్యదూ!

మామూలు ప్రేమ కథ గురించి ఏమిటి ఇంత గొడవ అంటారా? ఇది భావకవుల నాటి ప్రేమ. అమలిన శృంగారం, ఆరాధన, అశృకణాలు లాంటి భావకవిత్వపు ప్రేమ లక్షణాలు చాలా ఉన్నాయి ఈ కథలో (వెక్కిరించటానికి అంటున్న మాటలు కాదు). దూరంగా ఉన్న దేవతను ఆరాధిస్తూ ఆమెలో ఐక్యమైపోవాలని ఆరాటపడుతూ ఒకరినొకరు దూరాన్నుంచి చూసుకొంటూ గాఢంగా నిశ్వస్తిస్తూ కంటి తడీ, గద్గదపు గొంతులతో తపించే ప్రేమ. నాయిక, నాయకుడూ కలిసి మాట్లాడుకునేది తక్కువ. ఒకరినొకరు తాకిందీ లేదు. ఇంత గాఢంగా ఇంకెవరూ ప్రేమించలేదనీ, ఇంత తీవ్రంగా ఎవరూ బాధపడలేదనీ అంటాడు రచయిత. ఆ మాట నమ్మాలని మనకూ అనిపిస్తుంది.

ఈ పుస్తకంలో కథ ఏమిటో మూడు రోజుల క్రితం అజయ్‌ప్రసాద్ గారు చెప్పేశారు. అందుకని ఆ వివరాలలోకి మళ్ళీ వెళ్ళటం లేదు. కథతోపాటు కూడా నన్ను ఆకట్టుకుంది  కథకుడు తన పదాలతో వాక్యాలతో కళ్ళముందు గీసిన అద్భుత చిత్రం. ఆ వచనం చదువుతుంటే నా చెవులకు తానే పాటై పాడుతున్న కథానాయిక గానం వినిపించింది. ఆపాటలో తదేకమై తన అలజడిని సైతం మర్చిన కథానాయకుడు కనిపించాడు. శృంగార నాయిక నాగనందిని కళ్ళ ముందు కదలాడింది. విరహపు బాధ, వియోగపు విషాదమూ అనుభవానికి వచ్చాయి.

ఇది కవిత్వం కాదు, వచనమే అంటున్నాడు రచయిత. కవిత్వం అంటే ఏమిటో స్పష్టంగా తెలీని నాకు మాత్రం వచనం కన్నా కవిత్వమే ఎక్కువగా కనిపించింది. కొన్ని వాక్యాలు ఠక్కున నిలపెట్టి మళ్ళీ చదవమంటాయి. కొన్ని వ్యక్తీకరణలు వింతగా అబ్బురపరుస్తాయి. మరికొన్ని, వార్నీ, భలే అన్నాడే అనిపిస్తాయి.  ముఖ్యకథకు సంబంధం అంతగా లేని పక్కప్రయాణాలు చాలానే ఉన్నా, వాటిలో కొన్ని (అన్నీ కాదు) వాతావరణాన్ని గాఢంగా కల్పించటానికి ఉపయోగపడతాయి.

కథనంలో పరికల్పనా పైత్యం, సిమిలీల స్వైరత  ఎక్కువైపోయాయన్నట్లుగా రచయిత తన మాటలో ధ్వనించాడు.  కొన్నిచోట్ల ఆ మాట నిజమే ఐనా, మరికొన్నిచోట్ల ఆ పరికల్పన, ఆ సిమిలీలు భలే నచ్చాయి. మచ్చుకి కొన్ని.

 

“కచేరీకి ముందు గాయకుడు గొంతు సవరించుకోవడంలో  గుర్తింపుకి నోచని ఏదో తియ్యదనం ఉన్నట్టనిపిస్తుంది. గుడ్దు పగిలి, మొలిచీ మొలవని చిట్టిరెక్కలు విప్పుతూ గువ్వపిట్టలు చేసే కువకువలు విన్నట్టుంటుంది. విరామ నిశ్శబ్దపు తెరల జారుముడిని సుతారంగా లాగినప్పుడు  చిరుగంటలు మంద్రంగా మేలుకున్నట్టుంటుంది. తీగల్లోకి ఒత్తిగిలిన వాయిద్యాలు ఒక్కక్కొటే లేచి ఒళ్ళు విరవడం, స్పర్శకి దాసోహమైన పూర్వజన్మల స్ఫురణతో చర్మవాద్యాలు అసంబద్ధ శృతిలో గమకడం… ఏ కచేరీ  సన్నాహాల్లోనైనా ఉపేక్షకి వీల్లేని మాధుర్యం.”

“ఆవరించిన నిశ్శబ్దం  నిట్టనిలువున చీలి నడిరాతిరి యమునలా దారిస్తుంటే…”

“తలవని తలంపుగా జొరబడ్డ మునిమాపు కలల్ని కైమోడ్చి, వయసు రేపిన రేపటి ఆశల్ని జీవితమంత నివేదన చేసి దోసిలొగ్గినందువల్లనేమో ఆమె గొంతు లేత కొమ్మై అనుకంపిస్తోంది.

దూరంగా ఉండటం వల్లే కాదు, దఫాలవారీగా కమ్ముకుంటున్న నీటి పొరల కారణంగా కూడా ఆమె ఒక రూపంగా కాకుండా, సుడికేంద్రంలో గూడు కట్టిన నురగలా కంపిస్తోంది నాకు.”

ఆయన్ని వెక్కిరిస్తుండగా హఠాత్తుగా ప్రత్యక్షమైన సత్యసాయిబాబా ఎట్నుంచి ఊడిపడ్డారో, “ కొట్టుకునేంత వరకూ కనిపించని ఎదుర్రాయిలా”

తన ఎగతాళి మాటలు బహుశా విన్నప్పటికీ, “పండు వెన్నెలే కాదు, చురచురలాడే ఎండ పడ్డా ఏటికిరణాలు మెరిసినట్టు బాబా చిర్నవ్వు”.

“…బొంగరం పొడిచిన నేల చొట్టలా ఉన్న బొడ్డు…”

“తుంచితే ఎక్కడ నొచ్చుకుంటుందో అన్నట్లు అత్యంత సుకుమారంగా ఉండాల్సిన ఇడ్లీ…”

“…ముందర కాళ్ళకి బంధాలేసే లేసులున్న బూట్లు…”

“అందని దానికి అత్యాశతో ఎగబడిబోతున్న సాయంనీడ పట్టుదప్పి పట్టాల కడ్డంగా బోర్లాపడిపోతుంది.”

