నామిని – నెంబర్ వన్ పుడింగి : పడుతూ లేస్తూ ఉన్న ఏనుగు కత

పుడింగి అన్న పదం మొట్ట మొదట క్షణక్షణం సినిమాలో శ్రీదేవి నోట విన్నాను. ఆ పదానికి అర్థమేమిటో కచ్చితంగా ఇప్పటికీ తెలీదు కానీ, పోటుగాడు, పోటుగత్తె అని అర్థం అనుకొంటున్నాను. తొందరపాటు మనిషేమో అన్న అనుమానం కూడా ఉంది. నామిని అని అందరం పిలుచుకునే మిట్టూరోడు, నారప్ప కొడుకు సుబ్రమణ్యం నాయుడు ఈమధ్యే రాసిన ఆత్మకథకు పెట్టుకున్న పేరు నెంబర్ వన్ పుడింగి. అంతకు ముందు నాకు తెలీని మాటలు నామిని పుస్తకాల్లో నేర్చుకోవడం కొత్తేం కాదు. పుస్తకం పూర్తి చేసేటప్పటికి అర్థం తెలుస్తుందిలే అనుకొన్నాను.

కతలు రాయకూడదు, కతలు చెప్పాలి అన్నది తాను అనుసరించే సూత్రం అని నామిని ఈ పుస్తకంలో ఒకసారి చెప్పాడు. కతలు చెప్పటంలో నామిని మొగలాయీ అని మనకు బాగా తెలిసిన సంగతే. ఈ తన సొంత కతని కూడా ఎప్పట్లాగా మనం ఆపకుండా చదివేట్టు చెప్పాడు. నిలుకు  లేకుండా ఐదు రోజుల్లో ఈ కతంతా కాయితం మీద పెట్టాట్ట. మధ్య మధ్యలో ఈ కతంతా మనకు చెప్పాల్సిన అవసరం ఈయనకూ, చదవాల్సిన అవసరం మనకూ ఉందా అని అనిపించినా, ఒక గాసిప్ కాలం చదువుతున్నట్టూ, వలువలు విప్పేసిన ఒక జీవితం కళ్ళెదుట కనిపిస్తున్నట్టూ, పట్టాలు దాటేసి వేగంగా కొండ మీంచి కిందకు దూకుతున్న రైలును స్లోమోషన్లో చూస్తున్నట్టూ (watching a train wreck in slow motion) ఉండటంతో, నిలుకు  లేకుండా పుస్తకమంతా పూర్తి చేశాము నేనూ, అరుణా. దేవినేని మధుసూదనరావుగారి పుణ్యమా అని పుస్తకం మా ఇంట జేరిన మూడో రోజుకే ఇద్దరం చదవడం ఐపోయింది.

నామిని సుబ్రహ్మణ్యం నాయుడు నేను (అరుణ కూడా) అభిమానించే రచయితల్లో ఒకడు. అతను ఉదయంలో పచ్చనాకు సాక్షిగా రాసి గొప్ప పేరు సంపాదించుకొన్నప్పుడు ఆ విషయం అమెరికాలో ఉన్న మాకు తెలీదు. 1989 డిశంబర్లో విజయవాడ వచ్చినప్పుడు నవోదయా బుక్‌షాపులో సినబ్బ కతలు పుస్తకం బాపు గారి ముఖచిత్రంతో కనిపించింది. రచయిత పేరు నాకు పరిచితం కాకపోయినా నవోదయా ప్రచురణల నాణ్యతపై ఉన్న నమ్మకంతో ఆ పుస్తకం కొనుక్కొన్నాను.

ఆ పుస్తకం చదవడం మొదలుబెట్టాక అంకితం పేజీ దగ్గర్నుంచే షాకులు మొదలు. నాకు అసలు పరిచయం లేని మాండలికం, అప్పటిదాకా నేనెక్కడా చూడని పద్ధతులు (తండ్రిని కొడుకు నాకొడకా అని సంబోధించడం నాకు అప్పటికి ఊహక్కూడా అందని విషయం). ఆ తర్వాత పేజీల్లో భాష, వస్తువులు కూడా ఆశ్చర్యపరిచాయి. పల్లెటూళ్ళలో పెరిగిన నాకు బూతు మాటలు (పోనీ శారీరక, లైంగిక వ్యవహారాల గురించిన గ్రామ్యాలు) కొత్త కాదు; అమెరికాలో సంభాషణల్లో, ముఖ్యంగా నా పేషెంట్ల మాటల్లో, చాలా రకాల బూతులు వినటానికి అలవాటు పడిపోయినవాణ్ణే. ఐనా, తెలుగులో అందరికోసం ఉద్దేశించిన అచ్చుపుస్తకంలో అలాటి మాటలు చూడటం, అందులోనూ అలాటి మాటలు తల్లి గురించి, బంధుమిత్రుల గురించి ఉంటే సర్దుకోవటానికి నాకు కొంచెం సమయం పట్టింది.

ఐనా ఆ కతలు నవ్వించాయి, ఏడిపించాయి; గుండెని సూటిగా చాలాసార్లు తాకాయి. ఆ కతల్లో కనిపించిన నిజాయితీ, రచయిత తన చిన్నతనాన్నీ, తన పరిసరాల్నీ, తన బంధుమిత్రుల్నీ పరిచయం చేసిన తీరు నాకు చాలా నచ్చింది. ఇలా చెప్పటంవల్లే ఈ కతలు ఇంత బాగా చెప్పగలిగాడేమో అనిపించింది. ఆ తరువాత వాకబు చేస్తే పచ్చనాకు సాక్షిగా గురించి ఎంతో మంది చెప్పారు కానీ నాకు ఆ పుస్తకం దొరకటానికి చాలా కాలం పట్టింది. నవోదయా రామ్మోహనరావుగారే ఒక సెకండ్‌హేండ్ కాపీ పట్టుదలగా సంపాదించి పంపారు (పుస్తకం చూసేవరకు నేను పుస్తకం పేరు పచ్చ నాకు సాక్షిగా అనుకొనేవాణ్ణి; అంటే ఏమిటో అర్థమయ్యేది కాదు; పుస్తకం చూశాక అర్థమయ్యింది అది పచ్చనాకు అని; నామిని పెట్టిన పేరు పచ్చనాకు సత్తెంగా అని అట; ఏబీకే ప్రసాద్ సాక్ష్యంగా అని మార్చారట). అంతకంటే ముందే మిట్టూరోడి కతలు, మునికన్నడి సేద్యం, పాలపొదుగు చదివాను. అప్పటినుంచి ఇప్పటిదాకా నామిని ప్రచురించిన పుస్తకాలన్నీ కొని చదువుతున్నాము. రావణ జోస్యం గొడవలప్పుడు నామినిపై దౌర్జన్యాన్ని గొంతెత్తి ఖండించిన మొదటివాళ్ళం రచ్చబండ మిత్రులమే. అలాగే నామిని ధర్మాగ్రహంతో రాసిన చదువులా, చావులా పుస్తకాన్ని నేను చాలామందితో పంచుకొన్నాను ( రచ్చబండ గ్రూపులో మెయిల్ లంకె ఇక్కడ). రెండుసార్లు పనిగట్టుకుని ఆయన కుటుంబాన్ని తిరపతిలో కలుసుకున్నాము.

నామిని ఇప్పుడు కొత్తగా ఆత్మకథ వ్రాయటమేమిటి, ఇన్నాళ్ళూ అతను రాసింది ఆత్మకథ కాక మరేమిటి అని అనుమానం రావచ్చు. నామిని జీవితం గురించి మనకు ఇప్పటిదాకా తెలీనిదంతా తెలియజెప్పాలని ఇంతకు ముందు చెప్పని కథంతా హోల్‌మొత్తం ఏమీ విడిచిపెట్టకుండా మనకు ఇప్పుడు ఈ పుస్తకంలో చెప్పేస్తున్నాడన్న మాట. ఒక జీవితం కథంతా ఒక్క పుస్తకంలో వివరంగా చెప్పటం కష్టం అనుకోండి; అది వేరే విషయం.

ఈ పుస్తకంలో నామిని చిన్ననాటి ముచ్చట్లు తక్కువ. మిట్టూరు కబుర్లూ తక్కువే. ఈ పుస్తకం నామిని ఆంధ్రజ్యోతి వారపత్రికకు సంపాదకుడిగా నియమించబడ్డప్పట్నుంచి మొదలౌతుంది. తర్వాత ముందుకూ వెనక్కూ తిరుగుతూ ఒకట్రొండు నెలల క్రితం కబుర్లతో ముగుస్తుంది. ఈ పుస్తకంలో ఒక ప్రకరణం, నారప్ప కొడుకు సుబ్రమణ్యం రచయిత నామినిగా ఎట్టయ్యినాడో చెప్పిన కత, ఆంధ్రజ్యోతి దినపత్రిక వివిధ శీర్షికలో అచ్చయ్యింది.

నామిని జీవితం కొద్దిగా విచిత్రంగానే ఉంటుంది. వెనుకబడ్డ పల్లెటూర్లో ఆస్థి తక్కువగా ఉన్న వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగాడు. టెంత్ ఫస్ట్‌క్లాస్‌లో పాసై స్కాలర్షిప్ సంపాదించుకొన్నాడు. వ్యవసాయప్పనులకు ఇంట్లో వాళ్ళకు సాయపడుతూనే రోజూ బస్సులో తిరుపతికి వెడుతూ ఇంజనీరింగుకు సరిపడే మార్కులు తక్కువై చివరికి ఎమ్మెస్సీ మేథ్స్ చదివాడు. అప్పటివరకూ  సాహిత్యం ఏమీ చదవకపోయినా తనకు తెలిసిన జీవితాల గురించి రాయాలని తపన ఎక్కువై, మిగతావాళ్ళు ఎట్లా రాస్తారో తెలుసుకోవటానికి మిగతా వాళ్ళ పుస్తకాలు చదవటం మొదలుబెట్టాడు (అప్పుడు చదివిన లబ్ధ ప్రతిష్టుల రచనలేవీ నామినికి పెద్దగా నచ్చలేదు). పేపర్లో పని చేస్తే తన కతలు ప్రచురిస్తారేమోనని ఈనాడులో – ఇంట్లోవాళ్ళ ఇష్టాలకు వ్యతిరేకంగా – చేరాడు. అక్కడ పరిచయమైన రచయిత పతంజలి నామినికి అండగా నిలబడి తనతోపాటు ఉదయం పత్రికకి తీసుకెళ్ళి ఒక కాలంగా పచ్చనాకు సాక్షిగా రాయటానికి అవకాశం కల్పించాడు. దాంతో నామిని తెలుగులో ఆత్మకథాత్మక హ్రస్వ కథలు అనే కొత్త ఒరవడికి ఆద్యుడయ్యాడు. చాలామందికి అభిమాన రచయిత అయ్యాడు. నెమ్మదిగా ఆంధ్రజ్యోతి వారపత్రిక సంపాదకుడయ్యాడు.

పాత్రికేయుడుగా తిరప్తిలోనూ, ఐద్రాబాదులోనూ ఉద్యోగాలు చేసిన నామిని 2000 డిశంబరు 31న ఆంధ్రజ్యోతి మూసేసినప్పుడు, రిజైన్ చేసి లక్షా అరవై వేల గ్రాట్యుటీ తీసుకుని తిరప్తి ఎలబారిపోయినాడు. అక్కడికి పోయాక అమ్మ చెప్పిన కతలు అనే పుస్తకాన్ని పిలకాయల కోసం రాసి, కొన్నాళ్ళు స్కూళ్ళ చుట్టూ తిరిగి ఆ కతలు పిల్లలకి చెప్పి వారితో పుస్తకాలు కొనిపిస్తూ కష్టపడ్డాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు ఏమీ చేయకుండా, కదీర్‌బాబు, ఆర్.ఎం. ఉమామహేశ్వరరావుల్లా ఉద్యోగమూ చేయకుండా, రెండు పూటలా తాగుతుండగా రకరకాల ఐడియాలు వచ్చేవి కానీ ఏదీ ఆచరించినట్లు లేదు. ఒక ఏడాది క్రితం కొందరు మిత్రులు, అభిమానులు కలిసి పచ్చనాకు సాక్షిగా వ్రాసి పాతిక సంవత్సరాలైందని తిరప్తిలో 2010 జనవరి 9న సభ పెట్టి సన్మానం చేసి పది లక్షల రూపాయల పర్సు బహుమతిగా ఇచ్చారు. నా బోటి రచయితను ఇట్టా పదిమంది పోగు చేసి ఇచ్చిన డబ్బు తీసుకొనే దౌర్భాగ్య స్థితికి తేవటం తెలుగుదేశంలో మంచి సాహిత్యానికి పట్టిన చీడకు నిదర్శనం అన్నట్లుగా నామిని అప్పుడు చెప్పిన మాటలు చాలా కలకలం రేపాయి. ఆ డబ్బులతో అప్పటికి ఉన్న అప్పులన్నీ తీరిపోగా, తర్వాత తాగటం మానేసి మిట్టూరోడి పుస్తకం ఐదువేల కాపీలు, పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కతలు కలిపి వేసిన పుస్తకం ఇంకో ఐదువేల కాపీలు మళ్ళీ కాలేజీలు, స్కూళ్ళకూ తిరిగే అమ్మాడు. అమెరికా నుంచి కొంతమంది అభిమానులు ఒక లక్షా ఎనభై వేలు పంపిస్తే దానికి ఇంకో లక్షా ఇరవై వేలు కలిపి, తన సైటులో టీచర్లకూ తల్లితండ్రులకూ స్కూల్ పెట్టడం కోసం ఒక ’పెద్దల బడి’ కట్టించాడు (ఇంకా మొదలుబెట్టలేదు లెండి). నామిని కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఎం.ఎస్ (ఫార్మసీ) చేస్తుంది; కుమారుడు విశాఖపట్టణంలో ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. నామిని, ప్రభావతి గార్లు ఇద్దరే ప్రస్తుతం ఖాళీ గూట్లో (empty nestలో) ఉంటున్నారు.

2001లో ఆంధ్రజ్యోతి మూసేసినప్పుడు నామిని సోమరాజు సుశీలగార్ని ఆర్థిక సాయం అడిగితే ఆవిడ, ’ఏనుగు పడిందండీ, ఏనుగే లేవాలండీ, ఒకరు లేపలేరు కదా’ అన్నారట. అప్పట్నుంచీ ఈ ఏనుగు చాలాసార్లు లేచింది, మళ్ళీ మళ్ళీ పడుతూ లేస్తూ ఉంది.

