సిరాసేజ్జెం

రాసిన వారు : చంద్రలత
*********************
పొలమంతా సిరా చల్లి, అక్షరాలు నాటేసి, కథన సేద్యం చేస్తే .. అక్కడ మొలకెత్తేది ఆనందమా?ఆవేదనా? ఆందోళనా? ఆక్రందనా?
ఖచ్చితంగా అవి అన్నీ కలగలసిన.. మొలకలపల్లి గారి ” సేజ్జెగాడు” కథాసంకలనం అయి ఉంటుంది !

అవునండి. తెలుగునాట ప్రత్తిరైతులు పురుగుమందును కడుపులో దాచుకొని మన ఓటమిని తమదిగా దిగమింగిన విషాద నేపధ్యంలో , మొలకలపల్లి గారు నవలీకరించిన ఆ”ఆక్రందన” మనలను ఇంకా వెన్నాడుతూనే ఉండగా, ఇదుగో ఇప్పుడు పదిహేడు కథల రూపంలో రైతుల జీవితశకలాలను “సేజ్జెగాడు”వెంట తీసుకొచ్చింది.

బతక లేక బడుగు రైతు ..అనుకునే ఈ రోజుల్లో..ఈ కథలు మనకు మరో మారు బతుకు తీపిని పరిచయం చేస్తాయి.
రైతులంటే చిన్నచితకా రైతులు కాదండోయ్ ! మోతుబరులు!
మోతుబరులంటే అలాంటిలాంటి మోతుబరులు కాదండోయ్! అక్షరాలా అయిదెకారాల ముప్పై సెంట్ల మోతుబర్లు !
అవునండీ, పండిన పంటను ఉన్న ఊళ్ళో అమ్ముకోక , మార్క్ ఫెడ్ కు వెళితే మంచి ధర వస్తుందని ఒక రైతు, పట్నానికి పయనమాయ్యాడు. వాళ్ళావిడ ఎత్తిపొడుపులను మెత్తగానే వారిస్తూ” పండిన పంటని పీడాకారం అనుకుంటే ఎట్టే ?” అంటూ.

శీతలగిడ్డంగులకు చేరిన సరుకు అక్కడే ,పడి ఉండగా, ఎగుమతుల ఆంక్షలు తొలింగింప జేసేందుకు కృషి చేస్తున్నామని, అనుమతులు ఇప్పించేస్తామంటూ మంత్రివర్యుల వాగ్దానదాసులవుతూ , మార్క్ ఫెడ్ ఫారాలను చేత బట్టుకొని , పదారు “సంతకాలు” సేకరించి అందుకై ఉన్న నాలుగు రాళ్ళు కరగదీసి, చివరాఖరకు తెలిందేమిటయ్యా అంటే, ఈ రైతు గారు మోతుబరి అని!
ఏలాంటెలాంటి మోతుబరి..? అక్షరలా 30 సెంట్లు అధికంగా ఉన్న మోతుబరి.

“అందులో మూడున్నరెకరాలే పంటేసాను. మిగిందంతా సవ్వనేల ” అంటూ ఆ రైతు నెత్తీ నోరు కొట్టుకొని ఏమి ప్రయోజనం? మోతుబరి మోతుబరే! లెక్కలో తేడాల్లేవిక్కడ!
ఇక, అటూ ఇటూ చెడిన ఆ రైతు కు చివరికి మిగిలేదేమిటి?
గుక్కెడు పురుగు మందా? మూరెడు ఉరి త్రాడా?
మార్క్ ఫెడ్ మాయాజాలమై పోతే , వ్యవసాయం ఎత్తుభారం అయి పోదా?
ఇంతకీ , సదరు రైతుగారు పండించేదేమిటి?
శనగలు, కందులు,మినుములు,పెసలు, వంగ, చివారఖరకు ..వద్దనుకుంటూనే , మళ్ళీ, ప్రత్తి!

విత్తనాలు,సత్తవ మందులు, పురుగు మందులు,కూలిడబ్బులు , వీటన్నిటి కోసం చేసిన బాకీలు, ఇక, ఆ “వడ్డీతొ వడగళ్ళ గుర్రం కూడా పరిగెత్త లేదంట!”
ఆ పై, పల్లెలో మార్కెట్లో వ్యాపారుల మాయాజాలం లో రైతు చిక్కి విలవిలాడి పోక తప్పదు కదా?
” తనని ప్రేమించి లాలించి అనురాగం పంచీ మమకారం పెంచుకొన్న తన గారాల పుత్రుడి అవసరానికి కాకుండా, తన ఫలం ఎక్కడికో పరాయి ఇంటికి ,పరాయి చోటుకి ,పరాయి అవసరానికి పోతున్నందుకు నేలతల్లి కంట తడి “పెట్టుకున్నదట! కన్నబిడ్డ ఆరోగ్యం ఫణంగా పెట్టిన నిస్సహాయ స్థితిలో , భర్తతో పాటు పొలంలో రెక్కలు ముక్కలు చేసుకున్న” దొడ్డ ఇల్లాలు మల్లీశ్వరి “ఏం చేస్తుంది? ” పమిట చెంగుతో కళ్ళు తుడుచుకుంది!” (కోత)

