పలనాడు వెలలేని మాగాణిరా

స్వానుభవంలో ఎన్నిసార్లు గొంతెత్తి పాడుకున్నా తనివి తీరని  గేయాలు మూడే మూడు.మొదటిది పులుపుల శివయ్య గారి “పలనాడు వెలలేని మాగాణిరా”;దీనిని బాలడ్ గా భావించవచ్చు .రెండవది దాశరధి గారి “మాట్లాడని మల్లెమొగ్గ మాదిరిగా నడచిరా’;మూడవది శంకరంబాడి సుందరాచారి గారి “మా తెలుగుతల్లికి మల్లెపూదండ” .ఈ మూడు గొప్ప సాహిత్యస్థాయిని అందుకుని రసప్రవాహాలుగా సాగే రచనలు.శివయ్యగారి బాలడ్ లో అస్పష్టత గానీ,అన్వయకాఠిన్యం కానీ ఉండదు.గొప్ప రెమినిసెంట్ ఫెర్వర్ తో ఉజ్వలమైన చరిత్రని ఇవోక్ చేస్తుంది. దాశరధి గారి గేయంలో తిలక్ గారు చెప్పిన “ట్రాన్స్పెరంట్ చీకటి” లాంటి అందమైన అబ్స్క్యూరిటీ అక్కడక్కడ ఉంటుంది. గొప్ప ఇమాజినేటివ్ ఇంటెన్సిటీ తో సుందరమైన భౌతిక జగత్తును ,మనఃప్రపంచాన్ని మన కళ్ళముందు నిలుపుతుంది. సుందారాచారిగారు రాసినది ఈ ఒక్క గేయమే నని చెబుతారు.కానీ కలకాలం నిలిచిపోయే రచన. తెలుగు నదుల గలగలలు ,తెలుగు తేజం ధగధగలు,తెలుగు కవుల మధురిమలు ,తెలుగు నేల పసిడిపంటల మిసమిసలు ఆహ్లాదంతో కూడిన ఒక ఔద్ధత్యానుభూతిని పాఠకుల హృదయాలలో కలిగిస్తవి. కవితా శక్తిలో మూడూ మూడే.ఇవి సాహితీ ప్రియులని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.  ఇప్పుడు మనం సమీక్షించబూనుకున్నది పులుపుల శివయ్యగారి  “పలనాడు వెలలెని మాగాణిరా.”

శివయ్య గారు (1910-1976) కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని మనసా, వాచా,కర్మణా నమ్మి గొప్ప నిబద్ధతతో తమ జీవితాల్ని మలచుకున్న వెనుక తరం కు చెందిన ఉద్యమకారులలో పేరెన్నిక గన్నవారు. గుంటూరు జిల్లా,వినుకొండ నుండి పేదలకు నిజమైన ప్రతినిధిగా ఎమ్మెల్యే గా ఎన్నుకోబడ్డ నిరాడంబర నాయకులు.నేను రెండు మూడు సార్లు వారిని చూసే అవకాశం కలిగింది.ఇస్త్రీ చెయ్యని ముతక ఖద్దరు పంచె ,లాల్చీ ,పై పంచె తో సన్నగా,కొంచెం బట్తతలతొ ,ప్రశాంత వదనంతో ,చామనచాయ రంగులో,వివేకం,వినయం,అదొకరకమైన జాలితో నిండిన మెలంకలీ ఉట్టిపడే కళ్ళతో ఆకట్టుకునే మూర్తిత్వం వారిది.జగమెరిగిన నిస్వార్ధ సేవాతత్పరత ,సిద్ధాంత నిబద్ధత  చూసేవారికి ఆయనపై అపారమైన గౌరవభావాన్ని కలిగిస్తవి.శివయ్య గారు ఎమ్మెస్సీ డిగ్రీ తీసుకున్నారు.ఆ రోజుల్లో శివయ్యగారి పేరు వింటే వావిలాల గోపాలకృష్ణయ్య గారు,గోపాలకృష్ణయ్య గారి పేరు వింటే శివయ్యగారు గుర్తుకొచ్చేవారు. ఇక సుందరయ్య గారు సరేసరి .మరి ఈనాడు ? ఈనాడుకు తగిన వారే.

“పలనాడు వెలలేని మాగాణిరా” ను 1945 ప్రాంతంలో శివయ్య గారు వ్రాశారు.వ్రాసినదగ్గరనుండి పండితులు,సామాన్యులు అనే భేదం లేకుండా బహుళ జనాదరణ పొందిన రచనే అయినా ,అది అచ్చయ్యింది 1978 లో.శివయ్యగారు 1976 లో చనిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ వారు.ఈ బాలడ్ టైటిల్ తో ,ఇదిగాక ఇంకా 17 గేయాలు వారు వ్రాసినవి కలిపి గ్రంధంగా ప్రచురించారు.తక్కిన 17 గేయాలలో కొన్ని శ్రీశ్రీ ఫక్కీలో వ్రాయబడ్డట్టు అనిపిస్తుంది.కానీ పలనాడు మీది ఈ బాలడ్ తన సొంతు గొంతుక నుండి హిమాలయ శృంగాల మీదుగా దూకిన గంగోత్రిలా కవితా రస ఝరియై ఎత్తుపల్లాల మీదుగా హుందాగా,అందంగా,నిండుగా ,మధురంగా సాగిన  ప్రవాహంలా ఆద్యంతం ఆకట్టుకుంటుంది.భావావేశం,రసధార,ఔచిత్యశోభ,అబ్బురపరిచే నిర్మాణ రామణీయకత ,నిరలంకారమైన స్వచ్చమైన సౌందర్యం,ఒక్క వ్యర్ధ పదం,కూడా లేని సొగసైన పదాల కూర్పు చదువరులను తన్మయులని చేస్తాయి.బలీయమైన ఆవేశానికి లోను చేస్తాయి.ఒక మహా గొప్ప చేనేతకళాకారుడు నేసిన కలనేతపట్టు వస్త్రంలో ద్యోతకమయ్యె సౌందర్య నైపుణ్యం ఈ గేయ రచనలో కనబడుతుంది. కలనేతపట్టు వస్త్రం అని నేననడం యాదృచ్చికం కాదు.పలనాడు ప్రాంతపు నైసర్గికస్వరూపాన్ని ,చారిత్రకవైభవాన్ని ,పరంపరగా సాగి వస్తున్న సంస్కృతీ ,సంప్రదయాలని పలనాటి ప్రజల జీవలక్షణాల్ని దెనికి దానిని విడదీయరాని విధంగా సమ్మోహనంగా సమన్వయిస్తూ ,వీటన్నిటినీ మహా రసవత్తరంగా ప్రతిఫలింపచేస్తూ  చేయబడ్డ రచన ఇది. ఈ ఒక్క బాలడ్ చాలు పులుపుల శివయ్యగారిని ఎంత గొప్ప కవుల సరసనైనా సగర్వంగా ఆసీనులని చేయటానికి.