పై కబుర్లతోపాటు ఈ పుస్తకంలో రచయితగా, ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్‌గా తన అనుభవాలు, తన పెళ్ళి కబుర్లు, కొంతమంది బంధుమిత్రులతో తను వ్యవహరించిన విధానాలు, భూములు కొనటానికి చేసిన ప్రయత్నాలూ, పుస్తకాల ప్రచురణల, అమ్మకాల కతలు కూడా ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ కతలో ప్రకరణాల పేర్లు: మా దెయ్యాల బాట పక్కనేఐద్రాబాదు; ఆంధ్రజ్యోతిలో నా తోకాటలూ, జూటాతనాలూ; నక్కతోక తొక్కిన మా టాంసాయర్ బుక్స్; ఏనుగు పడింది, ఏనుగే పైకి లేచింది; రియల్ ఎస్టేట్లో కూడా శోబన్‌బాబు కంటే, చెడ్డతనంలో వర్మా కంటే నాలుగాకులు ఎక్కువే; నారప్ప కొడుకు సుబ్రమణ్యం గాకుండా నామిని ఎట్టయినాడంటే; పది లచ్చల కోసరం నేను తలొంచింది దీనికీ; పది కుయ్యో మొర్రోలు.

ఇందులో నామిని కొన్ని విపరీత సంఘటనలను, తాను పొందిన అవమానాల గురించి (ముఖ్యంగా ఒక ఇంటాయన వేసిన తప్పుడు అభియోగాన్ని గురించి) చెప్పినప్పుడు అయ్యో అనిపిస్తుంది. మరి కొన్ని విషయాలు చెప్పిన తీరుకు నవ్వొస్తుంది. మరి కొన్నిసార్లు ఈ మనిషి ఈ విషయాల గురించి ఇక మాట్లాడ్డం ఆపేస్తే బాగుంటుందనిపించింది. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు చాలాసార్లు ఏమిటి ఈయన ఇలా రాస్తున్నాడు, ఎందుకు ఇలా రాస్తున్నాడు అని సందేహాలు. పుస్తకం పూర్తయ్యాక కూడా అవే ప్రశ్నలు. మనబోటి మనుషులు తమతో తామే చెప్పుకోవటానికి ఇబ్బంది పడే విషయాలను ఈయన ఎందుకిలా అందరితోనూ పంచుకొంటున్నాడు? ఈ పుస్తకం వల్ల ఏం ఒరుగుతుంది ఈయనకుగాని, మనకుగాని అని అనిపించింది.

ఈ పుస్తకంలో నామీద బలంగా ముద్ర వేసిన మంచి విషయాలు రెండు.

మొదటిది: ఒక తెలుగు రచయిత రచనలని అమితంగా అభిమానించిన కొందరు మనుషులు, వివిధ ఆర్థిక సామాజిక స్థితుల్లో ఉన్న వాళ్ళు, రచయితతో ప్రత్యక్ష పరిచయం లేనివాళ్ళు ఆ రచయితకు వీలైనంత సహాయం చేయడానికి ప్రయత్నించడం. ఈ విషయంలో నామినికి జరిగినట్టు ఇంకెవరికైనా జరిగిందా అనిపిస్తుంది. పది లక్షల పర్సు మాట అట్టే పెట్టండి, 2001 నుండి 2010 దాకా ఆయనకు సహాయం చేసిన వారి వివరాలు వింటుంటే నాకు వారందరి మీదా చాలా గౌరవం కల్గుతుంది. తెలుగువాళ్ళు తమ రచయితలకి ఏమీ చెయ్యరు అన్నది అపప్రధ అనిపించింది. ముఖ్యంగా సాకం నాగరాజ వంటి వారిగురించి చదివినప్పుడు మనసు నిండిపోయింది.

రెండవది: తాను రాసిన అమ్మ చెప్పిన కతలు అనే పుస్తకాన్ని ఐదారేళ్ళలో దాదాపు లక్షా అరవై వేల కాపీల్ని పిల్లలకు నామిని (చాలా కష్టాలు పడుతూనే) స్వయంగా డైరెక్ట్‌గా అమ్మానంటే ఆశ్చర్యం వేసింది. గత ఏడాది, నాలుగు నెలల్లో మిట్టూరోడి పుస్తకం 5వేల కాపీలు, పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కతలు కలిపిన ఇంకో పుస్తకం 5వేల కాపీలు రెసిడెన్షియల్ కాలేజీ హాస్టల్ విద్యార్థులకు డైరెక్ట్‌గా అమ్మగలిగారట. ఈ విషయాలు చదివితే తెలుగు పుస్తకాలకు లేనిది మార్కెట్ కాదు, సరైన మార్కెటింగ్ అనిపించింది.

కోతి కొమ్మచ్చి మొదటిపేజీల్లో ముళ్ళపూడి గారు, ’ఆత్మకథ అంటే సొంతడబ్బా – మరియు పరనింద అని తాత్పర్యం” అన్నారు. నామిని ఆత్మకతలో ఈ రెండూ ఎక్కువ పాళ్ళలోనే ఉన్నాయి. ఈ రెంటికీ తోడు ఈ కతలో చేరిన కొత్త దినుసు ఆత్మనింద: తాను చేసిన జూటాతనాల, చేయగూడని పనుల గురించి మనతో చెప్పుకోటం. ఈ మూడు దినుసులు కలసిన వంటకం కొన్నిచోట్ల చాలా వెగటుగా అనిపించింది. ఈ పుస్తకంలో నాకు, ఇష్టులూ, సన్నిహితులూ ఐన వారి గురించీ, నాకు తెలియనివారు చాలామంది గురించీ కటువైన మాటలూ, కొంటె మాటలూ ఉన్నాయి. మిత్రుల గురించిన మాటలు నన్ను కొద్దిగా కష్టపెట్టినా, ఆ ఇబ్బంది మరీ పెద్దది కాదు. ఎవరి అనుభవాలు, అభిప్రాయాలు వారివి అని సరిపెట్టుకోగలిగాను. కానీ ఈయనకు సహాయం చేసినవారి గురించి కూడా ఆక్షేపణగా వ్రాస్తున్నప్పుడు మాత్రం చిరాకు అనిపించింది.

నాకు బాగా ఇబ్బంది కలిగించిన విషయాలు రెండు. మొదటిది పుస్తకం మొదటినుండి చివరిదాకా కనిపించిన అతిశయం, ప్రపంచమంతా నామిని గొప్పదనాన్ని తగినట్లుగా గుర్తించి ఆయన్ని పట్టించుకొని ఆయనకు ఇష్టమైన రీతిలో సహకరించటం లేదన్న ఆక్రోశం (దీన్నే ఇంతకుముందు రంగనాయకమ్మ గారు నామిని బడాయిగా వర్ణించారు). నామినికి తనపై తనకు జాస్తిగానే నమ్మకం ఉంది. అమ్మని గురించి, పల్లెజీవనాన్ని గురించి రాయటంలో తనకు సాటి (తెలుగు సాహిత్యంలో) మరొకరు లేరని, పల్లెటూళ్ళగురించి మిగతావారు రాసినవాటిలో నిజాయితీ, సాధికారత లేవని ఆయన నమ్మకం. ఆయన నమ్మకానికి ఆయన నమ్మకంతప్ప వేరే దాఖలాలేమీ ఆయన చూపెట్టలేదు. అలాగే ప్రపంచంలో మిగతా మనుషుల ప్రవర్తన తాను అనుకొన్నట్టుగానే ఉంటేనే రైటని కాకపోతే తప్పనీ చెప్పటానికి ఆయనేమీ వెరవడు. ఆయనకు సహాయం చేసేవాళ్ళు కూడా ఆయనకు రైటనిపించిన మార్గంలోనే చెయ్యాలి. ఐతే వచ్చిన చిక్కేమిటంటే ఆయన ఆలోచనలు, నమ్మకాలు కొంచెం ప్రత్యేకమూ, విలక్షణమూ అవటంతో, వాటిని పంచుకోలేని స్థాయిలో మిగతా ప్రపంచమంతా ఉంది మరి.

నామిని తిరపతి సన్మానసభ ఉపన్యాసంలోనూ, ఈ పుస్తకంలోనూ రకరకాల వైనాలుగా కనిపించే విషయం: సమాజానికి మంచి చేసే తన (పోనీ తనబోటి రచయితల) బాగోగుల్ని పట్టించుకొని, పుస్తకాలు కొనేసి, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా చూసుకోవలసిన బాధ్యత సమాజంలో మిగతావారందరిపైనా ఉందని. అలా చూసుకోకుండా ఏదో పనిచేసి కుటుంబం గడపవలసి రావటం మంచి సమాజం లక్షణం కాదని. మంచి (అంటే ఏమిటి అన్నది వేరే ప్రశ్న; బహు గడ్డు ప్రశ్న) రచయితలు తమ రచనల మీద వచ్చే ఆదాయంతో బతికే పరిస్థితి ఉండాలని భావించేవాళ్ళలో నేనూ ఒక్కణ్ణి. నామిని తిరపతి సభలో మాట్లాడినా మాటల్ని మిత్రులు చాలామంది విమర్శించినా, నేను వారితో చేరలేక పోయాను. కానీ, ఈ పుస్తకంలో నామిని చెప్పినదాన్ని బట్టి, నామిని తన రచనల ద్వారా బతకటానికి చాలామంది – నామినితో రచనలద్వారా తప్ప ఏ రకమైన పరిచయం లేనివాళ్ళు – కేవలం నామిని రచనల మీద అభిమానంతో – తమ వంతు సాయం అనేక రూపాల చేశారు. ఐనా ఆయన ఆర్థిక పరిస్థితి ఆయనకు కావలసినట్లు లేదంటే దానికి ఆయన తీసుకున్న కొన్ని వ్యక్తిగతమైన, వ్యాపారాత్మక నిర్ణయాలే కారణం. తాను తీసుకున్న నిర్ణయాలకు సమాజాన్ని, ప్రజలను బాధ్యులుగా చూపించబోవటం, తనకు మల్లే కాక ఆర్థికంగా విజయం పొందినవారిని నిందించటం హాస్యాస్పదమతుంది.

నన్ను ఇబ్బంది పెట్టిన రెండవ విషయం: ఈ పుస్తకంలో నామిని విప్పి చూపిన స్వంత తప్పుల చిఠ్ఠా – ముఖ్యంగా భార్య పట్ల, కొందరు దగ్గర బంధువుల పట్ల ఆయన ప్రవర్తించిన తీరు. ఆయన బలహీనతలు ఆయనవి అని వదిలేద్దామనుకున్నా అవి బలవంతంగా మన ఎదుట ఆయన ప్రదర్శనకు పెట్టినప్పుడు మనం ఏమనుకోవాలి? ఏం చేయాలి? పదిమంది ముందూ తప్పులొప్పుకొని పశ్చాత్తాపం ప్రకటించి పాపాల్ని కడిగేసుకొని (public confession and catharsis) కొత్త జీవితం ప్రారంభించే ప్రయత్నం అనుకోవాలా? లేక ఈ తప్పుల్ని నామిని కాబట్టి ఇంత బహిరంగంగా ఒప్పుకొన్నాడని మెచ్చుకొని ఆయన నిజాయితీని పొగడాలా? ఇంతకు ముందు నామిని రచనల్లో వచ్చిన కొన్ని విషయాలను, బహిరంగ ఒప్పుకోళ్ళను అప్పుడే ఖండించక అతని నిజాయితీకి ఇచ్చిన కితాబుల ఫలితమా ఇది?

ఈ పుస్తకం ఆఖరి భాగం ’పది కుయ్యో మొర్రోలు’లో నామిని యీ పుస్తకాన్ని చదివేవాళ్ళకూ, ప్రవాసాంధ్రులకూ ఒక వుజ్జోగం ఇచ్చాడు: తనకొక వుజ్జోగం యిచ్చి తనను దత్తత తీసుకోమని. ఆ పని ఎట్లా చెయ్యొచ్చో పది రకాలుగా చెప్పాడు. అందులో ఆఖరి మార్గం (పుస్తకంలో ఆఖరు పేరాగ్రాఫు) ఇది: “ ఇంకా పుస్తకాలు చదివేవాళ్ళంతా కూడా – నామిని జ్యోతిలో వున్నప్పటికంటే యిప్పుడే మంచి పని జేస్తుండాడు. వుజ్జోగాలేంది కదీర్‌బాబూ, ఉమామహేశ్వరరావూ కూడా చేస్తారు. యీ పని నామిని తప్ప యింకొక్కడు చెయ్యలేడు అనుకునే వాళ్ళంతా కూడా వాళ్ళకు తోచింది నా చేతుల్లో పెట్టండి. కుటుంబం కష్టంగా గడిచేవాళ్ళు నవ్వుమొకంతో దీవిస్తే చాలు. నా రెక్కల కష్టంతో ఇంకా ఇరవై లక్షల మంది పిల్లకాయల్ని కలిసి యీ పుస్తకాలమ్మి చిన్న యిల్లు కట్టుకొని దానికి ’పుస్తకం’ అని పేరు పెట్టి, దాంట్లోనే కుదురుగా ఉండాలనేది నా కోరిక…మీరంతా తలా ఒక చెయ్యందించాలని యీ మాదిరి A/c number యివ్వడానికి నాకేం సిగ్గుగా లేదు, కులుగ్గానే ఉండాది.’ డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడానికి వీలుగా అకౌంటు వివరాలు ఇవ్వడంతో పుస్తకం ముగిసింది. ఇదంతా చదివాక ఈయన మనల్ని ఆట పట్టిస్తున్నాడు అన్న అనుమానం వస్తే తప్పు మీది కాదు.

సాధారణంగా ఆత్మకథలు ఆ రచయితల స్థలకాలాల్ని పాఠకులకు పరిచయం చేస్తాయి. నామిని పాత పుస్తకాలు (ఇస్కూలు పుస్తకాలతో సహా) ఈ పనిని బాగా చేశాయి. ఈ పుస్తకంలో మాత్రం అలాంటివి తక్కువ. ఎక్కువగా నామిని గురించీ, కొద్దిగా ఆయనకు తెలిసినవారి గురించీ తెలుస్తుంది. ఈ పుస్తకానికి కొద్దిగా సాహిత్య చరిత్ర విలువలున్నాయేమో చెప్పలేను కాని సాహిత్యంగా విలువ మాత్రం తక్కువ అనిపించింది.

నామిని చెప్పిన దాని ప్రకారం ఆయన రాసిన కతలు – మిట్టూరోడి పుస్తకంలో ఉన్న సొంత కతలు (పచ్చనాకు సాక్షిగా, సినబ్బ కతలు, మిట్టూరోడి కతలు), తెలిసినవాళ్ళ కతలు (మునికన్నడి సేద్యం, పాల పొదుగు, సుందరమ్మ కొడుకులు) – అన్నీ 1985-1989ల మధ్య రాసినవే. ఈ ఇరవై ఏళ్ళలో ఇస్కూలు పిల్లల పుస్తకంలో ఉన్న విషయాలు (ఇవన్నీ కూడా 1999-2002 మధ్య రాసినవే), పతంజలి మీద వ్యాసం తప్ప ఇంకేమీ రాసినట్లు లేదు. నామిని చెప్పగల కతలు ఐపోయాయా? తన పాత కతల్ని కొత్త పాఠకులకు చేర్చడమే నామినికి మిగిలిన వ్యాపకమా?

