కనుపర్తి వరలక్ష్మమ్మగారి విశిష్ట వ్యక్తిత్వం

ప్రముఖ సంఘసేవా తత్పరురాలూ, రచయిత్రీ, అయిన కనుమర్తి వరలక్ష్మమ్మగారు (1896-1978) స్వాతంత్ర్యోద్యమంలో విస్తృతంగా కృషి చేసిన మహా మనీషి. వీరేశలింగంగారు ప్రారంభించిన ఉద్యమాలూ, స్వాతంత్ర్య సమరమూ మంచి వూపు అందుకున్న సమయం అది. వరలక్ష్మమ్మగారిమీద ఆ ఉద్యమాల ప్రభావం చాలా వుంది. గాంధీగారి నాయకత్వంలో విదేశీ వస్త్రబహిష్కరణలో పాల్గొని ఆమె ఖద్దరు ధరించడం ప్రారంభించారు. స్త్రీలని విద్యావంతులని చేయడానికీ, విజ్ఞానవంతులని చేయడానికీ బాపట్లలో స్త్రీహితైషిణీ మండలి స్థాపించారు. స్త్రీలు ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రోత్సహించిన ఆదర్శ మహిళ. ఆమె సామాజిక విలువలూ, వ్యక్తిత్వం కొంతవరకూ ఆమె రచనల్లో వ్యక్తమవుతాయి.

వరలక్ష్మమ్మగారి తొలి నవల వసుమతి. ఆమె 14 సంవత్సరాలప్పుడు ఆమె తల్లితో ఒక దీనురాలు చెప్పుకుంటున్న హృదయవిదారకమైన చరిత్ర విని మనసు ద్రవించి ఆకథ రాయాలని చాలా వేదన పడ్డారుట. ఆతరవాత మరో నాలుగేళ్లకి ఆకథ రాయడం జరిగింది. కానీ ప్రచురించడానికి చాలా అవస్థలు పడవలసివచ్చింది. ఆఖరికి 1925లో సాధించారు. అప్పటికి ఆమె వయసు 29.

వసుమతి నవలలో కథ సాధారణమయినదే. వసుమతి చిన్నపిల్ల, అమాయకురాలు. ఆనాటి ఆచారాలప్రకారం చిన్నతనంలోనే పెళ్లి చేశారు. భర్త ఆనందరావు చెడుసావాసాలకి లోనై, వేశ్య నాగమణి సంపర్కం పెట్టుకుని భార్యని హింసిస్తూ వుంటాడు. నాగమణి ప్రోత్సాహంతోనే భార్యని వదిలి, రంగూను వెళ్లిపోతాడు. అక్కడ నాగమణి అతడిని చులకన చేసి ఇతర సంబంధాలు పెట్టుకుంటుంది. రంగూనులోనే పరిచయమయిన మరొక తెలుగు పుస్తక ప్రచురణకర్త సుందరరావు సాహచర్యంలో జ్ఞానోదయమయి, తిరిగి స్వగ్రామం వచ్చి వసుమతితో చక్కగా సంసారం చేసుకుంటాడు. రచయిత్రి కథనరీతి, సందర్భానుసారం కథలో పొందుపరిచిన సాంఘిక పరిస్థితులూ, వాటిపై ఆమె వ్యాఖ్యానాలు మనని ఆకట్టుకుంటాయి.

నవల ప్రారంభంలో ఆశ్వీయుజమాసంలో శరన్నవరాత్రులూ, పూర్వవైభవమూ సూక్ష్మంగా వర్ణించి “అకటా ఆనాటి వైభవములిప్పుడేవీ” అంటూ విచారం వెలిబుచ్చి, వసుమతి ఇంటి వాతావరణం వివరిస్తారు రచయిత్రి.. అసురసంధ్యవేళ, వసుమతి పుస్తకం పట్టుకుని కూచుంది. “అసురసంధ్యవేళ చదవరాదని చెప్పలేదా? కొంచెమాగి, దీపం పెట్టినతరవాత చదువుకో”మంటుంది తల్లి. వసుమతికి ఆపుస్తకం విడవలేనంత ఆసక్తికరంగా వుంది. తల్లీ కుమార్తెల సంభాషణ చదువుతుంటే మనకి ఆహ్లాదకరమైన గృహవాతావరణం ప్రస్పుటమవుతుంది. అంతేకాదు, ఈనాడు కూడా చాలామంది అమ్మాయిలకి ఇది అనుభవమే కావచ్చు.