ఈ బాలడ్ లో శివయ్యగారి రచనా శిల్ప సౌందర్యం,ఔచిత్యం ఆద్యంతం ప్రస్ఫుటంగా కనిపిస్తవి.పలనాటి ప్రజల ప్రధాన జీవ లక్షణం పౌరుషం.శివయ్యగారు దీనిని మొదటి చరణంలోనే ఆవిష్కరిస్తారు:
“శాతవాహన తెలుగు చక్రవర్తుల శౌర్య
మిదెబ్రాహ్మ్య మిదెక్షాత్ర మన్న గర్జా ఘోష
పులకలే యెత్తించెరా పలనాట
పౌరుషమ్మే పొంగెరా! ”
ఆదిలోనే సువిశాలమైన సామ్రాజ్య నిర్మాతలుగా శాతవాహనుల నుదహరించటం తోనే,శౌర్యం,క్షాత్రం,పౌరుషం కీ నోట్ పదాలుగా పలనాటి ప్రజల మౌలికమైన  జీవలక్షణాలుగా స్ఫురింపచేయటంలోనే ఈ బాలడ్ గొప్ప మొమెంటం తో ప్రారంభమవుతుంది.అలా ప్రభవించిన మొమెంటం పంక్తి పంక్తికీ చరణ,చరణానికీ,”ఇంతింతై వటుడింతై” అన్నట్లు బలోపేతమై వైభవంగా జైత్రయాత్ర సాగినట్లు సాగుతుంది.ఇది గొప్ప కవితా కళాత్మక ఎత్తుగడ.ఇంతకు క్రితం చెప్పుకున్నట్లు వివిధ రంగాలలో పలనాటి ప్రజల అమోఘమైన ప్రాభవాన్ని ఒకదాని వెంట మరొకటి ఆవిష్కరిస్తాయి,ఈ రచనలోని చరణాలు.
ఈ బాలడ్ యొక్క సమగ్రమైన సౌందర్యాన్ని పాఠకుల అనుభవం లోకి తీసుకరావటానికి అవసరమనే భావంతో అతి క్లుప్తంగా దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.పలనాడు ప్రాంతం అంటే గుంటూరు జిల్లాలో వెనుకటి గురజాల తాలూకా క్రింద ఉన్న  సువిశాల ప్రదేశమంతా  వస్తుంది.గురజాల తాలూకా చాలా పెద్దదని,పరిపాలనా సౌలభ్యం కోసం మాచర్ల,గురజాల తాలూకాలగా రెందుగా విభజించారు.ఆ తర్వాత మండలాలు వచ్చాయి. పలనాడు ప్రాంతం అంటే నాగార్జున సాగర్ నుండి నర్సారావుపేట వైపు ఉన్న గుత్తికొండ,గుళ్ళపల్లి వరకూ నల్లమల అడవుల నానుకుని ఉన్న వెల్దుర్తి ,గుండ్లపాడు,శ్రీగిరిపాడుల నుండి సత్తెనపల్లి దగ్గరి పిడుగురాళ్ళ వరకూ విస్తరించిన ప్రాంతం అంతా వస్తుంది.పల్నాటి చరిత్రను పల్నాటి భారతంగా వ్యవహరించటం ఉంది.కారణం,కౌరవ,పాండవుల లాగానే అన్నదమ్ముల పిల్లలయిన నలగామరాజు గురజాల రాజధానిగా నాగమ్మ మంత్రిత్వంలో ,మలిదేవరాజు మాచెర్ల రాజధానిగా బ్రహ్మనాయుని మంత్రిత్వంలో రాజ్యాలు చేయటం,శకుని లాంటి నాగమ్మ దుర్బోధ వల్ల నలగామరాజు మధ్య,మలిదేవరాజు మధ్య వైషమ్యాలు పెరగటం,కౌరవ పాండవుల మధ్య శకుని కుతంత్రం వల్ల వచ్చిన మాయ జూదం లాగానే వారిద్దరిమధ్య మోసపూరితమైన కోడిపందాలను నాగమ్మ కుతంత్రం వల్ల రావటం,రాజ్యాలొడ్డటం,మలిదేవరాజు మోసానికి గురై ఓడిపోవటం,రాజ్యాన్ని గోల్పోయి అరణ్యవాసంగా మండాది దగ్గరి అడవుల్లోని మేడపి దగ్గర ఏడు సంవత్సరాలు గడపటం, ఆ తరవాత వారి రాజ్యాన్ని వారికివ్వవలసిందని రాయబారం పంపడం,నాగమ్మ మాయ మంత్రాంగానికి గురైన నలగామరాజు తిరస్కరించటం,పర్యవసానంగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన పల్నాటి యుద్ధం 1180 ప్రాంతంలో కారంపూడిలో జరగటం,బాలచంద్రుడు రణరంగంలో వీరవిహారం చేయటం ,అభిమన్యునిలా బాలచంద్రుని శౌర్య,ధైర్య,సాహస,పరాక్రమాలు ఆయన చేసిన మహాయుద్ధంలో ఆచంద్రార్కంగా నిలచిపోవటం ఆయన వీరమరణం పొందటం,బ్రహ్మనాయుడే స్వయంగా పోరాడి శత్రువులను నిశ్శేషంగా వధించటం (నాగమ్మను మినహా),ఆ తర్వాత ధర్మరాజులా నిర్వేదం పొంది పాండవులు స్వర్గారోహణం చేసినట్లుగా తపస్సుకోసం గుత్తికొండ బిలంలోకి ప్రవేశించటం …..ఇవన్నీ చూస్తుంటే భారతయుద్ధం పునరావృతం అయినట్లు గా కనిపిస్తుంది.