ఎహోషువా రూతమ్మలను ఒకసారి పలకరించి చూడండి. మన పొలం వొట్టిపోవడానికి కారణాలు తెలుస్తాయేమో!
ఎహోషువా మట్టి మర్మమెరిగిన సేజ్జెగాడు. కోల చేతబట్టి కొండ్ర వేశాడంటే ,పంట చాళ్ళలో విరగపండి, ఫక్కున నవ్వినట్లే.ఎద్దులను అదిలించాడంటే , ఇక ఆ ఊరి పురులు పొంగిపొర్లినట్లే. తెల్లరి లేచిన దగ్గరనుంచి ,పొద్దు వాలే వరకూ , అతను చేసిన సేజ్జెం ..రూతమ్మ కడుపు నింపిందా కట్టుకోకలిచ్చిందా ..ఊహు .. చివరకు ..బోరవిరుచుకు తిరిగిన ఆ సేద్యగాడు, అతనితో పాటు రంకెలేసుకు తిరిగిన ఆ ఒంగోలు జాతి గిత్తలు .. ఒక్క ట్రక్టరు దెబ్బకు ..కాలంలో కలిసిపోవలసి వచ్చింది.

“ఆ పాణం ఉన్న వాటికన్నా లేని వాటితోనే సుఖం రా! చీకూచింతా ఉండదు.ఎద్దులమేతకి ఎంత ఖర్చవతందీ? పని ఉన్నా లేకున్నా మేత తప్పదాయే! లెక్క జూసుకుంటే ఎద్దులసేజ్జం అందదురా,ఎనకటిరోజుల్లో ఎట్టా జేసారో కానీ..” అని ఊళ్ళోని రైతులన్నప్పుడు ఎహోషువా చెపుతాడు కదా”

“ ఎద్దులు గాట్లో ఉంటేనే గాదెలు నిండి పోతాయి గదా కాపా ! ఎద్దులకి వేసే మేత చూశావు కాని ,వాటి పేడ చాలు.బంగారం పంట పండడానికి ! వాటి పేడ ఎంతో సత్తవ కదా కాపా! మనకి ఎంత నయ్యిదిబ్బ తేలిద్దీ?బస్తాల ఎరువులు ఏమొస్తన్నయి..పురుగులు వస్తన్నయి,తెగుళ్ళు వస్తన్నయి,ఖర్చులు ఎక్కువ అవతన్నయి,చివరికి దిగుబళ్ళూ రావడం లా! ”

అదేంటి ఎహోషువా నోట అత్యాధునిక ఆర్గానిక్ ఫార్మింగ్ ,సస్టైనబుల్ అగ్రికల్చర్ లాంటి భావజాలం …అలా దొర్లిపోతున్నది?

అవునండి . ఆ పొలం తనది కాదు. ఆ అరక తనది .ఆ కాడెద్దులు తనవి కావు. కానీ, తరతరాలుగా సేజ్జేగాళ్ళగ బతికిన ఆ ఎహోషువ అనుభవం లోంచి వచ్చిన మాటలవి.రెక్కలకష్టం నమ్ముకున్న ఎహోషువ పట్నం దారి బట్టాడు. అతని మాటలు పెడ చెవిన పెట్టిన ఆ ఊరి రైతాంగం గుక్కెడు విషం పట్టారు!

మరి రైతులన్న దానిలోనూ వాస్తవమున్నది . చూడండి, కాడెద్దులు జతయితే .తమరెక్కలకష్టం తోడయితే , ఉన్న ఎకరం నేల తమను గట్టెక్కిస్తుందని , గంపెడంత ఆశతో బ్యాంకుకు అప్పుకు పోయిన రైతు ,చివరకు ఆ వడ్డీ తీర్చడం కోసం ఆ ఎద్దులు,అరక, బండి,ఎకరం నేల అమ్ముకొని ,కుటుంబమంతా కూలిపనికి మళ్ళాల్సిన వైనం ,”బతుకు తనఖా” లో చదవండి!