ఇంతకు ముందు రచనల్లో నామిని కష్టమైన పరిస్థితుల మధ్య పెరిగినా, నలుగురు తొక్కిన దారికి పెడగా నడిచినా, చిన్న చిన్న మాటకారీ మోసకారీ పనులు చేసినా, మొండిగా తనదైన దారి తాను వెదుక్కొని స్వయంకృషితో పెద్దవాడైన ఒక పల్లెటూరి అమాయకుడిగా, తనబోటి వారి కష్టాలను మర్చిపోని సున్నిత మనస్కుడిగా, స్నేహం చేసుకోవలసిన మనిషిగా కనిపించేవాడు. ఈ పుస్తకంలో నామిని అహంకారిగా, ఒకోసారి అమాయకుడిగా, ఇంకోసారి అతితెలివిగా, మోసకారిగా, అప్పుడప్పుడూ అవివేకిగా, కొండొకచో సోమరిగా, ఎప్పుడూ మొండిగా, పెడసరి మనిషిగా, దూరంగా ఉండి జాగ్రత్తగా మెసులుకోవలసిన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. పాత నామిని ఇట్లా బహిరంగంగా నామిని చేతిలోనే హత్య చేయబడడం విషాదం.

ఇంతకీ నాకు పుడింగి అంటే ఏమిటో పుస్తకం పూర్తయ్యాక కూడా స్పష్టంగా తెలీలేదు.

పుస్తకం అందంగా ముద్రించబడింది. అచ్చు తప్పులు బాగా తక్కువ.

నామిని
నెంబర్ వన్ పుడింగి
మార్చ్ 2011
టాం సాయర్ బుక్స్
ప్లాట్ నం. 211, అన్నమయ్య టవర్స్
యాదవ కాలనీ, తిరపతి 517 501
ఫోన్: 0877-224 2102
212 పేజీలు; 150 రూ.

***********************************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.
***********************************

You Might Also Like

56 Comments

  1. anil

    జంపాల గారు,

    మీరు నామిని కి ఇచ్హిన సమాదనం లొ, లక్ష రూపయలు ఇచ్హిన వర ప్రసద్ రెద్ది ని, 10 వెల రుపయలకు పుస్తకలు కొనుకున్న పరిమి గారిని, నామిని అక్షెపించ్నత్లు రాసరు. మీకు పుడింగి పని కంత్ట్కి అనలెదు. వర ప్రసద్ రెద్ది లంతి పరిస్రమికవెతకు సైతం, 10 స్చూల్ల వల్ల థొను, 10 కాలెజిల వల్లథొను మట్లది, నామిని ని పిల్లల ముందు హజరుపరిచె పని చెయతం కస్తమని, దని కంతె లక్ష్య రుపయలు సమర్పించుకొవతమె అయనకు సులువని, నామిని రాసదు. అది అక్షెపన కాదు.

    భారథ దెశం లొ, మరి ముక్యం గ అంధ్రప్రదెష్ లొ మన స్చూల్ల యజమనుల చదువురనితనన్ని నామిని తూర్పర పత్తతం లొ బాగం. నామిని అబిమనులు ఎవరైన స్చూల్ ల వల్లని ఒప్పించె కంతె, వల్ల వల్ల స్తొమథను బత్తి 5 వెలు, 10 వెలు , ఆయనకు ఇవ్వతమె మెలని, ఆ తలనొప్పి ఎవ్వరు భరించలెరని, ఆయన స్పస్తంగ చెప్పిన మీకు బొధపదలెదు. తెలుగు లొ ఒక రచైత , తనె పిల్లల దగ్గరకు పొఇ , పుస్థకలను పరిచయం చెసి, అమ్ముకొవలంతె ఎన్నెన్ని అద్దంకులు వస్థయొ చూదంది, అని నామిని చిలకకు చెప్పినత్తు చెప్పిన, మీరు చెవినె వెసుకొలెదు.

    ఇంకా పరిమి గారు నదిపె స్చూల్ మంచిదని, నామినె చెప్పరు. అలంతి పరిమి స్చూల్ లొనె , పిల్లలు కవలంతున్న పుస్థకన్ని, ప్రథి పిల్లవది చెతిలొ వుంచకుందొ, ఒ పదొ , ఇరవయ పుస్థకలను లిబ్రర్య్ లొ పెత్తరని నామిని నొచ్హుకున్నరు. అంథ మంచి స్చూల్ లొ కుద పుస్థకలను లిబ్రర్య్ లొ పెత్తె గవ్రవం దక్కింది కని, పిల్లల చెతిలొ వుందె గవ్రవన్ని పొందలెక పొయిందని నామిని బాధ.
    మీరు అథి తెలివిథొ , నామిని పుదింగి పుస్తకం లొ, వర ప్రసద్ రెద్ది గారి ని, పరిమి గారి ని అక్షెపించదని రాసరు. మీ ధొరణి చుస్థుంతె, మనకు అన్ని చెప్పి, పుస్థకంలొ తల దచుకున్న నామిని ని జుట్తు పత్తి వీఢ్చి వీది లొ వెస్థున్నరు. మీ అంథతి వరికి ఈవిషయలు అర్థం కవని నెను అనుకొవతం లెదు. నామిని కి లెని శెథ్రువుల్ని, మీరు కూదగత్తె పనిలొ పడ్డరా ?

    నా మొదతి వుత్తరనికి మీ సమదనం ఇవ్వలెదు, కనిసం ఈ వుత్తరని కన్న సమదనం ఇస్థరని అశిశ్థున్నను.

    ——– అనిల్

  2. anil

    Jampaala gaaru,

    meeru naamini ki ichhina samaadanam lo, laksha roopayalu ichhina vara prasad reddi ni, 10 vela rupayalaku pustakalu konukunna parimi gaarini, naamini akshepinchnatlu raasaru. meeku puDingi pani kantTki analedu. vara prasad reddi lanti parisramikavetaku saitam, 10 schoolla valla thonu, 10 kaalejila vallathonu maTladi, naamini ni pillala mundu hajarupariche pani cheyatam kastamani, dani kante laxya rupayalu samarpinchukovatame ayanaku suluvani, naamini raasadu. adi akshepana kaadu.

    Baaratha deSam lo, mari mukyam ga andhrapradesh lo mana schoolla yajamanula chaduvuranitananni naamini toorpara pattatam lo baagam. naamini abimanulu evaraina school la vallani oppinche kante, valla valla stomathanu batti 5 velu, 10 velu , aayanaku ivvatame melani, aa talanoppi evvaru bharinchalerani, aayana spastanga cheppina meeku bodhapadaledu. telugu lo oka rachaita , tane pillala daggaraku poi , pusthakalanu parichayam chesi, ammukovalante ennenni addankulu vasthayo choodandi, ani naamini chilakaku cheppinattu cheppina, meeru chevine vesukoledu.

    inkaa parimi gaaru nadipe school manchidani, naamine chepparu. alanti parimi school lone , pillalu kavalantunna pusthakanni, prathi pillavadi chetilo vunchakundo, o pado , iravaya pusthakalanu library lo pettarani naamini nochhukunnaru. antha manchi school lo kuda pusthakalanu library lo pette gavravam dakkindi kani, pillala chetilo vunde gavravanni pondaleka poyindani naamini baadha.
    meeru athi telivitho , naamini pudingi pustakam lo, vara prasad reddi gaari ni, parimi gaari ni akshepinchadani raasaru. mee dhoraNi chusthunte, manaku anni cheppi, pusthakamlo tala dachukunna naamini ni juTtu patti veeDhchi veedi lo vesthunnaru. mee anthati variki eevishayalu artham kavani nenu anukovatam ledu. naamini ki leni Sethruvulni, meeru koodagatte panilo paDDaraa ?

    naa modati vuttaraniki mee samadanam ivvaledu, kanisam ee vuttarani kanna samadanam istharani aSiSthunnanu.

    ——– anil

  3. Jampala Chowdary

    @చంద్ర కన్నెగంటి: చంద్రా:

    పుస్తకం చదివాక మీరు ఏమంటారో చదవాలని కుతూహలంగా ఉంది.

  4. Jampala Chowdary

    @Ravikiran Timmireddy:
    రవికిరణ్ గారూ:

    మీ ముసుగుల పోలికనే కొనసాగిస్తే: ముసుగులెన్ని వేసుకున్నా, అవన్నీ తీసేశాక, రంగులన్నీ కడిగేశాక బయటకొచ్చే అసలు ముఖం ఒకటి ఉంటుంది. దాన్ని మనం మూల వ్యక్తిత్వం అంటాము. దీన్ని పూర్తిగా దాచేయటం చాలా కష్టం.

    ఈ పుస్తకంలో నామిని తనతోపాటు ఇంకెవరివో బట్టలు విప్పి వార్ని నగ్నంగా నుంచోపెట్టారన్నట్లు, ఆ దృశ్యంలో నిజచిత్రాల్ని చూసుకొని అలజడి చెందిన వారూ, నేనూ ప్రతిస్పందిస్తున్నట్లు మీరు రాశారు అని అర్థం చేసుకుంటున్నాను.

    నాకు ఈ పుస్తకంలో కొన్ని (అన్నీనా?) బట్టలు విప్పేస్తూ లేదా ముసుగులు తీసేస్తూ కనపడింది ఒక్క నామినే. నామిని ఈ పుస్తకంలో తన గురించి చెప్పుకొన్నదే నాకు ఎట్లా కనిపించిందో నేను చెప్పాను. ఆ దృశ్యం నా ప్రతిబింబం అన్న కంగారేమీ నాకు లేదు.

    తనను కష్టపెట్టేట్లుగా ప్రవర్తించిన, లేక ఇష్టపడేట్లుగా ప్రవర్తించని (రెండూ ఉన్నాయి) వారి గురించి (వారిలో కొందరు నాకు ఇష్టులూ, సన్నిహితులూ ఐనప్పటికీ) నామిని రాసినదాంతో నాకైతే పెద్ద పేచీ ఏమీ లేదు. వాటిలో కొన్ని విషయాలకు నేనూ నొచ్చుకొన్నాను.

  5. jagadeeshwar reddy

    జంపాల చౌదరిగార్కి,
    క్షమించండి. మీరు ఉమాకి ఇచ్చిన జవాబును ఉమా రాసిన వాఖ్యగా పొరపడ్డాను. అందుకే ఉమాని ఉటంకిస్తూ రాశాను. వాఖ్యలన్నీ ఒకేసారి పదేపదే చదవడం వల్ల జరిగిన పొరపాటది. ఏదేమైనా ‘రావణజోస్యం’ ప్రస్థావన కూడా ‘పుడింగి’లో ఉండి ఉంటే – సంపాదకుడిపై రాజకీయ శక్తుల ప్రభావమనేది ఎలా ఉంటుందో పాఠకులకు చెప్పినట్టు అయ్యేది కదా అని ఉద్దేశ్యం.
    – గొరుసు

  6. Jampala Chowdary

    @jagadeeshwar reddy:

    జగదీశ్వర రెడ్డి గారూ:

    ఇప్పటివరకూ ఉమామహేశ్వరరావుగారి వ్యాఖ్య ఒకటే వచ్చింది ఈ సైట్లో. దాన్లో రావణజోస్యం ప్రసక్తి లేదు. ??

  7. Jampala Chowdary

    ఒక సవరణ/ వివరణ:

    రెండవ పేరా చివరిలో ఉన్న – … నిలుకు లేకుండా పుస్తకమంతా పూర్తి చేశాము నేనూ, అరుణా. దేవినేని మధుసూదనరావుగారి పుణ్యమా అని మా ఇంట జేరిన మూడో రోజుకే ఇద్దరం చదవడం ఐపోయింది. – వాక్యాలని దేవినేని మధుసూదనరావుగారు (వీరి ప్రస్తావన ఈ పుస్తకంలో ఉంది) మా ఇంట జేరిన అన్న అర్థంలో కొందరు అర్థం చేసుకుంటున్నట్లు తెలిసింది. దేవినేని మధుసూదనరావుగారి పుణ్యమా అని పుస్తకం మా ఇంట జేరిన మూడో రోజుకే ఇద్దరం చదవడం ఐపోయింది అనే అర్థంలో వ్రాసిన వాక్యం అది. సరి చేశాను.

    దేవినేని మధుసూదనరావు గారితో నాకు ప్రత్యక్ష పరిచయం లేదు. నేను ఇప్పటి దాకా కలవలేదు. కొన్నాళ్ళ క్రితం ఇండియానుంచి వర్జీనియా వచ్చిన మధుసూదనరావుగారు, మిత్రులు నాకు ఇండియానుంచి ఆయనతో పంపిన పుస్తకాలు మెయిల్ చేయటానికి నా అడ్రెస్‌కోసం ఫోన్ చేసినప్పుడు మాట్లాడుకోవటమే మొదటి సంభాషణ. ఆ సంభాషణలో ఆయన దగ్గర ఈ పుస్తకం ఉందని తెలిసి నేను అడగ్గా మిగతావాటితో పాటు ఈ పుస్తకం కూడా పంపారు. వారికి నా కృతజ్ఙతలు. ఈ పుస్తకం చదవొద్దు లెండీ అన్నారాయన పాపం; వింటే నేనెలా ఔతాను?

  8. Ravikiran Timmireddy

    క్షమించాలి, జంపాల చౌదరి గారి పేరు ప్రసాదని నా మనసుకెందుకనిపించిందో నాకు తెలీదు. జంపాల గారు I am really sorry.

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  9. చంద్ర కన్నెగంటి

    ముందుగా నామిని భాష గురించి రెండు ముక్కలు –
    మొదటిసారి ఆ “బూతు” మాటల్ని చదివినప్పుడు ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగాయి (“ఈడెమ్మ ఏం రాశాడ్రా!” అనుకునే స్థాయి నుంచి అప్పటికే ఎదిగిపోయాము కదా!)మా ఊళ్ళో వినిపించే మాటలు అప్పటిదాకా ఎక్కడా చదవక. “నా బట్టా” అనే పిలుపు ముద్దుగానో, చెతుర్లాడుకూంటూనో అనుకునే మాటల్లో వినడం నాకు గుర్తే. బూతుమాటలన్నిటికీ రోత అర్థమొకటే ఉంటుందనుకోవడం సరికాదు. అది మనం నేర్చుకున్న నాగరికత చేస్తున్న గారడీ.