పలనాడు ఆనాడే విశ్వవిఖ్యాతి గాంచిన శిల్పకళా విన్యాసానికి  జీవగడ్డై వెలసింది.
” తొలిసంజ దీక్షతో తెలుగు శిల్పుల చేతి
పోగరలు మలచిన బుద్ధయుగ జీవితము
నవశిల్ప రతనంబు రా ,పలనాట
నాగార్జునుడి కొండరా !”
ఒక్క”తొలిసంజ దీక్షతో” అన్న పదబంధంతో తపస్సులా ,ఏకైక జీవితాదర్శంగా ,ఏకాగ్రతతో బుద్ధుడి జీవిత విశేషాల్ని కళాఖండాలుగా చెక్కే శిల్పులను చూపిస్తారు,వారి పోగరలు చేసే శబ్దాల్ని హృద్యంగా వినిపిస్తారు,కొండప్రాంతంలోని తొలిసంజ పిల్లతెమ్మెరలు తెచ్చే చల్లదనాన్ని ఇచ్చే హాయిని మన అనుభవం లోకి తెస్తారు.
బౌద్ధనాగార్జునిని  బుద్ధవిజ్ఞాజ్యోతి
వరమహా యానమై వసుమతిని ప్రవహింప
హెచ్చుతగ్గులు సమసెరా పలనాట
విజ్ఞాన ప్రభ వెలిగెరా !”
ఆచార్య నాగార్జునిని ఆధ్వర్యంలో నాగార్జున కొండలో ప్రపంచప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయం ఉండేదని వేలమంది విద్యార్ధులు దశదిశలనుండి జ్ఞాన సముపార్జనార్ధం వచ్చేవారనేది చారిత్రక సత్యం.అంతే కాదు,సంఘంలో అందరూ సమానులే అన్న గొప్ప మానవీయ విలువలు ప్రభవిల్లిన రోజులవి.
“వర్ణధర్మాలన్న ఉక్కుచట్రము పగిలి
మాల కన్నమదాసు మనసైన సుతుడుగా
వీరవైష్ణవ మొచ్చెరా ,పలనాట
బ్రహ్మన్న కలిగీతలో!”
వర్ణవ్యవస్థకు వ్యతిరేకంగా ,మానవీయతే మహా ధర్మంగా సమానత్వమే అసమానమైన నైతిక విలువగా  బ్రహ్మనాయుడి నాయకత్వంలో గొప్ప  సంఘసంస్కరణోద్యమం  వచ్చింది. ముందుతరాల వారికి మార్గదర్శకమయింది.తానారాధించే శ్రీ చెన్నకేశవస్వామివారి సాక్షిగా సమానత్వం బ్రహ్మనాయునికి నిబద్ధతతో కూడిన మనోధర్మమయింది.”మాలకన్నమదాసు మనసైన సుతుడట” :సమానత్వాన్న్ని అంత సహజ గుణంగా,ప్రేమాస్పదం గా ,బ్రహ్మనాయుని తర్వాత ఆచరించిన మహనీయులెంతమంది ఉన్నారు ,ఇన్ని శతాబ్దాలలో ?

ఆతర్వాత యుద్ధం అనివార్యమయింది .
“మగువ నాగమ్మతో మాయ యుద్ధము వచ్చి
మగువ మాంచాల తా మగని రణమున కంప
వీరవనితలు పుట్టిరీ ,పలనాట
శౌర్యముగ్గులు పెట్టిరీ !’
ఆత్మగౌరవం కోసం,స్వాతంత్ర్యం కోసం ,ధర్మం కోసం త్యాగం చేసే మహోదాత్త గుణం చక్కగా చెప్పబడింది.
“బాలచంద్రుని కత్తి పదును మెరపులు మెరసి
తరలి కారంపూడి ధర్మరణరంగాన
వీరరక్తము చిందెరా,పలనాట
నాగులేరై పారెరా !”
బాలచంద్రుని కత్తి పదును మెరుపులు మెరవటం వీరావేశ ప్రధానమైన గొప్ప రసాత్మక ప్రయోగం.నాగులేరు కారంపూడి నుండి దాచేపల్లి మీదుగా ప్రవహించి కృష్ణా నదిలో కలుస్తుంది.పల్నాటి యుద్ధంలో అది రక్తప్రవాహమయిపోయింది.ఎంతచక్కగా శివయ్యగారు చరిత్రను,నైసర్గికతను,యుద్ధభీభత్సాన్ని సమన్వయం చేసారు!