ఇక, పల్లెటూరి పందాలు ,గెలుపుఓటములు, ఎత్తిపొడుపులు ,వేళాకోళాలు ,గడపదాటని గౌరవమర్యాదలు,పల్లెదాటని మాటపట్టింపులు, చిన్నరైతుల “కలలపంట” ఫేగుతీపి” పిల్లల చదువులు, ఆసుపత్రి ఖర్చులు, ఆడపిల్లలకట్నాలు ,అల్లుళ్ళ అరణాలు, కొడుకుల కొత్తపోకళ్ళు, కూతుళ్ల స్వతంత్రభావనలు, కోడళ్ళ కరకరలు,తలకొరివిపెట్టాల్సిన కొడుకుతో తలపగలకొట్టించుకొని తలవాల్చుకొని నిల్చునే తండ్రులూ, చెల్లెలి కట్నంసొమ్మును ఆస్తిలో తన వాటాగా చెల్లుబెట్టి వ్యాపరంలో పెట్టుబడిగా మార్చేసుకొనే అన్నాయి,నచ్చిన వాడితో నడిచివెళ్ళే చదువుకొన్న అమ్మాయిలు , భర్తతో పాటు కష్టమూ నిష్టూరం భరాయించే దొడ్డ ఇల్లాళ్ళు , అవసరమైతే ,భద్రకాళులై “ఈ సారి పైకి రా..నరికి పారేస్తా! మొగోడంటనే పేద్ద మొగోడు ! ఆడదాన్ని కొట్టడమా మొగోడితనమంటే ?” అంటూ గర్జించే శాంతమ్మలూ..

అందరికీ అన్నిటికీ అంతఃసూత్రంగా ఆ ఎకరం నేల!

అర్రుగొర్రు పొలం, మందళ్ళలో జొన్నపైరు …లాంటి పల్లెగడపలొంచి పలికే కమ్మని తేట తెలుగు పదాలు పలుకుబళ్ళు కమ్మని గుమ్ముపాలు తాగిన అనుభూతిని ఇస్తే, కడుపులో కెలికే కన్నపేగు మెలికలు, చర్రున నసాళానికెక్కే కోపమూ ,అన్నె తెలిసీ ఏమీ చేయలేని నిరాశా, నేలనమ్ముకొని నలిగిన బతుకులు ,అన్నిటినీ నడిపించే ఆ ఆర్ధిక మంతరం రజకీయ తంత్రమై కుతంత్రమై ..రైతు మెడకు చుట్టుకుంతున్న , ఆ వైనాలన్నీ ఈ కథల్లో చదివాక, కళ్ళల్లో గిర్రున నీళ్ళు తిరగకపోతే చూడండి.పొలంలో నాట్లేస్తూనో , నాగలి దున్నుతూనో ,కలుపు తీస్తూనో,కల్లాం చెస్తూనో, పైటేళ బువ్వ తింటూనో , మాపటేళ మననం చేసుకొంటూనో, ఆ రైతన్న మొలకలపల్లి ,పలికిన అచ్చమైన బతుకు కథలివి. ఆ రైతు బతుకులోని అగరు ..వగరు.. పొగరు ..ఎవరికి వారు స్వయంగా రుచి చూడవలసిందే.

అన్ని కష్ట నిష్టూరాలనూ ఓర్చి ,

” ఎల్ల కాలం దండగలు పడతాం ఏందీ? అట్టా పొలంలో ఎప్పుడూ దండగలు పడే పనయితే దేశంలో ఎవడూ పొలం జేయడు.ఇక జనం అంతా ఏం ..
తిని బతుకు తారు ? కొట్టిన అమ్మే పెట్టక మానదు.ఇయ్యాల కాకపోతే రేపైనా వానలు కురవకాపోవు,పొలం పండకాపోదు!”
అన్న ఆశాభావంతో తమను తాము ఓదార్చుకొని , మళ్ళీ అరక పట్టి సేజ్జెం మొదలెట్టే .. ఆ అన్నం పెట్టె చేతులకు నమస్కారం .
ఒక పాఠకురాలిగా రచయితకు అనేక ధన్యవాదాలు.

సేజ్జెగాడు, కథాసంకలనం (Sejjegaadu)
రచన: శ్రీ మొలకలపల్లి కోటేశ్వరరావు (Molakalapalli Koteswara Rao)
ప్రచురణ: విశాలాంధ్ర
వెల :60 రూ.