    ఇంకా ఈ పుస్తకం చదవలేదు కానీ, చదివిన సమీక్షలనుబట్టి అనిపిస్తున్నది ఇదీ –

    రచయితగా నామిని కల్పించి రాయలేదు(డు), ఉన్నది దాచలేదు(డు). అదే ఆయన బలమూ, బలహీనతా. రచయితలు నిజాయితీగా రాయాలని చెపుతూనే ఇంత నిజాయితీని భరించలేమని తెలుసుకుంటాము. “అనంతం” నేర్పిన పాఠమూ అదే. అంటే మనకు కావలసిందెప్పుడూ మంచితనమే, దొంగదీ, తెచ్చిపెట్టుకున్నదీ కానిది.

    రచనలకూ, రచయితకూ మధ్య మనం సమన్వయపర్చుకోలేని వైరుధ్యం ఉండడం కొత్తేమీ కాదు. వాళ్ళ వ్యక్తిత్వాలను వదిలేసి రచనల్ని స్వీకరించడమూ కొత్త కాదు. కొత్తేమిటంటే ఆ రచయిత బాహాటంగా తన వ్యక్తిత్వాన్ని అన్ని లొసుగులతోనూ మన ముందు పర్చడం, తనూ, తన రచనలూ వేరు కాదని చూపడం. ఈ పుస్తకంలోని అన్ని విషయాలూ మనకు నోటిమాటగా తెలిసి ఉంటే వేరేలా స్పందించేవాళ్ళమేమో! ఇవే విషయాలు కొంచెం దాచేసుకుని కాసిని నగిషీలద్ది రాసినా సినబ్బ కథల్లాగా మురుసుకుంటూ చదివే వాళ్ళమేమో!

    ఇది ఆత్మకథే అయితే నామిని రచయితగా తనకు తాను ద్రోహం చేసుకోలేదు, మనల్నీ మోసం చేయడం లేదనిపిస్తుంది. వ్యక్తిగా ఎదిగినట్లో, దిగజారినట్లో గానీ ఇంతకుముందులా మాత్రం పాఠకులెవరూ చూడలేకపోతున్నారనీ తెలుస్తుంది.

    ఎప్పుడయినా నెత్తిన పెట్టుకోవలసింది కళనే కానీ కళాకారుల్ని కాదు. వాళ్ళూ మామూలు మనుషులే, మన లాగే.

  10. jagadeeshwar reddy

    నామిని ‘పుడింగీ’పై జంపాల చౌదరిగారి అభిప్రాయం, ఆ తర్వాత ఇప్పటిదాకా జరిగిన చర్చంతా చదివాను. ‘ఉమా’ అభిప్రాయంలో ‘తను కూడా రావణజోస్యం విషయం ఉంటుందని ఆశించినట్టూ, అది లేకపోవడంతో- రావణజోస్యం నామినికి అంత ముఖ్యమైన విషయం అనిపించి ఉండకపోవచ్చు’ అని రాశాడు.
    ఉమా! అది అంత ముఖ్యమైన విషయం కాకపోవడం ఏమిటి? ఎంత రభస జరిగింది! నామినిగారు వీక్లీ ఎడిటర్‌గా ఉండగా ‘రావణజోస్యం’ కథని ప్రారంభించగానే ఆర్‌.ఎస్‌.ఎస్‌.వారు ఆంధ్రజ్యోతి ఆఫీసుకు వచ్చి కుర్చీలు, బల్లలూ ఎత్తేసి విరగ్గొట్టిన సంగతి … ఆ తర్వాత ‘రావణజోస్యం’ తర్వాతి భాగాల ప్రచురణ ఆపేస్తే మీరంతా కసి కొద్ది ఆ కథని చిన్న పుస్తకంగా వేయడం, ఆ సందర్భంగా ఆ కథా రచయిత డి.ఆర్‌.ఇంద్రని రాజమండ్రి నుండి రప్పించడం, ఆ దాడిని ఖండిస్తూ బషీర్‌బాగ్‌ ప్లెస్‌ క్లబ్‌లో మనమంతా మీటింగు పెట్టుకోడం (ఆ సభలో రంగనాయకమ్మగారు ఆ దాడిని ఖండిస్తూ రాసి పంపిన ఉత్తరాన్ని ఎవరో చదివి వినిపించారు కూడా), ఆ పుస్తకాలని ప్రెస్‌క్లబ్‌కు వచ్చిన వారికందరికీ పంచడం, తర్వాత అక్కడ్నుంచి మనందరం ర్యాలీగా నడుచుకుంటూ (బంజారా హిల్స్‌, రోడ్‌ నెం.3లోని) అప్పటి ఆంధ్రజ్యోతి ఆఫీసుకు రావడం, వచ్చి – అప్పటి సంపాదకులు ఐ.వెంకట్రావుగార్కి మెమొరాండమ్‌ సమర్పించడం … ఇవన్నీ ఒక పాత్రికేయుడిగా నామినిగారు మర్చిపోయే విషయాలు కాదనుకుంటా. మరెందుకని వాటిని విస్మరించారో తెలీదు. ఈ గొడవ జరిగి దాదాపు 12 ఏళ్లు కావస్తున్నా కళ్లకు కట్టినట్టుగా ఉన్నాయి నాకింకా.
    – గొరుసు

  11. anil

    “సత్యం గడప దాటెలొపల అసత్యం ప్రపంచాన్ని చుట్తి వస్థ్తండి”

    నామిని పుడింగె. ఎంధుకంఠె, ఈ పుస్థకం ఈకబిగిన రెందు రొజుల్లొ చదివను. ఎక్కడ బొరె కొత్టలెదు. అస్చర్యం వెసింది. ఎంది మనిషి, ఇంత బొలాగ మట్లడుతున్నడు అనిపించింది. నాకు బాగ నచ్హింది.

    జంపాల గారు!

    పాత నామిని చెతిలొ కొథా నామిని హథ్య కాలెదు. నామిని మరొ రుపం లొ జన్మించాదు. జననం లెద మరనం చుసె చుపులొ వుంతుంది. ఈ పుస్థకం మనిషి అద్దం ముందు నిలబది నగ్నంగ , తనను తను చుసుకొవతం లంతి ప్రయథ్నం. మంచి ఎవరైన చెప్థరు. కని తన తప్పుల గురించి ప్రపంచనికి చెప్పతనికి ధర్యం కావలి. ఆ ధర్యం నామిని కి వుంది.

    నామిని ఒ రచయిత. అతను ఒ పతకుదె. అతనికి నచ్హని రచయితల గురించి అతదు చెప్పదు.. అది అథని అబిప్రయం. మి అభిమన రచయిథలు నమినికి నచ్హలెదని , నామిని పి దందెథతం ఎంథవరకు సమంజసం?

    నా పెరు అనిల్. హ్య్దెరబద్ లొ సొఫ్త్వరె ఇంజినీర్ గ పనిచెస్థున్నను. నా అభిమన రచయిథల్లొ నామిని వున్నదు. కెశవ రెడ్ది వున్నదు. నామిని కి కెశవ రెడ్ది నచలెదని, నెను , నామిని పి దందెథతం అవివెకం. ఎవరి ఇస్తలు, అయిస్తలు వరివి.

    తెలుగు సహిథ్యం లొ ఈ పుస్థకం బత్తలు లెని పుస్త్కకం. ఔథెంతిచ్ మనిషి పుస్థకం. మంచి పుస్థకం. ముసుగులు లెని పుస్థకం. మనిషి జివన ప్రయనన్ని పొస్త్మర్తెం చెయతం లంతిది.

    ఈ పుస్థకం గొస్సిప్ అన్నరు. అంతె నామిని మిగిలిన పుస్థకల్లొని వ్యక్థుల జివిథం కుద గొస్సిప్ ఈ న?
    అది సహిథ్యం , ఐథె ఇది సహిథ్యం ఈ. ఈ పుస్థకం లొ, నామిని ని ఒ పత్ర లగ చుదవంది. రచయిత ల కాదు.

    ఒ మనిషి తన జివిథ ప్రయనం లొ , ఒ సారి వెనక్కు తిరిగి చుసుకుంతె , తన బాదలు, అనంధలు, తప్పులు, ఒప్పులు అన్ని, మైలు రల్లు కనిపించై. ఆ మనిషి వతిని, ఒ పుస్థకం ల రసదు.

    నకు పుస్థకలన్న, జీవిథం అన్న చాల ఇస్తం. అంధుకె “నామిని నుంబెర్ ఒనె పుదింగి” పుస్థకం నకు ఇస్తం.

    ——అనిల్ , సొఫ్త్వరె ఇంజినీర్, బాగ్య నగరం.

  12. రవి

    అబ్రకదబ్ర గారు: మీరు నామిని మీద చేసిన విమర్శల్లో కొన్ని generalizations అని చెప్పకతప్పదు.

    >>‘నామిని తన హృదయంలోంచి రాస్తాడు’ అనేది ఆయన లేకి భాషపై వచ్చే విమర్శలకి ఆయన అభిమానులిచ్చే సమాధానాల్లో తప్పనిసరిగా కనపడే వాక్యం.

    లేకి భాష?? అంటే ఏమిటండి? నామిని రచనల్లో తండ్రులను బూతులు లంకించుకోవడం అనేదొక్కటేనా మీకు కనబడ్డది? మీకు నామిని పుస్తకాల్లో కనిపించిన ఆ ఒక్క విషయం వల్ల లేకి అని అంటున్నారా? లేదూ ఆయన వాడిన యాస (లేదా మాండలికం) ’లేకి’ అంటున్నారా? అలాగయితే ఆ యాసలో, అదే మాండలికంలో అవే పదాలతో కొన్ని లక్షలమంది మాట్లాడుతున్నారు. వాళ్ళందరిదీ లేకిభాషేనంటారా?

    >>సహజత్వం పేరుతో కాలకృత్యాలు తీర్చుకోవటాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూపిస్తే అందులో అతని నిజాయితీ చూసి మెచ్చుకుంటామా, ఏవగించుకుంటామా?

    ఇదివరకెప్పుడో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా మీద గొల్లపూడి వారు ’naked reality cannot be an art’ అని వ్యాసం రాస్తే స్లం డాగ్ మిలియనీర్ ను సమర్థిస్తూ, గొల్లపూడి వారి మీద విరుచుకుపడినట్టున్నారు?

  13. Ravikiran Timmireddy

    సందేహవేవి లేదు. అది నామిని గారు వ్రాసిన అభిప్రాయవే. ప్రసాదు గారు మీరు సైకియాట్రిస్టులు, మీకు చెప్పగలిగిన వాడిని కాదు. కానీ నా రెండు సెంట్లు నేను కంట్రిబ్యూట్ చెయ్యాల కదా.

    ప్రసాదు గారు, మీకు తెలియందేవి కాదు మనుషులు రకరకాల మాస్క్లేసుకోని తిరుగుతారు మనసుమీద. ఆఫీస్లో ఒక మాస్కు, అక్కడె మళ్ళా బాసు దగ్గర ఒక మాస్కు, కొలీగ్స్ దగ్గర ఒక మాస్కు, బయట స్నేహితులదగ్గర ఒక మాస్కు, ఇంట్లో ఒక మాస్కు. ఇంకా రకరకాల మాస్కులు మనకి, మనుషులకి. మా జోయీకి (నా రెండో కూతురు మా జోయమ్మ, గోల్డన్ రిట్రీవర్ ) అవేం వుండవు. కానీ మనకి మాత్రం వుంటాయి. పెద్ద పుడింగి లాగా (నేను నెల్లూరు, పుడింగంటే ఏందో నాకు తెలుసు) నా గురించే కాక నలుగురి గురించి ఈడు చెప్పేదేంది అనుకోబాకండి. నేను చెప్పేది మీక్కూడా ఖచ్చితంగా రైటని నేను చెప్పటం లేదు, నా ఉద్దేశవేదో నేను చెప్తున్నాను.

    ఈ బుఖాలు సహజవైన సమాజం లో, ఎవరన్నా ఆ బురఖాలన్నీ పీకి పడేసి, మొండి గుద్దలతో (బూతని భయపడకండి, మా నెల్లూరులో ఇది చాలా కామన్ గా వాడతారు) నిలబడితే, మనం వాడే ఇన్ని బురఖాల్లోనించి మన నిజ స్వరూపాన్ని మనం చూసుకోవటం మనకి కొంచం కష్టంగానే వుంటుంది. ఇంత కాలం మనం మన ఇంట్లో గోడలకి మనం శీలలుగొట్టి తగిలించిన మాస్కులన్నీ, మనం అసహజంగా, ఎంతో కష్టపడి రక్షించుకున్న ఆ విలువలన్నీ ఆ దిశమొల ముందు ఎందుకు కొరగాకుంటా పోతుంటే, మనలో మన రక్తాన్నే కాకుండా మన చీవుని కూడా చూసుకోవాల్సొస్తే, మనం బురఖాల క్రింద ఇంత కాలం దాసి పెట్టుకున్న మన జీ క్రింద మన మచ్చని మనం చూసుకోవాల్సొస్తే, అది ఖచ్చితంగా అందరకీ నచ్చదు.

    నామిని పచ్చ నాకు సాక్షిగా వ్రాసి నప్పుడు ఆయన వంటి మీద వలువల్లేవు, కాకపోతే అప్పుడు ఆయన వంటిమీదే లేవు, మన మీద ఒకటికి నాలుగు వలువలున్నాయి. ఈ పుడింగితో ఆయన మన మన మీద, మనకు తెలిసిన వాళ్లమీద, మనకు నచ్చిన వాళ్ళ మీద అందరి మీదా ఆ ముసుగులు, ఆ బురఖాలు, ఆ వలువలు ఆన్నీ తీసేసి నిలబెట్టేడు ఆయనతోపాటు. అదీ మన ప్రాబ్లమ్, అదీ మనకు కష్టవేసేది, అదీ మనకు నచ్చనది, రామ్మోహన రావు గారికి నచ్చనిది, సోమరాజు సుశీల గారికి నచ్చనిది, వాళ్ళు ఏదోవిధంగా సమర్ధించుకున్నది, మీకు కూడా నచ్చనిది, బహుశా (ఇదొక ముసుగు) నాకు కూడా నచ్చనిది.

    మరొకరి దిశ మొలైతే మనకేవి నష్టం లేదుగాని, అది మనదైతే మనం ఇంత కష్టపడి చేసిన ఈ యాక్టింగ్ అంతా మట్టిపాలేనా? మనం ఇంత అందంగా వుంటావా? ఇంత అసహ్యంగా వుంటావా? ఇంత వినయంగానూ, ఇంత అతిశయంగానూ వుంటావా? ఇంత మంచిగానూ, ఇంత చెడ్డగానూ వుంటావా? మనం నిజంగానే ఇట్లాగా మనుషులుగా వుంటావా? మంచి చెడు, నవ్వు, ఏడుపు, గొప్పతనం, అశహ్యం, ఇవన్నీ కలగలిసిన మనుషులుగా వుంటావా? ప్రసాదు గారు, రామ్మోహన రావు గారు, సోమరాజు సుసీల గారు, బ్లాగరు గారు?

    మీకేవైనా అనుమానవుంటే నామిని గారి పుడింగి కథ చదవండి.