“బాలచంద్రుని కదన కౌశలము కధలల్లి
శ్రీనాధ కవిరాజు చంద్రవంకకు చెప్ప
ఎదకరిగి ప్రవహించెరా ,పలనాట
ఎత్తిపోతల దూకెరా !”
ప్రస్తుత స్థితిని దృష్టిలో ఉంచుకుని చూస్తే చంద్రవంక జన్మస్థలం మా ఊరే .అంటే మాచర్ల దగ్గర ఆత్మకూరు .మా ఊరిలో చెరువు చాలా పెద్దది.దానికంటే పెద్దది ఒక కంభం చెరువే నంటారు. ఏడుకొండవాగులొచ్చి మా చెరువు ముంచెత్తుతవి.దాని పొర్లుకట్ట కిందనుండే చంద్రవంక ప్రారంభం.1901లో మా ఊరి చెరువు నిర్మాణం జరిగిందని చెబుతారు. అంతకు పూర్వం చంద్రవంకగా పిలవబడేది పైన పేర్కొనబడిన ఏడు కొండవాగులు కలిసి పారే నది.చంద్రవంక ఎప్పుడూ సన్నగా పారే జీవనదే.వర్షాకాలం మాత్రం ప్రళయప్రవాహమైపోతుంది.మాచర్ల మీదుగా ప్రవహించి ఎత్తిపోతల కొండలమీదనుండి జలపాతమై నిర్లక్ష్యంగా దూకుతుంది. శ్రీనాధుడు పల్నాటివీరచరిత్ర వ్రాసారు.పల్నాటియుద్ధంలో బాలచంద్రుడి శౌర్యాన్ని, వీరమరణాన్ని శ్రీనాధుడు చెప్పగా విని పల్నాటిప్రజలచే మాతృమూర్తిగా చూడబడే చంద్రవంక స్త్రీ సహజమైన పుత్రప్రేమ,భరించలేని పుత్రశోకంగా మారి ఎదకరిగి దుఃఖావేశంతో కన్నీటిప్రవాహమై ప్రాణత్యాగంకోసమేమో నన్నట్లు ఎత్తిపోతలకొండలమీదనుండి దూకింది.ఎంతటి రమ్యమైన,అసమానమైన,కరుణరసప్రేరితమైన భావన ! చరిత్ర, నైసర్గికస్వరూపం, కరుణామయమానవ నైజం,శ్రీనాధుని గుండెలుపిండే కవితా శక్తి ఎంత అందంగా ,ఎంత శిల్పచాతుర్యంతో,ఎంతరసాత్మకంగా సమన్వయింపచేసారు శివయ్యగారు.

భట్టుమూర్తిగా పిలవబడే రామరాజ భూషణుడు శ్రీ కృష్ణదేవరాయల ఆస్థాన కవీశ్వరులలో ఒకరు.”రాయలవారి అష్టదిగ్గజాలలో భట్టుమూర్తి ఒకరని పండితలోకం చెప్పుకుంటుంది కానీ అందుకు ఆధారాలు తక్కువ” అని అంటారు ఆరుద్ర గారు తన “సమగ్రాంధ్రసాహిత్యం “లో రెండవ సంపుటిలో (పేజీ 322).ఏది ఏమైనా ఈ గేయం యొక్క సౌందర్యానికి వచ్చిన లోపం లేదు.భట్తుమూర్తి “హరిశ్చంద్ర నలోపాఖ్యానం” అనే గొప్ప ద్వ్యర్ధి కావ్యాన్ని వ్రాసారు.ఈ కావ్యంలోని ప్రతి పద్యం అటు హరిశ్చంద్ర చక్రవర్తి గాధకు,ఇటు నలమహారాజు గాధకు గొప్ప సమన్వయం కుదిరే విధంగా వ్రాయబడింది.ఇది మన భాషలో గొప్ప శ్లేషకావ్యం.ఇది సామాన్యమైన విషయం కాదు.సామాన్యమైన ప్రతిభ కాదు.అంతేకాదు ,ఆయన ఒక ఘటికలో నూరు శ్లోకాలు చెప్పగలిగేవారట. ఈ భట్టుమూర్తిగారి స్వగ్రామం పలనాడు లోని భట్టువారి పల్లె.ఈ విషయమై కూడా కొంత వివాదం ఉంది.ఆరుద్రగారి ప్రకారం కడప జిల్లాలోని పులివెందుల దగ్గరి భట్టుపల్లె భట్టుమూర్తిగారి స్వస్థలం అయిఉండవచ్చు అని అంటారు.
‘కృష్ణరాయల సభా కవిదిగ్గజాలలో
ఘటికాశతగ్రంధ కరణధుర్యుండైన
భట్టుమూర్తే వెలసెరా,పలనాట
ప్రౌఢ శ్లేషలు పల్కెరా!”