ఇంతలో ఎవరో తలుపు దీయమని పిలిచారు. తల్లి వసుమతిని తలుపు తీయమంటుంది. “దట్టంపు జిలుగు కుచ్చిళ్ల పావడాతో, గీరల చొక్కాతో, పిఱుదులదాకుతూ బెత్తెడు వాలుజడ వీపున గునిసియాడ,” వసుమతి తలుపు తీయడానికి వెళ్లినదిట. మళ్లీ రెండోసారి ఆ అమ్మాయి పెళ్లి అయినతరవాత, భర్తకోసం ఎదురుచూస్తూ కూర్చున్నసమయంలో కూడా ఆమె అందచందాలు ఒకటిన్నర పేజీల్లో వర్ణస్తారు పుట్టుకతో వచ్చిన సౌందర్యమే కానీ పెట్టు సౌందర్యం కాదని చెప్పడానికి (56-57) వరలక్ష్మమ్మగారు.

అయితే ఆవిడ వాక్యనిర్మాణం కేవలం వర్ణనలకే పరిమితం కాదు. తన అభిప్రాయాలు కూడా సమయోచితంగా, నర్మగర్భంగా తెలియజేస్తారు. తెలుగుపడుచులకి సర్వసాధారణమైన నగలవ్యామోహం వరలక్ష్మమ్మగారికి గిట్టదు. కొంతవరకూ ఇది స్వాతంత్ర్యోద్యమ సమయంలో స్త్రీలు ఆ ఉద్యమంకోసం తమ నగలు ఒలిచి దానం చేయడం కావచ్చు. వరలక్ష్మమ్మగారు కూడా స్వాతోంత్ర్యోద్యమంలో ఉత్సాహంతో పాల్గొన్నారు. అందుకే ఆవిడ వసుమతి మోయలేనన్ని నగలు ధరించలేదు అని ఒక చిన్నవాక్యంలో పూర్తి చేయలేదు. చూడండి.

సుందరమనుకొని చెవులనిండ సందు లేకుండ రంధ్రములు పొడిచి వివిధరూపములు తగిలించుకొని ముత్యముల యొక్కయు బంగారముచే కర్ణములు ముందుకు వ్రాలుటయు. ఒకానొకప్పుడు కుట్లు తెగుటకు కారణమైన నందవికారపు నగల ధరింపక ఆపూబోడి ధృఢమయిన క్రిందితమ్మెలకి దానిమ్మగింజలవంటి కాంతివంతములయిన కెంపులను మాత్రము శ్రోత్రాలంకారముగా దాల్చెను”

ఈ వాక్యం చాలు వరలక్ష్మమ్మగారి నిశిత పరిశీలనాశక్తి, భాషాపాటవం, వైయక్తికవిలువలు, సూత్రప్రాయంగా వివరించడానికి.


భర్త పోయిన నాటికి వసుమతి తల్లి మహలక్ష్మమ్మగారికి పాతికేళ్లు. వసుమతికి మూడేళ్లు. అన్నగారు రామచంద్రుడికి ఆరేళ్లు. పెద్దకూతురు రాజ్యలక్ష్మిని భర్త అభీష్టం ప్రకారం ఆడబిడ్డ కుమారుడికి ఇచ్చి పెళ్లి జరిపిస్తుంది. రామచంద్రుడు వసుమతికి చదువు చెప్తాడు. చారిత్రకంగాగా ఇది వీరేశలింగంగారు ప్రవేశపెట్టిన స్త్రీవిద్యా ఉద్యమప్రభావాన్ని సూచిస్తుంది. ఆకాలంలో వివేకవంతులయిన అన్నదమ్ములూ, తండ్రులూ స్త్రీవిద్యని సమర్థిస్తూ ఆడపిల్లలకి ఇంట్లోనే చదువుకునే అవకాశాలు కల్పించారు. ఆనాటి విదుషీమణులు వీరేశలింగంగారి అభిప్రాయాలని ఉన్నవి ఉన్నట్టు గ్రహించలేదు. ఆయన దృక్పథానికి భిన్నమైన దృక్పథం, రామచంద్రుడు వసుమతికి చెప్పినపాఠాల్లో కనిపిస్తుంది. అతను కేవలం సతీధర్మాలే కాక, భూగోళం, చరిత్ర, లెక్కలూ కూడా పాఠాలు చెప్తాడు చెల్లెలికి. స్త్రీవిద్యని సమర్థించే వాదనలకి రామచంద్రునీ, వ్యతిరేక వాదనలు ప్రవచించడానికి దుర్మార్గుడయిన వసుమతి భర్త ఆనందరావునీ రచయిత్రి వాడుకోడం గమనార్హం.