“తాడు విప్పిన లేగదూడలా గచ్చకాయరంగు పరికిణీతో గెంతుతో వచ్చిన భారతి… బుజ్జాయిమెడలో చిరుగంటల సవ్వడి నవ్వులతో” మాట్లాడిందట.

“నురగల చొంగతో వగరుస్తూ దౌడు తీస్తున్న గుర్రంలా కాలం కూడా సువాసన, దుర్వాసన కాని ఏదో వెగటైన మదం వాసన కొడుతుంది”

ఒకే సన్నివేశం; రెండు చిత్రణలు:

“వెండిపోగుల పల్చని నీరెండ… ఒద్దికగా వీస్తున్న చల్లని గాలి… నిండైన నమ్మకంలా బాహువుల్తో విస్తరించిన మహావృక్షం… ఆశీర్వచనాల మెత్తని నీడ… తన్మయంలో తలలూపే కొమ్మల్లోంచి ఆమోదంగా రాల్తున్న పూలు…”

“సూది మొనల నీరెండ… నక్కి నక్కి వీస్తున్న నంగిరి గాలి…విస్తరించిన అసహనమై వేయిచేతుల్తో లంఘిస్తున్న మాను… అనుమానంగా కదలాడే నీడ… అసహనంగా ఊగే కొమ్మల్లోంచి పట్టుతప్పి పడుతున్న పూలు…”

ఏది నిజం? రెండూ నిజమేనా? ఏదీ కాదా?
ఈ ద్వైధీభావం, ఈ సంఘర్షణ కథ అంతా విస్తరించుకొని ఉంటాయి. పుస్తకం పేరు చివర ఉన్న విరామచిహ్నాలు కూడా ఈ ద్వైధీభావాన్నే సూచిస్తాయి. విస్తృతమైన తాత్విక చర్చలకు కావలసినన్ని విషయాలు, ప్రశ్నలు ఉన్నాయి ఈ పుస్తకంలో. నమ్మకం, అపనమ్మకం, అస్తిత్వం, ఆస్తికత్వం, నాస్తికత్వం, భక్తి, ప్రేమ, ఆరాధన, అర్పణ వంటి అనేక విషయాలను కథకుడి అనుభవాల అద్దాల్లోంచీ, బయటనుంచీ చూసి తర్కించుకోవచ్చు.

ఈ కథకుడు నరేష్ నున్నా కవిగా ప్రసిద్ధుడే అయినా, ఈ మధ్య బ్లాగ్లోకంలోకి వచ్చే వరకూ నాకంతగా పరిచయం లేదు, అప్పుడప్పుడూ ది సండే ఇండియన్‌లో వ్యాసాలు చదవడం తప్పించి. అడపాదడపా బ్లాగుల్లో ఆయన రాతలు చదువుతుంటే ఒకోసారి విపరీతమైన భావుకత్వం, ఇంకోసారి తీవ్రమైన అసహనం, అప్పుడప్పుడూ పెడసరితనం కనిపించాయి నాకు ఆ రాతల్లో. ఈ మనిషి ఉద్వేగాలు, ఇష్టాయిష్టాలు తీవ్రమైనవే అని అనిపించింది. ఆ భావుకత్వం, అసహనం, పెడసరితనం, వీటన్నిటి మధ్యా తనను తాను ప్రశ్నించుకొనే నిజాయితీ, దానివల్ల కలిగే కలవరమూ, ఆందోళనా ఈ కథలో ప్రతిఫలిస్తాయి. ఆ ఉద్వేగాల తీవ్రత కథానాయకుడితో పాటు మనల్ని కూడా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

ఐతే ఈ పుస్తకంలో అప్పుడప్పుడూ రచయిత అనవసరంగా అడ్డం వచ్చి ఇబ్బంది పెట్టటం మాత్రం నిజం. ఉదాహరణకు: పైన ఒకే సన్నివేశాన్ని రెండురకాలుగా చిత్రించటం గురించి చెప్పాను కదా. మొదటి వర్ణన తర్వాత ఒక పేరాగ్రాఫ్ పొడుగు చర్చ ఉంటుంది. రెండవసారి అదే సన్నివేశాన్ని ఎలాగూ చిత్రించుతున్నప్పుడు ఈ పేరాగ్రాఫు అవసరం నాకు కనిపించలేదు. పాఠకుల్ని తక్కువగా అంచనా వేయటంవల్ల ఇలా రాసేడేమో అనుకున్నాను.  అదృష్టమేమిటంటే అలా నన్ను బాధించిన సందర్భాలు తక్కువే.

ఇది తనకథేనని రచయిత చెప్పారు. అంతలోనే దీనిలో కల్పనా వాస్తవం పాలూనీళ్ళలా కలసిపోయాయని కూడా అన్నారు. నిజానికి ఇదంతా వాస్తవమా, కల్పనా, లేక ఇందులో ఏది వాస్తవం, ఏది కల్పన అన్న విచికిత్స అంతగా అవసరం కాదేమోననిపిస్తుంది. సాహిత్యమంతా రచయితల స్వీయచరిత్రలతోనే ముడివడి ఉంది అన్న తీవ్రమైన తీర్మానాలు నేను ఒప్పుకోను కానీ, ఒకసారి పాఠకులకు అందించిన కథ దానిదైన వాస్తవికతను ఎలాగూ సంతరించుకుంటుంది. భారతి అన్న వ్యక్తి నిజంగా ఉన్నా, కల్పనే ఐనా పాఠకుడికి తేడా పెద్దగా ఉండదు, కొద్దిగా పేరున్నవాళ్ళ (లేక తెలిసినవాళ్ళ) లోరహస్యాల్లోకి తొంగిచూసిన వ్యర్థతృప్తి తప్పించి.