You Might Also Like

4 Comments

  1. పుస్తకం » Blog Archive » 2010లో నా పుస్తకాలు

    […] వంశీ 31. ఆనాటి వానచినుకులు – వంశీ 32. సేజ్జెగాడు – మొలకలపల్లి కోటేశ్వరరావు 33. పేగు […]

  2. చంద్ర లత

    సీతారామయ్య గారు,
    నమస్కారం.
    మీరన్నట్లుగానే , “సేజ్జెగాడు” ను పరిచయం చేద్దామని అనుకొన్నానే గానీ, ఉద్వేగం ఉద్రేకం కలగలిసి, అక్షరాలు సాగలేదు.. అందుకనే అచ్చుతప్పులతో సహా అన్ని పరిమితులు ఈ అభిప్రాయానికి.
    శాంతమ్మ పేరును ఎంపిక చేసుకోవడం లోనే మొలకలపల్లి గారి కలం చెణుకు తెలుస్తోంది.

    ఆ కథలన్నీ ,కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే ,ఆగి ఆగి చదవాల్సి వచ్చింది. నేను కూడా.

    చిన్న చిన్న సంఘటనలు.నిత్య సంఘర్షణలూ.జీవితం !

    ధన్యవాదాలు.

  3. ఆరి సీతారామయ్య

    చంద్రలత గారూ,

    “సేజ్జగాడు” గురించి మీరు రాసిన పరిచయం చాలా బాగుంది. మొలకలపల్లి గారి కథలంటే నాకు చాలా ఇష్టం. వారి కథల్లో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ఎక్కడా ఉపన్యాసాలుండవు, బోధించి బాధించే పని చెయ్యరు, నిజ జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు మన ముందుంచుతారు. ఇక చదివి కళ్ళనీళ్ళుపెట్టుకోవటమా, కోపం తెచ్చుకోవటమా, అధికారులనూ వ్యాపారస్తులనూ తన్నాలనుకోవటమా, అది పాఠకుల స్పందన మీద ఆధారపడి ఉంటుంది.

    “సేజ్జ గాడు” సంకలనం లో నాకు అన్ని కథలూ నచ్చినవే. కాకపోతే “శాంతమ్మ” అంటే నాకు ప్రత్యేకంగా ఇష్టం. ప్రతిరైతు కుటుంబంలోనూ ఈ సారి పంట బాగా పండితే అప్పులు తీరతయ్యనో, అదృష్టం బాగుంటే వచ్చే ఆదాయంతో ఈ సారి రెండెకరాలు కౌలుకు తీసుకుందామనో ఆశ ఉంటుంది. కాని పంటలు పండకపోతేనో, పురుగులు పడి పంటను నాశనం చేస్తేనో, పండిన పంటకు ధరలు లేకుండాపోతేనో, ఇలాంటి భయాలు వెంటాడుతూనే ఉంటాయి. “శాంతమ్మ” కథలో, వ్యవసాయ కుటుంబాల ఆశలకు ప్రతీకగా శాంతమ్మనూ, సంకోచానికి ప్రతీకగా ఆమె భర్తనూ నిలబెట్టి చక్కటి కథ రాశారు కోటేశ్వర రావు గారు.

    నేను జులై లో ఇండియా వెళ్ళినప్పుడు మా అమ్మా, ఇద్దరు చెల్లెళ్ళూ, ఇద్దరు మేనకోడళ్ళూ, కోటేశ్వరరావు గారూ నేనూ కూర్చుని ఈ కథ గురించి మాట్లాడుకున్నాం. కథ నేను చదివి అందరికీ వినిపిస్తానంటే, ఇప్పుడెందుకులెండీ అన్నారాయన. నాకైతే అందరికీ వినిపించాలనిపించింది. చదవటం మొదలుపెట్టాను. కాని చివరిదాకా వచ్చే సరికి ఇక చదవటం నా వల్ల కాలేదు. లేనిపోంది అందరిముండూ ఏడుపొచ్చేస్తుందేమోనని నా మేనకోడలు తనూజ పక్కనే కూర్చోనుంటే ఇక నువ్వు చదువు అని ఆమె చేతికిచ్చాను పుస్తకం.

    వ్యవసాయ కుటుంబాల సాధకబాధకాల్ని ఇంత లోతుగా అర్థం చేసుకున్న వారు చాలా అరుదు. కోటేశ్వరరావు గారికీ, ఈ పుస్తకాన్ని పరిచయం చేసిన మీకూ అభినందనలు.

  4. cbrao

    ఇది సిరాసేజ్జమే కాదు రైతుల వెత. ఇన్ని కష్టాలతో భారత రైతు ఎలా వ్యవసాయం చేస్తాడో అర్థం కాకుంది. రైతులందరికీ జోహార్లు. జై కిసాన్.

Leave a Reply