వసుమతి విద్యావంతురాలయినా సనాతనధర్మాన్ని కూడా పాటిస్తుంది. భర్త ఎంత దుర్మార్గుడయినా శాంతంగా అతనిని సంతోషపెట్టడమే తన ధర్మమని నమ్మి ఆచరణలో పెట్టిన సాధ్వి. ఇది కూడా వరలక్ష్మమ్మగారి వ్యక్తిత్వంలో భాగమే. ఆమె సనాతనధర్మాలను కూడా గౌరవిస్తుంది. అది రామచంద్రుని గుణగణాల వర్ణనలో ఆమెకి సనాతనధర్మాలపట్ల గల గౌరవం వ్యక్తమవుతుంది. అతనిని పూర్వాచారాల్లోనూ ఆధునికభావాల్లోనూ మంచిని తీసుకుని సమన్వయపరుచుకుని, తనకి తాను ఒక నిర్దుష్టమయిన మార్గాన్ని ఏర్పరుచుకున్న మేధావిగా చిత్రిస్తారు.నవల చివరిభాగంలో ఆనందరావుకి జ్ఞానోదయం కలిగించిన ఘట్టం కూడా వరలక్ష్మిగారు నేర్పుగా చూపించారు.

ఆనందరావు నేరుగా చెప్పకపోయినా, సుందరరావుగారు అతని పరిస్థితి గ్రహిస్తారు. భార్యని తీసుకురమ్మని అనేక విధాలా చెప్తారు. అనేక పుస్తకాలు ఇచ్చి చదవమంటారు. ఆనందరావుమీద ఆవేవీ పని చెయ్యలేదు. ఒకరోజు యదాలాపంగా వారిముందున్న బల్లమీద “హరిదాసి” అన్న పుస్తకం చూసి అదేమిటి అని అడుగుతాడు ఆనందరావు. ఆయన అతనికి ఆపుస్తకం ఇచ్చి చదవమంటారు. అది అతడికి జ్ఞానోదయం అవడానికి కారణమయింది. రచయిత్రి ఈసంఘటనలో “మనం అనుకున్నట్టు, పుస్తకాలూ సలహాలూ ఎల్లవేళలా పని చెయ్యవు. ఎప్పుడు ఏ కారణంగా తెలివి వస్తుందో చెప్పడం కష్టం” అని అన్యాపదేశంగా చెప్పుతున్నట్టు అనిపించింది నాకు. నిత్యజీవితంలో జరిగేది అదే కదా.

వరలక్ష్మమ్మగారు ఆనాటి సాహితీక్షేత్రం కూడా నిశితంగా పరిశీలిస్తూనే వుండేవారు అనడానికి తార్కాణం ఆమె 1940వ దశకంలో ప్రచురించిన “కథ ఎట్లా వుండాలె” అన్న చిన్నకథ. అందులో వరలక్ష్మమ్మగారు ఆనాటి విమర్శనాధోరణులని తీవ్రంగా విమర్శిస్తారు. అసలు ఈకథ నడిపించిన తీరే నాకు విశేషంగా కనిపించింది. శీర్షిక చూస్తే కథ కాదేమో అన్న అనుమానం కూడా వస్తుంది. కథ అంతా భార్యాభర్తల మధ్య సంభాషణగా సాగుతుంది.

భర్త తన రచనమీద “మంచి సమీక్ష వచ్చింది” అంటాడు.

అది రాసింది ఎవరు” అని అడుగుతుంది భార్య. ఇక్కడే కనిపిస్తుంది రచయిత్రి చమత్కారం. ఆమె ప్రశ్న ‘ఏమని రాసేరు’ అని కాదు, ‘ఎవరు’ అని.