కథ తర్వాత, Much Ado About Nothing అంటూ రచయిత ఏడు పేజీల్లో ఈ కథ గురించి తన ఆలోచనలు పంచుకుంటారు. కథలోని ద్వైధీభావం ఇక్కడా ప్రతిఫలిస్తుంది. దీన్ని గురించి ఎక్కువగా మాట్లాడను కానీ, ఆఖరుపేరాలో రచయిత తన కుటుంబపు విషయాలు మనకు చెప్పినప్పుడు మాత్రం, “భయ్యా, ఆల్ ఈజ్వెల్” అని ఆనందపడ బుద్ధయ్యింది. కథలకైతే మొదలూ, ముగింపూ చెప్పచ్చు; మంచో చెడో జరిగిందని తేల్చచ్చు.  కానీ, జీవితంలొ ఏది మంచో, ఏది చెడో ఎప్పుడు తెలుస్తుంది?

ఈ పుస్తకంలో వచనానికి, కథనానికీ దీటైన వాతావరణాన్ని కల్పిస్తూ, చక్కటి బొమ్మలతో ప్రతిపేజీని అలంకరించారు చిత్రకారుడు మోహన్. నలుపు తెలుపులలో – ఇండియా ఇంక్, పెన్సిల్ లేక చార్‌కోల్  వాడుతూ – రకరకాల రేఖా చిత్రాలతో పుస్తకం స్థాయిని పెంచారు మోహన్. ఇంత లలితంగా, ఇంత ఉధృతంగా ఈ బాణీలో మోహన్ బొమ్మల్ని ఏ పుస్తకంలోనూ చూసిన గుర్తు లేదు. ఇడ్లీ కన్నా పచ్చడి బాగుంది అనను కానీ, రెండిటినీ విడివిడిగానూ, కలివిడిగానూ ఆస్వాదించవచ్చు.

చిన్న పుస్తకం. చూడ్డానికి సుఖంగా ఉంది. పేజీలు చాలా అందంగా తీర్చిదిద్దారు. నేను కాలేజీలో ఉండగా చదివిన Jonathan Livingston Seagull పుస్తకం గుర్తొచ్చింది ఈ పుస్తకం చూస్తుంటే (లోపలి విషయంలో కాదు). అచ్చుతప్పులు చాలా తక్కువ. శ్రద్ధగా ముద్రించారు. ఫాంటు అందంగా ఉంది.  ఇంకొద్దిగా పెద్ద సైజులో ఉంటే చాలామంది పాఠకులకు సులువుగా ఉండేదేమో.

భజనలు, భజనగీతాలు, సత్యసాయిబాబా విషయాలు చాలా ఉన్నప్పటికీ ఇది బాబా భజన పుస్తకం కాదు. కథాస్థలం మాత్రం సాయిబాబా వేసవి విడిది బెంగుళూరులో వైట్‌ఫీల్డ్. బాబాది ఈ కథలో ముఖ్యపాత్రే.

*********

తేరా నామ్ ఏక్ సహారా?!
నరేష్ నున్నా

సెప్టెంబరు 2011

ప్రచురణ: అంజలి గ్రంథమాల
ప్రతులకు: పాలపిట్ట బుక్స్
Flat no. 3, MIG-II
Block 6, APHB,
Baghlimgampally, Hyderabad, 500 044
Phone: 40-2767 8430
E-mail: palapittabooks@gmail.com
71 పేజీలు; 50 రూ.

You Might Also Like

12 Comments

  1. చరసాల ప్రసాద్

    ఎవరి రివ్యూలు, ముందుమాటలూ, వెనుక మాటలూ చదవకుండా దీన్ని చదివా.
    మొదట ప్రతివాక్యంలో వున్న సిమిలీలు గడాగడా చదివే నా అలవాటుకు పదే పదే బ్రేకులు వేస్తుంటే మరీ ఇంతగానా అని విసుగు వచ్చింది.
    అయితే ఆ తర్వాత అందులో లీనమయిపోయా.. చివరికంటా చదవకుండా మనసాపుకోలేకపోయా. తను అనుభవంచకుండా ఇలా రాయడేలని దృడ నిశ్చయానికి వచ్చా. చివరలో తెలిసింది అది తన కథే అని. అప్పుడు మరింతగా హృదయం నీరయిపోయింది.
    అద్భుతమైన కథనం. ప్రతివాక్యమూ ఓ కవిత్వం. ఎన్నని వాక్యాలు అండర్‌లైను చేసుకోను, పుస్తకమంతా అవే అయితే!
    కినిగెలో eBook చదివా. కానీ అసలు బుక్కు తెప్పించుకొని మన అలమరాలో వుంచుకోవాల్సిన పుస్తకం.
    కథ సామాన్యమైందే .. అయితే భావాలను వెలిబుచ్చిన తీరు, గాడత.. వావ్ అది ప్రేమ కథా గానం!…

  2. కినిగె వార్తా తంతి 2 జూన్ 2012 | కినిగె బ్లాగు

    […] తేరా నామ్ ఏక్ సహారా?!సమీక్ష ‘కినిగె’పై […]

  3. కినిగె వార్తా తంతి 2 జూన్ 2012 | కినిగె బ్లాగు

    […] తేరా నామ్ ఏక్ సహారా?!సమీక్ష ‘కినిగె’పై […]

  4. Kinige Newsletter 2 June 2012 | Kinige Blog

    […] తేరా నామ్ ఏక్ సహారా?!సమీక్ష ‘కినిగె’పై […]