    -రవికిరణ్ తిమ్మిరెడ్డి

  14. chavakiran

    అబ్రకదబ్ర గారు,
    >>> ఎంత పల్లెటూర్లలోనైనా (అది చిత్తూరు కావచ్చు, గుంటూరు కావచ్చు, గోదావరి కావచ్చు) తల్లిదండ్రుల్ని బూతులకి లంకించుకునే గుణం ఆప్యాయతలకీ ఆత్మీయతలకీ నిదర్శనం అనేది సత్యదూరం.
    ప్రపంచమంతా మీ ఇంట్లో ఉండట్టే ఉంటుందా అండీ.

  15. Jampala Chowdary

    @పుస్తకం.నెట్ / నామిని:

    నామిని గారూ:

    విపులంగా మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. (ఈ వ్యాఖ్య మీరే రాశారని అనుకొంటున్నాను; కాకపోతే ఈ వ్యాఖ్య రాసినవారికి సమాధానం అనుకోండి.)

    ఊరు చూడమంటే ఉత్తరం చూసిన ప్రతిసారీ చూసినవాడిదే తప్పు అవదు; ఒక్కోసారి చూపించిన తీరులో ఉంటుంది, ఇంకోసారి అలా చూడవలసిన అవసరమూ ఉంటుంది. గారడీవాడు చూడమన్నవేపే చూస్తే మేజిక్కులు జరిగిపోతాయి. గారడీవాడి చేతులవంక చూస్తేకాని విషయం తెలీదు.

    స్వంత కథని ఆత్మకథ అంటారని మీకు తెలియదు అనుకోను. మీరు ఏ పేరుతో పిలచినా, ఇది మీ స్వంత కథ; అందుచేత నా దృష్టిలో ఆత్మకథే. ఆత్మకథల్లో ఆత్మస్తుతీ, పరనిందా ఉండాలన్న రూలేమీ లేదు. రాసినవారి వ్యక్తిత్వాన్ని బట్టి అవి ఉండవచ్చు, లేకపోవచ్చు. నాకు మీ పుస్తకంలో ఆత్మస్తుతీ, పరనిందా, ఆత్మనిందా కనిపించాయి. మీకు కనిపించలేదు. ఈ కనిపించడం కొంత తమాషా విషయం లెండి; చూసే చూపు, చీకటీ వెలుతురు వంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మేము మిమ్మల్ని ఎంత అభిమానించేవారమో వివరించాననుకుంటే, దానిలో నాకు కనిపించని అతిశయం మీకు కనిపించలేదూ? అన్నట్లు, నేను ఇంతకు ముందు ఇక్కడ చెప్పని విషయం – సందర్భం వచ్చింది కనుక చెబుతున్నాను – మా కోసం మీరు పనిగట్టుకుని ఇంట్లో ఉండటమే కాదు, మీరు, ప్రభావతి గారు మంచి భోజనం పెట్టారు; రైలు ప్రయాణానికి కేరేజ్ కట్టి మరీ ఇచ్చారు. కృతజ్ఙతలు బహిరంగంగా చెబుతున్నాను.

    వేరేవాళ్ళ గురించి కబుర్లు చెప్పటాన్ని గాసిప్ అనే అంటారు; చెడ్డ రసాయనాలూరే అవకాశమున్నా, అదొక్కటే కాదు పుస్తకాన్ని చదివించింది. కళ్ళ ఎదుట ఒక మనిషి తన్ని తాను చంపుకొంటుంటే ఆపలేని పరిస్థితిలో చేష్టలుడిగి చూస్తున్న నిశ్చేతనస్థితి కూడా.

    మీ పుస్తకంలో మిమ్మల్ని కష్టపెట్టిన కొందరి గురించి చెప్పిన మాటల్ని చదివి అయ్యో అనుకున్నాను. ఆ వ్యక్తులతో నా అనుభవాలు వేరుగా ఉంటే మీ అనుభవాలు మీవి అనుకున్నాను. వాటిపై విచారణ చేసి తీర్పులు చెప్పే ఉద్దేశం నాకు లేదు. అది నా పని కాదు. కాని (ఉదాహరణకు) మీ నిధి కోసం లక్షరూపాయలిచ్చిన వరప్రసాదరెడ్డిగార్నీ, పదివేలిచ్చి పుస్తకాలు కొనుక్కున్న పరిమిగారినీ మీరు ఆక్షేపించిన తీరు నాకు సమంజసంగా అనిపించలేదు.

    మీ ఇంతకు ముందు పుస్తకాలు చదివినప్పుడూ, ఈ పుస్తకం చదివినప్పుడూ, నాకు మీపట్ల కలిగిన భావాల్ని నిర్మొహమాటంగా చెప్పాను. మొదటివెంత నిజమో (లేక అబద్ధమో) ఇప్పటివీ అంతే అవ్వచ్చు; కానీ ఈ పుస్తకంలో నామిని నా భావనలో ఉన్న పాత నామినిని చంపేసిన మాట వాస్తవం. అది నాకు చాలా బాధాకరమైన విషయం. ఆ బాధ మీకు కనిపించకపోవటం దురదృష్టం.

    మిమ్మల్ని నేను గేలిచేస్తున్నాను అన్నారు; అది నా ఉద్దేశం కాదు. హేళన చేయాలనుకుంటే నా రాత తీరు వేరేగా ఉంటుంది. నాకు పుడింగి అంటే అర్థం తెలీదు అని చెప్తుంటే, మిమ్మల్ని నేను పుడింగి అని పిలిచిందెక్కడ? తగినా, తగకపోయినా అది మీరు పెట్టుకున్న పేరే.

    కతలు చెప్పటంలో మీరు మొగలాయీ అనే నేనన్నాను. మిమ్మల్ని రచయితగా అంగీకరించనివారిలో నేను లేను. ఈ పుస్తకం మూసేశాక నేను చేసిన పని మిట్టూరోడి పుస్తకం చదవటం; అరుణ చదువుతుంది నామిని ఇస్కూలు పుస్తకం.

    ఈ పుస్తకం గురించి ఇంకా మాట్లాడటమూ, మాట్లాడకపోవటమూ మీ ఇష్టం. మా అభిప్రాయాలేమిటో చెప్పుకోవటం మా ఇష్టం.

  16. అబ్రకదబ్ర

    షేక్‌స్పియర్ అన్నట్లు – గొప్పదనం కొందరికి పుట్టుకతో వస్తుంది, మరి కొందరు కష్టపడి సంపాదించుకుంటారు, ఇంకొందరికది ఆపాదించబడుతుంది. తెలుగు సాహిత్యానికి సంబంధించి – నామిని ఈ మూడో రకానికి చెందుతాడు. తన రచనల్లో లేని లోతులు కొలిచి తననింతవాడిని చేసిన తెలుగు సాహితీ విమర్శకులకి ఆయనెంతో రుణపడి ఉండాలి (విమర్శకులకి, సమీక్షకులకి (ఉదా: ఆయన తాజా ఆత్మఘోష పుస్తకమ్మీద సాక్షివారు వేసిన సమీక్ష!)

    ‘నామిని తన హృదయంలోంచి రాస్తాడు’ అనేది ఆయన లేకి భాషపై వచ్చే విమర్శలకి ఆయన అభిమానులిచ్చే సమాధానాల్లో తప్పనిసరిగా కనపడే వాక్యం. రచయిత రాసేది తన హృదయంలోంచి వచ్చిందా, జీవితంలోంచి వచ్చిందా, జేబులోంచి వచ్చిందా, అతను వ్యక్తిగతంగా ఎలాంటివాడు …. ఇలాంటి వివరాలు ఆయా రచనల్ని బేరీజు వేసే పరికరాలు కారాదు. కొన్నిరకాల శృంగార కథలు రాసేవాళ్లు సైతం వాటిని గుండెలోతుల్లోంచే రాస్తారు. అంతమాత్రాన ఆ రకం కథలు ఆణిముత్యాలవవు కదా. సహజత్వం పేరుతో కాలకృత్యాలు తీర్చుకోవటాన్ని ఏ సినిమా దర్శకుడైనా చూపిస్తే అందులో అతని నిజాయితీ చూసి మెచ్చుకుంటామా, ఏవగించుకుంటామా? ఎంత పల్లెటూర్లలోనైనా (అది చిత్తూరు కావచ్చు, గుంటూరు కావచ్చు, గోదావరి కావచ్చు) తల్లిదండ్రుల్ని బూతులకి లంకించుకునే గుణం ఆప్యాయతలకీ ఆత్మీయతలకీ నిదర్శనం అనేది సత్యదూరం. అయితే గియితే, అది కోపతాపాల ప్రదర్శనకో సాధనం మాత్రమే.

    ఈ ‘పుడింగి’ పుస్తకం విషయానికొస్తే (ఇది తమిళులు తరచూ వాడే పదం. తమిళనాడు సరిహద్దుల్లో ఉండేవారికీ వంటబట్టే అవకాశముంది), అది నామినివారు తన రచనల్ని అచ్చొత్తేవారు, వాటిని చదివేవారు, చదివాక మోసేసేవారు – అందరిపై టోకున సంధించిన జోక్. He must be laughing his head off observing all these discussions going on about this book.

    ఈ సందర్భంగా నాకు అల్ పచీనో సినిమా Simoneలో ఓ సన్నివేశం గుర్తొస్తుంది. ఆ సినిమా చూసినవారికి అదేంటో తెలిసిపోవాలి 🙂

  17. Jampala Chowdary

    @కత్తి మహేష్ కుమార్:

    మహేష్ కుమార్ గారూ: మీరేనా? మీ మాటలకు ఇప్పుడు ప్రామాణికం తెలుగు సినిమాలా? ప్చ్, ప్చ్! 🙂

    జండర్ సెన్సిటివిటీ ఉన్నవారు పాతవాడుకలను తాముగా వాడరని నేను మీకు చెప్పక్కర్లేదు.

    మేధావిత్వం, వెధవాయిత్వం ఒకే చోట ఉండటంలో నాకెట్టి ఆశ్చర్యమూ లేదు.

  18. Jampala Chowdary

    @Srinivas Vuruputuri: మీరే కరెక్టు. కథ పేరు రావణజోస్యం. డి.ఆర్.ఇంద్ర రచయిత. సవరించాను. థాంక్స్.

    అన్నట్లు, పైన నామినిపై దౌర్జన్యం అంటూ ఇచ్చిన లింకు, రచ్చబండ తెలుగు ఇంటర్నెట్ చర్చావేదికలో మొదటి పోస్టు.

  19. పుస్తకం.నెట్

    నామిని అన్న పేరుతో ఈ వ్యాఖ్య వచ్చింది. అయితే, ఈమెయిల్ అడ్రస్, ఐ.పీ.అడ్రస్లను బట్టి చూస్తే, ఆయన పేరుతో ఎవరో రాసిన వ్యాఖ్యలా అనిపిస్తోంది. అయినా, ఇదొక దృక్కోణం అన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాఖ్య ప్రచురిస్తున్నాము.

    *****************************************
    జంపాల చౌదరి సా!
    ఊరు చూడమంటే పిడికెడు మంది వుత్తరం చూస్తారు. ఆ పిడికిట్లో మీరూ వుండారు. నామిని నెంబర్ వన్ పుడింగి – అనే పుస్తకం మింద మీరు రానిన సమీక్షను చదివినాను. పాయింట్ల వారీగా నా జబాబిది:
    1) మన శరీరంలో అపెండిెనైటిన్ మాదిరిగా ఒకమూల ఆత్మ అనేది వుండదేమో. ఆ పుస్తకంలో నేనెక్కడా ‘ఆత్మకథ’ అని రాయలేదు. ఎవరో ఆత్మ వున్న మహనీయులు రాేనటివి ఆత్మకథలు. కానీ పుడింగి పుస్తకం చదివి దాన్ని ఆత్మకథ కింద లెకేే్కనేన్త నేనేమి చేద్దును?