ఎవరో తెలీదు. పేరు రాయలేదు” అంటాడు భర్త.

మీ స్నేహితుడో, మీ స్నేహబృందంలోవాడో అయివుంటాడు” అంటుంది ఆమె.

ఈ వాక్యాలలో వ్యాఖ్యాతలు వస్తునిష్ఠతో కాక, వ్యక్తిగత స్నేహాలు ప్రాతిపదికగా ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయనం పద్ధతిలో సమీక్షలు రాసి ప్రచురిస్తున్నారన్న వ్యాఖ్యానం కనిపిస్తుంది. ఆ తరవాత మంచి కథ ఎలా వుండాలో, మంచి కథ లక్షణాలేమిటో చెప్తుంది భార్య. నన్ను ఆకట్టుకున్న విషయాలు ఈకథలో విమర్శకులధోరణి. దాదాపు అరవై ఏళ్లక్రితం ఆమె వర్ణించిన ధోరణి ఈనాడు కూడా అన్వయించుకోవచ్చు కొంతవరకూ.

రెండోది భార్యాభర్తలసంబంధం. భార్య కూడా విద్యావంతురాలు. భర్తతో ముఖాముఖి “మీ స్నేహితులు ఇలాటివారు, మీరచనలకి వస్తున్న సమీక్షలు ఇలా వుంటున్నాయి” అని నిస్సంకోచంగా చెప్పగల ధీమంతురాలు. ఆడవాళ్లబతుకులు హేయం, హీనాతిహీనం అని ఆవిష్కరిస్తూ చాలా కథలు వచ్చాయి. వస్తున్నాయి. కాని దానికి ప్రత్యామ్నాయంగా ఇతర కోణాలు కూడా ఆవిష్కరించినప్పుడే, జాతి సంస్కృతి సంపూర్ణంగా మనకి అర్థం కాగలదు. ఆవిధంగా ఈకథకి ఒక ప్రత్యేక స్థానం వుంది అనుకుంటున్నాను నేను. కథాకథనసంవిధానం పరిశీలిస్తే ఈనాడు ప్రాచుర్యంలో వున్న కొలమానాలు ఈకథకి నప్పవు. అంటే కౌతుకాన్ని రేకెత్తించే ఆరంభం, పట్టి ఊపేసే సంఘర్షణా, చమత్కారంతో కూడిన ముగింపూ లేని కథ ఇది. అయినా ఇది కథే. వ్యాసం కాదు. కథకి కావలసిన ఆవరణా, పాత్రచిత్రణా వుంది. .

వరలక్ష్మమ్మగారు రచించిన మరొక వచన కావ్యం విశ్వామిత్ర. (1963). విశ్వామిత్రుడు కోపిష్టి అని జనసామాన్యంలో వాడుక. అందుకు భిన్నంగా వరలక్ష్మమ్మగారు ఆయనని ధర్మనిష్ఠాగరిష్ఠునిగా, బ్రహ్మర్షి పదవి సాధించిన దీక్షాపరునిగా చిత్రిస్తారు. ఆనాటి సాంఘికపరిస్థితులు, పశుబలంఆత్మబలాల్లో తారతమ్యాలూ ఎత్తి చూపుతూ కులపరమైన చర్చలూ చేస్తూ, విశ్వామిత్రుని మానవతావాదిగా ఆవిష్కరిస్తారు. మానవుడు పుట్టుకచేత కాక గుణకర్మలచేత ఔన్నత్యం సాధించగలడనీ, దానికి విశ్వామిత్రుడే సాక్షి అనీ ప్రతిపాదిస్తారు ఆమె. ఈకావ్యం ఆన్లైను లింకు ఇక్కడ.


నాకు ఇలాటి పుస్తకాలు చదవడం ఇష్టం. ఇందులో అచ్చతెలుగు నుడికారం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. నేను మరిచిపోయిన పదకేళిని గుర్తుకి తెచ్చింది. “కొండంత తండ్రికన్న ఏకులబుట్టంత తల్లి మేలను లోకసామ్యమును సార్థకము చేసినది” అంటారు వసుమతి తల్లి భర్త పోయినతరవాత సంసారాన్ని ఎలా ఈదుకొచ్చిందో చెపుతూ. చిన్నపుస్తకమే (158 పేజీలు) అయినా మనసుని రంజింపజేసే జాతీయాలు మణుగులకొద్దీ వున్నాయి. ఒక్కమాటలో, నాచేత ఆసాంతం విడవకుండా చదివించిన పుస్తకం. ఈ పుస్తకం ఆర్కైవ్స్.ఆర్గ్ లో ఇక్కడ చూడవచ్చు.