  5. jwaala

    పుస్తకం లో వచ్చిన ఈ సమీక్షలని చూసి పాలపిట్ట బుక్స్ కి కాల్ చెసి,ఎం.ఒ పంపి బుక్ రాకపోతే ఒక ఫ్రెండు ద్వార తెప్పించుకుందామని ట్రై చేసి అది కూడా కుదరక కినిగె లో ఈ బుక్ చూసి రెంట్ తీసుకుంటే ఇటీవల తెలుగు సాహిత్యంలో వచ్చిన ఆణిముత్యాలని దాచుకోకుండా పోతానేమో అని బ్రమ పడి పుస్తకం కొన్నాను. తీరా కొని చూద్దునుకదా,ఈ పుస్తకం గురించి పొగడడం మాట అటుంచి ఈ పుస్తకానికి కనీసం సమీకష కూడా రాసే అర్హత లేదనిపించింది.గొప్ప కధవస్తువు కాదు,శైలి ఘోరం. ప్రేమవల్ల వచ్చే అనుభూతుల గాలుల కంటే, పుస్తకం అంతటా వుండే వెటకారల,వ్యంగ్యల తుంపరులె ఎక్కువ.మనలో చాల మందికి ఒక వీక్నెస్ వుంటుంది.పరమ చెత్త విషయంలో కూడ మంచిని చూడడం గొప్ప సుగుణం గా భావిస్తారు.అంతే కాకుండా ఒకసారి పాజిటివ్ టాక్ వచ్చిన దానికి విమర్శ చేసే పాజిబిలిటీ వుండడు.నేను కొన్నది డిజిటల్ ఎడిషన్ కాబట్టి బతికి పోయింది.లేకపోతే మీరు వూహించుకోవచ్చు. కథ చెప్పడం పూర్తయిన తరువాత రచయిత రాసుకున్న వెనుక మాటలో ఈ పుస్తకానికి వచ్చిన పొగడ్తలు రాసుకోకుండా మంచి పని చేసారు,అదికాకుండా నెనెవరికి తీసిపోనని డబ్బాకొట్టుకోవడం టెంపరితనం. నన్ను ఏకబిగిన చదివించగలిగిన ఒక నవల అని రమ గారికి అనిపించినట్టు,నేను ఎప్పుడు పూర్తిచేస్తాను రా భగవంతుడా అని నాకు అనిపించేలా నా చెత చదవగలిగించిన నవల ఇది. రచయిత ఫ్రెండు చెప్పిన మాటలతో నా అబిప్రాయలు కరెక్టుగా సరిపోతాయి.
    ‘ దేశంలో ఎవరూ ప్రేమించనట్టూ ,నీ ప్రేమ ఒకటే పెటాకులైనట్టూ ,విడిపోయిన ఏడుపు నీదొక్కడిదే అయినట్టూ ,గోరంత దాన్ని కోండంతలు చేస్తావేం?’ -జ్వాల

  6. rama (rama sundari)

    జంపాల గారూ,
    ఏక్ సహారా అంటే ఒక ఆధారం అనే మాట లిటరల్ గా సరైనదే అయినా…పాట విన్నప్పుడు ఈ భవసాగరం ఈదడానికి అదొక్కటే ఆధారం అని స్ఫురించి, ఏకైక’ అంటే ‘నీవు తప్ప వేరే లేదు’ అనే అర్థంలో అలా అన్నాను.
    సూరదాస్ భ్రమర గీత్ లో
    ‘హమారై హరి హారిల్ కీ లకరీ’ అంటారు.
    …హారిల్ అనే పిట్ట ఎప్పుడూ ఒక రెమ్మని ఆధారంగా పట్టుకుని ఉంటుందట. ఎప్పుడూ విడవనే విడవదట. తాము హారిల్ పక్షి వలె కృష్ణుని (అతడి తలపులు) ఆసరాతోనే జీవించి ఉన్నామనీ, తాము స్థిరంగానే ఉన్నామనీ, అందువల్ల యోగ బోధల అవసరం తమకు లేదనీ, కావాలంటే అవేవో ఆ కృష్ణుడినే వినమనీ, బొత్తిగా స్థిరత్వం కోల్పోయి, చాంచల్య హృదయంతో ఇటూ అటూ తిరుగుతున్నాడు (అప్పటికే మధురకు వెళ్లిపోతాడు) కాబట్టి, అతడికే వాటి అవసరం ఉండవచ్చనీ అంటారు గోపికలు ఉద్ధవుడితో.
    అలాగే
    సూరదాస్ ‘జహాజ్ కా పంఛీ’ (ఓడ మీది పక్షి ) ఉదాహరణ ఇస్తారు. పక్షి ఏమరపాటున ఒక ఓడ మీద వాలింది. ఓడ బయల్దేరి పోయింది. చాలా సేపటివరకూ దానికి తను నేలకి దూరంగా వెళ్లిపోతున్నానని తెలియలేదు. అర్థం అయాక హడావిడిగా నేలని వెతుక్కుంటూ బయల్దేరుతుంది. కానీ ఉదయం నించి సాయంత్రం వరకూ తిరిగి వచ్చినా భూ ప్రాంతం కానరాదు. తిరిగి అది ఓడ మీదకే వచ్చి చేరుతుంది. ఇది తప్ప నన్ను తీరం చేర్చే సాధన లేదు అని తెలుసుకుంటుంది. ఇది అనన్య శరణాగతి.
    నాకు తేరానామ్ ఏక్ సహారా పాట విన్నప్పుడు ఈ భావాలన్నీ గుర్తుకొచ్చి అలా రాశాను…నిజానికి అది సాధారణ అర్థంలో …ఒక ఆధారం…అంటే సరిపోతుంది.

    ది సండే ఇండియన్ లో ఖలీల్ జిబ్రాన్ కథానికలకు నా అనువాదాలు ప్రచురితమయ్యాయి. ఆ లింక్స్ త్వరలో పంపిస్తాను.
    ది సండే ఇండియన్, ఇటీవలి సంచికలో శ్రీ సదాశివ గారిపై వచ్చిన వ్యాసం కూడా పంపుతాను.
    …రమా సుందరి

  7. rama

    తేరా నామ్ ఏక్ సహారా ? !
    (నీ నామమే ఏకైక ఆధారం)
    దీన్ని నవలిక గానూ, పెద్ద కథగానూ చూడడం కంటే, రచయిత స్వానుభవంగా చూడడమే సరైన విషయంగా తోస్తుంది.
    దీన్ని గురించి మాట్లాడాలంటే రచయిత కలం ప్రతిభ కంటే, అనుభూతుల గాఢతని ఏ రీతిగా వెలువరించారు ? అసలెందుకు ఆ అవసరం వచ్చిందీ అనే అంశం మీదే మాట్లాడాలనుకుంటున్నా.

    ముందు పేజీలో నరేష్ కృతజ్ఞతలు కూడా ఇచ్చుకోలేనని చెప్పినా, ఏ నాడూ వేడుకోకపోయినా ఆ దైవమే తన దూతను ఉష రూపంలో పంపాడని ఎపిలోగ్ ముగిస్తూ చివరి పేజీలో ఆయన తన అంతరంగం పరిచారు. ఈ నాటి వాస్తవం ఇదే కాబట్టి ‘ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్’ అన్న న్యాయంతో ఈనాడు ఆయన సంతోషంగా ఉన్నారు అనే భరోసాతోనే ఈ పుస్తకాన్ని సమీక్షించవచ్చునని నాకు అనిపిస్తోంది. నిజానికి తను ఒకటి కావాలనుకోవచ్చు. కానీ ‘వీడికేం కావాలో వీడికి తెలియడం లేదు, ఉష వల్లే వీడు సంతోషంగా ఉండగలుగుతాడు’ అని ప్రీ డిసైడ్ అయిపోయింది. అందుకే అన్నీ ఒక్కొక్కటీ తప్పుకున్నాయి.