తరువాత ఆంగ్లేయులు ఈస్టిండియా పేరుతో భారతదేశానికి వ్యాపార నిమిత్తం రావడం,క్రమక్రమేణా,సంస్థానాధీశులమధ్య వైషమ్యాలు  పెంచి అనైక్యతను పోషించి పరమ దుర్మార్గంగా భారతదేశాన్ని ఆక్రమించుకోవటం,స్వాతంత్ర్యపోరాటయోధులను,బందీలను చేయటం అందరికీ తెలిసినదే.
“కలిమి బలిమీ గల్గు కర్షకుల సీమలో
కానికాలం వచ్చి కలహములు చెలరేగ
కుంఫిణీ వాడొచ్చెరా ,పలనాట
ఖైదుకొట్టులు కట్టెరా ”
“కుంఫిణీ వాడొచ్చెరా” అనడం మంచి అర్ధవంతమైన ప్రయోగం .గొప్ప ఇవొకేటివ్ పవర్ ఉన్న ప్రయోగం.ఏదో బూచివాడొచ్చినట్లు,దొంగవచ్చినట్లు,దుష్టమాంత్రికుడొచ్చినట్లు ,దుష్టశక్తి ఏదో దేశానికి అరిష్టంగా ప్రవేశించినట్లు ధ్వనింప చేస్తుంది. వారిమీద ఏహ్యభావాన్ని చక్కగా స్ఫురింప చేస్తుంది.అటువంటివాళ్ళు వచ్చీ రాగానే చేసే పని ఖైదుకొట్టులు కట్టడం.గొప్ప ఔచిత్యశోభ ఉంది,ఇలా చెప్పటంలో. బాలడ్ నిండా ఇలా ఔచిత్యానికి అంతు లేదు.
“దాస్యమూ దోపిడీ దారిద్ర్యమూ హెచ్చి
పాడిపంటల మేలి బంగారు నాతల్లి
కరువుకాటకమొచ్చెరా,పలనాడు
కంటనీరెట్టిందిరా !”
దేశదుస్థితిని ఆర్ద్రంగా చెప్పిన తీరు అమోఘం.చరణం నిండా జాతి దైన్యం,దేశభక్తి తొణికిసలాడుతుంటవి .

“ఒక్క సుముహూర్తాన ఉప్పొంగి భరతోర్వి
స్వాతంత్ర్య సమరాన సింహనాదం సేయ
మేరువైనిలచిందిరా,పలనాడు
ముందుండిపోరిందిరా !
కన్నెగంటి హనుమంతు కోరమీసము త్రిప్పి
పలనాటి ప్రజలచే పన్నులెగబెట్టించె
బలియిచ్చె హనుమంతునూ ,పలనాడు
పరప్రభుత్వపు గుండ్లకూ”

“ఉప్పొంగి భరతోర్వి “చాలా గొప్ప పదప్రయోగం.ఆ రెండు చిన్న మాటల్లో ఆసేతుహిమాచల పర్యంతం గొప్ప కర్మయోగి గాంధీ మహాత్ముని అనితరసాధ్యమైన నాయకత్వంలో భారతీయులందరూ స్వాతంత్ర్యపోరాటంలో సర్వత్యాగాలకూ సిద్ధమై ఒక మహా ప్రవాహవేగంతో ముందుకు దూసుకు పోవటాన్ని ఈ మాటలు స్ఫురింపచేస్తాయి.పలనాడు ఈ మహాపోరాటంలో మేరువై నిలిచింది.ముందుండి అవిశ్రాంతంగా పోరాడింది.ఆ రోజులలో అడవులలో పశువులను మేపుకుంటే బ్రిటిష్ వాళ్ళకు “ఫుల్లరీ” అనే పన్ను కట్టాలట.ఈ పన్నేగాక మరే ఇతర పన్నులను కన్నెగంటి హనుమంతు గారి నాయకత్వంలో పలనాటి ప్రజలు కట్టలేదు,శాసనోల్లంఘనస్ఫూర్తితో.దుర్గికి ఆరేడు మైళ్ళదూరంలో ఉన్న మించాలపాడు గ్రామ కాపురస్తులు హనుమంతు గారు.కొందరు దేశద్రోహులు ఆచూకీ అందిస్తే ,బ్రిటిష్ ప్రభుత్వం కన్నెగంటి హనుమంతు గారిని కనుగొని కాల్చి చంపింది. వీర హనుమంతు తనప్రాణ త్యాగంతో  అమరులై బాలచంద్రుని సరసన పలనాటి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.మా చిన్నతనంలో కన్నెగంటి హనుమంతు అంటే మాకొక మహావీరుడు .ఆయన శారీరక బలాన్ని గురించి ,ధైర్యసాహసాలగురించి,ఉద్యమనిర్మాణ సామర్ధ్యం గురించి పెద్దలు కధలుకధలుగా చెప్పేవారు.నా చిన్నతనంలో వారి కుమార్తెను ఓబులేసునిపల్లెలో వాళ్ళ బజారుకు వెళ్ళినప్పుడల్లా దూరంగా నుంచుని చూసేవాణ్ణి. ఆమె వయస్సు అప్పుడు 45-50 సంవత్సరాల మధ్య ఉండవచ్చు.ఆమెను చూస్తే ఆమె తండ్రి వీర హనుమంతుగారిని చూసినట్లే ఉండేది.గర్వంగా ఉండేది.
“ఆనాటి పౌరుషాలానాటి విక్రమా
లానాటి వైభవాలానాటి సంస్కృతుల్
ఈనాటికీ చరితలోనా ,పలనాడు
వెలయించె బంగారుతో .
వెనుకతరములవారి వీరచరితల సిరులు
నార్వోసి త్యాగంబు నీర్వెట్టి పెంచరా !
విరిసి సుఖములు పండురా,పలనాడు
వెలలేని మాగాణిరా !”