    2) గానిప్స్ చదివినట్టు పుస్తకాన్ని చదివేనినాను అని అన్నారు. పది మంది చేత ఊపిరాడకుండా చదివించేద్దాం అని నేనేమి గానిప్స్ రానినానో నాకు అర్థంకావడం లా. నేను రానిందేందంటే ఒక కతగా – ఒకటిన్నర రెండెకరాల రైతుకు సుబ్రమణ్యం అనే వాడు చిన్నకొడుకు. వాడు డిగ్రీ చదవతా వుండినా కొ.కు అంటే ఎవరో తెలవదు. అట్టాంటివాడి కండ్లముందర వాడికి అన్యాయం అనిపించింది ఒకటి జరగడంతో దాన్ని తెల్ల కాగితం మింద పెట్టాలనుకుంటాడు. అట్లా అట్లా ఆ వుచ్చులో పడి చానాదూరం పోయి కతలు రాేన ‘నామిని’ అవుతాడు…. వుద్యోగంగా పత్రికల్లోనే చేరతాడు. పెండ్లి కూడా పంతానికి పోయి చేసుకుంటాడు. వొట్టి మొండితనం, మూర్ఖత్వంతో వుంటాడు. చాలాయేండ్లకు వాడికి ఎడిటర్ హోదాలో హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అవుతుంది. చీటీ వుంటే ఒకటి పాడుకొని నగరంలో ఎడిటర్గా అడుగుపెడతాడు. వాడు రానిన సాహిత్యం ద్వారా వాడికి బతుకు భయం వుందని, వున్న వుద్యోగం పోతే బతకలేడని అందరికీ తెలినిపోతుంది. ఐదంటే ఐదువేలు వాడు లంచం అడిగినాడని చెప్పి ప్రెన్ ెనక్యూరిటీని కూడా దాటుకొని ఆఫీసులోనే వాడిని పోలీసులు పట్టుకొని పోతారుకూడా. ెనవన్ నీటర్ ఆటో ఎక్కే ఎడిటర్కి ఇంతేలే అని గమ్మన పడివుంటాడు. ఇంతలో వుద్యోగం కూడా పోతాది. వాళ్ళ సహాయంతో వీళ్ళ సహాయంతో సొంత పుస్తకాన్ని కొడుకు పేరుతో ‘టామ్సాయర్ బుక్స్’ కింద అచ్చువేసుకుంటాడు. అప్పట్లో సందర్భవశాత్తు పబ్లిషర్లూ, వాళ్ళూ వీళ్ళూ కనీసం ఒక మనిషికి ఇచ్చే మర్యాద కూడా ఇవ్వలేదని అంతకు ముందు పుస్తక ప్రచురణకు సంబంధించి జరిగినవి కూడా చెప్పుకొని మనస్తాప పడతాడు. నగరంలో ఇంకెదుకులే తిరప్తికి వూరు దగ్గర, కర్చు తక్కువ కాబట్టి తిరిగొచ్చేస్తాడు. అట్లా ఒకరోజు చిన్న పిల్లలకోసరం ఒక పుస్తకం రాని దాన్ని రకరకాలుగా పిల్లల్ని కలిని అమ్ముకొనేదానికి ప్రయత్నిస్తాడు. ెనైకిల్ కొంటాడు. వాడు పొట్టి, జిల్లా యాసలో తప్ప వేరే మాదిరిగా మాట్లాడలేడు. కన్ను మెల్ల. నలబైయేండ్లకే తల నెరనిపోతుంది. రంగేసుకోడు. పెళ్ళాన్ని హీరో హోండా ెునకన కూర్చోబెట్టుకొని తిప్పలేడు. చానామంది బాగా మెచ్చుకొనే రచయిత కూడా వాడు. పుస్తకాలను ఆధారంగా చేసుకొని బతకాలనుకున్నోడు – వాడికే విచిత్రంగా పిల్లలు చానా ఇష్టపడి పుస్తకాల్ని ఎగబడి కొంటూంటారు. పిల్లల దగ్గరకి వెళ్ళి కతలు చదివి వినిపించి వాళ్ళచేత కొనిపించడమనేది వాడికి ఒక వ్యసనం మాదిరిగా అయిపోతుంది. రియల్ ఎేన్టట్ విషయాలు కూడా బాగా తెలినినవాడే. ఒక ెనైట్ను నిట్టనిలువునా అమ్మి రెండు లక్షలు ఎత్తుకొని శివకానికి పోయి లక్షపుస్తకాలు వేసుకొని వస్తాడు. ఇట్లా పిల్లల దగ్గరికి పోవడం పుస్తకాలు అమ్మడం పనుల్లోకెల్లా మంచిపని అని ఒక ఉన్మాదానికి లోనై ఆ పనిలో రెండేండ్లు గడుపుతాడు. ఇట్లా ఒక రచయితని, వాడి కష్టాన్ని, బతకలేక వాడు వేేన వెర్రిమొర్రి వేషాల్ని (కరస్పాండెంట్ల కాళ్ళు పట్టుకోవడం కూడా) కొంచేపు కుశాలగా, కొంచేపు మనేదగా చెప్పుకుంటా వుంటాడు. లోకంలో ఈ పనికి స్కూళ్ళవాళ్ళనుంచి ఏమాత్రం ప్రోత్సాహం వుండదు. ఆ పనిని ఆపేస్తాడు. దొంగెత్తువేని అతను రానిన పచ్చనాకు సాక్షిగా అనే పుస్తకానికి 25 ఏండ్లు అయింది అంటే అప్పనంగా లోకం వాడికి పది లక్షలు ఇస్తుంది. పనిచేనినప్పుడు అతనికి అవమానం జరిగి, దొంగెత్తు వేనినపుడు డబ్బువచ్చేసరికి నవ్వుకొని వాడి గోలంతా పాఠకుల్ని ేన్నహితులకంటే ఎక్కువగా భావించి కడుపులో వున్నదంతా చించుకుంటాడు.
    నాకు తెలినినంత వరకు నేను చెప్పిన కత ఇది. ఇందులో గానిప్స్ ఏమి వున్నాయో నాకు తెల్దు.
    3) ఈ పుస్తకాన్ని ఆత్మకథ కింద లెకేే్కనని అది ఆత్మకత కాబట్టి అందులో ఖచ్చితంగా ఆత్మస్తుతీ, పరనిందా వుంటాయని మీరనుకున్నట్టుంది. ఇంకా మీకు ఇష్టలు, సన్నిహితులు, మరికొంతమంది మీకు తెలియనివారి మిందకూడా కటువైన, కొంటెమాటలున్నాయని బాధపడ్డారు. ఇంకా ఇంకా పుస్తకం మొదటి నుంచి చివరి దాకా అతిశయం ప్రదర్శించినట్టు చెప్పారు. దీనికి నేను ఏమంటానంటే ….. నామిని అనేవాడు వాడికత వాడు చెప్పేటప్పుడు నేను నేను అని రాయాల్సిందే కదా! నామిని, నామిని అని చెప్పుకోలేడు కదా.
    నేను చీటీ ఈరకంగా పాడినాను, దొంగేనికం యేని ఫోను కనెక్షనుకు అప్పటి మార్కెట్ను బట్టి బాగానే డబ్బు చేసు కున్నాను, యీ యీ రకంగా ఐదరాబాదులో పడినాను అని అన్నా, జ్యోతి వీక్లీ ెన్పషల్ ఇష్యూ యీ రకంగా వేనినాను అన్నా, దాన్నికూడా సొమ్ము చేసుకున్నానన్నా, నేను దొంగబిల్లులు కొన్ని పెట్టినాను దరిద్రంగా అని చెప్పినా, తెల్లారి నిద్రలేచి రాగి జావ తాగతానన్నా, నేను కుచ్చున్నా, లేచినా… యేది చెప్పినా మీకు అతిశయంగా కనిపిస్తా వుంటే నేనేం చేేనది సా? పైగా మొదటి నుంచి చివరి దాకా కూడా అతిశయమే అని అంటున్నారు. రెండు సార్లు నాకోసరం పోలీసులు వచ్చినా పిల్లల్లో పనిచేస్తుంటే కరస్పాండెంట్లు మంచీ మర్యాద లేకుండా నానా మాటలు అంటున్నా … నేను నోరు తెరిేన్త మీకు అతిశయంగా కనిపించి భరించలేకపోతున్నారు. నామిని నామిని అని పుస్తకంలో పది సార్లు, నేను నేను అని వందసార్లు కనిపిస్తూ వుంటే మీకు రోతపుట్టిపోతుంటే… నేను ఏ ఏట్లో దూకేది చెప్పండి.
    నేను నాలో లేదనే ఆత్మ మీలోనూ ఉన్నట్టు లేదు. ‘పాలూ కూడూ తినేవాళ్ళలారా….’ ఇట్టా జరిగిందని నేను నెత్తిన నోరుపెట్టుకొని చెప్తున్నా మీరు మీ సన్నిహితుల్నీ, మీ ఇష్టల్నీ నేను అనరాని మాటలు అంటున్నట్టు మీరు ేన్నహధర్మాన్నే పాటిస్తున్నారు గానీ నేను చెప్పుకొన్నదాంట్లో ఆవగింజంత అపద్దం వున్నా నన్ను నిలదీయాలి. నువ్వు అబద్దాలు చెప్తున్నావు, నువ్విక్కడ అన్యాయంగా వేరే వాళ్ళను అంటున్నావు. అని నన్ను నిందించాలి. లేదంటే ేన్నహధర్మాన్ని కొదిే్దనపు కిందికి దించి, ‘అవునా యిట్లానా’ అని మీ ేన్నహితులనే అడగాలి. అప్పుడు మీరు సమీక్షుడిలా, న్యాయమూర్తిలా వ్యవహరించినట్టు. నేను మీ ేన్నహితులదగ్గరా అనిపించుకొని, అవన్నీ చెప్పినందుకు మీ దగ్గరా అనిపించుకుంటున్నాను. మీరు సమీక్షలో అంటున్నది చూస్తుంటే….. చూడు నామినీ! నువ్వు ఎన్ని పుస్తకాలు రానినా, నువ్వు పిల్లల్లో ఎంత పనిచేనినా… పేదవాడి కోపం పెదవికి చేటు అని తెలియదా? బొక్కబోర్లా పడతావు జాగర్తా అని అమెరికా అన్నయ్య ఇరాక్ తమ్ముడి మీదికి దూరి నట్టుంది.
    నా 212 పేజీల పుస్తకంలో మీకు మొదట నుంచి చివరి దాకా అతిశయం కనిపించిందంటున్నారు. నిజానికి మీ నాలుగు పేజీల వ్యాసంలో మీరెంత అతిశయం చూపించినారో చెప్తా వినండి. చదివే ఆయనికి రాేనవాడంటే ఎంతలోకువో కూడా చూడండి. మీరేదైనా ఒక పుస్తకాన్ని మీకోసం మీరు చదువుకొంటారు. రచయితల కోసం కాదు. 1989లో విజయవాడ వచ్చినపుడు నినబ్బ కతలు చదవడం, నవోదయ రామ్మోహనరావు పట్టుదలగా పచ్చనాకు సాక్షిగా… ెనకండ్ హాండ్ కాపీ సంపాదించి అమెరికా పంపడం, చదువులా? చావులా పుస్తకాన్ని మీరు చాలామందితో పంచుకోవడం… అలవోక పనుల్ని మీరు అతిశయంతో చెప్పుకున్నారు. ఇంకా రావణకాష్ఠం గొడవలప్పుడు నాపై జరిగిన దౌర్జన్యాన్ని మొట్టమొదట ఖండించడం కూడా నాకోసమేనా? మీ అతిశయానికి పరాకాష్టగా ‘రెండు’ సార్లు, ‘పనిగట్టుకుని’ నా కుటుంబాన్ని తిరపతిలో కలవడం! మీరు నన్ను కలవడానికి పనిగట్టుకుని ఒకసారి గూడా కాదు రెండు సార్లు వేన్త… నేను కూడా ‘పని గట్టుకుని’ ఆ రెండు సార్లూ యింట్లో వుండలేదా సా?
    కూలోడికి మొగబిడ్డ పుట్టకూడదా! (ఇది మా జిల్లా సామెత) మీకు మీ టైం ఎంత విలువైనదో దానికి తగినట్టే నా టైంకూ విలువ ఉండదా! మీరు చూపించిందేనా అభిమానం, నేను చూపించింది కాదా! ఒక రచయితను ఒక అమెరికా ఆయన కలినిందాన్ని కూడా అతిశయంతో చెప్పుకోవాల్నా మరి!
    ‘పరనింద’ ఎక్కువపాలైతే – యీ పుస్తకం చదివి నామినిని ఎంత బాగా ఎందరు ఏ లెక్కలూ వేసుకోకుండా చేతులు చాచి అక్కున చేర్చుకున్నారో చూడండని మీరు అనేవారా! నేను పిచ్చికుక్కలా అందర్నీ కరిచేద్దామనా ఆ పుస్తకం రానింది! లోకంలో అటు అభిమానమూ, ఇటు క్రూరత్వమూ సమంగా చెప్పుకోకుంటే ….. మీకు సాకం నాగరాజ మంచితనం తెలిసుండేదా! ఒకరింట్లో ఒక్కపూట చెయ్యి కడిగినా దాన్ని నేను ప్రశంస చెయ్య లేదా!
    ఇంక యితర రచయితలను ఎవ్వరినీ నేను మెచ్చుకోలేదనేది శుద్ధ అబద్దం. చలం, మునిమాణిక్యం, కొ.కు, మల్లాది, శ్రీపాద, జలసూత్రం… ఇట్లా ఎందరంటేనో నాకు ప్రాణమని చెప్పుకున్నదాన్ని మీరు పట్టించుకోనేలేదు.
    ఇంక కేశవరెడ్డి వంటి రచయితల మీద నా పాయింటు ఏమంటే – మీరు ‘మూగవాని పిల్లనగ్రోవి’ చదివినారా? దాంట్లో ఒకరైతు అర్ధరాత్రి జోరుమని వానకురుస్తుంటే ఎద్దుల్ని, మడకా కాడిమాన్నీ పొలం దాకా తీసుకొచ్చి, మోకాట్లోతు నీళ్ళలో మడక దున్నుతుండగా నాలుక గిటక్కరచుకొని చచ్చిపోయినట్టు రానినాడాయన. మీరు పల్లెటూరు వాళ్ళే కదా. జోరున వానలో పొట్టేలు పిల్లనూ కూడా బారెడు నడిపించలేం. ఒకవేళ ఎద్దుల్ని నడిపించినా ఒక రైతు అంత ఘోరంగా చచ్చిపోవాలంటే అన్ని నినిమా నీన్లు పెట్టాల్నా. భూమండలంమింద మున్నెమ్మ, గిత్తెద్దు కథ జరుగుతుందా. దేముడి దయవల్ల నేను రెండు ఎకరాల వాన్ని కాబట్టి మీరిప్పుడు మెచ్చుకునే పచ్చనాకు సాక్షిగా, మునికన్నడిేనద్యం, పాలపొదుగు…. వంటి రచనల్ని చేయగలిగానని, నాకు కూడా ఆరెకరాలు వుండుంటే రైతులమింద ఇంకా ఘోరంగా కతలల్లేవాడ్ని అని చెప్పినందుకు మీరు శిక్షలేస్తానంటే నేనేంచేయగలను తలవంచడం తప్ప! నింగమనేని నారాయణ సంపాదకత్వం వహించిన ‘నీమరైతు కత’ పుస్తకంలో నా కథే లేకపోయినప్పుడు నేను దాన్ని అవమానంగా అనుకోలేదు. నేను రానినవి కథలే కాదని ఇప్పటికీ వాళ్లూ, వీళ్ళూ ఇంటర్వ్యూలు ఇస్తున్నా నా తలగుడ్డేం కిందపడిపోలేదు. అట్లాగే నేను రావిశాస్ర్తి మీద, కేశవరెడ్డి మీద నా అభిప్రాయం చెప్పుకుంటే దానికి ఆగడం చేయాల్సిన పన్లా. దీన్ని హద్దుమాలిన అహంకారం కిందికి లెక్క ఏేనేన్త పోనీలెండి.
    సోమరి, అహంకారి, అతి తెలివి, మోసకారి… యీ తనాలన్నీ నాకుంటే నా పనిని మామూలు పాఠకులకు చెప్పుకొని చేయి చాచినట్టుగా అకౌంట్ నెంబరు యిచ్చే జోలికే పోను. మీలాంటి వాళ్లు గేలిచేస్తారని తెలుసు. సోమరి, అహంకారి అయ్యిందే నిజమైతే ెనైకిల్ మింద లక్షకాపీలేని ఊరూరూ తిరగనే తిరగను. అతి తెలివి వానె్నైతే ెనైట్ అమ్మి శివకానికి పోనే పోను. చేనిన కానింత పనిని ఒక ఫైలులా పెట్టుకుని ‘పిల్లల్లో పుస్తక పఠనాసక్తిని పెంచడం’ మీద ఒక స్వచ్ఛంద సంస్థనే పెట్టి అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ, తానాల చుట్టూ, ఆటాల చుట్టూ తిరిగి ఇప్పుడు మీరు డాక్టరుగా అమెరికాలో బతికే బతుక్కు మించి నేను తిరప్తిలో బతికుండేవాన్ని. పుస్తకాలు చదివే వాళ్ళను, వాళ్ళ ఇండ్లను సొంత ఇండ్ల మాదిరిగా అనుకోని నేను చేనిన పనిని చెప్పి ఇంకా చేయాలనుందని కుయ్యో మొర్రో అంటూ బీదా బిక్కీ అయిన పాఠకుల ముందే కళైన మొకంతో చేయిచాపినానంటే … నా తిక్కల తనం, కుడుమిేన్త పండగనే నా మనస్సు మీకు అర్థంకాకపోతే నేనేం చేేనది సా!
    సహాయాలను చేనిన వాళ్ళను కూడా నేను తూలనాడినట్లు మాట్లాడినారు మీరు. ఉదాహరణకు మీరు చదివిన హైస్కూలు పిల్లలకు మీరు నాదగ్గర పాతిక వేలకు పుస్తకాలు కొని, నామినీ! నీ మొహం చూని ఈ డబ్బు ఇస్తున్నా అని అనేనినారనుకోండి. అది తప్పే కదా! నన్నూ, మిమ్మల్నీ, మీరు ఒకప్పుడు చదివిన హైస్కూలు పిల్లల్నీ అందర్నీ అవమానించి నట్టే గదా మరి.
    పాత నామిని బహిరంగంగా కొత్త నామిని చేతుల్లోనే హత్యకు గురైపోతే అది నిజంగా నాకూ బాదే! అదే జరిగిపోయి వుంటే ఏం పర్లేదు. యిప్పటికి జరగలేదనే నా నమ్మకం. మీరు మాత్రం నా హత్యను ప్రకటించేశారు.
    పుస్తకంలో నేను ఇన్ని రకాలుగా చెప్పినా…. ఈ మాదిరిగా సమీక్ష రానినారే…. పుడింగి అని వాడంతట వాడే ఎగతాళి చేసుకుంటే… జరిగేది ఇదే! నేను చక్రవర్తి మొగలాయి పనిచేనినా ‘సరేలే పుడింగీ!’ అని మీరంటున్నారంటే పుడింగి పదానికి అర్థం మీకంటే యింకెవరికి బాగా తెలుసు సా!
    (ఒక పుస్తకానికి తోడుగా ఇంకొక గైడు గూడా రాయడమంటే నరకం. ఇంకెప్పుడూ ఈ పుస్తకం మింద ఇంకెక్కడా మాట్లాడను. పుస్తకాన్ని బలే వుందని నన్ను కావలించుకున్నా, తూ నాశినం అని నా మొకం మింద ఎంగిలూంచినా… నాకు రెండూ ఒక్కటే.)
    ************************************