    ‘తేరా నామ్ ఏక్ సహారా’ లో తన హృదయంలో సంచలనం రేపిన ఘడియలను గురించి నరేష్ మాట్లాడారు. ఎందుకు రాశారో కూడా ఆయన చెప్పారు. అదెందుకు నవల రూపంలో వచ్చిందో , మిత్రులు, బంధువులు, హితులు సూచించిన పలు సలహాల అనంతరం కూడా ఎక్కడా ఏ మార్పులూ లేకుండా ఈ పుస్తకం ఆ రూపం అలాగే ఎందుకు తీసుకుందో కూడా పేర్కొన్నారు. ఇక ఆ పరంగా ఏ సందేహమూ మిగలడానికి వీల్లేదు.
    ఈ పుస్తకం చేతిలోకి తీసుకున్నాక నేను పూర్తయ్యే వరకూ ఆపలేదు. పుస్తకంగా రాక ముందూ నాకు ఆ సబ్జెక్టు తెలుసు. అయితే పుస్తకంగా వచ్చాక నరేష్ అంతరంగానుభూతిని దర్శింప చేసే బొమ్మలకి వాటిదైన ఒక ప్రత్యేక స్థానం ఉంది ఈ పుస్తకంలో.

    తాల్ ఫిల్మ్ లో ఓ ఖవ్వాలీలో ‘ఊపర్ రబ్ హై , నీచే ఇష్క్ హై, ఇన్ దోనోంకే బీచ్ మే సబ్ హై’ (పైన ఆ భగవంతుడూ… క్రింద ఈ ప్రేమా….ఇక సమస్తమూ ఈ రెండింటి మధ్యనే…) అన్నాడొక కవి.

    శబ్దం నుంచి శబ్దాతీత స్థితికి తీసికెళ్లే ఒక దృశ్య కావ్యం.
    ధ్వన్యాకారుడు ఆనంద వర్ధనుడు ‘కావ్యానికి ధ్వనే ఆత్మ’ అంటాడు.
    ఈ రచనలో అడుగడుగునా ధ్వని ఉంది. అదీ సిమిలీలు, రూపకాలు, ఆక్జిమోరన్లూ, ఉత్ప్రేక్షలతో కలిసి పలికింది.
    రచయిత మనతో చెబుతున్నట్టే ఉన్న ఆత్మ కథన శైలి… అనుభూతుల గాఢత వల్ల గుండె బరువెక్కించే కథ…కథనం…

    అర్జునిడి బాణం తోడిన పాతాళగంగ భారతి స్వర ధార.
    రాబోయే ఘడియలకు ముందస్తు సూచన….శిలల మీద రాలి తలలు బద్దలైన రంగు పూలని పక్కకి ఊడ్చి.
    భారతికి కర చాలనం ఇచ్చి తొలి స్పర్శే వీడ్కోలు చేయడం ఇష్టం లేకపోవడం …
    సంధ్యా భీభత్సం వంటి రూపకాలు,
    కాగితాల చట్రాతి మీద తల బద్దలు కొట్టుకుని చిల్ల పెంకులై చెల్లా చెదరైన మనసుని అక్షరాలుగా పేర్చి నివేదన చేయడం…ఒంటిగా చేసిన జంట సంతకాల చేవ్రాలు నిర్లక్ష్యపు నిప్పుల్లో కాలి, నుసిగా రేగి, పొగలా కమ్మి కనుమరుగవడం వంటి అనుభూతుల గాఢత రచయిత అంతరాత్మ నుంచి బయల్దేరి సూటిగా పాఠకుడి అంతరాత్మనే చేరుతుంది.

    వినబోయే మాటలకు ముందుగానే వాటి పర్యవసానం వెల్లడించే ప్రకృతి దృశ్యాలు…
    తెల్ల చొక్కా భుజం మీద పడిన కాకి రెట్టని తుడుచుకుంటుంటే నడిచొచ్చింది భారతి, గడ్డిపోచల్ని తొక్కి కొత్త డొంక వేస్తున్న మట్టి కాళ్లతో..
    …వద్దన్నారు… నీకూ నాకు అసలు కుదరదన్నారు… ఇక ముందెప్పుడూ నన్ను కలవకూడదని కూడా చెప్పారు…
    63 వ పేజీలో మోడు మానవ ముఖంతో రోదిస్తున్న తీరు… చూశారా…

    గాన కళానిధి సుబ్బులక్ష్మిని గురించి మేఘ మృదంగాల ఉరుము దరువు కంటే ముందే చేరే మెరుపు తేజంలా. నిండైన నీలం రంగు కంచి పట్టు చీరలో స్వభావాన్ని సూచిస్తున్న మెత్తని నడకతో వస్తోంది రాగాన్ని వెదుక్కుంటున్న పదం, పరాన్ని అన్వేషిస్తున్న ఇహం …అంటూ ఇంత సంక్షిప్తంగా , అందంగా, గాఢతనీ, ఔన్నత్యాన్నీ పట్టివ్వగలిగే పదాలు మరెక్కడా నేను చూడలేదు. శబ్దాతీత సౌందర్యాన్ని కనిపెట్టగలిగిన ఆ అంతర్దృష్టే జీబురు జుట్టు మాయా ప్రపంచాన్నీ ఆవిష్కరించింది… ఎక్కడా తనకు విశ్వాసం కుదరలేదు. ఆ కుదరనితనాన్ని స్పష్టమైన శబ్దాల్లో చెప్పడానికీ ఎక్కడా వెనుదీయలేదు.

    దేవుడు ఉన్నాడా లేడా అనే విషయం దగ్గర నరేష్ అర క్షణం కూడా ఆగరేమో.