మన పూర్వులు చేసిన త్యాగాలకు మనమెప్పుడూ ఋణపడే ఉంటాము.వారి ఆశయాలను ఇంకా ముందుకు తీసుకపోయే నైతికబాధ్యత మనది.ఎంతచక్కని మెటఫర్స్ తో ఈ నీతిని ప్రబోధిస్తూ ,ఈ బాలడ్ ను ఎంతో అందంగా ముగిస్తారు శివయ్య గారు.

సచ్ఛీలులైన  గొప్పకవుల మాటలు ఊరక పోవు.శివయ్యగారు ఈ బాలడ్ వ్రాసినపుడు పల్నాడులో అక్కడక్కడ చెరువులక్రింద ఉండేమాగాణి మినహా తక్కిన దంతా వర్షాధారమైన మెట్టభూమి.ఈనాడు పలనాడు పాడిపంటల బంగారు తల్లి.శివయ్యగారు దీవించినట్లుగా నాగార్జునసాగర్ నీళ్ళతో పలనాడు నిజంగా వెలలేని మాగాణి!పలనాటి వీరులకు జోహార్లు!పులుపుల శివయ్యగారికి జోహార్లు!
దశాబ్దాలతరబడి ఈ బాలడ్ ని లయబద్ధంగా పాడుకుని పరవశించిపోవటం ,దీని సాహితీ విలువలను గురించి ఔన్నత్యాన్ని గురించి మిత్రులతో చర్చించుకోవటమే కానీ దీనిమీద వ్రాయాలనే తలంపు ఎప్పుడూ రాలేదు.ఇప్పుడు వ్రాయడానికి ప్రేరణ మొన్నీ మధ్య పుస్తకంలో  ప్రచురితమైన నా వ్యాసం “కోలవెన్ను రామకోటీశ్వరరావు గారు” పై నాళం రవీంద్రనాధ్ గారు తన కామెంట్ తో చేసిన సూచన.వారికి కృతజ్ఞతలు.
ఇది పులుపుల శివయ్యగారి శతజయంతి సంవత్సరం.ఈ వ్యాసం ద్వారా వారికి నివాళులర్పించటం నా అదృష్టంగా భావిస్తున్నాను.

సి.ఎస్.రావ్
09/29/2010

You Might Also Like

13 Comments

  1. దేవిరెడ్డి రామకృష్ణారెడ్డి

    సి.యస్. రావు గారూ మీకు ధన్యవాదాలు. కవిత్వానికి తగ్గ వ్యాఖ్యానం చేసినారు. పాటను అద్భుతంగా అవిష్కరించినారు. కడప వాన్నైనా రొమాంచంగా అనిపించింది. పలనాడు మీద గౌరవం ఇనుమడింప జేసింది.

  2. Desu Chandra Naga Srinivasa Rao

    తెలుగువారందరూ గర్వించదగ్గ మహానుభావులు శ్రీ పులుపుల శివయ్య గారు. వారి రచనలని శ్రీ సి. ఎస్. రావు గారు ఈ వ్యాసం ద్వార గుర్తు చేసారు. చాల స్పూర్తి దాయకం.

  3. Raghu Babu Yarlagadda

    స్ఫూర్తిదాయకమైన వ్యాసం !!! ధన్యోస్మి !!!

  4. C.S.Rao

    సుదర్శనబాబు గారూ,
    తనను ఆరాధించే సైన్యం,తనకోసం ప్రాణాలర్పించటానికి సిద్ధబడి పోరుకొచ్చిన సైన్యం.తాను నమ్మి ఆచరించే ధర్మయుద్ధరీతిని,నీతిని వారిలో ఎవరైనా అతిక్రమిస్తే నిర్దాక్షిణ్యంగా ,నిష్పక్షపాతంగా,పరమకఠినంగా శిక్షిస్తానని వారిని హెచ్చరించటానికి ఎన్ని గుండెలు కావాలి,ఎంత ధైర్యం కావాలి.ఎంతటి సాహసం కావాలి,ఎంతటి అచంచలమైన ధర్మదీక్షా తత్పరత కావాలి!ఈ సుగుణాలన్నీ ఉన్న మహా మనీషి మన బ్రహ్మనాయుడు గారు.వారి ఈ గుణాలనన్నీ స్ఫురింపజేసే విధంగా వ్రాయబడ్డ పద్యం మల్లాది రామకృష్ణశాస్త్రి గారిది.పాత్రోచితంగా వ్రాయబడ్డ గొప్ప పద్యం.
    “పులకలే యెత్తించెరా ” – అంటే శరీరం రోమాంచితం అయ్యేట్లు చేయడం.ఇదే సరైన పంక్తి.
    గురజాలలో బ్రహ్మనాయుడు గారి విగ్రహం ఉందన్నారు.సంతోషం.మాచర్లలో ఉండటం నేను చూసాను.కారెంపూడిలో ఉందా?ఉండాలి.
    ఆయన గొప్ప మహామాత్యులు,మహావీరులే కాదు,గొప్ప మానవతా వాదులు,సమతావాదులు.నిస్సంగులు.(ఎ స్పిరిట్ ఆఫ్ రినన్సియేషన్ కలవారు.)తెలుగువారందరూ గర్వించదగ్గ వారు.చరిత్రపుటలలో ఇంతటి మహనీయులు అరుదుగా కనిపిస్తారు.జాతి పునరుజ్జీవనం పొందేది ఇలాంటి మహానుభావులవలననే .వారికి వారసులుగా బ్రతకడంలో మనకు గొప్ప గౌరవం,ఒకింత గర్వం కూడా.

    మీ ఉత్తమకవిత్వాభిరుచికి అభినందనలు.