  20. బొల్లోజు బాబా

    to read or not read: that is the question 🙂

  21. ఒక బ్రౌజర్

    “పుడింగి” నిజానికి తమిళ సంప్రదాయం. తెలుగు మాట కాదు. ఇక్కడ వాడుకలో కూడా లేదు. “పోటుగాడు”, “మొనగాడు” అని అర్థం (వ్యంగ్యం). చాలాకాలం క్రితమే పుడింగి నామినికి మేధావి కళ వచ్చింది. “విద్య యొసగును వినయంబు…” అనే ఆర్యోక్తిని తలక్రిందులు చేసిన విలక్షణ రచయిత. కొన్నాళ్లుగా లేదా కొన్నేళ్లుగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తన చుట్టూ తిరుగుతోందని యీ పుడింగి ప్రగాఢంగా విశ్వశిస్తున్నాడు. కొ.కు ఆంధ్రవారపత్రిక సంపాదకత్వం, చందమామ రూపకల్పన చేశారు. పుడింగిని వదిలేసినా అవి చాలు తెలుగుజాతి ఆయనకి దణ్ణం పెట్టడానికి. పుడింగి పుస్తకం చదివాక – “నాకు మంచి పబ్లిసిటీ తెచ్చాడు. ఆయనకి థాంక్స్” అన్నారు నవోదయ రామ్మోహనరావు. సోమరాజు సుశీల – “ఎడిటర్లు లంచాలు ఆశిస్తారని నాకు తెలియదు. రెమ్యునరేషన్ చెక్కులు ఎడిటర్లు పుచ్చుకుంటారని అస్సలు తెలియదు. నామిని నా దృష్టిలో ఎప్పుడూ ఏనుగే. సరస్వతిని అమ్ముకుంటామా? అంతకంటే నీచం ఏవుంటదని చాలాసార్లు ఆయన అన్నారు. ఇప్పుడు సరస్వతిని లక్ష్మీదేవికి మారకం వేసినట్టు ఆయనే రాసుకున్నారు. మాలాంటి వాళ్ళకి ఔదార్యాలు, విశాల హృదయాలు వుండవు. మేము చాలా వొడిదుడుకులు చూసి ఏదో యిట్లా నిలబడ్డాం. అంతవరకే సంతోషం. ఆనాడు మరొకరికి యీ మహానగరంలో ఎపార్ట్‌మెంట్లూ, కంప్యూటర్లూ కొనిచ్చే స్థితిలో లేను. నామిని గారి రాతల్ని బట్టి ఆయన తల్లిదండ్రులు చాలా స్వాభిమానం, ఆత్మగౌరవం, విశ్వాసం వున్న వారని స్పష్టంగా తెలుస్తుంది. మరి వారి కడుపున పుట్టిన యీయనకి అడుక్కుతినే మనస్తత్వం ఎట్లా వచ్చిందో ఆ దేవుడికే తెలియాలి. అడుక్కు తినడమంటే ముష్టెత్తడమని నా వుద్దేశం కాదు. అడిగి తీసుకోవడం, లేదా ఎవరైనా తేరగా యిస్తే తీసుకోవాలనుకోవడం. ఒక్కందుకు ఆనందం. నామిని గారు కోటీశ్వరులయ్యారు. కనీసం అందులో తొంభైలక్షలైనా బీదాబిక్కీకి ఇచ్చేస్తారు. అసలీపాటికి యిచ్చేసే వుంటారు” – ఇవి దాదాపు యధాతథంగా అన్న మాటలు. చాలా కూల్‌గా, ప్రశాంతంగా. డా. జంపాల, నామినిని నామినే హత్య చేసుకున్నాడన్న వాక్యానికి చీర్స్!

  22. Srinivas Vuruputuri

    “ఆంధ్రజ్యోతిలో రావణకాష్టం గొడవ” – రావణ జోస్యం కథ తాలూకు ప్రస్తావనా ఇది?

  23. కత్తి మహేష్ కుమార్

    ఏంటో మనకు వ్యక్తుల్లోకూడా శానిటైజ్డ్ వర్షన్స్ మాత్రమే ఆమోదయోగ్యం. ఒక మనిషి మేధావిగానూ వెధవగానూ ఒకేసారి ఉండగలడనే నిజాన్ని ఒప్పుకోలేని మనం నిజంగా సాహిత్యం చదివి నేర్చుకుంటున్నదేదో అర్థంకాకుండా ఉంది.

    ఇక “ఒక్క మగాడు” అనే నా పదం గురించి… “పుడింగి” ఎలా వ్యవహారాల్లో అర్థాల్ని తెచ్చుకుందో అలాగే “ఒక్క మగాడు” అనేది కూడా. అందులో జెండర్ సెన్సిటివిటీని వెతికితే నేను చేసేదేమీ లేదు. అయినా ఒక్క మగాడు అనే సినిమా టైటిల్ శుష్కం కానప్పుడు నేను వాడినా అర్థముందనే అనుకుంటున్నా 😉 అర్థమయ్యవాళ్లకు అర్థమవుతుందనుకుంటా…. 😉

  24. Srinivasa rao

    కల్పనా సాహిత్యంలోకి రచయిత యథాతధంగా అడుగుపెట్టడు. నేను అంటూ రచన చేసినా, తనకు పరిచయమైన మరి కొందరి స్వభావాల్ని

    కూడా తనలో కలిపేసుకుంటాడు. యధార్ధ సంఘటనలకు కూడా నగిషీలద్దుతాడు. పాఠకుల ముందుకు తాను ఎలా వెళ్ళదలచుకున్నాడో అందుకు

    తగ్గట్టుగా తగిన మేకప్ చేసుకుని కథా ప్రవేశం చేస్తాడు. రచయితలందరూ చేసే పనే ఇదే. నామిని కూడా ఇంతదాకా తన రచనల్లో ఇదే చేశాడు. కాకుంటే

    చాలా తెలివిగా చేశాడు. జిత్తులమారితనంతో చేశాడు. అందువల్లే నామినిని realistic writer అనిగాక naturalistic writer అని అన్నారు. _________________________

    ఉమా మహేశ్వర రావు గారు బహుశా నామినికి కూడా తెలీని విషయాలను చెప్పి పుస్తకాన్ని ఆకాశానికెత్తారు. ఇలాంటి సందర్భాల్లో రంగనాయకమ్మ గారు నామినికి రాసిన ఉత్తరం గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి.

    నామిని కల్పనా సాహిత్యం ఎప్పటికీ రాయలేడు. మొదటినుంచీ తన జీవితానుభవాలే రాశాడు.కొన్నాళ్ళకి జీవితంలో ఇక చెప్పుకోదగ్గ అనుభావలు లేని నాడు ఆయన సాహిత్యమూ ఆగిపోతుంది.

    గొప్ప సాహిత్య వేత్తలూ, నామినిని ఎరిగిన మిత్రులూ పరిచయస్థులూ ఎంతగా ఈ పుస్తకాన్ని కవర్ చేసినా సినబ్బగా మాత్రమే నామిని ని ఎరిగిన పాఠకులు ఇకపై నామినికి దూరంగా ఉండాలని వాళ్ళే నిర్ణయించుకుంటారు.

    నేనయితే పాఠకులు తెలివిడితోనే

    వుంటారని నమ్ముతున్నాను. ….అవును ఆ మాత్రం తెలివిడి పుస్తకం కొని చదివాకైనా రాకపోతే ఎట్లా?

    అయితే ఆయన సాహిత్యాన్ని మాత్రం దూరం చేసుకోలేం…. ఆయన సాహిత్యాన్ని ఆయనే పాఠకులకు దూరంగా లాక్కెళుతుంటే ఇక పని గట్టుకుని మనమెందుకూ దూరం చేసుకోడం?

  25. Jampala Chowdary

    @ఆర్ ఎం ఉమామహేశ్వరరావు:

    ఉమామహేశ్వరరావు గారూ:

    నామినిని బాగా ఎరిగిన మీరు ఆలోచనాయుతంగా, విపులంగా ఈ వ్యాఖ్య వ్రాసినందుకు సంతోషం.

    >>ఇంతకీ ఆత్మకథల్లో బలహీనతల గురించీ, తనలోని అవలక్షణాల గురించీ రాసుకోవడం తప్పెలా అవుతుంది, అదొక చర్చ కావచ్చేమోగానీ. మేకప్పు చేసుకుని కనిపిస్తే యిక అది ఆత్మకథ ఎలా అవుతుంది? రచయిత తన బలహీనతలను ప్రదర్శిస్తూనే వాటికి పశ్చాత్తాపం ప్రకటించి వుండాలని జంపాలగారు కోరుకుంటున్నారా?

    నామినే ఈ పుస్తకంలో కొన్ని విషయాలకు అక్కడక్కడా పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. చేసినా, చేయకపోయినా పెద్ద తేడా రా(లే)దు. అలాగే ఇతరులకు అభ్యంతరకరంగా కనిపించిన తన ప్రవర్తనల గురంచి, తన భాష గురించి వివరణలు ఇచ్చుకొన్నాడు.

    నా చిన్నప్పుడు నేను ఏదో తప్పు చేసి, మా అమ్మమ్మ అడిగితే నిజం చెప్పి నా తప్పు ఒప్పుకున్నాను. అప్పటిదాకా నేను చదివిన పిల్లల కథల ప్రకారం మా అమ్మమ్మ నా నిజాయితీని మెచ్చేసుకుని, బహుమతులిచ్చి, నన్ను తిట్టకుండా వదిలేయాలి. మా అమ్మమ్మ ఆ కథలు చదవలేదనుకుంటా, మామూలుగానే తిట్టేసింది. నిజాయితీగా చెప్పినంత మాత్రాన కొన్ని విషయాలు అభ్యంతరకరమైనవి కాకుండాపోవు.

    ఐనా, నామిని వ్యక్తిగత ప్రవర్తనపై నేను తీర్పు చెప్పడం లేదు. తప్పొప్పుల గురించి ఆయనకే స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నట్టున్నాయి. కాని ఆ విషయాలు చదవటం ఇబ్బందిగా అనిపించిన మాట వాస్తవం. ఆ విషయాలన్నీ మనందరితోనూ పంచుకోవలసిన అవసరం ఈయనకు ఇప్పుడు ఎందుకొచ్చిందొ తెలీలేదు. ఇంత అర్జెంటుగా ఆత్మకథ రాయమని ప్రేరేపించిన ఒత్తిడి ఏమిటో.

    ఆత్మకథల్లో అబద్ధాలు వ్రాయాలని నేనంటున్నట్లు నా వ్యాఖ్య అనిపిస్తే, అది నా రాయలేనితనం.
    పాత రాతలపై ఆధారపడి నామిని గురించి కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకొన్న వారికి నిర్మొహమాటంగా కొన్ని నిజాలు చెప్పి పునరాలోచించుకొనే అవకాశం ఇచ్చాడు నామిని. భ్రమలు విచ్చిపోవటం మంచిదే ఐనా, చాలాసార్లు బాధగానే ఉంటుంది. మొదటి నామినిని దగ్గరగా చూడబుద్ధేసింది; రెండవ నామిని ఆకర్షణీయంగా లేడు. పాత నామిని చిత్రం, కొత్త నామిని చిత్రం రెండూ పూర్తిగా నిజం కాకపోవచ్చు. నామినిలో చాలా వైరుధ్యాలున్నాయని ఈ పుస్తకం చెప్తుంది.

    ఈ పుస్తకం వల్ల నాకు నామిని పాత పుస్తకాలపట్ల గౌరవం, మోజూ ఏమీ తగ్గలేదు. అచ్చ మాండలికంలో రాయటానికి పత్రికల్లో స్థానం కల్పించిన ఘనత నామినిదే. కానీ, మీతో ఒక్క విషయంలో ఏకీభవించను. ఆ కతలు ఆమాండలికంలో లేకపోయినా, నాకు నచ్చేవనే అనుకొంటున్నాను. ఇక్కడ శైలికన్నా వస్తువు ముఖ్యం అనుకొంటున్నాను.

    ఇతర రచయితల గురించి నామిని అభిప్రాయాలు వాటిని గురించి చర్చించేంత విపులంగా లేవు.

    ఆంధ్రజ్యోతిలో రావణ జోస్యం గొడవ గురించి ఏమైనా ఉంటుందేమో అనుకొన్నాను. అది ఆయనకు అంత అంత ముఖ్యమైన విషయం అనిపించినట్లు లేదు. అలాగే పాత్రికేయుడిగా ఈనాడు, ఉదయం, ఆంధ్రజ్యోతి పత్రికలలో అనుభవాలు కూడా.