    సుబ్బులక్ష్మి దేవుడు ఉన్నాడని నమ్మి పాడితే, ఆ దేవుడు దిగి వస్తాడని మాత్రం నమ్ముతారని అనిపిస్తుంది. అందుకు ఆమె దగ్గర సాష్టాంగ పడ్డారు. అది విలువైన ఆరాధన. అందరూ భగవాన్ గా కొలిచే , సాగిల పడే వ్యక్తి దగ్గర చేయలేదు ఆ సాష్టాంగం. అంతరాత్మను కాదనుకుని నరేష్ ఎక్కడా ఎప్పుడూ తలవంచలేదు. ఇది వ్యక్తిత్వ ఔన్నత్యం. జానకి రామయ్యగారితో వాగ్వాద సందర్భంలో కూడా ఇది గమనించవచ్చు.

    భారతి పాటకు పరుగున వచ్చి వరాలివ్వని వాడు దేవుడా అని సందేహం. అది భారతి పట్ల ప్రేమ కంటే ఆమె అంతటి ఆర్తితో పాడడాన్ని ఇష్టపడి అలా అన్నారనిపిస్తుంది. తనకిష్టమైన భారతికి దేవుడెందుకు వరమివ్వడని వకాల్తాతో అన్న మాటలు కావవి.

    కీర్తి ప్రతిష్ఠలకు ఆశించి చేసిన రచన కాదిది. భక్తులకు ఉండే విశ్వాసం కొంత మౌఢ్యానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కథాంశం సత్యమే అయినా కోట్లాది మంది భక్తులకు జ్ఞానోదయం అయ్యే అవకాశమూ లేదు.

    ‘మణి రత్నం చిత్రంలో ఏమిటీ గొప్ప?’ అతడి కథ సింపుల్ గా ఉంటుంది. కానీ కథన వైచిత్రి చెప్పుకోదగ్గది. కెమేరా పనితనాన్ని అతడు గొప్పగా ఉపయోగించుకుంటాడు. పాటలో 150 ఫ్రేములు కనిపిస్తాయి. ఆ వివిధ భంగిమల్లోంచి ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని సంక్షిప్తంగా చూపించేస్తాడు. శ్రీ నరేష్ కథనం నాకు మణి రత్నం సిన్మా లానే ఉంటుంది. అక్కడ కెమేరా పని ఇక్కడ అక్షరం పని. అంతే తేడా.

    మనసుకు అద్దం పట్టినట్లున్న ఆ బొమ్మలు చాలా బాగున్నాయి. 60 పేజీలో బొమ్మ ‘జాగ్ తే రహో’ అంతిమ దృశ్యంలోని నర్గీస్, రాజ్ కపూర్ లను తలపించింది. నాకు ఆ సినిమా చాలా ఇష్టం. అందులోనూ ఆ అంతిమ దృశ్యం…’జాగో మోహన్ ప్యారే’ పాడుతూ కృష్ణ మందిరంలో వనకన్యలా, దేవతా మూర్తిలాంటి నర్గీస్ పాట పాడుతూ పూల మొక్కలకు నీరు పోస్తూ ఉంటుంది. ప్రపంచ పంకిలం చూసి, రోత పుట్టి, భీతావహుడైన రాజ్ కపూర్ అటుగా వస్తాడు. తానూ దోసిలొగ్గితే, అదిగో…అలాగే నీరు పోస్తుంది.

    కచేరీ ముందు గాయకుడు గొంతు సవరించుకోవడంలో గుర్తింపుకి నోచని ఏదో తీయదనం ఉందనిపిస్తుంది. గుడ్డు పగిలి, మొలిచీ మొలవని చిట్టి రెక్కలు విప్పుతూ గువ్వ పిట్టలు చేసే కువకువలు విన్నట్టుంటుంది. విరామ నిశ్శబ్దపు తెరల జారుముడిని సుతారంగా లాగినప్పుడు చిరు గంటలు మంద్రంగా మేలుకున్నట్టుంటుంది. తీగల్లోకి ఒత్తిగిల్లిన వాయిద్యాలు ఒక్కొక్కటే లేచి ఒళ్లు విరవడం…
    …ఇలా సాగే వర్ణనలో ప్రకృతి మానవ కన్యగా హొయలొలికింది. తన ప్రగాఢానుభూతిని చదువరి గుండెల్లోకి నేరుగా చేర్చింది ఈ రచన.
    నవ రసాల్లో మనిషి నిరంతరం ఏదో ఒక రసానుభూతిలో ఉంటాడు. ఆ రసానుభవాన్ని అందజేయడంలో ప్రకృతి తోడు లేకుండా ఏ ఒక్కసారీ ప్రయత్నించలేదు రచయిత. భీభత్స, హాస్య, శృంగార, శాంత, కరుణ రసాలతోనూ, సజీవమైన ప్రకృతి కాంత సాయంతోనే కావ్యం లాంటి ఈ రచన ముందుకు సాగింది.

    (7 వ పేజీలో) వెండి పోగుల పల్చని నీరెండ…ఒద్దికగా వీస్తున్న చల్లని గాలి..నిండైన నమ్మకంలా వెయ్యి బాహువుల్తో విస్తరించిన మహా వృక్షం… ఆశీర్వచనాల మెత్తని నీడ…తన్మయంలో తలలూపే కొమ్మల్లోంచి ఆమోదంగా రాల్తున్న పూలు…కానీ రెండవ పేరాలోనే సందేహం కూడా వ్యక్తం చేస్తూ, ప్రకృతి రహస్యాత్మక ప్రవృత్తి ద్వారా… ఏమో ..ఏ కానుందో అనే సంశయంలో పడవేసేదిగానూ ఉంది. మొదటి రెండు పేరాల్లో ఆశ, చివరి పరిణామాలూ రెండూ స్పష్టమవుతాయి.

    (61 వ పేజీలో) అది స్పష్టంగా సూది మొనల నీరెండ… నక్కి నక్కి వీస్తున్న నంగిరి గాలి… విస్తరించిన అపనమ్మకమై వెయ్యి చేతుల్తో లంఘిస్తున్న మాను… అనుమానంగా కదలాడే నీడ… అసహనంగా ఊగే కొమ్మల్లోంచి పట్టు తప్పి పడుతున్న పూలు గా మారింది. ప్రకృతి చైతన్యంతో తొణికిసలాడుతూ, మానవ స్పందనలను కలిగి ఉండడమే మానవీకరణ అలంకారం. అది కావ్యం నిండా పుష్కలంగా వర్ధిల్లింది.