  5. సుదర్శన బాబు

    మాది పల్నాడు. గురజాలలో బ్రహ్మనాయుడి విగ్రహ శిలాఫలకం మీద రెండు పద్యాలున్నై.
    నేను మాతమ్ముళ్ళు(చదువుకుంటున్నారు) ఇంట్లోవాళ్ళందరం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ అందరితో లలిసి కేవలం పాత సినిమాలు మాత్రమె రిపీటెడ్ గా చూస్తూ ఉంటాం. ఈ క్రమంలో NTR పల్నాటియుద్దం చూశాం. టైటిల్స్ లో బ్యాక్ గ్రౌండ్ లో ఈ పద్యాలు వస్తాయి. సినిమా చూసినప్పటినుంచి ఈ పద్యాలని బట్టీపట్టి పోటీలు పడిమరీ పాడుతుంటాం. మా బ్యాచ్ లో కొందరు బడికి వెల్లే పిల్లగాళ్ళుకూడా ఉన్నారులెండి.

    గురువుగారు చిన్న అనుమానం.

    “పులకలే యెత్తించెరా పలనాట
    పౌరుషమ్మే పొంగెరా! ”

    “పుంఖలే యెత్తించెరా” అనుకుంటానండి.

    సినిమా గురించి ఇంకో మాట. మల్లాది రామకృష్ణశాస్త్రిగారు కూడా చాలా గొప్పపద్యాలు రాశారు. మచ్చుకి “బ్రహ్మనాయని కదనధర్మములు దప్పిన వాని మస్తమునుదరిగి కోటశక్తికి కొప్పులో గుచ్చగలను” అంటు బ్రహ్మనాయుడు తన సైన్యానికి యుద్దధర్మాలు చెప్పే పద్యం అద్భుతం.
    గుర్తుచేశారు గురువుగారు! ధన్యవాదాలు.

  6. C.S.Rao

    రెంటాలగోపాలకృష్ణ గారు,బెల్లంకొండ రామదాసు గారు,అనిశెట్టి సుబ్బారావుగారు వామపక్షసిద్ధాంతాల ప్రాతిపదికగా కల సృజనాత్మక రచనలు చేసి ప్రసిద్ధులైన “యాంగ్రీ యంగ్ మెన్ “గా నా హైస్కూల్ దశ లోనే వింటుండేవాణ్ణి.వారిలో ఒకరి పేరు వింటే తక్కిన ఇద్దరూ గుర్తుకువచ్చేవారు.వారు భావ సారూప్యతకల మంచి స్నేహితులు,ఒక యూనిట్.వారెవరినీ నేను చూడక పోయినా రామదాసు గారి నాన్నగారు బెల్లంకొండ రాఘవరావు గారిని,శ్రీకోలవెన్ను రామకోటీశ్వరరావుగారి ఇంట్లో సంవత్సరాల తరబడి దాదాపు ప్రతి రోజు చూస్తుండేవాడిని.వారితో కొద్దిపాటి పరిచయం కూడా ఉండేది.రాఘవరావు గారు,కోలవెన్ను వారు మంచి మిత్రులు.కల్పన గారు సహృదయతతో నిండిన వారి వ్యాఖ్యతో ఒక్కసారి వారినందరినీ ఆర్ద్రంగా గుర్తుకు వచ్చేట్లు చేసారు.

    సుందరాచారిగారు రామకధను అందమైన ఆటవెలదులలో వెలయించారని మందాకిని గారు చెప్పటం సంతోషంగా ఉంది.సాధ్యమైనంత త్వరలో ఆ గ్రంధం చదువుతాను.
    యదుకుల భూషణ్ గారు చక్కగా చెప్పారు,పలనాటి మట్టిలో,నీటిలో,శివయ్యగారు ఈ గీతం ద్వారా ఆ ప్రాంత ప్రజల ఆత్మను కాప్చర్ చేసారని.

    మాలతిగారి వ్యాఖ్య నేనెప్పుడూ అనుకునే హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ డిస్గైజ్ అనె విషయం తమాషాగా ఏదో కొత్తదనంతో మనసులో మెదిలేట్లు చేసింది.

    చేరా గారు వ్రాయగా నేనూ చదివాను,ఈ గేయాన్ని గోపాలం గారు గొప్పగా ఆలపించేవారని.గోపాలం గారు చదవటం నేను వినలేదు.”పల్నాటి యుద్ధం” సినిమా లో టైటిల్ సాంగ్ గా రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో ఈ బాలడ్ ని ఉపయోగించుకున్నారని నాకు తెలుసు.కానీ అది వినిపించిన తీరు నాకేమాత్రమూ నచ్చలేదు .ఈ బాలడ్ వ్యక్తీకరించే పలనాటి ప్రజల ప్రాచీన వైభవాన్ని రాజేశ్వరరావుగారి బాణీ రిసరెక్ట్ చేయలేకపోయింది.నా బాల్యం నుండి పలనాటి ప్రజలు గొప్ప లయబద్ధంగా చదువుకునే ఒకరకమైన జానపద సాంప్రదాయక రీతి ఆ ట్యూన్ లో లేకపోవటం ఆ సినిమా చూసినప్పుడు నిరాశ,నిస్పృహలకు లోనుచేసింది.
    కొత్తపాళీ గారు కలం కదిపితే ప్రొప్రైటీ ,బ్రెవిటీ,బ్యూటీ ఉంటవి.

    తమ వ్యాఖ్యల ద్వారా ఈ వ్యాసానికి సహృదయతతో స్పందించిన వారందరికీ ధన్యవాదములు.

    ఈ వ్యాసాన్ని ప్రచురించిన పుస్తకం నిర్వాహకులు పూర్ణిమ,సౌమ్య గార్లకు కృతజ్ఞతలు .