నేను తూలికలో చాలాసార్లు మరుగున పడిపోతున్న మన రచయితలగురించి, మనం పునః పరిశీలించుకోవలసిన అవుసరంగురించి ప్రస్తావించాను. అందుకు నిదర్శనంగా, (నాకు నొప్పి కలిగించిన ఒక విషయం) ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. వరలక్ష్మమ్మగారి కుటుంబసభ్యులే నడుపుతున్న ఒక సైటులో ఆమె గురించి రాస్తూ “…. [she] exclusively wore khadi till her last breath in 1986” (www.Indiastories.org, July 2007) అని రాశారు. వరలక్ష్మమ్మగారి శతజయంతి సంచికలోనూ ఇతర మూలగ్రంథాలలోనూ వరలక్ష్మమ్మగారు 1978లో మరణించిట్టు వుంది. వరలక్ష్మమ్మగారికి అత్యంత సన్నిహితులయిన పోలాప్రగడ రాజ్యలక్ష్మిగారు కూడా 1978 అనే ధృవపరిచారు.

వరలక్ష్మమ్మగారి కథలు, కథ ఎట్లా వుండాలె, కుటీరలక్ష్మి అనువాదాలు తూలిక.నెట్‌లో చూడొచ్చు.

***********************************

రాసిన వారు: నిడదవోలు మాలతి

http://tethulika.wordpress.com, http://thulika.net

You Might Also Like

20 Comments

  1. శంకర్

    మంచిగా ఉంది

  2. శంకర్

    మంచి విషయాలు బాగున్నాయి.

  3. మాలతి గారి రీడింగ్ లిస్టు | పుస్తకం

    […] కనుపర్తి వరలక్ష్మమ్మ – కథలు (నేను చదివినవి కుటీరలక్ష్మి, […]

  4. మహిళావరణం-2 « sowmyawrites ….

    […] మాలతి గారు రాసిన పరిచయ వ్యాసం ఇక్కడ […]

  5. పుస్తకం » Blog Archive » మరపురాని మనీషి === తిరుమల రామచంద్ర.

    […] ధీరవనిత. మహిళాభ్యుదయనికి పాటుపడిన కనుపర్తివారి రచనలు ఆధునిక నారీలోకానికి ఆమె […]

  6. పుస్తకం » Blog Archive » నాలుగు నెలల పుస్తకంలో..

    […] అత్యధిక భాగం. నిడదవోలు మాలతి గారు మనం మరిచిపోయిన రచనలూ – రచయిత్రలనూ పరిచయం చేస్తే, ఆచార్య తిరుమల […]

  7. మాలతి

    హనుమంతరావు గారూ, విపులంగా రాసిన మీవ్యాఖ్యకి ధన్యవాదాలు. శారదలేఖలు ఐయేయస్ పరీక్షకి పాఠ్యగ్రంథం అనీ, ఆంధ్రాలో దొరుకుతోందనీ ఆచార్య మలయవాసినిగారు చెప్పేరు. మీరు ఇండియా వెళ్లే ఆలోచన వుంటే ప్రయత్నించి చూడండి. పోతే, శైలి మాట. ఫాఠకులారా అని సంబోధించడం శైలిలో లోపం అని నేను అంగీకరించను. అది మరొక కథన పద్ధతి అంటాను. ఇంకా చెప్పాలంటే మనకి తరతరాలుగా వస్తున్న మౌఖిక సాహిత్య లక్షణం. ఈవిషయంలోనే తెలుగు రచయిత్రుల రచనలు విమర్శించేటప్పుడు మనవిమర్శనారీతులు పునఃపరిశీలించుకోవాలని రాశాను. ఎందుకంటే ఒక కథ కానీ కవిత గానీ పాఠకుల దృష్టిని ఆకట్టుకుందా లేదా అన్నది ప్రధానాంశం. అది ఎలా సాధించారు అన్నది రెండో అంశం.