    డోలాయమానంగా ఉన్న తన భవితవ్యం చూపించడానికి సూర్యుడు మూసిన మబ్బుల్ని జరీ అంచుతో మురిపించడం గురించి చెప్తారు.
    ఆవరించిన నిశ్శబ్దం నిట్ట నిలువునా చీలి, నడి రాతిరి యమునలా దారివ్వడం …
    మోహరించిన శబ్ద రాహిత్యం, తన రాకతో దాన్ని నిలువునా బాబా చీల్చడం, జరాసంధుడి భాగాల్లా అది కలిసి పోతుండడం, బద్దలైన ఎన్ని నెత్తుటి గుండెలు తొక్కుకుంటూ వస్తున్నారో.. గురివింద పువ్వులా…
    కాగితాల చట్రాతి మీద తల బద్దలు కొట్టుకుని చిల్ల పెంకులై చెల్లా చెదరైన మనసుని అక్షరాలుగా పేర్చి నివేదన చేయడం…ఒంటిగా చేసిన జంట సంతకాల చేవ్రాలు నిర్లక్ష్యపు నిప్పుల్లో కాలి, నుసిగా రేగి, పొగలా కమ్మి కనుమరుగవడం.
    కాండం తొలిచే పురుగు పట్ల మొక్కకుండే ఏవగింపు … వంటి పదాల్లో సజీవ చిత్రమేదో కదులుతూ ఉంది.

    బంగాళ దుంప, ఇడ్లీల ప్రసంగం మొత్తం పాఠకులు మంద స్మితితోనే, మనసులో చక్కలిగింతలతోనే చదువుకుంటారు.
    డాక్టరుకీ, భారతికీ మధ్య జరిగినట్టుగా చేసిన పరికల్పన కూడా పౌరాణికత స్ఫురింపచేస్తున్న పదాలతో రసస్ఫోరకంగా ఉంది.

    (17 వ పేజీలో) నమ్మకమైన ఎన్నిక గురించి చెప్పిన సత్యం నూటికి నూరుపాళ్లు ఏకీభవించదగింది. సత్య సాయి అయినా, నిత్య సాయి అయినా ఒక అనడాన్ని అది మనకు నచ్చిన ఎంపిక.

    చేతి రుమాలు విసిరి కుర్చీ సొంతమన్నట్లు మాట వరసకు వేసిన పసుపుతాడుతో తన ఇలాకా అని సదరు మొగుడు చెప్పుకుంటున్నా… పసుపుతాళ్లు బంధించలేని బంధాలను అలవోకగా చెప్పడం.

    నాస్తికత ఛాయల్లో పెరిగినా బహుశా అది కొంచెం తార్కికత నేర్పి ఉంటుందేమో గానీ మనిషికి సహజంగా రసజ్ఞతను దూరం చేయలేదు. సివిల్ ఇంజనీరింగ్ చదివీ, అదే వృత్తిలో స్థిరపడలేకపోవడం, తన passion కు విలువనిచ్చి అక్షర ప్రపంచంలోకి చోటు చేసుకోవడం, అక్కడే స్థిరంగా ఉండడం అనేది అతి పెద్ద ఫీటు.
    ఆశావహంగా ఉన్నప్పుడు
    హతాశుడైనప్పుడు

    ప్రతి జీవితంలోనూ కొన్ని ఘటనల సమాహారం సత్యాన్ని వెలికి తీస్తుంది.
    ఇక్కడ శీర్షికలో చివర చేర్చిన ‘? !’ చిహ్నాలతోనే ‘తేరా నామ్ ఏక్ సహారా’ అనే పదం పాడుకోవడానికే తప్ప వాస్తవం కాదనేది సత్య సాయికి సంబంధించిన సత్యాన్వేషణ.
    ఒక థాట్ నుంచి సాకారమైన ఈ తెలుపు నలుపుల పుస్తకం అనుభూతుల గాఢతనూ, హృదయ స్వచ్ఛతనూ, అలౌకికత్వాన్నీ అలవోకగా ప్రదర్శించింది.

    సత్య సాయి పేరు మీద ప్రపంచం అంతటా లక్షల కోట్లాది రూపాయలు వసూలైంది. సేవా సంస్థలు అన్నారు. ఆధ్యాత్మికత అన్నారు. జనం వెర్రికి ఎప్పుడూ ఒక ఆలంబన కావాలి. అది అదృష్ట వశాత్తూ సత్య సాయి అవతారం అయింది. గాన కోకిలలు పాడాయి. బృంద గానాలూ, కచ్చేరీలు ఎవరి ప్రతిభను వారు ప్రదర్శించడానికి ఓ వేదిక దొరికింది.
    కనీసం ప్రపంచానికి మరుగైనా తన సత్యం ఆ సత్య సాయికి తెలుసు. ఆయనను గురించి కాస్తంత కనిపెట్టి, నిర్లక్ష్యంగా ఉంటే చాలు పర్యవసానాలు ఇలాగే ఉంటాయనేందుకు నమూనా. మరీ కక్ష తీర్చుకునే చర్యలు చేపట్టడానికి ఇటు నుంచి అంత ధిక్కారం లేదు. కాబట్టి, అదే స్థాయిలో పొగ బెట్టడం జరిగిందనిపిస్తుంది.

    ఒక వేళ తిరుగుబాటు దార్లు ఓడితే పోయేది కొంచెమే. అదీ వ్యక్తిగత నష్టాలే, రచయితకి జరిగినట్టు. కానీ భక్తుల్లో వచ్చే తిరుగుబాట్లకు వెసులుబాటు ఇస్తే, ఆయన వైపు సామ్రాజ్యాలే కూల్తాయి. ఒకానొక స్థాయి తర్వాత ధిక్కారం సైపడం కష్టం అవుతుంది. తన వాస్తవికత తనకు తెలిసినంత బాగా రచయితకీ తెలిసిందనే ఒక అనీజీనెస్…అది పోగొట్టుకోవడానికి డౌన్ చేయాలి…అవతలి వ్యక్తిని…ఆయన చేశారు. తన చేతిలో ఉన్న తురుఫు ముక్క భారతిని కలుసుకోవద్దని చెప్పారు. ముఖ్యంగా ఇక్కడే నరేష్ తట్టుకోలేకపోయారన్నది నిజం. తనకు ఏ అర్హతా లేదని సాయికి తన అంతరాత్మలోనైనా తెలుసుగా, ఎదుటివారి తల రాతలను మార్చేందుకు సాయి ఆ రకంగా సాహసించడంపై రచయితకి గల అసహనం అడుగడుగునా ప్రదర్శితమైంది. ఆ అసహనం అర్థ రహితం కాదు.