  7. కొత్తపాళీ

    చాలా బాగుంది మాస్టారూ. సంతోషం

  8. malathi

    సి.యస్.రావుగారూ, మనసుకి హత్తుకునేలా వివరిస్తూ, పలనాటి వీరచరిత్ర మరోసారి గుర్తు చేశారు. శివయ్యగారిపేరు వినలేదు కానీ ఆ గేయం వినేదాన్ని చిన్నప్పుడు రేడియోలో. భారతానికీ పల్నాటివీరచరిత్రకీ మీరు ఎత్తిచూపిన సామ్యంతో కథ మరింత దగ్గరయింది.
    ఇలాటి పరిశీలనాత్మకవ్యాసాలు పుస్తకం.నెట్ స్థాయిని పెంచుతాయి. నాలాటిపాఠకులకి ఉత్సాహాన్ని ఇస్తాయి. రచయితకీ, సైటు నిర్వాహకులకీ అభినందనలు.

  9. తమ్మినేని యదుకుల భూషణ్.

    ఒక జాతిలో వీరత్వము నశించి పోయాక ఆ జాతిని గురించి చెప్పుకోవడానికి ఏమీ ఉండదు.
    కవులు చేయదగినది తరతరాలు వీరులను స్మరించుకోనేలా కావ్యాలు /గీతాలు రచించడం .
    పులుపుల శివయ్య గొప్పతనం పలనాటి ఆత్మను ఆ మట్టిలో ఆ నీటిలో దర్శించి గర్వంతో
    ఉప్పొంగి గానం చేయడం. శ్రీ .శ్రీ మహా ప్రస్థానం లో నయాగరా మొదలుకొని శివసముద్రం
    దాకా అన్ని జలవర్గాలు కనిపిస్తాయి. అంతే కాక , అది ఒక వైపు నజ్రుల్ “చొల్ చొల్ ఊర్ధ్వ
    గొగనే బాజే మతోల్ ” లాంటి గీతాలు మరో వైపు “షురూ హువా ..” లాంటి గీతాలు మరో
    వైపు లాగుతూనే ఉన్నాయి.ఇంత ప్రభావ కవిత్వం రాసినట్టు లేదు పులుపుల శివయ్య . కాబట్టే,
    రాసిన ఒకే ఒక వీరగీతం గదా ఘాతంలా తాకి నిద్రాణమైన జాతిని పౌరుష హీనమైన జాతిని తట్టి లేపుతుంది.

    ఈ క్షణంలో అక్కిరాజు ఉమాకాంతం గారు పలనాటి భారతాన్ని పరిష్కరించి విపుల పీఠిక తో
    ప్రచురించారు అన్న విషయం విజ్ఞులైన పాఠకులు మరచి పోరాదు. ఇవన్నీ చిన్న నాడు పాఠాల
    రూపంలో చదువు కొని ఉంటే ఎందరికో గుర్తు ఉండేవి . సుబ్బారావు గారు మహనీయులను
    తలచుకొని ప్రతాప స్ఫురణ కలిగించినందుకు సర్వదా వంద్యులు.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  10. జంపాల చౌదరి

    చేకూరి రామారావుగారు తమ చేరాతల్లో ఈ పాట గురించి, ఆరోజుల్లో కమ్యూనిస్టు పార్టీ సభల్లోనూ, ప్రజానాట్యమండలి ప్రదర్శనల్లోనూ బి.గోపాల్ ఉర్రూతలూగించేలా ఈ పాట పాడటం గురించీ విపులంగా, హృద్యంగా వ్రాశారు.

    బి.గోపాల్ గొంతులోనే ఈ పాట (మొత్తం కాదు కానీ) రామినీడు దర్శకత్వంలో వచ్చిన పల్నాటియుద్ధం చిత్రంలో వినిపిస్తుంది. పాత తెలుగు పాటల వెబ్‌సైట్లలో దొరకవచ్చు. నాకైతే పరుచూరి శ్రీనివాస్ ఇచ్చాడనుకోండి (థాంక్స్ ఒన్స్ అగైన్ శ్రీనివాస్!)

  11. మందాకిని

    1998 లొ ప్రచురించారు.

  12. మందాకిని

    మంచి విషయాలు అందిస్తూ చక్కటి వ్యాసం రాశారు. ధన్యవాదాలు.
    పలనాటి యుద్ధం గురించి మాత్రమే తెలుసును. ఇప్పుడింకొంత సమాచారం తెలిసింది.
    శంకరంబాడి సుందరాచారి గారు సుందర రామాయణము అనే పేరుతొ రామాయణాన్ని పూర్తిగా రాశారు. పొందికైన పదాలతో పొదిగిన తేటగీతి పద్యాలలో, సరళంగా అర్థమయ్యే రీతిలో (నిఘంటువు అవసరం) లేకుండా, రసపోషణ కలిగిఉన్న ఈ రెండు వందల పేజీల పుస్తకాన్ని తి.తి.దేవస్థానం వారు లొ ప్రచురించారు. వెల పదిహేను రూపాయలు.

  13. kalpana

    సి. ఎస్. రావు గారూ,

    ఇంత మంచి వ్యాసం రాసినందూకు మీకు వేనవేల ధన్యవాదాలు. పులుపుల శివయ్య గారు మా నాన్నగారికి ఆదర్శం. ఆ తరం వారి పేర్లు కూడా ఈ కాలం వారికి తెలియవు. మీలాంటి వాళ్ళు శ్రమకోర్చి ఇంత వివరంగానూ, ఇంత చక్కగానూ రాసినందుకు కృతజ్నతలు.

Leave a Reply