  8. కొడవళ్ళ హనుమంతరావు

    అయిదో తరగతి దాకా నయినా చదవనావిడ ఇన్ని రచనలూ, ఇన్ని పనులూ చేసిందంటే చాలా ఆశ్చర్యమేస్తుంది. ఈకాలపు విద్యావంతులని కాస్తయినా ఆలోచింపచేస్తుంది. పరిచయం చేసినందుకు మాలతి గారికి కృతజ్ఞతలు.

    కనుపర్తి వారి రెండు కథలు – “కుటీర లక్ష్మి” [1], “ఐదు మాసముల ఇరువది దినములు” [2] చదివాను. సమకాలీన పరిస్థితులని – ఖద్దరు ఉద్యమం, మొదటి ప్రపంచ యుద్ధ ప్రభావం మారుమూల ఊళ్ళపై కూడా ఎలా ఉన్నదీ – చిత్రించే ప్రయత్నం మెచ్చుకోదగ్గది. భాష పూర్తిగా వ్యవహారికం కాకపోయినా, చదవడానికి సాఫీగానే ఉంది. మంచి పలుకుబడులున్నాయి – “కడుపు ఘనమెరుగదు, లేమి సిగ్గెరుగదు.” ఈ కథలు మాలతి గారు, రాజ్యలక్ష్మి గారు అన్నట్లు రచయిత్రి సామాజిక విలువలని ప్రతిఫలిస్తాయి.

    కాని కథాశిల్పంలో కొంత లోపమున్నట్లనిపిస్తుంది. ([1] లో ఈ వాక్యం చూడండి: “పాఠకులారా! ప్రథమ ప్రకరణ వృత్తాంతము జ్ఞాపకము లేదా?”) ఇవి రాసేనాటికి (1924, 1931) మన కథా సాహిత్య ప్రక్రియ ఇంకా శైశవదశలోనే ఉండటం కారణమవచ్చు.

    పైవాటికన్నా నాకు చాలా నచ్చిన కథ, “మా వూరు” [3]. దీనిని 1931 తర్వాత, రచయిత్రిగా మరికొంత పరిణతి పొందిన తర్వాత రాశారేమో తెలియదు. కనుపర్తి వారివి నేనీ మూడూ రచనలే చదివాను. దాదాపు నలభై ఏళ్ళ మన సామాజిక చరిత్ర చక్కటి వ్యవహారికంలో “శారద లేఖలు” లో కనిపిస్తుందని తెలుసుకున్నాను [4] కాని నాకూ అవి అందుబాటులో లేవు. త్వరలోనే అవీ ఇతర రచనలూ మళ్ళీ ప్రచురణకి నోచుకుంటాయని ఆశిస్తాను.

    [3] తప్ప మిగిలినవి నేను గత మూడు నాలుగేళ్ళలోనే కొన్నాను కనుక, ఇంకా అందుబాటులో ఉండొచ్చు.

    కొడవళ్ళ హనుమంతరావు

    [1] విశాలాంధ్ర తెలుగుకథ, 1910-2000. సంపాదకులు – కేతు, సింగమనేని, పెనుగొండ, సదానంద్. 2002.
    [2] విస్మృత కథ. (A Collection of Forgotten Stories, 1930-80.) సంపాదకులు – పాపినేని, వల్లూరు, పెనుగొండ. 1998.
    [3] నూట పదహార్లు. సంపాదకులు – తాళ్ళూరు, హితశ్రీ. 1974.
    [4] శత వసంత సాహితీ మంజీరాలు, వంద పుస్తకాలపై విశ్లేషణ లో కొమ్మన రాధాకృష్ణారావు వ్యాసం. సంపాదకులు – ప్రయాగ, నాగసూరి. 2002.

  9. మాలతి ని.