    ఈ పుస్తకం చదవడంలోకి నామిని లాక్కుపోయిన మాట నిజమే. కానీ, తన సన్మానసభ ప్రసంగంలో నామిని పుస్తకాలు చదివినప్పుడు (ఇతర విషయాలు అనుభవించినప్పుడు) శరీరంలో ఊరే మంచి, చెడ్డ రసాయనాల గురించి చెప్పిన సిద్ధాంతం గుర్తు తెచ్చుకోవాలి. అది నిజమైతే, ఈ పుస్తకం చదివినప్పుడు మంచి రసాయనాలు ఊరే అవకాశం తక్కువ అని నా అభిప్రాయం.

  26. జంపాల చౌదరి

    @కత్తి మహేష్ కుమార్:
    మహేష్ గారూ:

    1) మీ మొదటివాక్యం వాదనకూ, విశ్లేషణకూ పనికిరాని శుష్కవాక్యం. పైపెచ్చు, ఈరోజుల్లో ఇటువంటి వాక్యాలు వాడటం స్త్రీపురుషుల్ని సమానంగా చూడదలచినవారు సమంజసంగా భావించరు.

    2) ఒకరి రచనల్ని గౌరవించటానికి/ ప్రేమించటానికి, ఒకరి వ్యక్తిత్వాన్ని గౌరవించటానికి/ ప్రేమించటానికి/ భరించటానికి మధ్య తేడా ఉంది. రచనల్నిబట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయటం సహజమే ఐనా, వ్యక్తికీ రచనలకీ మధ్య విపరీతమైన వైరుధ్యాలు ఉండటం సాధారణమైన విషయమే.

    3) మీరు వర్ణిస్తున్న నామిని ఈ పుస్తకం చదవకముందు నా మనసులో ఉన్న నామిని. ఇప్పుడు నా మనసులో ఉన్న నామినికి లౌక్యం తెలీదు అనుకోలేను. ఇది నా ‘నాగరీకత’కు సంబంధించిన విషయమే అని కూడా అనుకోను.

    4) నా వ్యాసంలో నేనెక్కడా ‘పిచ్చి’ అన్న పదం వాడలేదు.

  27. నాగేస్రావ్

    చౌదరిగారూ, పుడింగి అనేది అరవంలో “పోటుగాడు” అనే దూషణార్థకంలో (derogatory sense) వాడతారు. “పీకేవాడు” అనేది వాస్తవికార్థం. మనకీ బూతుగా “వాడు నా … కూడా పీకలేడు” వాడకం మీకు తెలీందికాదు.
    మీ సమీక్షనిబట్టి చూస్తే నామినిని పుడింగే అనుకోవాలి.

  28. ఆర్ ఎం ఉమామహేశ్వరరావు

    ముందుగా పుడింగి గురించి.. పుడింగి అనే పదం నెల్లూరు జిల్లా ధక్షిణ ప్రాంతంలోనూ, చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతంలోనూ వాడుకలో వుంది. బహుశా

    స్వర్ణముఖి నది తీర ప్రాంతంలో. ఇది తెలుగులోకి వచ్చిన తమిళ పదం ఏమో అనే అనుమానం నాకు కూడా తొలుత వచ్చింది. స.వెం. రమేశ్ సాయంతో

    ఈ పదం జాడ కనుక్కునే ప్రయత్నం చేశాను. తమిళ లెక్సికన్ లోనూ ఈ పదం లేదు. సంస్కృతమూ కాదు, ద్రవిడమూ కాదు. విచిత్రంగా తమిళనాడు

    ఉత్తర ప్రాంతంలోని తెలుగు వాళ్ళలోనూ , నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లోనూ మాత్రమే వాడుకలో వుంది. నా చిన్నప్పటి నుంచీ ఈ పదం

    వింటూనే వున్నాను. జంపాల చౌదరిగారు అభిప్రాయ పడ్డట్టు పెద్ద పోటుగాడు, పోటుగత్తె అనే అర్ధం లోనే దీనిని వాడుతారు. గొప్ప అంటూనే కొంత

    ఎకసెక్కెం చేయడం. ఈ పదానికి లింగభేదం కూడాలేదు.
    ఇక జంపాల గారి పుడింగి సమీక్ష గురించి…
    పచ్చనాకు సాక్షిగా నుంచి ఇస్కూలు పుస్తకం దాకా నామిని ప్రతి రచనలోనూ వొక ఎత్తుగడ, వొక వ్యూహం, వొక జిత్తులమారితనం, వొక మోసకారితనం

    కనిపిస్తూనే వున్నాయి. నామిని వ్యక్తిగత జీవితంలోని లక్షణాలే ఇవి. ఇవి నామిని వొక్కడి లక్షణాలు మాత్రమే కాదు, నగర వాసన సోకని పల్లె ప్రజల

    లక్షణాలు ఇవి. పచ్చనాకు సాక్షిగా చదివి వీటిని ముదిగారంగా పాఠకులు స్వీకరించారు. సినబ్బకతలు, మిట్టూరోడికతలు కూడా ఇదే వరుసలోనివి. ఈ

    మూడూ నామిని ఆత్మకథలే. మునికన్నడి సేద్యం నవలలోనూ నామినే కనిపిస్తాడు. ఇక్కడ నామిని ని రచయిత నామినిగా గాక వొక పల్లెటూరి మనిషి

    పాత్రగా పాఠకులు స్వీకరించారు. అయితే, పుడింగిలోకి నామిని వొక పాత్రగా కాక రచయిత నామినిగానే కథల తెర తొలగించుకుని అచ్చంగా బయటకు

    వచ్చేశాడు. దీంతో ఈ పుస్తకాన్ని ఎలా స్వీకరించాలో అర్ధంగాక తికమక పడుతున్నారనిపిస్తోంది. ఇదొక రచయిత ఆత్మకథ. దీనిని ఆత్మకథగానే

    స్వీకరించాలి. కల్పనా సాహిత్యంలోకి రచయిత యథాతధంగా అడుగుపెట్టడు. నేను అంటూ రచన చేసినా, తనకు పరిచయమైన మరి కొందరి స్వభావాల్ని

    కూడా తనలో కలిపేసుకుంటాడు. యధార్ధ సంఘటనలకు కూడా నగిషీలద్దుతాడు. పాఠకుల ముందుకు తాను ఎలా వెళ్ళదలచుకున్నాడో అందుకు

    తగ్గట్టుగా తగిన మేకప్ చేసుకుని కథా ప్రవేశం చేస్తాడు. రచయితలందరూ చేసే పనే ఇదే. నామిని కూడా ఇంతదాకా తన రచనల్లో ఇదే చేశాడు. కాకుంటే

    చాలా తెలివిగా చేశాడు. జిత్తులమారితనంతో చేశాడు. అందువల్లే నామినిని realistic writer అనిగాక naturalistic writer అని అన్నారు. అప్పటిదాకా

    తెలుగులో వచ్చిన రచనలన్నింటి కన్నా ఎక్కువ స్వచ్ఛంగా వుండడం వల్లే వీటిని పాఠకులు ప్రేమించారు. ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. అదే

    నామిని పొగరు. తన ముందుకాలం రచయితల గురించీ, తనకాలం రచయితల గురించీ నామిని అలాగ్గా మాట్లాడేస్తున్నదీ ఇందువల్లే. అయితే ఆ

    రచయితల రచనల్లో తనకు నచ్చనివి అంటూ నామిని ఎత్తి చూపుతున్న అంశాల గురించి మాత్రం ఎవరూ వివరంగా మాట్లాడటం లేదు. ఆయన పొగరు

    గురించి మాత్రమే మాట్లాడుతున్నారు.
    ఇంతకీ ఆత్మకథల్లో బలహీనతల గురించీ, తనలోని అవలక్షణాల గురించీ రాసుకోవడం తప్పెలా అవుతుంది, అదొక చర్చ కావచ్చేమోగానీ. మేకప్పు

    చేసుకుని కనిపిస్తే యిక అది ఆత్మకథ ఎలా అవుతుంది? రచయిత తన బలహీనతలను ప్రదర్శిస్తూనే వాటికి పశ్చాత్తాపం ప్రకటించి వుండాలని

    జంపాలగారు కోరుకుంటున్నారా? నామిని నిత్యానందస్వామిలా వేషం వేసుకుని వుండాల్సిందా? యథాతధంగా వుండడంవల్ల వాటిలో మంచేదో చెడేదో

    పాఠకులకు అర్ధం కాదా. నామినిలో నచ్చని వాటిని ఛీ కొట్టి, నచ్చిన వాటిని ఇష్టపడే తెలివితేటలు పాఠకులకు వుండవా? నేనయితే పాఠకులు తెలివిడితోనే

    వుంటారని నమ్ముతున్నాను. పుడింగి ఆత్మకథంతా చదివి కన్నీటి పర్యంతమై , అకౌంట్ నెంబర్ ఇచ్చాడు కదా అని నామినికి డాలర్ల బిచ్చం వేయాల్సిన

    అవసరం లేదు. అట్లా వేయాలనీ, వేస్తారనీ నామిని నమ్మకం. వేస్తే వాటిని దర్జాగా ఖర్చుపెట్టుకుని ఆనాక వేసిన వాళ్ళనీ ఎగతాళి చేసేయగల తెలివి

    తేటలు నామినివి. జంపాలగారు పుడింగి చదివి అన్నట్టు నిజంగానే నామిని అహంకారి, ఒకోసారి అమాయకుడు, అతితెలివిమంతుడు, మోసకారి,

    అవివేకి, సోమరి, మొండి, పెడసరి. ఈ లక్షణాలన్నీ వున్న మనిషి. ఈ మనిషికి దూరంగా ఉండి జాగ్రత్తగా మెసులుకోవడమే మంచిది. నామినికి దూరంగా

    వుండడం పెద్ద కష్టమేమీ కాదు గానీ ఆయన రచనలకి దూరంగా వుండడం మాత్రం కష్టమే. అది పచ్చనాకు సాక్షిగా అయినా, పుడింగి అయినా.
    నామిని దేన్ని గురించి రాసినా దాంట్లోకి తాను వెళ్ళడు. దాన్ని తనలోకి ఈడ్చుకొచ్చి పాఠకులను అందులోకి లాక్కుపోతాడు (జంపాల గారినీ

    అరుణగారినీ పుడింగిలోకి లాక్కుపోయిందీ యిలాగే). నిస్సందేహంగా ఇది వొక గొప్ప writing style. రచయితగా నామిని ని అత్యున్నత స్థానంలో

    నిలబెట్టింది ఇదే. నామినిని వ్యక్తిగతంగా మనం ఇష్టపడవచ్చు, అసహ్యించుకోనూ వచ్చు అయితే ఆయన సాహిత్యాన్ని మాత్రం దూరం చేసుకోలేం.

  29. వేణు

    మహేశ్ గారూ, ‘ఆధునిక కథకుల్లో ఒకే ఒక్క మగాడు నామిని’ అని రాశారు మీరు. 1) ఈ సందర్భంలో ‘మగాడు’ అంటే మీ దృష్టిలో అర్థం ఏమిటి? 2) ‘ఆధునిక’ అంటే 1980 కి ముందు కూడానా?

  30. సుజాత

    మహేష్, మీరు పుస్తకం చదివి రండి! వ్యథలొక్కటేనా అందులో ఉంది?

    ఆధునిక కథకుల్లో ఒకే ఒక్క మగాడు…..ఇదేం అవార్డు? మిగతా వాళ్ళంతా?

  31. కత్తి మహేష్ కుమార్

    ఆధునిక కథకుల్లో ఒకే ఒక్క మగాడు. నామిని.కల్మషం లేని భోళామనిషి తన బాధను వెళ్ళగక్కుతుంటే “నాగరీకులకు” కొంత ఇబ్బందిగానూ, కొంచెం పిచ్చిగానూ అనిపించడం తప్పదు. మొత్తానికి నామిని నామినే. మనమే ఇంకొళ్ళలాగా ఉండాలనుకుంటున్నామేమో!
    లౌక్యంగా తన బాధను మేకప్ చేసి చెప్పే ట్యాలెంట్ నామినికి లేదు. అలా ఉంటే అతడు నామినే కాదు. దాన్ని భరించాం కాబట్టే అతని కథల్ని ప్రేమించాం. ఇప్పుడు అతని వ్యధల్నిభరించకపోతే ఎట్లా..

  32. సుజాత

    పాత నామిని ఇట్లా బహిరంగంగా నామిని చేతిలోనే హత్య చేయబడడం విషాదం………..

    Amen!

  33. రవి

    పుడింగి – అనేది రాయలసీమ మాండలికంలో ఒక వాడుకపదమండి. “వాడేమైన పెద్ద పుడింగా?” – అని ప్రయోగిస్తుంటారు, “అతనేమైనా పెద్ద హీరోనా?” అన్న అర్థంలో.ఖచ్చితమైన అర్థమేంటో, ఈ పదం ఎలా వచ్చిందో తెలీదు.

    80 వ దశకంలో ఆంధ్రజ్యోతిలో పురాణం సీత ఇల్లాలి ముచ్చట్లు, నండూరి వారి విశ్వదర్శనం, యండమూరి అభిలాష, మరణమృదంగం, మల్లాది చంటబ్బాయ్, రెండు రెళ్ళు ఆరు, రాక్షస సంహారం, కొమ్మూరి వేణుగోపాలరావు నెత్తుటి బొట్టు, భాగ్యనగర్ బాతాఖానీ, తిరుమల రామచంద్ర గారి మరో శీర్షిక – వాటన్నిటి సరసన నామిని రచన సినబ్బ కథలు (అనుకుంటాను) నిలబడి అప్పట్లో ప్రజలను చదివించింది. ఈ కాలంలో బ్లాగులు పెట్టి ఆత్మకథలు, అనుభవాలు అందరూ రాసేస్తున్నారు. కానీ ఒక పత్రికలో ఈ రకమైన ఒరవడిని ప్రవేశపెట్టింది నామినియే. కథలు చెప్పాలనుకున్నాడు కాబట్టే ఈ రోజు వరకు తనకు వచ్చిన భాషలోనే, తనకు తెలిసిన మాండలికంలోనే చెబుతున్నాడు. పనిగట్టుకుని మాండలికం రాసిన రచయితలు ఉండవచ్చు, అయితే ఖచ్చితంగా నామిని ఆ కోవకు చెందడు.

  34. పారదర్శి

    పుడింగ్ అంటే అన్నీ తెలిసినవాడు, అన్నీ వచ్చినవాడు, శక్తిమంతుడు అనే అర్థం తోస్తుంది. తనంత గొప్పోడు లేడనే నామినీ విశ్వాసమే తనను తాను పుడింగ్ అనుకునేలా చేసిందేమో! ఈ పుస్తక ముఖచిత్రం నామిని ఆత్మస్థైర్యానికి ప్రతిబింబం.

    పుస్తక పరిచయం నిర్మొహమాటంగా, నిజాయితీగా ఉంది. జంపాల సమీక్షలు ఆసక్తిగా చదివిస్తాయి.

Leave a Reply