    ముందూ వెనకల్లేని శుద్ధ వచనం లాంటి ‘ఇక్కడేముందీ, అంతా అక్కడే వుంది’ వాక్యాల్లోనూ,
    మోహరించిన శబ్ద రాహిత్యం, తన రాకతో దాన్ని నిలువునా బాబా చీల్చడం, జరాసంధుడి భాగాల్లా అది కలిసి పోతుండడం, బద్దలైన ఎన్ని నెత్తుటి గుండెలు తొక్కుకుంటూ వస్తున్నారో.. గురివింద పువ్వులా… తిరనాళ్లలో తప్పి పోయిన పిల్లాడిలా బాబా జనం మధ్య తిరుగాడుతూ ఉండడం …వంటి చోట్లా ప్రదర్శితమవుతుంది.

    ఒకవేళ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఆయన తేరా నామ్ ఏక్ సహారా రాయాల్సిన అవసరమే ఉండి ఉండక పోవచ్చు. అనంతమైన సంఘటనలు జరగనూ వచ్చు. అనంతమైన సంఘటనలు జరగకపోనూ వచ్చు.

    రచయితది నాస్తిక ధోరణి కాబట్టి , దైవ ధిక్కారం చేశారా?
    అంటే, కాదనిపిస్తుంది. సుబ్బులక్షి తన అంతరంగాన్ని ఎక్కడ కేంద్రీకరించారో, కబీరు రాముణ్ణీ, మీరా కృష్ణుణ్ణీ తన స్వరంతో ఎలా వెదుక్కుంటున్నారో తట్టిన దృష్టి నాస్తిక , ఆస్తిక పరిభాషలకు అతీతమైంది. కానీ ఒకటి… ఏం చెబుతున్నారో…అది వారు చేస్తున్నారా…అనే ఒక పరిశీలన ఉంది. వారు అంటున్న విషయంలో వారున్నారా అని చూసే నిశితమైన చూపు ఉంది. ఎవరి స్థాయికి వారిని అర్థం చేసుకుని, వారి ఎరీనాలో వారిని స్వేచ్ఛగా తిరగడానికి వదిలి వేస్తూ ఉండే ఒక స్వభావం వల్ల ఒకప్పుడు సుజీతోనూ, తర్వాత కాలంలో భారతితోనూ అసందర్భాలు ఎదురయ్యాయి.

    ప్లాసిబో అనే మందు పేరు చెప్తారు హోమియోలో. అది మందు కాదు. కొందరు పేషెంట్లకు జబ్బు ఉండదు. లేదా వచ్చిన జబ్బు ఒక్క రోజులో దానంతట అదే తగ్గి పోతుంది. అలాంటి స్థితిలో తన జబ్బుకి డాక్టరు ఇచ్చిన పిల్స్ వేసుకుంటే కానీ నయం కాదనే ఫీలింగ్ లో ఆ పేషెంట్ ఉంటే, డాక్టరు ఈ ప్లాసిబో ఇస్తాడు. అంటే ఏ మందూ లేని ఉత్త పంచదార గుళికలన్నమాట. వేసుకున్న పేషెంట్ మందుకే నయమైందనుకుంటాడు. కానీ అసలు రహస్యం డాక్టరుకి తెలుసు.
    ప్రజలు ఎంచుకునే డాక్టరు ఒకో సారి సత్య సాయి లాంటి వ్యక్తులు అవుతారు. వారి ప్రభ వెలుగుతుంది. ఇలాంటి చరిత్రలు కోకొల్లలుగా నడుస్తూనే ఉన్నాయి ఇంకా.

    ఫిర్ వహీ దిల్ కో బేకరారీ హై
    సీనా జోయా యే జఖ్మెకారీ హై
    నా మనసు మళ్లీ వ్యాకులమవుతోంది, గుండె చెలమల్లోకి చూస్తే గాయమే ఉంది. అలా గాయం ఎందుకైందీ అంటే,

    ఫిగర్ జిగర్ ఖోద్ నే లగా నాఖూన్
    ఆమ్ దే ఫస్ లే లాలకారీ హై
    ఇక్కడ హృదయాన్ని గోరు త్రవ్వడంగా చెప్పారు ఇక్కడ హృదయం గాలిబ్ దీ, గోరు ప్రియురాలిదీ అయి ఉండవచ్చు. అలా చేయడం ద్వారా ఆమె నాటే బీజాలన్నీ (‌‍‌జ్ఞాపకాలు) ఎప్పటికీ గాయాలోడుతూ ఉండేవిగానే ఉంటాయి. (పంట కూడా రాగ రంజితంగానే ఉంటుంది.) మళ్లీ ఓ కొత్త పరిచయం గుండెను కుదుపుతోంది అని భావం.

    ఈ పుస్తకం నాకు నచ్చిన అతి కొద్ది పుస్తకాల్లో ఒకటి.

    1. Jampala Chowdary

      @Rama:
      మీరు వ్రాసింది న్యాయంగా – నా పరిచయంపై వ్యాఖ్యగా కాక – స్వతంత్రవ్యాసంగా ప్రచురించి ఉండవలసింది. బాగుంది.
      మీకు నచ్చిన ఇతర పుస్తకాలేమిటి?
      ఏక్ సహారా అంటే ఒక ఆధారం కదా?

    2. చరసాల ప్రసాద్

      adButaMgA ceppAru ramA gAru!

  8. siva

    ee vyasam chalabhagundi thankyu

  9. Arunkumar Marapatla

    @KumarN and some of the friends, who are interested to read the book:
    the following link may be useful…
    http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=12586&PHPSESSID=15e920896ff33b970d93d37bc580c183

  10. KumarN

    వామ్మో, ఇంతమంది ఇంతిదిగా రాస్తున్నారు, దీన్ని చదవక తప్పేలా లేదే 🙂
    US కి షిప్ చేస్తారాండి వాళ్ళు?

Leave a Reply