    వరూదిని, సారీ, మీ కామెంటు ఇప్పుడే చూసాను. అవును. డీలిట్ సైటులో చాలా పుస్తకాలు ఓపెన్ అవడం లేదు.
    శ్రీనివాస్ ఇచ్చిన లింకు http://www.ulib.org/cgi-bin/ulibcgi/ulibreader_path/bookReader.cgi?barcode=99999990688503&format=ptiff&curPage=1&handler=IIIT
    ఓపెన్ అవుతోంది. కానీ అందులో 334 పేజీలూ,ఒకొక పేజీ ఒకొక JPEG పైలు.
    నేను అదంతా ప్రింటు చేసుకోడం ఇప్పుడే అయేపని కాదు. మీకు పుస్తకం ఎక్కడయినా కనపిస్తే, తప్పకుండా చెప్పండి. బోల్డు ధన్యవాదాలు.
    మాలతి

  10. రవి

    ఈ మధ్య చందమామ 1947 లో తొలిదశలోని సంచికలు చూస్తూ ఉంటే, కనుపర్తి వరలక్ష్మమ్మ గారి చిట్టి చిట్టి కవితలు కనిపించాయి. మంచి విషయాలు తెలియజెప్పారు.ధన్యవాదాలు.

  11. పుస్తకం » Blog Archive » ‘మరపురాని మనీషి’ - తిరుమల రామచంద్ర

    […] మధ్యే ఇక్కడ పరిచయం చెయ్యబడ్డ కనుపర్తి వరలక్ష్మమ్మ గారిని కూడా ఈ పుస్తకంలో పరిచయం చేసారు. ఈ […]

  12. Aruna

    బాగుంది.
    పాతకాలం లో సంప్రదాయాల, వినూతన పోకడల మధ్య సమన్వయం ఎలా చేస్కున్నారో చూడటానికి ఐనా ఈ పుస్తకాలు చదవాలి.

  13. కనుపర్తి వరలక్ష్మమ్మగారి విశిష్ట వ్యక్తిత్వం « తెలుగు తూలిక

  14. మాలతి ని.

    శ్రీనివాస్ గారూ, లింక్స్ కి కృతజ్ఞతలు. ప్రొపెసర్ మలయవాసినిగారు చెప్పేరు, శారదలేఖలు ఐయేయస్ పరీక్షకి పాఠ్యగ్రంథంగా ఆవిడ ప్రోత్సాహంతో నిర్ణయించేరనీ, అంచేత మళ్లీ ప్రచురించారని. ఆన్ లైనులో చూస్తాను.
    పూర్ణిమా, వరూధినీ, సౌమ్యా – ధన్యవాదాలు. అసలు ఇలాటి వ్యాసాలమీద ఎవరికైనా ఆసక్తి వుంటుందా అని సందేహిస్తూ పంపించేను. 🙂

  15. Sreenivas Paruchuri

    I don’t know if “Saarada lEkhalu” volumes are republished in recent years. I have them, and my set’s published in 1967. Part 1 is available on-line, and so are 5 other books of her.

    Regards,
    Sreenivas

  16. వరూధిని

    మాలతి గారు నేను కనుక్కుంటాను. DLI లో వుంది కాని నాకు open అవటం లేదు, మీరు ఒకసారి చూస్తారా? http://dli.iiit.ac.in/cgi-bin/Browse/scripts/use_scripts/advnew/metainfo.cgi?&barcode=2020010003292

  17. Sowmya

    మాలతి గారికి:
    ఈ వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు. మీ నుండి మరిన్ని వ్యాసాలు ఇలాగే మా తరం వారికెన్నో విషయాలు చెప్పేవి రావాలని కోరుకుంటున్నాను 🙂

  18. మాలతి ని.

    అభ్యర్థన. వరలక్ష్మమ్మగారి రచనలలో అత్యంత ప్రాముఖ్యత పొందిన వ్యాసాలు శారదలేఖలు. ఆవ్యాసాలు పుస్తకంగా పునర్ముద్రించేరని నాకు ఇప్పుడే తెలిసింది. మీకు ఎవరికైనా వివరాలు తెలిస్తే దయచేసి నాకు రాయండి. శ్రమ తీసుకుని నాకు కాపీ పంపగలగితే, పూర్తి ఖర్చులు నేను పెట్టుకుంటాను. ఇంకా ఋణపడి వుంటాను కూడా. ధన్యవాదాలు.
    – మాలతి ని.

  19. వరూధిని

    మాకు తెలియని మరో రచయిత్రిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఏంటో పక్కనే ఉన్నా ఇలాంటివారి గురించి ఎందుకు తెలుసుకోమో?

  20. పూర్ణిమ

    చాలా బాగుందండీ! చాలా విషయాలు తెల్సుకున్నాను.

Leave a Reply to శంకర్ Cancel